పశ్చిమాసియాలో కొనసాగుతున్న కల్లోలం
అమెరికాకు చెందిన చమురు నౌకపై ఇరాన్ మెరుపు దాడి
నౌక పూర్తిగా మంటల్లో చిక్కిందని పేర్కొన్న ఇరాన్ ప్రభుత్వ వర్గాల
ఇరాక్, కువైట్ల్లో కూడా రెండు చమురు నౌకలపై దాడి!
యూఏఈ, అజర్బైజాన్, దోహాపై బాంబులు, డ్రోన్లు
ఇరాన్ నౌకాశ్రయంపై భారీ దాడులతో విరుచుకుపడ్డ అమెరికా
దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో క్షిపణి, బాంబు దాడులతో విధ్వంసం
లెబనాన్పై దాడుల తీవ్రతను మరింత పెంచిన ఇజ్రాయెల్
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం నానాటికీ పెరుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ గురువారం ఆరో రోజు ఇరాన్ వ్యాప్తంగా భారీ స్థాయిలో క్షిపణులు, బాంబు దాడులతో విరుచుకుపడ్డాయి. ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై పలు దఫాలుగా తీవ్ర స్థాయిలో దాడులు కొనసాగించింది. పలు గల్ఫ్ దేశాలపైనా మరిన్ని డ్రోన్ దాడులకు పాల్పడింది. ఇరు పక్షాలూ నౌకలు, నౌకాశ్రయాలను లక్ష్యంగా చేసుకున్నాయి.
పర్షియన్ గల్ఫ్లో అమెరికా చమురు నౌకపై దాడి చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. దానికి నిప్పంటుకుని భారీగా మంటలు ఎగసిపడుతున్నట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) తెలిపింది. బుధవారం శ్రీలంక తీర సమీపంలో తమ యుద్ధనౌకపై అమెరికా జలాంతర్గామితో దాడి చేసి ముంచేసినందుకు ప్రతీకారంగా ఈ చర్యకు దిగినట్టు వెల్లడించింది.
తమ యుద్ధ నౌకను ముంచేసినందుకు అమెరికా తీవ్రంగా పశ్చాత్తాప పడాల్సి వస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ హెచ్చరించారు. ఆ దేశ నౌకలను ఆ స్థాయిలో లక్ష్యం చేసుకుంటామని ప్రకటించిన కాసేపటికే ఐఆర్జీసీ నుంచి దాడి వార్త వెలువడింది. అమెరికా మాత్రం తమ చమురు నౌకపై దాడి జరిగినట్టు ధ్రువీకరించలేదు. అంతేగాక దక్షిణ ఇరాన్లోని కీలకమైన బందర్ అబ్బాస్ నౌకాశ్రయంపై అమెరికా యుద్ధ విమానాలు భారీస్థాయిలో విరుచుకుపడ్డట్టు తెలుస్తోంది. అక్కడ చాలాసేపటిదాకా భారీ స్థాయిలో పేలుళ్లు వినిపించినట్టు స్థానికులను ఉటంకిస్తూ మీడియా కథనాలు వెలువడ్డాయి.
కీలకమైన హార్మూజ్ జలసంధికి బందర్ అబ్బాస్ అతి సమీపంలో ఉంటుంది. హార్మూజ్ను ఇరాన్ ఇక్కడినుంచే నియంత్రిస్తూ ఉంటుంది. మరోవైపు కువైట్లో కూడా ఒక చమురు నౌకపై దాడి జరిగింది. దాంతో అందులోని చమురు సముద్రంలోకి ఒలికిపోతున్నట్టు సమాచారం. ఇది కూడా ఇరాన్ పనేనని భావిస్తున్నారు! ఇరాక్లోని ఖోర్ అలా జుబెయిర్ నౌకాశ్రయం వద్ద బహమాస్కు చెందిన మరో చమురు నౌకపైనా ఇరాన్కు చెందిన బోటు ఆత్మాహుతి దాడికి దిగింది. యుద్ధం మొదలైనప్పటి నుంచీ గల్ఫ్ ప్రాంతంలో దాడుల బారిన పడ్డ చమురు నౌకల సంఖ్య 9కి చేరింది.
గల్ఫ్ దేశాలపైకి ఇరాన్ డ్రోన్లు!
అమెరికా తమ యుద్ధ నౌకను ముంచేసిన కాసేపటికే ఇరాన్ రెచ్చిపోయింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై బుధవారం అర్ధరాత్రి నుంచే దాడులను తీవ్రతరం చేసింది. దాంతో జెరూసలేం, టెల్ అవీవ్తో పాటు పలు నగరాల్లో జనం వేలాదిగా బంకర్లలో తలదాచుకుంటున్నారు. పదులకొద్దీ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుని నేల కూలి్చనట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. యూఏఈ, ఖతర్తో పాటు దోహాలోని అమెరికా సైనిక స్థావరాలపైనా ఇరాన్ ఎడాపెడా డ్రోన్ దాడులకు దిగింది. ఆరు ఖండాంతర క్షిపణులతో పాటు 125 డ్రోన్లను అడ్డుకుని కూల్చేసినట్టు యూఏఈ ప్రకటించింది.
అబుదాబిలో డ్రోన్ శకలాలు పడి ఆరుగురు గాయపడ్డారు. దాడుల నేపథ్యంలో దోహాలోని అమెరికా రాయబార కార్యాలయం సమీప ప్రాంతాలను ఖతర్ ఖాళీ చేయించింది. దాడుల తీవ్రత దృష్ట్యా దుబాయ్లోని ఎమర్జెన్సీ లాజిస్టిక్స్ హబ్లో కార్యకలాపాలను నిలిపేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా గళం విప్పకపోతే యూరప్ దేశాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది!
అంతేగాక తన దాడులను అజర్బైజాన్కూ విస్తరించడం కలకలం రేపుతోంది. నఖి్చవాన్లో విమానాశ్రయంతో పాటు ఓ స్కూలు వద్దా పేలుళ్లు సంభవించాయి. దాంతో ఇరాన్ సరిహద్దుల సమీపంలో గగనతలాన్ని అజర్బైజాన్ మూసేసింది. తమపై భారీ స్థాయిలో డ్రోన్ దాడులు జరిగాయంటూ మండిపడింది. ఇందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ డిమాండ్ చేశారు. మరోవైపు అమెరికా ఎఫ్–15ఈ యుద్ధ విమానం ఇరాన్లో కుప్పకూలినట్టు వార్తలొచ్చాయి. వాటిని యూఎస్ సెంట్రల్ కమాండ్ మాత్రం ఖండించింది.
మెరుగైన విమాన సర్వీసులు
పశ్చిమాసియా దేశాల నుంచి ఐదు రోజులుగా దాదాపుగా పడకేసిన విమాన సరీ్వసులు గురువారం పాక్షికంగా కొనసాగాయి. ఒమన్, ఖతర్ తదితర దేశాలు పలు సరీ్వసులను నడిపాయి. దాంతో ఆయా దేశాల్లో చిక్కుబడ్డ యూరప్ తదితర దేశాలకు చెందిన వేలాదిమంది తిరుగు ప్రయాణమయ్యారు.
ట్రంప్ రక్తం కళ్లజూస్తాం
ఇరాన్ మత నేత అమోలీ
యుద్ధ కల్లోలం ఇప్పటికే ఆందోళనలు రేకెత్తిస్తున్న వేళ ఇరాన్ ఉద్రిక్తతలను మరింతగా పెంచే ప్రకటనలకు దిగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు ఇజ్రాయెలీల రక్తం కూడా కళ్లజూడాలంటూ ఇరాన్ మత పెద్ద అయతొల్లా అబ్దొల్లా జావేదీ అమోలీ ఏకంగా ప్రభుత్వ వార్తా చానల్లోనే దేశవాసులకు పిలుపునిచ్చారు! షియా ముస్లిం మత పెద్దల్లో అత్యున్నతమైన అయతొల్లా స్థాయి నేత నోట ఇలాంటి మాటలు రావడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి.
లంక వైపు మరో ఇరాన్ యుద్ధ నౌక
కొలంబో: ఇరాన్కు చెందిన మరో యుద్ధ నౌక ఐఆర్ఐఎన్ఎస్ బుషెర్ గురువారం శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించడం కలకలం రేపింది. ఇంజన్ వైఫల్యం కారణంగా లంకను అత్యవసర సాయం కోరి ట్రింకోమలి రేవులో లంగరు వేసింది. నౌకను తమ రేవులోకి అనుమతించి అందులోని 208 మంది సిబ్బందిని ఖాళీ చేయించినట్టు లంక తెలిపింది. ఇరాన్కు చెందిన భారీ యుద్ధనౌక ఐఆర్ఐఎస్ దేనాను బుధవారం లంక తీరానికి సమీపంలో అమెరికా ముంచేయడం తెలిసిందే.
అణు కార్యక్రమానికి స్వస్తి! ఇరాన్ కీలక ప్రకటన ?
యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అణు కార్యక్రమానికి స్వస్తి పలికేందుకు సంసిద్ధత వెలిబుచ్చింది! ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి మాజిద్ తఖ్త్ను ఉటంకిస్తూ అరబిక్ న్యూస్ వార్తా సంస్థ ఈ మేరకు పేర్కొంది. అయితే అణు కార్యక్రమానికి బదులు తమకు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని సూచించాలని అమెరికాకు షరతు విధించినట్టు సమాచారం. కానీ తఖ్త్ వ్యాఖ్యలు గతంలో చేసినవేనని ఇరాన్ అధికార వార్తా సంస్థ చెప్పుకొచ్చింది.
రంగంలోకి కుర్దు గ్రూపులు!
ఇరాన్, ఇరాక్ సరిహద్దుల్లోని కుర్దిష్ గ్రూపులు కూడా యుద్ధ రంగంలోకి ప్రవేశించే సూచనలు కని్పస్తున్నాయి. అమెరికాకు దన్నుగా ఇరాన్పై దాడులకు దిగుతామని పలు గ్రూపులు గురువారం ప్రకటించాయి. అమెరికా అధికారులు కూడా వాటి నేతలు మసూద్ బర్జానీ, బఫేల్ తలాబానీ, ముస్తఫా హిజ్రీ తదితరులతో ఇప్పటికే చర్చలు జరిపారని, దాడులకు కావాల్సిన సాయుధ సంపత్తిని అందజేస్తామని హామీ ఇచ్చారని సమాచారం. ఇరాన్, ఇరాక్ల్లోని కుర్దు సమూహాలు తమకు స్వతంత్ర దేశం కావాలని చిరకాలంగా పోరాడుతూ వస్తున్నాయి.
అల్లాడిన ఇరాన్
ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల దెబ్బకు ఇరాన్ అల్లాడిపోతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి టెహ్రాన్ తదితర నగరాలపైకి నిర్విరామంగా బాంబులు, క్షిపణులు వచ్చిపడుతున్నాయి. 300 పై చిలుకు బాలిస్టిక్ మిసైల్ లాంచర్లను నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటిదాకా ఇరాన్పై 5,000కు పైగా భారీ బాంబులు, వెయ్యికి పైగా క్షిపణులు ప్రయోగించినట్టు తెలిపింది.
దక్షిణ ఇరాన్లోని క్షిపణి లాంచర్లను అమెరికా; మధ్య, పశ్చిమ ఇరాన్లోని లక్ష్యాలపై ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నట్టు సమాచారం. దాడులు 175 నగరాలకు విస్తరించినట్టు ఇరాన్ ధ్రువీకరించింది. పౌర సముదాయాలపై కూడా విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారంటూ మండిపడింది. ఇరాన్ సరిహద్దుల్లోని సనందాజ్, సఖెజ్,బుకాన్ తదితర కుర్దు ప్రాబల్య నగరాలపైనా తాజాగా దాడులు జరిగాయి. టెహ్రాన్లోని సైనిక, ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయాలు, స్థావరాలపై క్షిపణుల వర్షం కురిసింది.
యుద్ధంలో ఇప్పటిదాకా 1,230 మందికి పైగా మరణించినట్టు ఇరాన్ వెల్లడించింది. లెబనాన్పైనా దాడులను ఇజ్రాయెల్ మరింత ఉధృతం చేసింది. బీరూట్తో పాటు పలుచోట్ల హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధాగారాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ట్రిపోలీలోని శరణార్థుల శిబిరంపై జరిగిన దాడుల్లో ఇద్దరు మరణించారు. దాంతో లెబనాన్లో ఇప్పటిదాకా మృతుల సంఖ్య 70 దాటింది. బీరూట్ దక్షిణ శివార్ల ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. హమాస్ కమాండర్ వసీం అతల్లా అలీని దాడుల్లో మట్టుబెట్టినట్టు ప్రకటించింది.


