రాజ్యసభకు నితీశ్‌ నామినేషన్‌ | Bihar CM Nitish Kumar files nomination papers for Rajya Sabha polls | Sakshi
Sakshi News home page

రాజ్యసభకు నితీశ్‌ నామినేషన్‌

Mar 6 2026 12:53 AM | Updated on Mar 6 2026 12:53 AM

Bihar CM Nitish Kumar files nomination papers for Rajya Sabha polls

నామినేషన్‌ వేయడానికి ముందు అమిత్‌ షా, నితిన్‌ నబీన్‌తో భేటీ అయిన నితీశ్‌ కుమార్‌

బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ కూడా

బిహార్‌లో మొత్తం ఆరుగురు అభ్యర్థుల నామినేషన్లు

సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు నితీశ్‌ ప్రకటన

కొత్త ప్రభుత్వానికి తన సహకారం ఉంటుందని వెల్లడి

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్, బీజేపీ చీఫ్‌ నితిన్‌ నబీన్‌ సహా ఐదుగురు గురువారం ఎన్డీయే తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. జేడీయూ చీఫ్‌గా ఉన్న నితీశ్‌ కుమార్, జనవరిలో బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నబీన్‌లు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో విధాన సభ సెక్రటేరియట్‌లో అధికారులకు నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. నామినేషన్లు వేసిన ఎన్డీయే అభ్యర్థుల్లో జేడీయూకు చెందిన కేంద్ర మంత్రి రామ్‌నాథ్‌ ఠాకూర్, ఆర్‌ఎల్‌ఎం చీఫ్‌ ఉపేంద్ర కుష్వాహ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివేశ్‌ కుమార్‌ ఉన్నారు. వీరితోపాటు ఆర్జేడీ బలపరిచిన సిట్టింగ్‌ ఎంపీ, వ్యాపారవేత్త అమరేంద్ర ధారి సింగ్‌ సైతం నామినేషన్‌ వేశారు. ఆయన వెంట ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఉన్నారు. 

డిప్యూటీ సీఎంగా నిశాంత్‌
సీఎం నితీశ్‌ కుమారుడు నిశాంత్‌ కుమార్‌ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా వార్తలు గుప్పుమన్న రెండు రోజుల్లోనే నితీశ్‌ రాజ్యసభకు నామినేషన్‌ వేయడం గమనార్హం. నితీశ్‌ కుమార్‌ రాజీనామాతో సీఎం పదవిని బీజేపీ నేత చేపడతారని భావిస్తున్నారు. అదేవిధంగా, ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన 40 ఏళ్ల నిశాంత్‌ కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేరుతారని అంటున్నారు. సీఎం రేసులో ఉన్న వారిలో ప్రస్తుత డిప్యూటీ సీఎం సమ్రాట్‌ చౌదరి పేరు గట్టిగా వినిపిస్తోంది.

నితీశ్‌ నివాసం వద్ద నిరసనలు..
గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయేను అఖండ విజయం వైపు నడిపించిన నితీశ్‌ రాజీనామాతో బీజేపీ నేత ఒకరు ఆ పదవిని చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆ పార్టీ అభ్యర్థి సీఎం పదవిని చేపట్టని ఏకైక హిందీ రాష్ట్రం బిహార్‌. అయితే, నితీశ్‌ నిర్ణయాన్ని నిరసిస్తూ జేడీయూ కార్య కర్తలు ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

‘రాష్ట్ర రాజకీయాలను వదిలి రాజ్యసభకు వెళ్లా లని నితీష్‌ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన నిర్ణయంపై పార్టీ కార్యకర్తలు సంతోషంగా లేరు. ఆయన సీఎంగా కొనసాగాలి’ అని రాష్ట్ర సున్నీ వక్ఫ్‌ బోర్డు చైర్మన్, జేడీ(యూ) నేత అల్హాజ్‌ మొహమ్మద్‌ ఇర్షాదుల్లా అన్నారు. నితీశ్‌ ట్వీట్‌ చూడగానే ఆయన రాసింది కాదని తేలిపోయింది. అది ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశమని అర్థ మైందని ఆర్జేడీ మరో నేత మనోజ్‌ ఝా వ్యాఖ్యానించారు. 

నితీశ్‌ స్వచ్ఛంద నిర్ణయం.
బిహార్‌లో చోటుచేసుకున్న ఆకస్మిక పరిణామంపై కేంద్ర మంత్రి గిరిరాజ్‌ కిశోర్‌ స్పందించారు. “రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నట్లు నితీశ్‌ మూడేళ్ల క్రితమే తెలిపారు. ఇప్పుడు ఆయన ఆమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమిది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఏర్పడినా అది ఆయన నాయకత్వంలోనే ఉంటుంది’అని తెలిపారు.

ఆ ఒక్క సీటు ఆర్జేడీకి దక్కుతుందా?
ప్రస్తుతం బిహార్‌లో ఎన్నికలు జరుగుతున్న ఐదు రాజ్యసభ స్థానాలకు గాను రెండు ఆర్జేడీకి చెందినవే. 2025 ఎన్నికల్లో ఆ పార్టీకి 25 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కడంతో ప్రస్తుతం కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పోటీ చేస్తోంది. ఆర్జేడీకి మహాగఠ్‌ బంధన్‌లోని మరో 10 మంది సభ్యులు ఇప్పటికే మద్దతు తెలిపారు. ఎంఐఎం, బీఎస్‌పీలకు చెందిన మరో ఆరుగురు మద్దతిస్తే ఒక్క రాజ్యసభ సీటు గ్యారంటీగా దక్కుతుంది.

అయితే, మద్దతుపై ఎంఐఎం, బీఎస్‌పీ చీఫ్‌లు ఇప్పటి వరకు ఎవ్వరికీ మద్దతు ప్రకటించలేదు. అదే సమయంలో, ఎన్డీయేకి 243 మందితో కూడిన అసెంబ్లీలో ఏకంగా 202 మంది ఉన్నారు. దీంతో, ఐదో సీటును దక్కించుకోవాలంటే కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం అవసరమవుతారు. ఆ మేరకు మద్దతును కూడగట్టడం ఎన్డీయేకు ఏమంత కష్టం కాదని పరిశీలకులు అంటున్నారు.

రాజ్యసభకు వెళ్తున్నా..
నామినేషన్‌ దాఖలు చేయడానికి ముందు, సీఎం నితీశ్‌ కుమార్‌ తాను రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో, బిహార్‌కు అత్యధికంగా 20 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన సుదీర్ఘ ప్రస్థానానికి తెరపడినట్లయింది. అనంతరం ఆయన ‘ఎక్స్‌’లో రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ‘రెండు దశాబ్దాలకు పైగా, మీరు నాపై నమ్మకం ఉంచారు. మద్దతిచ్చారు.

ఆ బలంతోనే అంకితభావంతో సేవ చేశాను. మీ నమ్మకం, మద్దతు బిహార్‌ అభివృద్ధికి, రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకురావడానికి అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఉభయసభలతోపాటు పార్లమెంటు ఉభయ సభలలో సభ్యుడిగా ఉండాలన్నది నా కోరిక. అందుకనుగుణంగా ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో రాజ్యసభ సభ్యునిగా ప్రయాణం ప్రారంభించాలనుకుంటున్నా’ అని ఎక్స్‌ వేదికగా ఆయన ప్రకటించారు. భవిష్యత్‌లోనూ రాష్ట్రంతో అనుబంధం కొనసాగుతుందన్నారు. కొత్త ప్రభుత్వానికి తన పూర్తి సహకారం, మార్గదర్శకత్వం ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement