టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో కీలక పోరుకు టీమిండియా సిద్ధమైంది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్తో గురువారం అమీతుమీ తేల్చుకోనుంది. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానం ఇందుకు వేదిక.
అజేయంగా సూపర్-8కు
ఇక టోర్నీ ఆరంభం నుంచి టీమిండియా మెరుగ్గానే ఆడింది. ముఖ్యంగా గ్రూప్ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్లూ గెలిచి అజేయంగా సూపర్-8కు చేరింది. అయితే, ఆ తర్వాత భారత జట్టు సౌతాఫ్రికా చేతిలో డెబ్బై ఆరు పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో తమ అతి పెద్ద పరాజయాన్ని నమోదు చేసింది.
ఫీల్డింగ్పై విమర్శలు
అనంతరం జింబాబ్వే, వెస్టిండీస్లపై గెలిచిన సూర్యకుమార్ సేన సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, విండీస్తో మ్యాచ్లో భారత్ ఫీల్డింగ్ చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెమీస్లోనూ ఇలాంటి తప్పులు పునరావృతం చేస్తే భారీ మూల్యం చెల్లించకతప్పదని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.
కాగా విండీస్తో మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి రనౌట్ చాన్స్ మిస్ చేయగా.. అభిషేక్ శర్మ రెండు, తిలక్ వర్మ ఒక క్యాచ్ జారవిడిచారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫీల్డింగ్ మాజీ కోచ్ ఆర్. శ్రీధర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
తప్పుడు ఫీల్డర్.. సూర్య ఇలాంటి తప్పు చేస్తాడా?
‘‘బయటి నుంచి చూసి వరుణ్ ఫీల్డింగ్ పొజిషన్ గురించి నేను ఏదైనా మాట్లాడవచ్చు. అయితే, ఆ బంతిని వేసిన అర్ష్దీప్ సింగ్ కోణం నుంచి చూస్తే.. డీప్ స్క్వేర్ లెగ్, డీప్ మిడ్ వికెట్, షార్ట్ ఫైన్ లెగ్ కంటే వరుణ్ షార్ట్ కవర్ రీజియన్లో ఉండటమే మంచిదని అనుకున్నారేమో!
అయినా సూర్యలాంటి తెలివైన కెప్టెన్లు ఇలాంటి ఎలిమెంటరీ స్కూల్ తరహా తప్పులు చేయకూడదు. తప్పుడు ఫీల్డర్ను తప్పుడు ఏరియాలో పెట్టినట్లు అనిపించింది. గతంతో పోలిస్తే వరుణ్ ఫీల్డింగ్ పరంగా మెరుగయ్యాడు. అయితే, ఈసారి మరోమారు తప్పు చేశాడు. అతడు సరైన స్థానంలో ఉన్నాడు. కానీ ఫీల్డింగ్ మాత్రం సరిగ్గా చేయలేకపోయాడు.
ఇక అభిషేక్ శర్మ తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయి క్యాచ్లు జారవిడిచినట్లు అనిపించింది’’ అని ఆర్. శ్రీధర్ విమర్శించాడు. కాగా విండీస్ స్కోరు 13/0గా ఉన్న వేళ అర్ష్దీప్ బౌలింగ్లో రోస్టన్ ఛేజ్ కవర్ షాట్ ఆడి పరుగుకు ఉపక్రమించాడు. అయితే, షాయీ హోప్ మాత్రం బాల్ పొజిషన్ చూసి తిరిగి నాన్ స్ట్రైకర్ ఎండ్కు వచ్చేశాడు.
వరుణ్ వల్లే మిస్
మరోవైపు.. ఛేజ్ పిచ్ మధ్య వరకు రాగా.. వరుణ్ వికెట్ కీపర్ వైపు కాకుండా.. బౌలర్ పొజిషన్ వైపు బంతిని విసిరాడు. దీంతో ఛేజ్ రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ మ్యాచ్లో వరుణ్ షాయీ హోప్ (32) రూపంలో ఒక వికెట్ దక్కించుకున్నాడు. కాగా సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ (50 బంతుల్లో 97 నాటౌట్)తో మెరిసి విండీస్పై భారత్ను గెలిపించాడు.
చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా


