లక్నో: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో లక్నో విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం ఢిల్లీ నుండి పశ్చిమ బెంగాల్లోని బాగ్డోగ్రాకు వెళ్తున్న 6ఈ 6650 విమానాన్ని, ముందస్తు జాగ్రత్త చర్యగా దారి మళ్లించారు. విమానం లక్నోలో సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే, భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమై విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి.
ఈ ఘటనపై ఏసీపీ రజనీష్ వర్మ మాట్లాడుతూ, విమానంలోని టాయిలెట్లో ఉన్న ఒక టిష్యూ పేపర్పై బాంబు ఉన్నట్లు రాసి ఉన్న సందేశం దొరికిందన్నారు. సిబ్బంది వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా లక్నోకు మళ్లించాల్సి వచ్చింది. ఘటనా సమయంలో విమానంలో పైలట్లు, సిబ్బందితో కలిపి మొత్తం 238 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బాంబు బెదిరింపు వార్తతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
విమానం లక్నోలో సురక్షితంగా దిగడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం లక్నో విమానాశ్రయంలో భద్రతా దళాలు విమానాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుని, తనిఖీలు నిర్వహిస్తున్నాయి. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో అణువణువూ గాలిస్తున్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని విమానాశ్రయ అధికారులు తెలిపారు.


