ధరల మోత.. వంటనూనెలు మొదలు ఔషధాల దాకా  | Iran Conflict Impact on India, Disrupts ͏Strait of Hormuz Supply Route | Sakshi
Sakshi News home page

ధరల మోత.. వంటనూనెలు మొదలు ఔషధాల దాకా

Mar 6 2026 5:22 AM | Updated on Mar 6 2026 5:35 AM

Iran Conflict Impact on India, Disrupts ͏Strait of Hormuz Supply Route

యుద్ధం ఇలాగే కొనసాగితే భారతీయులపై పెనుభారం 

సాధారణ ప్రజానీకంపై ధరలమోత మోగే ప్రమాదం

ఇరాన్‌పై అమెరికా దాడిచేస్తే బదులుగా ఇరాన్‌.. సౌదీ, బహ్రెయిన్, ఖతార్‌ సహా పలు గల్ఫ్‌ దేశాలపై బాంబులేస్తోంది. సుదూరంగా ఉన్న భారత్‌పై బాంబులు పడకపోయినా ధరల బాంబులు పడొచ్చన్న విశ్లేషణలు ఇప్పుడు సగటు భారతీయుని గుండెల్లో భయాందోళనలను పెంచేస్తున్నాయి. సముద్రమార్గంలో చమురు కూడలిగా పేరొందిన హార్మూజ్‌ జలసంధి గుండా నౌకల రాకపోకలు ఆగిపోవడంతో ముడిచమురు మొదలు పలురకాల వస్తూత్పత్తుల ధరలకు రెక్కలొచ్చే ఆస్కారముంది. 

తొలుత చమురు మంటలు 
యుద్ధం ఇలాగే కొనసాగితే మిగతా వినిమయ వస్తువులతో పోలిస్తే మొట్టమొదట ముడిచమురు, చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ద్రవరూప సహజవాయువు(ఎల్‌ఎన్‌జీ) సరఫరా ఇరాన్‌ నుంచి ఆగిపోయింది. సౌదీ అరేబియాలోని రస్‌ తనూరా రిఫైనరీ నుంచి భారత్‌కు సరఫరా భారీగా తగ్గింది. దీంతో ఫిబ్రవరి నుంచి చమురు ధరలు ఏకంగా 20 శాతం పెరిగాయి. హార్మూజ్‌ జలసంధికి బదులు ఆఫ్రికా ఖండంలోని ‘కేప్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌’ను చుట్టేస్తూ చమురు ఉత్పత్తులను సరఫరా చేస్తే రవాణా ఖర్చులు కలుపుకుని భారత్‌లో ఆయిల్‌ ధరలు పెరగడం ఖాయం. 

వంటనూనె మరింత ధర.. 
భారత్‌ వంటనూనెల కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడుతోంది. పామాయిల్‌ ఎక్కువగా ఇండోనేసియా, మలేసియా నుంచి వస్తోంది. అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి సోయాబీన్‌ నూనె, రష్యా, ఉక్రెయిన్‌ నుంచి పొద్దుతిరుగుడు నూనె దిగుమతి అవుతున్నాయి. వీటిలో కొంత సరుకు హార్మూజ్‌ జలసంధి గుండా వస్తోంది. రవాణా గొలుసు తెగిపోవడంతో ధరలు కట్టలు తెంచుకోవచ్చని ‘సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బీవీ మెహతా చెప్పారు. ఇప్పటికే వంటనూనెల ధరలు పెరగడం ఆరంభమైంది. కేంద్రప్రభుత్వంలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం మార్చి రెండో తేదీ ధరలతో పోలిస్తే మార్చి మూడో తేదీన సన్‌ఫ్లవర్, సోయా, పామాయిల్‌ నూనెల రిటైల్‌ ధరలు ఒకటి నుంచి మూడు రూపాయలు పెరిగాయి.  

పప్పులూ మరింత ప్రియం.. 
పప్పుల ధరలు పెరిగే వీలుందని ‘ఆల్‌ ఇండియా దాల్‌ మిల్‌ అసొసియేషన్‌’అధ్యక్షుడు సురేశ్‌ అగర్వాల్‌ చెప్పారు. మయన్మార్, కెనడా, ఆఫ్రికాల నుంచి భారత్‌ ఏటా దాదాపు 60 లక్షల టన్నుల కందులు, మినుములు సహా పలు రకాల పప్పులను దిగుమతిచేసుకుంటోంది. ‘‘ఇరాన్, అఫ్గానిస్తాన్‌ నుంచి భారత్‌ అత్తిపండు, బాదం, పిస్తా, ఖర్జూరా, ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు, అప్రికాట్‌లను దిగుమతి చేసుకుంటోంది. పాకిస్తాన్‌తో ఘర్షణ వాతావరణం కారణంగా ఇప్పుడు ఇరాన్, అఫ్గాన్‌ల నుంచి పాక్‌కు, అక్కడి నుంచి వాఘా సరిహద్దు గుండా భారత్‌కు సరుకు రావట్లేదు.

 సముద్రమార్గంలో వస్తోంది. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు సముద్రమార్గం మూసేయడంతో డ్రై ఫ్రూట్స్‌ సరుకు రావడం దాదాపు ఆగిపోయినట్లే. ధరలు పెరిగే వీలుంది’’అని ‘ముంబై డ్రై ఫ్రూట్, డేట్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌’అధ్యక్షుడు విజయ్‌ భూటా చెప్పారు. ఎరువులు, సాగు ఉత్పత్తుల రాక సైతం తగ్గిపోయిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విమానాల రాకపోకలు తగ్గడంతో కార్గో రవాణా పరిమాణం కుచించుకుపోయింది. ఇతర దేశాల మీదుగా విమానాలు తిరిగి రావడంతో అంతర్జాతీయ ప్రయాణికులకు టికెట్‌ అధిక చార్జీల మోత మోగుతోంది.  

ప్లాస్టిక్‌ సైతం.. 
ముడిచమురు నుంచే ప్లాస్టిక్‌ గ్రాన్యూల్స్‌ను తయారుచేస్తారు. ముడిచమురు సరఫరా తగ్గడంతో గత రెండు రోజుల్లోనే ప్లాస్టిక్‌ గ్రాన్యూల్స్‌ ధర 12 శాతం ఎగసింది. దీంతో ప్లాస్టిక్‌ ఆధారిత ఉత్పత్తుల ధరలు సైతం పైపైకి పోవడం ఖాయంగా కని్పస్తోంది. 

ఔషధాలదీ అదే బాట... 
ఔషధాల తయారీలో ఉపయోగించే ముడి సరుకులైన యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియంట్స్‌(ఏపీఐ) కోసం భారత్‌ ఎక్కువగా చైనాపై ఆధారపడుతోంది. కానీ అత్యంత ఖరీదైన కీ స్టారి్టంగ్‌ మెటీరియల్స్‌(కేఎస్‌ఎం) కోసం ఎక్కువగా ఐరోపా దేశాలపై ఆధారపడుతోంది. యూరప్‌ నుంచి కేఎస్‌ఎం సరుకు హార్మూజ్‌ ద్వారానే రావాల్సి ఉంది. ఇవి తగ్గిపోవడంతో భారత్‌లో సంక్లిష్ట జనరిక్‌ మందులతోపాటు సైడ్‌ ఎఫెక్ట్‌లను తగ్గించే ‘విలువ జోడింపు ఔషధా(వీఏఎం)’ల తయారీ ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. వీటికితోడు మారుతున్న అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి మారకం విలువ పతనమవుతుండటంతో పెట్రోకెమికల్‌ ఉత్పత్తుల ధరలు మరింత ప్రియంకానున్నాయి. ఇవన్నీ కలసి సగటు భారతీయుని జేబుకు పెద్ద చిల్లు పెడతాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement