జింబాబ్వే క్రికెట్ జట్టుకు భారీ ఊరట లభించింది. ఎట్టకేలకు స్వదేశానికి వెళ్లే మార్గం సుగమమైంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో జింబాబ్వే చిరస్మరణీయ విజయాలు సాధించిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించి
భారత్- శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీలో గ్రూప్-బి నుంచి శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్లతో కలిసి జింబాబ్వే పోటీ పడింది. అనూహ్య రీతిలో మాజీ చాంపియన్లు ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించి గ్రూప్ టాపర్గా సూపర్-8 చేరింది. అయితే, కీలక దశలో వెస్టిండీస్, టీమిండియా, సౌతాఫ్రికా చేతిలో ఓడి నిష్క్రమించింది.
యుద్ధం కారణంగా
ఈ నేపథ్యంలో మార్చి 2న భారత్ నుంచి జింబాబ్వే జట్టు స్వదేశానికి పయనం కావాల్సింది. కానీ ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో గల్ఫ్ వేదికగా ప్రయాణించాల్సిన విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఫలితంగా జింబాబ్వే జట్టు బుధవారం వరకు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ఈ క్రమంలో బ్యాచ్ల వారీగా భారత్ను వీడేందుకు జింబాబ్వే సిద్ధమైనట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. బుధవారం తొలి బ్యాచ్ స్వదేశానికి పయనం కాగా.. శుక్రవారం ఆఖరి బ్యాచ్ ఇండియా నుంచి బయల్దేరుతుందని తెలిపింది.
అందుకే విడతల వారీగా
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని పేర్కొంది. తగినన్ని విమానాలు అందుబాటులో లేనందున విడతల వారీగా ఆటగాళ్లు జింబాబ్వేకు చేరుకుంటాడని బోర్డు వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం జింబాబ్వే జట్టు దుబాయ్ మీదుగా ఎమిరేట్స్ ఫ్లైట్లో వెళ్లాల్సింది.
అయితే, యుద్ధ ప్రభావం కారణంగా అదిస్ అబాబా, ఇథియోపియా మీదుగా హరారేకు వారు చేరుకోనున్నట్లు సమాచారం. మరోవైపు.. వెస్టిండీస్ క్రికెట్ జట్టు సైతం భారత్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
చదవండి: మొయిన్ అలీపై నిషేధం..!


