విశ్లేషణ
ఎక్కువ ఉపయోగంలో లేదు గానీ ‘పారదర్శక అబద్ధాలు’ అనే మాట ఒకటుంది. దాని అర్థం, ఒక మనిషి అబద్ధాలు చెప్తే అవి అబద్ధాలని వెంటనే అందరికీ అర్థమైపోవటం. అటువంటి పారదర్శక అబద్ధాలు చెప్పటంలో ఘనా పాఠిగా మారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మరో వరుస అబద్ధాలు చెప్తూ ఇరాన్పై ఫిబ్రవరి 28న యుద్ధానికి తలపడ్డారు. యుద్ధానికి చెప్పిన కారణాలన్నీ పచ్చి అబద్ధాలని పరిశోధనలు చేసి నిరూపించవలసిన అవసరమేమీ లేదు.
స్వయంగా అమెరికన్ ప్రభుత్వపు నివేదికలు, అక్కడి మీడియా, చివరకు గతంలో ట్రంప్ తానే చేసిన ప్రకటనలు తేల్చి చూపుతున్నాయి. ‘యుద్ధాలు చేయ బోను, యుద్ధాలను అంతటా ఆపుతున్నాను’ అంటూ జనవరిలో మాదక ద్రవ్యాల విషయమై అబద్ధపు ఆరోపణలతో వెనిజులా అధ్యక్షుడిని, ఆయన భార్యను అపహరించారు; కేవలం రెండు నెలల తర్వాత, ఇరాన్ ‘కొద్ది రోజులలోనే’ అణ్వస్త్రాలు తయారు చేసి తమకు ముప్పుగా మారనుందనే అబద్ధం చెప్తూ ఆ దేశ అధినేతను కుటుంబ సభ్యులతో సహా బలిగొన్నారు.
మళ్లీ అవే అబద్ధాలు
ప్రస్తుత యుద్ధం ఎట్లా సాగి, ఏ విధంగా ముగుస్తుందన్నది అట్లుంచుదాం. అమెరికా, ఇజ్రాయెల్ తామే ప్రకటించినట్లు ‘గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో’ సైనిక సన్నాహాలు సాగించి మొదలుపెట్టిన యుద్ధం వారు ఆశించినట్లు రెండు రోజులలోనే ముగియక పోగా, రోజులు గడిచేకొద్దీ ఇరాన్ పట్టుదలతో మరింత భీకరంగా మారటం మాత్రం కనిపిస్తున్నది. ఇరాన్ అణుకేంద్రాలపై నిరుడు జూన్లో ఇజ్రాయెల్తో కలిసి దాడులు జరిపిన ట్రంప్, ఆ కేంద్రాలు ‘పూర్తిగా తుడిచి పెట్టుకుపోయా’యని ప్రకటించారు. ఆ దాడులకు ముందు కూడా, ఇరాన్ అణ్వస్త్రాలు ఇక ‘కొద్ది వారాలలోనే’ తయారు కానున్నాయన్నారు. ఆ మాట అబద్ధమని అపుడు కూడా ప్రపంచానికి వెంటనే అర్థమైంది.
తమ లక్ష్యం శాంతియుత వినియోగమే తప్ప అస్త్రాల తయారీ ఎంత మాత్రం కాదనీ, అంతర్జాతీయ చట్టాల మేరకు శాంతియుత వినియోగం తమ హక్కనీ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో అందుకే చేరామనీ అన్న ఇరాన్ మాటలను నమ్మకపోయినా, యథాతథంగా అణ్వస్త్ర తయారీ సన్నాహాలు ఎప్పుడూ ఎవరికీ కనిపించలేదు. అస్త్రాల కోసం యురేనియం శుద్ధి 90 శాతం అవసరం కాగా ఆ కేంద్రాలలో శుద్ధి ఎన్నడూ 60 శాతానికి దాట లేదు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నది. అమెరికన్ నిఘా సంస్థల నివేదికలు సైతం 60 శాతమనే చెప్పాయి. ఇవన్నీ గాక, అణుశక్తి వినియోగంపై ఇరానియన్ ప్రభుత్వం అమెరికా, యూరప్లతో చర్చలు జరుపుతూనే ఉంది. అయినా తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం, ట్రంప్ ఇరాన్ కేంద్రాలపై బి–52 బాంబర్లతో దాడులు చేశారు.
గ్రేటర్ ఇజ్రాయెల్ కోసమే!
అవే ప్రయోజనాల కోసం ఇపుడు తిరిగి సరిగా అవే అబద్ధాలు చెప్తూ యుద్ధం మొదలు పెట్టారు. గత జూన్ దాడులలో ఆ నిర్మాణాలు బాగా దెబ్బతినగా అక్కడి యురేనియం నిల్వలు, యంత్ర సామగ్రి ఆ శిథిలాల కింద కూరుకుపోయి ఉన్నాయి. వాటిని ఇరాన్ కనీసం బయటకు అయినా తీయలేదు. అటువంటపుడు అస్త్రాల తయారీ ప్రసక్తి ఎక్కడిది? పైగా, భవిష్యత్తులో శాంతియుత వినియోగం లేదా మరొకటి అన్న ప్రశ్నలపై ఇరాన్, అమెరికాల మధ్య కొద్ది నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. ఆ విషయమై ఒప్పందం కుదిరే సూచనలున్నట్లు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఒమన్ గత వారమే ప్రకటించింది.
విషయమేమంటే, ఇజ్రాయెల్కు, వారి పలుకుబడితో వ్యవహ రిస్తున్న ట్రంప్కు, పశ్చిమాసియాలో ఇరాన్ ఒక్కటే స్వతంత్రంగా నిలబడి అభివృద్ధి చెందటం కంటగింపుగా మారింది. వారి పరమ లక్ష్యం పాలస్తీనా దేశం ఏర్పడక పోవటం, గ్రేటర్ ఇజ్రాయెల్ సృష్టి, ఇరాన్ను సామంత రాజ్యంగా మార్చి అక్కడి చమురు నిల్వలు కాజేయటం! అమెరికా అధ్యక్షుడు అంతే పెద్ద అబద్ధం మరొకటి ప్రచారం చేస్తున్నారు. ఇరాన్ అణ్వస్త్రాలనే గాక, వాటిని అమెరికాపై ప్రయో గించగల క్షిపణుల తయారీని పూర్తి చేస్తున్నదని! ఇరాన్ వద్ద గల క్షిపణులలో అతి ఎక్కువ దూరం ప్రయాణించగల వాటి పరిధి సుమారు 1,200 కి.మీ. కాగా, ఇరాన్ నుంచి అమెరికా దూరం దాదాపు 12,000 కి.మీ.లు. అనగా 10 రెట్లు ఎక్కువ. ఇవన్నీ అమె రికా నివేదికలు, నిపుణుల లెక్కలే. అటువంటి స్థితిలో అణ్వస్త్రా లెక్కడ? వాటిని అమెరికా వరకు ప్రయోగించగల క్షిపణులెక్కడ?
అసలు విషాదం
ట్రంప్ ఒక పారదర్శక అబద్ధాలకోరు అన్నది ప్రపంచంతో పాటు స్వయంగా అమెరికన్లకు, తన ‘మాగా’ ఓటర్లకు కూడా అర్థమైంది. అందువల్లనే ఆయన ‘అప్రూవల్ రేటింగ్’ 27 శాతానికి పడిపోయింది. ‘మాగా’ అనే ఉత్తేజకర నినాదంతో గెలిచిన ఆయన ఆ లక్ష్యాల సాధనకు సవ్యమైన మార్గాలను ఎంచుకునే బదులు, వ్యక్తిగత ప్రయోజనాలకు, విధానపరమైన వైఫల్యాలకు, ఇజ్రాయెలీ లాబీకి బందీ అయి, ఈ అరాచకాలన్నీ సృష్టిస్తున్నారు.
యుద్ధం మొదలు పెట్టినప్పుడు ఇరాన్లో ప్రభుత్వాన్ని, రాజ కీయ వ్యవస్థనే మార్చివేసి, రివల్యూషనరీ గార్డ్స్ను అంతం చేయగలమన్న ట్రంప్, 48 గంటలు గడవగానే ప్రభుత్వాన్ని, వ్యవస్థను మార్చటం తమ లక్ష్యం కాదంటున్నారు. ఆయన బహిరంగంగా పిలుపు ఇచ్చినట్లు అక్కడి ప్రజలేమీ తిరుగుబాటు చేసి ‘ప్రభుత్వాన్ని తమ చేతులలోకి తీసుకోవటం’ లేదు. ట్రంప్, నెతన్యాహూల దుర్మా ర్గానికి, పశ్చిమాసియాలో అమెరికన్ స్థావరాలకు అవకాశమిచ్చి సామంతులుగా వ్యవహరిస్తున్న గల్ఫ్ దేశాలు బలవుతున్నాయి.
గతంలోకి వెళితే, ఇరాన్ చమురును మొదటి నుంచి తమ అధీనంలో ఉంచు కున్న పాశ్చాత్య దేశాలు అక్కడ ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చిన ప్రధాని మొసాదెగ్ను 1953లో సీఐఏ, ఎంఐ6 కుట్రతో పడగొట్టినప్పటి నుంచి ఈ క్రీడ సాగుతున్నది. 1979లో వచ్చిన ఇస్లామిక్ పాలన అందుకు అడ్డుకట్ట వేయటాన్ని సహించలేక, షా పహ్లవీ కుమారుడిని తిరిగి అమెరికా నుంచి దిగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ పరిణామాల మధ్య పెద్ద విషాదం ఒకటున్నది. గ్లోబల్ సౌత్కు నాయకత్వం వహించాలని ఉవ్విళ్లూరుతున్న ప్రధాని మోదీ– మదురో దంపతుల అపహరణను, వెనిజులాపై దాడిని, ఇరాన్పై దాడిని, ఖమేనీ హత్యను కనీసం పరోక్షంగానైనా ఖండించే సాహసం చేయలేదు.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


