భారత్‌లో అవినీతి తగ్గుముఖం! | India ranks 91st among 182 countries on Corruption Perceptions Index 2025 | Sakshi
Sakshi News home page

భారత్‌లో అవినీతి తగ్గుముఖం!

Feb 11 2026 4:28 AM | Updated on Feb 11 2026 4:40 AM

India ranks 91st among 182 countries on Corruption Perceptions Index 2025

182 దేశాలకు గాను 91వ ర్యాంకు  

గత ఏడాది కంటే ఐదు స్థానాలు మెరుగు  

అమెరికాకు 29వ ర్యాంకు, యూకేకు 20వ ర్యాంకు  

కరప్షన్‌ పర్‌సెప్షన్స్‌ ఇండెక్స్‌ నివేదిక వెల్లడి  

నివేదికను విడుదల చేసిన ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌’

న్యూఢిల్లీ: భారత్‌లో అవినీతి కొంత తగ్గుముఖం పట్టినట్లు అంతర్జాతీయ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ అయిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ మంగళవారం విడుదల చేసిన కరప్షన్‌ పర్‌సెప్షన్స్‌ ఇండెక్స్‌(సీపీఐ)–2025 నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 182 దేశాల్లో అవినీతి నిర్మూలనపై అధ్యయనం చేయగా, భారత్‌కు 91వ స్థానం దక్కింది. గత ఏడాది 96వ స్థానంలో నిలిచిన భారత్‌ ఈ ఏడాది తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఆసియా పిసిఫిక్‌ దేశాల్లో అవినీతి వ్యతిరేక కార్యక్రమాలు క్రమంగా పెరుగుతున్నాయని, వాటి ఫలితాలు సైతం కనిపిస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది.

అవినీతి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన వస్తోందని తెలియజేసింది. ప్రపంచంలో ప్రతిచోటా అవినీతి అనేది అతిపెద్ద జాడ్యంగా మారినట్లు ఆందోళన వ్యక్తంచేసింది. అవినీతికి అడ్డుకట్ట వేయాలంటే తొలుత పాలకులు, రాజకీయ నేతలు చొరవ చూపాలని, వారు అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని సూచించింది. జవాబుదారీతనం లేని నాయకుల పట్ల ప్రజలు విసుగెత్తిపోయారని, అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు జరుగుతున్నాయని వెల్లడించింది. వారంతా వ్యవస్థల్లో సంస్కరణలు కోరుకుంటున్నారని తెలియజేసింది. వ్యవస్థల ప్రక్షాళనతో అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందని అభిప్రాయపడింది.  

ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ 182 దేశాల్లో ప్రభుత్వ రంగంలో అవినీతిని అధ్యయనం చేసి ర్యాంకులు ఇచి్చంది. సున్నా నుంచి 100 దాకా స్కోర్‌ కేటాయించింది. సున్నా స్కోర్‌ అంటే అత్యంత అవినీతి దేశమని అర్థం. 100 దాకా స్కోర్‌ వస్తే అక్కడ అవినీతి ఆనవాళ్లు పెద్దగా లేనట్లే.  
పలుదేశాల్లో అవినీతిని బహిర్గతం చేస్తున్న జర్నలిస్టులకు హెచ్చరికలు ఎదురవుతున్నాయి. దాడులు జరుగుతున్నాయి. ఈ జాబితాలో భారత్‌ కూడా ఉంది.  
అవినీతిపై పరిశోధన చేసి, ప్రజలకు తెలియజేస్తున్న జర్నలిస్టులకు హత్యకు గురవుతు న్నా, దాడులను ఎదుర్కొంటున్నా పాలకులు సరిగ్గా స్పందించడం లేదని కరప్షన్‌ పర్‌సెప్షన్స్‌ ఇండెక్స్‌ నివేదిక ఆక్షేపించింది.  

2012 నుంచి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 829 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అవినీతిని బయటపెట్టడమే వీరు చేసిన నేరం.  
సీపీఐ స్కోర్‌ 50 కంటే తక్కువ ఉన్న దేశాలైన బ్రెజిల్, ఇండియా, మెక్సికో, పాకిస్తాన్, ఇరాక్‌లో ఎక్కువ మంది జర్నలిస్టులు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌ స్కోర్‌ 35, ఇండియా స్కోర్‌ 39, మెక్సికో స్కోర్‌ 27, పాకిస్తాన్‌ స్కోర్‌ 28, ఇరాక్‌ స్కోర్‌ 28గా ఉంది.  
31 దేశాల్లో 2012 నుంచి అవినీతి గణనీయంగా తగ్గిపోయింది. మిగిలిన దేశాలు అవినీతిని నియంత్రించడంలో విఫలమయ్యాయి. కొన్ని దేశాల్లో అవినీతి అదేస్థాయిలో ఉండగా, మరికొన్ని దేశాల్లో కొంత పెరిగింది.  

 ప్రపంచ సగటు సీపీఐ స్కోర్‌ 42గా నమోదైంది. మూడింట రెండొంతుల దేశాల స్కోర్‌ 50 కంటే తక్కువే ఉన్నట్లు తేలింది.  
 అవినీతి వల్ల ప్రజలకు భారీగా నష్టం జరుగుతోంది. వారి జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. మౌలిక వసతులు అందడం లే దు. యువత ఆశలు సాకారం కావడం లేదు.  
కరప్షన్‌ పర్‌సెప్షన్స్‌ ఇండెక్స్‌ రిపోర్టులో డెన్మార్క్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశం స్కోర్‌ 89. అవినీతి నిర్మూలనలో ఫిన్‌లాండ్, సింగపూర్‌ కంటే డెన్మార్క్‌ ముందంజలో ఉంది. చిట్టచివరి స్థానాల్లో దక్షిణ సూడాన్, సోమాలియా, వెనెజులా నిలిచాయి.  

అగ్రదేశం అమెరికాకు 29వ ర్యాంకు, యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)కు 20వ ర్యాంకు లభించింది.  
ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, యూకే, న్యూజిలాండ్‌లో అవినీతి నిర్మూలన ఆశించిన స్థాయిలో కొనసాగడం లేదని నివేదిక పేర్కొంది. అవినీతిని అంతం చేయాలన్న సంకల్పం అక్కడి పాలకుల్లో కనిపించడం లేదని వెల్లడించింది.  
అవినీతి పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రధానంగా రాజకీయ వర్గాల్లో పెచ్చరిల్లుతున్న అవినీతి సమాజానికి ముప్పుగా పరిణమిస్తోంది. పాలకులు అధికార దురి్వనియోగానికి పాల్పడుతూ జర్నలిస్టులను, ఎన్జీఓలను కట్టడి చేయాలని చూస్తున్నారు. పాలకుల్లో పారదర్శకత గానీ, జవాబుదారీతనం గానీ లోపిస్తున్నాయి. అంతిమంగా ఇది అవినీతికి బాటలు వేస్తున్నట్లు కరప్షన్‌ పర్‌సెప్షన్స్‌ ఇండెక్స్‌ నివేదిక తేలి్చచెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement