breaking news
Guest Column
-
వెనిజులాపై అమెరికా యుద్ధోన్మాదం
వెనుకబడిన, బలహీనమైన చిన్న దేశా లను, ఆ దేశాల ప్రభుత్వాలను ఆయుధ బలంతో తన చెప్పుచేతుల్లో పెట్టుకోవడం, తన మాట వినని ప్రభుత్వాలు కూలిపోయేలా చేయడం, అది సాధ్యం కాకపోతే యుద్ధం ద్వారా తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తరు వాత ఆ దేశాల సహజ వనరులను తరలించుకుపోవడం అమెరికా అనుసరిస్తున్న విధానంగా ఉంది.నేడు వెనిజులాపై దాని యుద్ధ సన్నాహాలు ఆ విధానంలో భాగమే. దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాపై దాడి చేయడానికి అమె రికా అధ్యక్షుడు ట్రంప్ కరేబియన్ దీవులకు 8 వార్షిప్లతో పాటు అతిపెద్ద విమాన వాహక నౌకను, 10 వేల మంది సైనికులనుపంపాడు. ఇది ఇలా ఉండగా 2025 సెప్టెంబర్ 2 నాడు వెనిజులా నుంచి పోతున్న పడవలపై అమెరికా దాడి చేసి 11 మంది ప్రాణాలు తీసింది. ఈ దాడికి కారణం పడవల్లో వెనిజులా మాదక ద్రవ్యాలను రవాణా చేయడమే అంటున్నది.వెనిజులాపై అమెరికా వ్యతిరేకత చాలా కాలంగా కొనసాగు తున్నది. ఆ దేశ భూగర్భంలో చమురు, సహజ వాయువు నిక్షేపాలు, వజ్రాలు, బంగారం వంటివి అపారంగా ఉన్నాయి. తన బహుళ జాతి సంస్థల ద్వారా వాటిని తరలించుకు పోతున్న అమెరికాకు, 1999లో వెనిజులా అధ్యక్షునిగా ఎన్నికైన హ్యూగో చావేజ్ అడ్డు కట్ట వేశాడు. ప్రభుత్వ సంస్థలను జాతీయం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న పెట్టుబడిదారీ అనుకూల ముఠా చావేజ్ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రయత్నాలకు మద్దతిచ్చింది.ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. బొలీ వియా దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక సమూహాలకు ఒక అమెరికా రాయబారి సహకరించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ దేశానికి మద్దతుగా 2008లో అమెరికా రాయబారిని వెనిజులా దేశం నుంచి బహిష్కరించింది. చావేజ్ మరణం తర్వాత వరుసగా మూడు సార్లు నికోలస్ మదురో అధ్యక్షుడయాడు. తమ దేశ పెట్టుబడిదారులకు చెందిన వెనిజులాలోని సంస్థలనూ, గను లనూ ఆ దేశం జాతీయం చేసినందుకు నష్టపరిహారం చెల్లించాలని అమెరికా కోర్టులు తీర్పులు వెల్లడించాయి. సార్వభౌమాధికారం గల ఒక దేశానికి సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. వెనిజులా అలాంటి దేశం కాబట్టి చమురు పరిశ్రమలను, ఖనిజాల గనులను జాతీయం చేసింది. ఆ దేశ నిర్ణయాలపై అమెరికా కోర్టులు తీర్పులు ఎలా ఇస్తాయి? వెని జులా నుంచి ఎవరూ చమురు కొనవద్దని అమెరికా ఆంక్షలు (2023) విధించి ఆర్థికంగా దాన్ని దెబ్బతీస్తోంది.అలాగే వెనిజులాపై యుద్ధానికి సిద్ధమై ఆ దేశ గగన స్థలాన్ని మూసి వేస్తున్నట్లు ప్రకటించింది అమెరికా. అధ్యక్షుడు నికోలస్ మదురో దేశం విడిచిపెట్టి పోవాలని, అతని మంత్రి వర్గ ముఖ్య సహచరులను కాపాడుకోమని ట్రంప్ బెదిరించినట్లు ‘హెరాల్డ్’ పత్రిక పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వ ప్రకటనను వెనిజులా తీవ్రంగా ఖండించింది. ఇది ఏకపక్ష చర్య అని పేర్కొంది. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో విమాన సర్వీసులను నిలిపి వేసిన స్పెయిన్, పోర్చుగల్, కొలంబియా, చిలీ, బ్రెజిల్, తుర్కియే దేశాలపై వెనిజులా ఆగ్రహం వ్యక్తం చేసి ఆ దేశాలకు సంబంధించిన విమాన సంస్థలపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.సార్వభౌమాధికారం గల ఒక దేశ గగన స్థలాన్ని మరొక దేశం మూసి వేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ ఒడంబడికలకు విరు ద్ధమైనది. ఒక స్వతంత్ర దేశమైన వెనిజులా అధ్యక్షుణ్ణి పట్టి అప్పగించమని అమెరికా కోరడం, నికోలస్ మదురో సమాచారం ఇస్తే ఏకంగా 5 కోట్ల డాలర్ల బహుమతి ప్రకటించడం దాని హంతక మనస్తత్వానికి నిదర్శనం. – బొల్లిముంత సాంబశివరావురైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు -
మనకు తెలియని మరో దేశం
అనేక భాషలు, సంస్కృతుల సమ్మేళనంగా, వివిధ ప్రాంతాల సమాఖ్యగా భారతదేశం విశాలమైనది.అంతకు మించి వైవిధ్యభరితమైనది. అలాంటి చోట ‘హిందీ బెల్ట్’గా రాజకీయ, ఆర్థిక జనవ్యవహారంలో పాపులరైన ప్రాంతం రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, బిహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల భూమి. మహాజనపదాల కాలం నుంచి ఇవాళ్టి దాకా భారత రాజకీయ భవితవ్యాన్ని నిర్దేశించడంలో ఈ ప్రాంత ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.చెప్పాలంటే, మొత్తం దేశ విస్తీర్ణంలో దాదాపు 38 శాతం, అలాగే భారత జనాభాలో 42కి పైగా శాతం ఇక్కడిదే. దేశ పార్లమెంట్ సభ్యుల్లో 40 శాతం పైగా ఇక్కడివారే. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశానికి 15 మంది ప్రధానమంతులైతే, వారిలో సగానికి పైగా (8 మంది) ఇక్కడివారే. అయినా ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతంగా మిగిలి, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అవినీతి, హింస తదితర జాడ్యాలతో సతమతమవుతోంది.దేశ వనరుల్లో అధిక భాగం ఇక్కడే ఖర్చవుతున్నా ఈ వెనుకబాటుతనానికి కారణాలేమిటి? ఆ ప్రశ్నకు జవాబుగా ఆ ప్రాంతంపై వివిధ కోణాల్లో వేసిన ఫోకస్లైట్... గజాలా వహాబ్ రచన ‘ది హిందీ హార్ట్ల్యాండ్’.ప్రధానంగా అయిదు విభాగాలుగా సాగిన ఈ రచన కీలకమైన హిందీ ప్రాంతం ప్రత్యేకతను సంత రించుకోవడానికి దోహదం చేసిన చారిత్రక కారణా లనూ, అలాగే వెనుకబాటు సహా సమకాలీన చరిత్రను ప్రతిఫలించే అక్కడి అనుభవాలనూ అందంగా గుది గుచ్చింది. అవి చదువుతుంటే ఆ ప్రాంత సామాజిక, రాజకీయ, ధార్మిక చలనసూత్రాలపై మునుపున్న అవ గాహన మరింత విస్తరిస్తుంది.స్వతంత్ర భారతావనిలో కాలగతిలో పెరుగుతూ వచ్చిన మత విద్వే షాలకు కారణాలపైనా ఈ రచన దృష్టిపెట్టింది. రచ యిత్రి ప్రాథమికంగా పాత్రికేయురాలు కావడంతో ఇంటర్వ్యూలు, సంభాషణలు, స్థానికంగా పర్యటన లతో సమాచారం సేకరించి, పరిణామాలన్నిటినీ క్షేత్ర స్థాయి నుంచి, ప్రత్యక్ష సాక్షుల ద్వారా పాఠకుల కళ్ళ ముందుంచారు. కుల మతాల చిచ్చులోపడి కునారిల్లుతున్న ఈ ప్రాంతంలో ముస్లిమ్లతో సంఘర్షణ కేవలం 144 ఏళ్ళ నుంచేననీ, ఎప్పుడో 12వ శతాబ్దం నుంచి ఉన్న సామరస్య సహజీవనాన్ని కొనసాగిస్తే అభివృద్ధి సాధ్యమేననీ రోడ్మ్యాప్ చూపారు. 1857 తర్వాత పెరుగుతూ వచ్చిన హిందూ – ముస్లిమ్ విభేదాలతోనే శుద్ధ హిందీని హిందువుల భాషగా, ఉర్దూను ముస్లిమ్ల భాషగా చిత్రీకరించే యత్నం మొదలైంది. ఇటీవల బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోలీసు పరిభాష నుంచి ఉర్దూ పదాలను ప్రభుత్వాలు తొలగించడం దాకా అది జరుగుతూనే ఉందని చారిత్రక ఆధారాలతో తెలుసుకుంటాం. భాష, సంస్కృతి పేరిట సాగుతున్న రాజకీయాలతో పాటు టాకీల తొలినాళ్ళ నుంచి హిందీ చిత్రసీమలో అధిక భాగం రచయితలు, కవులు హిందీ బెల్ట్ నుంచి ముంబయ్కి వెళ్ళినవారేనన్నది ఆలోచింపజేసే వాస్తవం. కులం, మతం, భాషా రాజకీయాల సూక్ష్మ వాస్తవాల విశ్లేషణ ఈ పుస్తకంలోని అధ్యాయాల నిండా పరుచుకుంది. లౌకికవాదం అనే మాటను సైతం దోషంగా భావిస్తూ, సామరస్యపూర్వక సాంస్కృతిక సమ్మిళిత జీవనాన్ని చెప్పే గంగా–జమునా తెహజీబ్ను తప్పుగా ఎంచే కాలానికి మన దేశం, ముఖ్యంగా హిందీ ప్రాంత ప్రయాణాన్ని ఆవేదనాభరితంగా బొమ్మ కడుతుంది.చరిత్ర, స్వాతంత్య్రోద్యమం, ఎమర్జెన్సీ... ఇలా ఎన్నింటినో స్పృశిస్తూ సాగే ఈ రచన కనిపించని కథ లెన్నో వెలికితీసింది. శివాజీ పట్టాభిషేకం, బ్రిటిషర్లపై చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ తిరుగుబాటు వెనుక కథలెన్నో ఆసక్తి రేపుతాయి. నిజానికి, విస్తృత చారిత్రక క్యాన్వాస్ ఉన్న పుస్తకాన్ని ఏకబిగిన చదవడమే అనుకుంటే, రాయడం మరీ కష్టం. కానీ, గజాలా పడిన కష్టమేమో కానీ హాయిగా చదివించడం ఈ రచన ప్రత్యేకత. చదువుతుంటే రచయిత్రి పక్కనే కూర్చొని కాశీ నుంచి కశ్మీర్ దాకా ప్రయాణించిన అను భూతి. కళ్ళ ముందు జరుగుతున్న కథలా చరిత్రను తెలుసుకుంటున్న భావన. ఈ రచనకున్న అతి పెద్ద బలాలు అవే! -గజాలా వహాబ్,జర్నలిస్టు – రచయిత్రి -
ఈసీపై నమ్మకం పెరిగేనా?
గట్టిగా బెట్టు చేసిన తర్వాత, ఎన్నికల సంస్కరణలపై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం దిగివచ్చింది. కానీ ఓటర్ల జాబితాల ప్రత్యేక సునిశిత సవరణ (సర్)పై నెలకొన్న వివాదం పరిష్కార మయ్యేందుకు ఇది తోడ్పడుతుందా? అసాధారణమైన రీతిలో సర్ నిర్వహించా లని భారత ఎన్నికల కమిషన్ (సీఈసీ) గైకొన్న నిర్ణయం అత్యంత వివాదాస్పద మైన నిర్ణయాలలో ఒకటిగా నిలుస్తుంది. ‘లొసుగులు లేని’ ఓటర్ల జాబితాలను రూపొందిస్తున్నామని కమి షన్ చెప్పుకుంటూంటే, ఇది చాలామంది ఓటు హక్కును కాల రాసేదిగా తయారైందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.సంస్కరణలకు ముందున్న పార్లమెంట్ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల తర్వాత ముఖ్యమైన భాగస్వా ములైన రాజకీయ పార్టీలు ఎన్నికల సంస్కరణలు తీసుకురావడంలో ముందు నిలిచిన సందర్భాలు అరుదు. సుప్రీం కోర్టు ముందుకు నెట్టిన సందర్భాలలో తప్పించి, ప్రభుత్వాలు కూడా సంస్కరణలకు విముఖంగానే ఉంటూ వస్తున్నాయి. పోలింగ్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనేటట్లు చేసేందుకు, సాంకేతిక ప్రగతిని వాడుకునేందుకు, నేరస్థులు పోటీ చేయకుండా అరికట్టేందుకు, పారదర్శకతను పెంచేందుకు, ఎన్నికల ప్రచారంలో నడచుకోవాల్సిన తీరును మెరుగుపరచేందుకు గణనీయమైన సంస్కరణలు తీసుకురావడంలో పార్లమెంట్ ముఖ్య భూమిక వహించింది. ఓటు హక్కు వినియోగించుకునే వయో పరిమితిని 1988లో 21 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళకు తగ్గించారు. తర్వాత, 2021లో అర్హత గడించుకునే తేదీలను పెంచారు. వయోజనులు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత, తదుపరి ఏడాది జనవరి 1 వరకు వేచి చూడన వసరం లేకుండా– జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల మొదటి తేదీలలో కూడా తమ పేర్లను ఓటరుగా నమోదు చేసుకోవచ్చని మంచి మార్పు తెచ్చారు. అలాగే, 1993లో ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టారు.ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం)లను వినియోగించ డాన్ని 1998లో దశల వారీగా మొదలుపెట్టి, అవి సక్రమంగా ఉన్నాయో లేవో సరిచూసేందుకు, ‘ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్’ (వీవీప్యాట్)లను 2019లో తప్పనిసరి చేశారు. సుప్రీం కోర్టు ఆదేశం పుణ్యమా అని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ పూర్వాపరాలను వెల్లడించడం 2003 నుంచి మొదలైంది. దోషులుగా తేలిన లెజిస్లేటర్లను, లిల్లీ థామస్ కేసు పర్యవసానంగా, వెంటనే అనర్హులుగా చేయడం 2013లో మొదలైంది. పోలింగ్ కేంద్రాలను ఆక్రమించుకున్నా లేదా పెద్ద యెత్తున హింస చోటు చేసుకున్నా పోలింగ్ను వాయిదా వేసే లేదా రద్దు చేసే అధికారాన్ని పార్లమెంట్ 1989లో ఎన్నికల కమిషన్కు కట్టబెట్టింది. ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలనే లక్ష్యంతోనే ఎన్నికల కమిషన్, పార్లమెంట్, సుప్రీం కోర్టు ఆ యా సంస్కరణలు తెచ్చాయి.అవసరమైన సంస్కరణలుఎగువ పేర్కొన్న శాసనపరమైన మార్పులు తెచ్చినప్పటికీ, పెండింగ్లో ఉన్న సంస్కరణల జాబితా పెద్దదే. అభ్యర్థులను అనర్హు లుగా ప్రకటించడానికి సంబంధించిన చట్టాన్ని మరింత కఠినతరం చేయడం నుంచి రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చేందుకు ప్రత్యా మ్నాయ పద్ధతులను రూపొందించడం, ఎన్నికల ప్రచార ఖర్చులపై ఒక పరిమితి విధించడం వరకు చాలానే ఉన్నాయి. రాజకీయ పార్టీల లీగల్ స్టేటస్పై స్పష్టత లోపించడం ఇప్పటికీ ఆందోళనకర అంశమే. రాజకీయ పక్షాలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకు రావాల్సిన అవసరం కూడా ఉంది. కీలకమైన ఈ అంశాలను పక్కన పెట్టేసి, ‘సంస్కరణలన్నింటికీ’ తల్లిగా చెబుతున్న ‘ఒక దేశం – ఒకే ఎన్నిక’పై చర్చించడంలో పార్లమెంట్ చొరవను ప్రదర్శించింది.‘సర్’పై ఆవేశకావేషాలను చల్లార్చవలసిన బాధ్యత కమిషన్ పైనే ఉంది. తమ ఓటు హక్కును తొలగిస్తున్నారని కొందరు అంటూంటే, దానికి తక్కువ సమయంలో ఎక్కువ పని చేయ వలసి రావడం వల్ల ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది పోలింగ్ కేంద్ర స్థాయి (బీఎల్వో) అధికారులు చనిపోయినట్లు చెబుతున్న అంశం తోడవు తోంది. కమిషన్ కున్న నిష్పాక్షిక ప్రతిష్ఠను సవరణ తతంగం మసక బారేటట్లు చేసింది. సాఫీగా, శాంతియుతంగా నిర్వహించదగిన ఓటర్ల జాబితా సవరణను, అనర్హత రాక్షసిపై యుద్ధంగా మార్చినందుకు కమిషన్ నిందను స్వీకరించవలసిన అవసరం లేదా?బిహార్లో ఏం సాధించినట్టు?బిహార్లో తుది ఓటర్ల జాబితాను లోపాలు లేకుండా మెరుగు పరచడం ద్వారా గడించిన ప్రస్ఫుట ప్రయోజనాలు ఏమిటో కమి షన్ తప్పకుండా ఆత్మపరిశీలన చేసుకుని, ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉంది. అది గతంలో డూప్లికేషన్ సాఫ్ట్వేర్ను విజయవంతంగా వినియోగించుకుంది. ఇపుడు దాన్ని ఉపయోగించి అన్ని రాష్ట్రాల ఓటర్ల జాబితాలను తనిఖీ చేయాలి. తద్వారా, డూప్లికేట్ ఓటర్లను గుర్తించి, వారి పేర్లను జాబితాల నుంచి తొలగించవచ్చు. కానీ అది ఆ సాఫ్ట్వేర్ను పక్కన పెట్టడానికి గల కారణం తెలియడం లేదు.‘‘డూప్లికేషన్ను నివారించేందుకు ఒకే ఒక్క సేకరణ ఫారాన్ని’’ మనఃసాక్షి ననుసరించి సమర్పించవలసిందిగా ఓటర్లను కోరడంపై అది ఆధారపడుతోంది. తాను ఎప్పుడూ అనుసరించే సాధారణ సవరణ విధానాల ప్రకారం కాకుండా, దేశవ్యాప్తంగా సునిశిత సవరణ ద్వారా తాను ఏం సాధించదలచుకున్నదీ కమిషన్ స్పష్టంగా వివరించి తీరాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ‘అర్హత లేని’ ఓటరును వెతికి పట్టు కునేందుకు ఇపుడు ఉన్న ఓటర్లు అందరినీ హాజరు పరచి తనిఖీ చేసే వ్యామోహాన్ని కమిషన్ వదులుకోవాలి. బిహార్లో సునిశిత సవరణ ద్వారా అది ఆ పని చేయలేకపోయింది.ప్రజలకు తనపై ఉన్న నమ్మకాన్ని తిరిగి గడించుకోవడంలో పార్లమెంట్లో జరిగే చర్చ కమిషన్కు ప్రేరణ నిస్తుందని ఆశిద్దాం. పార్లమెంట్ లేదా సుప్రీం కోర్టు మాదిరిగానే ఎన్నికల కమిషన్ కూడా ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. అది తన తలుపులను తెరచి ఉంచితే జనం ఇతర సంస్థల తలుపులు తట్టాల్సిన అవసరం ఉండదు. మన రిపబ్లిక్ అవతరించకముందే పురుడుపోసుకున్న కమిషన్కు పౌరు లతో పేగు బంధం ఉంది. ఈ రక్త సంబంధాన్ని ఏ సుప్రీం కోర్టు ఉత్తర్వో గుర్తు చేయవలసి వస్తే అది విషాదకరం అవుతుంది. రాజకీయ సంక్షోభం దానికి కారణమైతే, అంతకుమించిన విషాదం మరొకటి ఉండదు.అశోక్ లవాసా: వ్యాసకర్త ఎన్నికల సంఘం మాజీ కమిషనర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
గెలవాలంటే మాయం కావాలి!
ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పట్టభద్రులైన మీ అందరికీ అభినందనలు! నేను నా స్నాతకోత్సవానికి హాజరు కాలేదు. ఎందుకంటే, నేను సన్యాసిని కావాలనుకున్నా. సాధారణంగా, భారతదేశం నుంచి ఇక్కడకు వలస వచ్చేవారు ఎవరైనా డాక్టరు, లాయరు కావాలను కుంటారు. లేదా దేనికీ కొరగాకుండా పోతారు. అందుకే మా అమ్మా నాన్న నా మానసిక స్థితిపై ఆందోళనపడ్డారు. కానీ, దాన్ని బయటకు కనిపించనీయలేదు. ‘వై వుయ్ మేక్ బ్యాడ్ డెసిషన్స్’ అనే శీర్షికతో డ్యాన్ గిల్బర్ట్ రాసిన పుస్తకాన్ని నాకు పంపించారు. కాకతాళీయంగా, ఆయన కూడా ప్రిన్స్టన్ నుంచి పీహెచ్డీ చేసినాయనే! కనుక నా జీవితంలో ఒక చక్రభ్రమణం పూర్తయిందనుకుంటున్నాను. మీ విలు వైన కాలానికి తగ్గ విలువైన అంశాలనే చెప్పగలనని ఆశిస్తున్నాను. ఈ ధైర్యం నాకు చిన్నప్పుడు లేదు.స్వశక్తిపై సందేహాలు సహజమే!ఎనిమిదేళ్ళ వయసులో మొదటిసారి దీపావళి సందర్భంగా స్కూల్లో స్టేజీ ఎక్కాను. నాతో మాట్లాడించి, పాడించాలని మా అమ్మ ఆశ. నా గొంతు విని అందరూ నవ్వడం మొదలెట్టారు. దాంతో మాటలు మరచిపోయాను. కాగితంలో తర్వాతి వాక్యం చూడాలని ప్రయత్నించాను. కన్నీటి చుక్కలతో అక్షరాలు మసక బారాయి. టీచరు వచ్చి భుజం చుట్టూ చేయి వేసి, స్టేజి మీద నుంచి కిందకు దింపింది. తర్వాత, ఓ అమ్మాయి నా ప్రేమను తిరస్కరించింది. కొన్ని రోజులు నా బుర్రంతా అదే ఆలోచన. ఆమె నన్ను తిరస్కరించినందుకు కాదు. నా ప్రతిపాదనకు ఆమె ఏమనుకుందోనని నాలో భయం. కాలేజీ చదువు తర్వాత, ఆరామానికి వెళ్ళి భిక్షువుగా మారాను. అమ్మ, నాన్న నా నిర్ణయాన్ని ఎప్పటికైనా అర్థం చేసుకుంటారా అని ఆందోళన. మూడేళ్ళ తర్వాత, బౌద్ధారామానికి వీడ్కోలు పలికాను. ఫెయిలయ్యానని అనిపించింది. ఉద్యోగాల వేటలో 40 తిరస్కారాలు ఎదురయ్యాయి.కనీసం ఇంటర్వ్యూలకు కూడా పిలవలేదు. డిగ్రీలో ఫస్ట్ క్లాస్ తెచ్చు కున్నా అదీ పరిస్థితి. చివరకు కన్సల్టెంట్గా ఉద్యోగం వెలగబెట్టా. అందులోనూ అందరికన్నా వెనుకబడి ఉన్నానని బాధే. వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారోనని ఆదుర్దా. మీడియాలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కుదురుగా ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టా. నేను పాడ్కాస్ట్ మొదలుపెట్టినపుడు, చేయూత నిస్తానన్న ప్రొడక్షన్ కంపెనీ, అది మొదలవడానికి రెండు వారాల ముందే చేతులెత్తేసింది. నేను మొదటి పుస్తకం రాసినపుడు, 14 మంది పబ్లిషర్లు పుస్తకం పేరు మార్చమన్నారు. ఇలాంటివన్నీ ఎదుటివాళ్లు మన గురించి ఏమనుకుంటున్నారోనన్న ఆందోళనకు గురిచేస్తాయి.చార్లెస్ హార్టన్ కూలే 1902లో చెప్పిన మాటల సారాంశం చెబు తాను: నేను తెలివైనవాడినని మీరు అనుకుంటున్నారని నేను అనుకుంటే, నేను తెలివైనవాడిగా వ్యవహరించడం ప్రారంభిస్తా! కానీ, పనికిరానివాడినని మీరు నా గురించి అనుకుంటున్నారని, నేను అనుకుంటే, నేను నిజంగానే పనికిరానివాడిగా మారతా!! మన చుట్టూ ఉన్న ప్రపంచం పన్నే ఈ వలలో మనం పడకూడదు. మన రంగాల్లో ఏ పని చేయడానికైనా ఒత్తిడి అనుభవిస్తాం. అవి జనం అంగీకరించేవిగా, ముఖ్యమైనవని భావించేవిగా ఉండాలని కోరుకుంటాం. ఉనికిని చాటుకునేందుకు, ప్రాధాన్యాన్ని నిలుపు కొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాం. ఎందుకంటే, ప్రపంచం ఆకట్టుకునేదిగా ఉన్నదానివైపే మొగ్గుతుంది. నేను చెప్పేది ఒకటే. మనం కనపడకూడదు.బుద్ధుడు చెప్పిన పాఠంఅదృశ్యమైపోవడమంటే పని మానేయడం కాదు. పని చేస్తూనే ఉండాలి. కానీ, అది నలుగురికీ కనిపించేలా ఉండనవసరం లేదు. ప్రతి అడుగూ ముందే ప్రకటించాల్సిన అవసరం లేదు. జనం ఏమనుకుంటారోననే ఆలోచనను పక్కన పెట్టండి. మీకు ఏ పని చేయగలమని గట్టి నమ్మకం ఉందో దానికి విలువ నివ్వండి. మీకు ఆనందాన్ని ఇచ్చే దానితో పోలిస్తే, పైకి గొప్పగా కనిపించే లేదా సవ్యమైనదిగా తోచే పని ఏదైనా సరే దిగదుడుపే!వృత్తి జీవితం మొత్తం ప్రజల కళ్ళెదుట ఆన్లైన్లో గడిపే వ్యక్తి ఇటువంటి సలహా ఇవ్వడం చోద్యంగా తోచవచ్చు. కానీ, ఒకసారి కాదు రెండు సార్లు అదృశ్యమైన తర్వాతే, నేను ఇప్పుడున్న స్థితికి చేరుకున్నా. మొదటిసారి భిక్షువునయ్యా. రెండవసారి, బౌద్ధ భిక్షు వుల వద్ద నేర్చుకున్న అంశాలను నలుగురికీ పంచేందుకు, కుదు రుగా చేసుకుంటున్న ఉద్యోగాన్ని మానేశా. వ్యవస్థాపక సామర్థ్యం ఉన్న ప్రపంచస్థాయి ప్రముఖులు, కళాకారులు, వ్యాపారవేత్తలు అందరూ తాము ఇష్టపడే వ్యాపకంపై మౌనంగా కృషి చేసినవారే!ఒకసారి ఓ విద్యార్థి ‘‘ధ్యానం ద్వారా ఏమి పొందుతారు?’’ అని అడిగాడు. ‘‘ఏమీ లేదు’’ అన్నది బుద్ధుడి జవాబు. ‘‘ఇంక ధ్యానం చేయడం దేనికి?’’ అని విద్యార్థి అడిగాడు. ‘‘నేను ఏదో పొందాలని ధ్యానం చేయడం లేదు. ధ్యానం ద్వారా ఆందోళన, అభద్రత, సంశయాలు పోగొట్టుకుంటున్నా’’ అన్నాడు బుద్ధుడు.ప్రిన్స్టన్లో పట్టభద్రులవడం ద్వారా మీరు ఏయే ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారో ఊహించుకోవచ్చు. కానీ, మీరు వదిలించుకోవాల్సిన వాటి పట్ల కూడా కొంత ఆసక్తి వహించండి. ఎవరి ఆమోదం కోసమో చూసే అవసరాన్ని పోగొట్టు కోండి. ఎదుటివారితో పోల్చుకోవడమనే చాపల్యాన్ని వదులుకోండి. మన విజయాలను మరొకరి విజయాలతో పోల్చి చూసుకుంటే, మనం సాధించగలిగిన విజయాలు కూడా దెబ్బతింటాయి. మీరు మీ సాఫల్యాన్ని మరొకరితో పోల్చి చూసుకోవడం వల్ల మీకు ఎన్నటికీ అసంతృప్తే మిగులుతుంది.జీవితాన్ని తీర్చిదిద్దే నిర్ణయాలుమీరు నమ్మే వ్యక్తుల నుంచి పాఠాలు నేర్చుకోండి. కానీ, ఇత రుల అభిప్రాయాలు ఈ నిర్ణయాలను నిర్వచించకుండా చూసుకోండి. ఎందుకంటే, మనం తీసుకునే నిర్ణయాలకు మనమే బాధ్యు లమవుతాం. మనపై మన స్వీయ అభిప్రాయమే ముఖ్యం. ప్రతి రోజు నిద్రపోయే ముందు మిమ్మల్ని మీరు సమీక్షించుకోవాలి. కొన్ని రోజులు అప్రియమైనవిగా గడుస్తాయి. ఏవేవో పొరపాట్లు చేస్తాం. అప్పుడు నిజాయతీతో కూడిన స్వీయ అభిప్రాయం అవసరం.పొట్టకూటి కోసం ఏం చేస్తామన్నది మరో ముఖ్య నిర్ణయం అవుతుంది. మీకు ఏది ఇష్టమైన పనో దాన్ని చేయడానికి ప్రయత్నిం చండి. అటువంటి ఉద్యోగం దొరక్కపోతే, చేస్తున్న పనిలోనే పర మార్థాన్ని కనుగొనే ప్రయత్నం చేయండి. మన జీవి తంలో మూడవ వంతు సమయాన్ని మనం పని చేస్తున్న చోటే వెచ్చిస్తాం. దాదాపుగా 90,000 గంటలు అను కోవచ్చు. కనుక దాన్ని ద్వేషిస్తూ కూర్చోవద్దు. చేస్తున్న పనిపై మక్కువ పెంచుకునే ప్రయత్నం చెయ్యండి. పని ఇష్టం లేకపోయినా, ఆ పనికి మీరు ఇష్టపడేదేదో కలపండి. అయినా, ఏమాత్రం మన సుకు ఎక్కకపోతే, ఆ భావాన్ని మరో కొత్తదాన్ని ప్రయత్నించి చూడ టానికి ఉత్ప్రేరకంగా వాడుకోండి. 2030 నాటికి ఉండగల ఉద్యోగాల్లో 85 శాతం ఉద్యోగాలు ఇంకా రూపొందనే లేదని చెబుతున్నారు. అంటే, ఏ రకమైన అవకాశాలు తలుపు తడతాయో చెప్పలేం!మానవాళికి మనం ఏమి చేస్తామన్నది మరో ముఖ్యాంశం. చాలా మంది అసలు దీని గురించే ఆలోచించరు. కానీ, ఈ ప్రశ్నను కనుక పక్కన పెడితే, నిజమైన సంతృప్తికి దారితీసే ఒక అంశాన్ని జార విడుచుకుంటున్నట్లే లెక్క. అది ఎక్కువో, లేదా తక్కువో కావచ్చు. కానీ, మీ సమయం, శక్తి, వనరులు మీ సొంతం కోసమే కాకుండా ఎదుటివారికి వినియోగపడినప్పుడు అవి మరింత అర్థవంతమైనవిగా మారతాయి. -
మహాకవి గురజాడ మార్గం
వెయ్యేళ్ళుగా వస్తున్న సాహిత్య ఒరవడిని మార్చి, మరో వెయ్యేళ్ళ ముందుచూపుతో రచనలు చేసి సంఘ సంస్కరణ కావించిన మహా కవి గురజాడ వేంకట అప్పారావు. బౌద్ధాన్ని గురజాడ విశ్వసించారు. బుద్ధిజం ఏనాడైతే మన భారతదేశం ఎల్లలు దాటి వెళ్ళిందో ఆనాటి నుండి మన దేశం వెనుకబడిందన్నారు. దేవుళ్ళూ దయ్యా లని పూజలు చేస్తాం. సాటి మనిషికి సాయపడం. అదే కదా మూర్ఖత్వం. మనకు భౌతిక వనరులు పుష్కలంగా ఉన్నాయి. వెనుకబడటానికి మూలం మూఢవిశ్వాసం. ప్రపంచ దేశాలు హేతు వాద దృక్పథంతో విజ్ఞాన శాస్త్ర ఫలాలు పొందుతుంటే మన దేశం నమ్మకాలు, ఆచారాలు అంటూ అనాలోచితంగా వెనుకబడిపోతోందని ఆయన ఉద్దేశం. రవి కాంచని చోటు కవిగాంచునన్నారు. ఆ కవి గురజాడ.సమాజం ఆనాడు అవినీతి క్రిములమయం. మానవత్వం మంటగలిసిపోయింది. బైరాగులు, పెత్తందార్ల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. దానికి తోడు పురుషాహంకారం ప్రజ్వరిల్లింది. కన్యాశుల్కం అన్న పేరుతో పసిపిల్లలను పశువుల కన్నా హీనంగా విక్రయించడం, కాటికి కాళ్ళు చాచుకుని ఉన్న ముసలివారికి ఇచ్చి వివాహం చేయడం, వితంతువుల దౌర్భాగ్యం, దొంగ జాతకాలు, సాక్ష్యాలు, గిరీశం లాటి గిర్రలు, రామప్పంతుల లాంటి జాకాల్స్, లుబ్ధావధానులు లాంటి లోభులు, అగ్నిహోత్రావధానుల్లాంటి మూర్ఖులు సమాజానికి పట్టిన చీడపీడలు. గురజాడ విద్యా ప్రాముఖ్యాన్ని తన రచనల ద్వారా నొక్కి చెప్పారు. విద్య నేర్వడం వలన మధురవాణి సానుల్లో సంసారిగా భాసించింది. ‘దిద్దుబాటు’ కథలో చదువుకున్న కమలిని తన భర్త గోపాలరావుని లేఖ ద్వారా మార్చుతుంది. ఆంగ్లేయులు వారి రాజ్యాన్ని సుస్థిరం చేసు కోవడం కోసం ఆంగ్ల భాషలో విద్యను ప్రవేశ పెట్టారు. స్త్రీల కోసం కోపగృహం, మైల గదులు ఉండేవి. ‘మైలగియిలా ఇంగ్లీషు వారికి లక్ష్యం లేదంటాడు’ గిరీశం. సాంఘిక చైతన్యం, సంఘ సంస్కరణ అవసరం అని గురజాడ ఆశించారు. ‘వెనుక చూసిన కార్యమేమోయి, మంచి గతమున కొంచె మేనోయి, మందగించక ముందుకడుగేయి వెనక బడితే వెనకే నోయీ’ అన్నారు. మతం ఏదైనా బాధ లేదు, మనుషులు ఒక్కటిగా ఉండాలని ఉప దేశించారు. ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలచును అంటారు గురజాడ. అలాగే సజీవ భాష, నాల్క మీద నర్తించే భాషలో నా కలం బలంగా పలుకుతుంది అన్నారు. ‘దేశ మును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచు మన్నా’ అన్న కవి. ఇంకా ‘గుడిలో రాతి దేవుని కంటే మనతో ఉన్న మనిషిని ప్రేమించాలి’ అన్నారు. ఈ రెండు వాక్యాల సారమే గురజాడ వారి రచనల సందేశం. – డా‘‘ జక్కు రామకృష్ణ ‘ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, విజయనగరం -
ఎన్నికల సంఘం ‘నో’ అనగలదా?
భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. అంతకు రెండు నెలల ముందు 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఈ రాజ్యాంగానికి ఆమోదం లభించింది. అయితే, పూర్తి రాజ్యాంగం అమల్లోకి వచ్చేవరకూ వేచి ఉండకుండా అదే రోజున అందులోని 324 నుంచి 329 వరకు ఉన్న అధికరణాలను అమల్లోకి తెచ్చారు. అవే భారత ఎన్నికల సంఘానికి ప్రాణం పోశాయి. ఈ అధికర ణాలను ముందే అమల్లోకి తేవడం వెనుక సాంకేతికపరమైన అంశా లేమీ లేవు. అది లోతుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక, దాని అధికార పరిధికి లోబడి ఒక ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడి తీరాలి. రాజ్యాంగ నిర్మాతలకు ఈ విషయం తెలుసు. అందుకే గణతంత్రం పుట్టకముందే భారత ఎన్నికల సంఘాన్ని మనుగడలోకి తెచ్చారు. ఫలితంగా, కార్య నిర్వాహక వ్యవస్థ ద్వారా కాకుండా, రాజ్యాంగపరంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ నిర్ణేత (ఎన్నికల సంఘం) పర్యవేక్షణలో తొలి ప్రభుత్వం చట్టబద్ధత పొందుతుంది.ఎందుకు సర్వ స్వతంత్రం?అంతే ముఖ్యమైన మరో అంశం నాడు రాజ్యాంగ నిర్మాతల ముందు నిలిచింది. సమాఖ్య వ్యవస్థలో, ప్రతి రాష్ట్రం తన సొంత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించుకోవలసి ఉంటుంది. వాటికి ఆ అధికారం ఇవ్వడం సహజమే కదా అనిపిస్తుంది! చాలా సమాఖ్య దేశాల్లో అలా జరిగింది కూడా! అయితే, రాజ్యాంగ నిర్మాతలు ఆ నమూనాను తిరస్కరించారు.అందుకు కారణం ఉంది. రాష్ట్రాలు తమ ఎన్నికలను తిమ్మిని బమ్మిని చేయగలవని వారు భయపడ్డారు. పనుల కోసం, చదువుల కోసం, లేదా రాజకీయ కార్యకలాపాల కోసం వలస పోయే ‘వెలుపలి వారి’ని ఓటర్ల జాబితాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు తొలగిస్తాయనీ, తద్వారా ఎన్నికలను ప్రభావితం చేస్తాయనీ సందే హించారు. రాష్ట్రాలు నడిపే ఈ వ్యవస్థ ప్రాదేశికవాదానికి పని ముట్టుగా మారుతుందని రాజ్యాంగ సభలోని పలువురు సభ్యులు హెచ్చరించారు. కాబట్టి, ప్రతి భారతీయుడికీ తాను ఎక్కడ నివసించినా సరే సమానత్వం ప్రాతిపదికగా వివక్ష లేకుండా ఓటర్ల జాబితాలో స్థానం లభిస్తుందన్న గ్యారంటీ ఇచ్చేందుకు ఒక ఏకైక సర్వ స్వతంత్ర జాతీయ అధికారిక వ్యవస్థ అవసరమైంది.ఓటర్ల జాబితాలు; పార్లమెంటు, శాసనసభల ఎన్నికలు; అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవుల ఎన్నికలపై ఆర్టికల్ 324కింద భారత ఎన్నికల సంఘానికి ‘పర్యవేక్షణ, మార్గనిర్దేశం, నియంత్రణ’ అధికారాలు దఖలు పడ్డాయి. పౌరులందరికీ ఒకే విధమైన ఓటర్ల జాబితా, వివక్ష రహితమైన సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఉండేలా 325, 326 అధికరణాలు పూచీ పడుతున్నాయి. ఈ రాజ్యాంగ నిబంధనలు కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం రూపొందినవి కావు. గణతంత్ర పునాదులకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా వీటిని పొందుపరచారు. సమగ్రత, సమన్యాయం, స్వతంత్రత అనే విలువల ప్రాతిపదికగానే ఎన్నికల వ్యవస్థ నిర్మాణం జరిగింది.కమిషన్ను బలపరిచిన తీర్పులుదేశ అత్యున్నత న్యాయస్థానం దశాబ్దాల తరబడిగా ఈ రాజ్యాంగ దృక్పథాన్ని విస్తరించి, పరిరక్షించింది. స్వచ్ఛమైన ఎన్ని కల నిర్వహణ కోసం ‘చట్టం ప్రవేశించని చోట’ స్వతంత్రించి చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘానికి లభించిన సంపూర్ణ అధికారంగా మొహిందర్ సింగ్ గిల్ (1978) కేసులో జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ ఈ 324వ అధికరణాన్ని అభివర్ణించారు. కమిషన్ అధికారాలు న్యాయ చట్టాలకు పరిపూర్ణత కల్పించేవిగానే ఉంటా యనీ, అవి వాటిని పడగొట్టేవి కావనీ ఏసీ జోస్ (1984) కేసులో కోర్టు స్పష్టం చేసింది. దీని సారాంశం: ఎక్కడ చట్టం మౌనం వహి స్తోందో, అక్కడ కమిషన్ క్రియాశీలం అయితీరాలి. ఎక్కడ చట్టం మాట్లాడుతుందో, అక్కడ ఎన్నికల సంఘం ఆ మాటకు లోబడి నడచుకోవాలి.స్వేచ్ఛాయుత, న్యాయబద్ధ ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని టి.ఎన్. శేషన్ (1995) కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కార్యనిర్వాహక వ్యవస్థ ప్రభావం ఏమాత్రం పడకుండా ఎన్నికల సంఘం వ్యవహరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఓటరుకు ఉన్న తెలుసుకునే హక్కును, ‘నోటా’ను ఎంపిక చేసుకునే హక్కును బలోపేతం చేస్తూ ఏడీఆర్ (2002), పీయూసీఎల్ (2013) వంటి తర్వాతి తీర్పులు యావత్ ప్రక్రియలో పౌరుడిని కేంద్రబిందువు చేశాయి.తరచూ విస్మరించే ఒక చిన్న తేడా గురించి ఇక్కడ నొక్కి చెప్పాలి. స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన ఎన్నికల కోసం వీవీప్యాట్ పేపర్ ట్రయల్ అనేది ‘తప్పనిసరి అవసరం’గా సుబ్రమణియన్ స్వామి వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (2013) కేసు విచారణలో సుప్రీంకోర్టు గుర్తించింది. అయితే తక్షణం దేశవ్యాప్తంగా దీన్ని ప్రవేశపెట్టాలంటూ ఉత్తర్వులు ఇవ్వ లేదు. దశల వారీగా చేపడతామంటూ చేసిన ప్రతిపాద నను అమోదిస్తూ ఈ దిశగా కమిషన్ తీసుకుంటున్న చొరవను ప్రశంసించింది. అందుకు అవసరమైన నిధులు సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది వ్యవస్థల నడుమ వెల్లివిరిసిన సరైన రాజ్యాంగ సమతు ల్యతను ప్రతిబింబించింది.విశ్వసనీయతను నిలబెట్టుకునేదెలా?ఎన్నికల సంఘానికి ఉన్న అధికారం రాజ్యాంగం ద్వారా సంక్ర మించింది. అయితే దాని విశ్వసనీయత మాత్రం అసాధారణమైన నిశిత సమీక్షకు లోనయ్యే సాధా రణ అధికారుల మీద ఆధారపడి ఉంది. వారు తీసుకునే లక్షలాది చర్యలతో కూడిన ఆచరణలో అది నిగ్గు తేలాల్సి ఉంటుంది.18వ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ రాజ్యాంగ వ్యవస్థకు సరికొత్త ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఆడిట్స్, డాష్బోర్డులు అన్నీ కలిసి ఓట్ల నిరూపణీయతకు హామీ ఇస్తున్నాయి. అయితే నియమ నిబంధనల పరంగా స్వతంత్రత కలిగి ఉండటం కీలకం. నియామక ప్రక్రియలు, పదవీకాల భద్రతలు విశేష అధికారాలు కావు. అవి తటస్థ వ్యవహార శైలికి వ్యవస్థాగత అవసరాలు మాత్రమే. తను నియంత్రించే కార్యనిర్వాహక వ్యవస్థ మీదే న్యాయనిర్ణేత ఆధారపడే పరిస్థితి ఉండకూడదు. పార్లమెంటు ఆమోదించే ఏ సంస్కరణ నమూనా అయినా సరే ఒకే ఒక్క పరీక్షకు నిలబడి తీరాలి. రాజకీయ అధికారానికి ఎన్నికల కమిషన్ ‘నో’ చెప్పగలదని సగటు ఓటరు నమ్ముతున్నాడా అనే ప్రశ్నే ఆ పరీక్ష.సమ్మిళితం అనేది ఇప్పటికీ నెరవేరని వ్యవహారం. వలస కార్మి కులు, వికలాంగులు, తొలిసారి ఓటర్లు, మహిళలు, పోలింగ్ కేంద్రా లకు వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొనే వయోవృద్ధులు హర్షించే దిగా ఎన్నికల ప్రక్రియ ఉండాలి. విషాదం ఏమిటంటే, ఖైదీలు పోటీ చేయొచ్చు కాని వారు ఓటేయలేరు. వారికి ఆ అవకాశం కూడా ఉండాలి. ప్రజాస్వామ్య సక్రమత గెలిచినవారి మీదే కాదు, ఎవర్ని అనుమతిస్తున్నామనే దానిమీద ఆధారపడి ఉంటుంది.గణతంత్ర ఆవిర్భావానికి ముందే రాజ్యాంగపు 15వ ప్రకర ణాన్ని మన ప్రజాస్వామ్య వ్యవస్థాపకులు ఎందుకు అమలులోకి తెచ్చారనే విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. భారత ప్రజలు తొట్టతొలిసారి ఓటేసేప్పుడు... ఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు తాను సహాయపడుతుందో ఆ ప్రభుత్వంపై ఆధార పడకుండా స్వతంత్రంగా ఉండే వ్యవస్థ పర్యవేక్షణలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ధ్యేయంతో వారా చర్య తీసు కున్నారు. న్యాయనిర్ణేత నమ్మదగిన వాడైతేనే ఆ ప్రజాస్వామ్యం సఫలీకృతం అవుతుంది. ఎన్నికల కమిషన్ దేశ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి తీరాలి.ఎస్.వై ఖురేషి: వ్యాసకర్త కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
శశి థరూర్ (కాంగ్రెస్ ఎంపీ) రాయని డైరీ
రాష్ట్రపతి భవన్ డిన్నర్ హాలులో నేనొక్కడినే ఉన్నాను! హాలు నిండా మనుషులు ఉన్నా, ఒక్కడినే ఉన్నట్లుగా నాకు అనిపిస్తోందంటేనా పక్కన ఉండవలసిన వారు లేరని! మోదీజీ, పుతిన్లతో కలిసి డిన్నర్కు కూర్చోవటం గొప్ప ఆతిథ్యమే కానీ, గొప్ప అనుభూతైతే కాదు. నా పక్కన రాహుల్జీ ఉండాలి. ఖర్గేజీ ఉండాలి. అలా ఉన్నప్పుడే ఒక కాంగ్రెస్వాదిగా నా కడుపు నిండినట్లు! సరళమైన ఒక త్రేన్పు బయటికి వచ్చినట్లు!భోజనం రుచి మన ప్లేటులో వడ్డించి ఉన్న సౌతిండియన్ థాలీ వల్ల రాదు. మనతో కలిసి భోంచేస్తున్న వారి వల్ల వస్తుంది. రాహుల్జీని, ఖర్గేజీని కూడా మోదీజీ డిన్నర్కి ఆహ్వానించి ఉండవలసిందా? ఆహ్వానాలు పంపటానికి కొలబద్దలు, కొలమానాలు ఏవో ఉంటాయి. కానీ, కొన్నిసార్లు కొలతల్ని పక్కన పెట్టడమే సరిగా తూచటం అవుతుంది.ఏమైనా... మోదీ నుంచి ఆహ్వానం రావటం, రాకపోవటం రెండూ గౌరవాలే. ఆయనను అంగీకరించటం అసాధ్యం. ఆయనను విస్మరించడం దుస్సాధ్యం! మహాభారతం అంటుంది – ఇక్కడున్నది ఎక్కడా లేదు, ఇక్కడ లేనిదీ ఎక్కడా లేదని! భగవద్గీత నిష్కామ కర్మ గురించి చెబుతుంది. రెండూ నేను అనుసరించి, ఆచరించేవే.మోదీ వంటి నాయకులు ఇక్కడ తప్ప ఎక్కడా లేరు. ఇక్కడ లేకుంటే ఎక్కడా ఉండరు. మోదీజీ నిష్కామ కర్మయోగిలా కనిపిస్తారు నాకు! మహా భారతంలోని భీష్మ పర్వంలో భగవద్గీత ఒక భాగం అయినట్లే... భారతదేశ రాజకీయ పర్వంలో మోదీజీ ఒక భాగం అని నాకు తరచూ అనిపిస్తుంటుంది.పుతిన్కు మోదీజీ భగవద్గీతను కానుకగా ఇవ్వటం కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్య నిర్వహణను బోధించినట్లే ఉంది. డిన్నర్ అయ్యాక రాష్ట్రపతి భవన్ నుంచి లోధీ ఎస్టేట్లో ఉన్న నా నివాసానికి వస్తున్నాను. నేను చేసింది తగిన పనా, తగని పనా అని నేనెప్పుడూ ఆలోచించను. జీవితంలో తగనివి అంటూ ఏవీ ఉండవు. తగని స్థలాలు, తగని సమయాలు అనేవీ ఉండవు.ఏ సమయంలో మనం ఎక్కడ ఉంటామన్నది బహశా, మనం అక్కడ ఉండాల్సిన సమయం, స్థలం అయి ఉండాలి! పార్టీలో అంతా నాపై అసహనంగా ఉన్నట్లున్నారు. ‘పార్టీని మాటైనా అడగకుండా, పిలిస్తే వెళ్లి భోజనాల వరుసలో కూర్చోవటమేనా’ అని పవన్ ఖేరా! ‘డిన్నర్కి మన నాయకులను పిలవకుండా మనల్ని పిలుస్తున్నారంటేనే లోపల ఏం ఉడుకుతోందో మనం అర్థం చేసుకోవాలి కదా’ అని జైరాం రమేశ్, సల్మాన్ ఖుర్షీద్!‘‘కనీసం మనస్సాక్షి ఉండాలి’’ అంటున్నారంతా! ఉండాల్సిందే. కానీ, మనస్సాక్షి అవసరమైన స్థితిని మోదీజీ నాకు కల్పించలేదు. ఫారిన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా మాత్రమే నాకు ఆయన డిన్నర్ ఇన్విటేషన్ పంపించారు. కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థిగా ఖర్గే మీద నేను పోటీ చేసినప్పుడు కూడా పార్టీ సీనియర్ లీడర్లు ఇలాగే అన్నారు: ‘‘ఆత్మవిమర్శ చేసుకోవాలి’’ అని. ఆత్మ విమర్శ చేసుకుంటే ఏమవుతుంది? ‘‘ఖర్గే మీద నువ్వు పోటీ చేయటం కరెక్టే’’అంటుంది.‘‘సార్, వచ్చేశాం’’ అన్నాడు డ్రైవర్! రాష్ట్రపతి భవన్ నుంచి లోధీ రోడ్కు పది నిమిషాల ప్రయాణం. కారు దిగి, ఇంట్లోకి నడుస్తుంటే మొబైల్లో – మీడియాతో మాట్లాడుతున్న పవన్ ఖేరా! ఎవరో ఫార్వార్డ్ చేసిన క్లిప్. ‘‘ఆహ్వానాన్ని పంపినవారూ, ఆహ్వానాన్ని కాదనలేనివారూ అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నారు. ఆ ప్రశ్నలకు వారే జవాబు చెప్పాలి’’ అంటున్నారు ఖేరా. వీడియోను ఆఫ్ చేశాను. కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పనవసరం లేదు. జవాబు మనసులో ఉంటే చాలు. -
‘ప్రత్యేక’ విద్య అందించాలి!
వైకల్యం అనేది శరీరానికి సంబంధించిన ఒక పరిమితి మాత్రమే, మనసుకు కాదు. ఈ మహత్తరమైన సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ‘అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం’ ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటున్నాం. శారీ రక, మానసిక, దృశ్య, శ్రవణాల్లో ఏ వైకల్యం ఉన్నవారికైనా మిగతా వారితో పాటు సమాన హక్కులు, సమాన అవకాశాలు, గౌరవ ప్రదమైన జీవితం ఉండాలని గుర్తు చేసే రోజు ఇది. మిగతా రంగాల్లో ఎలా ఉన్నా... క్రీడా రంగంలో వికలాంగులు ప్రపంచ వ్యాప్తంగా అద్భుత నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. ప్యారా అథ్లెటిక్స్ వారి ధైర్యానికీ, పట్టుదలకూ, నిశ్చయానికీ ప్రతీక. మన దేశం ప్యారా అథ్లెట్ల వల్ల ప్రపంచ వేదికపై వెలుగొందు తోంది. భారతదేశానికి తొలి ప్యారాలింపిక్ స్వర్ణ పతకాన్ని అందించిన మురళీకాంత్ పేట్కర్ 1965 ఇండో–పాక్ యుద్ధంలో శత్రువుల దాడిలో తీవ్రంగా గాయపడి శాశ్వత వైకల్యం పాలయ్యారు. దీంతో వీల్ చైర్పై కొత్త జీవితం ప్రారంభించారు. 1972లో పశ్చిమ జర్మనీ లోని హీడెల్బర్గ్లో జరిగిన ప్యారాలింపిక్ క్రీడల్లో చరిత్ర సృష్టించారు. 50 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్లో 37.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ప్రపంచ రికార్డుతో పాటు భారతదేశానికి మొట్ట మొదటి వ్యక్తిగత ప్యారాలింపిక్ స్వర్ణ పతకాన్ని అందించారు. క్రీడ లకు ఆయన చేసిన సేవకు గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2018లో ‘పద్మశ్రీ’, 50 ఏళ్లకు పైగా నిరీక్షణ తర్వాత 2024 సంవ త్సరానికిగానూ ‘అర్జున’ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఆయన అసాధారణ జీవిత కథ ఆధారంగా హిందీ చిత్రం ‘చందు ఛాంపి యన్’ 2024లో విడుదలైంది. భారతదేశం ఇప్పటివరకు ప్యారాలింపిక్స్లో 60 పతకాలను గెలుచుకుంది. దేవేంద్ర ఝాఝరియా తన బాల్యంలోనే ప్రమాదవ శాత్తు తన ఎడమ చేతిని కోల్పోయాడు. ప్యారా అథ్లెటిక్స్ విభాగంలో ఏథెన్స్ (2004), రియో డీజెనీరో (2016)లో జావలిన్త్రోలో స్వర్ణాలు గెలిచాడు. అవనీ లేఖరా 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తీవ్ర కారు ప్రమాదం కారణంగా రెండు కాళ్లు దాదాపు పనిచేయడం మానుకున్నాయి. ప్యారాప్లీజియా వ్యాధిని ఎదుర్కొంది. ఈ స్థితిలో షూటింగ్లో కెరీర్ ప్రారంభించి ప్రపంచ స్థాయికి ఎదిగింది. ప్యారాలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ అయ్యింది. మారియప్పన్ తంగవేలు భారతీయ పారా హైజంపర్, వరుసగా మూడు ప్యారాలింపిక్స్లో పతకాలు గెలుచు కున్న మొదటి భారతీయుడు.పుట్టుకతోనే రెండు చేతులు లేకుండా జన్మించిన శీత్లా దేవి కాళ్లతో, నోటితో విల్లును, బాణాన్ని పట్టుకుని వదలడంలో శిక్షణ పొంది. 2024 ప్యారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించింది. 2023లో రాష్ట్రపతి చేతుల మీదుగా ‘అర్జున’ అవార్డు అందుకుంది. ప్రపంచ దేశాల్లో అనేకం ఇటువంటి విజయగాథలు కనిపిస్తాయి. మనదేశంలో అందరికీ చదువుకునే హక్కు ఉంది కానీ అంగ వైకల్యం ఉన్నవారికి అది ఇంకా దూరంగానే ఉండిపోయింది. అంగ వైకల్య విద్యార్థుల కోసం ప్రత్యేక శారీరక విద్య అందించాలని చట్టం ఉన్నా అది సరిగా అమలుకు నోచుకోవడం లేదు. భారత దేశంలో సుమారు 78 లక్షల అంగవైకల్యం ఉన్న విద్యార్థులు ఉన్నారు. వారిలో 70% విద్యార్థులు ప్రత్యేక శారీరక విద్య పొందడం లేదు. పాఠశాలల్లో వీరికి బోధించగల అర్హతలు ఉన్న టీచర్లు 15 శాతమే. అంగవైకల్యం ఉన్న విద్యార్థులు ఆటల ద్వారా ఎదగాలి, గెలవాలి, ప్రపంచాన్ని మార్చాలి. ప్రత్యేక శారీరక విద్య అంటే ఒక కార్యక్రమం కాదు, వారి భవిష్యత్తుకు తలుపులు తెరచే బంగారు తాళం చెవి. – జక్కుల వెంకటేశ్ యాదవ్ ‘ విద్యార్థి నాయకుడు(రేపు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం) -
సమాజం ఎవరికీ పట్టదా?
సమాజం పరిస్థితి తీవ్రమైన విచారాన్ని కలిగిస్తున్నది. ఈ మాట అంటున్నది అభివృద్ధి, పేదరికం, అవినీతి, తారతమ్యాలు, కులతత్వం, మతతత్వం వంటి విషయాల గురించి కాదు. ఆ సమస్యలపై చర్చలు ఎప్పుడూ జరుగుతున్నవే. ఉద్యమాలూ సాగుతున్నవే. అందుకు పరిష్కారాలపై అనేక థియరీలు, ఆలోచనలు చూస్తున్నాం. ఇక్కడ ప్రస్తావిస్తున్నది వీటన్నింటికి భిన్నమైనది. కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు, వ్యక్తులకు తమతో తమకు ఉండే ఆత్మ సంబంధాలు, ఈ సంబంధాలకు ఆలవాలమయే విలువల గురించి. ఇవి అన్నింటికీ అన్నీ క్రమక్రమంగా క్షీణిస్తుండటం గురించి.సామాజిక క్షీణత ఆ యా కాల పరిస్థితులను బట్టి ఈ సంబంధాలు బలంగా ఉండటం, బలహీనపడటం జరుగుతూనే ఉంటుంది. అది సాధారణ స్థాయిలో ఉండటానికీ, ఒక ధోరణిగా మారి తీవ్రతరం కావటానికీ తేడా ఉంది. దానికదే ఒక ఆందోళనకరమైన స్థితి కాగా, అంతే ఆందోళన కలిగిస్తున్నది మరొకటి ఉంది. అది, ఈ విషయమై ఎవరికీ పట్టినట్లు లేకపోవటం. ప్రభుత్వం, పార్టీలు, పెద్దలు, మేధావులు, రచయితలు, కళాకారులు, వివిధ మతాల పెద్దలు, గురువులు, సంస్కర్తలు, లెక్క లేనంతగా ఉన్న సంఘాల వారు, ఆ యా ఇజాల వారు. అందరికీ అందరూ. ఎవరికి ఏదీ పట్టడం లేదు. ఒక మాట సూటిగా చెప్పుకోవాలంటే, మనుషులు తమను తాము చంపుకోవటం, ఇతరులను చంపటం ఎక్కువవుతున్నాయి. అందుకు స్థూలంగా కనిపిస్తున్న కారణాలు ఆర్థికం, లైంగికం, మద్యం, మాదక ద్రవ్యాలు, జూదం, బలహీనపడుతున్న కుటుంబ సంబంధాలు, పెరిగిపోతున్న అసహనం వంటివి. ఇది స్థూలమైన పరిభాష. వీటిలో ఒక్కొక్క అంశాన్ని విడిగా పరిశీలిస్తే అన్నింటికీ కలిపి ఒక సమగ్ర సామాజిక స్థితి కనిపిస్తుంది. ఈ అంశాలలో కొన్నింటికి పరస్పర సంబంధం ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. వాటి జమిలి ప్రభావాలతో మన సమాజం, మనుషులు, కుటుంబాలు ప్రమాదానికి గురవుతున్నాయి. వాస్తవానికి ఇటువంటి అధ్యయనాలను సామాజిక శాస్త్రజ్ఞులు చేయాలి. సమాజ అధ్యయన శాస్త్రంలోకి రాజకీయం, ఆర్థికం, సమాజ సంస్కృతి, కుటుంబం, వ్యక్తిత్వ రూపకల్పనలు, మానసికతలు వీటన్నింటి పరస్పర సంబంధాలు, పరిణామాలు, మంచి చెడులు అన్నీ వస్తాయి. సామాజిక శాస్త్రం మనకు శ్రీకృష్ణుని నోటిలో సమస్త విశ్వ సందర్శనం వంటిది. కానీ దురదృష్టవశాత్తు, ఇతరత్రా మన విద్యా రంగాల వలె, సామా జిక శాస్త్ర విభాగాలు కూడా బలహీనపడుతూ, ఇటువంటి అధ్యయ నాలు చేయటం లేదు. తెలుగు రాష్ట్రాలలోని ఈ విభాగాల వారికి ఆ స్పృహ అయినా ఉన్నట్లు లేదు.చెదురుతున్న సంబంధాలువివరాలలోకి వెళితే, పైన పేర్కొన్న కారణాల వల్ల హత్యలు, ఆత్మహత్యలు జరగని రోజంటూ ఉండటం లేదు. డబ్బు, వ్యసనాలు, లైంగికాలు, హీన సంస్కృతి, వినియోగదారీతత్వం పాత్రలు పెరుగుతూ, మనుషులకు తమతో తమకు స్వీయ సంబంధాలు, వ్యక్తిత్వాలు, కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాల పాత్రలు, అనుబంధాలు బలహీనపడి అప్రధానమవుతున్నాయి. ధన ప్రభావం, క్రమంగా వ్యాపిస్తున్న కొత్త కన్జూమరిజం, కొత్త సంస్కృతి ప్రభావం పట్టణ ప్రాంతాలకు, కొన్ని తరగతులకు పరిమితమై ఉండక గ్రామాలకూ, అన్ని తరగతులకూ విస్తరిస్తున్నది. పట్టణాలకు ఎక్స్పోజర్, కొత్త మీడియా, వినోదం, బలహీనపడిన విద్య, కుటుంబ శిక్షణలు, క్రమశిక్షణలు, కన్జూమరిజం పెంచుతున్న కోరికలు ఈ సరిహద్దులను చెరిపివేస్తున్నాయి. అది జరిగినప్పుడు మనిషి ఒక భిన్నమైన ప్రపంచంలోకి ప్రవేశించటంతో మొదట తనతో తనకే స్వీయ సంబంధం చెదిరిపోతుంది. వ్యక్తిత్వం కలుషి తమవుతుంది. ఒకసారి అది జరగటం మొదలైతే కుటుంబంతో, ఇతర వ్యక్తులతో, సమాజంతో సంబంధాలు చెదిరిపోవటమన్నది తార్కికమైన సహజ పరిణామం. అది, వేర్లకు పురుగుపట్టిన చెట్లు మామూలు గాలికే కూలిపోవటం వంటిది. అట్లా కూలటంలో భాగంగానే అన్ని విధాలైన సంస్కారాలూ దెబ్బతిని వ్యక్తులు ఆత్మహత్యలకు, హత్యలకు, కుటుంబ సభ్యులపై దాడికి, లైంగిక నేరాలకు, ఇతర నేరాలకు, వ్యసనాలకు, తత్సంబంధిత అకృత్యాలకు పాల్ప డటం పెరుగుతున్నది. ఇదే సామాజిక క్షీణ స్థితి. పైన చెప్పుకున్నట్లు, ఇటువంటి స్థితి ఏర్పడటం వర్తమానకాల పరిస్థితుల ప్రభావంతో జరుగుతున్నది. అటువంటికాల పరిస్థితులకు పరిష్కారం ఏమిటన్నది ఒక ప్రశ్న కాగా, పరిష్కార ప్రయత్నాలు ఒక స్థాయిలో జరుగుతూనే వీలైనంత నివారణ ప్రయత్నాలు కూడా ఏమి జరగాలన్నది మరొక ప్రశ్న. ఈ ధోరణిని భిన్న కోణాల నుంచి మౌలికంగా ఎదుర్కోవటం, పరిష్కరించటం, ప్రభుత్వాలు విధానపరంగా తీసుకోగల చర్యలపై ఎక్కువగా ఆధారపడిఉంటుంది. పైన పేర్కొన్న వివిధ సమస్యలకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలు సాధ్యమే. విద్య, వినోదం, ఆర్థికం, కొత్త తరహా మీడియా, కన్జూమరిజం, సమస్త అంశాలలో డబ్బు పాత్ర మొదలైనవి విధానపరమైన నిర్ణయాల పరిధిలోకి రాగలవు.క్రియాశీలంగా మారితేనే...కానీ, అది మాత్రమే ఎంత మాత్రం చాలదు. అందుకు సమాజ పరంగా జరిగేది సరిసమానంగా అనుబంధం కావాలి. ప్రస్తుతం ప్రభుత్వాలు, సమాజం ఏదీ శ్రద్ధ చూపటం లేదన్నది సమస్యగా మారింది. ఒకోసారి ప్రభుత్వం ఎట్లా వ్యవహరించినా కనీసం సామాజికులు, సంస్కర్తలు, మత పెద్దలు, మేధావులు, రచయితలు, కళాకారులు ఇటువంటి పరిస్థితుల పట్ల ఆందోళన చెంది చైతన్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తారు. సంస్కరణోద్యమాలు తెస్తారు. ఆ విధంగా పాలకులపై కూడా ఒత్తిడిని సృష్టిస్తారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చూపినా ఇటువంటి సామాజిక వర్గాల క్రియాశీలతపై సమాజాలు ఆశలు పెట్టుకుంటాయి. కానీ ఈ వర్గాలు నిష్క్రియాపరంగా మారటం ఇంకా పెద్ద సమస్య అవుతున్నది. వారికి రాజకీయాలపై ఉన్న ఆసక్తి సమాజం పట్ల కలగటం లేదు. కనీసం ఇప్పటికైనా, ఈ సామాజిక ఉపద్రవం మరింత తీవ్రంగా మారకముందే, ఈ వర్గాలు కళ్ళు తెరవటం అవసరం. లేనట్లయితే, కొంతకాలంగా మారుతున్న కాల పరిస్థితుల ప్రభావాలు పెరిగి సమాజం మరింత ప్రమాదకరం అవుతుంది. టంకశాల అశోక్-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
లేబర్ కోడ్ల పరమార్థం ఏమిటి?
భారత్ కొత్త కార్మిక శకంలోకి ప్రవేశించిందనీ, ఇకపైన కార్మిక నిబంధనలు మారటంతో పాటు వారి సంక్షేమం మెరుగుపడుతుందనీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దశాబ్దాలుగా అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను క్రమబద్ధీకరించి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను ప్రారంభించారు. ‘వికసిత భారత్’ లక్ష్యాలకు అనుగుణంగా శ్రామిక వ్యవస్థను సిద్ధం చేయటమే ఈ సంస్కరణ లక్ష్యంగా పేర్కొన్నారు. వేతనాల కోడ్ (2019), పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020), సామాజిక భద్రత కోడ్ (2020), వృత్తిపరమైన భద్రత, హెల్త్, పని ప్రదేశంలో పరిస్థితుల కోడ్ (2020) అనే ఈ నాలుగు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. కార్మికుల ఉపాధికి, సామాజిక భద్రతకు వీటి ద్వారా పెద్దపీట వేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.పీవీ నరసింహారావు నుంచి అధికారంలోకి వచ్చిన ప్రతినాయకుడూ పాత కార్మిక చట్టాలు అభివృద్ధికి అవరోధం అంటు న్నారు. అయితే సంస్కరణల విషయంలో ముందడుగు వేయలేక పోయారు. 1999లో కార్మిక చట్టాల సవరణకు ఉద్దేశించిన రెండో నేషనల్ కమిషన్... వివిధ చట్టాలలో ఉన్న అసమతౌల్యాన్ని గుర్తించింది. ఒకే అంశానికి సంబంధించిన నిర్వచనాలు ఒక చట్టంలో ఒక రకంగా, ఇంకో చట్టంలో మరో రకంగా ఉండటాన్ని ప్రస్తావించింది. చివరకు పరిస్థితి ఎలా తయారైంది అంటే... ‘కనీసం 20 శాతం నిబంధ నలను విస్మరించకపోతే 100 శాతం కార్మిక చట్టాలను అమలు చేయటం కష్టం’ అన్న అభిప్రాయం ప్రచారంలోకి వచ్చింది. దానికి తోడు మన కార్మిక విధానాల్లో సంక్లిష్టత; చైనా, వియత్నాం, బంగ్లాదేశ్లతో పోలిస్తే ఉండే తేడాలపైన చాలా కాలంగా చర్చ సాగుతోంది.కోవిడ్ సమయంలో తగినంత ఉద్యోగ భద్రత లేక ఉపాధి కోల్పోయి వీధిన పడిన కుటుంబాలు కొత్త కార్మిక చట్టాలను స్వాగ తిస్తున్నాయి. కార్మికులకు తప్పనిసరిగా అప్పాయింట్మెంట్ లెటర్ ఇవ్వటం. అందరికీ సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అంటే... పీఎఫ్, ఈఎస్ఐసీ, బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తారనే అంశాన్ని ప్రశంసిస్తున్నాయి. 40 ఏళ్లకు పైనున్న వారికి ఏడాదికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించాలనీ, యాజమాన్యాలు తమ వార్షిక ఆదాయంలో 1 నుంచి 2 శాతాన్ని సామాజిక భద్రత కవరేజ్కి వెచ్చించాలనీ ప్రభుత్వం నిబంధన విధించింది. అలాగే కార్మికులకు ఆధార్తో జత చేసిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఇస్తారు. ఏ రాష్ట్రంలో ఉన్నా ... వారు ఒకే రకమైన ప్రయోజనాలను పొందగలుగుతారు.ఏడాది పాటు పనిచేసినా గ్రాట్యుటీ వంటి సౌకర్యాలను అందు కోగలుగుతారు. మహిళలు నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించారు. అందుకు అవసరమైన రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ‘సోషల్ సెక్యూరిటీ కోడ్’ను ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించింది. దాంతో కేంద్ర కార్మిక శాఖ ‘ఈ–శ్రమ్’ పోర్టల్లో 15 లక్షల మంది నమోదయ్యారు. మొత్తంగా 40 కోట్ల మంది దీని ద్వారా ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున చేపట్టిన సంస్కరణ మరేదీ లేదని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ఇది కార్మి కుల్లో సాధికారతను పెంచటమే కాదు, నిబంధనలను సరళతరం చేసి ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను ప్రమోట్ చేస్తుందని అంటు న్నారు. అయితే, దీని వెనక పెద్ద కుట్ర ఉందనీ, కార్మికుల చేత వారా నికి 12 గంటలు పని చేయించాలనే ప్రణాళిక ఉందనీ ట్రేడ్ యూని యన్లు ఆరోపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటికే వారానికి 70గంటలు పనిచేస్తే తప్ప ప్రపంచ దేశాలతో పోటీపడలేమని మేధావి వర్గం చెబుతూ వస్తున్న మాటలను ఉటంకిస్తున్నాయి. – డా‘‘ పార్థసారథి చిరువోలు ‘ సీనియర్ జర్నలిస్ట్ -
సోషల్ ఇంజినీరింగ్పై దృష్టి పెట్టాలి!
ఏ ఉద్యమమైనా, సామాజిక సంస్థ అయినా, రాజకీయ పార్టీ అయినా – సమా జంలోని అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం వహించేలా నాయకత్వాన్ని రూపొందించడానికి ‘సోషల్ ఇంజినీరింగ్’ ముఖ్య సాధనం. దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న రోజులవి. తిరుపతిలో జరిగిన ఒక పార్టీ సమావేశంలోని మరచిపోలేని అనుభవం గుర్తుకు వస్తున్నది. సమావేశం మధ్యలో ఒక కార్యకర్త లేచి నిలబడి, వేదిక మీద కేవలం అగ్రకులాలకు చెందిన నాయకులే ఎందుకు ఉన్నారు? అని ప్రశ్నించాడు. నేను కూడా ఆ వేదిక మీదే ఉన్నాను. నిజమే – వేదిక మీద ఉన్నవారంతా అగ్రకులాలకు చెందినవారే. ఆ కార్యకర్త ప్రశ్న నా హృదయాన్ని తాకింది. అది పరిశీలించదగిన, స్పందించదగిన ప్రశ్నగా అనిపించింది.2003 వరకు అదే బాధ్యతలో ఉన్నంత కాలం ఈ అంశాన్ని అమలు చేయడానికి చిత్తశుద్ధితో నేను కృషి చేశాను. అనేక వైపుల నుంచి తీవ్ర వ్యతిరేకతలు ఎదుర్కొన్నాను. సమాజాభివృద్ధి కోసం పనిచేసే ప్రతి సంస్థ, ప్రతి ఉద్యమం ఈ సూత్రాన్ని తప్పనిసరిగా అనుసరించాలి కూడా!ఒక బీసీ వ్యక్తి దేశ ప్రధానమంత్రిగా ఉన్నంత మాత్రాన కుగ్రామంలోని బీసీ యువకుడికి ఆర్థికంగా పెద్దగా ప్రయోజనం కలగకపోవచ్చు. కానీ మనవాడే ప్రధాని అన్న గర్వంతో, సంతృప్తితో అతని కళ్లు మెరిసిపోతాయి. ఈ విష యాన్ని విస్మరించి ముందుకు సాగే సంస్థలు, ఉద్యమాలు ఎప్పటికీ విజయవంతం కాలేవనేది నా గట్టి నమ్మకం.తెలివితేటలు, చిత్తశుద్ధి, పట్టుదల, త్యాగనిష్ఠ – ఇవి ఏ ఒక్క కులానికో పరిమితం కావు. అన్ని కులాల్లోనూ, అన్ని వర్గాల్లోనూ ఈ లక్షణాలు మూర్తీభవించిన వ్యక్తులు ఉన్నారు; ఉంటారు. వారిని గుర్తించి, ప్రోత్సహించి, వివిధ బాధ్యతల్లోకి తేవడమే నిజమైన నాయకుడి సమర్థత. కానీ ఇది ఎందుకు జరగడం లేదు? తీవ్రవాద ఉద్యమాల్లో అగ్రకులాల ఆధిపత్యం గురించిన చర్చ గట్టిగానే జరి గింది. సోషల్ ఇంజినీరింగ్ను అమలు చేయకపోవడమే అందుకు కారణం. సమాజం సజావుగా, శాంతియుతంగా ముందుకు సాగాలంటే రిజర్వేషన్లు కేవలం విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాలకే పరిమితం కాకూడదు; ప్రైవేటు వ్యాపార సంస్థల్లోనూ ఇవి అమలు కావాలి. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు వస్తే క్వాలిటీ పడిపోతుంది అని వాదిస్తారనడంలో అనుమానం లేదు; కానీ అది వాస్తవం కాదు. ఇటీవల వార్తల్లో ‘ఆపరేషన్ కగార్’ ప్రధానాంశంగా నడుస్తు న్నది. ఈ నేపథ్యంలో ఎక్కువగా వినిపించిన పేరు – హిడ్మా.ఎందరో సీనియర్ నాయకులు ఎన్కౌంటర్లలో మరణించినా, లొంగి పోయినా హిడ్మా పేరు మాత్రమే ఇంతటి సంచలనం సృష్టించింది. కేవలం 5వ తరగతి మాత్రమే చదివిన ఒక గిరిజనుడైన హిడ్మాలో అపారమైన మేధ, వ్యూహాత్మక దక్షత, అసాధారణ నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అందరూ ఒప్పుకుంటున్నారు. హిడ్మా ఎన్ను కున్న హింసాత్మక మార్గాన్ని నేను వందశాతం ఖండిస్తాను. కానీ ఆ గిరిజన యువకుడిలో ఉన్న అసామాన్య సమర్థతలు, చిత్తశుద్ధి, లక్ష్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ధైర్యం – వీటిని గుర్తించక తప్పదు కదా! సమాజంలోని అన్ని కులాల్లోనూ, అన్ని వర్గా ల్లోనూ ఇలాంటి యోగ్యులు ఉంటారనడంలో సందేహం లేదు. వారిని గుర్తించి, తగు శిక్షణ ఇచ్చి, అవకాశాలు కల్పిస్తే – ప్రైవేటు రంగంతో సహా అన్ని రంగాల్లోనూ సామాజిక న్యాయం సిద్ధిస్తుంది.పి. వేణుగోపాల్, వ్యాసకర్త ‘ఏకలవ్య ఫౌండేషన్’ ఛైర్మన్pvg2020@gmail.com -
మొన్న అలా! ఇవాళ ఇలా!!
సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాను గవర్నరు, రాష్ట్రపతి విధుల్లో వేలు పెట్టేది లేదని పరోక్షంగానైనా స్పష్టంగానే తెలియబర్చింది. రాష్ట్రపతి రిఫరెన్స్ ద్వారా అడిగిన ప్రశ్నలకు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ తన అభిప్రాయాల్ని ఏకగ్రీవంగా వెలిబుచ్చింది. కొండొకచో కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాన్నీ, వాదననూ బలపర్చింది. శాసన వ్యవస్థకు, కార్య నిర్వాహక వ్యవస్థకు నడుమ ఏర్పడగల వివాదానికి ‘మీరూ మీరే చూసుకోండి గానీ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు’ అన్న తరహాలో జవాబులిచ్చింది.ఈమధ్య గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదాలు ఎక్కువవుతున్నాయి. కేంద్రంలో ఒక పార్టీ ప్రభుత్వం, రాష్ట్రంలో తస్మదీయ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి వివాదాలు వస్తున్నాయి. రాష్ట్ర శాసన సభ ఆమోదించిన బిల్లు గవర్నర్ సంతకం పెడితేనే చట్టంగా మారుతుంది. ఆయన సంతకం పెట్టాలి, లేదా తిప్పి పంపాలి లేదా రాష్ట్రపతి అభిప్రాయాన్ని కోరుతూ పంపాలి. ఇలా ఏదో ఒక నిర్ణయం ఎప్పటిలోగా తీసుకోవాలన్నది రాజ్యాంగం చెప్పలేదు. అది ఆధారం చేసుకొని కొంతమంది గవర్నర్లు ఎటూ తేల్చకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు. దాని వల్ల ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాను చట్టాన్ని అందివ్వలేని స్థితిలో పడుతుంది. (మాటలే సరిగ్గా రాని వయసులో డైరెక్టరై పోయాడు)ఇలాంటి కేసుల్లో గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది ఏమంటే మరీ జాప్యం చేసిన బిల్లుల్ని ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్లు అనుకోవాలని! అయితే ఇప్పుడు అదే సుప్రీం కోర్టు అలా ఆటోమేటిక్ ఆమోదం (డీమ్డ్ అస్సెంట్) అన్నది రాజ్యాంగ బద్ధం కాదంది. అలాగే రాష్ట్రపతి, గవర్నర్ నిర్ణయం తీసుకోవడంపై ఎలాంటి గడువూ లేదంది. పైగా వారి నిర్ణయాలు న్యాయ సమీక్షకు అతీతం అని కూడా అభిప్రాయ పడింది. అయితే బిల్లులపై జాప్యం చెయ్యడం అన్యాయమని తోస్తే వాటిపై కాల పరిమితి పెట్టే అవకాశం కోర్టు తీసుకుంటుందని చెప్పింది. స్థూలంగా రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల పట్ల, కేంద్రం వాదన పట్ల సానుకూల ధోరణితో ఉందీ తీర్పు. చదవండి: ఇంటర్న్స్ కావాలి, నెలకు రూ. లక్ష స్టైఫండ్ : ట్విస్ట్ ఏంటంటే– డా.డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ -
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!
“సినిమాటిక్ లిబర్టీ” అనే సాకుతో దోపిడీ, చట్టవ్యతిరేక చర్యలను ‘న్యాయం’ పేరిట చూపిస్తూ, నేరస్తులకే కిరీటాలు పెట్టే సంస్కృతిని మీరు ఎన్నేళ్లుగా పెంచారు. అందుకే సామాన్యులను నిలువునా దోచే సినిమా ఇండస్ట్రీకి ప్రతిస్పందనగా చట్టవ్యతిరేకంగా సినిమాలను పైరసీ చేసిన iBOMMA రవిని ప్రజలు ‘దేవుడు’గా చూసినా, ‘రాబిన్ హుడ్’గా కీర్తించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ప్రజలకు ఇదే ధర్మం ఇది మీరు నేర్పినది.ప్రజలు iBOMMA వంటి పైరసీ సైట్లను ఆశ్రయించడానికి అస్సలు కారణాన్ని పరిశీలించకుండా లేదా తెలిసినా తెలియనట్టు నటిస్తూ మూలసమస్యలను పట్టించుకోకుండా,సినిమా ఇండస్ట్రీ సామాన్యులను చేస్తున్న నిలువు దోపిడీ గురించి మాట్లాడకుండా,సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లిన టికెట్ రేట్లను నియంత్రించకుండా,ఒక్క iBOMMA ban చేశారంటే సమస్యను పరిష్కరించినట్టు కాదు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి .. అటు సినిమా ఇండస్ట్రీకి, ఇటు సామాన్య ప్రజలకు నష్టం కలగకుండా సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని, మీరు ఆ సమయంలో ప్రతిపక్ష మీడియా సహకారంతో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. ప్రజలు అర్థం చేసుకోకుండా, ఆ నిర్ణయాన్నే వ్యతిరేకించేలా మోసపర్చారు.కానీ ‘నిజం అనేది నిప్పు’, దానిని దాచలేరు, ఆపలేరు. ఆ రోజున అర్థం కాలేకపోయిన విషయాలు iBOMMA ఉదంతం వెలుగులోకి వచ్చిన తరువాత ఈ రోజు ప్రజలు స్పష్టంగా గ్రహిస్తున్నారు.ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్న వాస్తవం ఏమిటంటే:వైఎస్ జగన్ సినిమా ఇండస్ట్రీ దోపిడిని తొలిసారి ప్రశ్నించిన నాయకులుసామాన్య ప్రజలకు అందుబాటు ధరలో సినిమా అందాలని ఉద్దేశంతో టికెట్ రేట్లపై సంస్కరణలు తీసుకువచ్చారుఆ రోజు ప్రతిపక్ష మీడియా అడ్డు అదుపు లేకుండా చేసిన మాయాప్రచారం వల్ల మోసపోయాముఇప్పుడు iBomma వర్సెస్ సినిమా ఇండస్ట్రీ ఘర్షణ బయటపడడంతో ప్రజలు దీని అసలు రూపాన్ని “సామాన్యుడు వర్సెస్ ఇండస్ట్రీ దోపిడి”గా చూస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో iBomma వ్యవస్థాపకుడిపై ఇటీవల జరిగిన చర్యలు కొత్త ప్రశ్నల శ్రేణిని లేవనెత్తాయి. పైరసీ నేరం అయినప్పటికీ, ఈ చర్య అసలు సమస్యను పరిష్కరిస్తుందా అనే సందేహం ప్రజల్లో పెరుగుతోంది. సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగుతున్న టికెట్ రేట్ల పెరుగుదల, సామాన్య ప్రజలను తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది.తెలుగు సినిమా రంగంలో టికెట్ ధరల పెరుగుదల, ప్రభుత్వ నియంత్రణల్లో అసంగత,ప్రజల్లో పైరసీ సైట్ల వైపు ఆధారణ పెరుగుతున్న దృశ్యం… ఇవన్నీ ఒకే కథ చెబుతున్నాయి: సమస్య వ్యక్తుల్లో కాదు, వ్యవస్థల్లో ఉంది. అయినా ఎలా జరుగుతోంది? వ్యక్తులను పట్టుకుని శిక్షించడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపుతున్నట్టు చూపడం.ఇటీవల iBomma వ్యవస్థాపకుడిపై జరిగిన చర్యలు చట్టపరంగా సరైనవే. పైరసీ అనేది నేరమే. కానీ ఈ చర్య ఒక పెద్ద ప్రశ్నను మాత్రం తప్పించలేదు: ఇది నిజంగా సమస్యకు శాశ్వత పరిష్కారమా?“తెలుగు సినిమాల టికెట్ రేట్లు అసహజంగా పెరగడం కొత్త విషయం కాదు. పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రం ధరలు ఆకాశాన్నంటుతాయి. కుటుంబంతో కలిసి సినిమా చూడడం సాధారణ ప్రేక్షకుడికి ఈ రోజుల్లో ఒక చిన్న ‘ఈవెంట్’లా మారిపోయింది; ఖర్చు 1,000 నుంచి 2,000 రూపాయల వరకు వెళ్తోంది. ‘సరే, OTTలో చూద్దాం’ అనుకుంటే, వాటి ధరలు కూడా సామాన్యుడికి అందే స్థాయిలో లేవు. సినిమాలు మన జీవన విధానంలో భాగమైనప్పటికీ, ఈ పరిస్థితుల్లో పైరసీ వేదికలు ఎదగడం ఆశ్చర్యకరం కాదు సహజమే.”అంటే iBomma కారణంగా టికెట్ ధరలు తగ్గలేదు; టికెట్ ధరలు అధికంగా ఉండటమే iBomma వంటి వేదికలకు ప్రాణవాయువు.అయితే ప్రభుత్వ వైఖరి మాత్రం విచిత్రంగా ఉంది. చట్టవిరుద్ధ ప్రవర్తనను చూపించే సినిమాలు సులభంగా సెన్సార్ అవుతాయి. అదే సినిమాలను ప్రైడ్, కల్చర్, ఇండస్ట్రీ గ్రోత్ పేరుతో ప్రోత్సహించడంలో వెనుకాడదు.కానీ పైరసీ విషయానికి వస్తే మాత్రం "కఠిన చర్యలు" అనే నినాదం.ఇది ద్వంద్వ వైఖరి కాదు అంటే ఇంకేమిటి?ఇది సనస్యకు శాశ్వత పరిష్కారం కాదు కేవలం తాత్కాలిక విరామం మాత్రమే.ఎందుకంటే..iBOMMA పుట్టింది అంటె అది ప్రజల తప్పు కాదు.. మీరు సంవత్సరాలుగా పట్టించుకోని దోపిడీ, అధికారదుర్వినియోగం,అదుపుతప్పినవ్యవస్థలవల్లే.,ఈ రోజు iBOMMA ban చేస్తే,రేపు అదే కారణాలతో ఇంకో వెబ్సైట్ పుడుతుంది.మరో రోజు ఇంకోటి.సైట్లను మూసేయడం కాదు.. సమస్యను మూసేయడం అవసరం.ఒక బొమ్మను మూసేస్తే మరొక బొమ్మ వస్తుంది—ఇది ఇంటర్నెట్ యుగం యొక్క వాస్తవం.వ్యక్తులు మారవచ్చు, వెబ్సైట్లు మూసుకోవచ్చు, కానీ వ్యవస్థలు మారకపోతే సమస్య మారదు.పైరసీ ఒక సాంకేతిక నేరం కాదు, ఒక ఆర్థిక–సామాజిక ప్రతిస్పందన.సమస్యను చూడాల్సిన నిజమైన కోణం• సినిమా టికెట్ ధరలు సాధారణీకరణ • ప్రభుత్వ పాలసీల్లో స్పష్టత • OTTలను అందుబాటులో ఉంచడం • మార్కెటింగ్ వ్యయం, సినీ నటుల పారితోషక నియంత్రణ • ప్రజలను శత్రువులుగా చూసే వ్యవహారం ఆపడం ఇవి జరిగితేనే పైరసీకి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితేనే iBomma తరహా వేదికలు నిలిచిపోతాయి.ఇది ప్రపంచం నిరూపించిన మోడల్ —Netflix, Aahaa,Amazon prime,Hot Star and YouTube Premium… అన్నీ చవకగా చేస్తే ప్రజలు పైరసీ వైపు వెళ్ళడం తగ్గిపోతుంది.అందువల్ల ప్రశ్న ఒక్కటే: ప్రభుత్వం, సినీ పరిశ్రమ,మూల సమస్యను ఎందుకు పరిష్కరించడంలేదు?ఎందుకు వ్యక్తులను మాత్రమే లక్ష్యంగా తీసుకుని పబ్లిసిటీ యుద్ధం చేస్తోంది?“ఒక వ్యక్తిని జైలుకు పంపితే వ్యవస్థలోని లోపాలు తొలగిపోవు. ఒక వెబ్సైట్ను మూసేసినా, ఆ సమస్యను పుట్టించే కారణాలు మాత్రం అలాగే బతికే ఉంటాయి. అందువల్ల ఇప్పుడు అయినా ప్రభుత్వం మరియు సినిమా ఇండస్ట్రీ పెద్దలు మేల్కొని, అసలు సమస్యకు కారణమేమిటో నిజాయితీగా పరిశీలించి, ఈ అంశానికి శాశ్వత పరిష్కారం చూపాలి.”-పి. నేతాజి పవన్ కుమార్ -
వరల్డ్ ఫిలాసఫీ డే : ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
World Philosophy Day 2025 ప్రతి సంవత్సరం నవంబర్ మూడో గురువారం ప్రపంచ తాత్వికతా దినం జరుపుకొంటున్నాం. ప్రపంచ పౌరులు వారి వారి సంస్కృతుల్లోంచి పైకి ఎదిగి ప్రతి ఒక్కరూ మానవీయ కోణంలో ఆలోచించి, మానవుడి ఔన్నత్యాన్నిమరింతగా పెంపొందించుకోవడానికీ, దాని ప్రకారం తమ తమ సమాజాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికీ దీన్ని ఆచరిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న భిన్నమైన మే«ధా సంపత్తిలో ఒక ఏకత్వాన్ని సాధించుకోవలసి ఉందని గుర్తు చేసుకోవడం కోసం ఈ రోజు ముఖ్యోద్దేశం. హేతుబద్ధమైన చర్చలతో, సంప్రదింపులతో నిజాయతీని, త్యాగనిరతిని, బాధ్యతని, ఓపికగా మానవుడే కేంద్రంగా సాగవల్సిన ప్రయాణానికీ ఒక తాత్విక భూమికను ఏర్పరచుకోవాల్సిఉందని ఈ రోజు మనకు గుర్తుచేస్తోంది.మనిషికి వివేకంపై గల ప్రేమనే మనం తాత్వికత / ఫిలాసఫీ అని అను కోవచ్చు. విస్తృతార్థంలో చెప్పుకోవాలంటే జనం తమ గురించి, తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి, వారి మధ్యగల సంబంధం గురించి కొన్ని మౌలిక సత్యా లను అర్థం చేసుకుని, రూపొందించుకునే జీవన విధానమే తాత్వికత! మళ్ళీ ఈ తాత్వికత అనేక రకాలుగా ఉంటుంది. సిద్ధాంతబద్ధమైన తాత్వికత (మెటాఫిజిక్స్ /ఎపిస్టిమాలజీ), య«థార్థం లోంచి వెలువడ్డ తాత్వికత- అంటే నైతిక, సామాజిక, రాజకీయ, సౌందర్య భావన వంటి అంశాలతో కూడిన తాత్వికత. ఇకపోతే వ్యక్తిగతమైన విశ్వాసాలు, జీవితాంతం నిలుపుకొనే విలు వలూ, ఆచరించే నైతిక సూత్రాలనూ బట్టి అది వారి వారి వ్యక్తిగత తాత్వికత అవుతుంది. అది మెరుగైనదై ఉండి, ఇతరులకు స్ఫూర్తిదాయకమైనప్పుడు– అదే ఒక ప్రాంతంలోని సమాజం ఆచరిస్తే అది సమాజ తాత్వికత అవుతుంది. అదే దేశం అనుసరిస్తే అది ఆ దేశపు తాత్వికత అవుతుంది. ఏమైనా చివరికి మానవాళికి మనిషి కేంద్రంగా ఒక ఉమ్మడి తాత్విక భూమిక అవసరం!ఇదీ చదవండి: H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్లో ఆ కంపెనీల జోరుతాత్విక దృక్పథం ఎప్పుడూ గౌరవప్రదమైన సమాజ నిర్మాణానికి ఉప యోగపడాలి. ఎదురయ్యే సవాళ్ళను సంయమనంతో ఎదుర్కోగలిగే శక్తిని కూడా అందజేయాలి. దీనిలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావల్సిందే. తమ వంతు బాధ్యతను నిర్వహించాల్సిందే. ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. కానీ, ఆ భాషల్లో తాత్విక దృక్పథం లేకపోతే అవి బీడు భూములైపోతాయి. అందులో పచ్చని జీవన తాత్వికతను మొలిపించు కోవాలి. ‘మనుషులంతా ఒక్కటి’ అని నినదించక తప్పదు. మారుతున్న పరిస్థి తులను గమనిస్తూ, అనుగుణంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోటా ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవాల్సి ఉంది. – ప్రొ.దేవరాజు మహారాజు మానవవాది, జీవశాస్త్రవేత్త(నేడు వరల్డ్ ఫిలాసఫీ డే) -
నా రోజు – నా హక్కు
World Childrens Day 2025 సర్ విలియం బ్లాక్స్టోన్ ప్రకారం తల్లితండ్రులకు పిల్లల పట్ల మూడు ప్రధాన బాధ్య తలు ఉంటాయి. పిల్లల పెంపకం, రక్షించడం, వారికి విద్యను అందించడం. ఐక్యరాజ్య సమితి ‘మానవ హక్కుల ప్రకటన’లో 25(2)వ నిబంధన రక్షణ, సహాయం పొందడం అనేది పిల్లల హక్కుగా పేర్కొంది. పిల్లలకు సాధారణంగా మనం పొందే హక్కులతో పాటు ప్రత్యేకంగా బాలల హక్కులుంటాయి. బాలలకు ప్రధానంగా జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగ స్వామ్య హక్కులుంటాయి. వీటిలో భాగంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే హక్కు, తల్లితండ్రుల సంరక్షణలో ఉండే హక్కు, పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకొనే హక్కు, లైంగిక వేధింపుల నుండి విముక్తి పొందే హక్కు;వినోదం–విశ్రాంతి పొందే హక్కు, ఉచిత విద్యతో పాటు ఆడుకొనే హక్కు, భావవ్యక్తీకరణతో పాటు గౌరవాన్ని పొందే హక్కులుంటాయి. వీటితో పాటు స్వేచ్ఛగా ఆలోచించే హక్కు కూడా పిల్లలకుంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ల అంతర్గత ఘర్షణ వల్ల పలువురు బాలలు పసిప్రాయంలోనే ప్రాణాలు కోల్పోతుండగా, ఆఫ్రికా ఖండంలో సోమాలియా, నైజీరియా వంటి దేశాలలో పిల్లలకు పౌష్టికాహారం లభించక ఆకలి మరణాలు సంభవిస్తున్నాయి. మన దేశంలో ఎక్కువగా బాల్య వివాహ బాధితులున్నారు. దేశంలో ఏటేటా బాల కార్మికులు, వీధిబాలలు, వివక్షకు గురి అయినవారు, ఎయిడ్స్ తదితర బాధిత బాలలు పెరుగుతున్నారు. పాకిస్తాన్ వంటి దేశాల్లో మత సంబంధమైన కారణాలతో ఆడపిల్లల్ని చదువుకు దూరం చేస్తున్నారు.చదవండి : H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్లో ఆ కంపెనీల జోరు పిల్లలను పనిచేసే వారిగా, డబ్బు సంపాదించే వనరుగా చూడరాదు. ఈ ఏడాది ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం థీమ్ ‘నా రోజు, నా హక్కులు’. ఈ థీమ్ పిల్లల జీవితం, వారి హక్కులు ఎలా ఉన్నాయి, ఎలా మెరుగుపరచవచ్చనే దానిపై పిల్లల నుండి నేరుగా వినడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది పిల్లలకు వారి అభిప్రాయాలను తెలియజేయడానికీ, వారి భవి ష్యత్తుపై తమ అభిప్రాయాలను పంచుకోవడానికీ అవకాశాన్నిస్తుంది.– ఎం. రాంప్రదీప్ జన విజ్ఞాన వేదిక(నేడు ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం) -
బీఎన్ను ఇట్లా స్మరించుకుందాం!
కొందరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి కార్యాచరణే వారిని ముందు తరాల వారు గుర్తించేలా చేస్తుంది. మరి కొన్నిసార్లు గుర్తు చేయాల్సి వస్తుంది. కొద్ది రోజులుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్) గురించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువకు ఆయన పేరు పెట్టాలనే డిమాండే ఈ చర్చకు నేపథ్యం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వెళ్లిన సందర్భంలో వరద కాలువకు ఫలానా నాయకుని పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. ఫలానా నాయకుని పేరు పెట్టడం పట్ల అభ్యంతరం లేదు. దానికి ఎవరి పేరు పెడితే సరైందో వారి పేరు పెట్టాలనే సూచన బలంగా వస్తున్నది. 1940లకు పూర్వం నుండే ఈ ప్రాంత చైతన్యానికి బాటలు వేసిన వారిలో బీఎన్ ఒకరు. బీఎన్ సేవలను కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాకు మాత్రమే పరిమితం చేయకూడదు. కాకపోతే సందర్భం అలాంటిది కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తున్నది. వరద కాలువ నీటి కోసం ఆయన నిర్వహించిన సభలు, సమావేశాల గురించి కథనాలు నాటి పత్రికల్లో పెద్ద ఎత్తున వచ్చాయి. బీఎన్ ఇంట ర్వ్యూలు కూడా అందులో ఉన్నాయి. నాటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడే ఈ ఆందోళనకు ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రం మారింది. కానీ అప్పట్లో అధికార, విపక్షాల్లో ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులకూ అన్ని విషయాలు తెలుసు. చదవండి: Ande Sri బడిలో చదవలేదు..లోకమే ఆయనకు విశ్వవిద్యాలయంతెలంగాణ రైతాంగ పోరాటాన్ని ‘మట్టి మనుషుల పోరాట’ మని నిర్వచించిందే బీఎన్. తాను భూస్వామి అయినా పేదల పక్షాన్నే నిలబడ్డారు. తన భూములను కూడా పేదలకు పంపిణీ చేశారు. తెలంగాణ గ్రామీణ జీవితపు సంఘర్షణను అనుభవించి, దాన్ని పారదోలేందుకు కంకణం కట్టుకున్న వారాయన. కాబట్టే అట్టడుగు వర్గాల ప్రజలకు ఆత్మగౌరవం కావాలని పట్టు బట్టారు. రైతుల సాగు ముందుకు సాగాలన్నారు. నీటి వసతి కావాలని డిమాండ్ చేశారు. కార్యాచరణ తీసుకున్నారు. ‘కొట్టిన వారిని, పెట్టిన వారిని మర్చిపోర’ని తెలంగాణలో అందరికీ పరిచయం ఉన్న సామెత. బీఎన్ అశేష తెలంగాణ ప్రజల మేలుకోరారు. మరీ ముఖ్యంగా తాను పుట్టిపెరిగిన నల్లగొండ జిల్లా జనాల, పొలాల దాహార్తి తీర్చాలని తపన పడ్డారు. బీఎన్ ఆనాడు భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలో మొదటి నుండి చివరిదాకా ఆయుధం పట్టి పోరాడిన యోధుడే కాదు... ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు పార్లమెంట్ సభ్యునిగా చట్టసభలలో అనేక సందర్భాలలో ప్రజా సమస్యలపై పోరాడిన మహాయోధుడు. అలాంటి వారి గురించి పట్టించుకోపోతే ఎట్లా? నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసిన వారిని గుర్తించాలని అడగటమే ఆవేదన కలిగించే విషయం. జన జీవితాలను మారుస్తున్న వరద కాలువకు ఆయన పేరు పెట్టాలనే ఉమ్మడి నల్లగొండ ప్రజల డిమాండ్ సముచితమే! – గోర్ల బుచ్చన్న, జర్నలిస్టు(ఎస్ఆర్ఎస్పీ వరద కాలువకు భీమిరెడ్డి నర్సింహారెడ్డి పేరు పెట్టాలని రేపు జరగనున్న ధర్నా సందర్భంగా) -
సీసీఐ నిబంధనల్ని తొలగించాలి!
రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి రైతులు సంక్షోభంలో ఉన్నారు. సేద్యపు ఖర్చులు పెరుగుతూ ఉండటం, న్యాయమైన ధర లభించక పోవటం, ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపోవడం, పత్తి దిగుమతులు పెరుగుతూ ఉండటం ఇందుకు కారణాలు. తెలంగాణలో ఎకరాకు సగటున 11.74 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా, ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో 4.56 లక్షల హెక్టార్లలో రైతాంగం పత్తి సేద్యం చేశారు. సుమారు 8 లక్షల టన్నుల పత్తి దిగుబడివస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో భారీ వర్షాలకు అపార నష్టం జరిగింది. ఎకరం సేద్యంపై 40 వేలకు పైగా రైతు పెట్టుబడి పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి వంకలూ పెట్టకుండా రైతుల వద్ద ఉన్నపత్తిని పూర్తిగా కొనుగోలు చేయాల్సిన బాధ్యత సీసీఐ చేపట్టే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. సంక్షోభంలో ఉన్న పత్తి రైతుల వద్ద నుంచి పత్తి సేకరణకు చాలా ఆలస్యంగా కొనుగోలుకేంద్రాల ఏర్పాటు ప్రకటన వచ్చింది. రెండు రాష్ట్రాల్లో ఎక రాకు 12 క్వింటాళ్ల పత్తి కొను గోలు చేస్తానని చెప్పి 7 క్వింటా ళ్లకు తగ్గించారు. పత్తికి 8,110 రూపాయల మద్దతు ధర ఇవ్వాలంటే తేమ 12% మించరాదని నిబంధన పెట్టారు. రైతు సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవాలంటే ముందుగా రైతు సేవా కేంద్రాల్లో పేరు నమోదు చేసుకున్న తర్వాత,కేంద్రం పెట్టిన ‘కిపాస్ కిసాన్ స్లాట్’లో 24 గంటల ముందు బుక్ చేసుకోవాలి. దీనిపై 70% మంది రైతులకు అవగాహన లేదు. సీసీఐ నిబంధనలు రైతుల నుంచి పత్తి కొనుగోళ్లను తగ్గించుకోవటానికే! చదవండి : Ande Sri బడిలో చదవలేదు..లోకమే ఆయనకు విశ్వవిద్యాలయంరెండు రాష్ట్రాల్లో తుపాన్, భారీ వర్షాల వల్ల పత్తికి నష్టం జరిగి ఎకరాకు దిగుబడి 5 నుండి 7 క్వింటాళ్లకుమించి రాదనీ, అందుకే సేకరణ ఎకరాకు 12 నుండి 7 క్వింటాళ్లకు తగ్గించడం జరిగిందనీ సీసీఐ చెప్పటం మోసమే! ఎటువంటి ఆంక్షలూ లేకుండా పత్తి మద్దతు ధరను 10 వేలుగా ప్రకటించాలనీ, పత్తి దిగుమతులపై 30% సుంకం విధించాలనీ, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పత్తి కొనుగోలు చేయాలనీ... రైతాంగం ఆందోళన బాట పట్టాలి. – బొల్లిముంత సాంబశివరావురైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు -
'ప్రాధాన్యాలను' గుర్తించడమే గెలుపు
ఐదు ట్రిలియన్ డాలర్ల విలువైన తొలి, ఏకైక కంపెనీగా ‘ఎన్విడియా’ ఇటీవలే చరిత్ర సృష్టించింది. ఎన్విడియా సహ–వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన తైవానీస్–అమెరికన్ వ్యాపారవేత్త జెన్సెన్ హూవాంగ్ కాలిఫోర్నియాలోని ‘క్యాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (కాల్టెక్) పట్టభద్రులను ఉద్దేశించి చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం: ఇది నిజంగా సంతోషకరమైన రోజు. మీరంతా ‘కాల్టెక్’ నుంచి పట్టభద్రులవుతున్నారు. ఈ విద్యాలయంలో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరిన వారిలో కొందరు నన్నూ, మా సంస్థనూ ఎంతో ప్రభావితం చేశారు. ‘ఎన్విడియా’లోని ఇద్దరు చీఫ్ సైంటిస్టులు ఇక్కడి నుంచి వచ్చినవారే. నిజానికి, సలహాలు ఇవ్వడమంటే నాకు ఇష్టం ఉండదు. నేను ఇష్టపడిన ఉదంతాలను, జీవితాను భవాలను కొన్ని చెబుతాను. సలహాలు వాటిలోనే అంతర్లీనంగా ఉంటాయి. ప్రపంచంలో ఒక టెక్ కంపెనీకి ఇంత సుదీర్ఘ కాలంగా సీఈఓగా ఉన్నది బహుశా నేనే అనుకుంటా. నేను ఈ 31 ఏళ్ళ వృత్తి జీవితంలో ఎంచుకున్న రంగం నుంచి బయటపడకుండా చూసు కున్నాను. విసుగు చెందలేదు. ఉద్వాసనకు గురయ్యే పరిస్థితులు తెచ్చుకోలేదు. మేధాపరమైన నిజాయతీ, ఒదిగి ఉండటం మా కంపెనీని కాపాడాయని చెప్పగలను. ఏఐ వెంట పరుగెత్తాలి!‘కుడా’ అనే ప్రోగ్రామింగ్ మోడల్ తయారు చేసేందుకు మాకు 20 ఏళ్ళకు పైగా పట్టింది. అది నేడు కంప్యూటింగ్ రంగాన్ని విప్లవా త్మకంగా మారుస్తోంది. టెక్నాలజీ పరంగా ఎన్నో పర్యవసానాలకు దారితీయగల కృత్రిమ మేధ (ఏఐ) రంగంలోకి దిగాల్సిందిగా నేను గ్రాడ్యుయేట్లను ప్రోత్సహిస్తాను. ఏకకాలంలో, బహు ముఖాలుగా వికసనం పొందుతూ ముందుకు సాగుతున్న టెక్నాలజీ అదొక్కటే!ఏఐ వెంట నడవడం కాదు పరుగెత్తండని నేను ‘తైవాన్ యూనివర్సిటీ’ విద్యార్థులకు సూచించాను. ఏఐ విప్లవంతో మమేకం కండని చెప్పాను. ఆ తర్వాత, ఒక ఏడాది గడిచేటప్పటికే అది నమ్మలేనంతగా మారిపోయింది. ఈ అసాధారణ పరిణామాలను మీరు అంతర్ దృష్టితో అవగాహన చేసుకోవాలి. మీ ముందున్న ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసు కుని ముందుకు సాగండి. ఆధునిక కంప్యూటింగ్ మూలాలు ఐబీఎం సిస్టమ్ 360లో ఉన్నాయి. నేను పుట్టిన ఏడాది తర్వాత, అది మార్కెట్లోకి వచ్చింది. చిప్ల రూపకల్పన నేర్చుకున్న 1980లలోని తొలి తరం వి.ఎల్. ఎస్.ఐ. ఇంజినీర్లలో నేనొకడిని. అప్పటి పాఠ్య పుస్తకాన్ని కాల్టెక్లో చదివినవారే తయారు చేశారు. ఆ పుస్తకం ఐసీ డిజైన్ను విప్లవీకరించింది. మా తరం సూపర్ జైంట్ చిప్లు డిజైన్ చేసేందుకు, అంతి మంగా సీపీయూ తయారీకి వీలు కల్పించింది. కంప్యూటింగ్లో బ్రహ్మాండమైన వృద్ధికి సీపీయూ బాటలు పర చింది. ప్రపంచం అంతకు ముందెన్నడూ చూడనంత సామూహిక ఉత్పత్తి మొదలైంది. అది పైకి కనిపించనిది. తేలిగ్గా కాపీ చేయదగి నది. అదే సాఫ్ట్వేర్. నేను మీలాగా విద్యార్థిగా ఉన్నప్పుడు అది చాలా స్వల్ప స్థాయిలో ఉంది. సాఫ్ట్వేర్ను విక్రయించి సొమ్ము చేసు కోవచ్చుననే భావన అప్పట్లో ఒక స్వైర కల్పన మాత్రమే. నేడు అది అత్యంత ముఖ్యమైన వస్తువు అయిపోయింది. ఎన్విడియా తీసుకొచ్చిన ‘కుడా’ ఫలితంగా కంప్యూటింగ్లో వచ్చిన వేగం మరింత ముందుకు సాగేందుకు తోవ చూపింది.అలెక్స్ నెట్కు శిక్షణ ఇచ్చేందుకు కొందరు ఎన్విడియాకు చెందిన ‘కుడా జీపీయూ’లను ఉపయోగించుకున్నారు. డీప్ లెర్నింగ్ ఆవిర్భవించింది. ఆ కీలక పరిణామం ఏఐ విప్లవానికి నాంది పలికింది. భారీ జీపీయూ క్లస్టర్లను నిర్మించకుండా డీప్ లెర్నింగ్కు ఉన్న పరిమితులను అన్వేషించేదెట్లా? వాటిని నిర్మించడానికి కోట్లాది డాలర్లు అవసరం. అంత ఖర్చు పెట్టినా ఫలితం ఉంటుందా? క్లస్టర్లను నిర్మించకపోతే, అది ఎప్పటికీ మనకు తెలియదు. వేలాది ఇంజినీర్లు డీప్ లెర్నింగ్ పైన, అడ్వాన్సింగ్, స్కేలింగ్ డీప్ లెర్నింగ్ పైన పదేళ్ళపాటు కృషి చేశారు. మా మొదటి ఏఐ సూపర్ కంప్యూ టర్ డీజీఎక్స్–1ను శాన్ఫ్రాన్సిస్కోలోని ఒక స్టార్టప్కు 2016లో అందించాం. ఏఐపై పనిచేస్తున్న నా స్నేహితుల బృందం ‘ఓపెన్ ఏఐ’ పేరుతో ఆ కంపెనీని నెలకొల్పింది. వాళ్లే ‘చాట్జీపీటీ’ తెచ్చారు.తోటమాలి నేర్పిన పాఠంఏఐలో తదుపరి అల రోబోటిక్స్ కాబోతోంది. రోబోలు, రోబో టిక్ వాహనాలు, హ్యూమనాయిడ్ రోబోలు, చివరకు రోబోలు కాప లాగా ఉండి నడిపించే భారీ గిడ్డంగులను నిర్మించే వందలాది కంపె నీలతో మేం కలసి పనిచేస్తున్నాం. కానీ, మా రోబోటిక్స్ పయనంలో చాలా ఎదురుదెబ్బలు తిన్నాం. డీప్ లెర్నింగ్ అంటే ఎవరికీ అర్థం కాని సమయంలో కలన గణితాన్ని ప్రాసెసింగ్ చేసే ప్రపంచపు మొదటి రోబోటిక్ కంప్యూటర్ను నిర్మించాం. మేం పరిస్థితులకు తగ్గట్లుగా ఒదిగిపోయే, మార్పు చెందే, చతికిల పడినా తిరిగి లేవ గలిగిన శక్తిని అభివృద్ధి చేసుకున్నాం. మా పిల్లలు చిన్న వయసులో ఉండగా, ఒక వేసవిని జపాన్లో గడిపాం. ఒక వారాంతంలో క్యోటో వెళ్ళి, సిల్వర్ టెంపుల్ చూశాం. అది ఆకర్షణీయమైన మోస్ గార్డెన్కు ప్రసిద్ధి. అక్కడ ఒక ఒంటరి తోటమాలిని గమనించాను. అక్కడ ప్రపంచంలో దాదాపు ప్రతి రకం నాచునూ పెంచుతారు. దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాను. ‘నిర్జీవంగా మారిన నాచును తొలగిస్తున్నాను’ అని జవాబిచ్చాడు. ‘కానీ మీ గార్డెన్ చాలా పెద్దది కదా!’ అన్నాను. ‘నేను 25 ఏళ్ళుగా ఈ తోట ఆలనాపాలనా చూస్తున్నాను. నాకు కావలసినంత సమయం ఉంది’ అని జవాబిచ్చాడు. జీవితంలో నేను నేర్చుకున్న అత్యంత సునిశితమైన పాఠాలలో అదొకటి. ఈ తోటమాలి తనకు వచ్చిన కళకు అంకితమయ్యాడు. మనమూ అదే బాటలో నడిస్తే, మనకు కావాల్సినంత సమయం ఉంటుంది. నేను చేయవలసిన పనుల ప్రాధాన్య క్రమాన్ని రాసుకుని, ప్రతి రోజూ ఉదయం, ఆ జాబితాలోని మొదటి పనితో ప్రారంభిస్తా.ఏ పని తర్వాత ఏ పని చేయాలన్న విషయంలో చాలా స్పష్టతతో ఉంటాను. నేను పనిలో ఉండగా ఎవరన్నా వచ్చి ఏదో చెప్పి లేదా అడిగి అవాంతరం కల్పించినా ‘నాకు చాలా సమయం ఉంది. నా పని పూర్తి చేసుకోగలను’ అని చెబుతాను.సూపర్ పవర్స్మనం పడే వేదనలు, కష్టాలు మన వ్యక్తిత్వాన్ని పటిష్ఠ పరు స్తాయి. ఒకటి కాకపోతే మరొకటి ప్రయత్నించి చూద్దామనే లక్షణం అలవడుతుంది. నా సామర్థ్యాలలో నేను ఎక్కువ విలువ ఇచ్చు కునేది నా ఇంటెలిజెన్స్కు కాదు. కష్టనష్టాలను భరించగల నా సహనశీలతకు; ఒకదాన్ని ఎంచుకున్న తర్వాత, ఆ పనిపై సుదీర్ఘమైన కాలం పనిచేయగల నా పట్టుదలకు; ఎదురు దెబ్బలను తట్టుకుని నిలబడగల శక్తికి; త్వరలోనే మరో అవకాశం రాబోతోందనే నా ఆశాభావానికి! వాటినే నేను నా ‘సూపర్ పవర్లు’గా పరిగణిస్తాను. మీకు కావాల్సింది కనుగొనగలరని భావిస్తున్నాను. మొదటి రోజునే ఒక నిర్ణయానికి వచ్చేయాలని అనుకోవద్దు. తక్కువ కాలంలోనే దాన్ని కనుగొనగలగడం కూడా ముఖ్యం కాదు. కానీ, మీ జీవిత కాలాన్ని అంకితం చేయడానికి ఒక పనిని మీరు కనుగొన గలరని ఆశిస్తున్నాను. మీ నైపుణ్యాలకు దానిలో పదును పెట్టుకోండి. అది మీ జీవితకాల కృషి కావాలి. చివరగా, చెప్పేది ఒక్కటే. జీవితంలో దేని తర్వాత ఏమిటో నిర్ణయించుకోవాలి. జీవితంలో అనేక సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. చేయవలసిన పనులు అనేకం ఉంటాయి. కానీ, ప్రాధాన్య క్రమాన్ని ఏర్పరచుకోండి. ముఖ్యమైన పనులు చేసేందుకు కావలసినంత సమయం చిక్కుతుంది. -
బడిలో చదవలేదు..లోకమే ఆయనకు విశ్వవిద్యాలయం
అందెశ్రీ సహజ కవి, ప్రజాకవి. కాళి దాసుది మేఘ సందేశం, అందెశ్రీది నది సందేశం. ‘నది నడిచి పోతున్నది, నావనై నను రమ్మన్నది’ అంటూ దేశ దేశాలను సందర్శించి ప్రపంచ నదులెన్నో చూసి పరవశించాడు. కవిత్వం కోసం ప్రపంచంలోని నదుల వెంట నడిచిన కవి ప్రపంచంలో అందెశ్రీ ఒక్కడే! అత్యంత పేదరికం నుండి ఆశు కవిగా, ప్రకృతి కవిగా పరిణతి చెందాడు.అందెశ్రీది వాక్శుద్ధి గల కవిత్వం. ఆయన పలికింది సత్యమై కూర్చుంటుంది. అలనాటి పోతులూరి వీరబ్రహ్మం గురించి విన్నాము. పోతులూరి సమాజానికి తిరుగుబాటు నేర్పాడు. రాజులను మార్చాడో లేదో తెలియదు గానీ అందెశ్రీ ప్రభుత్వాలను మార్చుతాను అన్నాడు. ‘వాడెంత’ అన్నవాడిని కుర్చీ నుండి దించే దాక హృదయంలో అగ్నిగుండమై రగిలాడు. అదే ‘నిప్పుల వాగు’ పాటల, కవితల సంకలనం. అది ఆరేండ్ల కృషి. ఆనాడు అవమానించబడిన చాణక్యుడు నంద రాజ్యాన్ని కూల్చి మౌర్య చంద్రగుప్తునికి పట్టాభిషేకం చేసినట్లు... నేటి చాణక్యుడిగా నిలిచి, ‘ఇంటర్వ్యూ నువ్వు చెయ్యాలి. నేను జవాబులు చెప్పాలి’ అని భవిష్యత్ తెలిసిన అందెశ్రీ... రేవంత్రెడ్డిని ఇంటర్వ్యూ చేయమన్నాడు. ‘ఆ చదువు రానివాడు నాలుగు నుడుగులు నేర్వగానే ఇంత పొగరా!’ అని అనుకున్న వారు ఉన్నారు. అతడు అంద రినీ ప్రేమించాడు. అతడికి కులం లేదు, ధనం లేదు. అందెశ్రీలో ఎంత పొగరున్నదో, ఎంత విద్వత్తున్నదో అంత వినయ సంపన్నుడు. అది ఆయన గురువుగా గౌరవించే శ్రీరాం సర్కు తెలుసు. నాకు తెలుసు. ఆయన వాక్శుద్ధిని గమనించిన సంస్కృతపండితులూ, వయోవృద్ధులూ ఆయనకు తలలు వంచి నమస్కరించారు. అందెశ్రీని ఒక్క మాటలో చెప్పాలంటే... ఆధునిక ఋషి. 1995లో ‘ప్రవహించే పాట: ఆంధ్రప్రదేశ్ దళిత పాటలు’ అనే పాటల పుస్తకం కోసం... అన్ని ప్రాంతాలనుండి వందలాది కవుల పాటలను సేకరిస్తున్న కాలంలో అందెశ్రీ వెలువరించిన రెండు పాటల పుస్తకాలు అందించాడు. అవి అన్నీ ప్రకృతి, పల్లె జీవితం, మానవీయత గురించిన పాటలు. 1992లో ప్రారంభించిన ‘దరకమే’ ఐక్యవేదికలో చేరలేదు. పాట కవుల వేదిక, అలాగే ‘కథకుల వేదిక’ ప్రత్యేకంగా ఉండాలని అనుకున్న ప్రకారం... గూడ అంజయ్య పాట కవుల వేదికను ప్రారంభించాడు. అందెశ్రీ దానితో కలిసి కొన్ని పాటలు రాశాడు. ఆ పాట కవుల వేదికే ‘తెలంగాణ ధూం ధాం’కు బీజం వేసింది. కామారెడ్డి సభతో తన రూపం తీసుకుంది. పాట కవులు, కళాకారులు తప్ప ఎవరూ వేదికపై ఉండరాదనే నియమంతో ‘తెలంగాణ ధూం ధాం’ బయల్దేరింది. పాట కవుల వేదికను ‘తెలంగాణ ధూం ధాం’గా మలచడంలో అందెశ్రీది కీలక పాత్ర. మారోజు వీరన్న కృషి అంత ర్లీనంగా ఉండింది. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాను ‘తెలంగాణ ధూం ధాం’ నిర్మాత అందెశ్రీనే అని! ఈ విషయాన్ని ‘నడుస్తున్న చరిత్ర తెలంగాణ’ సిరీస్ 2వ పుస్తకంలోనే ఇరవై యేళ్ళ క్రితం నమోదు చేశాను. ‘రసమయి’ బాలకిషన్ కళాకారుడిగా తెలంగాణ ధూం ధాంకు ఐకా¯Œ గా నిలిస్తే దాని రూపురేఖలను తీర్చిదిద్ది సాహిత్యాన్ని అందించినది అందెశ్రీ. అంతడుపుల నాగరాజు కళాబంధం దాన్ని రసమయం చేసింది. అందెశ్రీ బడిలో చదవలేకపోయాడు. లోకమే విశ్వవిద్యాలయంగా చదివినవాడు. అతడు పశువులను కాశాడు. సుతారి పని చేశాడు. నిజామాబాద్లో శృంగేరీ పీఠానికి చెందిన శంకర్ మహరాజ్ గురూజీ ఆయనకు జ్ఞానబోధ చేశాడు. బిరుదురాజు రామరాజు కన్నబిడ్డగా చూసుకున్నాడు. బాసర వాక్కులమ్మ స్ఫూర్తితో ఎది గాడు. తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన కవిగా నిలిచాడు. వర్తమానంలో సాహిత్యం మీద బతికిన మహాకవి అందెశ్రీ. ఏ నిర్మాణంలో ఇమడలేనని చెప్పి స్వతంత్రుడుగా జీవించిన కవి.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతడి పాడె మోసి ముందుకు నడిచాడు. అమరుడైనాక కూడ ఆయన కోరుకున్నట్టు ‘పద్మ భూషణ్’, ‘పద్మవిభూషణ్’ తప్పక వరిస్తాయి. అమరుడా...అందెశ్రీ! నీకు జోహార్లు.-బి.ఎస్. రాములు తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ చైర్మన్ -
మళ్లీ అణ్వాయుధ పోటీ?
అణ్వాయుధాల పరీక్షలను తక్షణం పున రుద్ధరించవలసిందిగా రక్షణ (ఇప్పుడు ‘యుద్ధ విభాగం’గా పిలుస్తున్నారు) శాఖను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 29న ప్రకటించారు. ఇది ప్రపంచ అణు సుస్థిరత, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక నియమావళులపై అక్షరాలా బాంబు వేయడమే! అమెరికా 1992 సెప్టెంబర్ తర్వాత, పూర్తి విస్ఫోటనాత్మక అణు పరీక్షను నిర్వహించలేదు. అయితే, 1998లో భారత్ అణు పరీక్షలను జరిపితే, ఆ వెంటనే పాకిస్తాన్ కూడా నిర్వహించింది. ఒక అణ్వాయుధాన్ని విస్ఫోటనం చెందించి చూడటం కడసారిగా 2017లో జరిగింది. భూగర్భంలో ఉత్తర కొరియా ఆ పరీక్షను నిర్వహించింది. అప్పటి నుంచి, అణు పాటవ పరీక్షలపై మారటోరియం అమలులో ఉంది. ఇప్పటివరకు అది ఉల్లంఘనకు గురి కాలేదు. ‘‘చాలా ఏళ్ళ క్రితం మేం దాన్ని నిలుపు చేశాం. కానీ, ఇతరులు పరీక్షలు చేస్తూండటంతో, మేం కూడా చేయడం సముచితమని నాకనిపించింది’’ అని ట్రంప్ అన్నారు. రష్యా పేరును ట్రంప్ ప్రస్తావించకపోయినా ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ మాటలన్నారన్నది స్పష్టం. రష్యా పుట్టిస్తున్న దడట్రంప్ ప్రకటనకు 10 రోజుల ముందు, మాస్కో అణ్వాయుధాలను మోసుకెళ్ళగల రెండు అధునాతన ప్రయోగ వ్యవస్థలను పరీ క్షించింది. బురైవెస్నిక్ (ఆకాశం నుంచి జారిపడే) క్రూజ్ క్షిపణిని... అక్టోబర్ 21న, అసాధారణ పొసైడాన్ జలగర్భ టార్పెడోను... అక్టో బర్ 28న పరీక్షించింది. అయితే, ఈ రెండూ అణ్వాయుధాలను మోసుకెళ్ళగల వాహకాలు మాత్రమే. వాటిని పరీక్షించడం అణు విస్ఫోట పరీక్షలతో సమానం కాదు. సాంకేతికంగా, అవి ప్రస్తుత ఆయుధ నియంత్రణ చట్రంలోకి రావు. ప్రయోగ వాహకాలను పరీ క్షించాంగానీ, అణ్వాయుధాలను కాదని రష్యా పునరుద్ఘాటించింది. కానీ అణ్వాయుధాలను కూడా పొదువుకుంటే, బురైవెస్నిక్, పొసైడాన్ ప్రాణాంతక ఆయుధాలుగా పరిణమిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అవి రష్యా వద్ద ఉన్నంతవరకూ దాని జోలికి వెళ్ళే సాహసం ఎవరూ చేయలేరు. రాడార్ దృష్టిలో పడకుండా బురైవెస్నిక్ 15 గంటల్లో 14,000 కిలోమీటర్ల దూరం పయనించినట్లు అక్టోబర్ 21 పరీక్షలో తేలింది. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన చోట మాత్రమే అది భూవాతావరణంలోకి ప్రవేశించగలదు. ప్రస్తుతమున్న క్షిపణి రక్షణ వ్యవస్థలు దాన్ని పసిగట్టలేవు. అదే అమెరికా ఆందోళనకు కారణం. ఇక పొసైడాన్... మానవ రహిత జలాంతర్గత అణ్వాయుధ వాహకం. ఇది 10,000 కిలోమీటర్ల దూరం పయనించగలదు. గరి ష్ఠంగా గంటకు 100 నాట్ల (185 కిలోమీటర్ల) వేగాన్ని అందుకోగ లదు. నీటిలో 1,000 మీటర్ల లోతు నుంచి సునాయాసంగా పని చేయగలదు. ఇది ఇప్పుడున్న జలాంతర్గామి నిరోధక రణతంత్ర సామర్థ్యాలకు అందనిది. అణ్వాయుధాన్ని కూడా తగిలించుకున్న పొసైడాన్ను యుద్ధంలో ప్రయోగిస్తే, అది భూగర్భ శిలా ఫలకాలను కదిలించే విధంగా అణుధార్మిక సునామీని రేకెత్తించగలదు. భూగోళానికి, మానవాళికి ఇది చూపించగల ప్రళయం మాటలకు అందనిది. ‘ఐరన్ డోమ్’తో మారిన పరిస్థితిప్రచ్ఛన్న యుద్ధ సమయంలో 1972లో అమెరికా, ఒకప్పటి సోవియట్ యూనియన్లు బాలిస్టిక్ నిరోధక క్షిపణుల ఒడంబడిక (ఏబీఎం)కు వచ్చాయి. పరస్పరం ఆయుధాలను ప్రయోగించుకుంటే ఇద్దరమూ నాశనం కావడం ఖాయం అనే అవగాహన (మ్యాడ్)ను అది కల్పించింది. విధ్వంసాన్ని ఆధారం చేసుకున్న మనుగడ అనే ఆ సిద్ధాంతం అసంబద్ధమైనదిగా కనిపిస్తుంది. ఏబీఎం ఆనాటి పరిస్థితులను బట్టి కుదుర్చుకున్న సంక్లిష్టమైన,సాంకేతిక–వ్యూహాత్మక ఒడంబడిక. పోగుపడుతున్న సామూహిక విధ్వంసక ఆయుధాల (డబ్లు్య.ఎం.డి.)తో రెండు అగ్ర రాజ్యాల మధ్య అభద్రత నెలకొన్న నేపథ్యంలో కుదుర్చుకున్నది. అయితే, 2001 సెప్టెంబర్ 11 (9/11) పరిణామాల నేపథ్యంలో, అమెరికా 2002 జూన్లో, ఏకపక్షంగా ఆ ఒడంబడిక నుంచి ఉపసంహరించుకుంది. వైశాల్యం కుంచించుకుపోయి, ఆత్మ విశ్వాసం సన్నగిల్లిన పరిస్థితిలోనున్న రష్యాలో అది అభద్రత బీజాలను నాటింది. పొసైడాన్ 2015లో పురుడు పోసుకోవడం పుతిన్ కన్నుల్లో కాంతి రేఖను నింపింది. కడచిన దశాబ్దంలో అది వైఫల్యాలను చూసింది. సైంటిస్టులు ప్రమాదాల్లో హతులయ్యారు. కానీ, కార్యక్రమం కొన సాగింది. అక్టోబర్ 21న విజయవంతమైంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, చేసిన ప్రక టన బహుశా పుతిన్ను ఈ పరీక్షకు పురిగొల్పి ఉండవచ్చు. ‘అమె రికాకు ఐరన్ డోమ్ ఏర్పాటు’ శీర్షికతోనున్న కార్యనిర్వాహక ఉత్తర్వుపై 2025 జనవరి 27న ట్రంప్ సంతకం చేశారు. ఇప్పుడా డోమ్కు ‘గోల్డెన్ డోమ్’ అని పేరు పెట్టారు. అది అమెరికా ప్రధాన భూభాగానికి అంతటికీ గొడుగులా పనిచేస్తుందనీ, బహుశా 2045 నాటికి పూర్తి కాగల ఈ కార్యక్రమానికి దాదాపు 3.6 ట్రిలియన్ డాలర్లు ఖర్చవుతాయనీ అంచనా. ఇందుకు సంబంధించి ఎలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’కు మొదటి విడత చెల్లింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ‘స్టార్ వార్స్’ కార్యక్రమాన్నీ, ప్రచ్ఛన్న యుద్ధం అంతాన్నీ గుర్తుకు తెస్తోంది. ఈ కార్యక్రమాలు దీర్ఘకాలంలో అమెరికా, రష్యా రెండింటినీ దివాళా తీయిస్తాయా? నిరాయుధీకరణే దారిపాకిస్తాన్తో సహా ఇతర దేశాలు రహస్యంగా అణు పాటవ పరీ క్షలు నిర్వహిస్తున్నాయని ట్రంప్ చెబుతున్నారు. అధునాతన అణ్వా యుధాలు డోమ్లో భాగం కావాలంటున్నారు. దానికి కొనసాగింపుగా, అమెరికా అణు పరీక్షలను పునరుద్ధరిస్తుందని అన్నారు. ‘‘సంయమనం, చర్చలు అవసరమైన సమయంలో అణు పాటవ పరీక్షలను పునరుద్ధరించడం అస్థిరతకు ద్వారాలు తెరుస్తుంది. మూడు దశాబ్దాలుగా అణ్వాయుధ పోటీని నిరోధిస్తూ వస్తున్న అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని బీటలు వారుస్తుంది’’ అని ఆసియా –పసిఫిక్ లీడర్షిప్ నెట్వర్క్ (ఏపీఎల్ఎన్) అనే ప్రాంతీయ బృందం ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఆ ప్రకటనపై సంతకం చేసిన వారిలో ఈ వ్యాసకర్త కూడా ఉన్నారు. ట్రంప్ అణు సంయ మనాన్ని పాటిస్తారో, లేక పరీక్షల నిషేధ ‘రెడ్ లైన్’ను ఉల్లంఘిస్తారో చూడవలసి ఉంది. అంతర్జాతీయంగా అణు సంయమనం, నిరాయు ధీకరణకు ఎల్లప్పుడూ పోరాడే భారత్ తన గొంతును తప్పనిసరిగా వినిపించవలసి ఉంది. వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్ -
శత్రువు తెలుసు, మిత్రులెవరో తెలీదు!
వర్తమాన భారత సమాజాన్ని చాలామంది చాలా రకాలుగా వర్ణి స్తున్నారు. కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం (సీసీడీ) అనే భావన ఇప్పుడు క్రమంగా బలాన్ని పుంజుకుంటోంది. ఈ కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం తనకు అనుకూలమైన రాజకీయ విభాగానికి పార్లమెంటరీ ఆధిపత్యాన్ని కట్టబెట్టింది. అదే బీజేపీ నాయకత్వంలోని జాతీయ ప్రజా స్వామ్య కూటమి (ఎన్డీఏ).ఈ వ్యవస్థ మారాలని అత్యధికులు ఆశిస్తుంటారు. వ్యవస్థను మార్చడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది – ఎన్డీఏను తప్పించడం. ఇది అన్నింటికన్నా ఆదర్శ పరి ష్కారం. అయితే, ఆచరణ అంత సులువు కాదు. చాలా కాలం పడుతుంది. సాధారణ ఉద్యమాలు, పోరాటాలు కూడ సరిపోకపోవచ్చు. తీవ్ర పోరాటాలు అవసరం కావచ్చు. తీవ్ర అనే మాటకు అర్థాన్ని ఎవరికి వారు ఎంత వరకైనా అన్వయించుకోవచ్చు.లేత ఎరుపు నుండి ముదురు ఎరుపు వరకు, లేత నీలం నుండి ముదురు నీలం వరకు గడిచిన వందేళ్ళలో మనదేశంలో సాగిన ఉద్యమాలన్నీ పౌర సమాజం మీద చాలా సానుకూల ప్రభావాన్ని వేశాయి. అయితే దాన్ని రాజకీయ ప్రయోజనంగా మార్చుకోవడంలో అవన్నీ ఘోరంగా విఫలం అయ్యాయి. అలనాడు గొప్పగా వెలిగిన పౌర సమాజాన్ని కూడ ఇప్పుడు సీసీడీ కలుషితం చేసేసింది. సమానత్వ, సహోదర, సామ్యవాద భావాల నుండి సమా జాన్ని తప్పించే పనిలో పడింది. దీనిని శుద్ధి కార్యక్రమం అని కూడ అంటున్నారు.బహుళ పార్టీల పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మనకు ఇంకో పరిష్కారం ఉంది; ఐదేళ్ళకు ఒకసారి జరిగే లోక్సభ ఎన్నికల్లో మనకు నచ్చని పార్టీనో, కూటమినో ఓడించడం. అది సాయుధ పోరాటాలు చేయాల్సినంత కష్టమైన పని కాదుగానీ, అంత ఈజీ కూడా కాదు. దాదాపు వందకోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉంటారు. వాళ్ళలో ఓ70 కోట్ల మంది పోలింగులో పాల్గొంటారు. వారిలో సగానికి పైగా, అంటే నలభై కోట్ల మందిని ప్రభావితం చేసేబృహత్తర పథకాన్ని రచించి కచ్చితంగా ఫలితాలనుసాధించే కార్యాచరణ ఒకటి ఉండాలి.అయితే, ప్రజాస్వామ్యం పేదది కాదు; పేదోళ్ళదిఅంతకన్నా కాదు. రాజకీయ కళలో ప్రావీణ్యం సంపాదించిన కొద్దిమంది కలిసి నడిపే నియంతృత్వంగా ప్రజా స్వామ్యం కుంచించుకుపోయింది. ఇదో రాజకీయ పార డాక్సీ! ఈ వాస్తవాన్ని ముందు గుర్తించాలి. సమ్మతి ఉత్పత్తి అన్నమాట! ఉత్పత్తి అంటేనే పెట్టుబడి.అయితే, సమాజం చాలామంది అనుకుంటున్నంతగా చెడిపోలేదు. సీసీడీ ప్రాయోజితంగా గెలిచినవాళ్ళు తమను తాము అప్రతిహత శక్తిగా చెప్పుకుంటున్నారుగానీ, ఓటర్లు వాళ్ళకు అంతగా మద్దతు పలకలేదు. 2014 నుండి 2024 వరకు జరిగిన మూడు లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పడిన ఓట్లు 31, 37.36, 36.56 శాతం మాత్రమే!అంటే, 60 శాతానికి పైగా ఓటర్లు ఎన్డీఏ కూటమికి వ్యతి రేకంగా ఓటు వేస్తున్నారు. దీని అర్థం ఏమిటీ? ఎన్డీఏ కూటమి తన సొంత బలం మీద కాకుండా విపక్షాల అనైక్యత వల్ల మాత్రమే గెలుస్తున్నది.విపక్షాలు ఏకం అయితే ఎన్డీఏ కూటమిని ఓడించడం సులువు అని దీన్నిబట్టి అర్థమవుతుంది. ఒక సీటు దగ్గర, ఒక పదం దగ్గర, అప్పుడప్పుడు ఒక అక్షరం దగ్గర కూడ తేడాలొస్తే భూమ్యాకాశాల్ని ఏకంచేస్తూ మన విపక్షాలు కొట్లాడుకుని విడిపోతుంటాయి. మరోవైపు, ఎన్డీఏ కూటమి ఏకశిలా సదృశంగా సమైక్యంగా ఉంటుంది. ఆ కూటమిలో, ఆరెస్సెస్ వంటి మెజారిటీ మతవాదులతోపాటు అథవాలే వంటి అంబేడ్కరిస్టులు, నితీశ్ కుమార్ వంటి సోషలిస్టులు కూడా ఉంటారు. అయినా, అందరూ ఒక్కటై ఉంటారు. అది వాళ్ళ విజయ రహస్యం.విపక్షాలను ఏకం చేయాలనే ఆలోచన ఓ ఐదారేళ్ళుగా చక్కర్లు కొడుతోంది. కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘ఎద్దేలు కర్ణాటక’ (మేలుకో కర్ణాటక) అనే ఒక పౌరసంస్థ ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నడుం బిగించింది. ఆశించిన ఫలితాలను సాధించడానికి ఆధునిక టెక్నా లజీని కూడ వాడింది. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ఓటింగ్ శాతం దాదాపు స్థిరంగా ఉన్నాసరే ఎన్నికల్లో ఓడి పోయింది. ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్కు ఓట్లు పెద్దగా పెరVýæకపోయినా (4–5 శాతం), సీట్లు మాత్రం భారీగా పెరిగి, అధికారాన్ని చేపట్టింది. రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నచోటనే ‘ఎద్దేలు కర్ణాటక’ ప్రత్యేక దృష్టి పెట్టి సానుకూల ఫలితాలను సాధించింది. కానీ, 2024 లోక్సభ ఎన్నికల్లో ఆ సంస్థ ప్రభావం కనిపించలేదు. మళ్ళీ బీజేపీ తన ఆధిక్యాన్ని చాటుకుంది. రాబోయే 2029 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ పౌరసంఘాలు కొన్ని ఈసారి కొంచెం ముందుగానే సన్నాహాలు మొదలెట్టాయి. ఇదొక సానుకూల సంకేతం. తొలి అడుగులో, వామపక్ష (మార్క్స్), సామాజిక న్యాయ (అంబేడ్కర్) ఆదర్శాలుగల రాజకీయ పార్టీల్ని ఏకం చేయాలనేది ఒక ప్రతిపాదన. ఇది సరిపోదు. సీసీడీ, ఎన్డీఏ కూటమి బాధిత సమూహాలు అనేకం ఉన్నాయి. ఒక్కొక్కరికీ ఒక్కో లక్ష్యం ఉంటుంది. ఉదాహరణకు ముస్లింలు తదితర మైనారిటీలకు మత సామరస్యం ప్రధాన ఆదర్శం. అలాగే బీసీలు, ఆదివాసీలు, మహిళలు, కార్పొరేట్ ప్రాజెక్టుల నిర్వాసితులు. ఆధిపత్య కులాల్లోని పేదలు, ఉదారవాదులకు వారివైన ప్రత్యేక లక్ష్యాలు ఉంటాయి. ఇలా విభిన్న లక్ష్యాలున్న సమూహా లన్నింటినీ మినహాయింపు లేకుండా ఏకం చేయాలి. లోక్ సభ ఎన్నికల్లో ఎవర్ని ఓడించాలో మనకు స్పష్టంగానే తెలుసు. ఎవర్ని బలపరిస్తే ఈ లక్ష్యాన్ని సాధించగలమనే దాని మీదనే ఇప్పుడు మేధామథనం సాగాలి.-వ్యాసకర్త సమాజ విశ్లేషకులు-డానీ -
వైట్ కాలర్ ఉగ్రవాదం... ఓ వాస్తవం
నవంబర్ 10 సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడుతో న్యూఢిల్లీ గతుక్కుమంది. భద్రతా సంస్థలు ఒక ప్రధాన నిందితుడిని గుర్తించగలిగాయి. కశ్మీర్లోని పుల్వామాకు చెందిన ఈ డాక్టర్ అధునాతన టెర్రర్ మాడ్యూల్లో భాగమని భావిస్తున్నారు. ఈ వైట్–కాలర్ టెర్రర్ మాడ్యూల్కు పాకిస్తాన్లో పేరుమోసిన జైషే మహమ్మద్ సంస్థతో సంబంధం ఉన్నట్లు వెలుగు చూస్తున్న సాక్ష్యాధారాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలు తాము నేరుగా ప్రమేయం పెట్టుకోకుండా, విద్యావంతులైన స్థానిక రిక్రూట్లతో దుశ్చర్యలకు పాల్పడే ధోరణి పెరుగుతోంది. విద్యావంతుల దుశ్చర్య‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత కూడా, ఉగ్రవాద ప్రయత్నాలలో ఎక్కడా విరామం కనిపించడం లేదు. భద్రతా దళాలు మే నెల నుంచి, కొన్ని డజన్ల ప్రయత్నాలను భగ్నం చేసినట్లు నిపుణుల అంచనా. స్థానిక మాడ్యూళ్ళ ప్రమేయమే చాలా వాటిలో ఉంది. కారు పేలుడుకు ముందు, వివిధ చట్ట సంస్థల అధికారులు రెండు గణనీయమైన డంపులను బట్టబయలు చేయగలిగారు. పోలీసులు నవంబర్ 9న వసతి భవనాల నుంచి 350 కిలోల అమోనియం నైట్రేట్తో సహా దాదాపు 3,000 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి కశ్మీర్ నుంచి పనిచేస్తున్న ఒక ఉగ్ర ముఠాకు చెందినవి. స్వాధీనపరచుకున్న వాటిలో అసాల్ట్ రైఫిళ్ళు, పిస్తోళ్ళు, బాంబుల తయారీకి ఉపయోగపడే టైమర్లు, రిమోట్ డిటొనేషన్ సాధనాలు కూడా ఉన్నాయి. గుజరాత్ ఉగ్ర నిరోధక స్క్వాడ్ (ఏటీఎస్) అదే రోజున ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసింది. వారి నుంచి బిరెట్టా పిస్తోళ్ళు, తూటాలు స్వాధీనపరచుకున్నారు. ఈ రెండు కేసుల్లోనూ డాక్టర్లు, విశ్వవిద్యాలయ ఉద్యో గులు నిందితులుగా ఉన్నారు. వైట్–కాలర్ ఉగ్రవాదం పెరుగుతున్న ధోరణికి ఇవి మరిన్ని ఆధారాలను సమకూర్చాయి. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ సాగి స్తున్న సీమాంతర ఉగ్రవాదంలో మారిన వ్యూహానికి ఢిల్లీ ఘటన అద్దం పడుతోంది. అది ఇక ఎంతమాత్రం విదేశీ ముష్కరులపై ఆధార పడటం లేదు. సరిహద్దుల నుంచి నేరుగా చొర బడేటట్లు చేయడం లేదు. భారతదేశం లోపల వృత్తి నిపుణులను మతోన్మాదులుగా తయారు చేసి వారిని దాడులకు ఉపయోగించుకునే పనికి పాకిస్తాన్ నిగూఢ వ్యవస్థ పాల్పడుతోంది. ఇది తమకేం సంబంధం లేదని చెప్పుకొనేందుకు పాక్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నం. దీనివల్ల ఉగ్రవాద చర్యలను పాకిస్తాన్తో, దాని లోని సంస్థలతో నేరుగా ముడిపెట్టడం కుదరదు.మారిన పాక్ వ్యూహంపాక్ ఇలా వ్యూహం మార్చుకోవడం వెనుక దేశీయ, అంతర్జాతీయ అంశాలు చాలా ఉన్నాయి. ఉగ్ర సంఘటనల్లో పాత్రకుగానూ అంతర్జాతీ యంగా ఎదురయ్యే విఘాతాలను తప్పించుకోవా లని పాక్ యోచిస్తోంది. ‘ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’ ఈ మధ్య అంటే అక్టోబర్ నెలలో పాకిక్కు తాజాగా హెచ్చరిక జారీ చేసింది. నిషే ధిత జాబితా నుంచి 2022లో బయటపడినందుకు సంబరపడిపోవద్దనీ, అది గుప్త ధనాన్ని మార్చడం, ఉగ్రవాదులకు నగదు చేకూర్చడానికి సంబంధించి అంతర్జాతీయ పర్యవేక్షణ నుంచి తప్పించుకున్నట్లు కాదనీ స్పష్టం చేసింది. పాకిస్తాన్ లోపల కూడా పరిస్థితులు సవ్యంగా లేవు.‘తెహ్రీక్–ఏ–తాలిబాన్ పాకిస్తాన్’ మళ్ళీ విజృంభిస్తోంది. అఫ్గానిస్తాన్తో ఘర్షణ కొనసాగుతోంది. ఫలితంగా, పాక్ సైన్యం ఆంతరంగిక భద్రతా విధుల పైనా, డ్యూరాండ్ రేఖ పైనా ఎక్కువ దృష్టి పెట్టవలసి వస్తోంది. ప్రాంతీయ ఘర్ష ణల్లో వ్యూహాత్మక లివరేజీని నిలబెట్టుకుంటూనే అంతర్జాతీయంగా తనకున్న చెడ్డ పేరును చెరిపేసు కుని, కొత్త అవతారం దాల్చినట్లుగా కనిపించవలసిన అవసరాన్ని అది గుర్తించింది. భారతదేశపు భద్రతా సంస్థలు కనివిని ఎరుగని సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. విదేశీ చొర బాటుదారులకు, దేశీయ కుట్రదారులకు మధ్యనున్న రేఖలు చెరిగిపోతున్నాయి. టెర్రర్ మాడ్యూళ్ళు వృత్తి నిపుణుల ముసుగును కూడా వేసుకుంటున్నాయి. వివిధ ప్రాంతాల్లో దొరికిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు, అవి ఏవో చెదురుమదురు దాడులకు ఉద్దేశించినవి కావనీ, సరిహద్దుకు ఆవల నున్న సూత్రధారుల ఆదేశాల మేరకు విస్తృత దాడులకు పథకాలు రచించుకున్నాయనీ తేలుతోంది. భద్రతా సంస్థలు ఎప్పటికప్పుడు చురుకుగా వ్యవహరిస్తూ నూతన రిక్రూట్మెంట్ మార్గాల రూపు రేఖలను కనిపెట్టవలసి ఉంది. వృత్తి విద్యా సంస్థల్లో రాడికలైజేషన్పై మానవ ఇంటెలిజెన్స్ పెంచు కోవాల్సి ఉంది. ఎవరెవరు చేతులు కలుపుతున్నారో గ్రహించేందుకు ఫోరెన్సిక్ డేటాను, డిజిటల్ నిఘాను వినియోగించుకోవాలి. సంస్థలు కూడా ఉద్యోగాలిచ్చే ముందు క్షుణ్ణంగా నేపథ్యాలు తెలుసు కోవాలి. యూనివర్సిటీలు, వృత్తి విద్యా సంస్థల లోపల కౌంటర్–రాడికలైజేషన్ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలి. ఫ్రాన్స్ 2018లో చేపట్టిన ‘కాపాడుకునేందుకు నివారణ’ మార్గాన్నే మనమూ అనుసరించవచ్చు. సామాజిక, విద్యా, భద్రతా, జైలు వ్యవస్థలను కూడగట్టుకుని ప్రభుత్వం సమ న్వయ కార్యాచరణ ద్వారా ఎవరూ ఉగ్రవాదం వైపు మళ్ళకుండా నివారించడంపై దృష్టి పెట్టాలి.లెఫ్ట్నెంట్ జనరల్ ఎస్.కె. సైనీ (రిటైర్డ్)వ్యాసకర్త సైనిక దళ మాజీ వైస్ చీఫ్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)విశ్లేషణఎర్ర కోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటనను ఉగ్ర దాడిగా ముద్ర వేయడంపై ప్రభుత్వం అభినందనీయమైన రీతిలో ఆచితూచి వ్యవహరించింది. దర్యాప్తు మొదలైన రెండు రోజుల తర్వాతే, దాన్ని ధ్రువపరచింది. కొన్ని ప్రాథమిక వాస్తవాలు తేటతెల్లమయ్యాయి. ఒక మాడ్యూల్ కశ్మీర్లో పనిచేస్తోంది. పెద్ద యెత్తున పేలుడు పదార్థాలు సహారన్పుర్, ఫరీదాబాద్ మీదుగా దేశ రాజధానికి చేరుకున్నాయి. ఆ రెండూ పరస్పర సంబంధం కలిగినవనీ, పాలుపంచుకున్నది ఒకే మాడ్యూలేననీ కొత్త డేటా తెలుపుతోంది. కానీ ఎవరి ప్రేరణతో జరిగిందనేది స్పష్టం కాలేదు. దీన్ని మరింత ప్రమాదకరమైనదిగా భావించవలసి వస్తోంది. ఇది అజ్ఞాతంగా పాకుతూ పోయే వైరస్ లాంటిది. డాక్టర్ టెర్రర్పోలీసులకు సహకరించవద్దని ఉద్భోదిస్తూ జైషే–మహమ్మద్ పోస్టర్లు నౌగామ్, శ్రీనగర్లలో అక్టోబర్లో దర్శనమిచ్చాయి. అప్రమత్తంగా ఉన్న పోలీస్ సూపరింటెండెంట్ వాటికి కారకుడైన వ్యక్తిని గుర్తించారు. అతను అదీల్ అహ్మద్ రాథెర్ అనే డాక్టర్. అనంతనాగ్లోని ప్రభుత్వ వైద్య కళాశా లలో సీనియర్ రెసిడెంట్గా పనిచేశాడు. జమ్ము–కశ్మీర్ పోలీసులు ఆ వైద్య కళాశాలలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కనుగొన్నారు. వాళ్ళు ఉత్తర ప్రదేశ్ పోలీసులను అప్రమత్తం చేయడంతో, అది నవంబర్ మొదటి వారంలో సహారన్పుర్కు మకాం మార్చిన రాథెర్ అరెస్టుకు దారి తీసింది. అక్కడ తీగ లాగితే ఫరీదాబాద్లో డొంక కది లింది. ముజమ్మీల్ గనాయీ అరెస్టయ్యాడు. పుల్వామాకు చెందిన అతడు ఫరీదాబాద్లోని అల్–ఫలా ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తు న్నాడు. ఇవి నవంబర్ మొదట్లో జరిగిన సంఘ టనలు. ఫలితంగా, ఫరీదాబాద్లో అమో నియం నైట్రేట్తో సహా సుమారు 2,900 కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి. మరింత మంది ఉగ్రవాదులను పసిగట్టే పనిని పోలీసులు నవంబర్ 10న ప్రారంభించి నప్పటికీ, ఆ సాయంత్రం ఎర్ర కోట వద్ద కారు బాంబు పేలింది. సీసీటీవీ ఫుటేజీలో ఉమర్ ఉన్–నబీ అనే మరో డాక్టర్ పైకి తేలాడు. కారు నడిపింది అతడేనని ఫోరెన్సిక్ ఆధారాలు వెల్ల డించాయి. అతనూ ఫరీదాబాద్లోని అదే ఆస్ప త్రికి చెందినవాడు. షోపియాన్లో ఒక రాడికల్ ఇమామ్ను, అల్–ఫలాకు చెందిన మహిళా డాక్టర్ను లక్నోలో అదుపులోకి తీసుకున్నారు. మరింత మంది పట్టుబడవచ్చు. అసలు కారు బాంబును ఉద్దేశపూర్వకంగానే పేల్చారా అనేది సందేహంగా మారింది. అక్కడికి కొద్ది వందల గజాల దూరంలో శ్రీ గౌరీ శంకర్ ఆలయం ఉంది. అక్కడ కారు బాంబును పేల్చి ఉంటే మరింత మంది చని పోయి ఉండేవారు. ఉగ్ర వాదులు సాధారణంగా కోరుకునే మతపరమైన కల్లోలాలను రేకెత్తించి ఉండేది. ముఠాలోని ఇతర సభ్యులు పట్టుబడటంతో, అతను భయోత్పాతానికి లోనై పేల్చేసుకున్నాడన్నది ఒక భావన. ఏ విధంగా చూసినా, ఇది రెండేళ్ళుగా సాగుతున్న పథకంగా కనిపిస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’కు ముందే ఈ సెల్ క్రియాశీలంగా ఉంది కనుక, జైష్, లష్కర్ల పురిటి గడ్డపై వైమానికి దాడులకు ప్రతీకారంగా ఇది జరిగి ఉండవచ్చునుకోవడానికి లేదు. కాచుకుని ఉన్న శత్రువులుఇది సడీచప్పుడు లేకుండా పనిచేస్తూ వచ్చిన, విస్తృతమైన స్లీపర్ సెల్. అనుమానించడానికి ఏమాత్రం అవకాశం లేని వ్యక్తులు దీనిలో ఉన్నారు. వారందరూ కశ్మీర్కు చెందినవారు కాదు. ఈ ధోరణిని అర్థం చేసుకునేందుకు స్పెయిన్, ఇటాలియన్ పోలీసుల చర్యలోకి వెళ్ళాలి. వారు అక్కడ ఒక పెద్ద పాకిస్తానీ సెల్ను కనుగొన్నారు. అది జనాన్ని ఉగ్రవాదం వైపు నడిపిస్తోందని తేలింది. దాని ఆనుపానులు కనుగొనేందుకు పోలీసులకు రెండేళ్ళు పట్టింది. ఈ ఏడాది మార్చిలో మాత్రమే వారు కొందరిని అరెస్టు చేయగలిగారు. ఒక కీలక వాస్తవాన్ని గుర్తించి తీరాలి. ఉగ్రవాదాన్ని సరికొత్తగా సృష్టించలేం. ప్రస్తుతమున్న వేర్పాటువాద పరిస్థితిని ఆధారం చేసుకునే అది పైకి లేస్తుంది. వీటిలో రెండవ దానికి పాకిస్తానే చక్కని ఉదాహరణ. ఢిల్లీ ఇంతవరకు ఉపేక్షించిన ఒక అంశానికి వ్యతిరేకంగా కార్యాచరణకు దిగాలి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మత విద్వేషం సెగలు గక్కుతోంది. రెండు వర్గాలకు చెందిన మనుషులు చనిపోయిన అంశాన్ని మీడియా ప్రముఖంగా పేర్కొనవలసిన అవసరం ఉంది. ఇది దేశాల సరిహద్దులను దాటిన అంతర్జాతీయంగా కనిపిస్తున్న ధోరణి. కీలక ఉగ్రవాద నాయకులు తుర్కియేలోని ‘సూత్రధారుల’తో సమావేశమైనట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, అంకారాను హెచ్చరించడం కూడా సమయోచితం అనిపించుకుంటుంది. భారతదేశాన్ని ఎలాగైనా ముక్కచెక్కలు చేయాలని చాలా మంది శత్రువులు కాచుకుని కూర్చున్నారు. భారత్–పాక్ యుద్ధానికి దిగాలని చూస్తున్నారు. భారత్ ఆర్థికంగా స్థిరంగా వృద్ధి చెందుతూండటం అనేక రాజధానులలో గణనీయమైన ఆందోళన రేకెత్తిస్తోంది. తారా కార్థా వ్యాసకర్త నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ మాజీ డైరెక్టర్(‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
మార్కులు, ర్యాంకులు కాదు.. సృజనతోనే భవితకు పునాది
November 14 Childrens dayబాలలు కేవలం కాబోయే పౌరులు కాదు, వాళ్ళు భవిష్యత్తు సృష్టికర్తలు. బాలల్లో సృజనాత్మకత అంటే... కేవలం కథలు, కవిత్వం కళలు కాదు; అది ఒక జీవన శిక్షణ. సృజనాత్మకత బాలల మన సుల్లో వెలిగే దీపమై, వారిని విజ్ఞానంతో, విలువలతో, చైతన్యంతో నింపుతూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది.సృజనాత్మకత ఒక శిక్షణ కాదు. అది ఒక సంస్కారం. ఆ సంస్కారం బాల్యంలోనే మొదల వుతుంది. ప్రతి బాలుడు/బాలిక ఒక కొత్త ప్రపంచం వైపు అడు గులు వేస్తున్న శిల్పిగా ఎదగాలంటే... పెద్దలుగా మనం ఇవ్వాల్సినవి ప్రేమ, స్వేచ్ఛ, ప్రోత్సాహం.బాలల్లో సృజనాత్మకత అంటే వెలుగుతున్న ఒక దీపశిఖ. అది ఒకసారి వారి మనసుల్లో వెలిగితే, సమాజం మొత్తానికి వెలుగును పంచుతుంది. ఆ వెలుగులో అతడు కేవలం విజ్ఞానవంతుడిగానే కాదు; మానవత్వం, విలువ లతో కూడిన సమగ్ర మనిషిగా ఎదుగుతాడు. నిజానికి మనిషిలో బాల్యంలోనే సరికొత్త ఆలోచనలకు విత్తనం పడుతుంది. ఆ చిన్న మనసుల్లో మెరుస్తున్న ఆలోచనలు పెద్ద పెద్ద ప్రపంచాలను నిర్మించగలవు. కానీ ఆ కాంతిని మసక బారనీయకుండా దానికి ఒక అందమైన అర్థ వంతమైన దిశ చూపడం పెద్దల బాధ్యత.సృజనాత్మకత ఒక నది లాంటిది. దాన్ని అడ్డుకుంటే నిలిచిపోతుంది. దారి ఇస్తే మొత్తం సమాజాన్నే సారవంతం చేస్తుంది. ఒక బాలుడు కాగితపు పడవను వర్షపు నీటిలో వదిలినప్పుడు అది కేవలం ఆట కాదు; అందులో ప్రకృతిని, ప్రవాహాన్ని, గమ్యాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది. ఈనాటి విద్యావ్యవస్థలో ‘పుస్తకాలు’, ‘బోధన’ కేవలం మార్కులు,ర్యాంకులు సాధించడానికి మాత్రమే కాకుండా బాలల్లో ఊహాశక్తిని పెంచే సాధనాలుగా ఉండాల్సిన అవసరం ఉంది. పాఠశాలలు బాలల నుంచి ‘సరైన సమాధానం’ రాబట్టడం కన్నా, ‘సరైన ప్రశ్న’ వేయగలిగిన ధైర్యాన్ని పెంపొందించాలి. కథలు చెప్పడం, చిత్రకళ, నాటకాలు, శాస్త్రీయ ప్రయోగాలు ఇవన్నీ బాలల్ని విభిన్నంగా ఆలోచించడానికీ, ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడటా నికీ ప్రేరేపిస్తాయి. తప్పులు చేయడం, విఫలమవడం కూడా సృజనలో భాగమే. తల్లితండ్రులు, ఉపాధ్యాయులు బాలల వైఫల్యాలను విమర్శించకుండా వాటిని ఒక అనుభవంగా చూడాలి. వర్తమాన ఏఐ కాలంలో స్మార్ట్ ఫోన్స్లు, ట్యాబ్లు, గేమ్లు, రీళ్ళు బాలల జీవన గతిలో భాగమైపోయాయి. ఆ స్థితిని ఆపలేం. వాటిని బాలలకు సృజనా త్మక మిత్రులుగా మార్చడం పెద్దల చేతిలో ఉంది. – వారాల ఆనంద్ కవి – కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత (నేడు బాలల దినోత్సవం) -
వ్యవసాయ రంగాన్ని కాపాడరా?
వ్యవసాయ రంగం (Agriculture sector) పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దివాళాకోరు విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారు. రోజురోజుకూ వ్యవసాయాన్ని వదిలి గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్ళి కూలీ నాలి చేసుకొనే దుఃస్థితిలో రైతులున్నారు. పంటలు దెబ్బతింటే నష్ట పరిహారం అందక, వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడులు వెళ్ళక, తెచ్చిన అప్పులు తీర్చలేక, మానసిక ఒత్తిడికి గురై రాష్ట్రంలో ప్రతి యేటా 450 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడు తున్నారు. వీటికి ప్రభుత్వాల వైఫల్యమే ప్రధాన కారణం. అందరికీ అన్నం పెట్టే రైతన్న నేడు అడుక్కోవలిసిన అధోగతి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2021–22 నాటి వ్యవసాయ ప్రణాళికను ప్రకటించటం నిలిపివేసింది. దాన్ని నేడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నది. 2014 నుండి 2025 వరకు కరువులు, వరదల వలన ప్రతిసంవత్సరం పెద్ద ఎత్తున పంటల నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వాల సహకారం లేకపోవడంతో రైతుల్లో అయోమయ స్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక కమిషన్ (2015–20), 15వ ఆర్థిక కమిషన్ (2020–25) ద్వారా ప్రకృతి వైపరీత్యాల వలన నష్ట పోయిన రైతులకు పరిహారం ప్రకటించింది. అయినా, ఇప్పటి వరకు సక్రమంగా రైతులకు అది అందకపోవడం విచారకరం. 2023లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలు ప్రకృతి వైపరీత్యాల సహాయం కొరకు కేంద్ర ప్రభు త్వానికి లేఖలు రాసింది. కేంద్ర బృందాలు వచ్చి, పరిశీలించి వెళ్ళాయి తప్ప, ఎలాంటి సహాయం ఇవ్వలేదు. 2021–26 సంవత్సరానికి 15వ ఆర్థిక కమిషన్ కింద అన్ని రాష్ట్రాలకు కలిపి 1.61 లక్షల కోట్ల నిధులు కేటాయించారు. తెలంగాణకు మాత్రంఅందులో కేవలం రూ. 2,872 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం రికమండ్ చేసిన వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం లేదు. రాష్ట్రంలో కల్తీ విత్తన వ్యాపా రులపై పీడీ యాక్ట్ పెడతామని గొప్పగా ప్రకటించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఒక్క లైసెన్సును కూడా రద్దు చేయలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం రైతులకు సరిపడా ఎరువులు అందించలేకపోతోంది. దీనికితోడు కృత్రిమ కొరతను సృష్టించి ఎరు వుల ధరలు అడ్డగోలుగా పెంచుతున్నారు వ్యాపారులు. కేంద్రం ఎరువులపై సబ్సిడీ బాగా తగ్గించడంతో ధరలు విపరీతంగా పెరుగు తున్నాయి. 2022–23లో కేంద్రం రూ. 2,51,369 కోట్లు సబ్సిడీ ఇవ్వగా, 2025–26లో రూ. 1,67,227 కోట్లకు సబ్సిడీని తగ్గించింది. ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయం చేయా లని ప్రచారం చేస్తూనే మరోవైపు నానో యూరియా, నానో డీఏపీ లను ఉత్పత్తి చేసి ధరలు పెంచారు. (బిహార్ మాదే.. ఇక బెంగాల్ వంతు : కేంద్రమంత్రి చాలెంజ్)రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులుండగా... బ్యాంకులు 42 లక్షల మందికే రుణాలిస్తున్నాయి. మిగిలిన వారు ప్రైవేటు రుణాలు తెచ్చుకుంటున్నారు. వారంతా 5 ఎకరాలు లోపు ఉన్న... సన్న, చిన్నకారు రైతులు, కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా వ్యవసాయ రంగం సమగ్రంగా అభివృద్ధి చెందా లంటే పాలకులు కండ్లు తెరిచి, వ్యవసాయ నిపుణులు, రైతుసంఘాల ప్రతినిధులు సూచించిన ప్రకారం వ్యవసాయ ప్రణాళికలు రూపొందించాలి. రైతు సమస్యలను పరిష్కరించటానికి అన్ని రకాల చర్యలు చేపట్టి వారిని ఆదుకోవాలి. -జూలకంటి రంగారెడ్డి మాజీ శాసన సభ్యులు, తెలంగాణ రైతు సంఘం ఉపాధ్యక్షులు -
ఇండియాకు మునీర్ బెడద తప్పదా?
పాకిస్తాన్ పార్లమెంట్ ప్రస్తుతం ప్రతిపాదిత 27వ రాజ్యాంగ సవరణపై చర్చిస్తోంది. ఈ సవరణ 243వ అధికరణాన్ని పూర్తిగా మార్చేసి దేశ సాయుధ దళాలపై నియంత్రణ, ఆధిపత్యానికి సంబంధించి మౌలికంగా కొత్త రూపు నివ్వనుంది. దేశ రాజకీయ రంగస్థలంపై సైన్యానికున్న పట్టును దృష్టిలో పెట్టుకుని చూసినపుడు, ఆ చర్చ చాలావరకు నిరుపయోగమైనదే అవుతుంది. ఎందుకంటే ఈ ఏడాది మొదట్లో భారత్–పాకిస్తాన్ మధ్య ప్రతిష్టంభన తర్వాత, పాకిస్తాన్ సైనిక ప్రధానాధికారి అసీమ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి కల్పించారు. అమెరికా అధ్యక్షుడి నుంచి లభిస్తున్న వ్యక్తిగత మద్దతు ధీమాతో ఆయన సాయుధ దళాలపై తన అధికారాన్ని మరింత పటిష్ఠపరచుకుంటున్నారు. పౌర ప్రభుత్వ–సైనిక సంబంధాలలో ఇప్పటికే మొగ్గు సైన్యం వైపు ఎక్కువగా ఉంది. తక్కెడలో సైన్యం వైపు బరువు మరింత పెరిగేటట్లు మునీర్ చూసుకుంటున్నారు. పదాతి దళానికే పెద్ద పీటప్రతిపాదిత రాజ్యాంగ సవరణ పౌర–సైనిక సంబంధాలలో, సైన్యం పాత్రలో గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టే లక్ష్యాలతో ఉంది. త్రివిధ దళాలపైన పెత్తనం వహించేటట్లుగా రక్షణ దళాల ప్రధానాధికారి (సీడీఎఫ్) పదవిని సృష్టించాలని ప్రతిపాదిస్తోంది. సీడీఎఫ్గా ఎప్పుడూ పదాతి దళాల ప్రధానాధికారే ఉండాలని పేర్కొంటోంది. ఆయన పదవీ కాలాన్ని ఐదేళ్ళకు పెంచుతోంది. సీడీఎఫ్కు వీలు కల్పించేందుకు, చిరకాలంగా ఉన్న త్రివిధ దళాల సంయుక్త కమిటీ చైర్మన్ (సి.జె.సి.ఎస్.సి.) పదవిని త్వరలో రద్దు చేయనున్నారు. సంయుక్త కమిటీకి ప్రస్తుతం చైర్మన్గా ఉన్న జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా రిటైరవడం, ఆ పదవి రద్దవడం ఒకేసారి జరగనున్నాయి. ఐదు నక్షత్రాల ర్యాంకులు పొందిన సైనిక అధికారులకు ఫీల్డ్ మార్షల్, మార్షల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, అడ్మిరల్ ఆఫ్ ద ఫ్లీట్ వంటి సైనిక బిరుదులను ప్రదానం చేయడం అసాధా రణం ఏమీ కాదుకానీ, అటువంటివారిని అభిశంసన ద్వారా తప్ప వేరే విధంగా తొలగించడానికి వీలు లేకపోవడం పాక్లో కనిపించే విచిత్రమైన అంశం. అన్ని అణు, వ్యూహాత్మక సంపత్తులను పర్యవేక్షించే విధంగా జాతీయ వ్యూహాత్మక దళ కమాండర్ (సి.ఎన్.ఎస్.సి.)గా ఒకరిని నియమించాలని కూడా ఆ సవరణ ప్రతిపాదిస్తోంది. ఆర్మీ చీఫ్ సిఫార్సు మేరకు, సైన్యం నుంచే ఒకరిని ఆ పదవిలో ప్రధాన మంత్రి నియమిస్తారు. సూటిగా చెప్పాలంటే, దానిపై నియంత్రణ పౌర ప్రభుత్వం నుంచి చేజారిపోతోంది. వీసమెత్తు ప్రతిఘటన లేకుండా, పాక్లో బాహాటంగా, ఇలా అధికారం కేంద్రీకృతం కావడం, పర్వేజ్ ముషారఫ్ హయాంతో సహా, ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఈ పరిణామాలు పాక్, భారత్ రెండింటిపైనా గణనీయమైన ప్రభా వాన్ని చూపనున్నాయి. అనూహ్యంగా ఎదిగిన మునీర్పాక్ను 1977 నుంచి 1988 వరకు పాలించిన సైనిక పాలకుడు జియా–ఉల్–హక్ తర్వాత, తిరిగి అంత ప్రాభవాన్ని అనుభవిస్తున్న వ్యక్తి మునీర్ కానున్నారు. జియా కంటే కూడా మునీరే నాలుగు ఆకులు ఎక్కువ చదివాడనుకోవాలి. సైనిక తిరుగుబాటు మాట లేకుండానే ఆయన మొత్తం అధికారాన్ని తన గుప్పిట్లోకి తెచ్చు కున్నారు. అసీమ్ అధికారాన్ని పటిష్ఠపరచుకున్న తీరు ఆసక్తి కలిగిస్తుంది. ఆయన 2022 నవంబర్లో ఆర్మీ చీఫ్ అయ్యారు.హిందువులు, ముస్లింలు కలసి ఎన్నడూ సహజీవనం సాగించలేరంటూ వ్యాఖ్యానించి, హిందూ వ్యతిరేక ధోరణితో ఈ ఏడాది మొదట్లో వార్తల కెక్కారు. ఘోరమైన పహల్గామ్ దాడికి సరిగ్గా ఒక నెల ముందు ఆయన నోటి నుంచి ఆ ప్రేలాపనలు వెలువడ్డాయి.పాక్లో అడుగుజాడలున్న ఉగ్రవాదులు పహల్గామ్లో పౌరులను పొట్టనబెట్టుకోవడంతో, పాక్పై భారత్ దాడులను నిర్వ హించింది. ఆ స్వల్పకాలిక సమరంలో, తాను 1971 మాదిరి విజ యాన్ని సాధించినట్లుగా పాక్ నిస్సిగ్గుగా ఒక ప్రాపగాండా ప్రారంభించింది. దాన్ని ఊతంగా చేసుకునే మునీర్ దేశంలో తన స్థితిని పటిష్ఠపరచుకుని, ఫీల్డ్ మార్షల్గా ప్రమోషన్ గడించారు. పాక్ను ట్రంప్కు చేరువ చేసే పనిని యుక్తితో నిర్వహించారు. సౌదీ అరేబి యాతో రక్షణ ఒప్పందాన్ని ఆధికారికం చేసుకోవడంతో సహా పశ్చి మాసియాకు స్నేహహస్తాన్ని చాచే వ్యూహాత్మక ప్రణాళికను రచించడంలో కృతకృత్యులయ్యారు. ప్రతిపాదిత రాజ్యాంగ సవరణతో, మునీర్ పదవీ కాలాన్ని ఐదేళ్ళకు పొడిగించినట్లవుతుంది. త్రివిధ దళాలు ఆయన కనుసన్న ల్లోనే మెలుగుతాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పరమ అధ్వాన్నంగా తయారైన పరిస్థితుల్లో, తెలివిగా పావులు కదుపుతూ, కేవలం ఎనిమిది నెలల్లో ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. కార్యనిర్వాహక అధికారాన్ని హస్తగతం చేసుకోకపోయినా నేడు పాక్లో ఆయనకు ఎదురు చెప్పగలవారు లేరు. ప్రస్తుత సవరణ, వైమానిక, నౌకా దళాలను కూడా ఆర్మీ చీఫ్ పరిధిలోకి తీసుకొస్తుంది. ఇది ఆ రెండు దళాలకు రుచించకపోవచ్చు. సైనిక ప్రధానాధికారే ఎల్లప్పుడూ సి.ఎన్.ఎస్.సి.గా ఉంటాడని నిర్దేశించడాన్ని అవి వ్యతిరేకించవచ్చు. క్షిపణులు సాధారణంగా నౌకాదళం వద్ద ఉంటాయి. ఇపుడీ సవరణతో మొత్తం పాక్ అణ్వాయుధాలన్నీ పూర్తిగా సైన్యం నియంత్రణలోకి వస్తాయి. సైన్యానికి ప్రస్తుతం ఉన్న పైచేయిని ధ్రువపరచే ప్రయత్నం మాత్రమే మునీర్ చేస్తూ ఉండవచ్చు. కానీ, ఇది కార్యనిర్వాహక వ్యవస్థ ఆదేశంగా కాకుండా, రాజ్యాంగ సవరణ రూపం పొందుతోంది. కనుక, భవిష్యత్ నాయకులకు, దీన్ని తిరగదిప్పడం అసాధ్యంగా పరిణమించవచ్చు. భారత్ ద్వేషమే ఆయుధంభారత్ పట్ల మునీర్ విద్వేష వైఖరి సుస్పష్టం. ఇపుడు మరిన్ని అధికారాలున్న మునీర్ కింద పనిచేసే సైన్యం, భారత్కు గణనీ యమైన సవాల్గా పరిణమిస్తుందనడంలో సందేహం లేదు. చిర కాలంగా, పాక్ సైన్యం దృష్టంతా భారతదేశంపైనే ఉంటూ వస్తోంది. అది ఇపుడు మరింత కేంద్రీకృతమవుతుంది. సాధారణ ప్రజానీకం, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, పాకిస్తానీ పౌర సమాజం ఈ మార్పులను ప్రతిఘటించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి తలెత్తడం సైన్యానికే వాటంగా ఉంటుంది. ప్రజల దృష్టిని మళ్ళించే అత్యంత ప్రభావయుక్తమైన వ్యూహంగా, అది భారతదేశంపై యుద్ధానికి, లేదా ఘర్షణకు దిగవచ్చు. భారత్కు వ్యతిరేకంగా సైన్యం చెప్పే కాకమ్మ కథలను నమ్మడానికే సహజంగా జనం మొగ్గు చూపు తారు. అది వారిని ఏకం చేసే ఆయుధంగానూ పనికొస్తుంది. కనుక, మునీర్ ఎత్తుగడలను భారత్ తప్పనిసరిగా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. హ్యాపీమ్యాన్ జాకబ్ వ్యాసకర్త ‘కౌన్సిల్ ఫర్ స్ట్రాటెజిక్ అండ్ డిఫెన్స్ రిసెర్చ్’ ఫౌండర్–డైరెక్టర్ (‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
సువర్ణ గళ దేవత
నేనెప్పుడూ ప్రసిద్ధి చెందాలని కోరుకోలేదు. పాటలు పాడి శ్రోతల్ని సంతోషపెట్టాలని మాత్రమే అనుకున్నాను. అభిరు చికి కట్టుబడి, నిజాయతీగా కష్టపడి పని చేస్తే మన ప్రతిభకు ఆశీర్వచనాలు లభిస్తాయి. నిరంతర సాధన, అభ్యాసం అనేవి కళాకారునికి శ్వాస వంటివి. – పి.సుశీల (90), నేపథ్య గాయని దక్షిణ భారత ప్లేబ్యాక్ రంగంలో అగ్రగామి గాయకురాలు పి. సుశీల. 12 భాషల్లో వేలాది పాటలు పాడిన ఆమెను ‘గాన సరస్వతి’ అనడం అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్లోని విజయ నగరంలో 1935 నవంబర్ 13న ప్రసిద్ధ క్రిమినల్ న్యాయవాది,సంగీత ప్రియుడు పులపాక ముకుంద రావు – శేషావతారం దంప తుల ఐదవ సంతానంగా ఆమె జన్మించారు.సుశీల కర్ణాటక సంగీతంలో అత్యుత్తమ వయొలిన్ విద్వాంసులైన ‘సంగీత కళానిధి’ ద్వారం వెంకటస్వామి నాయుడు, ఆయన కుమారుడు ద్వారం భావనరాయణల వద్ద ఆరు సంవత్సరాలు కఠిన శిక్షణ పొంది, గాత్ర సంగీతంలో డిప్లొమా సాధించారు. మొదట్లో వివాహ వేడుకలలో శాస్త్రీయ సంగీతం ఆలపించేవారు. సినిమా పాటలు పాడటానికి చెన్నై చేరే ముందు కొన్ని ఆలయ కచేరీలు ఇచ్చేవారని కొద్దిమందికి మాత్రమే తెలుసు. సుశీల స్వరం మూడో స్థాయిని కూడా స్పష్టంగా దాటుతుందని అందరికీ తెలుసు. ప్రముఖ వీణా విద్వాన్ ‘వీణ గాయత్రి’... సుశీల స్వరాన్ని ఒక గాత్ర వీణగా వ్యాఖ్యానించారు. ఆమె గొంతులో సూక్ష్మ గమకాలు సైతం అత్యంత స్పష్టతతో వినవచ్చు. ఈ గుణం సుశీలను శాస్త్రీయ గాయకులు కూడా భయపడే, గౌరవించే గాయనిగా చేసింది. ఆమె 1970లో ‘ఉయర్న్ద మనిదన్’ (1969) చిత్రానికి ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచు కున్నారు. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళ చిత్రాలకు మరో నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ఆ కాలంలోని ప్రముఖ గాయకులైన ఘంటసాల వేంకటేశ్వర రావుతో తెలుగులో, టి.ఎం. సౌందరరాజన్, పి.బి. శ్రీనివాస్లతో తమిళం, కన్నడ భాషలలో; తరువాత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో తమిళం, తెలుగు, కన్నడ భాషలలో; కె.జె. ఏసుదాస్తో మలయాళంలో ఆమె యుగళగీతాలు పాడి దక్షిణాదిలో అగ్రగామి గాయనిగా నిలిచారు. 1991లో తమిళనాడు అత్యున్నత కళా పుర స్కారం ‘కలైమామణి’, 2004లో తెలుగు సినిమా రంగంలో ఆమె జీవితకాల కృషికి ‘రఘుపతి వెంకయ్య అవార్డు’, 2008లో 73 ఏళ్ళ వయసులో ‘పద్మభూషణ్’ పురస్కారం వంటివి వరించాయి. ఆమె సమకాలీనులైన ఎస్.జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి, బి. వసంత; ఆమె జూనియర్లు కె.ఎస్. చిత్ర, ఎస్.పి. శైలజ వంటివారందరూ ఆమె స్వర నాణ్యత, స్వాభావిక శ్రావ్యతను ఎంతో గౌరవించారు. ఆమె 1962 నుండి 1990ల చివరి వరకు 17,695 పాటలను రికార్డ్ చేయడం... పాట పట్ల ఆమె నిబద్ధతకు నిదర్శనం. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం 12 భారతీయ భాషలలో సోలోలు, డ్యూయెట్లు, కోరస్, నేపథ్య పాటలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆమె అభిమానులు చాలా మంది ఆమెకు ’భారతరత్న’ పురస్కారం ఆమె 90వ పుట్టిన రోజు కానుకగా వస్తే బాగుండు అనుకుంటున్నారు. అందుకు ఆమె ముమ్మాటికీ అర్హురాలు.– డా.ఎం.ఎస్. నీలోత్పల్ అసిస్టెంట్ ప్రొఫెసర్, వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తమిళనాడు(నేడు గాన సరస్వతి పి. సుశీల 90వ జన్మదినం) -
10.1 కోట్ల మంది : ఒడుదొడుకులే అసలు కారణం
మధుమేహ బాధితుల పరంగా భారత దేశం ప్రపంచానికే రాజధాని అయితే, దక్షిణాది రాష్ట్రాలు భారతదేశానికి రాజధానులుగా మారాయని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో మధు మేహ బాధితుల సంఖ్య ఇప్పుడు 10.1 కోట్లకు చేరింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో మధుమేహం (Diabetes) క్రమంగా వేగాన్ని పుంజుకుంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మధుమేహం నియంత్రణ, నిరోధం పట్ల అవగాహన కల్పించడానికి ఇన్సులిన్ను కనుగొన్న సర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ పుట్టిన రోజైన నవంబర్ 14వ తేదీని ‘ప్రపంచ మధుమేహ నిరోధక దినం’గా ప్రతి ఏడాదీ జరుపుకోవడం ముదావహం.నేడు మనిషి జీవన విధానం, ఆహారంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు... మధుమేహం వంటి జీవితకాల దీర్ఘ వ్యాధులకు ఆజ్యం పోస్తున్నాయి. అతి చిన్న వయసు నుండే ఏమాత్రం శారీరక శ్రమ లేక పోవడం, ఆహారంలో చోటు చేసు కున్న మార్పులు, కల్తీలు, పంట పొలాల్లో వేసే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం, పర్యావరణ మార్పులు, కొత్త కొత్త వైరల్ వ్యాధులు, వృత్తిపర మానసిక ఒత్తిడి, జన్యువులలో ఉత్పరివర్తనలు... ఇలా ఎన్నో కారణాలు రక్తంలో షుగర్ను నియంత్రించే ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంథి)ని అసాధారణ రీతిలో ప్రభావితం చేస్తున్నాయి. శరీర అవసరాలకు సరిపడా ఇన్సులిన్ (Insulin) ఉత్పత్తి కాకపోవటం, ఇన్సులిన్ పనితీరులోని లోపాలు (రెసిస్టెన్స్), శరీర కణాలు ఇన్సులిన్ను వినియోగించుకోలేకపోవడం... వెరసి రక్తంలో అసాధారణ స్థాయిలో చక్కెర శాతాన్ని పెంచేస్తున్నాయి. చదవండి: ఆంక్షలతోనా వేతన సంఘాన్ని నియమించేది?మనం నిత్య జీవితంలో వాడే ప్లాస్టిక్ల అవశేషాల ప్రభావం వల్ల ప్యాంక్రి యాస్ సహజసిద్ధంగా ఉత్పత్తి చేసే ఇన్సులిన్ను శరీర అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేయలేకపోతోంది. ఇన్సులిన్ ఉత్పత్తి అయినా... శరీర కణజాలాలలో నిరోధకత వచ్చి అది ఉపయోగపడక పోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి (Sugar Level) అసాధారణ రీతిలో పెరిగిపోతోంది. మందుల వాడకం, ఆహార నియమాలు పాటించటం, క్రమం తప్పక వ్యాయామం చేయడం ద్వారా జీవితాంతం అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ టి. సేవకుమార్ వ్యవస్థాపకులు, ఎస్.హెచ్.ఓ. హైపర్ టెన్షన్–డయాబెటిక్ క్లబ్, గుంటూరు(నవంబర్ 14 ప్రపంచ మధుమేహ నిరోధక దినం) -
పత్తి రైతుకు మరో పాడుకాలం
పత్తి రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను చూడగా, 1990ల కాలం అని వార్యంగా గుర్తుకు వస్తున్నది. అప్పుడు దేశంలోని పలు రాష్ట్రాలలో పత్తి రైతులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ రాష్ట్రాలలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని విదర్భ అయితే లెక్కలేనన్ని ఆత్మహత్యలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి 30 సంవత్సరాలు గడిచిన తర్వాత అటువంటి విపత్కర పరిస్థితి ఇంకా ఏర్పడనైతే లేదు; కానీ, నెమ్మదిగా రూపు తీసుకుంటున్న పరిణామాలను చూడగా, ఆ దుఃస్థితి పునరావృతం కాగలదేమోననే అనుమానం కలుగుతున్నది.1990లలో జరిగిందేమిటి?పత్తికి, నూలు వస్త్రాలకు భారతదేశం క్రీస్తు పూర్వం నుంచే పేరెన్నిక గన్నది కాగా, బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగిందే మిటో తెలిసిందే. అక్కడి మిల్లుల కోసం ఇక్కడి రైతును కొల్లగొట్టి, స్థానిక చేనేత పరిశ్రమను ధ్వంసం చేసి, నేత కార్మికుడిని ఆకలి చావుల పాలు చేశారు. స్వాతంత్య్రానంతరం 1990లు వచ్చేసరికి అధికాదాయం పేరిట పత్తి పంటను విపరీతంగా ప్రోత్సహించి, అమ్మకాలను మాత్రం అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేసి, ధరలతో ఆటలాడారు. రైతు మరో పంటకు మారలేక, అక్కడే నిలవలేక, అప్పుల బాధకు తాళలేక, చావును ఎంచుకున్నాడు. ఆ సరికే భారత దేశపు డబ్ల్యూటీవో సభ్యత్వం, పశ్చిమ దేశాలకు కలసి వచ్చిన స్వేచ్ఛా వాణిజ్యం రైతు ఆత్మహత్యకు ఉరితాళ్లను పేనాయి.డబ్ల్యూటీవో సమయంలో వ్యవసాయం, పాడి, మత్స్య ఉత్పత్తుల విషయమై ఇండియా, చైనా, బ్రెజిల్ తదితర దేశాలు ఒక్కటై గట్టిగా నిలబడి కొన్ని రాయితీలు సాధించాయి. ఆయా రంగాలపై కోట్లాదిమంది ఆధారపడి జీవిస్తున్నందున వాటిని కాపాడుకునేందుకు పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతులపై తగినన్ని సుంకాలు విధించే హక్కు సంపాదించటం వాటిలో ఒకటి. ముఖ్యంగా అమెరికా తమ రైతులకు పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తుండగా, ఇతర దేశాలు ఆ పని చేయరాదని ఆంక్షలు విధించటాన్ని అంగీకరించబోమన్నది మరొకటి. ఇంత జరిగినా పాశ్చాత్య దేశాలు పత్తి కొనుగోళ్లు, తమ పత్తి ఎగుమతులు, అందుకు కోటాలు, వస్త్రాల ఎగుమతిలో కోటాలు వగైరా ఎత్తుగడలతో సృష్టించిన సమస్యలు తక్కువ కాదు. అధిక దిగుబడి వంగడాలపై వారిదే ఆధిపత్యం అయ్యింది. దీనంతటి ప్రభావాలు బట్టల మిల్లులు, పత్తి వ్యాపారులపై కన్నా పత్తి రైతుపైనే పడింది. ఇపుడు, స్వేచ్ఛా వాణిజ్యం తమకు లాభసాటిగా లేనట్లు భావిస్తున్న ప్రస్తుత అమెరికా ప్రభుత్వం, డబ్ల్యూటీవో నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించజూస్తుండటంతో, పత్తి రైతుకు 1990ల కాలం వలె కారు మేఘాలు తిరిగి కమ్ముకొస్తున్నాయి.అమెరికా ఒత్తిడితమ కొత్త వ్యూహంలో భాగంగా స్వేచ్ఛా వాణిజ్యాన్ని గాలికి వదలిన అమెరికా, వేర్వేరు దేశాలతో విడివిడిగా వాణిజ్య ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నది. అందుకోసం చర్చల పేరిట ఒత్తిడి, బ్లాక్మెయిలింగ్ పద్ధతిని అనుసరిస్తున్నది. ఇతరులను దారికి తెచ్చు కునేందుకు మొదటనే సుంకాలను భారీ ఎత్తున పెంచివేసి, అవతలి దేశాలు వాటి సుంకాలను తాము చెప్పినట్లు మార్చాలని, ఎత్తి వేయాలని షరతులు పెడుతున్నది. తమ పత్తి, మొక్కజొన్న, సోయా వంటి ఉత్పత్తులకు పూర్తిగా గేట్లు తెరవాలంటున్నది. లేనట్లయితే, సుంకాలూ, వాణిజ్యాలతో సంబంధం ఉన్న రంగాలలోనే గాక,లేని విషయాలలోనూ ఏకపక్షపు చర్యలు తీసుకోగలమని హెచ్చరిస్తున్నది.ఈ పరిస్థితుల మధ్య జరిగిందే అమెరికన్ పత్తి దిగుమతులపై ఉండిన 11 శాతం సుంకాన్ని భారత ప్రభుత్వం అకస్మాత్తుగా ఎత్తివేయటం. ఆ ఎత్తివేత మొదట గత ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే జరుగగా, తిరిగి డిసెంబర్ వరకు పొడిగించారు. ఇది తాత్కాలిక చర్య అని పైకి చెప్తున్నారు గానీ, నమ్మదగినట్టు లేదు. ఎందుకంటే, ఇదే సమయంలో అమెరికాతో కొత్త వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఆ ఒప్పందం ఈ సంవత్సరం ఆఖరు నాటికి జరగవచ్చునని భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్తో పాటు అమెరికన్ అధికారులు కూడా చెప్తున్నారు. అందు వల్ల, ఇప్పుడు తాత్కాలికం అంటున్నది దీర్ఘకాలికం కాగల ప్రమాదం పొంచి ఉంది. లేదా కనీసం 11 శాతం సుంకం గణనీయంగా తగ్గవచ్చు. ఏది జరిగినా ఇక్కడి పత్తి రైతుకు తీవ్ర ప్రమాదమే!సుంకం ఎత్తివేత ప్రత్యేకంగా అమెరికాకు మాత్రమే చేయలేరు గనుక మౌలికంగానే రద్దు కావటంతో అమెరికా సహా వేర్వేరు దేశాల నుంచి పత్తి నిల్వలు వచ్చిపడటం మొదలైంది. భారత ప్రభుత్వం తన నష్టాలు తాను చేయటం మొదలు పెట్టింది. గతంలో రైతులు ఎంత పత్తి తెచ్చినా కొనుగోలు చేస్తుండిన కాటన్ కార్పొరేషన్, ఎకరానికి 12 క్వింటాళ్లు మాత్రమేనని ఈసారి సీజన్కు ముందు షరతు విధించింది. పంట మార్కెట్కు రావటం మొదలైన తర్వాత తన ప్రకటనను తానే ఉల్లంఘిస్తూ 7 క్వింటాళ్లు మాత్రమే అంటు న్నది. తక్కిన పంటను వ్యాపారులు మద్దతు ధర కన్న తక్కువకు కొంటున్నా అధికారులు మాట్లాడటం లేదు. ఇదిగాక, ‘కపాస్ కిసాన్’ అనే కొత్త నిబంధన ఒకటి తీసుకువచ్చి, అందుకు అవస రమైన స్మార్ట్ ఫోన్లు లేని, ఆ సాంకేతికత తెలియని సామాన్య రైతులను యాతనలకు గురి చేయటం మొదలు పెట్టింది. ఇక, పత్తిలో తేమ నిబంధనలు ఎప్పుడూ ఉన్నవే.ఒప్పందం ఇంకెలా ఉండగలదో!అధికారికంగా సుంకాల ఎత్తివేత నుంచి మొదలుకొని, క్షేత్ర స్థాయిలో ఈ విధమైన ఎత్తుగడలు గానీ, కొత్త కాదు. అదే కథ తిరిగి నడుస్తున్నది. అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగిపోతున్న తీరును చూసినప్పుడు, పత్తి రైతుకు 1990ల నాటి పరిస్థితి పునరావృతం కాగలదేమోననే భయం కలుగుతుండటం అందువల్లనే! మనం మరొకటి గమనిస్తున్నట్లు లేము. పత్తితో పాటు మొక్కజొన్నను, సోయాను కూడా అమెరికా బలవంతంగా ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నది. అందుకు సహకరిస్తున్నారా అనే అనుమానం కలిగేట్లు, మొక్కజొన్న పంటను రైతుల నుంచి కొనుగోలు చేయటంలోనూ పత్తి పంట తరహా షరతులు విధిస్తున్నారు. ఎకరానికి 18 క్వింటాళ్లు మాత్రమే కొనగలమన్నది ఆ నిబంధన. దీనిని బట్టి, అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఎట్లుండవచ్చునో ఎవరి ఊహ వారు చేయవచ్చు.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఆంక్షలతోనా వేతన సంఘాన్ని నియమించేది?
ప్రతిభావంతులను ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఆకర్షించి,సామర్థ్యం, జవాబుదారీతనం, పని సంస్కృతిలో బాధ్యతను ప్రోత్స హించే విధంగా 8వ వేతన సవరణ సంఘం వేతనాలను సిఫార్సు చేయాలని... వేతన సంఘం నియామకంపై కేంద్ర ఆర్థిక శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న భత్యాలు, అమలు చేస్తున్న షరతులను పరిశీలించి వాటి హేతుబద్ధీకరణకు సిఫార్సు చేయాలని గెజిట్ నిర్దేశించింది. ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు వీలుగా ప్రస్తుతం అమల్లో ఉన్న బోనస్ పథకాలను పరిశీలించి, మంచి పనితీరు కనబరిచిన వారిని ప్రోత్సహించేలా ఆర్థిక కొలమానాలు సిఫార్సు చేయాలని కోరింది.గెజిట్ నోటిఫికేషన్ ఇలా ఉంటే దేశ ఆర్థిక స్థితి ఆకాశానికి ఎగిసిందని పాలకులు ప్రచారం చేస్తూ, ఆర్థిక అధోగతిని సూచించే ఆర్థిక జాగ్రత్తలను పాటించమని వేతన సవరణ యంత్రాంగానికి పరస్పర విరుద్ధమైన షరతులు విధిస్తున్నారు. నిజానికి ఆర్థిక పరిస్థితిని పరిశీలించాల్సిన బాధ్యత వేతన సవరణ యంత్రాంగానిది కాదు. వేతన సవరణ యంత్రాంగం ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక స్థితిలో జీవన వ్యయం వంటి అంశాలను పరిశీలించి సిఫార్సులు చేయాలి. వారి మెరుగైన సిఫార్సులతోనే ప్రతిభావంతులైన యువకులు ప్రభుత్వ ఉద్యోగాల వైపునకు ఆకర్షింపబడుతారు. అప్పుడే ప్రభుత్వ యంత్రాంగంలో సామర్థ్యం, జవాబుదారీతనం పెరుగుతాయి. ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు ప్రజలకు చేరుతాయి. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో లక్షలాదిమంది ఉద్యోగులు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల అధీనంలో పనిచేస్తున్నారు. వీరందరికీ రెగ్యులర్ ఉద్యోగుల వలె వేతన భత్యాలు అమలు కావడం లేదు. ‘సమాన పనికి సమాన వేతనం’ ఇక్కడ వర్తించడం లేదు. వేతన సవరణ సిఫార్సులు ఇటువంటి తాత్కాలిక ఉద్యోగులకు వర్తించవు. అటువంటప్పుడు సామర్థ్యం, జవాబుదారీతనం ఎలా సాధ్యమవుతాయి? (100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద)పైగా ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగుల వేతనాల తీరు, ప్రయోజనాలు, పని పరిస్థితులు కూడా పరిశీలించి, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సిఫార్సు చేయాలని మరో నిబంధన ఉంది. అయితే ప్రైవేట్ రంగంలో ఉద్యోగుల శ్రమదోపిడీ ఎక్కువగాఉంటుంది. వేతనాలు తక్కువ. పని పరిస్థితులు అధ్వాన్నం. ‘ఉద్యోగుల ప్రయోజనాల కంటే యాజమాన్యాల ప్రయోజనాలకే’ అక్కడ ప్రాముఖ్యం ఉంటుంది. వాటితో కేంద్ర ప్రభుత్వ ఉద్యో గులను పోల్చడం... ప్రభుత్వ రంగ ఉద్యోగుల వేతనాలను, పెన్షన్లను తగ్గించడానికే! ఉద్యోగుల వాటా నిధులు లేని పెన్షన్ పథ కాల ఖర్చు తగ్గింపు మరో షరతు. పాత పెన్షన్ పథకంలో కొనసాగు తున్న కొద్దిమంది ఉద్యోగుల పెన్షన్ను, పాత పెన్షన్ పథకాన్ని ఆపడానికి ఈ షరతులను ప్రభుత్వం నిర్దేశించింది. పదేళ్లకోసారి జరిగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవ రణ ఇప్పుడు 2026 జనవరి 1 నుండి అమలు కావాల్సి ఉంది. ఇప్పటికే 2025 ఆర్థిక బిల్లు ద్వారా ఉద్యోగుల పెన్షన్లను పెంపులేకుండా చూసే నిబంధనలను ఆమోదించుకున్న కేంద్ర ప్రభుత్వం, భవిష్యత్తులో వేతన సవరణ ద్వారా పెన్షన్ల పెరుగుదల లేకుండారంగం సిద్ధం చేసింది. ఆ మేరకే ఈ నిబంధనలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాబోయే వేతన సవరణ ద్వారా ఉద్యోగుల వేతనాల బిల్లు పెరగకుండా చూడటానికి వేతన సవరణ కమిషన్ నిబంధనల ద్వారా ముందు కాళ్లకు బంధం వేయడం గమనార్హం. (సహజీవనం నేర్చుకోవాలి..మానవత్వంతో వ్యవహరించాలి!)– కె. వేణుగోపాల్విద్యారంగ విశ్లేషకులు, టీపీటీఎఫ్ -
సహజీవనం నేర్చుకోవాలి..మానవత్వంతో వ్యవహరించాలి!
భారత సంస్కృతిలో జంతువులకు ఉన్న స్థానం ఉన్నతమైనది– నంది, గోవు, కాలభైరవుని వాహనమైన కుక్కలను పూజిస్తాం. అహింసా సిద్ధాంతాన్ని నమ్మిన దేశం అంటాం. కానీ కుక్క వీధిలో కనిపిస్తే రాళ్లు విసురుతున్నాం! దేశ అత్యున్నత న్యాయస్థానం వీధి జంతువులను ‘తొలగించండి‘ అని ఆదేశిస్తోంది. ఇది కేవలం చట్ట విరుద్ధం మాత్రమే కాదు, మన నాగరికతకూ విరుద్ధమే. వీధికుక్కల విషయంలో సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో మన సమాజం ఏ దిశగా సాగుతుందో ఆలోచించే సమయం వచ్చింది.తాజా సుప్రీం కోర్టు ఆదేశాలు – కొన్ని ప్రదేశాల నుంచి వీధికుక్కలు, పశువులను తొలగించాలని చెప్పడం, ఇప్పటికే ఉన్న చట్టాలను పూర్తిగా విస్మరించటం. ‘యానిమల్ బర్త్ కంట్రోల్ (డాగ్స్) రూల్స్ – 2023’ ప్రకారం, వీధి కుక్కలను పట్టి, స్టెరిలైజ్ చేయించి, వ్యాక్సినేట్ చేసి తిరిగి అదే ప్రదేశంలో వదలడం తప్పనిసరి. ఇది కేవలం జంతు సంక్షేమం కోసం కాదు, మానవ సమాజం భద్రత కోసం కూడా! ‘తొలగించటం’ కాదు, ‘వ్యవస్థీకరించటం’ అని చట్టం స్పష్టంగా చెబుతోంది. కానీ, కోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులు ఈ చట్టానికేవిరుద్ధంగా ఉన్నాయి. ఇదీ చదవండి: 100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద సాధారణంగా, చట్టం చేయటానికి పార్లమెంట్, అమలు చేయటానికి కార్యనిర్వాహక శాఖ, పర్యవేక్షించటానికి న్యాయవ్యవస్థ ఉన్నాయి. అయితే న్యాయస్థానం కొన్ని సందర్భాల్లో నేరుగా పాలనా నిర్ణయాల్లాంటి ఉత్తర్వులు ఇస్తోంది. ఇది ‘జ్యుడీషియల్ ఓవర్ రీచ్’ అని పిలవబడుతుంది. ఎన్నికల ద్వారా ఎన్నికవ్వని కొద్ది మంది న్యాయమూర్తులు ప్రజా జీవితంపై ఇంత ప్రభావం చూపడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.భారత రాజ్యాంగం ప్రతి జీవికీ ‘జీవన హక్కు’ (ఆర్టికల్ 21) ఇచ్చింది. సుప్రీం కోర్టే ఎన్నో తీర్పుల్లో ఈ హక్కు మానవులకే కాకుండా జంతువులకు కూడా వర్తిస్తుందని స్పష్టంగా చెప్పింది. అలాంటప్పుడు, వాటిని ‘తొలగించండి’ అనే ఆదేశం ఆ హక్కుకే విరుద్ధం. జంతువుల పట్ల దయ చూపడం కేవలం ‘ప్రేమ’ కాదు. అది నాగరికత ప్రథమ లక్షణం. సర్కారు, న్యాయస్థానం, ప్రజలు అందరూ కలిసే ఈ విలువను కాపాడాలి. జంతువులను దూరం చేయడం కాదు, వాటితో సహజీవనం నేర్చుకోవడం మన బాధ్యత. మన దేశం తన హృదయాన్ని కోల్పోయినట్లయితే తిరిగి దాని మూలాల్ని వెతకటానికి ఇదే సరైన సమయం.ఇదీ చదవండి: 20 ఏళ్ల స్టార్డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం– తలకోల రాహుల్రెడ్డి ‘ మౌలిక సదుపాయాల విశ్లేషకుడు -
సంస్కరణల పథాన్ని స్వాగతిద్దాం!
ఏ దేశ అభివృద్ధి అయినా అక్కడి మానవ వనరుల వికాసం మీదే ఆధారపడిఉంటుంది. ఈ మానవ వనరుల అభివృద్ధికి ప్రధానమైనది ‘విద్య’. బ్రిటిష్ కాలంలో కేవలం వారికి అనుకూలమైన గుమస్తాలను తయారుచేసే విద్యా విధానాన్నే అనుసరించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదటి విద్య శాఖ మంత్రిగా కొన్ని సంస్క రణలకు శ్రీకారం చుట్టారు. ఆయన జయంతినే ‘జాతీయ విద్యా దినోత్సవం (National Education Day 2025 ) గా జరుపుకొంటున్నాం.కేంద్ర పాలకులు 1968లో మొదటి జాతీయ విద్యా విధానాన్ని, 1986లో రెండవ జాతీయ విద్యా విధానాన్ని, 1992లో పరిమిత స్థాయిలో మూడవ జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి అమలు చేశారు. కానీ ప్రపంచ దేశాలతో ప్రత్యేకించి అభివృద్ధి చెందిన దేశా లతో సమానంగా పోటీపడి నైపుణ్యాలతో ముందుకు వెళ్లలేక పోయాము. మానవ వనరుల శాఖను కూలంకషంగా చర్చించి 34 ఏళ్ల తరువాత విద్యా రంగంలో కీలకమైన మార్పులు చేయాలనే తలంపుతో డా‘‘ కస్తూరి రంగరాజన్ అధ్యక్షతన ‘జాతీయ నూతన విద్యా కమిషన్’ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ సూచనల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం ‘నూతన జాతీయ విద్యా విధానం 2020’ (ఎన్ఈపీ–2020) ప్రకటించింది. ఇది దేశంలో విద్యారంగా నికి సంబంధించి సమగ్రమైన సంస్కరణ. సాంకేతిక విజ్ఞానం, నైతిక విలువ లతో కూడిన విద్య, ఉపాధి కల్పన, పారదర్శకత దీని లక్ష్యం. 2035వ సంవత్సరం నాటికి ఉన్నత విద్యాసంస్థల్లో దాదాపు 3 కోట్ల సీట్లు అదనంగా రానున్నాయి. యూజీసీ కోర్సులలో బహుళ ప్రవేశాలు, నిష్క్రమణలు చేర్చారు. దేశ జీడీపీలో 6% నిధులు విద్యా రంగానికి కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఇది 4.4% శాతంగా మాత్రమే ఉంది. విదేశీ విద్యా సంస్థలు తమ ప్రాంగణాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే విదేశీ విద్యార్థులు భారత్కు వచ్చి చదువుకునేలా ప్రోత్సహిస్తారు. ఇప్పటివరకు – కంటెంట్ కేవలం ఆంగ్లం, హిందీలోనే అందుబాటులో ఉండగా ప్రస్తుతం అది 8 భారతీయ భాషల్లో (ఇందులో తెలుగు కూడా ఉంది) అందు బాటులోకి రానుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను ఒకే వేదిక మీదకు తీసుకువస్తారు. దీనికై ‘నేషనల్ టెక్నాలజీ ఫోరమ్’ను ఏర్పాటు చేస్తారు.పాఠశాల విద్యను ప్రీ–ప్రైమరీ పాఠ్యంశాలను ఎన్సీఈఆర్టీ అభివృద్ధి చేస్తుంది. 3–6 సంవత్సరాల పిల్లలకు ఆటల కార్యక్రమాల ద్వారా సరళమైన పాఠ్యంశాలను అమలు చేస్తారు. 1–3 తరగతుల విద్యార్థులకు ప్రాథమిక అక్షరాలను, అంకెలను త్వరగా గుర్తుపట్టి చదివేలా తీర్చిదిద్దుతారు. దీనికై ఒక నేషనల్ మిషన్ ఏర్పాటు చేశారు. ‘కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల’ను ఇప్పుడున్న 8 – 10 తరగతుల నుండి 12వ తరగతి వరకు పొడిగిస్తారు. బోర్డు పరీక్షకు ఉన్న ప్రాధాన్యాన్ని తగ్గిస్తారు. ఏటా ఒకసారి కాకుండా 2 సార్లు పరీక్షలు నిర్వహిస్తారు. 12వ తరగతి ముగించుకొని బయ టకు వెళ్లే సమయానికి వాళ్ళు ఏయే నైపుణ్యాలు నేర్చుకున్నారో వాటిని ఒక డేటాబేస్లో నిక్షిప్తం చేస్తారు. ఈ నూతన విద్యా విధానంలో భాగంగా ఏ భాషను కూడా బలవంతంగా రుద్దడం జరగదు. అన్ని స్థాయుల తరగతుల్లో త్రిభాషా సూత్రాన్ని అమలు పరుస్తారు. ప్రస్తుతం ఉన్న 10+2+3 బదులు... 5+3+3+4 ఉండేలా మార్పులు చేస్తారు. 9–12 తర గతుల విద్యార్థులు ఏ మార్కులు వచ్చినా నచ్చిన సబ్జెక్టు తీసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే వాటితో పాటు విద్యార్థులు తమకు నచ్చిన ఫ్యాషన్ డిజైన్, ఆహార తయారీ, తదితర కోర్సులు నేర్చుకోవచ్చు. డిజిటల్ లాకర్ ద్వారా పాత క్రెడిట్స్ అట్టిపెట్టు కొని... చదువు మానేసినా, తనకు వీలైన సమయంలో తిరిగి చదువు కొనసాగించేలా వెసులుబాటు కల్పించారు. చదవండి: 20 ఏళ్ల స్టార్డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యంవృత్తి విద్యను 6వ తరగతి నుండే ప్రారంభిస్తారు. దీనిలో ఇంట ర్న్షిప్ కూడా ఉంటుంది. యూజీసీ, ఏఐసీటీఈ, జాతీయ ఉపా ధ్యాయ మండలి వంటివాటిని విలీనం చేసి మొత్తం విద్యా వ్యవస్థ నియంత్రణకు ఒకే వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఒకే రకమైన నిబంధనలను అమలు చేస్తారు. గుర్తింపు ఆధారంగానే స్వయం ప్రతిపత్తి ఇస్తారు. విద్యా ర్థులు, అధ్యాపకులకు మార్గదర్శనం చేయడానికి ‘నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్’ను ఏర్పాటు చేస్తారు.ఈ సంస్కరణలను సంకుచితమైన రాజకీయ దృక్కోణంలో చూడకుండా అన్ని రాష్ట్రాలూ అమలు చేయడానికి ముందుకు రావాలి. మనమందరం కూడా ఈ సంస్కరణ ను స్వాగతిద్దాం. అదే మనం అబుల్ కలావ్ు ఆజాద్కు ఇచ్చే నిజమైన నివాళి.బండారు దత్తాత్రేయ వ్యాసకర్త మాజీ గవర్నర్(నేడు ‘జాతీయ విద్యా దినోత్సవం) -
అమెరికాతో ఆచి తూచి...
ఇండియా, అమెరికా వాణిజ్య ఒప్పందం ఒక కొలిక్కి వచ్చినట్లేనా? సంతకాలు చేయడమే తరువాయి అంటూ ఆరు నెలలుగా వింటున్నాం. అయినా, ఉభయ పక్షాలూ ఆ చివరి ఘట్టం చేరుకోలేకపోతున్నాయి. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ఇండియా మీద విధించిన 25 శాతం అదనపు సుంకం విషయానికి వద్దాం. ప్రైవేటు రంగ సంస్థలు రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించాయి. మరి ఆ 25 శాతం అదనపు సుంకాలను అమెరికా ఎత్తివేస్తుందా? అలాంటి సంకేతాలేమీ లేవు.చమురు కొనకపోయినా...ఇండియా–యూఎస్ రక్షణ సహకారం మరో పదేళ్లు కొన సాగుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమెరికా యుద్ధ వ్యవహారాల మంత్రి పీట్ హెగ్సేథ్ ‘ఏసియాన్’ రక్షణ మంత్రుల సదస్సు సందర్భంగా అక్టోబర్ 31న కౌలాలంపూర్లో ప్రకటించారు. దీంతో వాణిజ్య వివాదం త్వరలోనే పరిష్కరం కాగలదన్న ఆశలు చిగురించాయి. ఇండియాకు రక్షణ సామగ్రి సరఫరా చేయడం ద్వారా అమెరికా బిలియన్ల డాలర్లను అర్జిస్తోంది. కాబట్టి మనపై ఆంక్షలు తొలగిస్తుందని అనుకోవడానికి వీల్లేదు. అమెరికా అధ్యక్షుడి లెక్కలు వేరేగా ఉంటాయి. ఇండియా జాగ్రత్తగా అడుగులు వేయాలి. రాబోయే రోజుల్లో ఎస్–500 తరహా రష్యా అత్యాధునిక ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు ట్రంప్ అభ్యంతరం చెప్పరని అనుకోలేం. వాటిని సమకూర్చుకునేట్లయితే తాము ఇండియాకు రక్షణ పరికరాలను, విడిభాగాలను విక్రయించబోమంటూ పేచీ పెట్టరన్న గ్యారంటీ లేదు. చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తారని అనుకున్నామా? రష్యా చమురుకు చైనా కూడా భారీ కొనుగోలుదారు. నాటో కూటమి సభ్యులైన టర్కీ, హంగరీ సైతం గణనీయంగా ఆ దేశం నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాయి. అయినా, అమెరికా ఇండియాను మాత్రమే వేరు చేసి ఆంక్షల శిక్ష విధించింది. బూసాన్ (దక్షిణ కొరియా)లో ఎపెక్ సదస్సు సందర్భంగా ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ట్రంప్ చర్చలు జరిపారు. అందులో రష్యా చమురు ప్రస్తావన తేలేదని అన్నారు. ఇండియా మీద ఆంక్షల కత్తి ఝుళిపించిన ట్రంప్ చైనా విషయంలో అలా చేయలేక పోయారు. ప్రతీకార చర్యలు తీసుకుంటామని చైనా ముందే హెచ్చరించడం అందుకు కారణం కావచ్చు.‘క్వాడ్’ లేనట్లేనా?అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం చైనా ముప్పు నుంచి కాపాడుతుందన్న నమ్మకాన్ని పునఃసమీక్షించుకోవాలి. నంబర్ 1, నంబర్ 2 దేశాల నడుమ నెలకొన్న వ్యవస్థాగత పోరు సమసి పోనప్పటికీ, ఇరు దేశాలూ వ్యూహాత్మక సర్దుబాట్లు చేసుకుంటున్నందువల్ల ఇండియా ఎత్తుగడలు ఫలించే అవకాశం తగ్గిపోతుంది. యుక్తమైన దౌత్యవిధానం అనుసరించడం ద్వారానే ఈ ముప్పును ఎదుర్కోవలసి ఉంటుంది.అమెరికా ఇండో–పసిఫిక్ వ్యూహం యథాతథంగా కొనసాగు తుందనడానికి ఇటీవలి ట్రంప్ ఆసియా పర్యటనే నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. అయితే, ఈ వ్యూహంలో ఇండియా ప్రయోజనాలకు సంబంధించిన ‘క్వాడ్’ అంశం మరుగున పడింది. ఈ ఏడాది అఖరున క్వాడ్ దేశాధినేతల సమావేశం జరగాల్సి ఉంది. ఇది అనుమానమే. ట్రంప్ ఎక్కడా క్వాడ్ ఊసెత్తలేదు. భాగస్వామ్య దేశాలైన ఆస్ట్రేలియా, జపాన్ సైతం ప్రస్తావించక పోవడం గమ నార్హం. అవి ట్రంప్ మనసెరిగి మసలుకున్నట్లుంది.ఒకవేళ ఆస్ట్రేలియా, జపాన్లతో ఇండియా తన సహకారాన్ని ముమ్మరం చేసుకుని ఒక త్రైపాక్షిక కూటమి (ట్రయడ్) ఏర్పాటు కోసం ప్రయత్నిస్తోంది అనుకుంటే, దాని ప్రయోజనాలు ఎలా ఉంటాయన్నది మరో ప్రశ్న. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇండియాకు ఉన్న ఇతర అవకా శాలను చూద్దాం. యూరప్తో సన్నిహిత సమగ్ర భాగస్వామ్య ఒప్పందం వీటిలో ఒకటి. యూరప్ రక్షణ పరిశ్రమ భారీ విస్తరణ కోసం నమ్మకమైన విపణి, అగ్రశ్రేణి మానవ వనరులు అవసరం.ఇండియా వీటిని సమకూర్చగలదు. యూరప్, ఇండియాల మధ్య దృఢ మైన రక్షణ భాగస్వామ్యం ఉన్నట్లయితే, నిలకడ లేని అమెరికా విధానా లకు విరుగుడుగా అది ఉభయ పక్షాలకూ ఉపయోగపడుతుంది. ఇండియా బలాలుఅరిగిపోయిన రికార్డులా నేను మళ్లీ చెబుతున్నా. ఉపఖండ సరిహద్దుల భద్రత మన తక్షణ ఆవశ్యకత. పొరుగు దేశాలతో ద్వైపా క్షిక సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారానే ఇది సాధ్యపడు తుంది. మనం దక్షిణాసియా వృద్ధికి ఒక కేంద్రకంగా, భద్రత కల్పించే శక్తిగా మారడం ముఖ్యం. అనూహ్యంగా అనిపించినా కాలక్రమంలో పాకిస్తాన్ కూడా ఈ పరిధిలోకి వచ్చి తీరాలి. మన ప్రాంతానికి వాతావరణ మార్పు అతిపెద్ద సవాలు కాబోతోంది. ఈ సంక్షోభాన్ని అధిగమించడం ప్రాంతీయ దేశాల నడుమ సహకారంతోనే సాధ్యమవుతుంది. ఈ విపత్తుపై ఉమ్మడి పోరాటానికి సారథ్యం వహించే శక్తి ఇండియాకు మాత్రమే ఉంది. తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లోనూ ఇండియా ప్రముఖ పాత్ర వహించాలి. ఇందుకు వీలుగా ఆర్సీఈపీ, సీపీటీపీపీ స్వేచ్ఛా వాణిజ్య కూటముల్లో సభ్యత్వం కోసం ప్రయత్నించాలి. శాస్త్ర సాంకేతిక మానవ వనరులతో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, సంక్షుభిత సమకాలీన ప్రపంచంలో చెక్కు చెదరని రాజకీయ సుస్థిరత... ఈ రెండూ ఇండియా సొంతం. వివేకంతో వినియోగించుకోగలిగితే దేశాన్ని ఇవి వ్యూహాత్మకంగానూ ముందంజ వేయిస్తాయి. చైనాతో సంబంధాలను మెరుగుపరచడంలో వీటి పాత్ర ఉంది. ఏమైనప్పటికీ, విదేశీ విధానంలో, రక్షణ వ్యవహారాల్లో బయటి శక్తుల ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా నిర్ణ యాలు తీసుకోగల ‘వ్యూహాత్మక స్వతంత్రత’ సాధించడానికి... సామర్థ్యం కంటే సంకల్పం ముఖ్యం.శ్యామ్ శరణ్వ్యాసకర్త కేంద్ర విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఆపద పైబడుతున్నా... అదే వైఖరి
బ్రెజిల్లోని బెలేమ్ నగరంలో ఈ రోజు (నవంబర్ 10) నుంచి ‘సీఓపీ30’ శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. దీనిలో 100కు పైగా దేశాల ప్రతి నిధులు పాల్గొననున్నారు. వాతావరణ మార్పును ఎదుర్కొనే కార్యాచరణ ప్రణాళికలను అప్డేట్ చేసుకునేందుకూ, పుడమి తాపాన్ని నిరోధించే చర్యల అమలును ముందుకు తీసుకెళ్ళేందుకూ ఈ సమావేశాలు నిర్ణయాత్మక మైలురాయి కానున్నాయని ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. ఆతిథ్యమిస్తున్న దేశంగా బ్రెజిల్ దీన్ని ఫలితమిచ్చిన శిఖరాగ్ర సమావేశంగా మలచాలని కోరుకుంటోంది. నడుం బిగించేందుకు ఇదే సమయమని సమావేశాల అధ్యక్షుడు ఆంద్రే కొర్రియా దొ లాగో అన్నారు. అయినా పెరిగిన భూతాపంవాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కుదుర్చుకున్న ప్యారిస్ ఒప్పందం పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భం కూడా దీనికి కలసి వస్తోంది. అది కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకునే లక్ష్యంగా కుదిరిన గొప్ప ఒప్పందం. కానీ, దాని లక్ష్యసాధన దిశగా తీసుకుంటున్న చర్యలు ఇప్పటికీ అరకొరగానే ఉంటున్నాయి. పుడమి సగటు ఉష్ణో గ్రత పారిశ్రామిక విప్లవం ముందు రోజుల కన్నా, 1.5 సెంటిగ్రేడ్ దాటకుండా చూసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, 2024లో అది మొదటిసారి దాన్ని దాటేసింది. తీవ్ర వాతావరణ ఉపద్రవాలు పెరుగుతూ పోతున్నాయి. సముద్ర జలాలు వేడెక్కడంతో 80కి పైగా దేశాలలో సముద్రపు దిబ్బలు నిర్జీవంగా మారాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మార్పును ఆపడం కష్టమైన ‘నిర్ణయాత్మక దశ’కు పుడమి చేరుకుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వాతావరణ సమ తూకానికి ఎంతో ముఖ్యమైన అమెజాన్ సతత హరితారణ్యాలు కుప్పకూలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత సీఓపీ30 సమావేశాలు అమెజాన్కు సమీపంలోని నగరంలోనే జరుగుతున్నాయి. ప్యారిస్ ఒప్పందానికి పరీక్షప్యారిస్ ఒప్పందాన్ని కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలు సుముఖంగా ఉన్నాయో లేదో సీఓపీ30 సమావేశాలలో తేలిపోనుంది. దుబాయ్లో 2023లో జరిగిన సీఓపీ28 సమావేశాల్లో ప్రపంచవ్యాప్త పరిస్థితిని మొదటిసారిగా సమీక్షించుకున్నారు. శిలాజ ఇంధనాల నుంచి మారడాన్ని ఆ సమావేశాల తుది ప్రకటనలో మొదటిసారిగా ప్రస్తావించారు. అజర్బైజాన్లో జరిగిన సీఓపీ29 సమావేశాల్లో నూతన వాతావరణ ఆర్థిక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. వార్షిక వాతావరణ ఫైనాన్స్ 2035కల్లా 1.3 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరేటట్లు చూసుకోవాలని అంగీకారానికి వచ్చారు. జాతీయ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను అమలుపరచడం, ఇంతవరకూ తీసుకున్న చర్యలను సమీక్షించడం బెలేమ్ సమా వేశాల్లో జరగనుంది. వివిధ దేశాలు ఏ మేరకు ఉద్గారాలను తగ్గించాలని నిర్ణయించుకున్నాయో వాటిని జాతీయ నిశ్చయ వాటాలు (ఎన్డీసీలు)గా పిలుస్తున్నారు. వీటిని ప్రతి ఐదేళ్ళ కొకసారి అప్డేట్ చేసుకుంటున్నారు. ప్యారిస్ ఒప్పందంపై సంతకాలు చేసిన 190కి పైగా దేశాలలో దాదాపు 70 ఇప్పటికే తమ లక్ష్యాలను అప్డేట్ చేశాయి. ప్రపంచ ఉద్గారాలలో మూడో వంతు పైగా వాటాకు మాత్రమే లెక్క తేలే విధంగా అవి ప్రణాళికలు సమర్పించాయి. పుడమి తాపాన్ని 1.5 సెంటిగ్రేడ్ పరిమితికి లోపల ఉంచేందుకు 2030 నాటికల్లా గ్రీన్హౌస్ వాయువు (కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటివి)లను సుమారు 31 గిగా టన్నులకు తగ్గించవలసి ఉంది. అయితే, అప్డేట్ చేసిన ఎన్డీసీలను లెక్కలోకి తీసుకున్నా అది 2 గిగా టన్నులకు మించడం లేదు. అమెరికా తడబాటు – చైనా ఎడబాటుభౌగోళిక రాజకీయాలు బహు సున్నితంగా ఉన్న సందర్భంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. వివిధ దేశాల మధ్య నమ్మకం కొరవడటం ప్రధాన సమస్యలలో ఒకటిగా పరిణమించింది. ఇది వాతావరణంపై చర్చలకు అవరోధం కానుంది. అంతర్జాతీయ వాతావరణ మార్పు నిరోధక సహాయ కార్యక్రమాలకు అమెరికా నుంచి అందే విరాళాలకు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే కోత పెట్టారు. ప్రభుత్వ వనరులను సైనిక, భద్రతాపరమైన అంశాలకు మళ్ళిస్తున్నారు. తలో చేయి వేస్తామని చెప్పిన దేశాలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదు. వాగ్దానం చేసిన మొత్తాలను తగ్గించి ఇస్తున్నాయి. ఉక్రెయిన్, గాజా యుద్ధాలు క్లైమేట్ ఫైనాన్సింగ్ ఇబ్బందులను తీవ్రతరం చేస్తున్నాయి. దాంతో సామాజిక ఉద్యమాల, పేద దేశాల ప్రతినిధుల హాజరు అంతంతమాత్రంగానే ఉండవచ్చుననిపిస్తోంది. చాలా దేశాలు తమ ప్రతినిధి బృందాల సంఖ్యను కుదించుకున్నాయి.కర్బన ఉద్గారాలు తక్కువగా ఉండగల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చైనా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి మధ్యాదాయ దేశాల నాయకత్వాలు ముఖ్య పాత్ర వహించవలసి ఉంది. ప్రపంచ ఉద్గారాలలో సుమారు సగ భాగం ఈ దేశాల నుంచే ఉన్నాయి. ఇవి తమ దేశాల్లో పరిస్థితులను చక్కదిద్దుకోకపోతే, మొత్తం ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ పైన కూడా పెద్ద బాధ్యతే ఉంది. వాతావరణ మార్పు ఇంత పెను సమస్యగా పరిణమించడంలో చారిత్రకంగా వాటి బాధ్యత చాలానే ఉంది. గ్రీన్హౌస్ వాయువుల విడుదలలో ప్రపంచంలో రెండవ పెద్ద పాత్ర అమెరికాదే! ప్యారిస్ ఒప్పందం నుంచి ఉపసంహరించుకునే ప్రక్రియ ట్రంప్ 2025 జనవరిలో తిరిగి అధికారానికి వచ్చాక ఊపందుకుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉద్గారాలను తగ్గించే లక్ష్యాన్ని చేరుకోగల గతిని నీరుగార్చనుంది. నిధుల మంజూరులో ఇచ్చిన మాటను అమెరికా ఎన్నడూ పూర్తిగా నిలబెట్టుకోలేదు. ఆ లోటును ఫెడరల్ ప్రభుత్వం బదులు, రాష్ట్రాలు, స్థానిక పాలనా సంస్థలు తీరుస్తాయని భావిస్తున్నారు. ఇక తమ గ్రీన్హౌస్ వాయువుల విడుదలను 2035కల్లా 7 నుంచి 10 శాతం మధ్యకు తగ్గించుకుంటామని చైనా నాయకుడు షీ జిన్పింగ్ గత సెప్టెంబరులో ఐరాస సర్వ ప్రతినిధి సభలో చెప్పారు. ప్రపంచ ఉద్గారాలలో చైనా వాటా సుమారు మూడో వంతుగా ఉంది. దానితో పోలిస్తే, ఆయన చెబు తున్న మాటలు పెద్దగా లెక్కలోకి రావు. వాతావరణ మార్పును అరికట్టే నాయకత్వం నుంచి అమెరికా, యూరోపియన్ యూనియన్ ఉపసంహరించుకోవడంతో చైనాయే నేతృత్వం వహించాలనే ఒత్తిడి పెరుగుతోంది. కానీ ‘ఏకైక నాయక’ పాత్రను చేపట్టడంలోని బరువు బాధ్యతలు చైనాకు బాగా తెలుసు. అందుకే నాయకత్వ బాధ్యత లను పంపిణీ చేయాలనీ, గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సహకారాన్ని పటిష్ఠపరచాలనీ చైనా భావిస్తోంది.అమందా మగ్నానివ్యాసకర్త బ్రెజిల్ పర్యావరణ పాత్రికేయురాలు -
తేజస్వీ యాదవ్ (సీఎం అభ్యర్థి) రాయని డైరీ
దేశంలో ఏదైనా ఒక రాష్ట్రానికి 14 కోట్ల మంది సీఎంలు ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో శ్రీ మోదీజీ, శ్రీ నితీశ్ కుమార్ నవంబర్ 14న ప్రత్యక్షంగా చూడబోతున్నారు. నేను సీఎంని అయితే బిహార్ ప్రజలంతా సీఎంలు అయినట్లే!ఎల్లుండి, నవంబర్ 11న రెండో విడత పోలింగ్. 14న ఫలితాలు. 6న మొదటి విడత పోలింగ్ పూర్తయింది. నాన్నగారు, అమ్మ, నేను, రాజశ్రీ, భారతి అక్క, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఓటేసి వచ్చాం. తేజ్ ప్రతాప్ అన్నయ్య కూడా మాతో ఉంటే బాగుండేది.నాన్నగారు తేజ్ అన్నయ్యను ఇంట్లోంచి, పార్టీ నుంచి వెళ్లి పొమ్మన్నాక తేజ్ అన్నయ్య వేరే పార్టీ పెట్టుకున్నారు. మాలో ఎవరితోనూ మాట్లాడటం లేదు. మొన్న పట్నా ఎయిర్ పోర్టులో ఒకరికొకరం ఎదురుపడినప్పుడు కూడా తేజ్ అన్నయ్య ముఖం తిప్పుకుని వెళ్లిపోయారు! నేను చాలా ఫీల్ అయ్యాను. తేజ్ అన్నయ్య ‘జనశక్తి జనతా దళ్’ అనే పార్టీ పెట్టుకుని మహువా నుంచి పోటీ చేస్తున్నారు. ఆర్జేడీలోని ‘జేడీ’ని అలాగేఉంచేసుకుని, ‘రాష్ట్రీయ’కు బదులుగా ‘జనశక్తి’ అని పెట్టుకున్నారు. అంటే పూర్తిగా పార్టీలోంచి వెళ్లినట్లు కాదు. నేను పోటీ చేస్తున్న రాఘోపుర్, తేజ్ అన్నయ్య పోటీ చేస్తున్న మహువా... రెండూ వైశాలి జిల్లాలోనివే. నాన్నగారు, అమ్మ,మా ఇద్దరి తలపై చేయి ఆన్చి వేర్వేరుగా మాకు ఆశీస్సులు అందించారు. అంటే అన్నయ్య పూర్తిగా ఇంట్లోంచి వెళ్లినట్లు కాదు. ఎవరో అమ్మాయితో తను రిలేషన్లో ఉన్నట్లు తేజ్ అన్నయ్య ఫేస్బుక్లో పోస్టు పెట్టడంతోనే వచ్చింది అసలు ఇదంతా! పాపం వదిన ఆ రోజు ఎంతగా చిన్నబోయారో ఇంట్లో అందరం చూశాం. అమ్మ వదినను గుండెల్లోకి తీసుకుంది. నాన్న గారు తేజ్ అన్నయ్యను గట్టిగా మందలించారు. ‘‘వ్యక్తిగా నీతి తప్పిన వారికి సమాజం కోసం పోరాడే శక్తి తగ్గుతుంది’’ అన్నారు. ఇంట్లోంచి, పార్టీలోంచి అన్నయ్యను పంపించేశారు.బయటికి వెళ్లి, కొత్త పార్టీ పెట్టగానే తేజ్ అన్నయ్య మొదట అన్నమాట... ‘‘మృత్యువునైనా ఆలింగనం చేసుకుంటాను కానీ తిరిగి ఆర్జేడీని ఆశ్రయించేది లేదు’’ అని! ఆ మాటకు నాన్నగారు, అమ్మ చాలా బాధపడ్డారు.తేజ్ అన్నయ్య జేజేడీ పార్టీ 22 చోట్ల పోటీ చేస్తోంది. ఆ పార్టీ అన్ని చోట్లా గెలిచి, నేను సీఎం అవటానికి 22 సీట్లు తగ్గితే అన్నయ్య అప్పుడేమంటారో చూడాలి. 2020 ఎన్నికల్లో నేను సీఎం అవటానికి తగ్గింది 12 సీట్లే! ఒంట్లో హుషారుగా లేక నాన్నగారు ప్రచారానికి రాలేకపోతున్నారు. కానీ, నాన్నగారి మాటలు నేరుగా ఇళ్లలోకే వెళ్లి పోతాయి. బిహార్లోని ప్రతి ఇల్లూ భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు నాన్నగారి సత్తువ కలిగిన మాటలను రొట్టెల్లా పంచుకుంటుంది. నాకింకా ఆ ఒరవడి రాలేదు.నితీశ్జీ ఇరవై ఏళ్లుగా బిహార్కు సీఎంగా ఉంటున్నారు. నాన్నగారు ఏమంటారంటే... ‘‘పెనం మీద రొట్టెను తిరగెయ్యకపోతే మాడిపోతుంది. ఇరవై ఏళ్లు అంటే చాలా ఎక్కువ సమయం’’ అని!ఈ ఒక్క మాట చాలు, రోజుకు నేను పది ర్యాలీలు తీసి, పది ప్రసంగాలు చేసినంత!ఇవాళ రాహుల్జీ పట్నా వస్తున్నారు. ఇవాళ జరిగే అన్ని ర్యాలీలలో ఆయన నా వెంట ఉంటారు. ప్రచారానికి సిద్ధం అవుతుంటే... ‘‘చల్లగా ఉండు’’ అని నాన్నగారు, అమ్మ వచ్చి నన్ను దీవించారు. నాకు మిఠాయిలు తినిపించారు. అమ్మ నా నుదుటిపై ముద్దు పెట్టింది.ఇంట్లోంచి నేను బయలుదేరుతుంటే... తేజ్ అన్నయ్య నుంచి ఫోన్... ‘‘హ్యాపీ బర్త్ డే రా తమ్ముడూ...’’ అని!!నాన్నగారికి నెహ్రూజీ అంటే ఇష్టం. ఈసారి ఎన్నికల ఫలితాలు సరిగ్గా నెహ్రూజీ బర్త్డే రోజే వస్తున్నాయి. బిహార్ ప్రజలంతా సీఎంలు కాబోతున్న రోజు కూడా అదే! -
వినిమయ తత్వమే కాలుష్య కారకం
దేశ రాజధానిలో వాయు కాలుష్య తీవ్రత గురించి ఇప్పటికే చాలా విన్నాం. మనం పీల్చే విషపు గాలి పర్యవసానాలు, నష్టా లపై నిపుణులు అడపాదడపా హెచ్చరి స్తూనే ఉన్నారు. కోవిడ్–19 వల్ల కన్నా వాయు కాలుష్యం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారని ‘ఎయిమ్స్’ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్పిన దాని ప్రకారం వాయు కాలుష్య దీర్ఘకాలిక ప్రభావాలు దగ్గులు, ఊపిరి సలపకపోవడానికి మాత్రమే పరిమితమైనవి కావు. అది హార్ట్ ఎటాక్, స్ట్రోక్, చివరకు క్యాన్సర్కు కూడా కారణమవుతోంది. అయినా, మనం సంక్షోభం మూలాలలోకి వెళ్ళేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం సూచించే తాత్కాలిక పరిష్కాలతో తృప్తి పడుతున్నాం. ఎయిర్ ప్యూరిఫయర్లు కొనేందుకు, బయటకు వెళ్ళేటపుడు ఎన్ 95 మాస్కులు ధరించేందుకు అలవాటు పడుతున్నాం. కృత్రిమ వర్షాలను సాంకేతిక అద్భుతంగా మురిసిపోతూ, అవి తేగల ఊరట కోసం ఎదురు చూస్తున్నాం. ఒక ప్రజా సమస్యకు ఆ రకమైన ప్రైవేటు పరిష్కారాలనుమించి ఆలోచించేందుకు తెగువ, రాజకీయ, నైతిక విశ్వాసం అవసరం. మనం సాధారణంగా మార్చేసిన జీవన విధానాలకు సంబంధించి ప్రపంచ దృక్కోణాన్ని ప్రశ్నించేందుకు మనమంతా ఏకం కావాల్సి ఉంది.వినిమయ తత్వపు విషవలయంఢిల్లీ వాయు కాలుష్యం విస్తృతమైన వాతావరణ మార్పు సంక్షో భంతో ముడిపడి ఉన్నదనీ, అవి రెండూ అవిభాజ్యమైనవనీ నిజాయితీగా అంగీకరిద్దాం. అది ఆధునికత తెచ్చిపెడుతున్న అనర్థం. ముందు వెనుకలు ఆలోచించని సాంకేతిక ప్రగతి కోసం ప్రకృతిని జయించాలని చూస్తున్నాం. దాంతో, టెక్నో–క్యాపిటలిజం స్థిరంగా వృద్ధి చెందుతూ వచ్చింది. వస్తు వినియోగ తత్వానికి మనం క్రమంగా బానిసలమైపోయాం. మవ చుట్టూ ఉన్న వాటిలో చెట్టు, పుట్ట, నది, పర్వతం ఏదైనా కావచ్చు– ప్రతీదీ వాటివైన స్వరూప స్వభావాలను, ప్రయోజనాన్ని కోల్పోయాయి. ప్రకృతి అంటే కొల్లగొట్టదగిన వనరు అనే భావన పాదుకుపోయింది. మరింత విద్యుచ్ఛక్తి, మరిన్ని కార్లు, మరింత వస్తు సామగ్రి, మరిన్ని దుస్తులు... వస్తు వినిమయ తత్వానికి అంతూ పొంతూ లేకుండా పోతోంది. రోడ్ల విస్తరణకు వేలాది చెట్లను నరికేసేందుకు మనం సంశయించడం లేదు. విద్యుదుత్పాదనకు నదుల సహజ ప్రవాహ గతులను మార్చేస్తున్నాం. ఔను. ఆధునికత సంక్షోభం ఢిల్లీ వాయు కాలుష్య రూపంలో జడలు విప్పుకుని దర్శనిమిస్తోంది. ఒక్కసారి ఢిల్లీ రోడ్లను పరికిస్తే వాహనాలు వరదెత్తినట్లుగా కనిపిస్తాయి. దేశ రాజధానిలో 1.2 కోట్ల వాహనాలు రిజిస్టరయ్యాయనీ, వాటిలో 33.8 లక్షలు ప్రైవేటు కార్లేననీ ఢిల్లీ స్టాటిస్టికల్ హ్యాండ్ బుక్ (2023) సూచిస్తోంది. వేగం, చలన శక్తి ఆధునికతలో అంతర్భాగాలవడంతో మనకు మరిన్ని కార్లు, విమానాలు అవసరమవుతున్నాయి. పర్యవసానంగా శిలాజ ఇంధనాలను వెలికి తీయడం అవిశ్రాంతంగా సాగుతోంది. కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్నాయి. ఆధునికత, టెక్నో–క్యాపిటలిజం విష విలయంలో చిక్కుకున్నాం. తప్పులో మన వాటా?ఢిల్లీలో కాలుష్యానికి ప్రాథమిక కారణం పొరుగు రాష్ట్రాలలో పంట కోతల తర్వాత గడ్డి గాదాన్ని మంటపెట్టడం వల్ల కాదని నిజాయితీగా అంగీకరించాలి. ఢిల్లీ వాయు కాలుష్యానికి వాహనాల ఉద్గారాలు ప్రధాన దోహదకారిగా ఉన్నాయనే వాస్తవాన్ని మనం ఎలా విస్మరించగలం? సూక్ష్మ ఘన, ద్రవ ధూళి కణాలు, దుమ్ము, మసి, పొగల మిశ్రమాన్ని పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం)గా పిలుస్తు న్నారు. ఢిల్లీలో వార్షిక పీఎం 2.5 శాతంగా ఉంది. దానిలో వాహన ఉద్గారాల వాటాయే 10 నుంచి 30 శాతంగా ఉందని లెక్క తేలింది. అలాగే, పరిశ్రమలు, విద్యుదుత్పాదన కేంద్రాలు విడిచిపెట్టేవి, వ్యర్థ పదార్థాలను దగ్ధం చేయడం వల్ల వచ్చేవి, నిర్మాణ పనుల వల్ల రోడ్లపైకి వస్తున్న దుమ్ము నగరంలో వాయు కాలుష్య తీవ్రతకు కారణమవుతున్నాయి. కానీ, ఈ ప్రశ్నలను లేవనెత్తడం కష్టం. ఎందుకంటే, అవి మనల్నే వేలెత్తి చూపుతాయి. మనం అనుసరిస్తున్న హైపర్ ఆధుని కత జీవన మార్గాలపై ఇంటరాగేషన్కు దిగుతాయి. కనుక, ఆత్మ పరిశీలనకు మనం విముఖులుగా ఉంటాం. దానికి బదులు, మన పడక గదుల్లో ఎయిర్ ప్యూరిఫయర్లను వాడితే మనం సురక్షితంగా ఉంటామని మనకు మనం సర్ది చెప్పుకోవడం తేలిక. పెద్దగా ఆందో ళన చెందనక్కర లేకుండా టెక్నో–సైన్స్ కృత్రిమ వర్షాలను కురిపించగలదని సంతృప్తి పడటం తేలిక. ఎలక్ట్రిక్ కార్లను వాడటం ప్రారంభిస్తే సమస్య పరిష్కారమైపోతుందని నమ్మడం తేలిక. కట్టె పొయ్యిలు, బొగ్గు కుంపట్లు వంటి వాటి ద్వారా కాలుష్యానికి కారణమవుతున్నారని పేదలను నిందించడం తేలిక. లగ్జరీ ఎస్యూవీలు, స్పీడుగా దూసుకుపోయే కార్లు, ఖరీదైన వస్తువుల వినియోగం కర్బన ఉద్గారాలకు గణనీయంగా తోడ్పడు తున్నాయని చెబితే ధనికులకు, అత్యంత సంపన్నులకు కోపం వస్తుంది. కాలుష్య పర్యవసానంగా ఏర్పడుతున్న ప్రతికూల అనా రోగ్య పరిస్థితుల బారిన ధనికులకన్నా పేదలు ఎక్కువ పడుతున్నా రనే వాస్తవాన్ని తేలిగ్గా పక్కన పెట్టేస్తున్నారు. నిజంగా కావాల్సినవి!కాలుష్య రహిత భవిష్యత్తుకు నూతన జీవన పద్ధతులు, పట్టణ ప్రణాళికలు తప్పనిసరి. న్యూరోటిక్ స్పీడు నుంచి మందగమనానికి, భారీ ఎక్స్ప్రెస్ వేల నుంచి నడకకు, సైకిళ్ళు తొక్కడానికి ప్రోత్సహించే రోడ్లకు, ప్రైవేటు వాహనాల నుంచి ప్రజా రవాణా వ్యవస్థ లకు మారక తప్పదు. ఆకర్షణీయంగా కనిపించే వినిమయ తత్వం నుంచి నిరాడంబర, నిలకడగా సాగించగలిగిన జీవన విధానాలకు మళ్ళాలి. అవసరం లేనివాటి కోసం వెంపర్లాడటం మానుకోవాలి. మనం, మన సంతానం ఆరోగ్యకరంగా ఉండేందుకు సహాయ పడగల వాటిని అలవరచుకోవాలి. శుద్ధమైన తాగునీరు, గాలి, చెట్లు, నీటి వనరులు, నీలాకాశం, ఎటుచూసినా హరిత పరిసరాలు మనకు నిజమైన అవసరాలు. ప్రాధాన్యాలను ఎంచుకోవాల్సింది మనమే. మనం ఏ విధమైన అభివృద్ధిని కోరుకుంటున్నామో, ఆ దిశగా అడుగులు వేసేందుకు మనమే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి.-వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-అవిజిత్ పాఠక్ -
‘కృత్రిమ’ కంటెంట్కు కళ్లెం ఇలాగా?
డీప్ఫేక్, జనరేటివ్ ఏఐల సాయంతో సృష్టించిన ఆడియో, వీడియో సమాచారం విచ్చలవిడిగా పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ రకమైన కంటెంట్ను నియంత్రించేందుకు ఉద్దేశించిన ముసాయిదా నిబంధనలను ప్రకటించింది. ఇవి 2021 నాటి ఐటీ చట్టానికి కొనసాగింపుగా ఉండ నున్నాయి. కంప్యూటర్లు, ఏఐ, అల్గారిథ మ్ల వంటి వాటి సాయంతో సృష్టించిన, అభివృద్ధి చేసిన, మార్పులు చేసిన సమాచారం, కంటెంట్ అన్నింటినీ కృత్రిమ మీడియాగా పరిగణిస్తారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్పై కొన్ని నెలలుగా ఈ కృత్రిమ కంటెంట్ మోతాదు విపరీ తమైన విషయం తెలిసిందే. ఎప్పుడూ అనని మాటలను, చేయని పనులను చేసినట్టుగా చూపించే ఈ రకమైన కంటెంట్ను నియంత్రించకపోతే ప్రమాదమే. ట్రంప్, మోదీ మధ్య జరిగినట్టుగా చెబు తున్న టెలిఫోన్ సంభాషణ కూడా ఈ కోవకే చెందుతుంది. ‘చట్టబద్ధమైన’ హెచ్చరిక ఉండాలి!ఏఐ ఆధారిత డీప్ఫేక్లను తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసేందుకు, ఒకరి పరపతిని తగ్గించేందుకు, ఆర్థికపరమైన నేరాలు చేసేందుకు వాడుతున్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంలో ప్రజలను ప్రభావితం చేసేందుకూ వాడటం కద్దు. ఇలాంటి అభ్యంతరకరమైన సమాచారం గురించి ప్రభుత్వం ఇప్పటి వరకూ ‘సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్’ (యాభై లక్షల కంటే ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న సామాజిక మాధ్యమ ప్లాట్ ఫామ్స్)కు సలహా, సూచనలు ఇవ్వడానికే పరిమితమైంది. ఫిర్యా దులపై స్పందించేందుకు, చట్టపరమైన నిబంధనలు అమల్లో ఉండేలా చూసేందుకు ఈ కంపెనీల్లో వ్యవస్థలు ఉండాలి.కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన నిబంధనలు... కంటెంట్ తీరుతెన్నులను గుర్తించేందుకు; సృష్టి, పంపిణీ, విస్తృతి వంటివి తెలుసుకునేందుకు బాధ్యత ఎవరిదన్న విషయాలపై చట్ట బద్ధతను కోరుతున్నాయి. ఏఐ ఆధారంగా సృష్టించిన కంటెంట్ మొత్తాన్ని మెటాడేటాలో స్పష్టం చేసేలా చేయడం ద్వారా దీన్ని సాధించాలన్నది లక్ష్యం. ఫలితంగా ఏది కృత్రిమమైంది? ఏది కాదన్న విషయం స్పష్టమవుతుంది. ఏది కృత్రిమ సమాచారం అన్న విషయాన్ని ఆయా సోషల్ మీడియా సంస్థలే ప్రకటించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తోపాటు ఏఐ కంపెనీలు, అవి అందించే టూల్స్కు కూడా వర్తిస్తాయి. ఏఐ టూల్స్ సిద్ధం చేసే కంపెనీలు కూడా సమాచారం ఏ రకమైందన్న విషయాన్ని స్పష్టం చేయాలి. పొగాకు ఉత్పత్తులపై ఉండే హెచ్చరిక మాదిరిగా ‘ఈ కంటెంట్ కృత్రిమమైంది’ అన్న లేబిలింగ్ శాశ్వతంగా ఉండాలన్న మాట! కనిపించే స్క్రీన్లో ఈ హెచ్చరిక కనీసం పది శాతం సైజులో ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ఆడియో విషయానికి వస్తే మొదటి పది శాతం నిడివిలో ఈ హెచ్చరిక వినిపించాలి. తాము అప్లోడ్ చేసే సమాచారం ఏ రకమైందో వినియోగదారులే ప్రకటించేలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చర్యలు తీసుకోవాలి. సదుద్దే శంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్... ఏఐ ఆధారిత కంటెంట్ దేన్నైనా నిరోధించినా, తొలగించినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం వీరికి లభించే చట్టపరమైన రక్షణ కొనసాగుతుంది. కృత్రిమ మేధ ఏదైనా సరే... నియంత్రణ ప్రభుత్వాలకు కష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు. ఏఐ కంటెంట్ చాలా సంక్లిష్టమైంది. ఛాట్జీపీటీ, జెమిని, డాల్–ఈ వంటి ఏఐ టూల్స్ మాత్రమే కాదు.. మరెన్నో రకాల ఏఐలు, ప్లాట్ఫామ్స్ కంటెంట్ సృష్టిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఏఐ ఆర్ట్ జనరేటర్, వాయిస్ క్లోనింగ్ టూల్స్, డీప్ఫేక్ యాప్స్ వంటివన్నీ కలిస్తేనే కృత్రిమ కంటెంట్ సృష్టి, వ్యాప్తి సాధ్యమవుతోంది. ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్, ఎక్స్, లింక్డ్ఇన్ వంటి ప్రధాన సోషల్ మీడియా కంపె నీలు మాత్రమే భారత్లో ఉండగా... మిగిలినవి ప్రపంచంలో ఎక్కడి నుంచో పనిచేస్తున్నాయి. వీటన్నింటినీ భారత ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి తేవడం దుస్సాధ్యం.హడావిడిగా నిబంధనలా?కేంద్రం డీప్ఫేక్స్ విషయంలో ప్రతిపాదించిన కొత్త నిబంధ నలు హడావిడిలో చేసినట్టుగా కనిపిస్తోంది. ఇంకోలా చెప్పాలంటే రాజకీయ నేతలపై వస్తున్న వరుస డీప్ఫేక్ వీడియోలపై అప్పటి కప్పుడు స్పందించినట్టుగా అనిపిస్తోంది. ప్రతి పౌరుడి హక్కులు పరిరక్షించేలా ఆలోచించి రూపొందించి ఉంటే బాగుండేది. ఈ కొత్త నిబంధనలన్నీ డీప్ఫేక్స్ లేదా అభ్యంతరకరమైన కంటెంట్ను తొల గించడంపైనే దృష్టిని కేంద్రీకరించాయి. అలాంటి కంటెంట్కు బాధ్యతను సోషల్ మీడియాపైనే మోపే ప్రయత్నం జరిగింది. ఇలా కాకుండా ప్రతి ఒక్కరి భౌతిక లక్షణాలు, గొంతుల రక్షణకు వీలు కల్పించేలా నిబంధనలను రూపొందించి ఉండాల్సింది. సినీతారలు తమ ముఖాలు, గొంతులను ఏఐ ద్వారా అనధికారికంగా ఎవరూ వాడకుండా ఉండే హక్కును కోరుతున్నారు.డీప్ఫేక్లపై వివిధ దేశాలు వేర్వేరు పద్ధతుల్లో స్పందిస్తు న్నాయి. డెన్మార్క్ పౌరులందరి వ్యక్తిగత లక్షణాలను ప్రత్యేకమైన హక్కుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటోంది. అమెరికా ఎన్ని కల్లో ఏఐ ద్వారా సృష్టించిన ఆడియో, వీడియో కంటెంట్ను నిషేధించేలా చట్టాన్ని ప్రతిపాదించారు. ఆన్ లైన్ భద్రతకు సంబంధించి ఫ్రాన్స్ ఒక సమగ్రమైన చట్టం చేసే ప్రయత్నాల్లో ఉంది. యూకే కూడా ఆన్ లైన్ సేఫ్టీ చట్టాలకు సవరణలు చేసింది. దీని పరిధిలోకి డీప్క్స్, ఫొటోల మార్ఫింగ్ను కూడా చేర్చింది. వీటన్నింటిలో యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చట్టం సమగ్రంగా ఉందని చెప్పాలి. ఏఐతో రాగల సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించి, నియంత్రణ అవసరాన్ని, లోటు పాట్లను చర్చించి దీన్ని రూపొందించారు. భారతదేశంలో మాత్రం ఎలాంటి బహిరంగ చర్చ లేకుండా ఈ నిబంధనల రూపకల్పన జరిగింది. ప్రతిపాదిత నిబంధనలపై వ్యాఖ్యానించేందుకు రెండు వారాల గడువు మాత్రమే ఇచ్చారు. కీలకమైన, దేశ ప్రజల్లో చాలామందిపై ప్రభావం చూపే అంశమైనందున మరింత విస్తృత చర్చ జరిగి ఉండాల్సింది. వేర్వేరు రంగాల భాగస్వాములతో చర్చించి ఉంటే నిబంధనలు మరింత సమర్థంగా ఉండేవి. పనిలో పనిగా 2021 నాటి డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ఎంత సమర్థంగా పనిచేస్తోందో కూడా చర్చించే అవకాశం దక్కేది. ఇందులో లోపాలను సరిదిద్దుకోవడంతోపాటు కొత్త నిబంధనలను మరింత సమర్థంగా రూపొందించేందుకు అవకాశం దక్కేది. అసలు సమస్యలుప్రభుత్వ సంస్థలు ఇలాంటి చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుని కొందరి కంటెంట్ను మాత్రమే తొలగిస్తాయన్న అను మానం నిత్యం ఉంటుంది. ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు కొందరు తప్పుడు, ఏఐ జనరేటెడ్ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా వాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే రోబోట్లు లేదా అపరిచితులు సృష్టించే కంటెంట్ విషయంలో టెక్ కంపెనీలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల అవిశ్వసనీయ వైఖరి అన్నది కొత్త నిబంధనల అమలులో అతి పెద్ద ప్రతిబంధకం అని చెప్పాలి. యూరోపియన్ యూనియన్ మాదిరిగా అన్ని విషయాలనూ నియంత్రించే సమగ్రమైన చట్టం భారతదేశానికి అవసరం. డిజిటల్ అక్షరాస్యత, ఆన్ లైన్ భద్రతలపై ప్రజల్లో చైతన్యం పెంచడం ద్వారా వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
‘షట్డౌన్’ తెచ్చిన ఆహార సంక్షోభం
ప్రస్తుతం అమెరికాలో ఆహార సంక్షోభం తలెత్తింది. ఈ మాట వినడానికే వింతగా ఉన్నా... వాస్తవం! అక్కడ ప్రస్తుతం ‘షట్డౌన్’ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షట్డౌన్ ప్రభావం అనేక రంగాలపై పడింది. తాజాగా వివిధ రాష్ట్రాలలో ఆహార సంక్షోభా నికి దారి తీసింది. ప్రధానంగా వాణిజ్య రాజధాని అయిన న్యూయా ర్క్పై పడింది. ఫెడరల్ ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆహార సాయం నిలిచిపోయింది. దీంతో ఆ రాష్ట్రం ‘స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. ఫెడరల్ ప్రభుత్వ షట్డౌన్ అమెరికాలోని కోట్లాది మంది అల్పాదాయ కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన ‘సప్లి మెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ లేదా ‘ఫుడ్ స్టాంప్స్’ ప్రయోజనాలు అందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. అమెరికాలో ఈ ప్రోగ్రామ్ ద్వారా దాదాపు నాలుగున్నర కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. వీరిలో ఎక్కువమంది పేద వారే! ఇదిలా ఉంటే, నిధుల కొరత కారణంగా నవంబరు నెల ప్రయోజనా లను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నిలిపివేయాలని ఇటీవల రాష్ట్ర ఏజెన్సీ లను అమెరికా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కాగా ఆహార సంక్షో భాన్ని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు లేదని గవర్నర్ కేథీ హోచుల్ ఆరోపించారు. చట్టబద్ధంగా ఆమోదించిన ఎమర్జెన్సీ ఫండ్ను విడుదల చేయడానికి ట్రంప్ సర్కార్ నిరాకరిస్తోందని కేథీ ఘాటు ఆరోపణలు చేశారు. ఆహార సంక్షోభాన్ని పరిష్కరించడానికి అమెరికాలోని అనేక రాష్ట్రాలు సొంతంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ జాబితాలో లూసియానా, వెర్మంట్, న్యూ మెక్సికో ముందు వరుసలో ఉన్నాయి.ఇదీ చదవండి : మేయర్గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందనఅమెరికా ఫెడరల్ ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రతి ఏడాది తప్పనిసరిగా ఒక బడ్జెట్ను లేదా తాత్కాలిక ఖర్చులను అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు అంటే అక్టోబరు ఒకటో తేదీలోగా కాంగ్రెస్ ఈ బడ్జెట్ను ఆమోదించాల్సిఉంటుంది. అలా జరగకపోతే, ప్రభుత్వంలో అత్యవసరం కాని సేవలు తాత్కా లికంగా నిలిచిపోతాయి. దీనినే ‘ప్రభుత్వ షట్డౌన్’ అంటారు. వాస్తవానికి ప్రభుత్వ సొమ్ము వృ«థా కాకుండా చూడాలనే సదుద్దేశంతో షట్డౌన్ చట్టాన్ని తొలి రోజుల్లో తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము వృథా కాకుండా చూడాలనే నియమాన్ని అన్ని రాజకీయ పార్టీలూ పక్కన పెట్టి... తమ విధానపరమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి బడ్జెట్ ఆమోదాన్ని అడ్డుకుంటున్నాయి. అయితే సామాన్య అమెరికన్లు మధ్యలో నలిగి పోవడం గమనార్హం.– ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్ -
'నేర్చుకోవడమే' నిత్యానందం
ఎప్పుడైనా నేనిచ్చే సలహా ఒకటే. మనం చదువుకునే విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాకరమైనదే కావచ్చు. కానీ, అక్కడి ప్రొఫెసర్లు, వాతావరణం నచ్చనప్పుడు, అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయేందుకు వెనుకాడకూడదు. నేను పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూలులో రెండేళ్ళు చదివిన తర్వాత, అక్కడి పరిస్థితులు నచ్చక ఇదే నెబ్రాస్కా–లింకన్ యూనివర్సిటీకి వచ్చేశాను. ఈ యూనివర్సిటీలో ప్రతి నిమిషం ఆనందంతో గడిపాను. ఇక్కడే 1951లో గ్రాడ్యుయేట్ అయ్యాను. విద్యాలయం విషయంలోనే కాదు, చదువు పూర్తయ్యాక, ఉద్యోగం చేసే సంస్థల విషయంలో కూడా వాటి పేరు ప్రఖ్యాతులను పక్కనబెట్టి, మన మనసు చెప్పిన మాట ప్రకారం నడచుకోవాలి. మొదట ఏదో ఓ కొమ్మ...జీవితంలో సంతృప్తినిచ్చే, మనసారా కోరుకునే ఉద్యోగం మనకు మొదట్లోనే లభించకపోవచ్చు. అది ఎక్కడో ఉంటుంది. ఆరంభంలోనే ఆ అవకాశం లభించకపోవచ్చు. కానీ, రోజులు వెళ్ళదీయాలి కనుక, లభించిన ఉద్యోగాన్ని మొదట చేపట్టక తప్పదు. అలాగని, వచ్చిన దానితోనే సంతోషపడిపోకూడదు. మీరు అభిమానించని కంపెనీలో లేదా మీరు ఇష్టపడే వ్యక్తులు లేని చోట ఉండిపోయి అదే పనిలో కొనసాగాలని అనుకోవద్దు. నచ్చిన ఉద్యోగంలో చేరండి. అది ఇచ్చే సంతృప్తి కోసం ఉద్యోగానికి వెళ్ళేందుకు ఉదయమే పక్క మీంచి లేచి కూర్చుంటారు. ఆ మేరకు నేను అదృష్టవంతుడిననే చెప్పు కోవాలి. ఇష్టపడే పనిలోకే రాగలిగాను. దానిని మించింది మరొకటి ఉండదని చెప్పగలను. చేస్తున్న పని అసలు పనే అనిపించదు. ఏరోజు కారోజు త్వరగా పనిలోకి దిగాలని అనిపిస్తుంది. ఉద్యోగాల వేట మొదలు పెట్టిన మొదటి రోజునే మనకు అటువంటిది దొరక్కపోవచ్చు. కానీ, ఎక్కడో ఉండే ఉంటుంది. దాని కోసం అన్వేషించాలి. దాన్ని సక్రమంగా నిర్వహించేందుకు సంసి ద్ధులమై ఉండాలి. యజమానులు ఎటువంటివారిని నియమించా లని ఎదురు చూస్తున్నారో వారు కోరుకునే విధంగా మనం తయారు కావాలి. అప్పుడే వారు మనల్ని ఉద్యోగంలోకి తీసుకుంటారు. తక్షణ ఆర్థిక ప్రయోజనాలను పక్కనపెట్టి, ఒక్కోసారి జీతభత్యాలు లభించకపోయినా సరే, ఇష్టపడే వృత్తి వ్యాసంగాలనే చేపట్టాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం. బాగా రాసే, బాగా మాట్లాడే కళను సంతరించుకోవాలి. నిన్న మనకు తెలియని చాలా విషయాలను నేడు తెలుసుకుని రోజుకు స్వస్తి పలికితే అంతకన్నా అద్భుతమైన కాలం ఇంకేముంటుంది? ప్రతిభావంతులైన విద్యార్థులను చూస్తే, నాకు ప్రపంచంపై ఆశావాదం రేకెత్తుతుంది. ఎదుగుదలపై నమ్మకం ఉంచి రంగంలోకి దిగాలనిపిస్తుంది. స్టాక్ మార్కెట్లో అది నన్ను ‘బుల్లిష్’గా వ్యవహ రించేటట్లు చేస్తుంది. మీరూ నాలాగానే జీవితం పొడవునా రకరకాల పరిస్థితులను ఎదుర్కోనున్నారు. నేను చూసిన మహా మాంద్యం లేదా రెండవ ప్రపంచ యుద్ధం, చవిచూసిన ఎత్తు పల్లాల లాంటి ఆశ్చర్యకర ఘటనలు మీకూ మున్ముందు అనుభవంలోకి రావచ్చు. అంతిమంగా గెలుపు మీదే అవుతుంది. అయితే, ఏ రంగంలో రాణించడానికైనా కమ్యూనికేషన్ నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి. విజేతలుగా నిలుస్తామని అంటే అర్థం మనకి ప్రతి రోజు అద్భు తంగా గడుస్తుందని కాదు. ప్రపంచం ఎన్నటికీ అలా నడవదు. మరో దేశంలోనో, మరో కాలంలోనో ఉండి ఉంటే, రాణించి ఉండే వారమనుకోవడం తప్పు. ఉన్న చోటునే, ఉన్న పరిస్థితుల్లోనే పైకి ఎదిగేందుకు ప్రయత్నించాలి. నా ఉద్దేశం – అందరికీ అవకాశాలు తప్పకుండా వస్తాయి. కానీ, జీవితం అన్నాక ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. అనారోగ్య సమస్యలో మరొకటో తలెత్తుతాయి. ప్రతి రోజూ ఎంతో కొంత కొత్త విజ్ఞానాన్ని సముపార్జించుకోవడాన్ని అల వాటు చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఎదగడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో గ్రహించి ఉంటారు. ఇక ముందు కూడా అదే ధోరణితో జీవితాన్ని కొనసాగించాలి. నిరంతరం చదవాలి!పుస్తకాలు చదవడాన్ని మించిన గొప్ప అలవాటు మరొకటి లేదు. అది వజ్రాయుధం లాంటిది. తెలియని విషయాలను తెలుసు కోవాలనే ఉత్సుకత ఉండాలి. ఎవరో ఒక వ్యక్తితో మాత్రమే విందు ఆరగించే అవకాశం లభిస్తే, దాన్ని బతికివున్న వ్యక్తితో వినియోగించుకుంటారా లేక చనిపోయిన వారిలో ఎవరినైనా ఎంచుకొంటారా అని కొన్నిసార్లు కొందరు నన్ను అడుగుతూంటారు. దానికి, చదవడాన్నే సహచరుడిగా చేసుకుంటాననేది నా జవాబు. మనం బెంజమిన్ ఫ్రాంక్లిన్ పుస్తకాన్ని చదువుతూంటే, ఆయనతో కూర్చుని విందును ఆరగిస్తున్నట్లే లెక్క. ఆ మాటకొస్తే, ప్రపంచ చరిత్రలోని ఏ మహా వ్యక్తితోనైనా మనం గడపవచ్చు. నిజం చెప్పాలంటే, మనం వారితో చాలా సుదీర్ఘమైన విందు ఏర్పాటు చేసుకోవచ్చు. పుస్తక పఠనం ద్వారా మనం రకరకాల ఆలోచనా స్రవంతులను ఆకళింపు చేసుకున్న వారమవుతాం. నేను కాళ్ళున్న పుస్తకం లాంటివాడినని ఎవరో ఓసారి వ్యాఖ్యానించారు. నేర్చుకోవడంలో, చదవడంలో ఎంతో ఆనందం ఉంది. నేర్చుకోవడం జీవితాంతం సాగే ప్రక్రియ. జీవితాన్ని అదే ఆసక్తికరంగా మారుస్తుంది.చదువుకోవడంలో లక్ష్యం కేవలం విషయ పరిజ్ఞానం సంపా దించడం కాదు. తోటివారితో ఎలా మెలగాలో తెలుసుకోవడం. వారితో స్నేహ సంబంధాలను ఏర్పరచుకోవడం. ఇక్కడ కాలేజీలో, అంతకుముందు స్కూల్లో మీరు కొందరితో స్నేహం చేసి ఉండ వచ్చు. సన్మిత్రులు కూడా జీవితంలో ముఖ్యమే! విజయానికి నిర్వచనంవ్యాపారంలోనో, వృత్తి జీవితంలోనో, లేదా వ్యక్తిగత జీవితంలోనో విజయాన్ని లేదా సఫలత పొందడాన్ని ఎలా నిర్వచించు కోవాలనే ప్రశ్న కూడా ఎదురవుతుంది. అసలు జీవన సాఫల్యం అంటే ఏమిటి? ఇది గొప్ప ప్రశ్న. తొంభై ఏళ్ళు వచ్చేసరికి కుబేరులుగా మారిన వారిని నేను చాలా మందిని ఎరుగుదును. అలాగని వారి జీవితాలను విజయాలుగా అభివర్ణించలేం. వారి వారి రంగాల్లో చాలా ప్రఖ్యాతి వహించిన వారు కూడా నాకు తెలుసు. కానీ, వాటినీ విజయాలుగా భావించలేం. 70 ఏళ్ళు వచ్చేసరికి అందరూ ఇష్టపడే పురుషుడిని, లేదా స్త్రీని నేను ఎన్నడూ చూడలేదు. వారున్న హోదాలో కొనసాగాలని వారికి అనిపించవచ్చు. దాన్ని విజయంగా తప్ప, మరి ఏ విధంగా నైనా అభివర్ణించవచ్చు.మన పిల్లలు, జీవిత భాగస్వామి, సహోద్యోగుల ప్రేమను చూరగొంటే అది సఫలత అనిపించుకుంటుంది. అటువంటి వారిని తమ జీవితకాలంలో చూస్తూ వచ్చి 65 లేదా 70 ఏళ్ళ వయసుకు చేరినవారు జీవన సాఫల్యం పొందినట్లు లెక్క. ఎంతో ప్రజ్ఞాపాటవాలు ఉండి, సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతులు గడించుకుని ఉన్న వారిని చాలా మందిని చూశాను. కానీ, వారిలో ఏదో వెలితి. నలుగురి ప్రేమనూ చూరగొనలేని జీవితం ఎంత గొప్పదైనా అది వట్టి డొల్ల కిందే లెక్క! -
ఇస్రో బాహుబలి : భవిష్యత్తుకు బంగారు బాట
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల పరంపరలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకెళ్తోంది. తాజాగా ఇస్రో ఒక ప్రతిష్ఠాత్మక బాహుబలి రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఎల్వీఎం3–ఎం5 అనే బాహుబలిగా పేరుబడ్డ రాకెట్ ద్వారా 4,400 కేజీల జీశాట్–7ఆర్ (సీఎంఎస్–03) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది ముఖ్యంగా భారత నౌకాదళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసిన ప్రయోగం. ఈ ఉపగ్రహాన్ని భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తున ఉన్న జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి నవంబర్ 2న విజయవంతంగా ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. షార్ నుండి ఇంత బరువైన ఉపగ్రహాన్ని పంపడం ఇదే మొదటిసారి కావడం విశేషం.సీఎంఎస్–03 కమ్యూనికేషన్ ఉపగ్రహం పది సంవత్సరాల పాటు భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమిస్తూ సేవలు అందిస్తుంది. ఇంటర్నెట్ సౌకర్యాల కోసం ఇస్రో 2013లో ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించిన ‘జీశాట్ 7’ ఉపగ్రహ కాల పరిమితి ముగియడంతో శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నాలజీతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సీఎంఎస్–03ని తయారు చేసి పంపారు. మల్టీ–బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎస్–03 భారత ప్రధాన భూభాగంతో సహా విస్తారమైన సముద్రప్రాంతానికి సేవలను అందిస్తుంది. ఈ ఉపగ్రహం ‘సీ’, ‘ఎక్స్టెన్డెడ్ సీ, ‘క్యూ’ బ్యాండ్లలో వాయిస్, డేటా, వీడియోల కోసం ట్రాన్స్పాండర్ సౌకర్యాలనుఅందిస్తుంది. ఈ శాటిలైట్ కీలకమైన సముద్ర ప్రాంతంలో భారత నౌకా దళ కమ్యూనికేషన్ సామర్థ్యాలను గణనీయంగా పెంచడంలో ఎంతో సహాయ పడుతుంది.‘ఆత్మనిర్భర భారత్’కు దోహదం చేస్తూ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇక్కడే తయారు చేసి ప్రయోగిస్తున్న ఇటువంటి ఉపగ్రహాలు భారత కీర్తి కిరీటంలో కలికితురాళ్లుగా నిలిచిపోతాయి. ప్రస్తుత ఉపగ్రహ ప్రయోగ విజయం... విక్రమ్ సారాభాయ్ దూరదృష్టికీ, అబ్దుల్ కలాం స్ఫూర్తికీ, సతీష్ ధావన్ నిబద్ధతకూ, ఇస్రో శాస్త్రవేత్తల కఠోరశ్రమకూ ప్రతీక. ఇస్రో కేవలం రాకెట్లు ప్రయోగించడమే కాదు, భారత భవి ష్యత్తును అంతరిక్షంలో సువర్ణాక్షరాలతో లిఖిస్తోంది. ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?– వి. సుధాకర్ -
ప్రాణాలు పోతున్నా పాఠాలు నేర్వరా?
మరోసారి తెలుగు నేలపై గుడిలో జరిగిన తొక్కిసలాటలో భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శనివారం నాడు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో కార్తిక ఏకాదశి సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొక్కిసలాటలో రైలింగ్ విరిగి పోయి భక్తులు ఒకరి మీద ఒకరు పడి అక్కడికక్కడే 9 మంది మర ణించారు. తీవ్రంగా గాయాల పాలైన భక్తులు మరికొందరు ఉన్నారు యథావిధిగా పాలకులు జరిగిన దుర్ఘటనకు దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఆలయాల వద్ద పర్వదినాలలో భక్తులు ఎంతమంది వస్తారో అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోకపోవడం ఆలయ నిర్వాహకుల వైఫల్యమే. అంబులెన్సులు కూడా అందుబాటులో లేకపోవడం ఆందోళనకరమైన విషయం. అది ప్రైవేట్ ఆలయమనీ, నిర్వాహ కులు భక్తులకు భద్రతా విషయంలో సరియైన చర్యలు తీసుకోలేదనీ స్వయానా ముఖ్యమంత్రి ఆరోపించడం గమనార్హం. సహజంగా ప్రైవేటైజేషన్ పాలసీని మనసా వాచా కర్మణా ఆహ్వానించి సమర్థించే మనిషి ఆలయం విషయంలో అది ప్రైవేటు వ్యక్తి నడిపిస్తున్నా డనీ, దానిలో భద్రతా చర్యలు కొరవడ్డాయనీ, అధికారులకు సరైన సమాచారం లేదనీ ఆరోపించడం వింతగా ఉంది. దేవుడి విషయంలో భక్తులకు అది ప్రైవేట్ ఆలయమా, లేక టీటీడీ నిర్వహి స్తున్న ఆలయమా అనే విచక్షణ ఉండదు. వాళ్లకు దేవుడు, భక్తి ప్రధానం కానీ ఆలయ నిర్వాహకులు కాదు.ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన సింహాచలంలో కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో కూడా వర్షా లకు తడిసి ఉన్న గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణం పాల య్యారు. అక్కడ కూడా సరైన భద్రతా ఏర్పాట్లు లేవనేది సుస్పష్టం.ఈ సంవత్సరం జనవరిలో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్లు కొనుగోలుకై జరిగిన తోపులాటలో ఆరుగురు తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకొన్నారు. మరి తిరుపతిలో కొన్ని వేలమంది రక్షక భటులు భద్రతా పర్యవేక్షణ చేస్తుంటారు. భక్తుల క్యూలను ఎప్పటికప్పుడు నియంత్రి స్తుంటారు. అయినా భక్తుల తోపులాటలు తొక్కిస లాటల ముందు రక్షకభటుల పనితనం తెల్లబోయింది.కాశీబుగ్గ ఆలయం ప్రైవేటు వ్యక్తులది కావచ్చు. మరి సింహాచలం, తిరుపతి దేవస్థానాలు ప్రభుత్వమే నిర్వహిస్తున్నది కదా! మరి అక్కడ ఎవరిని నిందించాలి? పోయిన ప్రాణాలు తిరిగిరావు. దిగ్భ్రాంతి, ఎక్స్గ్రేషియా, సంతాపం అన్ని యథా ప్రకారమే జరిగాయి. కానీ ఎవరు పాఠాలు నేర్చుకుంటున్నట్లు కనపడటం లేదు. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నాలు కూడా మనం చూశాం. అధికారులు కూడా తాము చేయాల్సిందంతా చేశామని చేతులు ఎత్తేస్తే జరిగే ఘోర ప్రమా దాలు ఇలాగే ఉంటాయి. ఇవి ప్రకృతి విపత్తులు కావు, మానవ తప్పిదాలు మాత్రమే అని గమనించాలి.– శ్రీశ్రీ కుమార్ ‘ కవి–రచయిత -
50 ఏళ్ల శ్రమ ఫలం
అర్ధ శతాబ్దపు స్వప్నం సాకారమై క్రికెట్లో మన నారీమణులు సాధించిన ప్రపంచ కప్ విజయం వెనుక వారు ఎన్నో ఏళ్ళుగా ఎదుర్కొన్న పెను సవాళ్ళు, ఛీత్కారాలు ఉన్నాయి. అమ్మాయిల క్రికెట్ నిన్న మొన్నటి దాకా ఆటలో అరటి పండు లాంటిదే. ‘పురుషుల క్రికెట్లో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు?’ అని మిథాలీ రాజ్ను ఆ మధ్య ఓ జర్నలిస్ట్ అడిగాడు. ‘ముందు ఆ పురుష పుంగవులను కలిసి వారికిష్టమైన మహిళా క్రికెటర్ ఎవరో అడిగి తెలుసుకుని రండి’ అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చి పడేశారామె. చులకన భావం ఒక్కటే మన క్రికెట్ వనితల సమస్య కాదు. మన దేశంలో మహిళల క్రికెట్ చాలా కాలం పాటు ఓ మొక్కుబడి వ్యవహారంగానే ఉంటూ వచ్చింది. నిధుల కొరత, అరకొర సదు పాయాల వల్ల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి దేశాల క్రికెట్ ప్రమాణా లను అందుకోవడం మన అమ్మాయిలకు కష్టంగా ఉండేది. మన దేశంలో మగపిల్లలు క్రీడలపై ఆసక్తి చూపిస్తేనే అది తలిదండ్రులకు నచ్చదు. ఇక ఆడపిల్లల్ని ఆటలకు పంపడం గురించి చెప్పేదేముంది! బ్యాట్లయినా లేని రోజుల నుంచి...పురుషులతో పోలిస్తే చాలా ఆలస్యంగా మన మహిళలు అంత ర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు. 1976లో మన మహిళా జట్టు మొట్టమొదటి క్రికెట్ టెస్ట్ ఆడింది. కొన్ని సంవత్సరాల తరబడి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని సందర్భాలు 1980, 1990 దశ కాల్లో ఉండేవి. అప్పట్లో నిధుల కొరత వల్ల మన జట్టు ఫంక్షన్ హాళ్ళలో, స్కూలు బిల్డింగుల్లో బస చేసేది. అక్కడ ఎలుకలు, బొద్దింకలతో సహజీవనం చేయాల్సి వచ్చేదని తొలినాళ్ళలో భారత మహిళా జట్టు కెప్టెన్ గా ఉన్న శాంతా రంగస్వామి చెబుతోంది. టీమ్ మొత్తానికి కలిపి రెండు, మూడు బ్యాట్లు మాత్రం ఉండేవట! మిథాలీ రాజ్ ఆడిన రోజుల్లో కూడా సరైన టాయిలెట్ సదుపాయలు లేక పోవడాన్ని ‘శభాష్ మిథు’ బయోపిక్లో చూపించారు. ఇన్ని ఇబ్బందులున్నా అప్పట్లో శాంతా రంగస్వామితో పాటు, డయానా ఎడుల్జీ, నీతూ డేవిడ్, మిథాలీ, ఝులన్ గోస్వామి లాంటి మెరిక ల్లాంటి క్రికెటర్లు పుట్టుకొచ్చారు. 2005 ప్రపంచ కప్లో మన జట్టు ఫైనల్ దాకా వెళ్ళింది కూడా!అప్పట్లో రైల్వేస్ వారు మన మహిళా క్రికెటర్లకు ఉద్యోగాలిచ్చి ప్రోత్సహించేవారు. 2006లో మహిళల క్రికెట్ను బి.సి.సి.ఐ. పరిధి లోకి తీసుకొచ్చారు. అయితే మన క్రికెట్ బోర్డు వారు ప్రేమ కొద్దీ చేసిన పని మాత్రం కాదది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐ.సి.సి.) ఆదేశాల మేరకు మహిళల క్రికెట్ను బి.సి.సి.ఐ.లో విలీనం చేశారు. ఈ మార్పు తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. కనీసం రిజర్వేషన్ ఉన్న రైల్వే కంపార్ట్మెంట్లలో ప్రయాణం, కొన్నిసార్లు విమానయానం కూడా సాధ్యపడింది. ఆర్థికంగా కూడా మహిళా క్రికెటర్లు కొంత లాభపడ్డారు. ఇందిరా గాంధీతో 1975 నాటి తొలి భారత మహిళా క్రికెట్ జట్టు సీరియస్గా తీసుకోవడం మొదలైంది!హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతీ మంధాన, దీప్తీ శర్మ, షెఫాలీ వర్మ లాంటి కొత్త తరం రంగంలోకి దిగాక అమ్మాయిల క్రికెట్కి కొత్త కళ వచ్చింది. ఈ తరం అమ్మాయిలు ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో పాటు, తమ ఆట తీరులో కూడా దూకుడు పెంచారు. 2017 ప్రపంచ కప్ సెమీఫైనల్లో హర్మన్ ప్రీత్ ఆడిన ఇన్నింగ్స్ భారత మహిళల క్రికెట్లో గేమ్ ఛేంజర్. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్లో ఆమె కేవలం 115 బంతుల్లో అజేయంగా 171 పరుగులు చేసింది. హర్మన్ ఆడిన ఆ ఇన్నింగ్స్ మొత్తం క్రికెట్ ప్రపంచం విస్తుపోయేలా చేసింది. అప్పటి ఫైనల్లో కూడా మన జట్టు గెల వాల్సింది గానీ తొమ్మిది పరుగుల తేడాతో కప్ పోగొట్టుకుంది. ఆ ప్రపంచ కప్ తర్వాత మన క్రీడాభిమానులు అమ్మాయిల క్రికెట్ను కూడా సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టారు. ఫ్యాన్ ఫాలో యింగ్ బాగా పెరిగింది.2022 నుంచి మహిళా క్రికెటర్లకు పురుషులతో సరిసమానంగా మ్యాచ్ ఫీజ్ ఇవ్వాలని బి.సి.సి.ఐ. నిర్ణయించింది. అలాగే మహిళా ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) కూడా ప్రారంభించడం మరో ముఖ్యమైన పరిణామం. కడప జిల్లాలోని ఓ మారుమూల పల్లెకు చెందిన శ్రీచరణి ఈ డబ్ల్యూపీఎల్ ద్వారానే భారత జట్టులోకి వచ్చింది. శ్రీచరణి లాగానే డబ్ల్యూపీఎల్ వల్ల గ్రామాల నుంచి, దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి కొత్త క్రికెటర్లు వస్తున్నారు. అమన్ జోత్ కౌర్ తండ్రి ఒక వడ్రంగి. తండ్రి తయారు చేసిచ్చిన బ్యాట్తోనే ఆమె క్రికెట్లో ఓనమాలు దిద్దుకుంది. షెఫాలీ వర్మ మగవాళ్ల హెయిర్ కట్తో కనిపిస్తుంది. అందుకు కారణం ఆమె చిన్నప్పుడు మగపిల్లాడిగా నటిస్తూ మగవాళ్లతో కలిసి ఆడేది. గ్రామీణ వాతా వరణం నుంచి వచ్చిన ఈ కొత్త తరం అమ్మాయిలు కసిగా, నిర్భయంగా ఆడుతున్నారు. మంచి ఫలితాలు తెస్తున్నారు. మగవాళ్లతో పోటీ!2022 కామన్వెల్త్ క్రీడల్లో మన అమ్మాయిలు క్రికెట్లో రజత పతకం గెలుచుకున్నారు. 2023 ఆసియా క్రీడల్లో మన దేశానికి క్రికెట్లో మొట్టమొదటి స్వర్ణ పతకం మన మహిళా జట్టే అందించింది. ఇప్పుడు ప్రపంచ కప్లో జయకేతనం ఎగరవేశారు. 1983 విజయం పురుషుల జట్టును అమాంతంగా ఎలా సూపర్ స్టార్స్ను చేసిందో, ఈ గెలుపు మహిళల క్రికెట్లో కూడా ఒక సువర్ణాధ్యాయా నికి తెర లేపనుంది అనడంలో సందేహం లేదు. 2017లో హర్మన్ ఆడిన ఇన్నింగ్స్ లాగానే మొన్నటి సెమీ ఫైనల్లో జమీమా రోడ్రిగ్స్ సెంచరీ కూడా భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిపోతుంది. ఇకపై సూపర్ స్టార్డమ్ కేవలం మగ క్రికెటర్లకే పరిమితం కాకపోవచ్చు. వారు అమ్మాయిలతో పోటీ పడాల్సి రావచ్చు. వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్!సి. వెంకటేశ్వ్యాసకర్త జర్నలిస్ట్, స్పోర్ట్స్ కామెంటేటర్ -
పేదరికాన్ని జయించిన ‘దేవభూమి’
కేరళ రాష్ట్రానికి ‘దేవభూమి’ అనే పేరుంది. కేరళీయులు తమ రాష్ట్రాన్ని దేవుడి సొంతిల్లు (గాడ్స్ ఓన్ కంట్రీ) అని సగర్వంగా చెప్పుకొంటారు. ఇప్పుడు వాళ్లు సగర్వంగా చెప్పుకొనే మరో ఘనత కూడా వారి సొంతమైంది. నవంబర్ 1 నుంచి తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా ప్రకటించుకుని కేరళ చరిత్ర సృష్టించింది. కటిక పేదరికం తుడిచి పెట్టుకుపోవడం అన్నది ఓ స్ఫూర్తిదాయక విజయం.ఎందుకంటే, దేశంలో అనేక రాష్ట్రాలో పేదరికం తీవ్రంగా ఉంది. బిహార్, ఉత్తరప్రదేశ్లలో ఇది ఏకంగా 37%. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన 1956 నవంబర్ 1న కేరళ ఏర్పడింది. అప్పటి నుంచి ప్రస్తుతం అధికారంలో ఉన్న పినరయి విజయన్ ప్రభుత్వం వరకు వామపక్ష పార్టీల కూటములు దాదాపు 40 ఏళ్లు అధికారంలో ఉంటే, మిగతా కాలం కాంగ్రెస్ కూటములు పాలన సాగించాయి. 1973–74 నాటికి కేరళలో పేద రికం 59.8%. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం సంక్షేమ రాజ్య స్థాపన కావాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది. దేశంలో ఏ ఒక్క వ్యక్తీ ఆకలితో పస్తు పడుకోని విధంగా పాలన సాగించాలని గాంధీజీ చెప్పేవారు. అధికారంలో ఉన్నవారు ‘పేదరికం లేని సమాజం’ తమ లక్ష్యం అని ఘనంగా చాటుకొంటుంటారు. అయితే, దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో ఆ అడుగులు ఎంత వేగంగా పడ్డాయన్నదే ప్రశ్న!అన్ని సూచికల్లో మిన్ననిజానికి కేరళలో మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలతో పోల్చిచూసినపుడు భారీ పరిశ్రమల్లాంటివి కనిపించవు. అయినప్ప టికీ, మానవాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి సూచికలలో అగ్రగామిగా నిలుస్తోంది. ‘పేదరిక నిర్మూలన’లో 2021లో నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆధ్యయన పత్రం ప్రకారం, అన్ని రాష్ట్రాలకంటే కనిష్ఠంగా 0.71%గా ఉన్నట్లు తేలింది. 2026 మార్చ్ నాటికి 0.002 శాతానికి చేరనుందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తేల్చాయి. ఈ ఏడాది మార్చ్ నుంచి రాష్ట్రావతరణ దినోత్సవమైన నవంబర్ 1 నాటికి రాష్ట్రాన్ని ‘నో పావర్టీ స్టేట్’ (పేదరిక రహిత రాష్ట్రం)గా చేయాలని సంకల్పించి, ఆ లక్ష్యానికి అనుగుణంగానే ‘జీరో హంగర్’ (సున్నా ఆకలి) రాష్ట్రంగా తీర్చిదిద్దడం విశేషం. పినరయి విజయన్ ప్రాతి నిధ్యం వహిస్తున్న ‘ధర్మదాం’ నియోజక వర్గం ఇప్పటికే దేశంలో పేదరిక రహిత నియోజకవర్గంగా ప్రకటించ బడింది. ఎలా సాధ్యమైంది?కేరళలో తొలి నుంచి ప్రజాచైతన్యం ఎక్కువ. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో జరిగిన సాంస్కృతిక, సంస్కరణోద్యమాలు ప్రజ లలో సామాజిక అంశాలపై అవగాహన కల్పించాయి. అక్కడ మొద ట్నుంచీ స్థానిక ప్రభుత్వాలు బలంగా పని చేస్తున్నాయి. స్థానిక సంస్థలకు ఉన్న 29 అధికారాలు మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి బదిలీ చేయడం అన్నది దేశంలో ఒక్క కేరళలోనే జరిగింది. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాలలో స్థానిక ప్రభుత్వాల కృషి సత్ఫలితాలను ఇస్తోంది. 2025 నాటికి కేరళలో అక్షరాస్యత 96 శాతం. ఇక, రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 5,415 ఉన్నాయి. ‘స్త్రీ క్లినిక్స్’ పేరుతో వీటిని నిర్వహిస్తున్నారు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ఎంతో జవాబుదారీతనంతో పేషంట్లను చూస్తారన్న పేరు తెచ్చుకొన్నారు. మహిళల ప్రసూతి సమయంలో శిశువుల మరణాల సంఖ్య ప్రతి వెయ్యి కాన్పులకు 5 మాత్రమే! జాతీయ సగటు ప్రతి వెయ్యికి 28గా ఉంది. రాష్ట్రంలో సగటు జీవిత వయస్సు 77.28 ఏళ్లుగా ఉంటే, జాతీయ సగటు 70.77. రక్షిత నీటిని అందించడం, పర్యావరణానికి అధిక ప్రాధాన్యం కల్పించడం, వైరస్లు, అంటువ్యాధులు వంటి వాటిని ఆదిలోనే సమర్థంగా ఎదుర్కోవడం వంటి చర్యల సామాన్య ప్రజల ప్రాణాలకు భరోసా కల్పిస్తోంది. పేదరికంపై యుద్ధంపలు రంగాలలో అభివృద్ధి సాధనకు కేరళ అనుసరిస్తున్న విధా నాన్ని ‘కేరళ మోడల్’గా పిలుస్తారు. దీన్ని దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు వివిధ రంగాలలో అనుసరిస్తున్నాయడంలో అతిశయోక్తి లేదు. పేదరికంతో మగ్గుతున్న కుటుంబాలను గుర్తించడానికి 2021లో కేరళ ప్రభుత్వం క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టి, రాష్ట్రంలో అత్యంత పేదరికంలో మగ్గుతున్న కుటుంబాల సంఖ్య 64,006 అని గుర్తించింది. పేదరికం లెక్కింపునకు కుటుంబ ఆదాయం, వారు తింటున్న తిండి, ఆరోగ్య ప్రమాణాలు, సొంత ఇంట్లో ఉంటున్నారా లేక అద్దె ఇల్లా, సదరు ఇల్లు ఏ విధంగా ఉంది... ఇత్యాది అంశాలను ప్రామాణికంగా తీసుకొన్నారు. ఈ కుటుంబాలలో చాలామటుకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటివి లేవు. దీంతో, వారికి వెనువెంటనే కల్పించే సదుపాయాలతోపాటు దీర్ఘకాలంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళికలు రూపొందించారు. 21,263 కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చి, వారికి రేషన్ అందేలా చేశారు. 4,000 కుటుంబాలకు ఇండ్లు కట్టించి ఇచ్చారు. మరో 1,500 కుటుంబాలకు సాగుభూమి అందించారు. శిథిలావస్థకు చేరుకొన్న వాటిల్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు ఇళ్ల మర మ్మత్తు కోసం రూ. 2 లక్షల సహాయం అందించారు. కేరళ ప్రతి ఏటా 11 శాతం ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. దాదాపు మూడున్నర కోట్ల జనాభా గలిగిన కేరళ బడ్జెట్ ఏటా 12 శాతం వృద్ధితో సగటున 2 లక్షల కోట్లు దాటుతోంది. రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తున్న రుణాలు కేంద్రం విధించిన పరిమితి అయిన స్థూల ఉత్పత్తిలో 3 శాతం మించకుండా ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా ఉంది కనుకనే, నేలవిడిచి సాము చేయకుండా ఏర్పరుచుకొనే నిర్దిష్ట లక్ష్యా లను నిర్ణీత కాలంలో పూర్తి చేయగలుగుతోంది.అలాగని, పినరయి విజయన్ పాలనలో వైఫల్యాలు లేవా అంటే... ప్రతిపక్ష పార్టీలు చేసే ఆరోపణల్ని పరిగణనలోకి తీసుకొంటే చాలానే కనబడతాయి. వ్యక్తిగతంగా ఆయనపై అనేక ఆరోప ణలున్నాయి. అయితే, కేరళ సాధించిన విజయాలను చూసినప్పుడు ప్రభుత్వ నిర్మాణాత్మక చర్యలను అభినందించాల్సిందే. పేదరికంపై విజయం సాధించడం చిన్న విషయమేమీ కాదు. ఈ ఘన విజయాన్ని భారతీయులందూ ఆస్వాదించాలి, స్ఫూర్తి పొందాలి. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,ఏపీ శాసన మండలి సభ్యులు -
పరేశ్ రావల్ (నటుడు) రాయని డైరీ
సినిమాలో దమ్ము లేదని టాక్! దమ్ము ఉందా లేదా అన్నది కాదు, అసలైతే ‘టాక్’ ఉంది. అది కదా ఒక మంచి సినిమాకు నిజంగా ఆదరణ. సినిమా చూసేసి, ఖాళీ పాప్కార్న్ బకెట్ను సీటు దగ్గరే వదిలేసినట్లు, సినిమాను సినిమా హాల్లోనే వదిలేసి పోతే... అప్పుడు కదా ఆ సినిమా పోయినట్లు! ‘‘పరేశ్జీ! మీరెందుకు ఇలాంటి సినిమాను ఎంచుకున్నారు? పైగా మీరొక మాజీ లోక్సభ ఎంపీ. ఇంకా పైగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్పర్సన్! కళంకం కాదా ఆ స్థానానికి?!’’శుక్రవారం రిలీజ్ అయిన ‘ద తాజ్ స్టోరీ’ గురించే ఈ ప్రశ్నలన్నీ! నేనేమీ ప్రెస్ మీట్ పెట్టలేదు. వాళ్లే వచ్చి ప్రశ్నల మీట్ పెట్టారు. ‘‘చూడండీ ఒకటి చెబుతాను. ఏ నటుడూ సినిమాను ఎంచుకోడు. సినిమానే నటుడిని ఎంచుకుంటుంది. ‘తాజ్ స్టోరీ’లోని విష్ణుదాసు తన పాత్ర కోసం ఈ ముంబయిలో నన్ను వెతికి పట్టుకున్నాడు’’ అన్నాను.‘‘కానీ పరేశ్జీ, ఆ విష్ణుదాసు... తాజ్మహల్ కింద నిజానికి ఏం ఉండేదో వెలికి తీసేందుకు తవ్వకాలు జరిపించాలని కోర్టు సీన్లో వాదిస్తున్నాడు. అంటే, ఆ పాత్రలో మీరు వాదిస్తున్నారు. ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారు పరేశ్జీ?’’ – మరో ప్రశ్న.‘‘ఎందుకు?’’ అనే ప్రశ్నకు నా దగ్గర ఎప్పుడూ సరైన సమాధానమే ఉంటుంది. అయితే అది అర్థం చేసుకోటానికే సరైన మనుషులు ఉండాలి. నేను ఎప్పుడూ అహ్మదాబాద్ వెళుతుండే వాడిని. ఎందుకంటే అక్కడ నా సిస్టర్ ఉండేవారు. నేను ముంబైలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీనే ఇష్టపడుతుంటాను. ఎందుకంటే ఢిల్లీకి మనోహరమైన చరిత్ర ఉంది. అక్కడ స్వీట్స్ కూడా బాగుంటాయి. ‘‘పరేశ్జీ, మీరెంతో మనోహరమైనవిగా భావించే ఢిల్లీ చరిత్ర పుటల కంటే కూడా దేశ ప్రజల మనోభావాలు మరింత మనోహరమైనవి, తియ్యనైనవి. కానీ మీరేం చేస్తున్నారు! విష్ణుదాసు అవతారం ఎత్తి, తాజ్ మహల్ను తవ్వి తీయిస్తే ఏదో బయట పడుతుందని ఆశిస్తున్నారు. ఎందుకు మీరిలా చేస్తున్నారు పరేశ్జీ... అదీ, దేశం కొద్దో గొప్పో ప్రశాంతంగా ఉన్న ఈ సమయంలో!’’ – ఇంకొక ప్రశ్న.కళాస్వేచ్ఛ గురించి ఈ విమర్శకులకు ఎందుకు పట్టదు! ‘‘మోదీజీని మెప్పించేందుకే మీరు విష్ణుదాసు పాత్రను భుజం మీద వేసుకున్నారని తెలుస్తూనే ఉంది పరేశ్జీ. తాజ్ మహల్ ఒకప్పుడు హిందూ రాజు రాజభవనం అని, షాజహాన్ దానిని స్వాధీనం చేసుకుని ముంతాజ్ మహల్ సమాధిగా మార్చాడని సినిమాలో మీరు వాదించటం చూస్తే అలాగే అనిపిస్తోంది’’ అని మరొక యక్షుడు!‘‘భారతీయ కళాకారులకు ‘పీఆర్’ లేకపోవడం వల్ల వామపక్ష చరిత్రకారులు గతాన్ని వక్రీకరించి మొఘలులను కీర్తించారని ఆ సీన్లో విష్ణుదాసుగా మీరు ఆరోపించడం కూడా మోదీజీ కోసమే కదా?’’ – ఇంకో ప్రశ్న!మహా భారతంలో ధర్మరాజును పరీక్షించింది ఒకరే యక్షుడు. శుక్రవారం కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు సవా‘లక్షులు’! ‘‘మంచిది మిత్రులారా! మరొక సినిమాతో, మరొక శుక్రవారం కలుద్దాం’’ అన్నాను, నవ్వుతూ పైకి లేస్తూ. ‘‘చివరి ప్రశ్న పరేశ్జీ, ఆ మరొక సినిమా కూడా ఇలాగే, ఈ ‘తాజ్ స్టోరీ’లానే ఉంటుందా?’’ – వ్యంగ్యం. నేనూ వారికి చివరి జవాబు ఇచ్చాను. ‘‘కొరుకుడు పడని కాలాల మీద నేను మనసు పడతాను. కొరుకుడు పడని మనుషుల మీద ఆ కాలాల వలను విసిరి, వారిని పడతాను’’ అన్నాను. ‘‘అర్థం కాలేదు పరేశ్జీ’’ అన్నారు!‘‘ఒక సినిమా ఆడనంత మాత్రాన ఇక సినిమాలనే తీయకూడదని కాదు’’ అని వారికి విడమరిచి చెప్పవలసి వచ్చింది. -
కొనడం కన్నా మానడం మేలు
రష్యాకు చెందిన ‘రోస్నెఫ్ట్’, ‘ల్యూక్ ఆయిల్’ కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెడుతూ అక్టోబరు 22న అమెరికా తీసు కున్న నిర్ణయం రష్యానూ, రష్యా చమురు కొంటున్న దేశాలనూ ఉక్కిరిబిక్కిరిచేస్తోంది. రష్యా ముడిచమురు ఆదాయంలో 57 శాతం ఈ రెండు దిగ్గజసంస్థల ద్వారానే సమకూరుతుంది. ఇతర చిన్నాచితకా కంపెనీల ద్వారా మిగిలిన 43 శాతం లభిస్తోంది. చిన్న కంపెనీల మీద ఎలాంటి ఆంక్షలు విధించనప్పటికీ, ఇండియా వంటి ప్రధాన చమురు దిగుమతి దేశాల మీద అమెరికా చర్య ప్రభావం గణనీయంగా ఉంటుంది. బ్లాక్ లిస్టెడ్ కంపెనీల నుంచి కొనుగోళ్లు చేయ బోమని ఇండియా చమురు కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి.రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతులు ఒకప్పుడు కేవలం1 శాతం ఉండేవి అలాంటిది ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అవి 38 శాతం గరిష్ఠ స్థాయికి పెరిగాయి. ఇండియా ఇలా రష్యా ముడి చమురు కొంటూ పుతిన్ యద్ధానికి పరోక్షంగా మద్దతు ఇస్తోందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. చౌకగా లభిస్తున్నందువల్లే దేశ ప్రయోజనాల దృష్టిలో తాము రష్యా చమురు కొంటున్నామని భారత ప్రభుత్వం ఈ ఆరోపణను కొట్టివేసింది. ఇండియా సందిగ్ధంఅమెరికా తాజా నిర్ణయంతో ఇండియా సందిగ్ధంలో పడింది. ఏదో ఒక విధంగా రష్యా చమురు కొనుగోళ్లను కొనసాగించడమా, లేదంటే రష్యా చమురుకు పూర్తిగా దూరం కావటమా అన్నది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. నిజానికి రెండు సర్వసత్తాక దేశాల నడుమ ద్వైపాక్షిక వాణిజ్యం ఎలా జరగాలో శాసించే హక్కు అమెరికాకు లేదు. తమ కంపెనీలు రెండిటిని అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టినప్పటికీ, చమురు ఎగుమతులు నిలిపివేయాలని రష్యా భావించడం లేదు. కానీ బ్లాక్ లిస్టెడ్ కంపెనీలతో వ్యాపారం చేసే దేశాల మీద అమెరికా ద్వితీయ స్థాయి ఆంక్షలు విధించే అవకాశం ఉన్నందున, అంత రిస్కు తీసుకుని రష్యా చమురు కొనాలా వద్దా అనేది ఇండియా, చైనా వంటి దిగుమతిదారులు తమకు తాముగా తీసు కోవలసిన నిర్ణయం. ఇప్పుడు ఇండియా ముందు రెండు మార్గాలు ఉన్నాయి. అమె రికా ఆంక్షలు విధించినా సరే రష్యా చమురును ఇకమీదటా కొనడం వాటిలో ఒకటి. అమెరికా ఆంక్షలు వర్తించకుండా దళారుల ద్వారా సమకూర్చుకునే వీలుంది. రష్యా రహస్యంగా నడుపుతున్న రహస్య (షాడో) ట్యాంకర్ల ద్వారానూ తెప్పించుకోవచ్చు. ఏదో విధంగా చౌక ధరలకు రష్యా చమురు తెప్పించుకోవడం సాధ్యమే. అయితే ఈ చర్యలు ట్రంప్కు ఆగ్రహం కలిగిస్తాయి. చపల చిత్తుడైన ట్రంప్ఆంక్షలను ధిక్కరించడం తెలివైన పని అనిపించుకోదు. ట్రంప్తో ఢీకొనడం అంటే, తలను రాతి గోడకేసి కొట్టుకోవడమే. అమెరికాతో తలపడటంలో మన కంటే గట్టిదైన చైనా సైతం ఆ రెండు రష్యాకంపెనీల నుంచి కొనుగోళ్లు నిలిపి వేస్తామని సూచనప్రాయంగా వెల్లడించింది.వాణిజ్య ఒప్పందమే ఆచరణీయంట్రంప్తో తల గోక్కోవడం కంటే, ఆచరణీయ వైఖరి అవలంబించాలి. విస్తృత వ్యూహాత్మక లక్ష్యాలకు ముప్పు వాటిల్లని రీతిలో, దౌత్య ఇంధన ఆర్థిక ప్రయోజనాలను సమతుల్యం చేసేట్లు ఈ వైఖరి ఉండాలి. ఇది రెండో మార్గం. మన చేతిలో ఉన్న ముక్కలతోనే మనం ఆడాలి. సమకాలీన భౌగోళిక రాజకీయాల్లో ఆచరణవాదమే నడుస్తోంది. ఇండియా భిన్నంగా వ్యవహరించలేదు. అమెరికా ఒత్తిడికి లొంగిపోతున్నామా అన్నది ముఖ్యం కాదు. దేశానికి గరిష్ఠ ప్రయోజనం దేనివల్ల సిద్ధిస్తుందో ఆ మార్గాన్ని ఎంచుకోవాలి.ఒకటి: ఆంక్షలకు గురికాని రష్యా ఇంధన కంపెనీల నుంచి కొను గోళ్లు చేసే అవకాశం ఇప్పటికీ ఉంది. రోస్నెఫ్ట్, ల్యూక్ఆయిల్ నుంచి కాకుండా మిగిలిన రష్యా కంపెనీల నుంచి కొంటే అమెరికా సెకండరీ ఆంక్షలు వర్తించవు. ఆంక్షలు ఆ రెండు కంపెనీల మీదే కానీ రష్యా ఆయిలు మీద కాదు. అయినా సరే ఇది అనుకున్నంత సులభం కాదు. రెండు: అమెరికా ఆంక్షలను ఇండియా తోసిరాజన గలదా, ఆ సాహసం ఫలితమిస్తుందా, అమెరికాతో ముడిపడి ఉండే విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని మాత్రమే రష్యా చమురు కొనుగోళ్ల కొనసాగింపుపై ఒక నిర్ణయానికి రావలసి ఉంటుంది.ఇండియా వస్తువుల మీద ట్రంప్ తొలుత విధించిన 25 శాతం సుంకాలను వీలైనంత తగ్గించేలా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలి. అదే సమయంలో రష్యా నుంచి చమురు కొను గోళ్లను నిలిపివేసినట్లయితే, తరువాత మోపిన 25 శాతం అదనపు సుంకాలను కూడా తగ్గించడానికి లేదా రద్దు చేయడానికి వీలు ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, అమెరికాతో సానుకూల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోడానికి అనువుగా రష్యా చమురుకు స్వస్తి పలికే అంశాన్ని పరిశీలించాలి. ప్రతిష్ఠ స్థానే ప్రయోజనాలుట్రంప్ ఏకపక్ష ఆంక్షలను తోసిరాజన్నట్లయితే, దేశ గౌరవం ఇనుమడిస్తుంది. కానీ దానివల్ల ఒనగూరే ప్రయోజనాలు పరిమిత మైనవి. వాటి కంటే మనం ఎదుర్కొనే రిస్కులు ఎక్కువ. కాబట్టి, అమెరికా విధానంలో మార్పు కోసం రష్యా నుంచి చమురు కొను గోళ్లను నిలిపివేసే ఆలోచన చేయాలి. తద్వారా, దక్షిణాసియాలోఇండియాకు వ్యతిరేకంగా ట్రంప్ అవలంబిస్తున్న ప్రతికూల భౌగో ళిక రాజకీయ వైఖరికి తెరపడుతుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రాంతీయ బలాబలాల సమతౌల్యాన్ని సానుకూల రీతిలో పునురు ద్ధరించుకునేందుకు అమెరికా సహకారం తీసుకుని తీరాలి. ప్రాంతీ యంగా వారి వ్యూహాత్మక ప్రయోజనాలకూ ఢోకా ఉండదన్న భరోసా ఇవ్వాలి. స్పష్టంగా చెప్పాలంటే, రష్యా చమురు కంపెనీల మీద అమెరికా ఆంక్షలు ధిక్కరించడానికి ఇండియాకు ఉన్న అవకాశాలు పరి మితం. ఈ తప్పనిసరి పరిస్థితి నుంచి ఎంతో కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేయాలి. కీలకమైన తన వ్యూహాత్మక ప్రయోజనాలు పరిరక్షించేట్లయితే, రష్యాపై ఆంక్షల పట్ల అభ్యంతరం లేదనిఇండియా ప్రతిపాదించాలి. జాతి గౌరవం, దేశ ప్రతిష్ఠ అంటూ అతిశయాలకు పోతే ప్రయోజనం ఉండదు. -వ్యాసకర్త ‘కౌన్సిల్ ఫర్ స్ట్రేటజిక్ డిఫెన్స్ అండ్రిసెర్చ్’ వ్యవస్థాపక డైరెక్టర్ (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-హ్యాపీమాన్ జాకబ్ -
ఆపత్కాలంలో ఆసరా ఏది?
తెలుగు రాష్ట్రాలను కంటి మీద కునుకు లేకుండా చేసిన మొంథా తుపాను చివరకు ప్రశాంతంగా ముగిసినా ఎడతెరిపి లేని వర్షాలతో లక్షలాది ఎకరాల పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. రెండు చోట్లా నదులూ, వాగులూ, వంకలూ, గెడ్డలూ ఉద్ధృతంగా ప్రవహించి కట్టలు తెంచుకుని జనావాసాలను ముంచెత్తాయి. సముద్రంలో పెను తుపానుగా బలపడి ప్రళయ భీకర రూపంతో భయపెడుతూ వచ్చిన తుపాను, తీరానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఏర్పడిన ‘విండ్ షీర్’(గాలికోత) ధాటికి విచ్ఛిన్నమై శాంతించిందని వాతావరణ నిపుణులంటున్న మాట. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని తీరప్రాంతాల్లో 15 లక్షల ఎకరాల్లోని వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరి విస్తీర్ణమే 11 లక్షలంటున్నారు. తెలంగాణలో దాదాపు 14 జిల్లాలు మొంథా ప్రభావంతో కుండపోత వర్షాలతో ఇక్కట్లపాలయ్యాయి. పలు జిల్లాల్లో పంటలు దెబ్బతినటంతో పాటు కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం సైతం నీట మునిగింది. ప్రకృతి వైపరీత్యాల ఆనవాళ్లను ముందుగా గుర్తించే సాంకేతికత అందుబాటులో కొచ్చి తుపాను తాకిడి ప్రాంతాల్లోని ప్రజలను సహాయ శిబిరాలకు తరలించటం సులభ మవుతోంది. కానీ అది మాత్రమే సరిపోదు. విపత్తులొస్తే... పంట నష్టం ఏర్పడితే జరగ గల నష్టాన్ని అంచనా వేసుకుని పంటల బీమా పథకాలను అమలు చేయాలి. ఇన్పుట్ సబ్సిడీలివ్వాలి. రైతులకు ఆసరాగా నిలిచే ‘రైతు భరోసా’ వంటి పథకాలుండాలి. ఆర్బీకేలు అన్ని విధాలా సాయపడాలి. పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలుండాలి. ఎన్నో తుపాన్లు చూశానని ఏపీ ముఖ్యమంత్రి స్వోత్కర్షకు పోతున్నారు. నిజమే... ఆయన వచ్చి నప్పుడల్లా అయితే తుపాన్లు లేదా కరువు కాటకాలు రివాజైన సంగతి తెలుసు. మరి ఎన్నో తుపాన్లు చూసిన నేతకు ఆపత్కాలంలో అక్కరకొచ్చే ముందస్తు చర్యలు తీసు కోవాలన్న స్పృహ ఎందుకు అడుగంటింది? అంతకుముందు జగన్ ప్రభుత్వ హయాంలో 85 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగేలా దాదాపు 70 లక్షల ఎకరాల్లో ఉచిత పంటల బీమా పథకం అమలు చేశారు. అందువల్ల విపత్తుల బారిన పడిన 54.5 లక్షలమంది రైతులకు రూ. 7,802 కోట్లు బీమా పరిహారం లభించింది. కానీ తన ఏలుబడి మొదల య్యాక బాబు వీటన్నిటినీ ఎలా విస్మరించగలిగారు? ఆర్బీకేలను భ్రష్టుపట్టించారు. ఇన్పుట్ సబ్సిడీలు అటకెక్కాయి. నిరుడూ, ఈ ఏడాదీ ఈ సబ్సిడీల రూపేణా ఒక్క రూపాయి అందించింది లేదు. బాబు సర్కారు నిర్వాకం వల్ల ఇప్పుడు పంట రుణాలు తీసుకున్న 19 లక్షల మంది రైతులకు మాత్రమే బ్యాంకులు కల్పించిన బీమా సదు పాయం ఉంది. మొంథా వల్ల తీవ్రంగా నష్టపోయిన మిగతా 66 లక్షల మంది రైతులు ఏం కావాలి? ‘రైతు భరోసా’ పేరు మార్చి ‘అన్నదాత సుఖీభవ’ అన్నారు. పేరేదైతేనేం... ఈ రెండేళ్లలో ప్రతి రైతుకూ ఇంతవరకూ రూ. 40,000 చొప్పున నగదు అందాలి. కానీ ఇచ్చిందెంత? కేవలం రూ.5,000! అనుభవశాలి చేయాల్సిన పనేనా ఇది?! ప్రభుత్వం నుంచి ఏదో రూపేణా సాయం అందుతుంటే, పంటలకు బీమా సదు పాయం ఉంటే, దిగుబడులకు గిట్టుబాటు ధరలు అందజేస్తే ఇలాంటి కష్టకాలంలో నిండా మునిగిపోయామన్న దిగులు రైతులను ఆవరించేది కాదు. అవన్నీ ఎగ్గొట్టినందుకు దోషిగా నిలబడాల్సింది పోయి రైతులతో ఆయన పరిహాసమాడుతున్నారు. ప్రచార యావ శ్రుతి మించి ఆర్టీజీఎస్ కేంద్రంలో కూర్చుని తుపాను నిలువరించినట్టు తెగ ప్రచారం చేసుకుంటున్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలు తిండి, నీళ్లు లేక అలమటిస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలు అసలు చూస్తున్నారా? అక్కడక్కడ తూ తూ మంత్రంగా సాయం చేసి చాటుకోవటం తప్ప బాధితులందరికీ అందజేయాలన్న సంకల్పం ఏదీ? కొన్నిచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ తదితర పక్షాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనటం కొంత ఊరట. ఎన్టీఆర్ జిల్లాలో ఒక పునరావాస కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ అందించిన ఆహారం తీసుకున్నారన్న కక్షతో అక్కడివారిని టీడీపీ పెత్తందార్లు వెళ్లగొట్టిన వైనం తెలుసా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. డబుల్ ఇంజన్ సర్కారని చెప్పుకుంటున్నారు గనుక బాధిత రైతులందరికీ తక్షణ సాయం అందించాలి. నష్టం అంచనాలు పక్కాగా ఉండాలి. నష్టపోయినవారికి సాధ్యమైనంత త్వరగా పూర్తి పరిహారం అందేలా చూడాలి. -
రైతుల కడుపు కొట్టేలా దిగుమతులా?
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇటీవలి బెర్లిన్ గ్లోబల్ డైలాగ్ సమావేశంలో సరైన వైఖరినే ప్రదర్శించారు. భారతదేశం తలకు పిస్తోలు గురి పెట్టి ఎవరూ బలవంతంగా ఒప్పందాలపై సంతకాలు చేయించలేరని తెగేసి చెప్పారు. అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థి తులను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన ధైర్యంగా పలికిన మాటలు నాకొక పాత సంఘటనను గుర్తుకు తెచ్చాయి. ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రధాన కార్యాలయం రోమ్లో ఉంది. ఒకప్పుడు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా కూడా ఉన్న జగ్జీవన్ రామ్ కోపంతో దాని సమావేశం నుంచి ఒక సారి వాకౌట్ చేశారని చెబుతారు. వ్యవసాయ శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఎం.ఎస్. స్వామినాథన్ చెప్పిన దాని ప్రకారం, ‘‘మీ వ్యవసాయ ఎగుమతులను మాపై రుద్దాలని చూస్తే సహించేది లేదు’’ అని అమెరికా సీనియర్ అధికారి ఒకరికి జగ్జీవన్ రామ్ నిస్సంకోచంగా చెప్పారు. ‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వివిధ హోదాలలో దాదాపు అందరు వ్యవసాయ మంత్రుల వద్ద పని చేశారు కదా! మీకు ఎవరు ఉత్తమమైన వ్యవసాయ మంత్రిగా తోచా’రని అడిగినపుడు స్వామినాథన్ పై ఉదంతం చెప్పారు. జగ్జీవన్ రామ్ 1974 నుంచి 1977 వరకు వ్యవసాయ, సేద్యపు నీటి శాఖ మంత్రిగా పనిచేశారు. కాచుకుని ఉన్న అమెరికావిస్తారమైన భారతీయ వ్యవసాయ మార్కెట్లోకి అడుగు పెట్టాలని అమెరికా ఏనాటి నుంచో కాచుకుని ఉందని మనం గుర్తుంచుకోవాలి. అమెరికాతో సాగుతున్న వాణిజ్య చర్చలలో భారత్ ఇంతవరకు దృఢ వైఖరినే అనుసరిస్తూ వస్తోంది. వ్యవసాయ, పాడి పరిశ్రమ, మత్స్య సంపదల రంగాలను కాపాడుకుని తీరుతామని చెబుతోంది. కానీ, మన దేశంలోని కొన్ని బలమైన వర్గాలు ఎప్పుడూ బహుళ జాతి కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు మొగ్గు చూపుతూ వస్తున్నాయి. ఆత్మనిర్భరత సాకుతో అవి తమ వైఖరిని సమర్థించుకుంటున్నాయి. అమెరికా సంస్థలకు ద్వారాలు తెరిస్తే– దేశంలోని పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, పాడిపరిశ్రమ, యాపిల్, ఇతర పండ్ల విభాగాల వారి ప్రయోజనాలను పణంగా పెట్టినట్లు అవుతుంది. అమెరికా సహజంగానే తన తదుపరి లక్ష్యంగా మొదట వరిని, తర్వాత గోదుమలను ఎంచుకుంటుంది. అమెరికా సిసలైన ప్రయోజనాలు వీటిలోనే ఇమిడి ఉన్నాయి. జన్యుపరంగా సవరించిన (జీఎం) యాపిల్స్, మొక్కజొన్న, సోయాబీన్ల ప్రవేశం వివాదాస్పదంగా మారడంతో, దానికి సంబంధించిన కార్యనిర్వాహక పత్రాన్ని నీతి ఆయోగ్ ఇప్పటికే ఉపసంహరించుకుంది. సుంకాలు లేని విధంగా పత్తి దిగుమతికి అనుమతిస్తున్నట్లుగానే, పాలు, పాల ఉత్పత్తులకు కూడా మార్కెట్ ద్వారాలు తెరవడం సముచితంగా ఉంటుందని వాదించే ఆర్థికవేత్తలు కొందరు తయారయ్యారు. కానీ, వారొక సంగతిని గ్రహించడం లేదు. అమెరికాలో సుమారు 8,000 మంది పత్తి రైతులున్నారు. అక్కడి వ్యవసాయ క్షేత్ర సగటు పరిమాణం 600 హెక్టార్లు. వారికి ఏటా లక్ష డాలర్లకు పైగా సబ్సిడీ అందుతుంది. అది అంతర్జాతీయ ధరలను తగ్గిస్తుంది. ఫలి తంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలలోని రైతులు దెబ్బతింటారు. మన దేశంలో పత్తి రైతులు 98 లక్షల మందికి పైగా ఉన్నారు. వారి కమతాలు సగటున 1 నుంచి 3 ఎకరాలు మాత్రమే. చౌక ధరలకు, సబ్సిడీ దిగుమతులను అనుమతిస్తే, అసలే అంతంత మాత్రంగా ఉన్న వారి బతుకు బండలవుతుంది. దానికి బదులు, దేశీయ పత్తి పరిశ్రమ మన రైతులకు అండగా నిలిస్తే, అది నిజంగా ఉభయ తారకమైనది అవుతుంది. పత్తి దిగుమతిపై సుంకాలు పైసా కూడా లేకుండా చేయడం ద్వారా, భారత్ తన రైతులను తోడేళ్ళ బారిన పడేసినట్లయింది. చౌక దిగుమతులతో రైతులకు నష్టంపప్పు ధాన్యాల విషయంలో సరఫరా–డిమాండ్ సూత్రం పనిచేయడం లేదు. పప్పు ధాన్యాల విస్తీర్ణం 3.07 కోట్ల హెక్టార్ల నుంచి గత ఐదేళ్ళలో 2.76 కోట్ల హెక్టార్లకు కుంచించుకుపోయింది. దానివల్ల డిమాండ్ కొద్దిగా పెరిగినా, ఆ మేరకు రైతుల మార్కెట్ యార్డు ధరలు ఏమీ పెరగలేదు. నిజానికి, వాటి ప్రస్తుత మార్కెట్ ధరలు, ప్రకటించిన కనీస మద్దతు ధరల కన్నా సుమారు 30 శాతం తక్కువగా ఉన్నాయి. దిగుబడి తగ్గడం వల్ల ఏర్పడిన వెలితిని చౌక దిగుమతులు భర్తీ చేయడమే దానికి కారణం. ఆ దిగుమతులు కూడా అవసరమైన దానికన్నా రెండింతలున్నాయి. చాలా రకాల చిక్కుళ్ళు సుంకాలు లేకుండా దిగుమతి అయ్యాయి. ఒక్క 2024–25లోనే 7.6 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకున్నారు. అలాగే, 2020 –21లో పప్పు ధాన్యాల దిగుమతికి రూ. 12,153 కోట్లను వెచ్చిస్తే, గడచిన ఐదేళ్ళలో దిగుమతి వ్యయం ఇప్పటికే అంటే 2024–25లో రూ. 47,000 కోట్లను దాటినట్లు వార్తలు సూచిస్తున్నాయి. వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించే నెపంతో జీఎం సోయా గింజల దిగుమతిని సమర్థించుకుంటున్నారు. నిజానికి, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని సోయా రైతులు గిట్టుబాటు ధర కోసం లబోదిబోమంటున్నారు. సోయాబీన్ కనీస మద్దతు ధరను క్వింటాల్ కు రూ. 5,328గా నిర్ణయించగా, మార్కెట్ ధరరూ. 3,500 నుంచి రూ. 4,000 మధ్య ఊగిసలాడుతోంది. ఒత్తిళ్లకు లొంగకూడదు!కేంద్రం తగిన నియమ, నిబంధనలను రూపొందించేంత వరకు జీఎం ఆహార పదార్థాల దిగుమతి, అమ్మకాలను నిలిపి వేయాలని రాజస్థాన్ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. దిగుమతులకు అది కాస్త బ్రేకు వేయవచ్చు. జీఎం సోయాబీన్ దిగుమతులకు ద్వారాలు తెరవవలసిందని అమెరికా గతంలోనూ మనపై ఒత్తిడి తెచ్చింది. బయోటెక్నాలజీ –ఫుడ్ సెక్యూరిటీ ఫోరమ్ (ఢిల్లీ) చేపట్టిన ఉద్యమం వల్ల, ఎట్టకేలకు భారతీయ రేవులకు అమెరికా సోయా బీన్ చేరగానే దాన్ని (దేశీయ ఉత్పత్తితో కలపకుండా) వేరుగా ఉంచా లని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆదేశించింది. అమెరికా సరఫరాదారులు తమ దేశంలోని సీనియర్ అధికారుల మద్దతుతో ఆ చర్యను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. కానీ, భారత్ ఆ ఒత్తిడికి తలొగ్గ లేదు. ఇప్పుడూ అదే రకమైన వైఖరిని అనుసరించాలి. ఆహార పదార్థాలను నౌకల నుంచి దించుకొనే దయనీయమైన పాత రోజులలోకి భారత్ మళ్ళీ జారి పోకూడదు.దేవీందర్ శర్మవ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
చుక్క నెత్తురు రాలకుండా...
బ్రిటిష్ పార్లమెంటులో 1947 జూలై 5న ప్రవేశపెట్టిన ‘ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్’ దరిమిలా భారత దేశంలో విభజన అల్లర్లు ఒక్కసారిగా ఊపందు కున్నాయి. మరోవైపు స్వతంత్రంగా ఉన్న 562 సంస్థానాలను సర్దార్ వల్ల భాయి పటేల్ ఆధ్వర్యంలో ‘స్టేట్స్ డిపార్ట్మెంట్’ ఒకటి ఏర్పాటుచేసి ‘ఇన్స్ట్రు మెంట్ ఆఫ్ యాక్సెషన్’ (విలీన ఒప్పందం) ద్వారా ఇండియాలో విలీనం చేయనారంభించారు. ఆగస్టు 15 నాటికి హైదరాబాద్, కశ్మీర్, జూనాగఢ్ మినహా మిగతా రాజ్యాలు చాలావరకు భారత దేశంలో కలసిపోయాయి. హైదరాబాదుతో పాటు భోపాల్,రాంపూర్, మహమూదాబాద్ వంటి 11 సంస్థానాలు ముస్లిం నవాబుల అధీనంలో ఉండేవి. కశ్మీరు, హైదరా బాదు అలీనంగా ఉండదలచుకుని విలీన పత్రంపైసంతకం చేయలేదు. కానీ, గుజరాత్లోని జూనాగఢ్ నవాబు మహబత్ ఖాన్ మాత్రం తన సంస్థానాన్ని పాకిస్తాన్లో కలపనున్నట్లు ఆగస్ట్ 14న వెల్లడించారు. జూనాగఢ్ దీవాన్ (ప్రధాని) షానవాజ్ భుట్టో (పాకిస్తాన్ మాజీ అధ్య క్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో తండ్రి), ముస్లిం లీగ్ నేత జిన్నాను సంప్రదిస్తూనే ఉన్నారు. వేరావలి పోర్టు నుండి పాకిస్తాన్ యుద్ధ సామగ్రి జూనాగఢ్ చేరు తున్న వార్తలు రావటంతో, ఇండియన్ నేవీ నౌకలను పర్యవేక్షణ కోసం అటు పంపా లనే పటేల్ సలహాను భారత నౌకాదళానికి చెందిన బ్రిటిష్ అధికారి అడ్మిరల్ జాన్ టి. హాల్ తోసిపుచ్చారు. ఆ తిరస్కారాన్ని పటేల్ సహించలేక పోయారు. నెహ్రూ తటస్థ వైఖరి కూడా ఆయనకు నచ్చలేదు. ‘24 గంటల్లో జూనాగఢ్కు భారత్ మిలిటరీ వెళ్లకుంటే, నేను కేబినెట్ నుండి తప్పుకుంటా’ అని ప్రధాని నెహ్రూకు అల్టిమేటం ఇచ్చారు. ఇంతలో హిందూ–ముస్లిం అల్లర్లు రాజుకున్నాయి. పటేల్ తీసుకున్న రాజ కీయ నిర్ణయంతో ఆ రోజు రాత్రి నెహ్రూ, గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్తో సుదీర్ఘ చర్చలు జరిపారు. మరుసటి రోజు జూనాగఢ్ సరిహద్దుప్రాంతాల్లోని భావనగర్, పోర్బందర్, నవానగర్లకు భారత సైన్యం, నౌకా బలగాలు చేరుకున్నాయి. ఇక ఏ క్షణంలోనైనా జూనాగఢ్ ప్యాలెస్ ముట్టడి జర గొచ్చు. పరిస్థితిని అర్థం చేసుకున్న నవాబ్ మహబత్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి 1947 అక్టోబరు 24న ప్రత్యేక విమానంలో కరాచీ వెళ్ళి పోయారు. నవంబరు 1న ఇండియన్ ఆర్మీ జూనాగఢ్ చేరుకుంది. తర్వాత దివాన్ షానవాజ్ భుట్టో రాష్ట్ర పరిపాలన యంత్రాంగాన్ని భారత్కు అప్పగించి పాకిస్తాన్ చేరుకున్నాడు. పటేల్ తీసుకున్న కఠిన నిర్ణయంతో ఏ రక్తపాతం లేకుండా జూనాగఢ్ భారత్లో కలిసిపోయింది. (జాన్ జూబ్రిజీకి రచన ‘డీత్రోన్’ ఆధారంగా)– జిల్లా గోవర్ధన్ ‘ మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబై(రేపు (31 October) సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి ) -
ఆరేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయి, ద మేకర్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్గా!
పుణేలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్టీఐఐ) గురించి ఇవాళ జాతీయంగానే కాదు... అంతర్జాతీయంగానూ బాగా తెలుసు. కానీ, 1961లో కేవలం రూ. 3 లక్షల వార్షిక బడ్జెట్తో ఆ సంస్థను ఆరంభించినప్పుడు దాన్ని ఇలాంటి ఓ వ్యవస్థగా తీర్చిదిద్దడం వెనుక ఉన్న అరుదైన వ్యక్తి గురించి కొద్దిమందికే తెలుసు. ఆయన... జగత్ మురారి (1922–2007). స్వయంగా ఫిల్మ్మేకరైన ఆయన జీవితకథ, ఆయన సారథ్యంలో సినీ సృజనాత్మక కార్యశాలగా ఎఫ్టీఐఐ అవతరించిన కీలక సమయం, సందర్భాలకు చెరగని అక్షరరూపం... ‘ద మేకర్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్’. భవిష్యత్ సినీ రూపకర్తలను తండ్రి తీర్చిదిద్దుతున్న సమయంలో ఆ సృజనాత్మక ప్రాంగణంలో పెరిగిన రాధ ఇప్పుడు ఆ పురావైభవ చరిత్రను ఆసక్తికరంగా అందించారు. పట్నాలో ఓ మామూలు కుటుంబంలో పుట్టి, ఆరేళ్ళ వయసులోనే తల్లిని కోల్పోయి, ఒంటరి తండ్రి పెంపకంలో పెరిగి, భౌతికశాస్త్రం చదువుకొన్న జగత్ అసలు సైంటిస్ట్ కావాల్సిన వ్యక్తి. అనుకోకుండా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో సినిమా చదువు చదువుకొని, ఆయన కళారంగంలోకి రావడం యాదృచ్ఛికమే అయినా, భారతీయ సినీ రంగానికి బోలెడంత మేలు చేసింది. ఫిల్మ్స్ డివిజన్లో కెరీర్ను మొదలుపెట్టి, 1940లు, 50లలో పలు డాక్యుమెంటరీ లతో భారతీయ ఆత్మను కెమెరాతో కోట్లాది జనం ముందుకు తెచ్చారు. తొలి రాష్ట్రపతి స్వర్ణపతకం (ఇప్పటి పరిభాషలో నేషనల్ అవార్డ్) సాధించిన ఘనత ఆయన తీసిన ‘మహాబలిపురం’ (1952) డాక్యు మెంటరీదే! అందుకే, దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ను పెట్టాలనుకున్నప్పుడు దాని సారథ్యానికి అన్నివిధాలా ఆయనే అర్హుడయ్యారు. 1947లో ‘మ్యాక్బెత్’ తీస్తున్న సినీ దిగ్గజం ఆర్సన్ వెల్స్ వద్ద పాఠాలు నేర్చుకున్న జగత్ ఆ తరువాత ఎందరికో పాఠాలు చెప్పే గురువయ్యారు. ఎఫ్టీఐఐకి ప్రిన్సిపాల్గా జగత్ దూరదృష్టి అపూర్వ పథనిర్దేశం చేసింది. జయా బచ్చన్, షబానా ఆజ్మీ, సుభాష్ ఘయ్, అదూర్ గోపాలకృష్ణన్, శత్రుఘ్నసిన్హా లాంటి ఎందరో నటులు, దర్శకులు, ఇంకా సినిమా టోగ్రాఫర్లు, ఎడిటర్లు ఆయన వదిలిన బాణాలే. భారతీయ సినీ రంగంలో ‘న్యూ వేవ్ సినిమా’కు వారే కీలక పాత్రధారులు. ముఖ్యమైన వ్యక్తిగా ఉండడం కన్నా మంచి వ్యక్తిగా ఉండడం ప్రధానం – ఇదీ జగత్ జీవన తాత్త్వికత. పుణేలోని ప్రసిద్ధ జయకర్ బంగళా (ఇప్పుడు నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫీసు)లోని నివాసంలో విద్యార్థుల్ని సొంత బిడ్డల్లా చూసిన వైనం, అలాగే ఆయన జీతం పెంపు కోసం అప్పటి సమాచార శాఖ మంత్రి ఇందిరాగాంధీ జోక్యం చేసు కోవడం లాంటివి అబ్బురపరుస్తాయి. అప్పటికే ప్రసిద్ధ సినిమాలు తీసినా, అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో వీధిన పడ్డ ముగ్గురు చిన్నపిల్లల తండ్రి రిత్విక్ ఘటక్ను ఎఫ్టీఐఐలో వైస్ ప్రిన్సిపాల్గా తీసు కోవడానికి జగత్ పడ్డ కష్టం, అవస్థలు పడుతూనే రిత్విక్ను కాపాడుకొనేందుకు పడిన శ్రమ చదువుతూ గుండె చిక్కబట్టుకోవడం కష్టం. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆరంభ, వికాసాలకు జగత్ చేసిన అపార కృషి సహా ఎన్నో సంఘటనలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.ఇదీ చదవండి: Cyclone Montha.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!జగత్ రాసుకున్న డైరీలు, దాచిపెట్టుకొన్న ఆత్మ కథ నోట్సులు ప్రధాన ఆధారమైనప్పటికీ, ఈ రచన కోసం లోతుగా పరిశోధించి, అనేక అంశాలను గుదిగుచ్చారని అర్థమవుతుంది. అదే సమయంలోఈ పుస్తకం ఒక మంచి నవలలా సాగుతూ, భారత సినీ చరిత్రలో అవిస్మరణీయ అధ్యాయాన్ని పాఠకుల ముందు ఉంచుతుంది. ఇవాళ్టికీ రికార్డు కాని ఇలాంటి తెర వెనుక కథలు, వ్యక్తుల విశేషాలెన్నో తెలుసు కోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. అరుదైన ఫొటోలు, అనుబంధ సమాచారం అదనపు హంగులు. భారతీయ డాక్యుమెంటరీ చిత్రనిర్మాణ చరిత్రలో ప్రత్యేక స్థానమున్న జగత్తో పాటు ఎఫ్టీఐఐ తొలి నాళ్ళను తెలుసుకోవడానికి ఈ రచన సినీ ప్రియులకు ఓ అపురూప సమాచార విందు! -రెంటాల జయదేవ(‘ద మేకర్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్’ : హౌ జగత్ మురారి అండ్ ఎఫ్.టి.ఐ.ఐ. ఛేంజ్డ్ ఇండియన్ సినిమా ఫరెవర్ రచయిత్రి – కాలమిస్ట్ : రాధా చడ్ఢా) -
తదుపరి గురి వెనిజులా?
ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు గల లాటిన్ అమెరికా దేశం వెనిజులాను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు అమెరికా ఇపుడు సన్నాహాలు ప్రారంభించినట్లు కనిపిస్తున్నది. ఉక్రెయిన్, గాజా యుద్ధాల తర్వాత ఈ కొత్త పరిణామాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తు న్నాయి. తమ సన్నాహాలలో భాగంగా అమెరికా ఇటీవలి వారాలలో వెనిజులా సమీపంలోని కరీబియన్ సముద్రానికి 10 యుద్ధ నౌకలను, 10 ఎఫ్–35 యుద్ధ విమానాలను, ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక యుద్ధ నౌకను, ఒక అణుశక్తి జలాంత ర్గామిని మోహరించింది. ఇందుకు అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్న కారణాలు అదే ప్రాంతంలో గల ట్రినిడాడ్ దేశంతో కలిసి యుద్ధ విన్యాసాలు జరపటం, అదే విధంగా వెనిజులా నుంచి మాదక ద్రవ్యాల రవాణాను నిలువరించటం! కానీ, గత 35 సంవత్సరా లుగా ఎన్నడూ లేని స్థాయిలో సాగుతున్న మోహరింపుల ఉద్దేశం అదేనని ఎవరూ నమ్మటం లేదు.చమురు కోసమేనా?వెనిజులాలోని చమురు నిల్వలు 303 బిలియన్ బ్యారల్స్ అని అంచనా. వాటితో పోల్చినపుడు సౌదీ అరేబియా నిల్వలు 267 బిలియన్లు, ఇరాన్వి 208 బిలియన్లు, రష్యావి 80 బిలియన్లు కావ టాన్ని బట్టి పరిస్థితిని ఊహించవచ్చు. అయితే, పాశ్చాత్య దేశాల ఆంక్షలు, పెట్టుబడులకు – మౌలిక ఏర్పాట్లకు గల కొరత కారణంగా అక్కడ ఉత్పత్తి స్వల్పంగానే జరుగుతున్నది. మరొకవైపు అక్కడి నిల్వలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు పాశ్చాత్య దేశాల కంపెనీల ప్రయత్నాలు నెరవేరటం లేదు. ఆ నిల్వలన్నింటి యాజ మాన్యం అక్కడి ప్రభుత్వ సంస్థ చేతిలో ఉంది. సోషలిస్టు పార్టీకి చెందిన హ్యూగో చావెజ్ ప్రభుత్వం లోగడ తీసుకున్న ఈ నిర్ణ యాన్ని, ఆయన వారసుడైన ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో కొనసాగిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరిపడని ట్రంప్, ఆయనను పడగొట్టేందుకు తన మొదటి పాలనా కాలంలోనూ ప్రయత్నించారు గానీ వీలుపడలేదు.వెనిజులాలో సోషలిస్టు పార్టీ బలమైనది. తమ దేశంలోగానీ, మొత్తం లాటిన్ అమెరికాలో గానీ అమెరికా జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చావెజ్ తన రోజులలో ప్రపంచవ్యాప్తంగా పేరు పడ్డారు. ఆయన మరణం తర్వాత అధ్యక్షుడైన మదురో స్వరంలో అటువంటి తీవ్రత లేకపోయినా, విధానాలలో ఎటువంటి మార్పూ లేదు. మదురో సమాజంలోని అడుగుస్థాయి నుంచి ఎదిగి వచ్చిన వాడు. 2013 నుంచి ఇప్పటికీ వరుసగా అధ్యక్షునిగా ఎన్నికవు తున్నారు. ఆయనకు ప్రజల మద్దతు సరేసరి కాగా, సమాజంలోని ఎగువ తరగతులు, పట్టణవాసులతోపాటు సైన్యం సమర్థన కూడా పూర్తిగా ఉందన్నది అంచనా. అందువల్లనే ఆయన్ని అమెరికా అనేక ఇతర లాటిన్ అమెరికా దేశాలలో చేసినట్లు అంతర్గత కుట్రల ద్వారా పడగొట్టలేక పోతున్నదనే అభిప్రాయం ఉంది. మాదక ద్రవ్యాల సాకుతో...ఒక విశేషం చెప్పుకోవాలి. గత ఎన్నికలలో మదురోతో పోటీ చేసి ఓడిన మరియా కొరీనా మచాడోకు ఇటీవలి నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు. వెనిజులా సమీపాన అమెరికా సేనల మోహరింపుపై, ‘యుద్ధాన్ని మదురో ప్రారంభించారు, ట్రంప్ ముగించనున్నారు’ అని వ్యాఖ్యానించి ఆమె అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ నేపథ్యం ఇట్లుండగా, వెనిజులాపై చర్యలకు ట్రంప్ సాకులు వెతకటం మొదలుపెట్టారు. అందులో మొదటిది నిరుటి అధ్యక్ష ఎన్నికలలో అక్రమాలు జరిగాయనీ, అందువల్లనే మరియా మచాడో ఓడిందనీ ఆయన ఆరోపణ. మరొక దేశపు ఎన్నికల సక్ర మాలు, అక్రమాలను నిర్ధారించటమనే సాకుతో తమకు సరిపడని ప్రభుత్వాలను పడగొట్టజూడటం అమెరికాకు గతం నుంచి ఉన్న సంప్రదాయమే! అంతెందుకు? వెనిజులాకు సరిగా పొరుగునే గల బ్రెజిల్లో, ఎన్నికలలో గెలిచిన అధ్యక్షుడు లూలాతో ఓడిన బోల్సొ నారో తిరుగుబాటును, ఆయనపై కోర్టు చర్యలను ట్రంప్ బాహాటంగా వ్యతిరేకించారు. తన మిత్రుడైన బోల్సొనారోపై చర్యలు తీసు కున్నందుకు బ్రెజిల్పై సుంకాలను 50 శాతం పెంచారు. అమెరికా ఉద్దేశంలో ఇదంతా ప్రజాస్వామ్య పరిరక్షణ. కనుక ఇపుడు వెనిజులా ఎన్నికలు, మచాడో ఫిర్యాదులు అమెరికా అధ్యక్షునికి సాకులుగా ఉపయోగపడుతున్నాయి. అయితే, గత ఏడాదిగా సాగుతున్న ఈ ప్రయత్నాలు నెరవేరక పోతుండటంతో ట్రంప్ ఇటీవల కొత్త సాకు ముందుకు తెస్తున్నారు. వెనిజులా నుంచి తమ దేశంలోకి కొకైన్, ఫెంటానిల్ వంటి డ్రగ్స్ భారీగా రవాణా అవుతున్నాయంటున్నారు!మాదక ద్రవ్యాల సమస్య అమెరికాలో తీవ్రంగా ఉంది. కానీ అందులో వెనిజులా పాత్ర ఏమిటన్నది ప్రశ్న. అమెరికా సంస్థ ప్రక టించిన మాదక ద్రవ్యాల నివేదిక – 2025లో వెనిజులా ప్రస్తావన లేదు. కొకైన్, ఫెంటానిల్ తదితరాలన్నీ ఉత్పత్తి అవుతున్నది కొలంబియా, పెరూ, బొలీవియా, మెక్సికో వంటి చోట్ల. రవాణా మాత్రం స్వల్పస్థాయిలో వెనిజులా మీదుగా జరుగుతున్నది. ఇతరత్రా కూడా బయటి నిపుణుల అభిప్రాయం అదే.ఏకపక్ష దాడులుఈ వివరాలన్నీ గమనించినపుడు, అమెరికా అధ్యక్షుని లక్ష్యం మదురో ప్రభుత్వాన్ని పడగొట్టి తమ అనుకూలురను అధికారానికి తేవటమని తేలికగా అర్థం చేసుకోవచ్చు. ఆ మాట ట్రంప్ గత పర్యాయమే అన్నట్లు పైన చూశాము. అదే మాటను ఈసారి డొంక తిరుగుడుగా చెబుతుండగా, తన విదేశాంగ మంత్రి మార్కో రూబియో సూటిగానే అంటున్నారు. ఇటీవలి వారాలకు వస్తే, అక్కడ జోక్యం చేసుకుని రహస్య కార్యకలాపాలు సాగించవలసిందిగా సీఐఏను ఆదేశించినట్లు ట్రంప్ బాహాటంగానే ప్రకటించారు. మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నాయంటూ వెనిజులా తీరంలో పది బోట్లపై వైమానిక దాడులు జరిపి సుమారు యాభైమంది ప్రాణాలు తీశారు. ఆ రవాణా అబద్ధమని, అవన్నీ మామూలు బోట్లని మదురో ఖండించారు. మాదక ద్రవ్యాలకు ఆధారాలు దాడికి ముందుగానీ, తర్వాతగానీ ఉన్నాయా అన్న మీడియా ప్రశ్నలకు ట్రంప్ సమాధానమివ్వలేదు. ఐక్యరాజ్యసమితి సముద్రయాన, సముద్ర తీర చట్టాల ప్రకారం అసలు అటువంటి దాడుల అధికా రమే లేదని నిపుణులు స్పష్టం చేశారు. అయినా ఇదంతా ప్రపంచపు అమాయకత్వంగాని, అమెరికా ప్రయోజనాలకు ఎప్పుడు ఏది ప్రతిబంధకమైంది గనుక!టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
గాలిలో దీపమైన భద్రత
అదుపులేని ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రయాణికుల ప్రాణాల్ని గాలిలో దీపాలుగా చేస్తున్నాయి. కర్నూలు దగ్గరలో జరిగిన అగ్ని ప్రమాదంలో బస్సు లోనే ఆహుతి అయిన 19 మానవ ప్రాణాలు ఈ దుఃస్థితికి ఉదాహరణ. ఆ ప్రమాద కారణాలు ప్రత్యక్షంగా ఏవైనప్పటికీ, అలాంటి ప్రమాదం ఏర్పడ టానికి పరోక్షంగా దోహదపడిన పరిస్థితుల్ని చక్కదిద్దడానికి పూనుకోకపోతే మళ్లీ మళ్లీ అలాంటి దురదృష్టకర సంఘటనలు పెచ్చరిల్లుతాయి. ఈ దుర్ఘటన జరిగాక ఆంధ్రప్రదేశ్లో సంబంధిత అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల్లో 360కి పైగా అతిక్రమణలు గుర్తించారు. నలభై బస్సుల్ని సీజ్ చేశారు. కళ్లెదుట ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణించే బస్సులు ఒక్కరోజు తనిఖీలోనే పదుల సంఖ్యలో ప్రయా ణింప వీలుగాని కండిషన్లో ఉన్నా యంటే వ్యవస్థ ఏ స్థితిలో ఉందో అర్థమవుతోంది. మితిమీరి లాభాలు పొందడా నికి ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు గడ్డి కరి చినా, వాటిని నియంత్రించే వ్యవస్థకు ఏమైంది? ఆల్ఇండియా పర్మిట్లు ఈశాన్య రాష్ట్రాల్లో తీసుకోవడం, బళ్ళు ఇక్కడ తిప్పడంలోనే అవినీతి జాడ లున్నాయి. సిటింగ్కి అనుమతి తీసుకుని, స్లీపర్గా మార్చి ప్రయాణికుల రక్షణను రోడ్డున పడేస్తే, అధికారులు గమనించలేక పోతున్నారా? అగ్నిమాపక నిబంధనల్ని కచ్చితంగా అమలు చేయాల్సిన చోట చూసీచూడనట్లు వది లేయడం ఎంత దారుణం! గత రెండు రోజుల్లో నమోదైన అతిక్రమణల కేసులు చూస్తే అర్థమయ్యేది ఏమిటంటే నిబంధనలు పాటించే వారికన్నా అతిక్రమించే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. నియంత్రించాల్సిన వ్యవస్థలు అలసత్వంతోనో, అవినీతితోనో కళ్లు మూసుకొంటున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే జరిగే తనిఖీల హడావిడి రెండ్రోజుల తర్వాత పూర్తిగా అటకెక్కుతుంది. తర్వాత షరా మామూలే! పాడె మారువేషంలో స్పీడుగా తిరుగుతుంది రోడ్ల మీద!!ఇదీ చదవండి : బిగ్బీ దివాలీ గిఫ్ట్ : నెట్టింట ట్రోలింగ్ మామూలుగా లేదుగా!ఈ స్థితి మారాలి. రోడ్డు నిబంధనల్ని నిక్కచ్చిగా పాటించేలా చూడాలి. స్పీడు అతిక్రమించితే బైక్నైనా సీజ్ చెయ్యాలి. భారీగా పెనాల్టీ వెయ్యాలి. ప్రజా రవాణా వాహనాల్ని ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ కండిషన్లో ఉండేలా నియంత్రించాలి. రోడ్డు ప్రమాదాల్లో విలువైన ప్రాణాల్ని కోల్పోతున్నాం. సరైన చర్యల ద్వారా వాటిని బాగా తగ్గించగలం. ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలి.– డా.డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం మాజీ ఎంపీ -
'స్వీయ నిబద్ధతే' జీవిత సారం
సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో వక్తలు మీ అంతరాత్మ ప్రబోధాన్ని వినండి, ఇష్టమైన వ్యాపకాన్నే చేపట్టండి, మీ భవిష్య త్తుకు ఆకాశమే హద్దు లాంటి మాటలు చెబుతూంటారు. విఫల మవడం కూడా ముఖ్య మని చెప్పే స్నాతకోపన్యాసాలను నేను ఇష్టపడతాను. కొన్నేళ్ళ క్రితం స్టీవ్ జాబ్స్ చేసిన ప్రసంగంతో ఈ ధోరణి మొదలైంది. కానీ మీరు స్టీవ్ జాబ్స్ అయితేనే వైఫల్యం కూడా గొప్పగా ఉంటుంది. లేదంటే కుంగదీస్తుంది. అందుకే విఫలం కాకపోవడమే మంచిది.ఏజెన్సీ మూమెంట్!వచ్చే రెండేళ్ళలో మీలో కొందరికి ఉద్యోగాలు రాకపోవచ్చు. కొందరికి అర్హతకు తగిన ఉద్యోగాలు దక్కకపోవచ్చు. జీవితానికి సరైన దిశా నిర్దేశం, ఒక ప్రణాళిక అంటూ లేకపోయాయని మీలో సగం మంది భావించవచ్చు. కానీ, ఇదంతా ఒక ప్రక్రియలో భాగమే! మీకు ఇష్టమైన వాటిని కనుగొనే, మీకవి నిజంగానే ఇష్టమైనవో కావో పరీక్షించే ప్రక్రియలో భాగం. మనందరం కొన్నింటిని ఇష్టపడతాం. కొందరు స్నేహితులను, కొన్ని సబ్జెక్టులను, కొన్ని కలలను, కొన్ని వృత్తిపరమైన లక్ష్యాలను ఇష్టపడతాం. కానీ, వాస్తవికత అనే గీటురాయిపై వాటిని పరీక్షించి చూసేంత వరకు, వాటి స్వాభావికత గురించి మీకు నిజంగా తెలి యదు. నేను గ్రాడ్యుయేట్ అయినపుడు, రచయిత కావాలనీ, కొన్నాళ్ళు టీచింగ్ చేపట్టాలనీ, నాటక రచయిత లేదా నవలా రచయిత కావాలనీ కోరుకున్నా. రాజకీయాల్లోకి ప్రవేశించాలనీ, పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కనాలనీ కూడా అనుకున్నా.ఇరవై ఏళ్ళ ప్రాయంలోని మిగిలినవారి మాదిరిగానే, నేను కూడా నాకిష్టమైన వ్యాపకాలను పరీక్షించి చూసుకున్నాను. ఆ క్రమంలో కొత్తగా ఇష్టమైనవిగా తోచినవాటిని కూడా రుచి చూశాను. ఇది మాల్లో, ప్యాంటు, చొక్కా వేసుకుని సరిపోయాయో లేవో అద్దంలో చూసుకోవడం లాంటిదే. పదేళ్ళు గడిచే సరికి నాటక రచన కుదరని పనిగా తోచింది లేదా ఇష్టం పోయిందని చెప్పాలి. కొన్ని కొత్తవి దృష్టి పథంలోకి వచ్చాయి. రాజకీయాలకన్నా రచన మరింత ముఖ్యమైనదని తేల్చుకున్నా. నాకు ఇష్టమైన వాటిని ఒక కాగితంపై ప్రాధాన్యతా క్రమంలో రాసుకున్నా. ఎక్కువగా ఇష్టపడుతున్నవాటికి నా శక్తియుక్తులను వీలైనంత ఎక్కువగా వెచ్చించడం ప్రారంభించా. ఒక క్రమపద్ధతిలో ఆ జాబితాను సిద్ధం చేసుకునే సామర్థ్యాన్ని చూపారంటే, ‘ఏజెన్సీ మూమెంట్’కు వచ్చినట్లే. అంటే, రూపాంతరీకరణ గ్రహింపును సంతరించుకున్నట్లే! ఒక వ్యక్తి బాహ్య ఒత్తిడుల నుంచి బయటపడి, స్వీయ విచక్షణ ప్రమాణాలు, విలువలను ఆధారం చేసుకుని ఇష్టంతో కార్యాచర ణకు దిగడం ప్రారంభించడాన్ని ‘ఏజెన్సీ మూమెంట్’ అంటారు. వేరెవరో విజయాన్ని నిర్వచించిన సూత్రాలకు అనుగుణంగా మీకు మీరు మూస పోసుకోవడం మానేస్తారు. మీ సొంత ప్రమాణాలు మీకుంటాయి. ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడటం మానే స్తారు. జీవితాన్ని మీదైన రీతిలో మలచుకోవడం ప్రారంభిస్తారు. చాలా మంది 30 ఏళ్ళకు కొద్ది ముందు ఆ స్థితికి చేరుకుంటారు. మరికొన్ని ఇతర ‘ఏజెన్సీ మూమెంట్లు’, తదనంతర జీవితంలో 53 లేదా 75 ఏళ్ళ వయసులో కలుగవచ్చు. మీకు ఇష్టమైన వ్యాప కాల ప్రాధాన్యతా క్రమం మారుతుంది. దాన్ని గ్రహించి, అందుకనుగుణంగా, సర్దుబాట్లు చేసుకోక తప్పదు. ఒకసారి ‘ఏజెన్సీ మూమెంట్లు’ సాధించాక, నిబద్ధత చూపడం మొదలుపెట్టవచ్చు.స్వేచ్ఛ వర్సెస్ నిబద్ధతమన సమాజం నిబద్ధతతో మెలగడాన్ని పెంపొందించే రకమై నది కాదు. దేనినైనా ఎంచుకునే స్వేచ్ఛను అట్టేపెట్టుకుంటాం, మరో వైపు దేన్నైనా కోల్పోతామేమో అనే భయంతో ఉంటాం. టిండర్, ఓకేక్యూపిడ్, ఇన్స్టాగ్రామ్, రెడిట్ వంటి డీకమిట్మెంట్ సాధనా లతో నిండిన సమాజంలో జీవిస్తున్నాం. ఒకదాని తర్వాత మరో దానికి వెంటవెంటనే వెళ్ళేవిధంగా మొత్తం ఇంటర్నెట్ మనల్ని పురిగొల్పుతుంది. మన ఏకాగ్రతను భగ్నం చేయడమే మన చేతిలోని ఫోన్ల పని. ఒక అంశంపై కనీసం 30 సెకన్లు కూడా దృష్టి పెట్టలేని వాళ్ళం, జీవితం పట్ల నిబద్ధత ఏమి చూపగలం? మీ స్వేచ్ఛకు మీరు ఎంత బాగా అడ్డుకట్ట వేసుకోగలుగుతారనే దానిపైనే జీవితంలో ఏదైనా నెరవేరడం లేదా నెరవేరకపోవడం ఆధారపడి ఉంటుంది. నిబద్ధతతో మెలగడమే ప్రాథమిక కర్తవ్య మనే సంగతిని 30 ఏళ్ళ ప్రాయంలో గ్రహిస్తాం. నిబద్ధతతో మెల గాల్సి ఉంటుందంటే, మొదట భయం వేయవచ్చు. కానీ, నిబద్ధత అంటే, ఏదైనా ఒకదాని పట్ల ఇష్టం ఏర్పడి, అది నెరవేరకపోయినా, జీవితంలో ముందుకు సాగే విధంగా, నడవడికను రూపొందించు కోవడమే! అది జీవిత భాగస్వామి, ఉద్యోగం, పని చేస్తున్న కంపెనీ ఏదైనా కావచ్చు. నిబద్ధత ఒక నైతిక కార్యాచరణఒక కెరీర్ లేదా ఒకేషన్ పట్ల బద్ధులమై ఉన్నామని 28–32 ఏళ్ళ మధ్యలో గ్రహిస్తాం. కానీ, కెరీర్ వేరు, ఒకేషన్ వేరు. కెరీర్ను మీరు ఎంచుకుంటారు, ఒకేషన్ మిమ్మల్ని ఎంచుకుంటుంది. ఫ్రాన్సిస్ పెర్కిన్స్ అనే యువతి 20వ ప్రాయం చివరలో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ, అగ్ని ప్రమాదాన్ని చూశారు.వందలమంది మంటలకు ఆహుతయ్యారు. మంటల నుంచి రక్షించుకునే క్రమంలో పైనుంచి దూకేసి చనిపోయారు. తర్వాత, ఆమె తన జీవితం మొత్తాన్నీ కార్మికుల భద్రత, హక్కుల సాధనకు వెచ్చించారు. మనకు ప్రీతిపాత్రమైన దానిని అంతర్ దృష్టితో కనుగొనలేం. దీనిపై అధ్యయనాలు సాగాయి. మనలో ఎనభై శాతం మందికి ప్రీతిపాత్రమైనది అంటూ ఉండదు. బయటకు చూడటం ద్వారా, అవసరాలను చూసినపుడు ఆర్ద్రతతో స్పందించడం ద్వారా దాన్ని కనుగొనవచ్చు. భాగస్వామి లేదా పిల్లల పట్ల చూపించేది మరో నిబద్ధత. వివాహం 30 లేదా 40 లేదా 50 ఏళ్ళ సంభాషణ. అన్ని గొప్ప అంకిత భావాల మాదిరిగానే, ప్రేమ కూడా రెండు భిన్నమైన స్థాయు లలో సమాంతరంగా పనిచేస్తూ వస్తుంది. ఒకటి – సడలని వాస్తవి కత. రెండు– భావాతీత ఇంద్రజాలం. ఇంట్లోకి సరుకులు కొనడం, ఇల్లు శుభ్రం చేయడం, రాజీపడవలసి రావడం, తేలికపాటి బలహీనతలతో సర్దుకుపోవడం వంటివి ఈ కోవలోకి వస్తాయి. కవితాత్మకమూ, భావాతీతమూ, ఆదర్శవంతమూ, విశ్వజనీనమూ అయినది ప్రేమలోని మరో కోణం. చాలా భాగం వనరులు పరిమితమైనవి. మనం ఉపయోగించుకుంటున్న కొద్దీ అవి తరిగిపోతాయి. కానీ, ప్రేమ వేరు. ప్రేమిస్తున్న కొద్దీ మీరు ఇంకా ప్రేమించగలుగుతారు. ఒక బిడ్డను ప్రేమిస్తున్నంత మాత్రాన, మరో బిడ్డ పుడితే, ఆ రెండవ బిడ్డను తక్కువగా ఏమీ ప్రేమించరు. పంచుతున్న కొద్దీ ప్రేమ విస్తారమవుతుంది. ప్రేమలో ఉన్నవారు కష్టనష్టాలను తట్టుకునేందుకు కూడా సిద్ధపడతారు. రెండు వేర్వేరు నగరాల్లో ఉంటున్న యువతీ యువకులకు కలసి ఉండడంలో అర్థం లేదని చెప్పండి. వారు ఒప్పుకోరు. విడిపోయి సంతోషంగా ఉండటం కన్నా, కలసి ఉండి, కష్టసుఖాలు పంచుకునేందుకే ఇష్టపడ తారు. నిబద్ధతలో ఉండే గొప్ప అంశమది. నిబద్ధత ఒక నైతిక కార్యాచరణ. ఒక వృత్తిని నిర్వహించడం నైతిక చర్య. 30 లేదా 50 ఏళ్ళ వివాహ బంధానికి కట్టుబడి ఉండడం నైతిక చర్య. మాట ఇచ్చి నిల బెట్టుకోవడం నైతిక చర్య. ఒక మంచి, నైతిక వ్యక్తిగా పరిణమించడ మంటే, ప్రలోభాలను నియంత్రించలేకపోవడం కాదు. నిబద్ధతతో వ్యవహరించగల సామర్థ్యాన్ని ప్రదర్శించడం. -
ఇప్పటికీ మారేది లేదా!
దగ్గు మందు సేవించిన పిల్లలు వరుసగా మృత్యువాతపడటం ఇటీవల కలకలం సృష్టించింది. ఔషధాల నియంత్రణ వ్యవస్థ పనితీరు దేశంలో అధ్వానంగా ఉన్న స్థితిని ఇది మరోసారి కళ్ళకు కట్టింది. కల్తీ మందులు సేవించి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు ఇటీవలి సంవత్స రాలలో దేశ, విదేశాలలో చోటుచేసు కున్నాయి. అవి మన దేశంలో తయారైనవి కావడంతో తీరని తలవంపులు తెచ్చి పెట్టాయి. ఇలాంటి విషాదకర ఘటనలు వెలుగు చూసిన ప్రతిసారీ మన స్పందన ఒకే విధంగా ఉంటుంది. యథావిధిగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దర్యాప్తునకు ఆదేశిస్తాయి. చెదురు మదురుగా కొన్ని మందుల పరిశ్రమలలో సోదాలు నిర్వహిస్తారు. నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేటట్లు చూడాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్రాలకు ఆదేశాలు వెళతాయి. అనతి కాలంలోనే ‘పరిస్థితులు’ మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారవుతాయి. సడలింపులతో సమస్యలుడైఇథిలీన్ గ్లైకాల్(డి.ఇ.జి.), ఇథిలీన్ గ్లైకాల్ వల్ల కల్తీ అయిన దగ్గు మందులను సేవించినవారికి పొత్తి కడుపులో నొప్పి,వాంతులు, అతిసారం, మూత్రం పోయలేకపోవడం, తలనొప్పి వంటి లక్షణాలు మొదలవుతాయి. కొన్ని కేసుల్లో మూత్ర పిండాలకు తీవ్ర గాయమై, అది మరణానికి కూడా దారితీయవచ్చు. భారత దేశంలో తయారైన ఔషధాల వల్ల జాంబియా, ఉజ్బెకిస్తాన్, కామె రాన్, ఇరాక్ తదితర దేశాలలో డజన్ల కొద్దీ పిల్లలు మరణించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో అప్రమత్తమైంది. ఔషధాల తయా రీకి ఉపయోగించే ముందు ముడి పదార్థాలలో డి.ఇ.జి. ఉందేమో పరీక్షించవలసిందని ఆ సంస్థ జాతీయ అధికారులకు సలహా ఇచ్చింది. మధ్యప్రదేశ్ లోని ఛింద్వారాలో దగ్గు మందు మరణాలకు డి.ఇ.జి.యే కారణమని తేలింది.విధిగా పాటించవలసిన ‘మంచి తయారీ విధానాల’కు (జీఎంపీ) ఔషధ తయారీ సంస్థలు తిలోదకాలిస్తున్నాయని స్పష్ట మవుతోంది. అవి అనుసరించడం, లేదా అవి తప్పించుకునేందుకు ప్రభుత్వమే అవకాశమిస్తోందా అంటే... రెండూనని జవాబు చెప్పు కోవాలి. కలుషిత మందుల వల్ల మరణాలు సంభవించగానే, జీఎంపీని అమలుపరచడం, వాటిని మరింత కఠినంగా రూపొందించడం గురించిన మాటలు వినవస్తాయి. వెంటనే, చిన్న, మధ్యతరహా ఔషధాల తయారీ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పారిశ్రామిక సంఘాలు నిబంధనల అమలుకు సమయాన్ని అడుగుతాయి. లేదా వాటిని అమలుపరచగల సామర్థ్యం తమకు లేదంటూ సడలింపు లను కోరతాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం దెబ్బతింటుందని, ప్రభుత్వం కూడా వాటిపట్ల సానుభూతితో వ్యవహరిస్తుంది. జాంబియాలో 68 మంది పిల్లలు మరణించాక కూడా, విధానాలను సరిగా అనుసరించడం లేదంటూ భారతీయ సంస్థలు ప్రపంచ ఆరోగ్య సంస్థనే వేలెత్తి చూపాయి. భారతీయ ఎగుమతులను నీరు గార్చే కుట్ర జరుగుతోందంటూ ఆరోపణలకు దిగాయి. ‘మంచి తయారీ విధానాల’ ( జీఎంపీ)లోని ‘ఎం’(తయారీ)కు సంబంధించిన రివైజ్డ్ నియమాలను సంస్థలు విధిగా పాటించవలసిన అవసరం ఉందని, ఛింద్వారా ఘటన తర్వాత, ‘డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ పునరుద్ఘాటించారు. సవరించిన జీఎంపీ నిబంధనలను కఠినంగా అమలుజరపవలసిందని రాష్ట్రా లను కోరారు. ‘‘ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల ఉన్నతి పథకా నికి దరఖాస్తు చేసుకున్న కొన్ని సంస్థలకు 2025 డిసెంబర్ వరకు పొడిగింపు ఇచ్చాం’’ అని ఆయన వివరించారు. అంటే, జీఎంపీ నూతన షెడ్యూలును ఇప్పుడిప్పుడే అమలుపరచబోవడం లేదని అవగతమవుతోంది. పేరుకు కఠిన నిబంధనలే కానీ...భారతదేశంలో తయారైన దగ్గు సిరప్లు వివిధ దేశాలలో మర ణాలకు కారణమవడంపై అంతర్జాతీయంగా హాహాకారాలు రేగడంతో నూతన షెడ్యూలును ప్రవేశపెట్టారు. అది 2024 జూన్ నుంచి పెద్ద సంస్థలకు అమలులోకి వచ్చింది. (రూ. 250 కోట్లకన్నా తక్కువ టర్నోవరు ఉన్న) చిన్న, మధ్య తరహా తయారీ సంస్థలకు 2025 డిసెంబర్ వరకు పొడిగింపునిచ్చారు. నిజానికి, చాలా భాగం కలుషిత మందులు ఈ సంస్థల నుంచే వస్తున్నాయి. తయారీ సంస్థల్లో చాలా వాటికి మినహాయింపు లభించే విధంగా ఈ టర్నో వరు పరిమితిని నిర్ణయించారు. మందుల తయారీ సంస్థలు ఫార్మ స్యూటికల్ క్వాలిటీ సిస్టం, క్వాలిటీ రిస్క్ మేనేజ్మెంట్, కంప్యూ టరైజ్డ్ స్టోరేజీ వ్యవస్థలు వంటి విధానాలకు కట్టుబడి ఉండాలని షెడ్యూలు ఎం నిర్దేశిస్తోంది. సునిశిత పునః పరీక్షకు మధ్యంతర, తుది ఉత్పత్తుల నమూనాలను తయారీ సంస్థలు తప్పకుండా అట్టే పెట్టవలసి ఉంటుంది. కనుక, నిబంధనలకు లోటు లేదు. మరింత కఠినమైన విధంగా వాటిని సవరిస్తున్నారు కూడా! కానీ, వాటిని అమలుపరచే సంకల్ప దీక్ష కొరవడుతోంది. ఈ నిబంధనలను అమలుపరచేటట్లు చూసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులపై ఉంది. కానీ, తగినంత సిబ్బంది లేదు. ఉద్దేశపూర్వకంగానే సిబ్బందిని అరకొరగా ఉంచుతున్నారని అనుకోవాలి. అనేకానేక నిపుణుల ప్యానెళ్ళు, సమీక్షా కమిటీలు, పార్లమెంటరీ ప్యానెళ్ళు గత రెండు దశాబ్దాలుగా ఈ సంగతిని వెల్లడిస్తూనే ఉన్నాయి. కానీ, క్షేత్ర స్థాయిలో మార్పు లేదు. ఔషధ తయారీ సంస్థలు ఎక్కువగా కేంద్రీకృతమైన తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పరిస్థితులు మరింత అధ్వానంగా ఉన్నాయి. పేషెంట్కు ప్రాధాన్యత ఉండొద్దా?పరిశ్రమను కాపాడటం కోసం నిబంధనలను పాటించకపోయినా పట్టించుకోవడం లేదు. లేకపోతే, మన దేశంలో పిల్లల మరణాలకు డి.ఇ.జి. కారణమై ఉండేది కాదు. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న దగ్గు సిరప్లు జాంబియా, తదితర దేశాలలో పిల్లల మరణాలకు కారణమైనప్పుడే, ఆ రసాయనిక పదార్థం కారణమని గుర్తించారు. అప్పుడే దగ్గు మందులను తయారు చేసే సంస్థలన్నింటా దేశవ్యాప్తంగా తనిఖీలు జరిపి ఉండవలసింది. అవేవీ జరగకపోవడం వల్ల, ఛింద్వారాలోనూ మరణాలు సంభవించాయి. ‘‘భారతదేశంలో డ్రగ్ రెగ్యులేషన్ వ్యవస్థను పట్టిపీడిస్తున్న చాలా జాడ్యాలకు, డ్రగ్ రెగ్యులేటర్ సంకుచిత ప్రాధాన్యాలు, దృక్కో ణాలే కారణం. కొన్ని దశాబ్దాలుగా అది మందుల తయారీ సంస్థల వ్యాప్తికి, వెసులుబాటుకే ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. దాంతో, దుర దృష్టవశాత్తు, అసలు లెక్కలోకి రావలసిన వినియోగదారుని ప్రయో జనాలు అటకెక్కుతున్నాయి’’ అని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీ 59వ నివేదిక పేర్కొంది. ఈ నివేదికను 2012లో పార్లమెంట్కు సమర్పించారు. ప్రజారోగ్యాన్ని కాపాడటాన్నే కేంద్ర ఔషధ సంస్థ ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని ఆ ప్యానెల్ సిఫార్సు చేసింది. అయినా కల్తీ మందులు ప్రజల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. ప్రజారోగ్యం కన్నా పరిశ్రమల ప్రయో జనాలకు పెద్ద పీట వేస్తూనే ఉన్నారు.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
మార్క్ జుకర్బర్గ్ (మెటా సీఈవో) రాయని డైరీ
చీఫ్ ఏఐ ఆఫీసర్గా ‘మెటా’ లోకి వచ్చీ రావటంతోనే అలెగ్జాండర్ వాంగ్ చేసిన రెండో పని... జింజర్ ఫైర్బాల్ తెప్పించుకుని వాక్ ఏరియాలో నాతో కలిసి నడుస్తూ తాగటం.ఇక అతడు చేసిన మొదటి పని... 600 మంది ఏఐ నిపుణులను ఒకేసారి ఫైర్ చేసి, నవంబర్ 21లోగా రిజైన్ చేయాలని కోరుతూ వాళ్లందరికీ లెటర్స్ మెయిల్ చేయించటం.28 ఏళ్ల వయసుకే కాఫీ, టీలను త్యజించినవాడు వాంగ్. నిజంగా జ్ఞానోదయం పొందినవారు మాత్రమే పని మధ్యలో ఒక కప్పు సాదాసీదా వేడి నీటితో తమ ఇంద్రియాలను పునరుజ్జీవింప జేసుకోగలరని అంటాడతడు. ‘‘ఎవర్నీ ఫైర్ చెయ్యకుండా మెటా ‘ఏఐ’ని నడిపించలేమా వాంగ్?’’ అన్నాను. ఫైర్బాల్ జ్యూస్ను సిప్ చేస్తున్న క్రీస్తు పూర్వపు చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్లా... నా వైపు చూశాడు వాంగ్,‘‘హైర్ చేసేటప్పుడు ఎంపిక చేసుకుంటాం కదా, ఇదీ అంతే మార్క్. ఫైర్ చేయటానికి ఎంపిక చేసుకుంటున్నాం’’ అన్నాడు.ట్రంప్ కంటే మొండివాడు వాంగ్. ‘‘ఏఐ వార్లో అమెరికా గెలిచి తీరవలసిందే’’ అని ట్రంప్కే నేరుగా లెటర్ రాసినవాడు! వాంగ్ ‘రూట్స్’ చైనావి. వాంగ్ ‘హార్ట్ బీట్స్’ అమెరికావి.‘‘కానీ వాంగ్, కొన్నిసార్లు ఆఫ్రికా ఖండంలోని ఆకలి చావుల కన్నా, మన ఇంటి ముందర నిర్జీవంగా పడి ఉన్న ఉడుతే మనల్ని ఎక్కువగా కలచివేస్తుంది!’’ అన్నాను. మెటాకు నేనొక ‘ఔట్మోడెడ్’ వెర్షన్ అన్నట్లుగా నా వైపు చూశాడతడు. ‘‘ఓకే మార్క్... మళ్లీ కలుద్దాం’’ అనేసి వెళ్లిపోయాడు.ఎంప్లాయీస్ని తొలగించినందుకు యూజర్స్ చేస్తున్న కామెంట్స్ అన్నీ వాంగ్ మీద వస్తున్నవే! వాంగ్ చైనీస్ పర్సన్ కనుక అతడు ఫైర్ చేసిన వాళ్లలో ఒక్కరు కూడా చైనీస్ ఉండకపోవచ్చని ఒకరు కామెంట్ చేశారు!దారుణమైన కామెంట్ కూడా ఒకటి ఉంది. జుకర్బర్గ్ భార్య చైనీస్ పర్సన్ కనుక, వాంగ్ అనే చైనీస్ పర్సన్ కి ‘మెటా’లో అంత పెద్ద ఉద్యోగం దొరికిందని!!నిజానికి, మెటాలోకి వచ్చేటప్పటికే వాంగ్ ‘స్కేల్ ఏఐ’ అనే ఒక పెద్ద కంపెనీకి కో–ఫౌండర్. అందులో సగ భాగాన్ని మెటా కొనేయటంతో అతడు మెటాలోకి వచ్చాడు కానీ, మెటాలో ఉద్యోగం దొరకటం వల్ల వచ్చినవాడు కాదు.వాంగ్ వెళ్లిపోయాక, వాకింగ్ ఏరియా నుంచి నా డెస్క్లోకి వచ్చి కూర్చున్నాను. ఓపెన్ డెస్క్ అది. చుట్టూ ఎంప్లాయీస్ ఉంటారు.‘‘మార్క్! మీతో మాట్లాడాలి. యాక్చువల్లీ మీతో మాట్లాడటం కోసమే నేను ఎదురు చూస్తున్నాను’’ అంటూ – ఇండియన్ యాక్సెంట్తో ఒక అమ్మాయి. చాలా కోపంగా ఉంది. చాలా అంటే చాలా! ‘‘షూట్ మీ..’’ అన్నాను నవ్వుతూ.తను నవ్వదలచుకోలేదని ఆమె ముఖంలో స్పష్టంగా తెలుస్తూ ఉంది.‘‘మార్క్! ఎంప్లాయీస్ అంటే స్ప్రెడ్షీట్స్ కాదు.. మనుషులు. యునీక్ స్కిల్స్, ఎమోషన్ ్స, అనుభవం ఉన్నవారు. ఎలా తీసేస్తారు అంతమందిని? అంతమంది అని కాదు. అసలు వారిలో ఒక్కరినైనా?!!’’ – స్థిరంగా, స్ట్రాంగ్గా అంటోంది. అం... టూ...నే ఉంది! తను వెళ్లాక, వాంగ్కి కాల్ చేసి... ‘‘ఏఐ ల్యాబ్స్ నుంచి ఫైర్ చేసిన వాళ్లలో తను కూడా ఉందా?’’ అని అడిగాను. కాసేపటి తర్వాత వాంగ్ కాల్ బ్యాక్ చేసి, ‘‘ఏఐ ల్యాబ్స్ ఫైరింగ్ లిస్ట్లో తను లేరు మార్క్! కానీ తను చేస్తున్నది ఏఐ ల్యాబ్స్లోనే!!ఇంటెర్న్. సూపర్ ఇంటెలిజెంట్ అని విన్నాను’’ అన్నాడు వాంగ్. ఆ అమ్మాయి తన కోసం తను ఫైట్ చెయ్యటం లేదంటే తను ఎవరితోనైనా ఫైట్ చేయగలదని! అమెరికన్ కంపెనీలు ప్రపంచంలో నంబర్ 1గా ఉండటానికి నాకిప్పుడు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి –ప్రాక్టికల్గా ఉండే చైనీస్ చీఫ్ ఆఫీసర్స్. రెండు – ‘ఫైటింగ్ స్పిరిట్’ ఉన్న ఇండియన్ ఇంటెర్న్లు! -
ట్రంప్ ‘ఏడువారాల నగలు’
మహారాణులకు, ఏడువారాల నగల వలె, అమెరికా మహారాజు డోనాల్డ్ ట్రంప్కు ఏడువారాల వ్యూహాలుంటాయి. ఈ స్థితిని ప్రపంచం పలు విషయాలలో గమనిస్తున్నది. గమనించి మొదట భయ పడింది. తర్వాత అయోమయానికిగురైంది. చివరకు పరిస్థితి కొంత వినోదాత్మకంగా మారగా, ప్రేక్షకులలో కొందరు ట్రంప్ తలపై ఆయన ఇటీవల స్వయంగా ధరించి పోస్ట్ చేసిన రాజు గారి కిరీటానికి బదులు సర్కస్ క్లౌన్ టోపీని చూస్తున్నారు. కొందరు ఏమిచేయాలో తోచక విసుగెత్తి తలలు పట్టుకుంటున్నారు.అమెరికా అధ్యక్షుని గురించి పైన చేసిన వ్యాఖ్యలేవీ కాలక్షేపపు ఊహాగానాలు కావు. ప్రతి ఒక్కటీ వాస్తవంగా జరుగుతున్న వాటిని పరిగణనలోకి తీసుకుని అన్న మాటే. అట్లా పరిగణించిన విష యాలు ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, భారత దేశంతో ఆర్థిక – వ్యూహాత్మక సంబంధాలు, చైనాతో వాణిజ్య – వ్యూహాత్మక తగవులు. వీటికి సంబంధించి కొన్ని మాసాల నుంచి మొదలుకొని నేటివరకు మాట్లాడుతున్నవి, చేస్తున్నవి, చేస్తానని చేయనివి, తాను చేయకున్నా ఇతరులు చేయాలనేవి, ఇతరులు చేయాలంటూ తిరిగి అందుకు మార్పులు చేసేవి, తాను చేస్తాననే వాటిలో మార్పులు తెచ్చేవి... అన్నింటినీ ఒక కాలక్రమంలో పేర్చి పెట్టి చూస్తే, మొత్తం మీద కనిపించేది ట్రంప్ చక్రవర్తి ‘ఏడువారాల నగలు’. మనంఅంటున్న ఈ మాట ఆయనకు చేరే అవకాశం లేదుగానీ, ఇటీవల అమెరికన్ పౌరులు ‘నో కింగ్’ అంటూ పెద్ద ఎత్తున జరిపిన నిరసనలను హాస్యాస్పదంగా చూపేందుకు తానే హాస్యాస్పద వేషధారణ చిత్రాన్ని పోస్ట్ పెట్టినట్లు, ఏడువారాల నగలతో ఏడు పోస్టులు పెట్టే వారేమో!చక్రవర్తి ఎందుకు?ట్రంప్ చేస్తున్నదంతా ఒక వ్యూహంలో భాగమని ఆయన అంతే వాసులు ప్రచారం చేసి లోకాన్ని నమ్మించజూశారు. వారు చెప్పిన దాని ప్రకారం ఆయన ఒక విషయమై అవతలి వారిని పిచ్చుకపై వేస్తాను సుమా బహ్మాస్త్రం అన్నట్లు మొదటే భయపెడతారు. అట్లా వేయటం నిజంగా తన ఉద్దేశం కాదు. కానీ అట్లా భయపెడితే అవతలి వారు బ్రహ్మాస్త్ర ప్రయోగం నిజంగానే జరగవచ్చునని భయ పడిపోయి, తన ఆదేశాలను శిరసావహించగలరన్నది ట్రంప్ అంచ నాలట! దానిని వారు బ్రహ్మాస్త్ర వ్యూహమన్నారు. ఇది యథాతథంగా వినేందుకు గొప్పగా తోస్తుంది. మధ్యయుగాల నాటి ‘బెనెవెలెంట్ డిక్టేటర్ (ఉదార నియంత) లక్షణాల తరహాలో కనిపిస్తుంది. ట్రంప్ వ్యక్తిత్వంలో, వ్యవహరణలో నిజంగానే ఈ లక్షణాలు ఉన్నాయన్నది కొందరి అభిప్రాయం. పరిస్థితి అంతవరకే అయితే ఫరవాలేదు. నిజం చెప్పాలంటే ‘ఉదార నియంత’ భావన ఆధునిక ప్రజాస్వామ్య భావనలకు సరిపడేది కాదుగానీ, ఒకోసారి అందువల్ల కొంత మంచి కూడా జరుగుతుంటుంది. అదే సమయంలో ఎక్కువసార్లు బెడిసి కొడుతుంది. ఈ రెండింటిలో ఏమి జరిగేదీ అవతలి పక్షాల పైనా, వాస్తవ పరిస్థితుల పైనా ఆధారపడి ఉంటుంది. అందువల్ల, కిరీటం ధరించిన ‘కింగ్ ట్రంప్’ గారి ‘బెనెవె లెంట్ డిక్టేటర్’ వ్యూహం కొద్ది సందర్భాలలో తప్ప పనిచేయదు. వాస్తవానికి ఈ హెచ్చరిక ఆయనకు అందరికన్నా ముందు చేసినవాడు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా. అయినదానికి కాని దానికి ట్యారిఫ్లు పెంచుతూ, వాణిజ్య ఒప్పందాల గురించి బెది రిస్తూ, చివరకు బ్రెజిల్ ప్రతిపక్ష నాయకుడు బోల్సొనారోపై చర్యల విషయంలోనూ జోక్యం చేసుకొనజూసినపుడు, ‘‘ప్రపంచం చక్ర వర్తిని కోరుకోవటం లేదు. అమెరికన్లు ట్రంప్ను ఎన్నుకున్నది చక్ర వర్తి అయేందుకు కాదు’’ అని ఘాటుగా మాట్లాడారాయన. పరిస్థి తిని ట్రంప్ అర్థం చేసుకోలేదన్నది వేరే విషయం! మార్చేందుకే మాట ఉన్నది...ప్రస్తుతానికి వచ్చి, పైన పేర్కొన్న వేర్వేరు విషయాలను గమనిస్తే, అమెరికా అధ్యక్షుడు నాలుగు రోజులకు ఒక విధంగా మాట మార్చటం చూస్తున్నాం. ఉక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటలలో ఆపివేయగలనంటూ మొదలుపెట్టిన ఆయన, ఇపుడు ఏమిచేయాలో తోచక, టేబుల్కు రెండు వైపులా తానే నిలిచి తనతో తానే పింగ్పాంగ్ ఆడుతున్నారు. ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని, సోమవారం నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్ను హెచ్చరిస్తారు. డోన్బాస్ను వదలుకోవాలని మంగళవారం ఆదేశించి క్రిమియాను సైతం స్వాధీన పరచుకునేందుకు జెలెన్స్కీకి తోమహాక్లు అంద జేయగలనంటూ బుధవారం నాడు పుతిన్ను భయపెట్టజూస్తారు. గురువారంరోజు ఇద్దరితోనూ ఖనిజ ఒప్పందపు చర్చలు నడుపు తారు. శుక్రవారం యూరోపియన్ దేశాలను మీ దారి మీదేనని చెప్పి, శనివారం నాడు ‘నాటో’ను అందరం కలిసి బలోపేతం చేద్దామంటారు. ఈ విధంగా ఉక్రెయిన్ విషయమై ప్రపంచం గమనించి అబ్బు రపడుతున్న ‘ఏడువారాల నగల ప్రదర్శన’ వంటిదే ఇతర సంద ర్భాల్లోనూ చూస్తున్నాము. ఉక్రెయిన్ వలెనే మరొక యుద్ధమైన గాజాను గమనించండి. గతాన్ని కొద్దిసేపు అటుంచి ఇటీవలి పరిణామాలనే గమనిస్తే– 20 అంశాల ప్రకటన, షర్మ్ అల్ షేక్ సంతకాలతో మొత్తం పశ్చిమాసియాలోనే ‘శాశ్వత శాంతి’ సిద్ధించిందని ప్రకటించారు ట్రంప్. అది తొందరపాటనీ, మొదటి దశ అయిన కాల్పుల విరమణే ఇంకా స్థిరపడవలసి ఉందనీ అందరూ ఎత్తిచూపారు. కానీ అధ్యక్షుడు మాత్రం నోబెల్ శాంతి ప్రకటన ముగిసినదే తడవు హమాస్కు హెచ్చరికలు మొదలుపెట్టారు.అంతర్గత అరాచక శక్తులను అదుపు చేసేందుకు హమాస్ ఆయు ధాలను ఉంచుకోవచ్చునని ఒకరోజు ప్రకటించి, ఒకరోజు తిరిగే సరికి అస్త్రసన్యాసం చేస్తారా లేక ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ‘సర్వనాశనం’ చేయాలా అని బెదిరింపులు మొదలుపెట్టారు. ఇజ్రా యెల్ బాంబింగులు, సహాయ సరఫరాల నిలిపివేతలపై మౌనం వహిస్తున్నారు. గతంలోకి వెళితే, ఆయన గాజా, పాలస్తీనా విధా నాలు, రకరకాల ప్రకటనలు తెలిసినవే గనుక ఇక్కడ రాయ నక్కర లేదు. 20 అంశాల ప్రకటన అయితే బయటి వారితో తాత్కా లిక ప్రభుత్వం, బయటి దళాలతో భద్రతావ్యవస్థ, బయటి వారి ప్రణాళికల మేరకు అభివృద్ధి అని చెప్పటం మినహా, స్వతంత్ర పాలస్తీనా గురించి నిశ్చితంగా ఏమీ పేర్కొనక పోవటం తెలిసిందే. వీటన్నింటి చుట్టూ తిరుగుతూ ట్రంప్ వేర్వేరు మాటలతో ఏడు వారాల నగలు ధరిస్తూనే ఉన్నారు. మధ్యయుగాల క్రీడభారత దేశం, చైనాలతో ట్యారిఫ్లు, వాణిజ్య ఒప్పందాలకుసంబంధించి కూడా సరిగా ఇదే జరుగుతున్నది. ఒక రోజు బెదిరింపులు, ఈసడింపులు, మరునాడు సానునయమైన మాటలు. ఒక రోజు సంయుక్త సమావేశపు ప్రతిపాదనలు, మరొకరోజు వాయి దాలు... ఇది ఈ రెండు ఆసియన్ దేశాల విషయంలోనూ జరుగు తున్నది. ట్రంప్కు సమస్య ఎక్కడ వస్తున్నదంటే, కొద్ది తేడాలతో రెండు దేశాలు కూడా ఒక పరిమితిని దాటి తమ జాతీయ ప్రయో జనాలను వదులుకునేందుకు సిద్ధంగా లేవు. చైనా అయితే తన ఆర్థిక బలిమి వల్ల, కొన్ని రంగాలలో అమెరికాను పూర్తిగా ధిక్కరించ గలగటం ట్రంప్కు పాలుపోని పరిస్థితి అయింది. అయినా చైనా, ఇండియాలను గెలవనివ్వకూడదు గనుక, తరచూ ‘నగల మార్పిడి’ చేసుకుంటూనే ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు అర్థం చేసుకుని మారవలసింది ఏమంటే, తన వ్యూహంలో బలహీనతలు అనేకం ఉన్నాయి. ప్రపంచం ఒకప్పటి వలె లేదు. అందువల్ల, మధ్య యుగపు రాజువలె కిరీట ధారణ, రాణివలె ఏడువారాల నగలు చూసి చిత్తభ్రమలకు లోనై లొంగిపోయే వారి సంఖ్య నానాటికి తగ్గిపోతున్నది.- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు- టంకశాల అశోక్ -
ఆదర్శాలతో అవతరించి...ఎన్నో విజయాలు సాధించి
రెండవ ప్రపంచ యుద్ధం వల్ల ప్రపంచం తీవ్ర అశాంతిని అనుభవించింది. దీంతో శాశ్వతమైన శాంతి కోసం ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని, 1945 అక్టోబర్ 24న 51 దేశాలు కలిసి ‘ఐక్యరాజ్యసమితి చార్టర్’ (United Nations Charter) ను అమల్లోకి తెచ్చాయి. ఆ తరువాత అనేక దేశాలు ఐక్యరాజ్య సమితిలో చేరాయి. అంతర్జాతీయ శాంతిని కాపాడడం, దేశాల మధ్య స్నేహ పూర్వక సంబంధాలను పెంపొందిస్తూ, అంతర్జాతీయ సహకారాన్ని సాధించడం, మానవ హక్కులను పరిరక్షించడం, సుస్థిరాభివృద్ధిని సాధించడం, యుద్ధాలను నివారించడం ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) ప్రధాన లక్ష్యాలుగా చెప్పవచ్చు. సాధించిన విజయాలుయుద్ధాలు, అంతర్గత ఘర్షణలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో ఐక్యరాజ్యసమితి శాంతిస్థాపన కోసం బలగాలను పంపి, వివాదాలను పరిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఉదాహరణకు, కొరియా, కాంగో, లెబనాన్, సూడాన్, సిరియా వంటి దేశాల్లో ఐక్యరాజ్యసమితి బలగాలు శాంతిస్థాపనకు ఎంతగానో కృషి చేశాయి. 1948లో ‘మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన‘ ను ఆమోదించడం ఈ సంస్థ గొప్ప విజయంగా చెప్పవచ్చు. అదేవిధంగా, ‘ప్యారిస్ ఒప్పందం’, ‘క్యోటో ఒప్పందం’ వంటి వాతావరణ మార్పుల నియంత్రణ కోసం చేపట్టిన కార్యక్రమాలు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో విజయవంతమయ్యాయి. కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, జీవవైవిధ్యం పరిరక్షణ వంటి అనేక అంశాల్లో అంతర్జాతీయ చర్చలకు ఐక్యరాజ్యసమితి ఒక వేదికగా మారింది. యూఎన్డీపీ, యునెస్కో, యునిసెఫ్ వంటి ఉపసంస్థల ద్వారా, పేదరిక నిర్మూలన, విద్యా విస్తరణ, ఆరోగ్య సంరక్షణలో అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా పోలియో, మలేరియా, టీబీ వంటి వ్యాధుల నిర్మూలనలో యూఎన్ఓ విజయవంతమైంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందించడం ద్వారా ప్రపంచంలో సమానాభివృద్ధి, సామాజిక శ్రేయస్సు కోసం యూఎన్ఓ కృషి చేస్తోంది. ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ (ఎస్డీజీల) ద్వారా 2030 నాటికి ప్రపంచ అభివృద్ధికి లక్ష్యాలను నిర్ధారించింది. శరణార్థుల సమస్యలపై మరింత దృష్టి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారత, సమాన హక్కులు, విద్య, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం ప్రత్యేక లక్ష్యంగా గుర్తించి ఆ దిశలో కృషి చేసింది. దేశాల మధ్య అణు ఆయుధాల పరిమితులు, అణుసమర పరికరాల నియంత్రణలో ఐక్యరాజ్యసమితి కీలక పాలకురాలిగా నిలిచింది. ప్రపంచ ఆహార కార్యక్రమం ద్వారా కోట్లాది ప్రజలకు ఆహారం అందిస్తోంది. అనేక విజయాలు సాధించిన మాట నిజమే కానీ ఇప్పుడు ఐరాసను ఎందుకు స్థాపించారో ఆ లక్ష్యాల సాధనలో విఫలమవుతున్నట్లు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ రాజకీయాల్లో విభజనల ఫలితంగా ఈ పరిస్థితి చోటుచేసుకుంది. ముఖ్యంగా అమెరికా పెత్తనం ఎక్కువవ్వడం, నిధుల్లో ఆ దేశం కోత విధించడం వంటి కారణాలు ఐరాసను డమ్మీగా మార్చేస్తున్నాయి. ప్రపంచ శాంతిని కాపాడడంలో చిన్న, పెద్ద దేశాలు అనే తేడా లేకుండా వ్యవహరించాలి. లేకపోతే, మనం ఎదుర్కొంటున్న యుద్ధాలు మరింత తీవ్రతరమవుతాయి. ఫలితంగా ప్రపంచం అశాంతిమయం అవుతుంది. VIDEO | Delhi: EAM S. Jaishankar, speaking at an event on the UN’s 80th anniversary at Jawaharlal Nehru Bhawan, says, "Even today, we are regrettably witnessing multiple conflicts. The Global South, in particular, has felt this pain. The 80th anniversary is a significant… pic.twitter.com/qWuexBYrL4— Press Trust of India (@PTI_News) October 24, 2025– డా. బి. లావణ్య, రాజనీతిశాస్త్ర విభాగం, కాకతీయ యూనివర్సిటీ -
‘ఆడపడుచు కట్నాలు’ ఫలిస్తాయా?
రానున్న బిహార్ ఎన్నికల్లో మహిళా ఓటు నిర్ణయాత్మకం కాబోతోందా? వారు కింగ్ మేకర్లు కాబోతున్నారా? 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులు 54.6 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుంటే, స్త్రీలు వారికన్నా ఎక్కువగా 59.7 శాతం మంది పోలింగ్లో పాల్గొన్నారు. బిహార్లో ఇలా మహిళలు పెద్ద యెత్తున ఓటు వేసేందుకు తరలిరావడం దశాబ్దం పైనుంచి కనిపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విజయాన్ని ఖాయం చేయడంలో వారి ఓటు సహాయపడిందనడంలో సందేహం లేదు. కానీ ఈ నవంబర్లో పరిస్థితిలో మార్పు రావచ్చు. వివాదాస్పదంగా మారిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమం తర్వాత సిద్ధమైన ఓటర్ల వివరాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ప్రస్తుత ఓటర్ల జాబితాలోని మొత్తం 7.43 కోట్ల మందిలో మహిళల (3.5 కోట్ల మంది) కన్నా పురుషులు (3.92 కోట్ల మంది) ఎక్కువగా ఉన్నారు. అంటే, ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు మహిళా ఓటర్లు 892 మంది చొప్పున ఉన్నారు. ఈ మార్పు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే, 2015–20 మధ్యలో పురుష ఓటర్ల సంఖ్య 34.42 లక్షలు పెరిగితే, మహిళా ఓటర్లు 39.62 లక్షల మంది పెరిగారు.మహిళల నాడి తెలుసుకొని...బిహార్ ఎన్నికల్లో కులం పాత్ర ముఖ్యమైనదే కానీ, ప్రధానంగా నితీశ్ కుమార్ ఉత్సాహ ప్రోత్సాహాలతోనే ఎన్నికల రాజకీయాల్లో మహిళలు పాల్గొనడం పెరిగింది. పంచాయతీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు నిర్ణాయక శక్తిగా మారే విధంగా, వారు చురుకుగా పోలింగ్లో పాల్గొనేటట్లుగా ఆయన 2005 నుంచి కీలకమైన చర్యలు తీసుకుంటూ వచ్చారు. నిజం చెప్పాలంటే, రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించిన కారణంగానే గత రెండు ఎన్నికల్లో నితీశ్ విజయం సాధించగలిగారు. మహిళా సాధికారతకూ, మద్యనిషేదానికీ నితీశ్ ముడిపెట్టారు. తాగుడు వ్యసనం వల్ల మహిళలే ఎక్కువ ఇక్కట్లు పడుతున్నారంటూ ఆయన చేసిన వాదన వారిని ఆకట్టుకుంది. స్కూళ్ళకు వెళ్ళే బాలికలకు సైకిళ్ళు, యూనిఫారాలు పంపిణీ చేయడం ద్వారా, మహిళా ఓటర్లను కూడగట్టుకునే పనిని ఆయన 25 ఏళ్ళ క్రితమే ప్రారంభించారు. వారిలో కొందరు వనితలు వ్యవస్థాపక సామర్థ్యం ఉన్నవారిగా నిరూపించుకున్నారు. కొందరు మాతృమూర్తులయ్యారు. ఇన్నేళ్ళుగా నితీశ్ పట్ల వారి మమకారం చెక్కుచెదరకుండా వస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ‘లాడ్లీ బెహనా యోజన’, ‘లడ్కీ బహిన్∙యోజన’ పథకాలను అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రారంభించి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉండవచ్చు; కానీ, మహిళలపై నితీశ్ ప్రభావం అంతకన్నా పెద్దది.పోటాపోటీ వరాలుఅయితే, మహిళల్లో నితీశ్ పట్ల ఆదరణ తగ్గినట్లు ఇటీవలి ఒక ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆయన పదవి నుంచి వైదొలగి యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని మహిళల్లో చాలా మంది భావిస్తున్నారు. రాజకీయంగా మరింత పెద్ద పాత్ర వహించే విధంగా నితీశ్ తన కుమారుడు నిశాంత్ను తీర్చిదిద్దడం మొదలుపెట్టడానికి బహుశా అదే ప్రధాన కారణం కావచ్చు. రాష్ట్ర ఆర్థిక మంత్రి మార్గదర్శకత్వంలో నిశాంత్ ఎక్కువ సమయాన్ని సమస్తిపూర్ నియోజకవర్గంలో వెచ్చిస్తున్నప్పటికీ, ఆయన ఈ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయడం లేదు. కనుక, రానున్న ఎన్నికల్లో నితీశ్దే ప్రధాన పాత్ర. మహిళా ఓటర్లపై తన పట్టును కొనసాగించేందుకు నితీశ్ యుక్తిని ప్రదర్శించారు. మహిళా ఔత్సాహికæ పారిశ్రామికవేత్తలకు ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’ కింద ఇవ్వదలచిన రూ. 10,000 కోట్ల మొదటి విడత మొత్తాన్ని బదిలీ చేస్తున్నట్లు ఇటీవల ఆయన ప్రకటించారు. వ్యవస్థాపక సామర్థ్యం కనబరచిన మహిళలకు వచ్చే ఆరు నెలల్లో, మరో రూ. 2 లక్షల చొప్పున బదిలీ అవుతాయి. ఈ పథకం కింద దాదాపు రూ. 21,000 కోట్లను వెచ్చించనున్నారు. నితీశ్ ఈ ఏడాది సెప్టెంబర్లో మరికొన్ని పథకాలు ప్రకటించారు. సుమారు 1.89 కోట్ల మంది వినియోగదారులకు రూ. 5,000 కోట్ల వ్యయంతో 125 మెగావాట్ల ఉచిత విద్యుత్తును అందించనున్నారు. సామాజిక భద్రతా పింఛను పథకం 1.11 కోట్ల మందికి లబ్ధి చేకూర్చనుంది. జీవిక, అంగన్వాడి, ‘ఆశా’ వర్కర్ల గౌరవ వేతనాలను పెంచారు. దీనివల్ల, ప్రభుత్వ ఖజానాపై మరో రూ.9,300 కోట్ల భారం పడనుంది. కొత్తగా ప్రకటించిన కేటాయింపుల వల్ల ఏటా అదనంగా రూ. 40,000 కోట్లు ఖర్చు కానున్నాయి. రాష్ట్ర వార్షిక రాబడి మొత్తం దాదాపు రూ. 56,000 కోట్ల మేరకు ఉంటుంది. రూ. 7 లక్షల కోట్ల వ్యయమయ్యే ఈ ఉచిత పథకాల వాగ్దానాలను ఎలా నెరవేరుస్తారని ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రశ్నిస్తున్నారు. కానీ, జనాకర్షక వాగ్దానాలు చేయడంలో ఆయనా ఏమీ వెనుకబడి లేరు. ప్రతిపక్ష ‘మహాగuЇబంధన్’ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఖాయమని ఆయన హామీ ఇచ్చారు. ఆ ప్రతిపాదనలోని ఆర్థికాంశాలను తేజస్వి పరిశీలించలేదని వేరే చెప్పనక్కర లేదు. రాష్ట్రం అంత భారాన్ని మోయగల స్థితిలో ఎంతమాత్రం లేదు.తగ్గని అతివల అగచాట్లుఇటీవల రాష్ట్రం నలుమూలల పర్యటించి, గ్రామాలు, పట్టణాలలోని మహిళలతో మాట్లాటిన సామాజిక ఉద్యమకారిణి షబ్నం హష్మీ వారి స్థితిగతులు ఏమీ బాగా లేవని చెబుతున్నారు. వనితలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారనీ, ‘హఫ్తాలు’ (రౌడీ మామూళ్ళు) చెల్లించుకోలేని మహిళల ఇళ్ళకు గూండాలు వచ్చి, ఉన్న వస్తువులను పట్టుకుపోతున్నారనీ ఆమె అంటున్నారు. ముఖ్యంగా, బిహార్ ఉత్తర ప్రాంతంలో మహిళలు తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారని ఆమె చెబుతున్నారు. తమపైన, తమ పిల్లలపైన హింసాయుత చర్యలు పేట్రేగిపోతున్నాయని వారిలో చాలా మంది వాపోయారని హష్మీ వెల్లడిస్తున్నారు. రేషన్ కార్డు సంపాదించడాని కైనా లేదా రేషన్ కార్డులో కొత్త పేర్లు చేర్చడానికైనా అడుగడుగునా లంచాలు చెల్లించుకోవాల్సి వస్తోందన్నది మహిళల నుంచి ఎదురైన మరో ప్రధాన ఫిర్యాదు. నితీశ్ కుమార్ మహిళలకు స్నేహపూర్వకమైన పథకాలు చేపడుతున్నారని చేస్తున్న ప్రచారంలో పస లేదనీ, వాస్తవానికి, సామూహికంగా వలసపోతున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు మహిళల్లో పెరిగాయనీ హష్మీ మాట. కాగా, గత ఎన్నికల్లో ఆర్.జె.డి., ఇతర ప్రతిపక్షాల వైపు ఓటర్లు మొగ్గినట్లు విశ్లేషణలు సూచించిన ప్రాంతాల్లో మహిళలు, ముస్లింల పేర్లు మాయమయ్యాయని లక్నో యూనివర్సిటీ మాజీ వైస్–చాన్స్లర్ ప్రొఫెసర్ రూప్ రేఖ అభిప్రాయపడుతున్నారు. బీజేపీ కార్యకర్తలు లక్నోలో పార్టీకి అనుకూలమైన, వ్యతిరేకమైన ప్రతి గడపనూ గుర్తించడాన్ని ఆమె అందుకు ఉదాహరణగా చూపుతున్నారు. ‘‘క్షేత్ర స్థాయిలో వారి (బీజేపీ) కార్యకర్తలు మరింత చురుకుగా ఉన్నారన్నది వాస్తవం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఏమైనా బిహార్లో తరాలలో మార్పు వచ్చిందనడంలో ఇసుమంత సందేహం కూడా అవసరం లేదు. తేజస్వీ యాదవ్, చిరాగ్ పాశ్వాన్ ఈ మార్పునకు కరదీపకులుగా ఉన్నారు. బిహార్లో పాచికలు పైకి ఎగిరాయి. అవి ఎవరికి అనుకూలంగా పడతాయన్నది ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే!రష్మీ సెహగల్వ్యాసకర్త రచయిత్రి, సీనియర్ జర్నలిస్ట్(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
పక్కనపెట్టిన ప్రోటోకాల్తో తంటా
‘‘దౌత్యమంటే 50 శాతం ప్రోటోకాల్, 30 శాతం ఆల్కహాల్, 20 శాతం టి.ఎన్. కౌల్’’ అని మన దేశంలో చమత్కారంగా అంటూంటారు. ఒకప్పుడు విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన టీఎన్ కౌల్ పేరు తో ఆ చమత్కారం వాడుకలోకి వచ్చింది. ఆయన మాస్కో, వాషింగ్టన్ వంటి ముఖ్యమైన చోట్ల భారత రాయబారిగానూ పనిచేశారు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా దౌత్యం తీరుతెన్నులు మారుతున్నాయి. సంప్రదాయ ఉల్లంఘనల చిక్కుఇటీవలి కాలంలో భారతీయ దౌత్య సంప్రదాయాల్లో గణనీయమైన మార్పు అక్టోబర్ 11న కనిపించింది. మన దేశంలో అమెరికా రాయబారిగా నియమితుడైన సెర్జియో గోర్కు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. న్యూఢిల్లీలో గోర్ నూతన బాధ్యతలకు సంబంధించి చాలా విషయాలు సంప్రదాయానికి భిన్నంగానే సాగాయి. 38 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన ఇంత పెద్ద బాధ్యతల్లోకి వచ్చారు. ఆయనకు దౌత్య అనుభవం సున్నా. ఒక రాయబారి పదవికి ఆయనకున్న శక్తిసామర్థ్యాలేమిటి అనేది అమెరికా సెనేట్ ముందు శల్యపరీక్షకు లోనుకాలేదు. అమెరికా కాంగ్రెస్కు నిలయమైన క్యాపిటల్ హిల్లో ప్రోటోకాల్ ఎలా ఉల్లంఘనకు లోనైందో, అదే మాదిరిగా భారతదేశంలో అధికార కేంద్రమైన రైజీనా హిల్లోనూ ఉల్లంఘనకు లోనైంది. దానికి ఎంతటి మూల్యాన్ని చెల్లించుకోవలసి వచ్చిందో మోదీ ప్రభుత్వం ఇటీవలనే తెలుసుకుంది. రాయబారిగా నియమితులైనవారు తమ నియామక పత్రాలను రాష్ట్రపతికి సమర్పించిన తర్వాతనే, అధికారిక లాంఛనాలు అమలులోకి వస్తాయి. ఆ తతంగం పూర్తి కాకుండానే ప్రధాని తన కార్యాలయంలో గోర్తో సమావేశమయ్యారు. ఈ సంఘటన చోటుచేసుకోకపోయి ఉంటే, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ళపై ప్రస్తుత గందరగోళానికి అవకాశం ఉండేది కాదు. మోదీ–గోర్ మధ్య సంభాషణను ఆధారంగా చేసుకుని, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ళను ఆపేస్తోందంటూ అక్టోబర్ 15న ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించేశారు. ఈ ‘సంచలన వార్త’ను ప్రకటించేందుకు గోర్ అనుమతిని ట్రంప్ కోరారు. మోదీతో తాను ఫోన్లో సంభాషించినపుడు, మోదీ తనతో ఆ మాట అన్నట్లు, ట్రంప్ ఎన్నడూ చెప్పలేదు. మోదీ ‘‘రష్యా నుంచి చమురు కొనబోవడం లేదని ఈ రోజు (అక్టోబర్ 15) నాకు హామీ ఇచ్చారు’’ అని మాత్రమే ట్రంప్ చెప్పారు. ఈ అంశంపై మోదీ ఆలోచనలను సరిగ్గానో లేదా తప్పుగానో అధ్యక్షుని చెవిన వేసింది గోరేనని, ట్రంప్ మీడియా సమావేశం పూర్తి వీడియో చూస్తే తేటతెల్లమవుతుంది. శ్వేతసౌధంలో ఉన్నదే సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించే వ్యక్తి గనక, ప్రధానికీ, గోర్కూ మధ్య సమావేశం ఏర్పాటు చేస్తే, అది ఊహించని పర్యవసానాలకు దారితీస్తుందని ప్రధాని సలహాదారులు గ్రహించి ఉండవలసింది. భారతదేశంలో దౌత్యం తాలూకు సంప్రదాయాల గురించి బొత్తిగా అనుభవం లేని వ్యక్తికి, నేరుగా ప్రధానితో సమావేశమయ్యే అవకాశం కల్పించకూడదు. చివరగా జరగవలసిన పని మొదట్లోనే జరిగింది. దౌత్యవేత్తలు గట్టిగా ఉంటే...అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ 2000వ సంవత్సరంలో భారత పర్యటనకు రావడానికి ఒక వారం ముందు, ఒక విమానం నిండా మెరైన్లు, క్లింటన్ ముందస్తు భద్రతా దళ సిబ్బంది ఆ రోజు మధ్యాహ్నం భారత్కు బయలుదేరుతారని క్లింటన్ పాలనా యంత్రాంగంలోనివారు వాషింగ్టన్ లోని భారతీయ రాయబార కార్యాలయానికి తెలియజేశారు. మెరైన్లు సకాలంలో భారతీయ వీసా తీసుకున్నారా అంటూ రాయబారి కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్గా ఉన్న టి.పి. శ్రీనివాసన్ మర్యాదపూర్వకంగానే ప్రశ్నించారు. అప్పటికి వారు వీసాల కోసం కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. ‘‘అమెరికా మెరైన్లు వీసాలపై ప్రయాణించరు’’ అని ఫోన్ చేసిన వ్యక్తి కసురుకుంటున్న రీతిలోనే చెప్పారు. కానీ, శ్రీనివాసన్ అదరలేదు. ‘‘మెరైన్లకు వీసాలు లేకపోతే వారు భారత్ వెళ్ళడానికి ఉండదు. వారి విమానం న్యూఢిల్లీలో ల్యాండ్ అవడానికి వీలుపడదు’’ అని నిష్కర్షగా చెప్పేశారు. దాంతో అమెరికన్లు దారికి వచ్చి, ప్రయాణ నియమాలను పాటించారు. గోర్ విషయంలో మాదిరిగానే, భారత్ ప్రోటోకాల్ను ఉల్లంఘించిన ఉదంతం మరోటి కూడా గుర్తుకు వస్తోంది. భారత్లో అమెరికా రాయబారిగా నియమితుడైన రిచర్డ్ సెలెస్ట్, 1997 నవంబర్లో న్యూఢిల్లీలో దిగుతూనే, అప్పటి విదేశాంగ కార్యదర్శి కె.రఘునాథ్ ఇచ్చిన ప్రైవేటు విందుకు హాజరయ్యారు. అప్పటి ప్రధాని ఐ.కె. గుజ్రాల్ అంతకు రెండు నెలల ముందు న్యూయార్క్లో క్లింటన్ను కలుసుకుని, ఆయనను భారత పర్యటనకు ఆహ్వానించారు. విదేశాంగ విధానంపై తనదైన ముద్రవేయాలని చూస్తున్న గుజ్రాల్, అప్పటికి 19 ఏళ్ళ విరామం తర్వాత, ఒక అమెరికా అధ్యక్షుడు భారతదేశానికి వస్తే, తన పేరు ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయని భావించారు. క్లింటన్ పర్యటనకు వేగంగా మార్గం సుగమం చేయవలసిందిగా సెలెస్ట్ను కోరారు. సెలెస్ట్ ఆ మాటలకు పడిపోలేదు. తన నియామక పత్రాలను రాష్ట్రపతికి సమర్పించి, రాజకీయ వాస్తవ పరిస్థితులను బేరీజు వేశారు. భారత పర్యటనకు అది సరైన సమయం కాదని గుట్టుచప్పుడు కాకుండా క్లింటన్కు సలహా ఇచ్చారు. గుజ్రాల్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిదనే నిర్ధా్ధరణకు క్లింటన్ పాలనా యంత్రాంగం వచ్చింది. ఆ తర్వాత, ఐదు నెలలకే గుజ్రాల్ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఉల్లంఘనకూ ఓ లెక్కుండాలి!భారత్లోగానీ, మరెక్కడైనాగానీ రాయబారులుగా నియమితులైనవారు ప్రభుత్వాధినేతలను కలుసుకోవడం అసాధారణమైన విషయం ఏమీ కాదు. కాకపోతే, ఆ దౌత్యవేత్త నమ్మకస్థుడిగా పేరు తెచ్చుకుని, ఆతిథేయ దేశం గురించి సరైన సలహా ఇవ్వగలిగిన యోగ్యత కలిగినవారై ఉంటారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ కూడా గుజ్రాల్ మాదిరిగానే తొందరపడబోయి 1979లో అభాసు పాలయ్యారు. అప్పట్లో ఆయన మరో అగ్ర రాజ్యపు రాయబారిని సమావేశానికి పిలిచారు. కాబూల్పై సోవియట్ దురాక్రమణకు సంబంధించి సోవియట్ రాయబారి యులి వొరొంత్సోవ్కు క్లాసు పీకాలని చరణ్ సింగ్ ఉద్దేశం. తీరా, సోవియట్ రాయబారి మాటలకు చరణ్ సింగ్ ఖంగు తిన్నారు. మరి కొద్ది రోజుల్లో మళ్ళీ ప్రధాని కాబోతున్న ఇందిరా గాంధీని కలిసి మాట్లాడాననీ, మాస్కో వైఖరిని అర్థం చేసుకున్న రీతిలో ఆమె మాట్లాడారనీ వొరొంత్సోవ్ కుండబద్దలు కొట్టారు. అవతలి పక్షం కూడా న్యాయబద్ధంగా వ్యవహరించగలదనే నమ్మకం ఉంటే, ప్రొటోకాల్ను అప్పుడప్పుడు ఉల్లంఘించినా ఫరవాలేదు. లేకపోతే, అది వికటించే ప్రమాదం ఉందని గ్రహించాలి. కె.పి. నాయర్వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఏఐలో మౌలిక సవాళ్ళు
కృత్రిమ మేధ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉద్యోగాల స్వభావంపై ప్రభావం చూపిస్తోంది. ఈ కృత్రిమ మేధ మానవ మనుగడకు ప్రమాదమని కొంతమంది వాదిస్తున్నప్పటికీ, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందిన భారత్కు, ఏఐ లాంటి నూతన సాంకేతికత విషయంలో ‘గ్లోబల్ లీడర్’గా స్థానం సంపాదించవలసిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా జెనరేటివ్ ఏఐ వినియోగించే సంస్థలు 2023లో 33 శాతం కాగా, 2024లో అవి 71 శాతానికి పెరిగాయి. పటిష్ఠమైన వృత్తి నైపుణ్యం కల్గిన శ్రామికులు, సాంకేతికతపై సంస్థల భారీ పెట్టుబడులు, డిజిటల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి కారణంగా భారత ఏఐ మార్కెట్ 2027 నాటికి 17 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ‘బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు’ నివేదిక వెల్లడించింది. 2030 నాటికి ఏఐ కారణంగా డేటా ఎన్నొటేషన్, ఏఐ ఇంజినీరింగ్, కస్టమర్ సేవలు, ఎథికల్ ఏఐలో 40 లక్షల మందికి నూతన ఉపాధి లభిస్తుందని ‘నీతి ఆయోగ్’ అభిప్రాయపడింది. ఏఐ విజయంలో స్టార్టప్లు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది. ఇంటర్నెట్ లేకుండానే ఏఐ ఎలా?ఏఐ సాంకేతికత కారణంగా భారత్లో ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ, ఐటీ సేవలు, విద్య, వ్యవసాయ రంగంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే, డేటా భద్రత–ప్రైవసీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత, ఏఐ సొల్యూషన్స్ అమలుపరచడానికి తగిన పెట్టుబడి లేకపోవడం, డేటా నాణ్యత తక్కువగా ఉండటం, ఎథిక్స్ ఏఐ సొల్యూషన్ ప్రొవైడర్స్కు సవాలుగా పరిణమించడం లాంటివి ఏఐ సాంకేతిక వినియోగంలో ప్రధాన సమస్యలుగా నిలుస్తున్నాయి.జాతీయ స్థాయిలో సీబీఎస్ఈ కృత్రిమ మేధను ఐచ్ఛిక సబ్జెక్ట్గా 9, 10వ తరగతి విద్యార్థులకు 2019–20లో; సెకండరీ విద్య (6, 7 తరగతులు)లో 2022–23 నుండి ప్రవేశపెట్టింది. కానీ ఏఐని ఐచ్ఛిక సబ్జెక్ట్గా ప్రవేశపెట్టిన పాఠశాలల్లో 2021–22 నాటికి 33.9% పాఠశాలలు మాత్రమే ఇంటర్నెట్ లభ్యతను కలిగి ఉన్నాయి; ఆ యా పాఠశాలల్లోని ఉపాధ్యాయుల్లో 50 శాతం కన్నా తక్కువమంది కంప్యూటర్ వినియోగం పట్ల అవగాహన కలిగి ఉన్నారు. ఇది పాఠశాలల స్థాయిలో అవస్థాపనా సౌకర్యాల కొరతను ఎత్తిచూపుతోంది. కేంద్ర ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరంలో మూడో తరగతి నుండే పాఠశాల విద్యా ప్రణాళికలో ఏఐని ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. ఈ క్రమంలో సీబీఎస్ఈ అన్ని తరగతులలో ఏఐని అనుసంధానపరచడానికి ఒక చట్రాన్ని (ఫ్రేమ్ వర్క్) రూపొందిస్తున్నప్పటికి, కోటిమంది ఉపాధ్యాయులకు ఏఐ–సంబంధిత విద్యలో శిక్షణనివ్వడం క్లిష్టతరమయ్యే అవకాశం ఉంది.రాష్ట్రాల్లో మౌలిక ఇబ్బందులుఏఐ అడాప్షన్లో రాష్ట్రాల మధ్య అసమానతలు స్పష్టమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2023 జూలైలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు కరిక్యులమ్లో ఏఐని చేర్చాలనీ; ఏఐ, రోబోటిక్స్ను మెడికల్ విద్యలో ప్రవేశపెట్టాలనీ విద్యాశాఖ అధికారులు, వైస్ ఛాన్స్లర్లకు సూచించారు. విద్యార్థులను ‘ఏఐ క్రియేటర్స్’గా రూపొందించాలనే లక్ష్యాన్ని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. సుపరిపాలన, ఇతర రంగాలలో అభివృద్ధి నిమిత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏఐ వినియోగానికి ప్రాధాన్యమిస్తూ, బోధనా పద్ధతులలో మార్పు నిమిత్తం టెక్ దిగ్గజాలతో కలసి పనిచేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏఐని ప్రోత్సహించడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందించింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం లాంటి రంగాలలో సమర్థత, సర్వీస్ డెలివరీ పెంపునకు ఆ యా శాఖల్లో ఏఐని అనుసంధానపరచింది. 5 లక్షల మందికి ఏఐ నైపుణ్యంపై శిక్షణనివ్వడంతో పాటు, కోటి మంది ప్రజలకు 2027 నాటికి 300కు పైగా, పౌర సేవలను ఏఐ ద్వారా అందించాలనీ, ప్రపంచవ్యాప్తంగా మొదటి 25 ఏఐ ఇన్నోవేషన్ హబ్లలో హైదరాబాద్ స్థానం సాధించాలనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత లక్ష్యసాధనలో అవరోధంగా నిలిచే ప్రమాదం ఉంది.మరోవైపు కర్ణాటక 28 కోట్ల వ్యయంతో 2029 నాటికి 3,50,000 మందికి ఏఐ ఉపాధి లక్ష్యంగా ‘ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’ను బెంగళూరులో ఏర్పాటు చేసింది. పశ్చిమ రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర కూడా యూనివర్సిటీల్లో ఏఐ కేంద్రాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఏఐలో ఉన్నత విద్య సర్టిఫికేషన్కి హరియాణా ప్రాధాన్యమిస్తోంది. బిహార్లో అవస్థాపనా సౌకర్యాల కొరత, పట్టణ – గ్రామీణ, ప్రభుత్వ –ప్రైవేటు రంగంలోని అసమానతల వల్ల కృత్రిమ మేధ ప్రగతి తక్కువగా ఉంది.సమంగా పంపిణీ కాకపోతే...కృత్రిమ మేధ ప్రయోజనాలు అన్ని వర్గాల ప్రజల మధ్య సమంగా పంపిణీ కావడం లేదు. ఏఐ సాంకేతికత... ఉపాధి పెంపు, ఆదాయ సమాన పంపిణీ, సంపద కల్పనకు దారి తీయనట్లయితే సమాజంలో అన్ని వర్గాల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. ఆదాయ స్థాయి, సామాజిక తరగతులు (సోషల్ క్లాస్) ఏఐ సాంకేతికత అందుబాటును నిర్ణయిస్తున్నాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో బ్రాడ్బాండ్ కనెక్టివిటీ తక్కువగా ఉండటం వలన ఏఐ సాంకేతికత అందుబాటు అసమానతలకు కారణమవుతోంది. పైగా పరిమిత విద్యుచ్ఛక్తి లభ్యత ఏఐ సేవల వృద్ధిని ప్రభావితం చేస్తుంది. 2030–35 నాటికి ప్రపంచ విద్యుత్ వినియోగంలో డేటా సెంటర్ల వాటా 20 శాతంగా ఉండి పవర్ గ్రిడ్స్పై అధిక ఒత్తిడికి కలుగ జేస్తాయని అంచనా. భారీ పరిమాణంలో డేటాను ప్రాసెస్ చేయడానికీ, గణనకు అవసరమయిన గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్లు, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లు పని చేయడానికీ, శిక్షణలో భాగంగా ప్రాసెసర్లు పని చేయడానికీ భారీ విద్యుత్ అవసరం. విద్యుత్ లభ్యత పట్టణ ప్రాంతాలతో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో తక్కువ. తద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఏఐ అడాప్షన్లో తేడాలు ఎక్కువగా ఉంటాయి. పారిశ్రామికీకరణ, అధిక పట్టణీకరణ అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులో విద్యుత్ వినియోగం అధికం కాగా; ఈశాన్య రాష్ట్రాలు, తక్కువ పారిశ్రామికీకరణ చెందిన బిహార్, జార్ఖండ్లో విద్యుత్ వినియోగం తక్కువ. డిజిటల్ లిటరసీ గ్రామీణ ప్రాంతాలలో 25 శాతం కాగా, పట్టణ ప్రాంతాలలో 61 శాతం. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లను సొంతంగా కలిగి ఉండటం కూడా ఏఐ సాంకేతికత వినియోగానికి తప్పనిసరి.కృత్రిమ మేధ వ్యాప్తి అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ అసమానతలను తొలగించి సమానత్వ సాధనకు దోహదపడగలదు. అందుకే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ నైపుణ్యం కల్గిన శ్రామిక శక్తిపై పెట్టుబడులు పెంచాలి. ఏఐ సాంకేతికతను మానవ శ్రేయస్సు పెంపొందించుకొనే విధంగా రూపొందించుకోవాలి. దానికోసం సమాజంలో విస్మరణకు గురైన వర్గాల ప్రజలకు ‘రీ–ట్రైనింగ్’ అందించే సామాజిక భద్రతా పథకాలు అవసరం. డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇంచార్జ్), ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
చైనా డ్యామ్తో మహా విపత్తు
ప్రపంచ జల సంతులనాన్ని తలకిందులు చేసే పనికి చైనా ఒడిగడుతోంది. దాని పర్యవసానాలు వాతావరణ మార్పు అంశమంతటి తీవ్ర ప్రభావం చూపబోతు న్నాయి. చైనా 168 బిలియన్ డాలర్లతో హిమాలయ సూపర్–డ్యామ్ నిర్మిస్తోంది. ఇది ప్రపంచంలో అత్యంత ఖర్చుతో కూడిన మౌలిక వసతి ప్రాజెక్టు మాత్రమే కాక, అంతర్జాతీయంగా అత్యంత ముప్పుతో కూడుకున్నది కావడం వల్ల భయాలు వ్యక్తమవుతున్నాయి. బీజింగ్ దీన్ని ఇంజినీరింగ్ అద్భుతంగా వర్ణిస్తోంది కానీ, నిజానికి దాన్ని ముంచుకొస్తున్న జీవావరణ మహా విపత్తుగా పేర్కొనాలి. యాలంగ్ జింగ్పొ నది మలుపు తిరిగి భారతదేశంలోకి ప్రవే శిస్తున్న చోటుకు కొద్ది వెనుకగా ఈ ఆనకట్టను నిర్మిస్తున్నారు. దీన్ని మనం బ్రహ్మపుత్ర నదిగా పిలుచుకుంటాం. చైనా ప్రధాని లీ చాంగ్ గత జూలైలో ఈ ఆనకట్టకు శంకుస్థాపన చేసి ప్రాజెక్టు గురించి అధి కారికంగా ప్రకటించారు. కానీ, ఆనకట్ట నిర్మాణ పనులు కొంతకాలంగా సాగుతున్నాయని ఉపగ్రహ ఛాయాచిత్రాలు వెల్లడిస్తున్నాయి. రహస్య నిర్మాణంచైనా నాయకుడు ఒకరు ఒక ఆనకట్టకు శంకుస్థాపన చేయడం చివరిసారిగా 1994లో జరిగింది. యాంగ్ చి నదిపై నిర్మించిన త్రీ గార్జెస్ డ్యామ్కు అప్పటి ప్రధాని లి పెంగ్ శంకుస్థాపన చేశారు. దాని కన్నా కూడా బ్రహ్మపుత్ర మెగా డ్యామ్ పరిమాణంలో చాలా పెద్దది. ఈ ప్రతీకాత్మకత మారుతున్న ప్రపంచంలో పెరుగుతున్న చైనా ఆశ లతోపాటు, పెద్ద గండాన్ని సూచిస్తోంది. త్రీ గార్జెస్ డ్యామ్ను మొదట్లో ఆధునిక వింతగా కీర్తించారు. ఇపుడు దాన్ని పర్యావరణ, సామాజికపరమైన వైపరీత్యంగా గుర్తిస్తు న్నారు. దానివల్ల పది లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు. ఈ డ్యామ్ తరచూ కొండచరియలు విరిగిపడటానికి కారణమవుతోంది. భూగోళ కంపన సుస్థిరత దెబ్బతింది. దాని బ్రహ్మాండ జలాశయం చివరకు భూ భ్రమణాన్ని కూడా కొద్దిగా మందగింప జేసింది. చైనా చేపట్టిన నూతన ప్రాజెక్టు స్థితిగతులు మరింత ప్రమాద కరంగా ఉన్నాయి. ప్రపంచంలో భూకంపాలకు ఎక్కువ అవకా శాలున్న ప్రాంతాల్లోని ఒకదానిలో దాన్ని నిర్మిస్తున్నారు. సైనిక దళాలు పెద్ద యెత్తున మోహరించి ఉండే∙సరిహద్దు ప్రాంతానికి దగ్గరలో అది ఉంది. భారతదేశపు విశాలమైన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని చైనా ‘దక్షిణ టిబెట్’గా పరిగణిస్తోంది. నిర్మాణంలో బల హీనత వల్లగానీ లేదా జలాశయం పురికొల్పగల భూగర్భ ఫలకాల చలనం వల్లగానీ డ్యామ్ కుప్పకూలితే, భారతదేశపు ఈశాన్య ప్రాంతం, బంగ్లాదేశ్ మహా విధ్వంసాన్ని చవిచూడవలసి రావచ్చు. త్రీ గార్జెస్ డ్యామ్ కన్నా దాదాపు మూడింతల ఎక్కువ విద్యుదుత్పాదనకు వీలుగా రూపకల్పన చేసిన ఈ డ్యామ్కు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ 2021లో ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ నదుల పొడవునా పెద్ద పెద్ద ప్రాజెక్టులను రహస్యంగా నిర్మిస్తూ పోవడం చైనాకు రివాజుగా మారింది. జలం ఆధిపత్య సాధనంబ్రహ్మపుత్ర, మిగిలిన నదుల లాంటిది కాదు. హిమాలయ ఉత్తుంగ శిఖరాల నుంచి కిందకు దూకుతూ ప్రపంచంలోని అత్యంత నిటారైన, లోతైన లోయను సృష్టిస్తోంది. అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ కన్నా ఇది రెండింతల లోతైనది. సాటిలేని నదీమ శక్తి కేంద్రీకృతమవుతున్న చోట డ్యామ్ను చైనా నిర్మిస్తోంది. టిబెట్లోని పర్వతాలపైన నీటి బుగ్గల నుంచి పుడుతున్న బ్రహ్మపుత్ర, ప్రపంచంలోని ఎత్తయిన ప్రాంతాల నుంచి ప్రవహించే ప్రధాన నదులలో ఒకటి. భారత్, బంగ్లాదేశ్ గుండా ప్రవహించే ఈ నది వ్యవసాయానికి, మత్స్యసంపదకు ఆలంబనగా ఉంటూ, జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మనుగడ కల్పిస్తోంది. బ్రహ్మపుత్రకు ఏటా వచ్చే వరదలు విధ్వంసకరమైనవే అయి నప్పటికీ, అవి విష పదార్థాలను తోసుకుపోతాయి. భూగర్భ జలాల మట్టాన్ని పెంచుతాయి. సేద్యానికి ఎంతో ముఖ్యమైన పోషక విలువ లున్న అవక్షేపాలను పొలాలకు చేకూర్చుతాయి. కానీ సూపర్– డ్యామ్ ఈ గతిని తలకిందులు చేస్తుంది. ఒండ్రుమట్టికి అడ్డుకట్ట వేస్తుంది. పెరుగుతున్న సముద్ర మట్టాలతో ఇప్పటికే సంకటంలోనున్న బంగ్లాదేశ్ డెల్టా కుంచించుకుపోతుంది. భారతీయ రైతులను సహజ ఫలదీకరణ ఆవృత్తాలకు దూరం చేస్తుంది. ఉప్పు నీరు చేరిపోవడం, వరదలు మరింత పరిపాటిగా మారతాయి. వచ్చిన చిక్కేమిటంటే, నీటిని వనరుగాకాక, ఒక శక్తి సము పార్జన సాధనంగా చైనా చూస్తోంది. నది టిబెట్ను విడిచిపెట్టే చోట మెగా–డ్యామ్ నిర్మించడం ద్వారా, దిగువ ప్రవాహ ప్రాంతాలలో నివసించే కోట్లమందికి ఇష్టముంటే నీరు ఇవ్వగలగాలని, లేకపోతే నీటిబొట్టు కూడా అందకుండా చేయగలగాలని చూస్తోంది. ఒకప్పుడు చమురుపై ఆధిపత్యం ప్రపంచ శక్తిని నిర్ణయించేది. ఈ 21వ శతాబ్దంలో, సరిహద్దులను దాటి ప్రవహించే నదులపై నియంత్రణ అంతే నిర్ణాయక శక్తిగా పరిణమించవచ్చు. ఈ డ్యామ్ ద్వారా చైనా, ఒక్క తూటా కూడా పేల్చనవసరం లేకుండా, నీటిని ఆయుధంగా మలచుకోగలుగుతుంది. ‘చమురు ఉత్పాదన, ఎగు మతి దేశాల కూటమి’ (ఒపెక్) చమురుపై ఒకప్పుడు ఎలాంటి వ్యూహాత్మక పట్టును అనుభవించిందో, నీటిపై అదే రకమైన శక్తిని చైనాకు ఈ డ్యామ్ కట్టబెట్టవచ్చు. ప్రమాదంలో జల భద్రతనిజానికి, ప్రపంచంలోని మిగిలిన దేశాలన్నీ కలిపి నిర్మించిన డ్యామ్లకన్నా కూడా ఎక్కువ సంఖ్యలో పెద్ద డ్యామ్లను చైనా నిర్మించింది. అదే ఊపులో, అది 1990ల నుంచి అంతర్జాతీయ నదు లపై దృష్టి పెట్టింది. మికాంగ్ నదిపై అది కట్టిన 11 పెద్ద డ్యామ్లు దిగువ ప్రవాహ ప్రాంతాలను ఇప్పటికే అతలాకుతలం చేస్తున్నాయి. దుర్భిక్షాలు తీవ్రమవుతున్నాయి. థాయిలాండ్, లావోస్, కంబో డియా, వియత్నావ్ులలో జీవనోపాధులకు ఎసరు పెడుతున్నాయి. ఏ రూపంలో నీటి పంపకానికైనా ససేమిరా అనడాన్ని బీజింగ్ కొనసాగిస్తోంది. పొరుగునున్న దేశాలతో నీటి పంపక ఒప్పందాలు వేటిపైనా అది సంతకం చేయలేదు. ఐక్యరాజ్య సమితి 1997లో చేసిన జలవనరుల ఒడంబడికలోనూ అది చేరలేదు. తన సరి హద్దుల లోపలనున్న జలాలన్నింటిపైన ‘నిర్ద్వంద్వ సార్వభౌమాధి కారం’ చాటుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఆసియాను మించి ప్రయోజనాలు ఇక్కడ పణంగా ఉన్నాయి. అంతర్జాతీయ సగటుకన్నా వేగంగా టిబెట్ వేడెక్కుతోంది. పీఠ భూమి హైడ్రాలజీని తారుమారు చేయడం ప్రాంతీయ జూదం మాత్రమే కాక, మొత్తం భూగోళానికి ముప్పు తేవడమే అవుతుంది. టిబెట్ నుంచి నదీ ప్రవాహాల గతులు మారుతున్న ప్రభావ ప్రకంప నాలు, ఆసియాను దాటి, బాహ్య వాతావరణ వ్యవస్థలు, ఆహార భద్రత, వలసల తీరుతెన్నులపైన కూడా కనిపిస్తాయి. దేశ సరిహద్దులను దాటి వెళ్ళే నదులపై ఏకఛత్రాధిపత్యం వహించడంలో బీజింగ్ సఫలమైతే, ఇతర దేశాలు కూడా అదే బాట పట్టవచ్చు. అది ఇతరత్రా బలహీనంగా ఉన్న సహకార నియమ నిబంధనలను నీరుగార్చవచ్చు. నైలు నదీ పరీవాహక ప్రాంతం నుంచి టైగ్రిస్–యూఫ్రటీస్ వరకు అదే పరిస్థితి నెలకొంటుంది. ఆ విధంగా, మెగా–డ్యామ్ ఒక్క ఆసియా సమస్య మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానిది. అందుకే అంతర్జాతీయ జల నిబంధనలను గౌరవించేట్లుగా అంతర్జాతీయ సమాజం చైనాపై ఒత్తిడి తేవాలి. బ్రహ్మచేలానీవ్యాసకర్త న్యూఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్’లో వ్యూహాత్మక అధ్యయనాల ప్రొఫెసర్(‘ద గ్లోబ్ అండ్ మెయిల్’ సౌజన్యంతో) -
సిద్ధరామయ్య (కర్ణాటక సీఎం) రాయని డైరీ
మనం ఏదైనా ఒకటి బలంగా అనుకున్నప్పుడు, దానిని నెరవేర్చటానికి పంచభూతాలన్నీ కలసికట్టుగా ఒక్కటై మనకు సహాయం చేస్తాయని అంటారు! ఈ మాట హైందవ పురాణ ప్రబోధమా, పవిత్ర ఖురాన్ సందేశమా, లేక పరిశుద్ధ గ్రంథ వచనమా అన్నది నాకు తెలియదు కానీ... మత విశ్వాసాలను గౌరవించటానికి ఆస్తికులు కానవసరం లేదు కనుక నేను ఈ మాటను గట్టిగా నమ్ముతాను. నాకు ఇంకొక మాట మీద కూడా గొప్ప నమ్మకం ఉంది. పదవి కోసం కాచుకొని కూర్చుండే మనుషులు ఆ పదవిలో ఉన్నవారిని తప్పించాలని బలంగా సంకల్పించినప్పుడు ఆ మహత్కార్యాన్ని పూర్తి చెయ్యటానికి గొలుసుకట్టుగా అంతా ఒక్కటవుతారని!సీఎంగా నిన్న మొన్న నేను చేసిన ప్రమాణ స్వీకారానికి అప్పుడే రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్నాయి. ‘రొటేషనల్ ఫార్ములా’ ప్రకారం మిగతా రెండున్నరేళ్ల ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వస్తారని పార్టీలో కొద్ది రోజులుగా టాక్ నడుస్తోంది.అసలు రాజ్యాంగంలోనే రొటేషన్ అన్నది లేనప్పుడు ఫార్ములా ఎక్కడి నుంచి వస్తుంది?! శనివారం రాత్రి, అత్యవసరంగా డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి మినిస్టర్లందర్నీ పిలిపించాను. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒక్కరే రాలేదు. ‘‘డీకే డిన్నర్కి ఎందుకు రాలేదో కనుక్కోండి పరమేశ్వర గారూ’’ అన్నాను. ఆయన స్పందించలేదు. పరమేశ్వర హోమ్ మినిస్టర్. శివకుమార్ లాగే ఆయన కూడా సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. శివకుమార్కి ఫోన్ చేసే ఉద్దేశాన్ని పరమేశ్వర కనబరచకపోవడంతో నేనే శివకుమార్కి ఫోన్ చేసి, ‘‘ఎక్కడున్నారు డీకే? మీకోసం అందరం ఎదురు చూస్తున్నాం. మీరొస్తే డిన్నర్ స్టార్ట్ చేద్దాం’’ అన్నాను. ‘‘రాత్రి పూట భోజనం మానేసి రెండున్నరేళ్లు అవుతోంది సిద్ధరామయ్య గారూ! మీరంతా ఉన్నారు కదా, కానిచ్చేయండి’’ అన్నారు శివకుమార్. పెద్దగా నవ్వాన్నేను. ఆయనా నవ్వారు తప్పితే వస్తున్నానని మాత్రం అనలేదు. మెల్లిగా భోజనాలు మొదలయ్యాయి. ‘‘చెప్పండి మిత్రులారా... పార్టీలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?’’ అని నేనూ మొదలు పెట్టాను. ‘‘నవంబర్ 20 తర్వాత సీఎంగా మీ ప్లేస్లోకి శివకుమార్ వస్తారని వినిపిస్తోంది సీఎం గారూ’’ అన్నారు ఎమ్మెల్సీ బోసురాజు. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఆయన. ‘‘ఇంకా...!’’ అన్నాను. ‘‘మనలోనే కొందరు శివకుమార్తో టచ్లో ఉన్నట్లు వినిపిస్తోంది సీఎం గారూ’’ అని ఎనర్జీ మినిస్టర్ జోసెఫ్ జార్జి అన్నారు. ‘‘శివకుమార్తో టచ్లో ఉంటున్న ఆ కొందరు ఇప్పుడీ డిన్నర్ మీటింగ్లో ఉండి వుండవచ్చా జోసెఫ్ జార్జ్?’’ అని అడిగాను. డైనింగ్ హాల్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. హోమ్ మినిస్టర్ పరమేశ్వర అయితే మొదటి నుంచీ సైలెంట్ గానే ఉన్నారు.‘‘ఈ భోజన సమావేశంలో, ఆ కొందరు ఉన్నారో లేదో చెప్పలేను కానీ... ‘ప్రభు రాత్రి భోజనం’ గురించి మాత్రం చెప్పగలను సీఎం గారూ’’ అన్నారు జోసెఫ్ జార్జి.‘‘చెప్పండి’’ అనలేదు నేను. శిష్యులలో ఒకరు క్రీస్తును పట్టించిన ‘ద లాస్ట్ సప్పర్’ గురించి ఆయన చెప్పబో తున్నట్లు నాకు అర్థమైంది. భోజన సమావేశం ముగిసి అందరూ వెళ్లిపోతున్నప్పుడు పరమేశ్వరను ఆపాను. ‘‘డీకేకి మీరు ఫోన్ చేయకపోతే పోయారు. కలిసినప్పుడు మాత్రం ఆయనకో మాట చెప్పండి. ఇంకో రెండున్నరేళ్లు ఆయన తన రాత్రి భోజనాన్ని మానేయవలసి ఉంటుందని చెప్పండి’’ అన్నాను. ఆ మాట డీకేకి, పరమేశ్వరకి కూడా! -
రాజ్యాంగం వెర్సస్ రైఫిల్
మల్లోజుల వేణుగోపాల రావు లొంగిపోవడం మీద మావోయిస్టు అభిమానులకు కూడా సానుభూతి ఉంది. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన నిలబడి ఏదో ఘన విజయాన్ని సాధించినట్టు పళ్ళు ఇకిలించి నవ్వితే సహజంగానే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఒకరు నవ్వినా మరొకరు ఏడ్చినా జరగాల్సిందే జరుగుతోంది! మావోయిస్టు గెరిల్లాలు 70 మంది తుపాకులు తెచ్చి ముఖ్యమంత్రికి స్వాధీనం చేసి వారి చేతుల మీదుగా రాజ్యాంగ ప్రతుల్ని అందు కున్నారు. ఇదొక పారడాక్సీ వేడుక. రాజ్యాంగం వెర్సస్ రైఫిల్! ఆ వెంటనే ఛత్తీస్గఢ్లో ఆశన్న బృందం లొంగుబాటు. ఇలాంటి వేడుకలు సమీప భవిష్యత్తులో ధారావాహికంగా మరికొన్ని జరగవచ్చు. చాలామంది మరచిపోయినట్టున్నారుగానీ, దేశంలో రక్తపాత విప్లవాన్ని నివారించడానికే రాజ్యాంగం రూపుదిద్దుకుంది. నిజాం సంస్థానంలోని తెలంగాణలో 1946 జూలై 4న రైతాంగ సాయుధ పోరాటం ఆరంభం అయింది. ఆ ఏడాది డిసెంబరు 9న భారత రాజ్యాంగ సభ తొలి సమావేశం జరిగింది. నాలుగు రోజుల తరువాత డిసెంబరు 13న జవహర్లాల్ నెహ్రూ లక్ష్య ప్రకటన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.రక్తపాత విప్లవ నివారణకే... రాజ్యాంగంలో పొందుపరచిన ప్రతి ఆదర్శం వెనుక రక్తపాత విప్ల వాన్ని నివారించాలనే లక్ష్యం ఉంది. అంబేడ్కర్ ఈ విషయాన్ని స్పష్టంగానే చెప్పారు. ప్రభుత్వాలు సామాజిక, ఆర్థిక రంగాల్లో సమానత్వాన్ని సాధించకపోతే బాధితులు తిరగబడి ప్రజాస్వామిక భవనాన్ని పేల్చి పడేస్తారు అని రాజ్యాంగ సభలో చేసిన తన చివరి ప్రసంగంలో హెచ్చరించారు. మన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప ఆదర్శ ప్రకటనగా రూపొంద డానికి కమ్యూనిస్టుల సాయుధ పోరాటం ఒక కారణం అంటే అతిశయోక్తి కాదు. నక్సలైట్ పోరాటాల వ్యాప్తిని నిరోధించడానికే భూపరిమితి, అటవీ భూములు, ఆదివాసుల హక్కుల రక్షణ వగైరా చట్టాలు రూపొందాయి. రాజ్యాంగ తొలి ఆదర్శాలైన సమానత్వం సోదర భావాలకు మరింత స్పష్టతను చేకూర్చడానికి రాజ్యాంగ పీఠికలో మతసామరస్యం, సామ్య వాదం ఆదర్శాలు చేరింది కూడా నక్సలైట్ల భయంతోనే! అందుచేత నక్స లైట్ల పోరాటాలు, ప్రాణ త్యాగాలు వృథా ప్రయాసలు అనడానికి వీల్లేదు.రెండు అధ్యాయాలువందేళ్ళ భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రను మన ఆసక్తి మేరకు వంద సంకలనాలుగా రాయవచ్చు. రెండు అధ్యాయాల్లో రాయాలంటే మాత్రం దానికో ప్రమాణం ఉంది. అది: 1990లకు ముందు, 1990ల తరువాత. పెట్టుబడిదారీ సమాజం రెండు పనులు చేస్తుంది; యంత్రాల వినియో గాన్ని పెంచి సంపదని విపరీతంగా సృష్టిస్తుంది; అదే సందర్భంలో సృష్టి కర్తలకు యజమానులకు మధ్య శత్రుత్వం కూడా విపరీతంగా పెంచుతుంది. ఈ రెండు ధోరణులు సమాజాన్ని అనివార్యంగా సామ్యవాదం వైపునకు నడిపి స్తాయనేది మార్క్సిస్టు మూల సిద్ధాంతం. వైచిత్రి ఏమంటే, పెట్టుబడిదారీ వ్యవస్థ శ్రామికులు, యజమానుల మధ్య శత్రుత్వాన్ని పెంచకుండానూ బతకలేదు; పెంచినా బతకలేదు. తెలివిగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడా నికి అది నిరంతరం సృజనాత్మకంగా జీవన్మరణ పోరాటాన్ని సాగిస్తుంటుంది. అయితే, అంతర్గత బలహీనతలు, లోపాలు, శాపాలు కమ్యూనిస్టులకు బోలెడు ఉన్నాయి. 1990లకు కొంచెం అటూ ఇటుగా తూర్పు యూరప్లోని సోషలిస్టు దేశాలు పతనమయ్యాయి. సోవియట్ రష్యా విచ్ఛిన్నమైంది. చైనా లోనూ సోషలిస్టు ధోరణులు తగ్గి పెట్టుబడిదారీ ధోరణులు పెరిగాయి. ఫలితంగా, కమ్యూనిజానికి ఆమోదాంశమే ఇరుకున పడిపోయింది.‘పెట్టుబడిదారులారా... ఏకం కండి!’సరిగ్గా ఇలాంటి సందర్భం కోసమే ఎదురుచూస్తున్న ప్రపంచ పెట్టుబడి దారులు ఏకం అయ్యారు. అప్పటికే క్లౌస్ మార్టిన్ స్క్వాబ్ వంటివారు ప్రపంచ ఆర్థిక వేదికను నడుపుతున్నాడు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ‘నిర్మాణాత్మక సర్దుబాట్లు’ సిద్ధాంతాన్ని రూపొందించాయి. మరోవైపు, ‘వాషింగ్టన్ ఏకాభిప్రాయం’ విధానం వచ్చింది. ఇదే అదనుగా, గ్యాట్ డైరెక్టర్ జనరల్ పీటర్ సూదర్ల్యాండ్ ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్మాణానికి నడుం బిగించాడు. చాలాకాలం ముందే ఆస్ట్రియా రాజకీయార్థికవేత్త జోసెఫ్ షుంపీటర్ ‘సృజనాత్మక విధ్వంసం’ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చాడు. జోయెల్ మోక్యర్, ఫిలిప్ అఘియన్, పీటర్ హోవిట్ త్రయం దీనికో రోడ్ మ్యాప్ గీసిపెట్టారు. 2025 నోబెల్ బహుమానం ఇచ్చింది ఈ ముగ్గురికే! వీళ్ళందరూ తెలివైనవాళ్ళు. ఎక్కడా సామ్యవాదానికి వ్యతిరేకులం అని చెప్పరు. పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూలంగానూ మాట్లాడరు. మార్కెట్ ప్రజాస్వామ్యం, పర్యావరణ రక్షణ వంటి అందమైన పదాల్ని వాడుతుంటారు. మార్క్సిస్టులు సామాజిక పరిణామాలకు కొలబద్దగా భావించే ఉత్పత్తి విధానాన్ని వాళ్ళు, కమ్యూనిస్టు పార్టీలకే అర్థం కాని ఒక మార్మిక వ్యవహారంగా మార్చేశారు. ఒకరోజు మార్కెట్లో వెలిగిన బ్రాండు మరు నాడు కనిపించదు. ఒకదాన్ని అర్థం చేసుకునేలోపునే దాన్ని తీసివేసి దాని స్థానంలో మరోదాన్ని ప్రవేశ పెడుతుంటారు. దీనికి వాళ్ళు పెట్టిన అంద మైన పేరు ‘సృజనాత్మక విధ్వంసం’! దీనికి తోడు అనేక దేశాల్లో మతతత్త్వాలను రెచ్చగొట్టడం మొద లెట్టారు. దీనితో రాజకీయ లబ్ధిని సులువుగా పొందడమేగాక కొత్త తరాలు సామ్యవాదం వైపునకు మరలకుండా అడ్డుకోవడమూ సాధ్యం అవుతుంది. దీనికి సమాంతరంగా సామాజిక ఉనికివాద ఉద్యమాలు తలెత్తి సన్నివేశాన్ని ఇంకా సంక్లిష్టంగా మార్చాయి. ఇంత జరిగిపోతున్నా సైద్ధాంతిక రంగంలో పెట్టుబడిదారీ వ్యూహకర్తల్ని ఢీకొనే ఆలోచనాపరుల్ని కమ్యూనిస్టు పార్టీలు సృష్టించుకోలేకపోయాయి. దానికి ప్రధాన కారణం కమ్యూనిస్టు పార్టీల్లో కొనసాగుతున్న ఏకేశ్వరోపాసన! పార్లమెంటరీ పంథా ప్రత్యామ్నాయమేనా?ప్రపంచ పెట్టుబడిదారులు ఇంతగా విజృంభిస్తున్న సమయంలో, ఇండి యాలో ప్రధాన నక్సలైట్ పార్టీగా భావించే పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వ పోరులో నిండా మునిగి వుంది. ముందు కేజీ సత్యమూర్తిని తరిమేశారు. అవే పద్ధతుల్లో కొండపల్లి సీతారామయ్యను బయటికి పంపించారు. నిజా నికి కొండపల్లి, సత్యమూర్తి కలిసి కొనసాగినా విప్లవ కమ్యూనిస్టు ఉద్యమంలో అనూహ్య మార్పులు ఏమీ వచ్చేవి కావు. వాళ్ళు చేయగలిగింది చేసేశారు. చరిత్రలో వాళ్ళ పాత్రలు అక్కడికే పరిమితం. ఆ తరువాత విప్లవ పార్టీలకు నాయకత్వం వహించినవాళ్ళు ఆపాటి సమర్థులు కూడా కాదు. పెట్టుబడిదారీ సమాజంలో అతి వేగంగా జరిగిపోతున్న పరిణామాలను అర్థం చేసుకుని విరుగుడు కనిపెట్టే శక్తి వాళ్ళకు లేకపోయింది. బ్రిటిష్ కాలంలో 303 రైఫిల్ గొప్పది. ఓ నలభై ఏళ్ళ క్రితం ఏకే 47 గొప్పది. ఇప్పుడు మానవ రహిత డ్రోన్లు, యుద్ధ విమానాలు వచ్చేశాయి. పాత అవగాహనలతో, పాత ఆయుధాలతో కొత్త శక్తుల్ని ఎదుర్కోవడానికి సిద్ధమైతే అది దుస్సాహసం అవుతుంది! ఏ ఉద్యమంలో అయినా విధిగా మూడు తరాలుండాలి. యువతరం, మధ్యతరం, అనుభవతరం. అనుభవతరం బండిని లాగుతుండాలి. యువ తరం బండిని గెంటుతుండాలి. కొత్త తరాల్ని ఆకర్షించలేకపోతే విప్లవ పార్టీలు వృద్ధాశ్రమాలుగా మారిపోతాయి. ఆయుధాలను ఉపయోగించడం అటుంచి వాటిని మోయడం కూడా సాధ్యం కాదు. ఒక వ్యూహం ప్రకారం ఉద్యమాల్లోనికి యువతరం రిక్రూట్మెంటును ఆపగలిగినవాళ్ళు... కల్లోల ప్రాంతాల్లో ప్రాణరక్షణ మందుల సరఫరానూ ఆపేశారు. వృద్ధాప్యంలో వచ్చే జీవనశైలి వ్యాధులకు అడవిలో మందులు అందకపోతే అల్లకల్లోలం జరిగిపోతుంది. గ్లూకోజ్ స్థాయిలు పెరిగి రెటీనో పతితో అంధులైన నాయకులు దారి కనిపించక పోలీసులకు దొరికిపోతున్న బాధాకరమైన కేసులు ఇటీవలి కాలంలో అనేకం ఉన్నాయి. అణగారిన సమూహాల సహజమైన ఆప్షన్ సమసమాజమే. ఆ లక్ష్య సాధన కోసం పుట్టిన పార్టీలు బలహీనంగా ఉన్నప్పుడే మరోవైపు చూడాల్సి వస్తుంది. సాయుధ పోరాటానికి ప్రత్యామ్నాయం రాజ్యాంగం అనడం కూడా ఇప్పుడు సమంజసం కాకపోవచ్చు. పాలకులు మంచోళ్ళయితే చెడ్డ రాజ్యాంగం కూడా ప్రజలకు మంచిదయిపోతుంది; పాలకులు చెడ్డోళ్ళయితే మంచి రాజ్యాంగం కూడా ప్రజలకు చెడ్డదయిపోతుందని అంబేడ్కర్ చెప్పి ఉన్నారు. ఇప్పుడు సమస్య రాజ్యాంగం మంచిదా, కాదా అన్నది కాదు; పాలకుల స్వభావం ఏమిటీ అన్నదే అసలు సమస్య! మన రాజ్యాంగానికి ప్రాణం ప్రజాస్వామిక ఎన్నికలతో కూడుకున్న పార్లమెంటరీ వ్యవస్థ. ఈ రెండింటినీ, కార్పొరేట్ మతతత్వ నియంతృత్వం భ్రష్టు పట్టించింది. ఆయుధాలు అప్పగించిన మావోయిస్టులు పార్లమెంటరీ పంథా చేపడతారా? అక్కడ మార్పులు తేగలుగుతారా? దానికి సమాధానం కోసం మరికొంతకాలం వేచిచూడాలి.డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులు -
బిహార్లో ప్రజాస్వామ్యం గెలిచేనా?
దేశంలో అన్ని ఎన్నికలనూ కురుక్షేత్ర సంగ్రామంగా మార్చడం దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. అక్టోబర్ 6న ఎన్నికల నగారా మోగిన బిహార్లో మొదలైన ఎన్నికలసందడి అనేక ప్రత్యేకతలు కలిగిన దృష్ట్యా దేశ ప్రజల దృష్టి అటువైపు కేంద్రీకృతమైంది. 243 స్థానాలున్న బిహార్లోపోలింగ్ రెండు విడతలలో నవంబర్ 6, 11 తేదీలలో జరుగుతుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడుతాయి. ‘యువ బిహార్’ సాధ్యమా?ఉత్తరాది రాష్ట్రాలలో, ప్రత్యేకించి బిహార్లో అభ్యర్థులు ఎన్ని కలకు ముందు ఆ యా పార్టీలు మారటమే కాకుండా... కూట ముల్లోని పార్టీలు అటు ఇటు పిల్లిమొగ్గలు వేస్తుంటాయి. ప్రధాన కూటములుగా ఎన్డీయే, ఇండియా బ్లాక్ (మహా ఘట్బంధన్)లు రెండే ఉన్నాయి. ఎన్డీయేలో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీ (యు), భారతీయ జనతా పార్టీ, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి (ఎల్జేపీ) ఉన్నాయి. కొత్తగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏర్పాటు చేసిన ‘జన్ సురాజ్’ పార్టీ ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఇక, ముస్లివ్ు ఓట్లను గంపగుత్తగా వేయించు కోగలననే ధీమాతో అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్ పార్టీ కూడా పోటీ చేస్తోంది. స్వర్గీయ రావ్ువిలాస్ పాశ్వాన్ తనయుడైన ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ‘అబ్ కీ బార్ యువ బిహార్’ అనే నినాదంతో బిహార్ యువతను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. అదే జరిగితే ఎన్డీయే కూటమికి ఇబ్బందికరమే! అందుకే ఎన్డీయే నుంచి చిరాగ్ పాశ్వాన్ బయటకు పోకుండా ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ను ప్రకటించకుండా బీజేపీ వ్యూహాత్మకంగా ఆయనకు చెక్ పెట్టింది. ‘యువ బిహార్’ కావాలంటే యువకుడైన ముఖ్యమంత్రి ఉండాలన్న సెంటిమెంట్ను ప్రశాంత్ కిశోర్ తేవడంతో... ఈసారి ఎన్డీఏ గెలిచినా, 75 సంవ త్సరాల వయస్సులో ఉన్న నితీష్ కుమార్ను మరోమారు ముఖ్య మంత్రిగా ఎన్డీఏ కూటమి ఒప్పుకోకపోవచ్చు.ఓట్ల తొలగింపు రగడనిజానికి బిహార్లో జరగనున్న శాసనసభ ఎన్నికలను మోదీ వర్సెస్ రాహుల్గాంధీల నడుమ సాగే పోరుగానే చూడాలి. గత ఏడాది రాహుల్ బిహార్లో చోటు చేసుకొన్న ఓటర్ల జాబితా సవరణలపై దృష్టి పెట్టారు. బిహార్లో చేపట్టిన సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో సుమారు 65 లక్షల ఓట్లు తొలగించి కేంద్ర ఎన్నికల సంఘం పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ‘సర్’ ద్వారా ఓట్లను తొలగించడంతోకాంగ్రెస్ దానిపై పెద్దఎత్తున ఉద్యమించింది. స్వతంత్రంగా నడుచుకోవాల్సిన ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఓట్లను తొలగించిందని ‘ఓట్ చోరీ’ అంటూ ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకొంది. చివరకు ఓటర్ల తొల గింపు అంశం సుప్రీంకోర్టుకు చేరింది.భారతీయ జనతా పార్టీ దూకుడుకు కళ్లెం వేయడానికి, ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కాంగ్రెస్ అనేక విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. రెండు విడతలుగా భారత్ జోడో యాత్రలు ఇందులో భాగంగానే చూడాలి. దేశంలో సమగ్రంగా, శాస్త్రీయంగా కులగణన చేయాలనీ కాంగ్రెస్ కోరుతోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న ఆ పార్టీ అక్కడ స్వయంగా కులగణన చేసింది. దానిని తెలంగాణ మోడల్గా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొంటోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ పట్ల ప్రతికూలంగా మారినా మోదీ ప్రశ్నించకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారని విమర్శ చేస్తోంది. బీజేపీ వైపు నుంచి, మోదీ వైపు నుంచి ‘ఇండియా’ కూటమిపై ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు కూడా పదునైనవే! దేశం వెనుకబడి పోవడానికీ, అన్ని వ్యవస్థలూ సకల అవలక్షణాలతో కునారిల్లడానికీ కారణం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సుదీర్ఘంగా పాలించడమేనని బీజేపీ విమర్శిస్తోంది. దాంతోపాటు మోదీ నేతృత్వంలో ఈ 12 ఏళ్లకాలంలో దేశం ఏ విధంగా ముందంజ వేసిందీ ఘనంగా చాటుకొంటున్నారు. తాజాగా తెచ్చిన జీఎస్టీ సంస్కరణలను, ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని బీజేపీ నేతలు ఉదహరిస్తున్నారు. అయితే, బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే... జీఎస్టీ సంస్కరణలు చేశారనీ, ఆ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారనీ ప్రతిపక్షం ఆరోపి స్తోంది. 17 శాతం ముస్లివ్ు జనాభా గల బిహార్లో... మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గాలలో యథావిధిగా ఎవరితోనూ పొత్తు లేకుండా ఒవైసీ తన పార్టీ ‘మజ్లిస్’ను రంగంలోకి దించు తున్నారు. తమకు పడని ఓట్లు ఎదుటి పక్షానికి పడకుండా చీల్చడంలో ఇది బీజేపీకి లాభించేదే!కొత్త సంస్కరణలు ఇక్కడి నుంచే...తాజాగా పలు ఎన్నికల సంస్కరణలకు బిహార్ వేదిక కావడం విశేషంగా చెప్పాలి. కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశ పెట్టబోతున్న 17 ఎన్నికల సంస్కరణల అమలు బిహార్ నుంచి మొదలు కాబోతోంది. ఈ సంస్కరణలలో ప్రధానంగా ఒక్కోపోలింగ్ బూత్ను 1,200 మంది ఓటర్లకే పరిమితం చేస్తున్నారు. ఈవీఎంల మీద అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంటాయి. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లు, పోస్టల్ బ్యాలెట్ను ముందుకు జరిపి తప్పనిసరి చేస్తున్నారు. ఓటరు గుర్తింపునకు ఆధార్ను వినియోగించుకోవచ్చు నని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఎన్నికల కమిషన్ తొలుత నిరాకరించినా చివరకు దిగొచ్చింది. గతంలో తన మీద వచ్చిన ఆరో పణలకు కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చేది. ఈసారి అందుకు భిన్నంగా సీఈసీ తనను విమర్శించిన ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. గతంలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసిన టీఎన్ శేషన్ అన్ని రాజకీయ పార్టీల వ్యవహార శైలి పట్ల కఠినంగా వ్యవహరించి ఎన్నికల సంఘానికి గౌరవాన్నిపెంచారు, ప్రజల మన్ననలు పొందారు. ఇప్పుడది మృగ్యమైంది.ఎన్నికలు జరిగినప్పుడు ఏదో ఒక పార్టీ లేదా కూటమి గెలు పొందుతుంది. అయితే, ప్రజాస్వామ్యం గెలిచిందన్న భావన ప్రజలకు కలగాలి. ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రజలకు విశ్వాసం కలగాలి. గెలుపు కోసం ఎంతకైనా దిగజారడానికి రాజకీయ పార్టీలు సిద్ధపడి పోతున్న నేపథ్యంలో... ప్రజాస్వామ్యం గెలవాలని కోరు కోవడం అత్యాశ అవుతుందా? కొత్తగా కొన్ని సంస్కరణలు చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎం డేటా, బ్యాటరీ లాగ్స్, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. పైగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన 45 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్ను నాశనం చేయాలనిజిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఇటువంటి నిబంధనలు విధించడంపై ప్రతిపక్ష పార్టీలు న్యాయపోరాటం కొనసాగిస్తూనే ఉన్నాయి. ఒకవైపు రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక, పొత్తులు కుదుర్చు కోవడంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలపై సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనల నేపథ్యంలో బిహార్ ఎన్నికలు ఈసారి అత్యంత రసవత్తరంగా మారనున్నాయి.-వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసన మండలి సభ్యులు -డా‘‘ ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు -
పదే పదే అదే దాడి!
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అనేది కేవలం జర్నలిస్టుల హక్కు మాత్రమే కాదు, అది ప్రజలకు సమాచారం తెలుసు కునే హక్కు కూడా! ప్రభుత్వ తప్పిదాలు లేదా లోపాలను ఎత్తి చూపినందుకు, ముఖ్యంగా మద్యం మరణాల వంటి సున్నితమైన అంశాలలో, సంపాదకుడిని లేదా విలేకరులను వేధించడం, బీఎన్ఎస్ 179(1) వంటి అసంబద్ధమైన సెక్షన్ల కింద నోటీసులు ఇవ్వడం, ‘సోర్స్’ వివరాలను అడగటం వంటి చర్యలు చట్టబద్ధమైన పరిధిని దాటి అధికార దుర్వినియోగానికి (అబ్యూజ్ ఆఫ్ అథారిటీ) పాల్పడటం కిందికి వస్తాయి.పత్రికా స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నాలు జరిగినప్పుడు, వివిధ కేసులలో సుప్రీంకోర్టు తీర్పులు జర్నలిస్టులకు బలమైన రక్షణ కవచంగా నిలిచిన విషయం గమనార్హం. సత్యాన్ని ధైర్యంగా నిల బెట్టే ప్రతీ జర్నలిస్టుకూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ఎప్పుడూ రక్షణగా నిలుస్తుంది.ఒక వార్తా దినపత్రిక సంపాదకుడికి, మద్యం మరణాల గురించిన వార్తను ప్రచురించినందుకు గానూ, పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 179(1) కింద నోటీసులు జారీ చేయడం, ఆ వార్తకు సంబంధించిన విలేకరుల అన్ని డాక్యుమెంట్లు, వివరాలను బీఎన్ఎస్ సెక్షన్ 94 కింద సమర్పించాలని డిమాండ్ చేయడం చట్ట బద్ధమేనా? ఇటువంటి పోలీసు చర్యలు, లేదా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు జర్నలిస్టులను వేధించడం కాదా? అవి వేధింపులే!ఏదైనా దర్యాప్తు, విచారణ లేదా ఇతర ప్రయోజనాల కోసం ఏదైనా పత్రం, ఇతర వస్తువు అవసరమని కోర్టు లేదా పోలీస్ స్టేషన్ అధికారి భావించినప్పుడు, దానిని సమర్పించమని బీఎన్ఎస్ సెక్షన్ 94 (పాత సీఆర్పీసీ సెక్షన్ 91) కింద ఎవరికైనా సమన్లు జారీ చేయవచ్చు. కానీ అది పాత్రికేయులకు వర్తిస్తుందా? సాధారణంగా, విచారణ కోసం పత్రాలను అడగడానికి ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. అయితే, జర్నలిస్ట్ వనరు (సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్) లేదా సమాచారాన్ని సమర్పించమని బలవంతం చేయడం, జర్నలిజం ప్రధాన సూత్రమైన ‘సోర్స్ గోప్యత’కు విరుద్ధం. విలేకరుల రక్షణ, పత్రికా స్వేచ్ఛ దృష్ట్యా, ఈ సెక్షన్ను విచక్షణా రహితంగా ఉపయోగించడం చట్టవిరుద్ధం అవుతుంది. వార్తా ప్రచురణను కేవలం ప్రభుత్వంపై విమర్శగా భావించి, ఈ సెక్షన్లను ఉపయోగించి విలేకరుల వివరాలను, డాక్యుమెంట్లను కోరడం స్పష్టంగా ‘చట్టపరమైన వేధింపు’ కిందకు వస్తుంది.భారతదేశంలో జర్నలిస్టులు తమ వార్తా మూలాలను పోలీసు లకు బహిర్గతం చేయాలని ఏ చట్టం కూడా ఒత్తిడి చేయదు. సమాచా రాన్ని సేకరించే హక్కు, ప్రచురించే హక్కు – ఈ రెండింటినీ ఆర్టికల్ 19(1)(ఎ) కింద భారత రాజ్యాంగం ప్రసాదించింది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో సంబంధిత న్యాయస్థానం, అది కూడా అత్యవసర మైతేనే ఆ మూలాలను వెల్లడించమని ఆదేశించగలదు. కానీ పోలీసు లకు ఆ హక్కు లేదు. జర్నలిజంలో సమాచారాన్ని అందించిన వనరును రక్షించడం అత్యంత కీలకం. సోర్స్ను బహిర్గతం చేయమని బలవంతం చేయడం పత్రికా స్వేచ్ఛను అణిచివేయడమే అవుతుంది.జర్నలిస్టులకు ‘సుప్రీం’ బాసటరోమేష్ థాపర్ (1950) నుంచి ఆర్ణబ్ గోస్వామి (2020), ‘న్యూస్క్లిక్’ (2024) కేసుల వరకు, భారత అత్యున్నత న్యాయ స్థానం ఎప్పటికప్పుడు పోలీసుల లేదా రాజకీయ నేతల ఒత్తిడి లేకుండా మీడియా పని చేయాలనే హక్కును కాపాడుతూనే ఉంది. ‘ఆర్ణబ్ గోస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసును జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షా విచారించారు. ముఖ్యంగా టీవీ కార్యక్రమాల మీద పలు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం మీద విచా రణ జరిగింది. జర్నలిస్టులు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగటం, ప్రభు త్వాన్ని విమర్శించడం వారి హక్కుగా కోర్టు పరిగణించింది. రాజకీయ దురుద్దేశంతో ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కుకు విరుద్ధం అని వ్యాఖ్యానించింది.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రతి పౌరుడికీ వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా కల్పిస్తుంది. ఈ హక్కులోనే పత్రికా స్వేచ్ఛ కూడా అంతర్లీనంగా ఉంది. పోలీసుల వేధింపులను ఎదుర్కొంటున్నప్పుడు, ఒక జర్నలిస్ట్ లేదా ఎడిటర్ తన రక్షణ కోసం హైకోర్టును లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టులు తరచూ నాలుగు అంశాలను పరిగణన లోకి తీసుకుంటాయి: ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వార్త ప్రచురిత మైందా? వార్తలో ఉన్న వివరాలు నిజమని భావించడానికి ప్రాథ మిక ఆధారాలు ఉన్నాయా? నేరారోపణ చేయబడిన సెక్షన్ (ఇక్కడ బీఎన్ఎస్ 179(1)) ఈ వార్తకు అసలు వర్తిస్తుందా? లేదా ఇది కేవలం జర్నలిస్టును వేధించడానికి లేదా భయపెట్టడానికి ఉపయో గించారా?ప్రభుత్వ చర్యలు పత్రికా స్వేచ్ఛను అరికట్టే విధంగా ఉండ కూడదు. అంటే భయపెట్టి, ఒత్తిడి చేసి జర్నలిస్టులు సత్యాన్ని రాసేందుకు వెనకాడేలా చేయడాన్ని ‘చిల్లింగ్ ఎఫెక్ట్’ అంటారు. సుప్రీం కోర్టు ఇటువంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తుంది. పత్రికా స్వేచ్ఛకు ఊతం‘న్యూస్క్లిక్’ ఎడిటర్ కేసులో ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు అద్భు తమైన వ్యాఖ్యానాలు చేశాయి. తమకు ఇష్టం లేని రిపోర్టింగ్ చేసినందుకు జర్నలిస్టులను నిందితులుగా పరిగణించే అధికారం పోలీసులకు లేదని కోర్టులు స్పష్టం చేశాయి. అంతేకాకుండా, సదరు వార్త సాధనాలను స్వాధీనం చేయాలని కోరడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది.‘రోమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్’ కేసులో ఆర్టికల్ 19(1)(ఎ) కింద పత్రికా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అని 1950లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే ఏడాది ‘బ్రజ్ భూషణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ’ కేసులో వార్తలను ప్రచురించడానికి ముందు సెన్సార్ షిప్ను కోర్టు కొట్టివేసింది. ఇది పత్రికా స్వేచ్ఛకు తొలి విజయం.‘అభిషేక్ ఉపాధ్యాయ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ’ (2024) కేసులో జర్నలిస్ట్ రాతలను ప్రభుత్వ విమర్శగా భావించినంత మాత్రాన, ఆ రచయితపై క్రిమినల్ కేసులు నమోదు చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రభుత్వ చర్యలను విమర్శించే జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తుంది. ‘సిద్ధార్థ్ వరదరాజన్, ఇతరులు వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం’ (2025) కేసులో, ఒక వార్తా పోర్టల్కు సంబంధించిన సీనియర్ జర్న లిస్టులపై నిర్బంధ చర్యలు తీసుకోకుండా అస్సాం పోలీసులను సుప్రీంకోర్టు నిలువరించింది. ఈ చర్యలు పత్రికా స్వేచ్ఛపై దాడిగా కోర్టు భావించింది.పత్రికా స్వేచ్ఛ గురించి న్యాయస్థానాలు అనేక తీర్పులు ఇస్తున్నా, వేధింపులకు సంబంధించి పోలీసులను హెచ్చరిస్తున్నా ప్రభుత్వాల ఆదేశాల మేరకు వారు ఈ పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి కేసులు నిలవవని వారికీ తెలుసు. అయితే ఈ లోపు తాత్కాలికంగా ఇబ్బంది పెడుతూ ‘చిల్లింగ్ ఎఫెక్ట్’తో భయ పెట్టడమే వారి ప్రధానోద్దేశం. ఇలాంటి చర్యలకు సైతం వారు కచ్చి తంగా న్యాయస్థానం ముందు నిలబడాల్సి వస్తుందనేది వాస్తవం.పి. విజయ బాబు వ్యాసకర్త రాజ్యాంగ న్యాయ శాస్త్ర పట్టభద్రులు, సీనియర్ సంపాదకులు -
ఛిద్రమవుతున్న బాల్యం
18 ఏళ్ల లోపు బాలబాలికలను లైంగిక నేరాల నుండి రక్షించడానికి రూపొందించిన పోక్సో చట్టం 2012 (POCSO Act 2012)నవంబర్ 14 నుండి అమల్లోకి వచ్చింది. నేరస్థుడు పురుషుడు, మహిళ లేదా మూడవ జెండర్ కూడా కావచ్చు. కేంద్ర న్యాయ శాఖ వెబ్సైట్ ప్రకారం దేశంలో 725 కోర్టులు ఈ కేసులను విచారిస్తున్నాయి, 2 లక్షల పైగా కేసులు పెండింగులో ఉన్నాయి, ఇప్పటి వరకూ 3,34,213 కేసులు పరిష్కారమైనాయి. బంధు వులు, పొరుగింటివారు, యజమానులు, బాగా పరిచయమున్నవారు కూడా బాలలపై లైంగిక నేరాలకు పాల్పడుతున్నారని జరుగు తున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని పోలీసుల దాకా వెళ్ళకుండా నిందితులతో రాజీ చేసుకునే కేసులు, నిందితు లకు భయపడి మౌనంగా ఉండే కేసులు ఎన్నో ఉంటాయి. ఈ నేరాన్ని ప్రేరేపించిన వారు కూడా నిందితులు అవుతారు. నేరం రుజువైతే జీవిత ఖైదు, మరణ శిక్షతో పాటు జరిమానాకు అర్హులు.ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో ప్రత్యేక సెషన్స్ కోర్టుల ముందు ‘ఇన్ కెమెరా’ పద్ధతిలో విచారణ జరుగుతుంది. నేర అభియోగపత్రం రిజిస్టరైన తేదీ నుండి ఏడాది లోపులో తీర్పు వెలువరించాలని చట్టం చెప్తోంది. ఎగతాళి, సామాజిక బహిష్కరణ, వేధింపుల నుండి నివారణ కోసం లైంగిక వేధింపులకు గురైన బాలల పేరు, చిరునామా, ఫొటోలను బహిర్గతం చేయరాదు. బహిర్గతం చేసినట్లయితే ఏడాది పాటు శిక్షకు గురవుతారు. అంతెందుకు, విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం, అప్పిలేటు న్యాయస్థానం కూడా తమ తీర్పుల్లో బాధిత బాలుడు లేదా బాధిత బాలికగానే పేర్కొనాలి తప్ప పేరును బహిర్గతం చేయకూడదు. సాక్ష్యాలను నమోదు చేసే సమయంలో బాధిత బాలలు నింది తుడికి కనిపించకుండా ప్రత్యేక కోర్టు చర్యలు తీసుకోవాలి. వీడియో కాన్ఫరె న్సింగ్, సింగిల్ విజిబిలిటీ మిర్రర్లు, పరదా లేదా ఏదైనా ఇతర పరికరాన్ని ఉపయోగించి, భయాందోళనలకు గురి కాకుండా స్నేహపూర్వక వాతావరణం కల్పించి పిల్లల వాఙ్మూలాన్ని రికార్డ్ చేయాలి. అదే సమయంలో నిందితుడు బాధిత బాలల వాఙ్మూలాన్ని వినగలిగే, అతని న్యాయవాదితో సంభాషించ గలిగే స్థితిలో ఉండాలి. ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో నేరం చేయలేదని రుజువు చేసుకోవాల్సిన భారం నిందితుడి మీదే ఉండటం గమనార్హం. పిల్లలు, టీనేజర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న వెబ్సైట్ల సంఖ్య పెరుగుతోంది. వీటి దుష్ప్రభావాల నుంచి రక్షించడంలో భాగంగా పదహారేళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం తెచ్చింది. అలాంటిది తేవడానికి అవకాశం ఉందేమో మన ప్రభుత్వాలూ పరిశీలించాలి. చికిత్సకు ముందే వ్యాధి నివారణకై ఆలోచించటం ఉత్తమం.-తడకమళ్ల మురళీ ధర్ విశ్రాంత జిల్లా జడ్జి -
నష్టం తక్కువ... లాభం ఎక్కువ
2021 ఆగస్టులో అధికారాన్ని చేపట్టిన తర్వాత మొదటిసారి, తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీకి న్యూఢిల్లీలో భారత్ ఆతిథ్యం ఇచ్చింది. తాలిబాన్ను అఫ్గానిస్తాన్ అధికారిక ప్రభుత్వంగా గుర్తించకుండానే, దానితో చర్చలు సాగించే విధానాన్ని ఇన్నాళ్లూ భారత్ అను సరిస్తూ వచ్చింది. ఆ మాటకొస్తే, రష్యా మాత్రమే కొద్ది నెలల క్రితం ఆ ప్రభు త్వాన్ని గుర్తించింది. ముత్తాకీ న్యూఢిల్లీ రావడం, ఆయన్ని అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రిగా భారత్ ప్రస్తావించడంతో, తాలిబన్ను అఫ్గానిస్తాన్ అధికారిక ప్రభుత్వంగా గుర్తించే దిశగా భారత్ మరో అడుగు వేసిన ట్లయింది. అలా చేస్తే, ఎదురుకాగల ఇబ్బందులు తక్కువ, ఒనగూడ గల వ్యూహాత్మక ప్రయోజనాలు ఎక్కువ.మూడు ముఖ్య అభ్యంతరాలుఅవాంఛనీయ విలువలను ప్రబోధిస్తూ, తన జనాభాలో సగం మందికి వ్యతిరేకంగా వివక్షాయుత విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వాన్ని భారత్ గుర్తించకూడదన్నది ఒక వాదన. దీనిలో సహే తుకత ఉంది. అయితే, మనం ఒక విషయాన్ని దృష్టిలో ఉంచు కోవాలి. (క్రూరమైన పనులను నాజూకుగా చేస్తున్నంత మాత్రాన) అన్ని ప్రభుత్వాలూ నైతికంగా ఆమోదయోగ్యమైనవి కావు. అంగీ కారయోగ్యం కాని విలువలతో కూడిన ప్రభుత్వాన్ని గుర్తించినంత మాత్రాన, ఆ విలువలను మనం ఆమోదిస్తున్నట్లు కాదు. అంత ర్జాతీయ రాజకీయాలు అంతకు మించి జటిలమైనవి. వ్యక్తిగత స్నేహానికి ఎంచుకొనే ప్రమాణాలను, ప్రభుత్వాల విధాన నిర్ణయాలకు వర్తింపజేయలేం. అఫ్గానిస్తాన్ చట్టబద్ధమైన పాలకులుగా తాలిబాన్ను గుర్తించడం వల్ల, ఈ ప్రాంతంలో శుద్ధాచారవాదం పెరిగేందుకు దోహద పడినట్లు అవుతుందనేది రెండో అభ్యంతరం. కానీ, తాలిబాన్ను గుర్తించడం ద్వారా వారు ప్రధాన జీవన స్రవంతిలోకి రావడానికీ, సామాజికంగా మెరుగైన ప్రవర్తనను అలవరచుకోవడానికీ బాటలు పరచినట్లు అవుతుంది. 1996 నాటి తాలిబాన్ వేరు, 2025 తాలి బాన్ వేరు. వారు మరికాస్త మధ్యేవాదులుగా మారారు, ఆధునిక మార్గాలను అనుసరించేందుకు మరింత సుముఖంగా ఉన్నారు. స్త్రీ–పురుష వివక్ష చూపడంపై విమర్శలను ఎదుర్కొన్న తర్వాత, భారతీయ మహిళా జర్నలిస్టులను ఆహ్వానించడం ద్వారా, తాలి బాన్ తన తప్పును సరిదిద్దుకుంది. కొన్నిసార్లు మార్పు, ఏక పక్షంగా దూరం పెట్టడం కన్నా, నలుగురితో కలవడం, ఒత్తిడిని చవిచూడటం వల్ల వస్తుంది. వారి మత విశ్వాసాలు, విధానాలతో ఏకీభవించనంత మాత్రాన పొరుగు దేశాన్ని దూరంపెట్టడం గొప్ప రాజ్య లక్షణం అనిపించుకోదు. తాలిబాన్కు దగ్గరైతే పాకిస్తాన్తో మన సంబంధాలు మరింత క్షీణిస్తాయనేది మూడో అభ్యంతరం. వాస్తవం ఏమిటంటే, భారత్ –పాక్ సంబంధాలు ఇప్పటికే అట్టడుగుకు చేరాయి. ఈ చర్య వల్ల ఇప్పుడు ఆ గతిశీలతలో గణనీయంగా రాబోయే మార్పు ఏమీ లేదు. నాలుగు ప్రధాన ప్రయోజనాలుఐ.సి.814 విమాన హైజాక్ ఉదంతాన్ని పక్కన పెడితే, సాధా రణంగా భారత్ పట్ల తాలిబాన్ వైఖరి సానుకూలంగానే ఉంది. ఆ హైజాక్ సూత్రధారి పాకిస్తాన్ సైనిక గూఢచారి సంస్థ. ఆ ఘటనలో తాలిబాన్ కన్నా ఐఎస్ఐ పాత్ర ఎక్కువ. తాలిబాన్ 2021 ఆగస్టులో అధికారం చేపట్టిన నాటి నుంచీ భారత్తో సంబంధాలు మెరుగు పరచుకునేందుకు ప్రయత్నిస్తోంది. కశ్మీర్ను భారత్ – పాక్ మధ్య ద్వైపాక్షిక అంశంగా చూడటం ద్వారా, అది భారత్ వైఖరిని సమ ర్థిస్తోంది. రెండు – రష్యాను అనుసరిస్తూ మిగిలిన దేశాలూ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి ఎంతో కాలం పట్టదు. తాలిబాన్పై పశ్చిమ దేశాల ఒత్తిడీ తగ్గింది. చైనా, పాకిస్తాన్ కూడా రష్యాను అనుసరించే అవకాశం ఉంది. మిగిలిన దేశాలు గుర్తించేంత వరకు భారత్ వేచి చూసి, ఆ తర్వాత గుర్తిస్తే, దౌత్యపరంగా దానికి ఇపుడు న్నంత ప్రాధాన్యం ఉండదు. పైగా, త్వరగా గుర్తించడం వల్ల, వ్యూహాత్మకంగా మొదటి మిత్రుని సానుకూలత లభిస్తుంది. అఫ్గానిస్తాన్ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహించే అవకాశం దక్కుతుంది. మూడు – తాలిబాన్ నేతృత్వంలోని అఫ్గానిస్తాన్తో సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడం మనకే మంచిది. ఈ ప్రాంతంలోని దేశాలను భారత్కు దూరం చేయాలని చైనా – పాకిస్తాన్ వేస్తున్న పథకాలను అడ్డుకునేందుకు వీలవుతుంది. కాబూల్తో చైనా సాన్నిహిత్యం కూడా పెరుగుతోంది. దానితో వీలైనంత మేరకు సమతూకం సాధించేందుకు ఇది తోడ్పడుతుంది. కాబూల్లో ఎవరు అధికారంలో ఉన్నారనేదానితో ప్రమేయం లేకుండా, అఫ్గానిస్తాన్ చాలావరకు, భారతదేశానికి ముఖ్యమైన భాగస్వామిగా కొనసాగుతూ వస్తోంది. కాబూల్లో అనంగీకార ప్రభుత్వం ఉందని, ఆ భాగస్వామ్యాన్ని పాడుచేసుకోకూడదు. ‘అఫ్గానిస్తాన్ సార్వభౌమత్వానికీ, ప్రాంతీయ సమగ్రతకూ, స్వాతంత్య్రానికీ’ భారత్ పూర్తిగా కట్టుబడి ఉంది’’ అని ముత్తాకీ పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చేసిన ప్రకటన ప్రధానంగా పాకిస్తాన్ను ఉద్దేశించినదిగానే కనిపిస్తోంది. అఫ్గాన్ ప్రభుత్వంతో క్రియాశీలంగా వ్యవహరించడంలోని వ్యూహా త్మక విలువను న్యూఢిల్లీ గుర్తించిందనీ, ఈ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రాబల్యాన్ని కట్టడి చేసేందుకు ఒక మార్గంగా దాన్ని భావిస్తోందనీ ఆ ప్రకటన సూచిస్తోంది. అంతిమంగా, భారత్ నుంచి దౌత్యపరమైన గుర్తింపు లభించడం అంతర్జాతీయంగా గుర్తింపు కోసం తహతహలాడుతున్న తాలి బాన్కు ఎంతో ఊతాన్ని ఇస్తుంది. ప్రాంతీయంగా అ–మిత్ర వాతా వరణం పెరుగుతున్న నేపథ్యంలో, ఈ చర్య ద్వారా, మధ్య ఆసియాలో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, స్నేహపూర్వక ఉనికితో భారత్ లబ్ధి పొందనుంది.హ్యాపీమాన్ జాకబ్వ్యాసకర్త ‘కౌన్సిల్ ఫర్ స్ట్రేటజిక్ డిఫెన్స్ అండ్రిసెర్చ్’ వ్యవస్థాపక డైరెక్టర్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ప్రాణాలు నిలిపే అదృష్టం ఊరికే రాదు!
World Anaesthesia Day 2025 అదృష్టం ఊరికే రాదు. ఎవరైనా దాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంటేనే అంది వస్తుంది. ఒక ప్రాణం కాపాడటం అలాంటి అదృష్టమే. దానికి వైద్యుడే కానక్కర లేదు. కొద్దిపాటి అవగాహన, కొంచెం శిక్షణ దొరికితే ప్రతీ పౌరుడూ ప్రాణం నిలపగలడు. మొదట నా సొంత అనుభవానికి వద్దాం. వైద్యునిగా, ప్రత్యేకించి అనస్థీషియా (మత్తువైద్యం) నిపుణుడిగా ఎవరికైనా అరు దుగా దక్కే అదృష్టం నాకు దక్కింది. అదేమిటంటే నా చేతిలో నా తండ్రి ప్రాణం తిరిగి రావడం! నేను 2001లో ఎంపీగా ఉన్న రోజుల్లో ఒక అధికారిక పర్యటనలో ఉండగా మా పల్లెటూరు పాలికవలసనుండి ఫోన్ వచ్చింది... నాన్నకు బాగులేదని. పార్వతీపురం నుండి ఆ ఊరు నలభై కిలోమీటర్లు. అప్పటికే నాన్న బీపీ పేషెంట్ కనుక ఎందుకైనా మంచిదని అత్యవసర మందులు పట్టుకుని బయలుదేరాను. ఇంటికి చేరి మూడు నిమిషాలు అయిందో లేదో నాన్నకు గుండె, ఊపిరి ఆగి పోయాయి (కార్డియాక్ అరెస్ట్). వెంటనే ఆయన్ని సరైన పొజిషన్లో ఉంచి నోటితో శ్వాస అందిస్తూ, గుండెపై బలంగా నొక్కుతూ అత్యవసర ప్రక్రియ చేపట్టాను. కాసేపటికి ఆయన గుండె కొట్టుకోవడం, ఊపిరి తీసుకోవడం మళ్లీ మొదలైంది. గండం గట్టెక్కింది. మిగతా వైద్యం కోసం హాస్పిటల్కు తక్షణం పంపే ఏర్పాట్లు చేశాను. ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న గ్రామీణులకే కాదు, బాగా చదువుకున్న అనుచరులకు, సెక్యూరిటీ సిబ్బందికి కూడా వింత. నాకు పట్టరాని ఆనందం. తలుచుకుంటే ఇప్పటికీ అంతే ఆనందం.చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!గుండె, ఊపిరి ఆగిపోయిన క్షణాల్లో అందించే ప్రాథమిక అత్యవసర ప్రక్రియ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) క్లిష్టమైన ప్రక్రియ కాదు. ఎవరైనా నేర్చుకోగలరు. గతంలో అది వైద్యులకే పరిమితమైన విద్య. ఇప్పుడుఅందరూ నేర్చుకోవాల్సిన ప్రాథమిక నైపుణ్యం. ఎందుకంటే ఆ మొదటి క్షణాల్లో అందించే వైద్య సహాయం ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడగలం. రోగిని గట్టి బల్లపై లేదా రోడ్డుపై పడుకోబెట్టడం, ఛాతీపై తగు బలంతో నిమి షానికి 100 సార్లు చేతులతో ఒత్తిడి ఇవ్వడం, అభ్యంతరం లేకపోతే నోటికి నోటి ద్వారా శ్వాస అందించడం లాంటి వాటితో ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకు రావచ్చు. ఈ నైపుణ్యాలపై విద్యార్థుల్లో, పౌరులందరిలో అవగాహన కల్పించాలి. ప్రస్తుతం ఈ దిశగా జరుగుతున్న కృషి ప్రాథమిక స్థాయిలో ఉంది. ప్రభుత్వం, పౌర సమాజం దృష్టి పెడితే ప్రజారోగ్య కోణంలో సమాజానికి చాలా మేలు జరుగుతుంది.– డా.డి.వి.జి. శంకరరావు మాజీ ఎంపీ(అక్టోబర్ 15.. ప్రపంచ అనస్థీషియా దినోత్సవం) -
శాంతి పర్వమా?
గాజా కాల్పుల విరమణ అంగీకారం అక్టోబర్ 10 నుంచి అమలులోకి వచ్చింది. ఇజ్రాయెల్పై 2023 అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) పాలస్తీనియన్లను ఊచకోత కోయడం ఆగింది. ట్రంప్ కుదిర్చిన ఈ కాల్పుల విరమణను ఒక అత్యవసర కారణం రీత్యా స్వాగతించవలసి ఉంది. కొడిగడుతున్న మానవతా దీపానికి రెండు చేతులు అడ్డుపెట్టేందుకు ఈ సంధిని సమర్థించవలసి ఉంది. పాలస్తీనా పౌరులపై రెండేళ్ళుగా మోతాదుకు మించి సాగుతున్న దాడుల్లో 67,000 మందికి పైగా పాలస్తీనియన్లు హతులయ్యారు. పౌరులు, సైనికులతో కలిపి సుమారు 2,000 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 55 లక్షల పాలస్తీనియన్లలో సుమారు ఇరవై లక్షల మంది నిర్వాసితులయ్యారని ఐక్యరాజ్య సమితి, మానవతా సంస్థలు, స్థానిక అధికారుల అంచనా.మానవ కల్పిత మహా విపత్తుగాజా శిథిలాల కుప్పగా మారింది. కరవు కాటకాలతో జనం సతమతమవుతున్నారు. ఇతర ప్రాంతాలకు పారిపోయిన పాలస్తీనియన్లు కాల్పుల విరమణ అమలులోకి రావడంతో గాజా నగరానికి, షేక్ రద్వాన్ వంటి ప్రాంతాలకు తిరిగి వస్తున్నారు. నుసేరత్, ఖాన్ యూనిస్ వంటి దక్షిణ ప్రాంత శిబిరాల నుంచి మిగిలిన అరకొర సామాను వేసుకుని అల్ రషీద్ వంటి ఉత్తర ప్రాంతాలకు నడక సాగిస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను ‘మానవ కల్పిత మహా విపత్తు’గా ఐరాస అభివర్ణించింది. ఇపుడు గాజాలోకి రోజూ 600 సహాయ సామగ్రి ట్రక్కులు వస్తున్నాయి కనుక, ఈ కాల్పుల విరమణ ఫలితంగా కరవు తీవ్రత కొద్దిగా తగ్గవచ్చు. సహాయ సామగ్రి రాక పెరగడం, రఫా, ఇతర కూడలి మార్గాలను తిరిగి తెరవడం వల్ల, గాజాలో మిగిలినవారి కష్టాలకు తాత్కాలికంగానైనా ఉపశమనం లభించవచ్చు.అయితే, వాస్తవ పరిస్థితులు ఇప్పటికీ గుబులు రేకెత్తించేవిగానే ఉన్నాయి. సుస్థిర శాంతితో పాటు, సామాజిక–రాజకీయ న్యాయం పాలస్తీనియన్లకు అందని మావి పండుగానే మిగిలిపోవచ్చు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను ఒక రకంగా బలవంతంగానే ఈ కాల్పుల విరమ ణకు ఒప్పించారు. ట్రంప్, ఇతర ప్రాంతీయ భాగస్వాములు (ఈజిప్టు, ఖతార్, సౌదీ అరే బియా) ఊహిస్తున్నంత సుందర స్వప్నం సాకారం కాకపోవచ్చు. అయినప్పటికీ, పెడ మొహంతో ఉన్న నెతన్యాహూను బలవంతం గానైనా చర్చలకు కూర్చోబెట్టినందుకు ట్రంప్ను ఎంతో కొంత అభినందించాల్సిందే. పునర్నిర్మాణం ఎలా?శిథిలాలను తొలగించి, గాజాను పున ర్నిర్మించే పనికి శ్రీకారం చుట్టడం తక్షణ ప్రాధాన్యం కావాలి. యుద్ధానంతరం గాజా పునర్నిర్మాణానికయ్యే మొత్తం వ్యయం వచ్చే పదేళ్ళలో 53.2 బిలియన్ డాలర్ల మేరకు ఉండవచ్చని అధికారిక అంచనాలు వెల్లడి స్తున్నాయి. ఐరాసకు చెందిన నష్టాలు – అవస రాల తాత్కాలిక సత్వర మదింపు సంస్థ, యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంక్ కలసి ఆ రకమైన లెక్కకు వచ్చాయి. అవి 2023 అక్టోబర్ నుంచి 2024 అక్టోబర్ వరకు వాటిల్లిన నష్టాలను దృష్టిలో పెట్టుకుని ఆ అంచనాకు వచ్చాయి. పాలస్తీనాకు అంత పెద్ద మొత్తాలను ఎలా అందుబాటులోకి తెస్తారో ఈ దశలోనే చెప్పడం కష్టం.ఐరాస పరిధికి బయట ఈ ఒడంబడిక కుదరడంతో, ఇది ఎంతవరకు ముందు సాగుతుందనే సందేహాలు రేకెత్తుతున్నాయి. దీన్ని బలమైన ప్రాంతీయ పక్షాల మద్దతుతో అమెరికా నేతృత్వాన సాగిన చొరవగానే చూస్తున్నారు. గాజాకు బయటనున్న స్థావరాల నుంచి హమాస్ ఏ విధంగా నియమాలను పాటిస్తుందో పర్యవేక్షించే ఒక బహుళ దేశీయ సైనిక సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనిలో అమెరికా దళాలు కూడా 200 వరకు ఉంటాయి. తాత్కాలిక టెక్నికల్ పాలనా బృందానికి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ నాయకుడిగా ఉంటారు. ఇది ట్రంప్ శైలిలో నయా సామ్రాజ్యవాద పోకడను సూచిస్తోంది. ఈ ఒప్పందానికి భారత్ కూడా మద్దతు తెలిపింది. మొదటి దశకు శుభారంభం చేసినందుకు నెతన్యాహును ప్రధాని మోదీ ప్రశంసించారు. సంక్లిష్టమైన శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో పాల్గొన్న అనుభవం భారతదేశానికి ఉంది. కొరియా యుద్ధ విరమణ (1953) నుంచి తదుపరి ఐరాస ప్రత్యేక విధుల్లో భారత్ పాలుపంచుకుంది. విపత్తుల సహాయ కార్యక్రమాల్లో భారత్ తన సమర్ధతను విజయవంతంగా నిరూపించుకుంది. కనుక,గాజాకు ఇపుడు ఎంతో అవసరమైన అంతర్జాతీయ పునర్నిర్మాణ పనులకు భారత్ చేదోడువాదోడు కాగలదు. కాల్పుల విరమణ ఒడంబడిక తాత్కాలికమైనది, విఘాతాలకు లోనుకాగల అవకాశం ఉన్నది. ఇది 2023 అక్టోబర్లో యుద్ధం మొదలైన తర్వాత సంధి కుదర్చడానికి సాగుతున్న మూడవ పెద్ద ప్రయత్నం. రెండు ప్రయత్నాలు గతంలో విఫలమయ్యాయి. ఈసారైనా సత్ఫలితాలు ఇస్తుందా? నిజానికి, ఐరాస ఆధ్వర్యంలోకి ఈ సంక్లిష్ట ఒప్పందాన్ని తీసుకురావడం వాంఛనీయం. కానీ, అటువంటి పరిణామానికి ఉన్న అవకాశం చాలా తక్కువ.సి. ఉదయ్ భాస్కర్వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్ -
'మనసు మాటే' బతుకు బాట
గొలుసుకట్టు సరుకుల దుకాణాల సంస్థ ‘హోల్ ఫుడ్స్ మార్కెట్’ సహ వ్యవస్థాపకునిగా, దాని మాజీ సీఈఓగా జాన్ మెకే ప్రఖ్యాతి వహించారు. ఈ అమెరికన్ 44 ఏళ్ళ పాటు శ్రమించి దాన్నొక బహుళ జాతి సంస్థగా వృద్ధిలోకి తెచ్చారు. 2022లో అందులోంచి రిటైరయ్యాక ‘లవ్ లైఫ్’ పేరుతో ఆరోగ్య, స్వస్థతా వ్యాపారాన్ని ప్రారంభించారు. బెంట్లే కాలేజ్ పట్టభద్రులను ఉద్దేశించి మెకే చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం: తల్లితండ్రులను మనసారా గౌరవించి, ప్రశంసించాలని బెంట్లే విద్యార్థులకు నేనిచ్చే మొదటి సలహా. కన్నవారు ప్రేమించినంతగా మనల్ని మరెవరూ ప్రేమించరు. మనల్ని పెంచి పెద్దచేసే క్రమంలో వారు కూడా తప్పులు చేసి ఉండవచ్చు. కానీ వారికి తెలిసినంతలో, ఉన్నంతలో మనల్ని తీర్చిదిద్దే కృషి చేశారని గుర్తించాలి. వారు మన కోసం ఎన్నో త్యాగాలు కూడా చేసి ఉంటారు. వాటిలో కొన్ని మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. అంతరాత్మకు వ్యతిరేకంగా పోతే...జీవిత కాలం నిజంగానే చాలా చిన్నది. ఈ ప్రాథమిక సత్యాన్ని ఎన్నడూ మరచిపోకూడదు. మృత్యువు అనివార్యం కనుక మన జీవి తాలను ఎలా గడపాలి? ఈ ప్రశ్నకు జవాబు విషయంలో యువ కుడిగా ఉన్నప్పటి నుంచి నాకొక స్పష్టత ఉంది. అంతరాత్మ ప్రబోధం మేరకు నడచుకోవాలి. ఇష్టమైన వ్యాపకాన్నే చేపట్టాలి. జీవితంలో ఏం చేయాలని కోరుకుంటున్నామో, దేన్ని ఎక్కువ అభిమానిస్తామో ఆ రంగంలోకే దిగాలి. నేను 19 ఏళ్ళ వయసు నుంచి నా జీవితంలో అలాగే నడచుకునేందుకు ప్రయత్నించాను. కాలేజీ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పి, హోల్ ఫుడ్స్ మార్కెట్ ప్రారంభించాలనే నిర్ణయం నా హృదయం నుంచే వచ్చింది. ఈ నిర్ణయం నా తల్లితండ్రులనూ, స్నేహితుల్లో చాలా మందినీ ఆశాభంగానికి గురిచేసింది. కానీ, నిస్సందేహంగా అది సరైన నిర్ణయమనే దృఢ నిశ్చయంతో ముందుకు సాగాను. హృదయం చెప్పినట్లు నడుచుకోవడంలో రెండు ముఖ్యమైన కోణాలున్నాయి. మొదట– మనల్ని మనం తెలుసుకునే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే మనం నిజంగా అంతరాత్మ చెప్పినట్లు నడచుకుంటు న్నామా లేక ఎక్కడన్నా దారి తప్పామా అన్నది తెలుస్తుంది. మనం గాఢంగా ఇష్టపడే వ్యాపకాలను చేపడితే మనం రెట్టింపు శక్తితో పని చేస్తాం. సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. అది సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా, చేసే పనికి ఒక ప్రయోజనాన్ని కూడా చేకూరుస్తుంది. అంతరాత్మ చెప్పినట్లు నడచుకోవడం మానేస్తే దానికి వ్యతిరేక ఫలితాలు సంభవిస్తాయి. శక్తి సన్నగిల్లుతుంది. సృజన కొరవడుతుంది. చేసే పనికి ఒక పరమార్థం అంటూ ఉండదు. ముఖ్యంగా సంతోషం కూడా లోపిస్తుంది. ఒక దిశ, దశ లోపించాయని అనిపించినపుడు మరో దాన్ని ఎంచుకోండి. కొన ఊపిరి ఉన్నంత వరకు ఏదీ చేజారిపోయినట్లు కాదు. దేనికీ కాలం మించిపోయినట్లు కాదు. హృదయం చెప్పిన మార్గంలో నడిచేందుకు మరొకటి అవసరం పడుతుంది. అది భయాన్ని జయించడం! జీవితానికి ఒక పూర్తి సార్థకత చేకూర్చుకోకుండా చాలా మందికి అడ్డుపడేది భయమే! చేపట్టే పనిలో విఫలమవుతామేమోననే భయం. ఆత్మీయులు మనం ఇష్టపడుతున్న రంగాన్ని తిరస్కరిస్తారేమోనని భయం. సక్రమంగా నిర్వహించగలమో, లేదోనని మనకే ఒక సందేహం. మనలో రేకెత్తే భయాన్ని బయటివారు ఎవరూ పోగొట్టలేరు. దాన్ని మనకు మనమే తొలగించుకోవాలి. భయం మన మనసు సృష్టించే ఒక బూచి. అది బయటిది కాదు. లోపలి నుంచి పుట్టుకొచ్చేది. పుడుతున్న చోటనే దాన్ని అంతం చేయాలి. ప్రేమే జీవిత మూలసూత్రంమన జీవితాల్లో ప్రేమను పెంచి పోషించుకోవడాన్ని ఒక మూలసూత్రంగా అనుసరించాలి. ఇక్కడ ప్రేమ అంటే స్త్రీ పురుషుల మధ్య లైంగికతకు సంబంధించినది కాదు. నేను చెప్పే ప్రేమ ఎదుటి వారి పట్ల దయతో వ్యవహరించడానికి చెందినది. ఎదుటివారు మంచిపని చేస్తే నిండు మనసుతో అభినందించగలగాలి. తోటి వారిని ప్రేమించడం వల్ల మన జీవితాలు సుసంపన్నమవుతాయి. ప్రేమతో మెలిగేందుకు మరో మూడు సుగుణాలు అవసరమని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మొదటిది – కృతజ్ఞత చూపడం! బతికున్నంత కాలం మనం ధన్యవాదాలు తెలుపవలసిన సందర్భాలు అనేకం ఎదురవుతూంటాయి. ప్రతి రోజూ ఉదయం పూట కొద్ది నిమిషాలు మనకు మేలు చేసినవారిని, మనల్ని సంతోషపరచినవారిని గుర్తు చేసుకోవాలి. అవకాశం రాగానే వారికి కృతజ్ఞత తెలియచేయాలి. వృత్తి ఉద్యో గాలలోనూ సంతోషపెట్టే పనులు చేసిన తోటి సిబ్బందిని అభినందించాలి. అది సంస్థ పనితీరు మెరుగుపడేందుకూ, మరిన్ని సత్ఫలి తాలు సాధించేందుకూ నిస్సందేహంగా తోడ్పడుతుంది. రెండవది – క్షమాగుణం! అరకొర అవగాహనతో, అపోహలతో ఎదుటివారి పట్ల ఒక నిర్ణయానికి వచ్చేస్తూంటాం. వారిపట్ల మనసులో అక్కసు పెంచుకుంటాం. మన బాధలకు వారే కారణం అనుకుంటాం. మన జీవితాల్లో ప్రేమ పొంగి పొరలకుండా అడ్డుకునేది అలా పొరపాటు అభిప్రాయాలను ఏర్పరచుకోవడమే! దానివల్ల మనకు మనమే ఎంత హాని చేసుకుంటున్నామో పూర్తిగా గుర్తెరగం. అది తెలిస్తే అటువంటి అలవాటు మానుకుంటాం. మనం చేసిందే ఒప్పు అని, ఎదుటివారిది తప్పు అని మనసులో బలంగా ఉండటం వల్ల క్షమించలేం. ఎదుటివారు తప్పు చేయడం వల్లనే మనం క్షమించవలసి వచ్చిందనే అభిప్రాయం కూడా మనకు తరచు కలుగుతూ ఉంటుంది. కానీ, క్షమించడమంటే అసంతృప్తినీ, కోపాన్నీ మన మనసు నుంచి పారదోలడమే! అంతేకానీ, మన విలువలను, నైతిక సూత్రాలను వదులుకుంటు న్నట్లు కాదు. క్షమించడం వల్ల మనం గతం నుంచి విముక్తుల మవుతాం. వర్తమానంలో ప్రేమను ఆస్వాదించగలుగుతాం. మూడవది – ఉదారత! దీన్ని చాలా మంది డబ్బు ఇవ్వడమే అనుకుంటారు. ఎదుటివారికి మన సమయాన్ని వెచ్చించి, సేవలందించడం కూడా ఉదారత చూపడమే. అవి మనం వారికిచ్చే కానుకలు. మనం దేన్నో త్యాగం చేస్తున్నామనుకోవడం, మన ప్రయోజనాలను పక్కనపెట్టి వారికి సేవ చేస్తున్నామనుకోవడం నిజమైన ఉదారత అనిపించుకోదు. వారి లాభం మనకు నష్టం అనే భావన రాకూడదు. ఉదారత అంటే మన హృదయం నుంచి ప్రవహించే ప్రేమకు పొడిగింపు మాత్రమే! ఆశాభంగపు పాఠాలుజీవితంలో ఆశాభంగాలు, అన్యాయాలు చాలా ఎదురవు తాయి. మనకు ఎదురయ్యే కష్టాలు, సవాళ్ళలో చాలా వాటిని మనం వృద్ధి చెందడానికి తోడ్పడే అవకాశాలుగా చూడటం నేర్చుకోవాలి. గతంలో చూడని నెలవులను మించి కొత్తవాటిలోకి ప్రవేశించేందుకు సహాయపడగల పాఠాలనుకోవాలి. పరిస్థితుల ప్రాబల్యం లేదా ఇతరుల వల్ల నష్టపోయిన వ్యక్తిగా మనల్ని మనం చూసుకోవడం వల్ల ఉపయోగం ఉండదని గ్రహించాలి. మనల్ని చూసి ఎదుటివారు జాలి పడాలనుకోవడం కన్నా, మన మీద మనం జాలిపడటం కన్నా పెను విధ్వంసక భావావేశం మరొకటి లేదు. దాన్ని కనుక నిర్మూలించకపోతే – నిస్సహాయులం, నిర్వీర్యులం అయిపోతాం. హృదయం చెప్పినట్లు నడుచుకోలేం. జీవితం నేర్పాలనుకుంటున్న పాఠాలను అర్థం చేసుకునేందుకు నిపుణుల సలహాలు తీసుకోవడం, ధ్యానం వంటివాటిని ఆశ్రయించవచ్చు. -
నీరవ్ మోదీ (ఖైదీ బిలియనీర్) రాయని డైరీ
భారత ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగినట్లయితే ఈ ఏడాది డిసెంబరులో విజయ్ మాల్యా, వచ్చే ఫిబ్రవరిలో నేను, మే నెలలో మా మామయ్య మెహుల్ చోక్సీ... ముగ్గురం ముంబై ఆర్థర్ రోడ్ జైల్లో మా తొలి బర్త్డేలు జరుపుకొంటాం అనుకుంటా!జైల్లో నేను 55 లోకి, మామయ్య మెహుల్ చోక్సీ 67లోకి, విజయ మాల్యా 70లోకి అడుగు పెడతాం. ఏడాది నుంచి ఏడాదిలోకి అడుగు పెట్టడమే కానీ, మేమిక ఆర్థర్ రోడ్ జైలు నుండి బయటికి అడుగుపెట్టడం అనేదే ఉండదని భారతీయ శిక్షా స్మృతి ప్రకారం నా మనసుకు అనిపిస్తోంది.నేను 2019 నుండీ లండన్ జైళ్లలో ఉంటున్నాను. మాల్యా 2016 నుండీ లండన్ వీధుల్లో చల్లటి బీరు తాగుతూ బెయిల్ మీద ఉంటున్నారు. ఆయన ఒక్కసారీ జైల్లో లేరు. నాకు ఒక్కసారీ బెయిల్ రాలేదు. మామయ్య మెహుల్ చోక్సీని ఐదు నెలల క్రితమే... బెల్జియంలో అరెస్ట్ చేసి అక్కడే జైల్లో ఉంచారు. మోచేతి కర్రతో ఆయన నడుస్తుండటం ఫొటోల్లో చూసి నా మనసు చివుక్కు మంది. విధి ఎవర్ని ఎలా నడిపిస్తుందో ఊహించలేం. నేరం అన్నది చట్టం దృష్టిలో క్రూరమైనదే కావచ్చు. కానీ, నేరం కంటే క్రూరమైనది చట్టం. ఈ మాటనే 2019లో ఒకసారి, 2021లో ఒకసారి ఫోన్లో నేను మాల్యాతో అన్నప్పుడు, రెండుసార్లూ మాల్యా ఒక్క క్షణం ఆగి, పెద్ద పెట్టున నవ్వారు. ‘‘ఎందుకలా ఒక్క క్షణం ఆగారు మాల్యాజీ?’’ అని అడిగాను. ‘‘బీరు పొలమారింది’’ అన్నారు.‘‘మరి ఎందుకలా పెద్ద పెట్టున నవ్వారు మాల్యాజీ?!’’ అన్నాను.‘‘ఇంత వయసు వచ్చినా నాకు బీరును పొలమారకుండా తాగటం రానందుకు నవ్వొచ్చింది’’ అన్నారు!ఆ తర్వాతెప్పుడూ నేను చట్టం–నేరం అంటూ మాల్యాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు. మధ్యలో మాల్యానే 2023లో ఒకసారి నాకు ఫోన్ చేశారు.‘‘ఎక్కడున్నావ్?’’ అన్నారు.‘‘ఇదిగో ఇప్పుడే సౌత్ వెస్ట్ లండన్ నుంచి, సౌత్ ఈస్ట్ లండన్ కి వచ్చాను మాల్యాజీ’’ అని చెప్పాను. ‘‘వావ్ వావ్... బెయిల్ వచ్చేసిందా!’’ అని చాలా సంతోషంగా అడిగారు మాల్యా. ఒకరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకునే వారిలో మాత్రమే అంతగా సంతోషం పొంగి పొర్లుతుంది.‘‘బెయిల్ కాదు కానీ, బెయిల్ లాంటిదే మాల్యాజీ. కరడుగట్టిన నేరస్థులతో కిక్కిరిసి ఉండే ‘హిజ్ మెజెస్టీస్ ప్రిజన్ ’ వాండ్స్వర్త్ నుంచి కొంచెం శుభ్రంగా ఉండే ‘హిజ్ మెజెస్టీస్ ప్రిజన్ ’ థేమ్స్సైడ్కు నన్ను షిఫ్ట్ చేశారు అన్నాను.‘‘అవునా... ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్’’ అన్నారు మాల్యా. కొత్త సంతోషం పాత బాధల్ని మరిపిస్తుందని!నవంబర్ 23న వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో నా ‘అప్పగింత’ కేసు హియరింగ్. ‘‘నీరవ్ని మాకిచ్చేయండి ‘ప్రేమగా’చూసుకుంటాం’’ అని ఇండియా అంటోంది. మొదట నేను, నా వెనుకే మామయ్య, ఆ వెనుకే మాల్యా వరుసగా ఒక్కొక్కరంఇండియా ప్రేమకు పాత్రులం అవక తప్పేలా లేదు. బ్రేక్లో నా సెల్ నుంచి బయటికి వచ్చి మాల్యాకు ఫోన్ చేశాను. ‘‘హా... నీరవ్! నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నా... బెల్జియం నుంచి నాకొక డాజిలింగ్, రేడియంట్, సింటిలేటింగ్,గ్లిజనింగ్, లస్ట్రస్... డైమండ్ నెక్లెస్ సెట్టును స్పెషల్గా తయారుచేయించి తెప్పించగలవా? ఫిబ్రవరిలో పింకీ బర్త్ డే ఉంది’’ అన్నారు! పింకీ... మాల్యా గర్ల్ ఫ్రెండ్. నేనిక్కడ జైల్లో మా ముగ్గురి ‘ఆర్థర్ రోడ్’ బర్త్డేల గురించి ఆలోచిస్తుంటే, మాల్యా అక్కడ బెయిల్లో తన గర్ల్ఫ్రెండ్ గ్రాండ్ బర్త్డే గిఫ్ట్ గురించి ప్లాన్ చేస్తున్నారు! -
ప్రజాస్వామ్యంలో ఏకతా శక్తి
ధార్మిక, సాంస్కృతిక, జ్ఞాన భూమి అయిన బిహార్లో గంగా, ఘాఘరా నదుల సంగమ స్థానాన ఉన్న సితాబ్ దియారా గ్రామంలో 1902 అక్టోబరు 11న జయప్రకాశ్ నారాయణ్ జన్మించారు. మనమంతా ఆత్మీయంగా జేపీ అని పిలుచుకునే జయ ప్రకాశ్ నారాయణ్... గొప్ప రాజ నీతిజ్ఞుడు, ప్రజాస్వామ్య రక్ష కుడు, ‘సంపూర్ణ క్రాంతి’ రూప శిల్పి. ‘లోక్ నాయక్’ బిరుదు ఆయనకు ఎవరో పెద్దలుఇచ్చింది కాదు... 1974 జూన్ 5న పట్నాలోని గాంధీ మైదా నంలో సమావేశమైన లక్షలాది ప్రజలు ప్రేమతో ఆయనను ‘లోక్ నాయక్’ అని పిలిచారు. రాజకీయ చేతనకు పునాది సితాబ్దియారాలో ప్రాథమిక విద్య అనంతరం పట్నా వెళ్లిన ఆయనను అక్కడి జాతీయవాద వాతావరణం ఆకట్టుకుంది. ఇంట ర్మీడియట్ చదువుతున్న రోజుల్లో దేశంలో బ్రిటిష్ ఆక్రమణవాదా నికి వ్యతిరేకంగా సాగుతున్న అహింసాయుత, సహాయ నిరాకరణో ద్యమం ఆయనపై అమితమైన ప్రభావం చూపింది. అమెరికాలో ఏడేళ్ల విద్యాభ్యాస సమయంలో మార్క్సిజం వైపు ఆకర్షితుడయ్యారు. దేశంలో సమస్యలన్నింటికీ మార్క్సిజమే పరి ష్కారం చూపుతుందని ఆ సమయంలో భావించారు. అయితే, భారత్కు తిరిగొచ్చిన తర్వాత ఈ దేశ పరిస్థితులకు మార్క్సిజాన్ని అన్వయించే సాధ్యాసాధ్యాలను అన్వేషించిన అనంతరం... ‘ప్రజా స్వామ్య సామ్యవాదం’, ‘సర్వోదయ’ భావనలే ఇక్కడి సమస్యలకు పరిష్కారమన్న నిశ్చయానికి వచ్చారు. ఈ ఆచరణాత్మక దృక్పథమే జేపీ ఔచిత్యానికీ, రాజనీతిజ్ఞతకూ నిదర్శనం. శ్రమ విలువ తెలిసినవారు!వినోబా భావే భూదానోద్యమాన్నీ, సర్వోదయ తాత్వికతనూ మేళవిస్తే దేశంలోని భూ సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారం లభిస్తుందని 1952లో జేపీ భావించారు. 1954–73 మధ్య కాలంలో ఆయన చేపట్టిన చంబల్ బందిపోట్ల పునరావాసం, అహింసాయుత సంపూర్ణ విప్లవం వంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునూ, ప్రశంసలనూ పొందాయి. ‘శ్రమకు గౌరవం (డిగ్నిటీ ఆఫ్ లేబర్)’ అన్న భావనను జేపీ అర్థం చేసుకున్న తీరు కేవలం సైద్ధాంతికపరమైంది కాదు. స్వీయా నుభవాల నుంచి గ్రహించినదే. అమెరికాలో అభ్యసిస్తున్న రోజుల్లో ‘చదువుకుంటూనే సంపాదించుకోవడం’ ఆయనకు అలవడింది. ఆర్థిక అవసరాల కోసం చిన్న చిన్న పనులు చేశారు. నిజాయతీగల శ్రమకు గౌరవం, న్యాయబద్ధమైన వేతనాలు, మానవీయ పని వాతా వరణం ఉండి తీరాలన్న ఆయన నిశ్చయాన్ని ఇవి మరింత బలో పేతం చేశాయి. కార్మిక వర్గ సంక్షేమమే న్యాయబద్ధమైన సమాజానికి పునాది అన్న దృఢమైన నిశ్చయంతో ఆయన భారత్కు వచ్చారు. ముఖ్యంగా 1947లో మూడు ముఖ్యమైన అఖిల భారత కార్మికసంఘాలు – అఖిల భారత రైల్వే సిబ్బంది సమాఖ్య, అఖిల భారత పోస్టుమెన్ – టెలిగ్రాఫ్ దిగువ స్థాయి సిబ్బంది సంఘం, అఖిల భారత ఆయుధ కర్మాగారాల కార్మికుల సంఘాలకు ఆయన అధ్య క్షుడిగా ఎన్నికయ్యారు.1960ల సమయంలో రుతుపవనాల వైఫల్యం బిహార్ను కరవు పరిస్థితిలోకి నెట్టింది. ఆ సమయంలో జేపీ తన భూదానోద్యమ సహచరులు, అనుచరులతో కలిసి ప్రజల బాధలను తగ్గించేందుకు సహాయక చర్యల్లో తలమునకలయ్యారు. ‘బిహార్ రాహత్ కమిటీ’తో ఈ సమయంలోనే ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల ‘దేశ సేవా దృక్పథా’న్ని ప్రత్యక్షంగా చూశారు. అది ఆయననెంతో ప్రభావితం చేసింది. నా అనుభవంజీవితంలో ప్రతి దశలోనూ అవినీతి సమస్యను ఎదుర్కొన్న జేపీ... భారతీయ సమాజ పునరుజ్జీవనం, పునర్నిర్మాణంలో భాగ స్వాములయ్యేలా దేశ యువతను ప్రేరేపించాల్సిన ఆవశ్యకతఉందని భావించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోతున్న తరుణంలో... ప్రజాస్వామ్య శక్తిపై వారిలో ఆశలనూ, నమ్మకాన్నీ పునరుద్ధరించారు. 1973లో వినోబా భావే పవనార్ ఆశ్రమం నుంచి ‘సంపూర్ణ విప్లవం’ దిశగా జేపీ స్పష్టంగా పిలుపు నిచ్చారు. ఆదర్శ మానవీయ సమాజాన్ని సాధించడమే ‘సంపూర్ణ క్రాంతి’ ఉద్యమ లక్ష్యం. అవినీతికి వ్యతిరేకంగా నిరంతరం గొంతె త్తిన ఆయన భావాలు నాటి రాజకీయాల్లో వేళ్లూనుకున్నాయి. ప్రజల్లో చైతన్యాన్ని రగల్చగల ఆయన సమర్థత, 1977లో దేశంలో ఓ కొత్త వ్యవస్థను నెలకొల్పే దిశగా వారి ఆగ్రహాన్ని ఆయన మళ్లించిన తీరు అనన్య సామాన్యం. 19 ఏళ్ల యువకుడిగా కోయంబత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్ర టరీగా ‘సంపూర్ణ క్రాంతి’ ఉద్యమంలో భాగస్వామినయ్యే అవకాశం దక్కడం నాకు లభించిన గొప్ప గౌరవం. ఈ దశలో, దేశ చరిత్రలో అత్యంత కీలక సమయంలో నేను నేర్చుకున్న విషయాలు యువ కుడిగా ఉన్న నన్ను... ఆత్మవిశ్వాసంతో కూడిన, సామాజిక అవగా హన కలిగిన నాయకుడిగా తీర్చిదిద్దాయి.మన ప్రియతమ నేత జయప్రకాశ్ నారాయణ్ను ప్రేమగా గుర్తు చేసుకుంటున్న మనం... దేశ స్వాతంత్య్రోద్యమం కోసం నిస్వార్థంగా బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసిన ఆయన జీవిత భాగస్వామి ప్రభావతీ దేవినీ మరవకూడదు. గాంధీ ఆదర్శాల సాధన కోసం నిస్వార్థంగా ఆమె తన శక్తినంతా వెచ్చించారు.జేపీ వారసత్వం 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం నుంచి 1970లో చేపట్టిన ‘సంపూర్ణ క్రాంతి’ దాకా... దేశం పట్ల ఉన్న ప్రేమ భావనే ఆయనను నిరంతరం ముందుకు నడిపింది. ప్రభుత్వంలో తనకు నచ్చిన పదవిని పొందే అవకాశం దొరికినప్పటికీ, అధికార వ్యామోహానికి ఆయనెప్పుడూ లొంగలేదు. నిస్వార్థ దేశసేవకే కట్టుబడి ఉన్నారు. ఎంత కఠినమైన సవాళ్లు ఎదురైనా, ప్రజలు తలచుకుంటే మార్పును తేగలరని చెప్పడానికి జేపీ జీవితం, బోధనలు నిదర్శనం. ప్రజాస్వామ్య విలువలను రక్షించుకుంటూనే – సమానత్వం, న్యాయం, శాంతి నెలకొని ఉన్న సమాజాన్ని నిర్మించాలన్నది ఆయన బోధనల సారాంశం. సామాజిక, ఆర్థిక న్యాయమూ, రాజకీయ స్వేచ్ఛ విడదీయలేనివని ప్రకటించిన దార్శనిక నాయకుడాయన. విప్లవమంటే హింస అని భావించే అవకాశం ఉంది. కానీ, జేపీ చేపట్టిన సంపూర్ణ విప్లవానికి అహింసే ప్రాతిపదిక. అహింసాయుత ప్రజా ఉద్యమం ద్వారా... వ్యవస్థాగతంగానూ, సామాజికంగానూ మానవత, నైతికత విలువల ఆధారంగా భారత పురోగమనానికి ఆయన పునాది వేశారు. జాగరూకులమై, నిస్వార్థం, సేవ, సత్యసంధతతో భారత అభ్యున్నతికి కృషి చేయడమే మనం ‘భారతరత్న’ జేపీకి అందించే నిజమైన నివాళి.-సి.పి. రాధాకృష్ణన్ భారత ఉప రాష్ట్రపతి -
ముళ్లదారిలో ఒక ముందడుగు
గాజాలో ‘శాంతి సాధన’ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ప్రణాళికలో ‘మొదటి దశ’ అమలుకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించినట్లు 8వ తేదీ రాత్రి ప్రకటనలు వెలువడ్డాయి. ఈ ప్రకటనను హమాస్, ఇజ్రాయెల్ వెంటనే ధ్రువీకరించాయి. అది స్థూలమైన అంగీకారం. అమలు ఏ విధంగా అనే వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. యథాతథంగా ఈ మొదటి దశ అనే దానిలో కాల్పుల విరమణతో పాటు రెండు అంశాలున్నాయి. ఒకటి – ఇజ్రాయెలీ బందీలను హమాస్, వారి ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయటం. రెండు – ఇజ్రాయెలీ సేనలు ‘అంగీకృతమైన’ (అగ్రీడ్ అపాన్) రేఖ వద్దకు ఉపసంహరించుకోవటం. ఈ రెండు అంశాల అమలు ఎంత సాఫీగా జరగవచ్చునన్నది వేచి చూడవలసిన విషయం. కాగా, రెండేళ్ళుగా సాగుతున్న గాజా మారణహోమంలో ఇపుడందరూ కొంత ఊపిరి తీసుకోగలరని మాత్రం చెప్పవచ్చు.ఏది అంగీకృత రేఖ?సరిగా రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్పై దాడి జరిపిన హమాస్, 250 మందిని బందీలుగా పట్టుకుంది. వారిలో ప్రస్తుతం సజీవులుగా 20 మంది, మృతదేహాల రూపంలో 28 మంది ఉన్నట్లు అంచనా. ఇజ్రా యెల్ వద్ద 250 మంది పాలస్తీనియన్లు జీవిత ఖైదీలుగా, సుమారు 1,300 మంది యుద్ధ ఖైదీలుగా ఉన్నట్లు చెప్తున్నారు. రెడ్ క్రాస్ ద్వారానో, మరొక విధంగానో వీరందరి విడుదలకు సమస్య ఉండక పోవచ్చు. కానీ, రెండవ అంశమైన ఇజ్రాయెలీ సేనల ఉపసంహరణ విషయం తేలటం తేలిక కాదు. ‘అంగీకృత రేఖ’ వద్దకు మాత్రమే పాక్షిక ఉపసంహరణ అన్నది ట్రంప్ ప్రణాళికలో గల అంశం కాగా, బందీలను తాము విడుదల చేయగానే పూర్తి ఉపసంహరణ జరగా లని హమాస్ షరతు పెడుతూ వచ్చింది. ఆ షరతును హమాస్ ఇప్పుడు సడలించిందా? ఏ విధంగా? ‘అంగీకృత రేఖ’ అర్థం పర స్పర అంగీకారమనా? లేక ట్రంప్, నెతన్యాహూల మధ్య అంగీ కారమా?ఇందులో ‘అంగీకృత రేఖ’ అనే మాట గురించిన సందేహాలు అనవసరమైనవిగా తోచవచ్చు. కానీ, ట్రంప్ 20 సూత్రాల ప్రణా ళికను ఎవరితోనూ సంప్రతించకుండా ట్రంప్, నెతన్యాహూల మధ్య రూపొందిన విషయాన్ని గుర్తు చేసుకుంటే, ఈ సందేహాలు సహేతు కమైన వని అర్థమవుతుంది. పైగా, మొదట తాము ట్రంప్కు చేసిన సూచనలను ట్రంప్, నెతన్యాహూ సమావేశం దరిమిలా మార్చివేశా రని అరబ్ నాయకులు బహిరంగంగా ఆరోపించటం కూడా గమనించదగ్గది. ‘అంగీకృత రేఖ’ అన్నది రాగల రోజులలో ఏ విధంగా ‘పరస్పర అంగీకృతం’ అయే రీతిలో రూపొందగలదో చూడవలసి ఉంటుంది.ఆయుధాలు వదిలేస్తారా?కాల్పుల విరమణ జరిగిన అనేక సందర్భాలలో ఏవో కారణా లతో ఏదో ఒక పక్షమో, ఇరుపక్షాలో ఉల్లంఘనలకు పాల్పడటం సర్వసాధారణం. ఇజ్రాయెల్కు సంబంధించి వారు లెబనాన్, సిరియా, గోలన్ కనుమలు, జోర్డాన్ ప్రాంతాలలో చేస్తున్నది అదే. అందువల్ల, గాజాలో ఉపసంహరణను పర్యవేక్షించేది, ‘అంగీకృత రేఖ’ వద్దకు ఉపసంహరణ తర్వాత నియంత్రించేది ఎవరో ఇంకా సూచనలు లేవు. గాజా సమస్య కేవలం గాజాకు పరిమితమైనది కాదు. వెస్ట్ బ్యాంక్తో కలిపి మొత్తం పాలస్తీనా దేశం ఏర్పాటుకు సంబంధించినది. ఇప్పటికే 150 దేశాలు గుర్తించినప్పటికీ కేవలం ఇజ్రాయెల్ కోసమని అమెరికన్లు భద్రతా సమితిలో పదే పదే వీటో చేస్తున్న తమ విధానాన్ని మార్చుకుని, రెండు స్వతంత్ర దేశ వ్యవస్థలు ఏర్పడే వరకు ఈ సమస్య పరిష్కారమయ్యేది కాదు. ఈ విషయమై ట్రంప్ 20 సూత్రాలలో అస్పష్టతలు, వంచనా కళలు తప్ప నిజా యతీ లేదు. గాజాకు సంబంధించి పాలస్తీనియన్లు, అరబ్బుల ఆలో చనలు ఒక విధంగా ఉండగా, అమెరికా, ఇజ్రాయెల్ ఆలోచనలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.అందుకు కొన్ని ఉదాహరణలను చెప్పుకొనేముందు... బందీలు, ఖైదీల విడుదల, అంగీకృత రేఖ వద్దకు సేనల ఉపసంహరణతో పాటుగా ఆ వెంటనే ముందుకు రాగల అంశాలేమిటో చూద్దాం. వాటిలో మొదటిది గాజా పౌరులకు సహాయం చేరటం. రెండవది హమాస్ నిరాయుధీకరణ. ఈ అంశాలు 20 అంశాలలో చేరి ఉన్నాయి గానీ, 8వ తేదీన ట్రంప్ చేసిన ప్రకటనలో లేవు. ఈజిప్టులో చర్చలు కొనసాగుతున్నందున సహజంగానే ముందుకు వస్తాయి. ఇందులో సహాయాల సరఫరాకు కూడా ఇంతకాలం ఆటంకాలు కల్పించిన ఇజ్రాయెల్, ఆ సహాయం హమాస్కు చేరుతున్నదనే వాదనలు చేసింది. సరఫరాలపై తమకు పూర్తి నియంత్రణ ఉండా లన్నది. ఇది పరిష్కారం కావలసి ఉన్న విషయం. హమాస్ నిరాయుధీకరణ జరిగి తీరాలన్నది అమెరికా, ఇజ్రాయెల్ల పట్టు దల కాగా, స్వతంత్ర పాలస్తీనాకు మార్గం సుగమం అయ్యే వరకు ఆ పని చేయబోమని హమాస్ ప్రకటిస్తున్నది. కాకపోతే, గాజాలో ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వంలో భాగస్వాములం కాబోమని సూచించింది. అయితే, పాక్షిక నిరాయుధీకరణ కోసం ఒప్పించేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారన్నవి 9వ తేదీ నాటి వార్తలు. పాక్షిక మంటే ఏమిటో, హమాస్ నిర్ణయమేమిటో తెలియాలి.ధూర్త ఆలోచనఇవి రెండవ దశగా భావిస్తే, ట్రంప్ ప్రణాళికలోని తక్కినవన్నీ మహా సమస్యాత్మకమైనవి. ఒక్క మాటలో చెప్పాలంటే, స్వతంత్ర పాలస్తీనా అన్నదే లేకుండా ఆ రెండు భూభాగాలు తమ అధీనంలోకి రావాలన్నది అమెరికా, ఇజ్రాయెల్లకు ఈ రోజు వరకు కూడా ఉన్న పథకం కాగా, అందుకు ససేమిరా అన్నది పాలస్తీనియన్ల చరిత్రాత్మకమైన జాతిపరమైన ఆకాంక్ష. ట్రంప్ 20 సూత్రాలలో హమాస్ సంపూర్ణ నిరాయుధీకరణ, వారి రక్షణ వ్యవస్థలన్నింటి విధ్వంసం, ఆ సంస్థ కొత్త ప్రభుత్వంలో పాల్గొనకపోవటం, గాజాను డీ–ర్యాడికలైజ్ చేయటం, గాజా పరిపాలనకు బయటి వారితో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు, అమెరికా ఆధ్వర్యంలో రక్షణ బలాలు, గాజాను సెజ్గా మార్చి, బయటివారే అభివృద్ధి ప్రణాళికలు రచించి, బయటి నిధులతో అభివృద్ధి పరచటం వంటివి ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్లోని పాలస్తీనా అథారిటీ తాము ఆశించిన విధంగా ‘తనను తాను పూర్తిగా సంస్కరించుకున్న పక్షంలో’ స్వీయ నిర్ణయాధికారం, పాలస్తీనా ఏర్పాటు విషయాలు అపుడు ఆలోచిస్తారు. ఇదెంత ముళ్ల దారో, ధూర్తమైనదో స్పష్టంగా కనిపిస్తున్నదే!టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మానసిక ఆరోగ్యానికి మనమేం చేస్తున్నాం?
ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10న ‘మానసిక ఆరోగ్య దినోత్సవా’న్ని (World Mental Health Day 2025) జరుపు కొంటున్నాము. మానసిక ఆరోగ్య ప్రాము ఖ్యాన్ని గుర్తించి ‘వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్’ (డబ్ల్యూఎఫ్ఎమ్హెచ్) 1992 నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా 150 దేశా లలో మానసిక ఆరోగ్యంపై అపోహలు తొలగించి అవగాహన పెంచడానికి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ‘విపత్తులు, ఆపత్కాలంలో మానసిక ఆరోగ్య సేవల లభ్యత’ అనేది ఈ ఏడాది నినాదం. ‘శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా, సామాజికంగా కూడా దృఢంగా ఉండటం’ సంపూర్ణ ఆరోగ్యం అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్వచనం. మనిషి తన ఆలోచనలు, భావోద్వేగాలు నియంత్రించుకోగలిగి, సమస్యలను ధైర్యంగా ఎదు ర్కొని, సరైన నిర్ణయాలు తీసుకోగలగాలి. డబ్ల్యూహెచ్ఓ అంచనా ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 97 కోట్లకు పైగా ప్రజలు, రకరకాల మానసిక రుగ్మతలతో బాధ పడుతున్నారు. మన దేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక ఇబ్బందికి గురవుతున్న వారే! డిప్రెషన్, ఆందోళన, మద్యపానం, మాదక ద్రవ్యాల విని యోగం వల్ల ఎక్కువమంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, తొక్కిసలాటల్లో వందలాది మరణాలు సంభవించడం, కోవిడ్ లాంటి సందర్భాలలో అచటి ప్రజలు మరింత మానసిక క్షోభకు గురవుతారని పరి శోధనల్లో తేలిన విషయం. కోవిడ్ ప్రపంచానికి ఒక పెద్దపాఠం నేర్పింది. చావు భయంతోపాటు, లాక్డౌన్ ప్రభావం, ఉద్యోగాలు పోయి ఆర్థిక ఇబ్బందులు, బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఒంటరిగా ఉండటం లాంటివన్నీ మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపాయి. ఒక అంచనా ప్రకారం, కోవిడ్లో మానసిక రుగ్మతలు కనీసం 25 శాతం పెరిగాయి. యువతలో మొబైల్ అడిక్షన్, డిప్రెషన్, గ్యాంబ్లింగ్ సమస్యలు అధికమయ్యాయి. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్–గాజా యుద్ధాల వల్ల అక్కడి ప్రజలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు సర్వేలు తెల్పు తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ వంటి చోట్ల ఆ మధ్య సంభవించిన మేఘ విస్ఫోటనం వల్ల వచ్చిన వరదలు, ఆస్తి, ప్రాణనష్టంతో అనేకమంది మానసిక వేదనకు గురయ్యారు. దాదాపు 140 కోట్లకు పైగా జనాభా గల మన దేశంలో కనీసం 20 వేల మంది అర్హులైన మానసిక వైద్య నిపుణులు కూడా లేరంటే ఆశ్చర్యమే! మానసిక ఆరోగ్యానికి హెల్త్ బడ్జెట్లో కేటాయింపులు కేవలం ఒక శాతం కన్నా తక్కువే!చదవండి: Mounjaro వెయిట్లాస్ మందు దూకుడు, డిమాండ్ మామూలుగా లేదు!ఈ సమస్యల నుండి బయటపడాలంటే, ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థతో, మానసిక ఆరోగ్య సేవలను అనుసంధానించాలి. కళాశా లల్లో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు తప్పనిసరి చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెంటల్ హెల్త్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. విపత్తులలో పనిచేసే సిబ్బందికి ‘సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్’లో శిక్షణ ఇప్పించాలి. హెల్ప్లైన్లు, టెలిమానస్ లాంటి సర్వీసులు మరింతగా పెంచాలి. ఆపద సమయాల్లో మన మిచ్చే ఓదార్పు, భరోసా, భవిష్యత్తులో వారు మరిన్ని మానసిక రుగ్మతలకు లోనుకాకుండా నివారిస్తుంది. మానసిక వైద్యుల కొరత ఉన్న మన దేశంలో, ఇలాంటివి ఎదుర్కొనేందుకు ఆశా, హెల్త్ వర్కర్లు; ఎన్ఎస్ఎస్, రెడ్క్రాస్ కార్యకర్తలు; టీచర్లు, మత ప్రతి నిధులు లాంటి వారికి, ‘సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్’లో తగిన శిక్షణ నివ్వాలి. అప్పుడే 2047 నాటికి మనం పరిపూర్ణ ‘వికసిత్ భారత్’ని సాధించగలుగుతాం. ఇదీ చదవండి: చిట్టిచేప.. చీరమీను... ఒక్కసారి తిన్నారంటే!వ్యాసకర్త డా.ఇండ్లరామసుబ్బా రెడ్డి మానసిక వైద్య నిపుణులు(అక్టోబర్ 11 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం) -
ప్రజాభీష్టాన్ని పట్టించుకోవాలి!
స్వతంత్ర భారతదేశం పలు పునర్విభజనలతో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడటాన్ని చూసింది. ఈ మార్పులు దేశంలోని బహుళ సాంస్కృతిక, బహుళ జాతుల సంక్లిష్టతలను ప్రతి బింబింపజేశాయి. లద్దాఖ్లో ప్రస్తుతం కనిపిస్తున్న అశాంతి, సార్వభౌమాధి కారాన్ని పంచుకునేందుకు చేస్తున్న సాధారణ వక్కాణింపు కాదు. వారు స్వతంత్ర ప్రతిపత్తిని ఆకాంక్షిస్తున్నారు. జమ్ము–కశ్మీర్ను విభజించిన తర్వాత, 2019లో లద్దాఖ్కు కేంద్ర పాలిత ప్రాంత (యూటీ) హోదా కల్పించారు. అయితే, తమ హక్కుల పరిరక్షణను కోరుతూ లద్దాఖీయులు 2021 డిసెంబర్లో తిరిగి వీధులకెక్కారు. లద్దాఖ్ ఎందుకు కీలకం?లద్దాఖ్ ఒక శీతల ఎడారి. దాని గణనీయమైన ప్రాంతం చైనా, పాకిస్తాన్ల ఆక్రమణలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రణరంగం సియాచిన్ హిమనదం ఈ ప్రాంతం లోనిదే. వ్యూహ పరంగా లద్దాఖ్కు ఉన్న ప్రాధాన్యం, పొరుగునున్న రెండు శత్రు దేశాల ఉనికి వల్ల భారత్ అప్రమత్తంగా మెలగుతూ, అక్కడ సత్పరి పాలనకు బాధ్యత వహించవలసి ఉంది. ఉపాధి అవకాశాలను తగినంతగా పెంపొందించే విధంగా దాని ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెంద కపోతే, ఆ ప్రాంత పౌరుల్లో అసంతృప్తి, అశాంతి కొనసాగుతూనే ఉంటాయి. వాస్తవాధీన రేఖ వెంబడి భారతదేశపు భద్రతను, వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడంలో అది విఘాతంగా పరిణమించవచ్చు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేయటడంలో లద్దాఖ్ నైసర్గిక స్వరూపం అధికారులకు సవాల్గా పరిణమిస్తోంది. లద్దాఖ్ ఇంత సంక్లిష్టమైనదిగా మారడానికి చారిత్రక కారణాలున్నాయి. డోగ్రా రాజు గులాబ్ సింగ్కు చెందిన సేనాపతి జోరావర్ సింగ్ 1834 –35లో ఈ ప్రాంతాన్ని జయించారు. జమ్ము–కశ్మీర్ అంశం వివాదంగా మారినపుడు, ఆ పెద్ద వివాదంలో లద్దాఖ్ చిక్కుకుంది. భారత సైన్యం 1947లో ప్రతిదాడులు చేపట్టి, ద్రాస్, కార్గిల్, లేహ్ల నుంచి చొరబాటుదారులను తరిమేయడంతో, జమ్ము–కశ్మీర్లోని మూడు పాలిత విభాగాల్లో లద్దాఖ్ ఒకటిగా రూపుదాల్చింది.నిరసనలకు కారణాలులద్దాఖ్ చాలా కాలం అభివృద్ధికి నోచుకోలేదు. పేలవమైన ఆరోగ్య సేవలతో మరణాల రేటు అధికంగా ఉంటూ వచ్చింది. ఉపాధి అవకాశాలు వ్యవసాయానికి, ప్రభుత్వ రంగానికి, చాలా కాలం తర్వాత టూరిజానికి పరిమితమయ్యాయి. దాంతో ప్రభుత్వంపై లద్దాఖ్కు పేచీ తలెత్తింది. తమ సొంత ప్రతినిధుల చేతిలో అధికారం ఉంటేనే, తమ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. అందుకే, 2024 ఫిబ్రవరిలో నిరసనలు తలెత్తడం ఆశ్చర్యం కలిగించలేదు. అవి లేహ్, కార్గిల్లను ఏకం చేశాయి. ఇంజినీర్, విద్యావేత్త, గాంధేయవాది అయిన సోనమ్ వాంగ్చుక్ నాయకత్వ పాత్రను ధరించారు. వాంగ్చుక్ నూతన తరహా పాఠశాలను స్ఫూర్తిగా తీసుకుని హిందీ సినిమా ‘3 ఇడియట్స్’ రూపొందడంతో, ఆయన ఇదివరకే ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆయన నిరాహార దీక్షకు కూర్చుని, శ్రేయోభిలాషుల సలహా మేరకు, 21 రోజుల తర్వాత దాన్ని విరమించుకున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఇసుమంత కూడా మార్చుకోలేదు. ఆయన గత నెలలోనూ నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. లేహ్లో హింసాయుత ఘటనలు చోటుచేసుకోవడంతో, మళ్ళీ విరమించుకున్నారు. తదనంతరం, ఆయనను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి, జోధ్పూర్ జైలుకు తరలించారు. చర్చలతో ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించవచ్చు. కానీ, ఆ ప్రక్రియలో వాంగ్చుక్కు పాత్ర కల్పించడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుగా కనిపిస్తోంది. కాల్పుల్లో నలుగురు నిరసనకారులు మరణించిన ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని వాంగ్చుక్ కోరుతున్నారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ హోదా, లద్దాఖ్కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్ల విషయంలో లేహ్ అపెక్స్ బాడీకి, కార్గిల్ డెమొక్రాటిక్ అలయ¯Œ ్సకు తన మద్దతును పునరుద్ఘాటించారు. రాష్ట్ర హోదా వచ్చేనా?జమ్ము–కశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్నపుడు లద్దాఖ్ నుంచి శాసన సభలో నలుగురు సభ్యులు, ఒక లోక్సభ సభ్యుడు ఉండే వారు. ఈ ప్రాతినిధ్యం తగినంతగా లేదనే భావన అప్పుడూ ఉంది. ఈ ప్రాంతం, ప్రజల పట్ల అధికారులు వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రజాస్వామిక, ప్రాతినిధ్య పరిపాలనను పటిష్ఠ పరచేందుకు లేహ్కు (1995లో), కార్గిల్కు (2003లో) లద్దాఖ్ స్వయం ప్రతిపత్తి పర్వత ప్రాంత అభివృద్ధి మండళ్ళను జమ్ము– కశ్మీర్ ప్రభుత్వం ఎట్టకేలకు ఏర్పాటు చేసింది. కానీ, ఇది క్షేత్ర స్థాయిలో పరిస్థితులలో మార్పు వచ్చేందుకు తోడ్పడలేకపోయింది. 2019 ఆగస్టు 5న, 370వ అధికరణాన్ని రద్దు చేయడంతో కేంద్రపాలిత ప్రాంత హోదా డిమాండ్ నెరవేరిందికానీ, అవకాశా లను అది పరిమితం చేసింది. పాలనా యంత్రాంగంలోకి తీసుకునేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటిదేమీ లేకపోవడం వల్ల కేంద్ర పాలిత హోదా ఎక్కువ ఉద్యోగావకాశాలను చూపలేకపోయింది. దాదాపు 3 లక్షల జనాభా కలిగిన లద్దాఖ్ వ్యవస్థాగతంగా బలహీనంగా ఉంది. యూటీ అనిపించుకున్నా వనరులపై హక్కులు ఉండవు కనుక, అది రాష్ట్ర హోదాను కోరుకుంటోంది. అధికార కేంద్రీకరణకు మొగ్గు చూపే బీజేపీ కేంద్రంలో గద్దెపై ఉండటం వల్ల, రాష్ట్ర హోదా మంజూరు కుదిరే పని కాదని చెప్పవచ్చు. వ్యాపార వర్గాలకు చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టులు కట్టబెడుతుందనీ, బయటి ప్రాంతాల కార్మికులు ఉన్న కొద్ది పాటి అవకాశాలను ఎగరేసుకుపోతారనీ ఈ ప్రాంతంలో భయాందో ళనలు ఉన్నాయి. అందుకే, తమను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యులులో చేర్చాలనీ, రాష్ట్ర హోదా కల్పించాలనీ అడుగుతున్నారు. లద్దాఖ్కు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్, రెండు పార్లమెంట్ సీట్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి, ఉద్యోగావకాశాలు, రాజకీయ ప్రాతినిధ్య పెంపునకు పురిగొల్పే విధంగా ప్రత్యేక రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని లద్దాఖ్ ప్రజానీకం చేస్తున్న డిమాండ్ న్యాయబద్ధమైనదే!అజయ్ కె. మెహ్రావ్యాసకర్త ‘సెంటర్ ఫర్ మల్టీ లెవెల్ ఫెడరలిజం’లోవిజిటింగ్ సీనియర్ ఫెలో (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
విశ్రాంత పాత్రికేయులకేదీ భరోసా?
సంక్షేమంలో ఛాంపియన్లుగా పేరుపొందిన తెలుగు రాష్ట్రాలు పాత్రికేయుల సంక్షేమాన్ని మాత్రం పక్కన పెడుతున్నట్లున్నది! 1,000 నుంచి 2,500 రూపా యల పీఎఫ్ పెన్షన్ మాత్రమే అందుకొంటూ విశ్రాంత జీవితాన్ని నానాపాట్లూ పడుతూ గడుపుతున్న 60 ఏళ్లు పైబడిన విశ్రాంత పాత్రికేయులను పట్టించు కోవడం లేదని... కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.మన తెలుగు రాష్ట్రాల్లో గౌరవప్రదమైన జీతభత్యాలు ఇస్తూ, పీఎఫ్ చందాలు కడుతూ పాత్రికేయులకు అండగా, ఆలంబనగా నిలుస్తున్న సంస్థలు పరి మితమే. ఉద్యోగ భద్రత, నెలవారీగా వేతనం వస్తుందన్న గ్యారెంటీ లేకుండా జీవితాన్ని గడిపే పాత్రికేయులే ఇప్పడు ఎక్కువగా ఉన్నారు. అటువంటి వారు రిటైరైన తర్వాత కూడా కనీస అవసరాలు తీరక నరకయాతన పడుతున్నారు. ఉద్యోగంలో ఉన్నంత కాలం సమాజంలోని అన్ని వర్గాల కోసం పాటుపడిన పాత్రికేయులు రిటైరయ్యాక ఎవరూ పట్టించుకోని దైన్యస్థితిలో బతుకుతున్నారంటే అతిశయోక్తి కాదు. అక్ష రాన్నే నమ్ముకుని ఉన్న వేలాదిమంది పాత్రికే యుల పరిస్థితి అసంఘటిత కార్మికుల కంటే తీసికట్టుగా తయారైంది. చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?నిజానికి, తెలుగు రాష్ట్రాలు తప్ప దేశంలో మరో 19 రాష్ట్రాలు విశ్రాంత పాత్రికేయులకై పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అత్యధికంగా నెలకు రూ. 20 వేల చొప్పున పెన్షన్ను 60 ఏళ్ళు పైబడిన పాత్రికేయులకు అందజేస్తోంది. అసోం నెలకు రూ. 5 వేలు, ఛత్తీస్గఢ్ 10 వేలు, గోవా 10 వేలు, హరియాణా 10 వేలు, మన పొరుగునే ఉన్న కర్ణాటక 10 వేలు, కేరళ 11 వేలు చెల్లిస్తున్నాయి. పంజాబ్లో 12 వేలు, రాజస్థాన్లో 15 వేలు, తమిళనాడులో 12 వేలు, త్రిపురలో 10 వేల చొప్పున విశ్రాంత జీవితం గడుపుతున్న పాత్రికేయులకు పెన్షన్గా అందచేస్తున్నారు. ఇదీ చదవండి: Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులుతెలుగు రాష్ట్ర్రాలు వందల కోట్ల నిధులతో లక్షలమందికి సామాజిక పెన్షన్లు అందచేస్తున్నాయి. అయితే అరకొర ఆదాయంతో రిటైర్మెంట్ జీవి తాన్ని గడుపుతున్న పాత్రికేయులకు పెన్షన్ వసతి కల్పించడానికి మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ గత ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో పాత్రికేయులకు పెన్షన్ ఇస్తామంటూ వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి ఆ వాగ్దానాన్ని గుర్తుచేశారు విశ్రాంత పాత్రికేయులు. త్వరలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలనూ కలిసి వినతిపత్రం సమర్పించ నున్నారు. రిటైర్డ్ జర్నలిస్టులకు దేశమంతటా ఒకే పెన్షన్ విధానం కావాలని సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సైతం తీర్మానం చేసింది. అక్షరాన్ని నమ్ముకొని, సమాజానికి మార్గదర్శనం చేసిన వయోధికులకు పాలకులు అండనివ్వాలి. – చొప్పరపు కృష్ణారావుపాత్రికేయుడు 84668 64969 -
ఊహకందని అంచనాలతో ఉత్కంఠ!
పండుగల సమయంలోనూ బిహార్ రాజకీయాలలో మునిగితేలుతుంది. బిహా రీలకు రాజకీయాలకు మించిన కాలక్షేపం లేదు. బిహార్ శాసన సభ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగ నున్న నేపథ్యంలో ఎన్నికల పండుగ మొద లైపోయింది. నితీశ్ కుమార్ ఎక్కడుంటే అధికారం అక్కడేనని గడిచిన రెండు దశాబ్దాలలో బిహార్లో ఒక కొత్త నానుడి రూపుదిద్దు కుంది. పొత్తు పెట్టుకున్న పార్టీలను దూరం పెట్టేదిగా బీజేపీ పేరు మోసినప్పటికీ, రాష్ట్రంలో అది జూనియర్ భాగస్వామిగా సంతృప్తి పడటానికి బహుశా అదే కారణం. నితీశ్ నేతృత్వంలోని జేడీ (యు)తో పొత్తు పెట్టుకున్నప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ నాయక త్వంలోని ఆర్జేడీ కూడా అదే రకమైన సంకట స్థితిని ఎదుర్కొంది.నితీశ్ సరసన లేని ఏ పార్టీ అయినా, ఆయనపై విషం చిమ్మడం ఖాయం. అయినప్పటికీ, ఆయనతో అంటకాగాలని రహస్యంగా కోరుకుంటాయి. లాలూ 2022లో నితీశ్తో చేతులు కలపడానికి ఇదే కారణం. 2017లో చీలిక చేదును మిగిల్చినా లాలూ దాన్ని దిగ మింగుకోవాల్సి వచ్చింది. మహాఘట్ బంధన్ రెండు విడతల హయాంలో నితీశ్తో ఎన్నడూ పొత్తు పెట్టుకోమని బీజేపీ నాయ కులు బాహాటంగా ప్రతిన బూనారు. కానీ తమ ‘సహజ భాగ స్వామి’తో రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. నితీశ్ బలాబలాలుగతంలో బిహార్లో ఎన్నికల విజయాన్ని నితీశ్ ఎలా సొంతం చేసుకున్నట్లు? నితీశ్ 2005లో బిహార్ సీఎం అయినపుడు తన శక్తి యుక్తులన్నింటినీ శాంతి భద్రతల నిర్వహణపై కేంద్రీకరించారు. రోడ్లు, విద్యుత్ సరఫరా, రవాణా, విద్యా రంగాలు మెరుగుపడ్డాయి. స్కూళ్ళలో అడ్మిషన్లను, హాజరును పెంపొందించేందుకు ఆయన 2006లో ‘స్కూల్ చలో అభియాన్’ ప్రారంభించారు. బాలికలకు సైకిళ్ళు పంపిణీ చేశారు. అలా 2005లో ఒక మౌన విప్లవం మొదలైంది. రాష్ట్రంలో 2005లో కేవలం 1.8 లక్షల మంది బాలికలు 10వ తరగతి పరీక్షకు కూర్చుంటే, ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాయ బోతున్న 15.85 లక్షల మంది విద్యార్థులలో సగంపైగా బాలికలే. ప్రతి ఒక్కరికీ ఇల్లు, తాగునీటి సదుపాయం కార్యక్రమాన్ని నితీశే మొదట ప్రారంభించారు. కానీ, అంతగా సఫలీకృతులు కాలేక పోయారు. రాష్ట్రం నుంచి జనం ఇప్పటికీ వలస పోతూనే ఉన్నారు. అనేక మానవ, అభివృద్ధి సూచికలలో బిహార్ అట్టడుగున ఉంది. నితీశ్ మూడవ, నాల్గవ విడత పాలన అనేక కారణాల రీత్యా అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈసారి నితీశ్ వివిధ వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన ఆరోగ్య స్థితి కూడా నిశిత పరిశీలనకు గురవుతోంది. ఈ కారణంగానే, ఈసారి నితీశ్ ప్రభుత్వం కోటి మంది మహిళల ఖాతాల్లో రూ. 10,000 చొప్పున నగదు జమ చేసింది. రకరకాల రాయితీలను, వరాలను ప్రకటించింది. తేజస్వి ప్లస్ కూటమినితీశ్ ప్రధాన ప్రత్యర్థి తేజస్వి యాదవ్, గత ఎన్నికల్లో అద్భు తమైన ఫలితాలు సాధించారు. ఆయన మహాఘట్ బంధన్ కేవలం 16,825 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్, వామ పక్షాలు ఇప్పటికీ ఆయనకే మద్దతు ఇస్తున్నాయి. కాంగ్రెస్ ఓట్ల పునాదికి కోత పడినప్పటికీ, రాహుల్ గాంధీ తన యాత్రలో తేజస్విని పటిష్ఠపరచేందుకు ప్రయత్నించారు. మొత్తం ప్రతిపక్షమంతా తేజస్వి వెనుకనే నిలిచిందని చాటేందుకు దీపాంకర్ భట్టాచార్య (వామపక్షం), అఖిలేశ్ యాదవ్ (సమాజ్ వాదీ పార్టీ), సంజయ్ రౌత్ (శివసేన), ఎం.కె.స్టాలిన్ (డీఎంకే), హేమంత్ సొరేన్ (జేఎంఎం), యూసుఫ్ పఠాన్ (తృణమూల్ కాంగ్రెస్) ఆయన యాత్రలో పాల్గొన్నారు. అయితే, ఆయన సహచరుల,సొంత కుటుంబ సభ్యుల మితిమీరిన ఆశలు పెను సవాలును విసురుతున్నాయి. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన కొత్త ఓటర్ల జాబితా 69 లక్షల ఓటర్ల తొలగింపును, 21 లక్షల మంది పేర్ల కొత్త జోడింపును చవి చూసింది. మహాఘట్ బంధన్ కొన్ని నెలలుగా దాన్నొక రాజకీయ అంశంగా మారుస్తూ వస్తోంది. సీట్ల పంపకంపై ప్రస్తుతం మహా ఘట్ బంధన్లో బురద జల్లుకునే కార్యక్రమం సాగుతోంది. ఇది ప్రతిసారీ కనిపించేదే. కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ కలసి పోటీ చేయడం మాత్రం ఖాయం. పీకే ప్రభావంప్రశాంత్ కిశోర్, ఆయన ‘జన్ సురాజ్’ పార్టీ మరో ప్రభావిత అంశం కానుంది. ఆయన గతంలో, 2014 ఎన్నికలకు ముందు బీజేపీకి ఎన్నికల నిర్వహణ సేవలందించారు. తదనంతరం,కాంగ్రెస్, వైసీపీ, తృణమూల్, ఆప్, డీఎంకేలతో పాటు, చివరకు నితీశ్ కుమార్కు కూడా సేవలందించారు. రాష్ట్రంలో ఈ విడత ఎన్నికల సందర్భంగా, ప్రతి జిల్లాలోనూ ప్రశాంత్ కిశోర్ పాదయాత్రలు చేశారు. గత ఏడాదిగా ఆయన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సందర్శించి ప్రజలతో నేరుగా సంభాషించారు. రాత్రిపూట గ్రామాల్లోనే బస చేశారు. నితీశ్, బీజేపీ, ఆర్జేడీలపై సమానంగా విమర్శలు గుప్పించారు. ఆయన పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షిస్తున్నారు. ఆశ్చర్యకరంగా, ఆయన పార్టీకి నిధుల కొరత కూడా లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారా లేక హంగ్ అసెంబ్లీ ఏర్పడే పక్షంలో కింగ్ మేకర్గా మారతారా? విజ యానికి పెద్ద సంఖ్యలో జన వాహినులు, ఆకర్షణీయమైన నినా దాలు అవసరమేగానీ, అవి విజయానికి పూచీ నివ్వలేవు. బీజేపీ గురించి కూడా ముచ్చటించుకుందాం. ఈ కాషాయ పార్టీకి అద్భుతమైన సంస్థాగత బలం ఉంది. కుల సమీకరణలు కూడా దానివైపు పటిష్ఠంగా ఉన్నాయి. జేడీ(యు)తోపాటు, చిరాగ్ పాశ్వాన్, జీతన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుశ్వాహ ఎన్డీయేను తిరుగులేని కూటమిగా నిలబెడుతున్నారు. గత ఎన్నికల్లో, జేడీ (యు)తో పోల్చుకుంటే బీజేపీ రెట్టింపు సీట్లకు పైగా గెలుచుకున్నా, ముఖ్యమంత్రిగా తమ అభ్యర్థే ఉండాలని పట్టుబట్టలేదు. విశ్వస నీయమైన ముఖం ఏదీ లేకపోవడం దాని బలహీనత. ఈ అంశంపై ఇప్పుడు కాకపోయినా, రాబోయే రోజుల్లోనైనా ఆ పార్టీ కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు. బిహార్ ఒక ఆసక్తికరమైన దశలోకి అడుగిడుతోంది. చివరి నిమిషం వరకు అంతిమ ఫలితం నిర్ణయం కాదని గత అసెంబ్లీ ఎన్నికలు సూచిస్తున్నాయి. ఎన్నికల సంరంభపు హడావిడి సద్దుమణగి,అంతిమ సంఖ్యా బలాలు వెల్లడైన తర్వాత, అసలు క్రీడ ఆరంభం కాబోతోంది. శశి శేఖర్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు(‘ది హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
'ఇష్టం ఉంటే' కష్టం ఉండదు!
కొత్తగా పట్టభద్రులైన వారికి అభినందనలు. ప్రత్యక్షంగా మీ ముందు లేకుండా, ఇలా ఇంటి నుంచి వర్చ్యువల్ ప్రసంగం చేస్తా నని నేను ఊహించలేదు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఆశావహ దృక్ప థంతో మెలగడం కష్టమే! కానీ, మీరు మరింత శక్తిమంతులుగా, ఉన్నతు లుగా నిరూపించుకోగలరనడంలో సందేహం లేదు. ఎందు కంటే, మీకంటే ముందు చాలా మంది దాన్ని రుజువు చేశారు. వందేళ్ళ క్రితం, 1920లో స్పానిష్ ఫ్లూ సమయంలోనూ కొందరు పట్టభద్రులుగా బయటకు వచ్చారు. అప్పటికి యాభై ఏళ్ళ తర్వాత, 1970లో వియత్నాం యుద్ధ కాలంలోనూ గ్రాడ్యుయేట్లు అయినవారున్నారు. అంతెందుకు, సెప్టెంబర్ 11 ఘటనకు కొద్ది నెలల ముందు 2001లో చదువు పూర్తి చేసుకుని యూనివర్సిటీల నుంచి బయటకొచ్చినవారు లేరా? మహమ్మారులను, యుద్ధాలను, ఇతర సంక్షోభాలను దాటుకుని వచ్చినవారు ఎందరో ఉన్నారు. వారు కొత్త సవాళ్ళను అనేకం ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్ని సంద ర్భాలలోనూ వారు విజయులుగా నిలిచారు. ఆశావాదంతో బతకమని మన సుదీర్ఘ చరిత్ర చాటుతోంది. ఆశావహులై ఉండండి. వర్తమానంలోని ప్రతి తరం, తమ తర్వాత రాబోయే తరం గురించి తక్కువ అంచనా వేసే విచిత్ర ధోరణిని నేను గమనించాను. ఒక తరం సాధించిన ప్రగతి తదుపరి తరానికి పునాది అవుతుందని గ్రహించ లేకపోవడమే దానికి కారణం. కొత్త వ్యక్తుల సమూహం అన్నింటినీ సాధ్యం చేసి చూపిస్తుంది. మీ అనన్యమైన దృక్పథం ఇంతవరకు ఊహించని వాటిని కూడా మన ముందుకు తేవచ్చు. టెక్నాలజీలో పుట్టిన తరంటెక్నాలజీ అంతగా అందుబాటులో లేని కాలంలో పెరిగి పెద్దవాడినయ్యాను. నాకు పదేళ్ళు వచ్చేదాకా నేను టెలిఫోన్ ముఖమే చూడలేదు. చదువుకునేందుకు అమెరికా వచ్చిన తర్వాతనే కంప్యూటర్ను రోజూ వాడుకోవడం కుదిరింది. పాత రోజుల్లోకి వెళితే, ఎంతో కాలానికి ఇంటికొచ్చిన టెలివిజన్లో ఒకే ఛానల్ ఉండేది. మీకిపుడు రకరకాల ఆకృతుల్లో, పరిమాణాల్లో కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడైనా, దేని గురించైనా కంప్యూటర్ను అడగగలిగే సామర్థ్యం మీకిపుడు ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కానీ, అటువంటి సామర్థ్యాన్ని నిర్మించడంపైనే నేను ఓ దశాబ్ద కాలం పనిచేశాను. మిమ్మల్ని చూసి నేను కుళ్ళుకోను. ఈ రకమైన ప్రగతి నన్ను మరింత ఆశావహుడిని చేస్తుంది. టెక్నాలజీకి సంబంధించిన కొన్ని అంశాలు మిమ్మల్ని బహుశా నిస్పృహకూ, అసహనానికీ లోనుచేస్తూ ఉండవచ్చు. ఆ అసహనాన్ని అలాగే ఉండనివ్వండి. ఎందుకంటే, అదే కొత్త టెక్నాలజీ విప్లవాన్ని సృష్టిస్తుంది. నా తరం కలలుకనే సాహసం చేయలేనివాటిని మీరు తయారు చేసి చూపించగలరు. వాతావరణ మార్పు లేదా విద్యా రంగ సమస్యల పట్ల మా వైఖరి కూడా మిమ్మల్ని నిస్పృహకు గురిచేసి ఉండవచ్చు. అసహనంతోనే మెలగండి. అది ప్రపంచానికి అవసర మైన ప్రగతిని సృష్టిస్తుంది. పరిస్థితులను మార్చాలి, ఏదో చేయాలి అనే తపన నవీకరణలకు దారితీసి, ప్రపంచానికి కొత్త రూపురేఖలను సంతరిస్తుంది. టెక్నాలజీ మన కుటుంబాలకు ఎంతగా అందుబాటు లోకి వస్తే, మన జీవితాలు అంతగా మెరుగవుతాయి. మెరుగైన సెమీకండక్టర్లను తయారు చేయడం ద్వారా ఆ పని చేయగలనని నేను గ్రాడ్యుయేట్ని అయినపుడు భావించాను.అప్పటికి అంతకన్నా ఉత్తేజకరమైన అంశం ఏముంది? నేను అమెరికా రావడం కోసం విమాన టికెట్కు మా నాన్న ఒక ఏడాది జీతాన్ని వెచ్చించవలసి వచ్చింది. ఇంటికి ఫోన్ చేసేందుకు నిమి షానికి 2 డాలర్లకు పైగా ఖర్చయ్యేవి. బ్యాక్ ప్యాక్ కొనేందుకు కూడా ఇండియాలో మా నాన్నకు వచ్చే ఒక నెల జీతం అంత ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అందరి కోసం టెక్నాలజీనేను స్టాన్ఫోర్డ్లో చేరిన ఏడాదే ఇంటర్నెట్ రూపుదిద్దుకోవడం మొదలుపెట్టింది. అదే ఏడాది మొజాయిక్ బ్రౌజర్ విడుదలైంది. అది వరల్డ్ వైడ్ వెబ్, ఇంటర్నెట్లను ప్రాచుర్యంలోకి తెచ్చింది. టెక్నాలజీని మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు ఇంటర్ నెట్ ఏకైక ఉత్తమ మార్గం అవుతుందని నాకు అప్పటికింకా తెలియలేదు. ఆ సంగతి గ్రహించాక, గూగుల్లో నేను నా కలలను సాకారం చేసుకునే పనికి ఉద్యమించాను. నా నేతృత్వంలో సాగిన కృషితో 2009లో క్రోమ్ మొదలైంది. సరసమైన ధరలకు ల్యాప్ టాప్లను, ఫోన్లను అందించడంలో గూగుల్ చేసిన కృషికి సహాయపడ్డాను. గ్రాడ్యుయేషన్ తర్వాత పీహెచ్డీ చేసివుంటే అమ్మ, నాన్న గర్వపడేవారే. కానీ, టెక్నాలజీ ప్రయోజనాలను అనేకమందికి అందుబాటులోకి తెచ్చే అవకాశాన్ని కోల్పోయి ఉండేవాడిని. గూగుల్ సీఈఓగా ఈరోజు మీ ముందు నిల్చొని మాట్లాడగలిగి ఉండేవాడిని కాదు. మీదైన రీతిలో ప్రపంచాన్ని మెరుగైనదిగా మార్చండి. మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని, మీదైన విశిష్టమైన మార్గంలో సాను కూల ప్రభావాన్ని చూపేందుకు, దాన్ని వినియోగించుకోండి. క్యాలిఫోర్నియా రాష్ట్రంలో 27 ఏళ్ళ క్రితం మొదటిసారి అడుగిడి నపుడు ఇవేవీ నా ఊహల్లో లేవు. అదృష్టంతోపాటు టెక్నాలజీ పట్ల గాఢమైన వ్యామోహం, విశాల దృష్టితో వ్యవహరించడం నన్నిక్క డకు తీసుకొచ్చాయి. అసహనమూ మంచిదే!ప్రపంచంలో మిగిలిన వాటన్నింటి కన్నా మిమ్మల్ని ఏది ఎక్కువ ఉత్తేజపరుస్తోందో దాన్ని కనుగొనే ప్రయత్నం చేయండి. మీ తల్లితండ్రులు చెప్పారని లేదా మీ స్నేహితులు చేస్తున్నారని లేదా సమాజం మీ నుంచి ఆశిస్తోందనే కారణంతో మీకిష్టం లేని పనుల్లోకి దిగకండి. ఊహించని దారులు గణనీయమైన ప్రభావానికి దారితీస్తాయి. ఎంచుకున్న రంగం ఇష్టమైనదైతే మనసు పెట్టి పనిచేయగలుగుతారు. అదృష్టం, పరిస్థితుల కన్నా, మీ వ్యామోహమే మిమ్మల్ని ముందుకు నడిపించే చోదక శక్తిగా పనిచేస్తుంది. అది మీ గమనాన్ని తీర్చిదిద్ది, కలకాలం నిలవగల వారసత్వాన్ని మిగల్చగలుగుతుంది. దేనినైనా అక్కున చేర్చుకునేందుకు సిద్ధ్దంగా ఉండండి. ఉన్న వాటిని ఇంకా మెరుగుపరచాలనే అసహనంతోనే వ్యవహరించండి. ఆశావహ దృక్పథాన్ని వీడవద్దు. ఇదే నేనిచ్చే సలహా. మీరు ఆ పని చేయగలిగితే చరిత్ర మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. అన్నింటినీ మార్చగలిగిన అవకాశం మీకుంది. మీరు మారుస్తారనే నమ్మకం కూడా నాకుంది! -
ఒక తల్లి – ఆమె కూతురు
అరుంధతీ రాయ్ తన పేరులోని ‘ఫస్ట్ నేమ్’ వదులుకున్నారని మీకు తెలుసా? 18 ఏళ్లప్పుడు ‘‘నా మొదటి పేరు సుజానాను వదిలేసుకున్నాను. అప్పట్నుంచీ క్రమంగా, ఉద్దేశపూర్వకంగా, వేరెవరి మాదిరిగానో రూపాంతరం చెందుతూ వచ్చాను’’ అని తన తాజా పుస్తకంలో వెల్లడించారు. ‘మదర్ మేరీ కమ్స్ టు మి’లో ఆమె ఇలాంటి ఇంకా అనేక చిరు జ్ఞాపకాలను పంచుకున్నారు. మత్తుమందు లేకుండా గర్భస్రావం చేయించుకున్న సంగతి మన దృష్టిని ఆకర్షించే మరో దృష్టాంతం. అప్పటికి ఆమెకు ఇరవై రెండేళ్ళు. ‘‘అది భయంకరం. కానీ, అలా జరిగిపోయిందంతే’’ అని రాశారు. అదే రోజు రాత్రి ఆమె మరుసటి రోజు షూటింగ్లో పాల్గొనేందుకు హోశంగాబాద్ నుంచి పంచ్మఢీ వెళ్ళే రైలు ఎక్కేశారు. తల్లి మేరీ రాయ్తో ఆమెకు పడేది కాదు. ఈ పుస్తకం పాక్షికంగా ఆ సంగతులనూ, అరుంధతి జీవితంలోని వివిధ దశల్లోని ఆత్మా నుగత వివరాలనూ వెల్లడిస్తుంది. అవి తరచూ కలతకు గురి చేస్తాయి. అరుంధతి తన తల్లిని ‘శ్రీమతి రాయ్’ అనే సంబోధిస్తూ వచ్చారు. పుస్తకం వెనుక వైపు అట్టలో ఆమెను ‘బందిపోటు’ అని పేర్కొన్నారు. కానీ, ఈ పుస్తకం చదువుతూంటే ఆమె నాకు రాక్షసిగానే తోచారు. అరుంధతికి ఆరేళ్లున్నప్పుడు మొదటిసారి విమాన ప్రయాణంలో ‘‘అమ్మా! పిన్ని నీలాగా కాకుండా అంత సన్నగా ఉంటుంది ఎందుకని?’’ అని ప్రశ్నించడం ద్వారా తల్లికి చిర్రెత్తుకొచ్చేటట్లు చేసింది. ఆ ప్రశ్నకు ఆవిడ ఎంతగా కోప్పడిందంటే, అరుంధతి దానికి భయపడి విమానం కూలిపోవాలని కోరుకున్నారట. ‘‘విమానం కూలి మేమంతా చస్తే సరిపోతుంది అనిపించింది.’’అరుంధతిని మేరీ తరచు ‘బిచ్’ అనే తిట్టేవారు. సోదరుడు క్రిస్టొఫర్ను ఇంకా దారుణమైన మాటలన్నారు. ‘‘తను కౌమారంలో ఉన్నప్పుడు, అమ్మ ఒకసారి అందికదా: ‘నువ్వు అసహ్యంగా ఉన్నావు, తెలివితక్కువ సన్నాసి, నేను నీ స్థానంలో ఉంటే ఈపాటికి ఆత్మహత్య చేసుకునేదాన్ని.’’ మేరీ రాయ్లో మెచ్చుకోదగిన పార్శ్వం కూడా ఉంది. ఆమెది దృఢ సంకల్పం. ఆమె నెలకొల్పిన పల్లికూడంను చక్కని పాఠశాలగా పరిగణించేవారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను చెప్పడంతోబాటు మంచి నడవడికను అలవరచేవారు. వారి స్నానపానాలను, మరుగు దొడ్లను శుభ్రం చేయడాన్ని మేరీ స్వయంగా పర్యవేక్షించేవారు. ఓసారి బాలురు ఆడపిల్లల వక్షోజాలు, వేసుకునే బ్రాల గురించి అసభ్యంగా మాట్లాడడం ప్రారంభించినపుడు, మేరీ తన కప్ బోర్డు నుంచి ఒక బ్రాను బయటకు తెచ్చి ‘‘ఇదే బ్రా. దీన్ని ఆడవాళ్లందరూ వేసుకుంటారు. మీ అమ్మలు వేసుకుంటారు. తొందరలోనే మీ అక్కచెల్లెళ్ళు వేసుకోవచ్చు. ఇది మిమ్మల్ని అంతగా ఉత్తేజపరుస్తోందనుకుంటే, దీన్ని ఉంచుకోండి’’ అన్నారట. అరుంధతి నటించిన లేదా స్క్రిప్టు సమకూర్చిన ‘మాసీ సాహెబ్’, ‘ఇన్ విచ్ యానీ గివ్స్ ఇట్ దోజ్ వన్స్’, ‘ఎలక్ట్రిక్ మూన్’ లాంటి చిత్రాలతో ఈ పుస్తకం అరుంధతి జీవితపు తొలినాళ్ళలోకి తీసుకెళుతుంది. అయితే ‘గార్డియన్’ పత్రిక చిత్ర సమీక్షకుడు డెరెక్ మాల్కమ్ ‘‘పేరు మార్చి ఉండాల్సింది. ‘గివ్స్ ఇట్ దోజ్ వన్స్’ అనే దానికి ఇంగ్లీషులో అర్థమే లేదు’’ అని పెదవి విరిచారు. అరుంధతి, ఆమె బృందం ఆ వ్యాఖ్యను బాగా వాడుకున్నారు. ‘‘మిష్టర్ మాల్కమ్, ఇంగ్లండ్లో మీరు ఇక ఎంతమాత్రం ఇంగ్లిష్ మాట్లా డటం లేదు’’ అని పబ్లిసిటీ చేశారు. ఆమె జైలులో గడిపిన ఒక రోజు గురించి కూడా ఈ పుస్తకం ప్రస్తావించింది. ‘‘జైలు గది తలుపు వెనుక వైపు మూసుకున్న శబ్దం, నాలోని ధైర్యాన్ని, విశ్వాసాన్ని నీరుగార్చేసింది. నేను మరో ప్రపంచంలోకి అడుగు పెడుతున్నానన్నది స్పష్టం. అక్కడున్నన్నాళ్ళూ ఏమి చోటుచేసుకోవడానికైనా అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు. నిజానికి, ఆమె అంత దుర్బలంగా ఏమీ అయి పోలేదు. అక్కడ ఆమె కొందరిని స్నేహితులుగా చేసుకున్నారు. జైలు పక్షులను తనవైపు తిప్పుకొని ఉంటారని నా అనుమానం. పుస్తకం చివరి పేజీల కొచ్చేసరికి, తల్లితో ఆమెకున్న సంక్లిష్ట సంబంధాన్ని అర్థం చేసుకుంటాం. ఒక్కోసారి ఆమె తల్లిని ద్వేషించారు. మరికొన్ని సందర్భాల్లో ప్రేమించారు. శ్రీమతి రాయ్ చని పోవడానికి కొద్ది నెలల ముందు కుమార్తెకు ఒక మెసేజ్ చేశారు. ‘‘ఈ ప్రపంచంలో నిన్ను మించి నేను ఎవరినీ ఎక్కువగా ప్రేమించింది లేదు.’’ అది అరుంధతిని ఆశ్చర్యపరచింది. కానీ, జవాబు మాత్రం అంతే ప్రేమాస్పదమైన రీతిలో ఇచ్చారు. ‘‘నాకింత వరకు తెలిసినవారిలో నువ్వు చాలా అసాధారణమైన, అద్భుతమైన మహిళవి. నేను నిన్ను ఆరాధించే వ్యక్తిని.’’తల్లితో పడకపోయినా, ఆమె లేని లోటును అరుంధతి అను భవిస్తోందనే నా సందేహం. ‘‘నేను నిన్ను కలుస్తాను’’ అంటూ పుస్తకాన్ని ముగించారు.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇండియన్ ఇంగ్లిష్ స్థితి ఎలా ఉంటుంది?
ఇంగ్లిష్ దేశాలతో మన దేశ సంబంధాలు గందరగోళంలో ఉన్న రోజులివి. ఒకవైపు ఇండి యన్ యువకుల అమెరికన్ డ్రీమ్లపై అమెరికా మట్టికొ డుతున్న రోజులు. మరోపక్క కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్లు కూడా ఇమ్మిగ్రే షన్ (వలస)పై తిరుగుబాటు చేస్తున్న రోజులు. ఇందుకు రష్యన్ ఆయిల్ను ఇండియా కొనడం ఒక కారణమైతే, ప్రపంచ దేశాలన్నిటిలో మన దేశం ‘ఫస్ట్’ అనే సంకుచిత జాతీయ భావన పెరిగిపోవడం మరొకటి. ప్రపంచీకరణ ఆచరణలో ఉన్న గత ముప్పయి ఏండ్లలో ‘నా దేశం ఫస్ట్’ అనే నినాదం మన దేశ బీజేపీ ప్రభుత్వమే మొదట ఇచ్చింది. దీనితో పాటు భారతదేశంలో ‘హిందీ ఫస్ట్’ అనే ప్రచారం కూడా మొదలైంది. క్రమంగా వివిధ రంగాలలో ఇంగ్లిష్ భాషను వెనక్కి నెట్టే ప్రక్రియ నడుస్తున్నది. 2025 అక్టోబర్ 5 నాటికి ఇండియాకు ఇంగ్లిష్ భాష ఒక బోధనా భాషగా వచ్చి 208 ఏళ్ళు అవుతుంది. గత కొంతకాలంగా మనం ఆ రోజును ‘ఇండియన్ ఇంగ్లిష్ దినం’గా జరుపుకొంటున్నాం. ఈ భాష ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో; సివిల్ సర్వీస్ పరీక్షలలో చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ మధ్య ఇంగ్లిష్ దేశాలుగా ఉన్న అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ఇండియన్ ఇమ్మిగ్రేషన్ మీద తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలు ఇక్కడి ఇంజినీరింగ్ విద్యారంగాన్ని ఏం చెయ్యబోతున్నాయన్న అనుమానం కలుగుతోంది.గత 30 ఏళ్లుగా ఈ దేశంలో ఐఐటీ, ఎన్ఐటీ, వివిధ రాష్ట్రాల్లో పబ్లిక్, ప్రైవేట్ యూనివర్సిటీల్లో, ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు కేవలం అమెరికాకో, మరో ఇంగ్లిష్ భాష మాట్లాడే దేశానికో పోవడం కోసమే చదవడం జరిగింది. కానీ ఇకముందు అన్ని రకాల కోర్సులను మన దేశంలో ఉండి ఏదో ఒక పనిచేసి కుటుంబం, దేశం అభివృద్ధి కావడం కోసం చదవాల్సి ఉంటుంది. ఈ స్థితిలో ఈ దేశంలో ఇంగ్లిష్ ప్రాధాన్యం తగ్గుతుందా? తగ్గించే వైపునకు పయనించాలా అనే ప్రశ్న ఎదురౌతుంది.ఇండియన్ ఇంగ్లిష్ ఇండియా అభివృద్ధికే!ఇతర ఇంగ్లిష్ దేశాలు భారతదేశం నుండి మొత్తం వలసలను ఆపినా సరే... ఇండియన్ ఇంగ్లిష్ను బాగా అభివృద్ధి చేసుకోవలసిందే. భవిష్యత్తులో అన్ని రంగాల్లో రీసర్చి ఇంగ్లిష్ భాష అభివృద్ధి అయిన దేశాల్లోనే పెరుగుతుంది. ఇంగ్లిష్ భాషకు ఉన్న కాన్సెప్ట్యువల్ క్లారిటీ ప్రపంచంలోని ఏ ఇతర భాషల్లో రాలేదు. పరిశోధనలో కొత్త ఆవిష్కరణలు జరగాలంటే భూమి మీద ఉన్న పదార్థాలను మానవులు చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలగాలి. అందుకు దోహదపడే భాష చాలా అవసరం. మన దేశంలోని ప్రాంతీయ భాషల్ని అటుంచండి; చైనా, జపాన్ వంటి సైన్సులో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆ దేశ భాషలకు ఆ పట్టు లేక వాళ్ళు రీసర్చిలో, ఉన్నత చదువుల్లో ఇంగ్లిష్ను అభివృద్ధి చేసుకుంటున్నారు. అందుకే చైనా అతిశక్తిమంతమైన సెర్చ్ ఇంజిన్కు ‘డీప్ సీక్’ అని ఇంగ్లిష్ పేరు పెట్టింది. ఈ మధ్యకాలంలో అమెరికా హెచ్ వన్ బీ వీసా ఆంక్షలు విధించగా టాలెంట్ ఉన్నవారికి తాము స్వాగతం పలుకుతామని ఓ కొత్త వీసా ఇవ్వడానికి సిద్ధమయ్యింది చైనా. దానికి ‘కె–వీసా’ అని ఇంగ్లిష్ పేరే పెట్టింది. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం అన్ని స్కీములకూ హిందీ పేర్లు పెడుతున్నది. హిందీలో పెట్టిన ఆ పేర్లన్నీ ఈ దేశంలోని దక్షిణ, ఈశాన్య ప్రాంత పౌరులకు అర్థం కావు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రభుత్వ స్కూళ్లలో తీసెయ్యడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది.యూఎన్ 80 ఏండ్ల చరిత్రలో ఇంగ్లిష్ పాత్రఈ మధ్యకాలంలో ఐక్యరాజ్యసమితి (యూఎన్) తన 80 ఏండ్ల సంబరాలు జరుపుకున్నది. ప్రపంచ దేశాల అధినేతలు అందులో పాల్గొని మాట్లాడారు. దాదాపు 80 శాతం ప్రపంచ దేశ నాయకులు తమ ఉపన్యాసాలు ఇంగ్లిష్లోనే ఇచ్చారు. కొద్దిమంది నాయకులు తమ దేశాల భాషల్లో మాట్లాడారు. కానీ వినే వారికి వారి పెదవుల కదలిక మాత్రమే కనిపించింది.ఇంగ్లిష్ అనువాదకుల మాట మాత్రమే వినిపించింది. అంటే 1945 నుండి 2025 నాటికి ఇంగ్లిష్ భాష ప్రపంచమంతటికీ పాకిందన్నమాట. చాలా దేశాల్లో భాషా సంకుచిత భావం బాగా తగ్గింది. మన దేశంలో భాషా ప్రాతిపదికన ప్రాంతాల మధ్య కొట్లాటలు తగ్గాయి. ఇప్పుడు హిందీని రాష్ట్రాలపై రుద్దుతున్నందువల్ల మళ్ళీ కొన్ని నిరసన ప్రదర్శనలు మొదలవుతున్నాయి. ప్రపంచ దేశాల్లో సైన్సు అభివృద్ధి కీలకమైంది. ఈ స్థితిలో భారతదేశం వెనుకబడకుండా ఉండాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లిష్ భాషను అభివృద్ధి పర్చి శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చెయ్యడం తప్ప మరో మార్గం లేదు.భారత్లో ఇంగ్లిష్ ప్రాముఖ్యంపైన పేర్కొన్న అన్ని రకాల కారణాల వల్ల అక్టోబర్ 5 నాడు దేశం మొత్తంగా ఇండియన్ ఇంగ్లిష్ డే జరపడం చాలా ముఖ్యం. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఇంగ్లిష్ ప్రాముఖ్యాన్ని చర్చించేందుకు అదొక సందర్భం అవుతుంది. ఇంగ్లిష్ దేశాల్లోకి యువత ఇమ్మిగ్రేషన్కు ఆటంకాలు ఏర్పడతున్నాయి కదా అని మన విద్యారంగాన్ని ప్రాంతీయ భాషల్లోకి జార్చితే సైన్సు, టెక్నాలజీ అభివృద్ధి సాధ్యం కాదు. ఈ సందర్భంలో చాలా తీవ్రంగా చర్చించాల్సిన అంశం: ‘అసలు మన చదువులు విదేశాల కోసమా, మన దేశం కోసమా?’ ‘మన చదువులు మన దేశంలో మన జీవితాలను, నిర్మించుకునేటందుకు’ అనే ఆలోచన కీలకమైంది. నేను జీవితాంతం ఇంగ్లిష్లో రాసింది, చదివింది విదేశాల్లో మార్పు, అభివృద్ధి కోసం కాదు కదా! ‘నా అభివృద్ధి నా దేశంతోనే ముడివడి ఉంది’ అనే ఆలోచనతో. ఈ ఆలోచనతోనే అంబేడ్కర్ విదేశాల్లో చదువుకొని ఇక్కడ ఇంగ్లిష్లో రాశారు, మాట్లాడారు. ఆ రోజుల్లో తన కమ్యూనిటీలో గానీ, తన వర్గంలో గానీ ఇంగ్లిష్ అర్థం చేసుకునే వారు గానీ, చదివేవారు గానీ లేరు. ఆ స్థితి ఇప్పుడు కొంతైనా మారింది కదా! అందుకే ఇంగ్లిష్ నేర్చుకోవాలనే పట్టుదలను దేశం వదలకూడదు.వ్యాసకర్త ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు(నేడు ‘ఇండియన్ ఇంగ్లిష్ డే’) -
హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్) రాయని డైరీ
ఇండియా, పాకిస్తాన్ రెండూ కూడా ఫైనల్స్కు చేరుకుంటే, రెండు జట్ల మధ్య – ఈ రోజు మధ్యాహ్నం జరుగుతున్నట్లే – ఆ రోజు మధ్యాహ్నం కూడా ఇదే ప్రేమదాస స్టేడియంలో పోరు మొదలౌతుంది. ‘ప్రేమ’దాస స్టేడియంలో ‘పోరు’!! భలే ఉంటాయి ఈ అనుబంధాలు... కొట్లాడుకునే అక్కచెల్లెళ్ల మధ్య, ఘర్షణలు పడే అన్నదమ్ముల మధ్య! ఒకరి ఇంట్లోకి ఒకరు అడుగు పెట్టరు. పొరుగింట్లోనో, ఆ పై ఇంట్లోనో పంచాయితీ! ‘‘అలాగైతేనే వస్తాం’’ అని మొదటే అగ్రిమెంట్! నవ్వొస్తోంది నాకు!షేక్ హ్యాండ్స్ ఇవ్వాలనీ, సెల్ఫీలు తీసుకోవాలనీ, హగ్స్ ఇస్తుంటే వద్దనకూడదనీ రూల్ బుక్లో ఏమైనా ఉందా అని ‘బోర్డు’లో పెద్దవాళ్లు అంటున్నారు! అది నిజమే కానీ... షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదనీ, సెల్ఫీలు తీసుకోకూడదనీ, హగ్స్ ఇస్తుంటే వద్దనాలనీ కూడా రూల్ బుక్లో ఉండదేమో కదా! ఇలాంటప్పుడే, అమాయకమైన చిరునవ్వుతో – పైవారి ఆదేశాలను ధిక్కరిస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన నాకు వస్తుంటుంది.‘‘అలా చెయ్యకు హ్యారీ’’ అనేవారు చిన్నప్పుడు నాన్న. చిరునవ్వుతో సరిగ్గా అలానే చెయ్యబుద్ది అయ్యేది నాకు!‘‘అలా చెయ్యటం కరెక్ట్ కాదు హర్మన్ ’’ అనేవారు కాలేజ్లో ప్రిన్సిపాల్. చిరునవ్వుతో సరిగ్గా అదే కరెక్ట్ అనాలనిపించేది నాకు!ఇప్పుడిక బీసీసీఐ సెక్రెటరీ! ‘మహిళల ప్రపంచ కప్లో భారత్–పాక్ ప్లేయర్స్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారనే గ్యారంటీ ఏమీ లేదని అంటున్నారు! చిరునవ్వుతో సరిగ్గా నాకేం అనిపిస్తోందంటే, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోబోమనే గ్యారంటీ కూడా ఏమీ లేదని! మనసులో దగ్గరితనాన్ని ఉంచుకుని దూరాన్ని ఎంతకాలం నటించగలం? మాట్లాడాలని లోలోపల పీకుతూ ఉంటే మౌనాన్ని ఎలా పాటించగలం?కొద్దిసేపట్లో భారత్–పాక్ల మధ్య లీగ్ మ్యాచ్. అది వదిలేసి, ఎప్పుడో నెల తర్వాత నవంబర్ 2న ఎవరి మధ్య జరుగుతుందో కూడా తెలియని ఫైనల్ మ్యాచ్ గురించి ఆలోచిస్తున్నాన్నేను!నిజంగానే భారత్–పాక్ ఫైనల్కి చేరుకుంటే, ఫైనల్లో గెలుపెవరిది అనే మాట అటుంచి... ఫైనల్లోనైనా టాస్ వేశాక షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటామా, ఆట ముగిశాకైనా చేతులు కలుపుకుంటామా అన్నదే ఆలోచిస్తూ యావద్దేశంతో పాటుగా నేను కూడా ఆ రోజు తెల్లవారుజాము నుంచే టెన్షన్ టెన్షన్గా ఉంటాననుకుంటా!ఫాతిమా సనా పాక్ కెప్టెన్ . చిన్న పిల్ల. నాకంటే 13 ఏళ్లు చిన్న. ఎం.ఎస్.ధోనీ తన ఇన్ స్పిరేషన్ అట. ధోనీలా కూల్గా ఉండి ఈ వరల్డ్ కప్లో తన జట్టును గెలిపిస్తుందట! బహిరంగంగానే చెప్పేసింది. అది కదా ‘హై–స్పిరిటెడ్’ అంటే. కానీ బీసీసీఐ వేరే ‘హై’లో ఉంది. మొన్నటి మెన్ ్స క్రికెట్ ‘సంప్రదాయాన్నే’ ఉమెన్ ్స క్రికెట్ కూడా ఫాలో అవాలట! అంటే, నో షేక్ హ్యాండ్స్ అని. 2022 వరల్డ్ కప్లో – న్యూజిలాండ్లో భారత్–పాక్ ఆటకు పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ తన ఆర్నెల్ల వయసున్న కూతుర్ని వెంటపెట్టుకుని వచ్చింది. తల్లీకూతుళ్లతో కలిసి టీమ్ ఇండియాలోని అందరం సెల్ఫీ తీసుకున్నాం. ఆ గేమ్లో ఇండియా గెలిచింది కానీ, ఇండియాను బిస్మా మరూఫ్ కూతురు తన బోసి నవ్వుల్తో ‘క్లీన్ బౌల్డ్’ చేసేసింది. ఆ పాప పేరు కూడా ఫాతిమానే!లీగ్ మ్యాచ్ టైమ్ అయింది. టాస్ కోసం లోపలికి వెళుతున్నాం. గెలుపు, ఓటమి... తర్వాతి సంగతి. ఫీల్డ్లో ఫాతిమా నాకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతే నేను చెయ్యి చాస్తానా? లేక, ఫాతిమా షేక్ హ్యాండ్ కోసం నేనే ముందుగా చెయ్యి చాస్తానా? అంతా ఫాతిమా చేతుల్లో ఉంది.ఊహు... చేతుల్లో కాదు, ఫాతిమా చిరునవ్వులో ఉంటుంది. -
టైమ్ మిషన్: ప్రపంచ చరిత్రనే మార్చిన యుద్ధం
ప్రపంచ చరిత్రలో అత్యంత నిర్ణయాత్మకమైన యుద్ధాలలో ‘గౌగమేలా’ యుద్ధం ఒకటి. ఈ యుద్ధంలో మేసిడోనియా యువరాజు అలెగ్జాండర్... అకిమెనిడ్ పారసీక సామ్రా జ్యపు చక్రవర్తి డరియస్–3ను చిత్తు చేశాడు. దీనితో ప్రపంచ చరిత్ర గతే మారి పోయింది. గ్రీకు సేనలకు ఆసియా ద్వారాలు తెరచుకున్నాయి.గౌగమేలాకు ముందు ‘ఇసస్’ యుద్ధంలో (క్రీ.పూ. 333) కూడా డరియస్ను అలెగ్జాండర్ ఓడించాడు. కానీ ఆ విజయం పారసీక సామ్రా జ్యాన్ని బలహీనం చేయలేకపోయింది. ఈసారి డరియస్ తన సామ్రాజ్య అపారమైన వనరులను ఉపయోగించుకుని భారీ సైన్యాన్ని (సుమారు లక్షన్నర నుంచి రెండున్నర లక్షల మంది) సమ కూర్చుకున్నాడంటారు. అలెగ్జాండర్ కేవలం తన 47,000 మంది సైనికులతో ఈ భారీ సైన్యాన్ని ఎదుర్కొని విజయం సాధించడంలో అతడి యుద్ధ తంత్రమే ప్రధాన కారణం అయ్యింది.మెసపొటోమియా ఉత్తర ప్రాంతం (ప్రస్తుత ఇరాక్)లోని గౌగమేలా మైదానంలో క్రీస్తు పూర్వం 331 అక్టోబర్ మొదటివారంలో (1వ తేదీ) జరిగిన ఈ యుద్ధంలో... డరియస్ తన రథాలను, యుద్ధ గజాలను ప్రధాన ఆయు ధాలుగా ఉపయోగించాలని భావించాడు. అందుకే సమతలమైన ఈ మైదానాన్ని యుద్ధ క్షేత్రంగా ఎంచుకున్నాడు. కానీ అలెగ్జాండర్ ఈ వ్యూహాన్నే తనకనుకూలంగా మార్చుకున్నాడు.మైదానంలో ఎడమవైపు ఉన్న జాగాలో డరి యస్ తన అపార సైన్యాన్ని మోహరించి ఉన్నాడు. అతి కొద్ది సైన్యాన్ని డరియస్ను ఎదు ర్కోవడానికి అలెగ్జాండర్ అక్కడ మోహరించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్థానాన్ని వీడకుండా ఉండాలని ఆదేశించాడు. ప్రధాన సైన్యాన్ని కుడి వైపునకు మరల్చి దూరంగా పొమ్మని ఆజ్ఞ జారీ చేశాడు. ఇది చూసిన డరియస్ చుట్టూ ఉన్న సైన్యం... శత్రుసైనికులు వెనక్కి తిరిగి పారి పోతున్నారని భావించి వారిని వెంబడించడం ప్రారంభించింది. దీంతో డరియస్ చుట్టూ ఖాళీ ఏర్పడింది. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న అలెగ్జాండర్ తనను వెన్నంటి ఉన్న సుశిక్షిత అశ్విక దళంతో శరవేగంతో ఆ ఖాళీలో ప్రవేశించి డరియస్ను చుట్టుముట్టాడు.అలెగ్జాండర్ అత్యంత వేగంగా సైన్యాన్ని నడిపిస్తూ డరి యస్ చుట్టూ ఉన్న సైన్యాన్ని ఊచకోత కోశాడు. ఎడమవైపుకు డరియస్ సైనికులు పారిపోకుండా అంతకు ముందే మోహరించి ఉన్న తన కొద్ది పాటి సైనిక సమూహం వీరోచితంగా పోరా డుతూ ప్రధాన సైన్యం విజయం సాధించేంత వరకు తమ స్థానాన్ని కాపాడుకుంది. వారు వెనక్కి తగ్గి ఉంటే అలెగ్జాండర్ ప్రణాళిక విఫ లమై ఉండేది. ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరచబడిన ఓ మృత్తికా ఫలక శాసనం (క్లే టాబ్లెట్ ఇన్స్క్రిప్షన్)లో ఈ వివరాలు ఉన్నాయి.యుద్ధ ప్రాముఖ్యంగౌగమేలా యుద్ధం తరువాత, అకిమెనిడ్ సామ్రాజ్యం అంతరించిపోయింది. డరియస్ తప్పించుకున్నాడు. కానీ అలెగ్జాండర్ పారసీక రాజదానులైన బాబిలోన్, సూసా, పెర్సెపోలిస్ లను సులభంగా స్వాధీనం చేసుకున్నాడు. యుద్ధం తరువాత, గ్రీకు సంస్కృతి, ఆచారాలు ప్రాచ్య ప్రపంచంలోకి వ్యాపించడానికి మార్గం సుగమమైంది. ఈ సంస్కృతుల మిశ్రమమే ‘హెలె నిస్టిక్ యుగం’గా ప్రసిద్ధికెక్కింది. ఇది శాస్త్రీయ, సాంస్కృతిక, రాజకీయ రంగాల అభివృద్ధికి దోహ దపడింది. ఈ విజయం తరువాత, అలెగ్జాండ ర్ను ‘అలెగ్జాండర్ ద గ్రేట్’ అని పిలవడం ప్రారంభమయ్యింది. చరిత్రలో ఆయన గొప్ప వారిలో అత్యంత గొప్పవాడిగా నిలిచాడు. -
స్వదేశీ అమలుకు అడ్డంకేమిటి?
‘స్వదేశీ’ అనే గొప్ప నినాదాన్ని స్వాతంత్య్రోద్యమ కాలంలో అప్పటి నాయకులు ఒకసారి ఇచ్చారు. స్వాతంత్య్రాన్ని సాధించుకుని కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత ప్రస్తుత నాయకత్వం మరొకసారి ఇస్తు న్నది. ఆ నినాదం పారిశ్రామిక వర్గాలను గానీ, సమాజాన్ని గానీ అపుడెట్లా ఉత్తేజ పరిచింది, ఇపుడెట్లా చేస్తున్నది? ఆ దరి మిలా నినాదపు అమలు అపుడెట్లా జరగింది, ఇపుడెట్లా జరుగుతున్నది?ఇందుకు సమాధానాన్ని మామూలు పద్ధతిలో వెతికి అపుడు గొప్పగా ఉండేదనీ, ఇపుడు ఆశించిన ఫలితాలు లేవనీ ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. కానీ అది విషయాలను సమగ్ర దృష్టితో పరిశీలించి చేసే విమర్శ కాబోదు. ఎందుకంటే, స్వాతంత్య్రోద్యమ కాలపు స్వదేశీ నినాద స్ఫూర్తి లోపించటం స్వాతంత్య్రం లభించిన తర్వాత కాంగ్రెస్ పాలనా కాలం నుంచే మొదలై, ప్రస్తుత బీజేపీ పాలన వరకు కూడా కొనసాగుతున్నది. ఎందుకన్నది ప్రశ్న. ఆ స్ఫూర్తి తిరిగి రావటం ఎట్లాగన్నది విషయం.బెంగాల్ విభజన కాలంలో...చర్చలోకి వెళ్లేముందు ఈ రెండు సందర్భాలలో ‘స్వదేశీ’ భావనల నేపథ్యం కొంత చూడాలి. ఆ మాట మొదటిసారిగా బ్రిటిష్ వలస పాలనా కాలంలో అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ ప్రావిన్స్ను 1905లో రెండుగా విభజించినపుడు అందుకు నిరసనగా అక్కడి నాయకులు, సమాజం ముందుకు తెచ్చినటువంటిది. వారు బ్రిటన్కు సంబంధించిన అన్నింటిని బహిష్కరించి హింసాత్మక ఉద్యమం సాగించగా విభజన రద్దయింది. తర్వాత కొన్నేళ్లకు ఉద్యమ ప్రవేశం చేసిన గాంధీజీ ఆ నినాదానికి కొత్త అజెండాను రూపొందించారు. ప్రస్తుతం మనం అంటున్న స్వదేశీ నినాదానికి మూలాలు ఆయన అజెండాలో ఉన్నాయి. అందులో భాగంగా ఆయన ప్రజలకు బోధించింది ఆర్థిక స్వావలంబన, స్వయంసమృద్ధి, స్థానిక ఉత్పత్తుల వాడకం, అందుకు అవసరమైన వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, వీటన్నింటికి సమాంతరంగా విదేశీ వస్తు బహిష్కరణ. ఆ కాలంలో టాటా, బిర్లా వంటి భారీ పారిశ్రామికసంస్థలు ఒక మేర బ్రిటిష్ కంపెనీల సహకారంతో నడిచినప్పటికీ, మరొకవైపు గాంధీజీ నినాదం ప్రజల స్థాయిలో ఒక ఉద్యమంగా సాగింది. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ ప్రభుత్వాలు పారిశ్రామి కాభివృద్ధి కోసం ప్రయత్నించటం అవసరమే అయినా, అందుకు సమాంతరంగా ఖాదీ గ్రామీణోద్యోగ రంగాన్ని కొంతకాలం మొక్కు బడిగా నడిపి దిక్కులేనిదిగా వదిలారు. పారిశ్రామిక రంగం క్రమంగా స్వదేశీ – విదేశీ మిశ్రమంగా మారింది. ప్రజలలో సైతం గత కాలపు స్ఫూర్తి అంతరించి విదేశీ ఉత్పత్తుల పట్ల మోజు పెరుగుతూ పోయింది. ఆ మాటే వినని తరం...1991లో భారతదేశం డబ్లు్యటీవోలో ప్రవేశించి, ఆర్థిక సంస్కర ణల ద్వారా విదేశీకి తలుపులు పూర్తిగా తెరిచింది. మతం విష యాన్ని అట్లుంచితే, జాతీయతా భావనలు బలంగా ఉండే ఆరెస్సెస్ ద్వారా అదే సంవత్సరం స్వదేశీ జాగరణ్ మంచ్ ఏర్పడింది గాని పరిమితంగానే పనిచేయగలిగింది. తర్వాత కాలంలో వాజ్పేయి ప్రధానిగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం కూడా స్వదేశీని పక్కకు పెట్టింది. అందుకు కారణం, భారత పారిశ్రామిక, వాణిజ్య వర్గా లలో అత్యధికులు విదేశీ పెట్టుబడులతో కలిసి ఉమ్మడి ఉత్పత్తులు, వ్యాపారాల వైపు మొగ్గటం. బయటినుంచి ప్రత్యక్ష పెట్టుబడులు, జాయింట్ వెంచర్లు, ఎగుమతులకు తగిన స్థాయిలో ఉత్పత్తులు చేసేందుకు టెక్నాలజీ దిగుమతులు, ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ అభివృద్ధి అవసరమనే దృష్టి పెరుగుతూ పోయాయి. ఈ కొత్త దశలో అత్యధికులు ‘స్వదేశీ’ అనే మాటనే విని ఉండరు. 1947కు ముందటి స్వదేశీ దృక్పథం, స్ఫూర్తీ, ఆ తర్వాత అర్ధ శతాబ్దం గడిచి, రెండు తరాలు మారి, రెండు ప్రధానమైన పార్టీల పరిపాలనను కూడా చూసిన వెనుక, ఉక్కిరిబిక్కిరై అవసాన దశలోకి ప్రవేశించింది.ఈ విధమైన రెండు దశల వెనుక 2014లో అధికారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, మరొక పేరుతో తిరిగి స్వదేశీ నినాదాన్ని ఇచ్చారు. అందుకు ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ వంటి పేర్లు పెట్టారు. ఆయన గుజరాత్కు చెందినవారు కావటం, గుజరాత్ – మహారాష్ట్ర ప్రాంతంలో స్థానిక పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు బలంగా ఎదగటం ఒకటైతే, విదేశీ పెట్టుబడులు, కంపెనీలు రావాలి గానీ అవి తమకు అనుకూలమైన విధంగా వ్యవ హరించాలనుకునే ధోరణులు పెరగటం మరొకటిగా మారి, ఈ కొత్త తరహా స్వదేశీ నినాదానికి భూమికగా మారాయి. దీనితోపాటు ఆత్మనిర్భర్కు మూల స్తంభాలని అయిదింటిని పేర్కొన్నారు. అవి ఆర్థికం, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవస్థలను నిర్మించి బలోపేతం చేయటం, సమాజాన్ని క్రియాశీలం చేయటం, దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెంచటం. నాలుగు కీలకాంశాలుఅప్పటినుంచి 10 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగిన సమీక్షలు ప్రోత్సాహకరంగా లేకపోవటం గమనించదగ్గది. ఆత్మ నిర్భర్కు మూలస్తంభాలుగా పైన పేర్కొన్న అయిదు రంగాలలో పెరుగుదల లేదని కాదు. కానీ అది సాధారణమైన రీతిలో జరుగు తుండేదే తప్ప ప్రత్యేకమైన ఊపు ఏదీ రాలేదు. మొత్తం ఆర్థిక వ్యవస్థ పరిమాణం జపాన్ను మించి నాల్గవ స్థానానికి చేరటానికి ఒక కారణం మన దేశ పరిమాణం ఇంత పెద్దది కావటమైతే, మరొక కారణం జపాన్ అభివృద్ధి వేగం మందగించటం. దీని అర్థం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ పెనవేసుకుపోయిన స్థితిలో ఒంటరితనంగా ఎదగాలని కాదు. అది అసాధ్యం, అవాంఛ నీయం కూడా. మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా పునర్నవీకరణ జరుగుతూనే, మౌలిక స్థాయిలో స్వదేశీ, స్వావలంబనలను పునాదులుగా నిలబెట్టుకోవచ్చు. ఇతరులపై ఆధారపడటం తగ్గుతూ, వారి ఒత్తిడులకు భయపడే స్థితిని పోగొట్టు కోవచ్చు. ఇది ప్రభుత్వపరంగా జరగవలసినది కాగా, సమాజాన్ని కూడా అదే స్ఫూర్తితో ఆ ప్రణాళికలో భాగస్వామిని చేయటం అసాధ్యం కాదు. అమెరికా ట్యారిఫ్లు వాణిజ్య ఒప్పంద ఒత్తిడుల స్థితిలో ఇపుడీ మాటను ప్రధాని మోదీ తనకు తాను పదేపదే గుర్తు చేసుకుంటూ దేశ ప్రజలకు గుర్తు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటికీ మూలంలో అసలు ప్రస్తావనకు రాని కీలకమైన విషయం ఒకటున్నది. భారతదేశానికి గొప్ప చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. ప్రజలకు గొప్ప దేశభక్తి, జాతీయతా భావాలున్నాయి. ఏ దేశానికైనా, జాతికైనా ఈ నాలుగు అంశాలు కలిసి ఎనలేని శక్తిని ఇవ్వగలవు. వాటిని ఒక దార్శనికత, ప్రణాళిక, పట్టుదల, నిజాయితీ అనే నాలుగు అంశాలతో సమన్వయం చేసి ఆచరణలోకి తేగల నాయకత్వం ఉన్నట్లయితే ఆశించిన ఫలితాలను సాధించగలరు. అది జరిగినందువల్లనే స్వదేశీ నినాదం స్వాతంత్య్రోద్యమ కాలంలో విజయవంతమైంది. స్వాతంత్య్రానంతరం ఎవరు పాలించినా ఆ పని చేయలేక పోతున్నారు. స్వదేశీ నినాదాల అమలుకు మౌలికమైన అడ్డంకిగా నిలుస్తున్న లోపం అదే.- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు-టంకశాల అశోక్ -
తమిళ రాజకీయాల తొక్కిసలాట
తమిళనాట కరూర్లోని వేలుసామిపురంలో హీరో విజయ్ రాజకీయ ర్యాలీలో విషాద ఘటన జరిగి నాలుగు రోజులు గడిచాయి కానీ, దానిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు మాత్రం సమీప భవిష్యత్తులో సమసిపోయేలా లేవు. విజయ్ కొత్త రాజ కీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేతలపై వరుస ఎఫ్.ఐ.ఆర్.లు, రకరకాల కోర్టు కేసులు, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జ్యుడిషియల్ కమిషన్, బాధితులకు అండ పేరిట వివిధ రాజకీయ పార్టీల సందర్శనలు, కేంద్రంలోని పాలక ఎన్డీఏ కూటమి పక్షాన నటి హేమమాలిని సారథ్యంలో 8 మంది ఎంపీల బృందం క్షేత్రస్థాయి పర్యటన... ఇలా ఆగకుండా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విజయ్పై చెప్పులు విసరడం దగ్గర నుంచి ర్యాలీ వేళ విద్యుత్ సరఫరాకు అంతరాయం దాకా అనేక అంశాలు, కుట్ర ఉందనే అభియోగాలు ఒక్కొక్కటిగా వస్తు న్నాయి. దుర్ఘటనపై సీబీఐ విచారణ జరపాలని విజయ్ కోరు తుంటే, సుప్రీంకోర్ట్ సిట్టింగ్ జడ్జితో నిష్పక్షపాత విచారణ కావాలని ఎన్డీఏ డిమాండ్ చేస్తోంది.మామూలుగా సినీ స్టార్ వస్తున్నారంటేనే భారీ జన సందోహం ఉంటుంది. ఇప్పుడు విజయ్ ఓ రాజకీయ నేత కూడా! త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాజకీయపార్టీ, దాని అధినేత సభలు పెట్టడం సహజం. దానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, దాని చెప్పు చేతల్లోని పోలీసు యంత్రాంగానిది. అందులోనూ వారాంతంలో రోడ్ షో అంటే, అభిమాన నాయకుణ్ణి చూసేందుకు పిల్లా పాపలతో సహా జనం మరింతగా తరలి వస్తారు. అంత పెద్దయెత్తున జనం వస్తుంటే, కచ్చితంగా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు అవసరం. క్రేజున్న విజయ్ సభలకు మద్రాసు హైకోర్ట్ అందుకు కొన్ని నిబంధనలు పెట్టింది. అవన్నీ తు.చ. తప్పక పాటించాల్సిందే! అదే సమయంలో కరూర్ ఘటనలో ప్రభుత్వ, పాలనా యంత్రాంగాల ఘోర వైఫల్యాలను విస్మరించలేం. అనుమతులు ఇవ్వడం దగ్గర నుంచి అత్యవసర రక్షణ వరకు అన్నీ చూసుకోవాల్సిన పోలీసు, ప్రభుత్వ యంత్రాంగాలు ఆ బాధ్యతల నుంచి తప్పించుకొని, సభ పెట్టిన వారిదే తప్పంటూ నెపం నెట్టివేయాలని చూస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కుట్ర ఉందనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. అదే నిజమైతే, అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు. నిజానికి, మరో సినీ హీరో స్వర్గీయ విజయ్కాంత్ ఆ మధ్య కొన్నేళ్ళ క్రితం తన డీఎండీకె పార్టీతో మెరుపులు మెరిపించి నప్పటికీ, తమిళనాట రాజకీయాలంటే ప్రధానంగా రెండు ప్రధాన ద్రవిడ పార్టీలు డీఎంకె, అన్నా డీఎంకెల మధ్యనే నడుస్తుంటాయి. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలది సహాయ పాత్రే. సీమాన్ నేతృత్వంలోని ఎన్టీకే, అలాగే పీఎంకే లాంటి ఇతర పార్టీలది మరీ చిన్న పాత్ర. అలాంటì ద్రవిడ రాజకీయాల తమిళనాట ‘ఇళయ దళపతి’ (యువ దళపతి) విజయ్ పార్టీ పెట్టడం కుదుపు తెచ్చింది. రాజకీయ రంగప్రవేశంపై సుదీర్ఘ కాలం దోబూచులాడిన సూపర్స్టార్ రజనీకాంత్ మిడిల్డ్రాప్తో ఖాళీగా ఉన్న స్థానంలోకి దూసుకువచ్చారీ ఇళయ దళపతి.విజయ్ ఇప్పటికే తమిళనాట రెండు రాష్ట్ర స్థాయి మహా సభలు పెట్టారు. రెండు వీకెండ్ రోడ్ షోలూ చేశారు. ఎక్కడకు వెళ్ళినా జనసందోహమే! గతంలో అన్నా డీఎంకె సంస్థాపకుడైన సినీ హీరో ఎమ్జీఆర్ కాలంలో లాగా ఇప్పుడు విజయ్ సభలకు అభిమాన గణం వెల్లువెత్తుతున్నారు. ప్రధానంగా పాతికేళ్ళ లోపు యువతీ యువకులు తమ అభిమాన హీరోను దగ్గర నుంచి చూడాలని ఉరకలెత్తుతున్నారు. ఫలితంగా, విజయ్ ఇటు పాలక డీఎంకెను కలవరపరచడమే కాక, అటు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో గద్దెనెక్కాలని ఆశలు పెట్టుకున్న ప్రతిపక్షం అన్నాడీఎంకె వ్యూహానికీ పెను సవాలయ్యారు. అలాంటి వేళ సెప్టెంబర్ 27న కరూర్లో వీకెండ్ రోడ్ షోలో జరిగిన తొక్కిసలాట అనూహ్యంగా బ్రేకులు వేసింది. కుంభమేళా తొక్కిసలాట ఘటన లాంటివన్నీ ఇటీవలి చేదు జ్ఞాపకాలే. అయితే, 41 మంది దుర్మరణానికీ, పదులసంఖ్యలో క్షతగాత్రులకూ కారణమైన కరూర్ ఘటన తమిళ రాజకీయ సభలలో కనీవినీ ఎరుగనిది. ఆ దుర్ఘటనతో మ్రాన్పడిపోయిన విజయ్ తక్షణమే 2 ఎయిర్పోర్టుల వద్దా మీడియాతో మాట్లా డకున్నా, తర్వాత సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 2 లక్షల వంతున నష్టపరిహారం చెల్లించారు. పరామర్శకు ఆయన వెళ్ళాలను కున్నా, పరిస్థితి సద్దుమణగకుండా రావద్దన్న ప్రభుత్వసూచనను మన్నించక తప్పలేదు. రెండు వారాల పాటు రోడ్ షోలనూ వాయిదా వేసుకున్నారు. ర్యాలీ నిర్వహించిన రాజకీయ పార్టీ నైతిక బాధ్యతను ఎవరూ కాదనలేరు. కానీ, కరూర్ ఘటన మొత్తానికీ విజయ్నే దోషిని చేస్తూ, కొందరు ప్రత్యక్షంగానూ, మరికొందరు పరోక్షంగానూ వ్యాఖ్యలు చేయడమే విడ్డూరం. ఒకవేళ సభా నిర్వాహకులు నియమాలను పాటించడం లేదనుకుంటే, స్పష్టమైన రుజువులు చూపి, వారిని వారించాలి. అంతే కానీ, జరగకూడనిది జరిగాక తప్పంతా వాళ్ళదే అంటే ఒప్పదు. ‘‘పోలీసులు పూర్తిస్థాయిలో భద్రత కల్పించి ఉంటే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు చోటు చేసుకుని ఉండేవి కావు. ఇకనైనా పోలీసులు అధికార పక్షానికి ఓ న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం అన్నట్టు వ్యవహరించకుండా ఉంటే మంచిది’’ అని ప్రధాన ప్రతిపక్షమే వ్యాఖ్యానించడం గమనార్హం. రాజకీయ ఆరోపణలు చేయాలే తప్ప తమిళ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే క్రేజున్న విజయ్ను ప్రత్యక్షంగా బాధ్యుణ్ణి చేస్తే, ఆయ నను వేధిస్తున్నారన్న భావన జనంలో కలిగి అది తమకే ఎదురు కొడుతుందన్న ఎరుక పాలక పక్షానికీ లేకపోలేదు. అందుకే, పార్టీలన్నీ తమ స్వార్థప్రయోజనాలకు తగ్గ ప్రకటనలిస్తూ, ప్రజల్లో మార్కులు కొట్టేసే పనిలో తలమునకలయ్యాయి. ఏమైనా, రాజ కీయ ర్యాలీలలో భద్రతా ప్రమాణాలు కీలకమనీ, జవాబుదారీ తనం అత్యవసరమనీ కరూర్ దుర్ఘటన మరోసారి గుర్తు చేసింది. అందుకు, పాలకులే ప్రధాన బాధ్యత తీసుకోక తప్పదు. – ఆర్. పర్వతవర్ధని ‘ కోయంబత్తూరు -
వంద సంవత్సరాల దేశసేవ
ఓ శతాబ్దం కిందట విజయదశమి పర్వదినాన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆవిర్భవించింది. అయితే, ఇది కొత్తగా సృష్టించినదేమీ కాదు... ప్రాచీన సంప్రదాయానికి నవ్య వ్యక్తీకరణ మాత్రమే. భారత నిరంతర జాతీయ చైతన్యం కాలానుగుణంగా భిన్న రూపాల్లో, విభిన్న సవా ళ్లను ఎదుర్కొంటూ ఇలా అవతరించింది. ఆ కాలాతీత జాతీయ చైతన్యానికి మన కాలపు ప్రతిరూపమే ఈ సంఘ్. ఇటువంటి సంఘ్ శతాబ్ది వేడు కలలో భాగస్వాములం కావడం మన తరం స్వయంసేవకుల అదృష్టం. దేశానికి, ప్రజలకు సేవ దిశగా ప్రతినబూని, అంకిత భావంతో ముందుకు సాగుతున్న అసంఖ్యాక స్వయం సేవకులకు ఈ చారిత్రక సందర్భంలో నా శుభాకాంక్షలు. సంఘ్ స్థాపకుడు, మనందరి మార్గదర్శకుడు అయిన డాక్టర్ హెడ్గేవార్జీకి నా సగౌరవ ప్రణామాలు అర్పిస్తున్నాను. వందేళ్ల ఈ అద్భుత పురోగమనాన్ని స్మరించుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లతో పాటు స్మారక నాణాన్ని కూడా ఆవిష్కరించింది.వ్యక్తి వికాసం.. దేశ పురోగమనంమానవ నాగరికతలన్నీ గొప్ప నదీ తీరాల్లోనే పరిఢవిల్లాయి. అదే తరహాలో సంఘ్ ప్రభావంతో లెక్కలేనన్ని జీవితాలు చరితార్థ మయ్యాయి. ఒక నది తాను తడిపిన ప్రతి అంగుళం నేలనూ సుసంపన్నం చేస్తుంది. అదే విధంగా సంఘ్ కూడా దేశంలోని ప్రతి మూలనూ, సమాజంలో ప్రతి రంగాన్నీ పెంచి పోషించింది. ఒక నదీ ప్రవాహం పలు విధాలుగా చీలి తన ప్రభావాన్ని మరింతగా విస్తరింపజేస్తుంది. సంఘ్ ప్రయాణం కూడా ఇలాంటిదే. వివిధ అనుబంధ సంస్థల ద్వారా విద్య, వ్యవసాయం, సామాజిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహిళా సాధికారత సహా జీవితంలోని అనేక రంగాల్లో సంఘ్ తన సేవానిరతిని రుజువు చేసుకుంది. ‘‘వ్యక్తి వికాసం నుంచి దేశ వికాసం, వ్యక్తిత్వ నిర్మాణంతో దేశ పురోగమనం’’... ఇదీ సంఘ్ అనుసరించిన పంథా! దేశభక్తికి మారుపేరుఆవిర్భవించిన మరుక్షణం నుంచే దేశ ప్రాధాన్యాన్నే తన ప్రాథమ్యంగా సంఘ్ పరిగణించింది. డాక్టర్ హెడ్గేవార్ సహా అనేకమంది స్వయంసేవకులు స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. డాక్టర్ హెడ్గేవార్ స్వయంగా అనేకసార్లు జైలుకు వెళ్లారు. పలువురు స్వాతంత్య్ర సమరయోధులకు సంఘ్ మద్దతునిస్తూ రక్షణగానూ నిలిచింది. స్వాతంత్య్రం తర్వాత కూడా దేశం కోసం తన వంతు కృషిని కొనసాగించింది. దేశభక్తికి, సేవకు మారుపేరుగా ‘సంఘ్’ నిలిచింది. దేశ విభజన సమయంలో లక్షలాది కుటుంబాలు ఆశ్రయం కోల్పోయిన వేళ... స్వయంసేవ కులు ముందుకొచ్చి శరణార్థులకు సేవలందించారు. పరిమిత వనరులే ఉన్నప్పటికీ... ప్రతి విపత్తు సమయంలోనూ ఆపన్న హస్తం అందించే వారిలో స్వయంసేవకులు ముందుంటారు. వారి దృష్టిలో ఇవి ఉపశమన చర్యలు మాత్రమే కాదు... దేశ చేతనను బలోపేతం చేయడం కూడా! వివక్షకు వ్యతిరేకంగా పోరాటంశతాబ్ద కాలపు ప్రయాణంలో సమాజంలోని వివిధ వర్గాల్లో స్వచేతననూ, ఆత్మవిశ్వాసాన్నీ సంఘ్ జాగృతం చేసింది. దశాబ్దా లుగా గిరిజన వర్గాల సంప్రదాయాలు, ఆచారాలు, విలువలను పరిరక్షించి, పెంపొందించడానికి అంకితమైంది. నేడు సేవా భారతి, విద్యా భారతి, ఏకల్ విద్యాలయాలు, వనవాసీ కల్యాణ్ ఆశ్రమ్ వంటి సంస్థలు గిరిజన వర్గాల సాధికారతకు మూలస్తంభాలుగా నిలిచాయి. కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలు శతాబ్దాలుగా హిందూ సమాజానికి సవాళ్లుగా ఉన్నాయి. డాక్టర్ హెడ్గేవార్జీ కాలం నుంచి నేటి వరకు.. ప్రతీ స్వయం సేవక్, ప్రతీ సర్ సంఘ్ చాలక్ ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ‘‘అంట రానితనం తప్పు కాకపోతే, ప్రపంచంలో మరేదీ తప్పు కాదు’’ అని పూజ్య బాలసాహెబ్ దేవరస్జీ ప్రకటించారు. అనంతరం పూజ్య రజ్జు భయ్యాజీ, పూజ్య సుదర్శన్జీ కూడా ఈ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. ‘అందరికీ ఒకే బావి, ఒకే గుడి, ఒకే శ్మశానవాటిక’ ఉండాలంటూ ప్రస్తుత సర్ సంఘ్చాలక్ గౌరవ మోహన్ భాగవత్జీ ఐక్యత దిశగా స్పష్టంగా పిలుపునిచ్చారు. శతాబ్దం కిందట సంఘ్ ఏర్పడిన వేళ నాటి అవసరాలు, సవాళ్లు నేటి కాలానికి భిన్నంగా ఉన్నాయి. నేడు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా పురోగమిస్తున్న కొద్దీ కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. మన ఐక్యతను భగ్నం చేసే కుట్రలు, చొరబాట్లు, ఇంకా ఎన్నింటినో ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. వీటిని సమర్థంగా ఎదుర్కోవడం కోసం ఆర్ఎస్ఎస్ కూడా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయడం సంతోషదాయకం.తదుపరి శతాబ్దికి సమాయత్తంసంఘ్ ప్రవచిస్తున్న ‘పంచ పరివర్తన్’... నేటి సవాళ్లను అధిగమించే మార్గాన్ని ప్రతి స్వయం సేవకుడికీ నిర్దేశిస్తుంది.అవి: 1. స్వబోధ: వలసవాద మనస్తత్వం నుంచి విముక్తుల మయ్యేలా, మన వారసత్వ ఘనతను గర్వంగా ప్రకటించు కునేలా, స్వదేశీ సూత్రాన్ని పురోగమింపజేసేలా ఈ ‘స్వీయ అవగాహన’ దోహదపడుతుంది. 2. సామాజిక సామరస్యం: అణగారిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చి సామాజిక న్యాయంపై భరోసా కల్పించడం ద్వారా సామాజిక సామరస్యం సాకార మవుతుంది. మన సామాజిక సామరస్యానికి పెనుసవాలుగా పరిణమించిన చొరబాట్ల సమస్యను పరిష్కరించడం కోసం ఉన్నత స్థాయి జనాభా మిషన్ (హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్)ను ప్రభుత్వం ప్రకటించింది. 3. కుటుంబ ప్రబోధన్: మన సంస్కృతికి పునాది అయిన కుటుంబ వ్యవస్థను కుటుంబ విలువలు బలోపేతం చేస్తాయి. 4. నాగరిక్ శిష్టాచార్: సామా జిక స్పృహ, బాధ్యతా భావం ప్రతి పౌరుడి లోనూ జాగృతం కావాలి. 5. పర్యావరణ్: రాబోయే తరాల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడం కోసం పర్యావరణ సంరక్షణ అత్యంత ముఖ్యమైనది. ఈ ఐదు సంకల్పాల నిర్దేశంలో... తదుపరి శతాబ్ది లోకి ప్రయాణాన్ని ‘సంఘ్’ నేడు ప్రారంభించింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యాన్ని సాకారం చేసుకోవడంలో సంఘ్ కృషి కీలకం. మరోసారి ప్రతి స్వయంసేవకుడికీ నా శుభాకాంక్షలు. నరేంద్ర మోదీభారత ప్రధాని -
ఆయన మార్గం నిత్యనూతనం
‘నువ్వు ఏం చేయాలి అని సందిగ్ధానికి లోనయినప్పుడు, జీవితంలో నీకు తారసపడ్డ అత్యంత నిరుపేద, నిస్సహాయుడి ముఖాన్ని గుర్తు తెచ్చుకొని, ఇప్పుడు నీవు తలపెట్టిన పని అతనికి ఏవిధంగా నైనా సాయపడుతుందా? తన బ్రతుకు తాను బ్రతకడానికీ, తన జీవితం సఫలం చేసుకోవడానికీ నువ్వు చేయబోయే పని అతని కేమైనా ఊతమిస్తుందా అని ఆత్మావలోకన చేసుకో, కర్తవ్యం నీకు బోధపడుతుంద’న్న గొప్ప జీవన సందేశాన్ని ఇచ్చినవారు మహాత్మా గాంధీజీ. గాంధీజీ ప్రత్యేకత ఏమిటంటే... తాను చెప్పిన విషయాన్ని తాను స్వయంగా ఆచరించిన తర్వాతనే చెప్పేవారు. ఇతరులు ఎలాంటి వారైనా, మన పట్ల ఎంతటి ద్వేషభావన కలిగి ఉన్నా... మన ప్రవర్తన ద్వారా ఎదుటివారిలో మానవతను కలిగించేలా నడుచుకోవాలని ఉద్బోధించారు. ఆ ప్రకారమే పాలకులలో పరి వర్తన తీసుకురావడానికి ‘సత్యాగ్రహం’, ‘అహింస’, ‘సత్యం’ అనే మూడు ప్రధాన ఆయుధాలను ఉపయోగించుకొని జాతీయో ద్యమాన్ని మరో మలుపు తిప్పారు.అహింసాయుతంగా, మౌనంగా పోలీసులు లాఠీలతో కొడుతున్నా భరిస్తూ తమ నిరసనను తెలియజేసే ‘సత్యాగ్రహం’ ఆయుధాన్ని గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రయోగించి అనేక విజయాలు సాధించారు. గోపాలకృష్ణ గోఖలే కోరిక మేరకు దేశంలో అప్పటికే కొనసాగుతున్న జాతీయోద్యమంలో పాల్గొనడానికి భారత దేశానికి గాంధీజీ తిరుగు ప్రయాణం అయినప్పుడు దక్షిణాఫ్రికాకు చెందిన సైనికాధికారి జనరల్ ‘గిల్బల్ట్ ముర్రే’ బ్రిటీష్వారిని ఇలా హెచ్చరించాడు: ‘గాంధీకి సుఖాపేక్ష లేదు, ధనాపేక్ష లేదు; కామం, మోహం లేవు. తాను ధర్మం అని నమ్మిన దానిని ఆచరించడానికి ఎంత దూరమైనా వెళతాడు. అందువల్ల గాంధీ విషయంలో తగిన జాగ్రత్త వహించాలి. అటువంటి వ్యక్తి దేహంపై మీరు విజయం సాధించవచ్చునేమో గానీ, అతని వ్యక్తిత్వాన్ని జయించడం అసాధ్యం. గాంధీ మీకు ప్రమాదకరమైన చిక్కులు తెచ్చి పెట్టే శత్రువు అవుతాడు’. గిల్బర్ట్ చేసిన ఈ హెచ్చరిక ఎంత నిజమో ఆ తర్వాత కాలంలో భారతదేశంలోని బ్రిటిష్ పాలకులకు అనుభవంలోకి వచ్చింది.ఒక సందర్భంలో గాంధీ తన ‘యంగ్ ఇండియా’ పత్రికలో ఇలా రాశారు: ‘‘నా భావాలు మారుతూ ఉంటాయి. సత్యాన్వేషణలో నేను అనేక విశ్వాసాలను వదులుకొన్నాను. కొత్త విశేషాలు తెలుసు కొన్నాను. సత్యమే నా దేవుడు. అందువల్ల ‘వెనుక చెప్పిన వాటికి, ఇప్పుడు చెప్పేవాటికి పొంతన లేకుండా ఉన్నదే...’ అని నన్ను విమర్శించే బదులు, నేను ఇటీవల చెప్పిన మాటనే గ్రహించమని కోరుతున్నాను’ అంటూ వివరణ ఇచ్చారు. నిరాడంబరతకు చిహ్నంగా నిలిచారు గాంధీజీ. 1921 సెప్టెంబర్ 27న గాంధీజీ ఇతర దుస్తులన్నీ విసర్జించి భారతీయులుధరించే కొల్లాయిగుడ్డ, ఉత్తరీయానికి తన దుస్తుల్ని పరిమితం చేసుకొన్నారు. బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్తో చర్చలు జరప డానికి ఇంగ్లాండ్కు అదే వేషధారణతో వెళ్లిన గాంధీని బ్రిటీష్ పాలకులు ‘హాఫ్ నేక్డ్ ఫకీర్’ (అర్ధనగ్న సన్యాసి) అని అవహేళన చేసినప్పుడు గాంధీ చిరునవ్వు నవ్వి ‘మీరు చూడాల్సింది నా దుస్తులు కాదు... నేను మోసుకొచ్చిన కోట్లాది భారతీయుల ఆకాంక్ష’ అని చెప్పి, వారు సిగ్గుతో తలవంచుకొనేలా చేశారు. గాంధీజీ ప్రవచించి ఆచరించిన ఉన్నత మార్గాలలో ‘అహింసా మార్గం’ ఒక్కటే ‘ప్రపంచశాంతిని’ నెలకొల్పగలదని అన్ని సందర్భా లలో రుజువయ్యింది. గాంధీ బోధనలు, సత్యాన్వేషణకై ఆయన వేసిన మార్గాలు ఎప్పటికీ నిత్యనూతనం!– డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసనమండలి సభ్యులు( అక్టోబరు 2- గాంధీ జయంతి) -
చేటు తెచ్చిన అనుభవ రాహిత్యం
తమిళనాడులోని కరూర్ పట్టణంలో ఓ కూడలి వద్ద సెప్టెంబర్ 27 రాత్రి సంభవించిన తొక్కిసలాటలో 41 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో గాయ పడిన జనం పదుల సంఖ్యలో ఆసు పత్రిలో చికిత్స పొందుతున్నారు. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన హీరో, ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అధ్యక్షుడు అయిన విజయ్ ర్యాలీకి 27,000 మందికి పైగా హాజరైనపుడు ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆయన రాక ఏడు గంటలు ఆలస్యమై, సభ రాత్రి 7.30 గంటలకు మొదలైంది. అప్పటి వరకు విజయ్ కోసం ఉత్సుకతతో వేచి ఉన్న అభిమానులు ఒక్కసారిగా తోసుకోవడంతో తొక్కిసలాటలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నామక్కల్లో సభ ముగించుకుని కరూర్ వచ్చేందుకు విజయ్కి అన్ని గంటల సమయం ఎందుకు పట్టిందని కొందరు అంటున్నారు.పోలీసులు కేటాయించిన స్థలమే!విజయ్ కరూర్ సభకు ఎంతమంది తరలిరాగలరో అంచనా వేయడంలో పోలీసులు విఫలమయ్యారా... అన్నది సహజంగానే ఇక్కడ తలెత్తే ప్రశ్న. రాజకీయంగా తనను ఎదగనీయకుండా చేసేందుకు పోలీసులు అవరోధాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విజయ్ చేస్తున్న ఆరోపణలతో తమిళనాడు పోలీసులు గత కొద్ది నెలలుగా ఆత్మరక్షణ ధోరణిని అనుసరిస్తున్నారు. కొన్ని వారాల క్రితం తిరుచిరాపల్లిలో విజయ్ రోడ్ షో నిర్వహించినపుడు పట్టణంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాంతో సభా నిర్వహణ కోసం కరూర్లో విజయ్ ఎంచుకున్న రెండు ప్రదేశాలకు పోలీసులు అను మతి నిరాకరించారు. అవి జన సమ్మర్ధంతో కిటకిటలాడే వాణిజ్య స్థలాలు కావడమే అందుకు కారణం. అందుకే ఆ రెండూ కాకుండా, కొద్ది రోజుల క్రితం అన్నా డి.ఎం.కె నాయకుడు ఎళప్పాడి పళని స్వామి సభ నిర్వహించిన కరూర్లోని మరో ప్రదేశాన్ని పోలీసులు విజయ్ సభకు కేటాయించారు. టీవీకే మొదట ఎంచుకున్న ఆ సభా ప్రాంతాలు రెండింటికీ ఇది కూడా దగ్గరలోదే కావడంతో పార్టీ అందుకు వెంటనే అంగీకరించింది. ఏర్పాట్లలో తడబడుతున్న టీవీకేకాగా, తాజా ఘటన రాజకీయంగా, సంస్థాగతంగా టీవీకేకు కొరవడిన సామర్థ్యాన్ని బహిర్గతం చేసింది. పుదుచ్చేరి మాజీ ఎమ్మెల్యే ఎన్. ఆనంద్ ఒక్కరే టీవీకేలో రాజకీయంగా అనుభవం ఉన్న నాయకుడు. ఆయన గతంలో వివిధ కాంగ్రెస్ చీలిక వర్గాలలో పనిచేశారు. ఇటువంటి విషయాల్లో ఏ రాజకీయ పార్టీలోనైనా జిల్లా కార్యదర్శులు ముఖ్యపాత్ర వహిస్తారు. వారు సాధారణంగా అట్ట డుగు స్థాయి సంబంధాలు కలిగినవారై ఉంటారు. అయితే టీవీకేలో విజయ్ అభిమాన సంఘాలలోని ప్రీతిపాత్రులే ఆ భూమిక నిర్వ హిస్తున్నారు. సభలకు తగిన ఏర్పాట్లు చేయడంలో వారు తడబడు తున్నారు. తమ సభలకు సుమారు పది వేల మంది హాజరు కావచ్చని అంచనా వేస్తున్నట్లు వారు పోలీసులకు చెబుతున్న సంఖ్య కూడా తక్కువగానే ఉంటోంది. ఇలాంటి సభలప్పుడు సాధారణంగా పార్టీలు కొద్దిమంది కార్యకర్తలకు డబ్బు పంపిణీ చేసి ఆహారం, నీరు సమకూర్చే ఏర్పాట్లు చేస్తూంటాయి. కాగా, సభలకు హాజరైన జనాన్ని అదుపులో ఉంచి, నియంత్రించవలసిన అవస రాన్ని ఇప్పటికే అనేక తమిళ పార్టీలు గుర్తించాయి కూడా! రాజీవ్ గాంధీ హత్యోదంతంతో తమిళనాడు ఈ చేదు పాఠాన్ని నేర్చు కోవాల్సి వచ్చింది. టీవీకే తన తరహాలో నిర్వహిస్తున్న రోడ్ షోల లాంటివి మాత్రం తమిళనాడు రాజకీయాలకు కొత్త. అప్పటి ‘సినీ–నాయకులు’ వేరు!గతంలో జయలలిత, కరుణానిధి కూడా వాహనాలలో రాష్ట్ర హైవేలలో ప్రయాణించినా ముందుగా నిర్ణయించిన చోట్ల మాత్రమే వారు వాహనాలను ఆపి ప్రసంగించేవారు. కొద్ది వేల మందిని ఉద్దే శించి ప్రసంగించి మరో చోటుకు బయలుదేరేవారు. పైగా, వారు జనాలు వేచి చూసేటట్లు చేసేవారు కాదు. నిర్హేతుకమైన జాప్యాలకు అవకాశమిచ్చేవారు కాదు. మొన్నటి ఘటనలో అంబులెన్సుల రాకకు సంబంధించిన శబ్దాలు వినిపిస్తున్నా విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగించడం కూడా ఆయన రాజకీయ అనుభవ రాహి త్యాన్ని సూచించింది. ఏం జరుగుతోందో ఎవరూ ఆయన చెవిన వేసినట్లు లేదు. పరిస్థితి తీవ్రతను గమనించిన వెంటనే ఆయన అక్కడ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. తిరుచిరాపల్లిలో ప్రైవేటు విమానం ఎక్కి, రెండు గంటల్లోపల చెన్నైకి చేరుకున్నారు. ఆయనతో పాటే టీవీకే సభ్యులు కూడా సభా ప్రాంగణం నుంచి నిష్క్రమించారు. పోలీసుల ఎఫ్.ఐ.ఆర్కు ఎక్కిన కొందరు పరారీలో ఉన్నారు. ‘‘కక్ష ఉంటే నాపై తీర్చుకోండి!’’ఈ అవకాశాన్ని అధికార డి.ఎం.కె పార్టీ సద్వినియోగం చేసుకు న్నట్లే కనిపిస్తోంది. కరూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన సెంథిల్ బాలాజీ ఆ సమయంలో నియోజకవర్గంలోనే ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చింది. అయితే సెంథిల్ బాలాజీ ఆస్పత్రికి చేరుకోక ముందే, కరూర్ మాజీ ఎమ్మెల్యే అన్నా డి.ఎం.కె నాయకుడు ఎం.ఆర్. విజయ్ భాస్కర్ బాధితులను పరామర్శించటం ప్రారంభించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా శనివారం అర్ధరాత్రికల్లా కరూర్ చేరు కున్నారు. స్టాలిన్ కుమారుడు, ఆయన వారసత్వాన్ని అందుకుంటాడని భావిస్తున్న ఉదయనిధి కూడా ఆదివారం ఉదయానికల్లా కరూర్లో వాలారు. అయితే విజయ్కి మాత్రం ఈ ఘటనపై క్షమా పణ కోరుతూ బహిరంగ ప్రకటన చేయడానికి 12 గంటలకు పైగా పట్టింది. ఇక, తాజాగా నిన్న (సెప్టెంబరు 30) విడుదల చేసిన ఒక వీడియోలో, ‘‘నా జీవితంలో ఇంతటి బాధాకరమైన రోజు వస్తుందని ఊహించ లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది. నా గుండె ముక్కలైపోయింది. మాటలు రావటం లేదు. కరూర్ తొక్కిసలాట ఘటనలో నిజానిజాలు త్వరలోనే బయటపడతాయి. నాపై కక్ష ఉంటే తీర్చుకోండి. నా అభిమా నులపై కాదు’’ అని కూడా విజయ్ ఆ వీడియోలో అన్నారు. వచ్చే ఏడాది (2026) ఎన్నికలకు సమాయత్తమవుతున్న విజయ్కి ఈ సంఘటన పెను విఘాతమేనని చెప్పాలి. ఘటనపై ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి నేతృత్వంలో ఏకసభ్య విచారణ సంఘాన్ని నియమించ డాన్ని టీవీకే, అన్నా డి.ఎం.కెలు తోసిపుచ్చాయి. సి.బి.ఐతో దర్యాప్తు జరిపించాలని అవి డిమాండ్ చేస్తున్నాయి.హీరో... నాయకుడిగా మారాలిఎం.జి. రామచంద్రన్, జయలలితలు కూడా సినీ రంగం నుంచి వచ్చినవారే అయినా, ఎమ్జీఆర్కు ద్రవిడ ఉద్యమ నేపథ్యం ఉంది. జయలలిత చాలా ఆటుపోట్లను తట్టుకుని ఎంజీఆర్ చెంత రాజకీయంగా సుశిక్షితురాలిగా మారారు. తాజా ఘటన నేపథ్యంలో విజయ్ తనను తాను పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆయనకు లక్షల మంది అభిమానులున్నమాట నిజమే. అయితే ప్రజలు ఓటు వేయాలని కోరుకునే రాజకీయ నాయకునిగా ఆయన రూపాంతరం చెందాల్సి ఉంది. ఇక ఆయన రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి తిరిగి ఎప్పుడు బయలుదేరుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. భవిష్యత్ పరిణామాలు వెండితెరపై కాక, రాజకీయ యవనికపైనే ఆవిష్కృతం కానున్నాయి. నిరుపమా సుబ్రమణియన్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పుడమితల్లికి నీరాజనం
మానవుడు పుడమి తల్లి ముద్దుబిడ్డ. ఆమె అతగాడికి కన్నతల్లి కంటె మిన్న. తల్లి తన బిడ్డలనందరినీ సమానంగానే ప్రేమిస్తుంది. కానీ ప్రతి బిడ్డతోనూ ఆమె అనుబంధం ప్రత్యేకం. తన బిడ్డలలో అందరికంటె ఎక్కువ చురుకుతనమూ, బుద్ధిబలమూ, కార్యకుశలతా, ప్రయోజకత్వమూ ఉన్న మానవుడిని చూస్తే, పుడమితల్లి గుండె ఒకింత గర్వంతో పొంగితే... అది సహజమే. తన మేధతో, కృషితో,సృజన శక్తితో తల్లి అందించిన వనరుల విలువను మరింత చేయగల మహత్తరమైన శక్తి మనిషికి ఉంది. ఆమె నీటినిస్తే, అతగాడు దానిని ఇంకని, తరగని, శోభాయమానమైన జలాశయాలుగా మారుస్తాడు. ఆమె పచ్చి దినుసులు ప్రసాదిస్తే, అతడు వాటిని పంచభక్ష్య పరమాన్నాలుగా మార్చగలడు. ఆమె పిట్టపాట వినిపిస్తే, అతడు ఆ జాడలో మరింత శోధించి... భావ, రాగ, లయలతో సమగ్రమైన సంగీత ప్రపంచం సమకూర్చుకోగలడు. ఆమె పువ్వులు ప్రసాదిస్తే, అతడు వాటితో అద్భుతమైన ‘బతుకమ్మ’ సంబరాలు సృష్టించగలడు! ఆమె ప్రసాదించిన పూలకు తన బహుముఖమైన కళాత్మకత జోడించి, పువ్వుల పండగ జరిపి, ఆమెకే తిరిగి కన్నుల పండుగనూ, వీనుల విందునూ అందిస్తాడు. పుడమి తల్లి మనసు పులకరింపజేసి రుణం తీర్చుకొంటాడు.బతుకమ్మ సంబరం అంటే సాధారణంగా లభించే వనరులతో అసాధారణమైన అందాల పుష్పాకృతులను అమర్చి చేసే నేత్రోత్సవం. నిసర్గ సౌందర్యం తొణికిసలాడే అమ్మలక్కల ఆటల నృత్యోత్సవం. కృత్రిమత లేని పల్లె పడతుల పాటల తీపిని శ్రవణపేయంగా చెవులకు చేర్చే కర్ణోత్సవం. ఆత్మీయతలతో అలరారే, ఆదర్శమైన, సౌహార్ద విలసితమైన, సామాజిక జీవన మాధుర్యానికి అద్దం పట్టే సందర్భం. వికసితమైన బుద్ధిగల మానవుడు, తన వికాసానికి అన్నివిధాలా ఆధారభూతమైన ప్రకృతి మాత పట్ల ప్రగాఢమైన కృతజ్ఞతను ప్రదర్శించే వార్షికోత్సవం. సౌందర్యోపాసనలోనూ, పర్యావరణం పట్ల బాధ్యతలోనూ, సామాజిక సామరస్యం పట్ల నిబద్ధతలోనూ, తన ప్రత్యేకత ప్రదర్శిస్తూ, మనిషి వినయంగా మట్టితల్లికి సమర్పించే సాష్టాంగ ప్రణామం.– ఎం. మారుతి శాస్త్రి -
మనసులను వేరు చేసి చూడలేం!
నిజాయతీపరుడైన, ఉన్నతమైన భారతీయుడు ఎవరూ పాకిస్తాన్ను సొంత ఇంటిగా భావించడం ఇక ఎంత మాత్రం అంగీకార యోగ్యమైన విషయం కాదా? మనలో కోట్లాది మంది నేడు పాకిస్తాన్గా భావిస్తున్న రాష్ట్రాలలో పుట్టినవాళ్లమే. ఆ రోజుల్లో, మాకు తెలిసిన సొంత ప్రాంతం అదే. నా తల్లితండ్రులు, సోదరీమణులు, నా దగ్గరి బంధువులలో చాలా మంది అక్కడే జన్మించారు. మా అమ్మ తొంభై ఏళ్ల వయసులో సొంతూరు వెళ్లాలని కోరుకున్నప్పుడు లాహోర్ పేరు చెప్పింది కానీ, జీవించిన ఛతర్పుర్ కాదు. ఛతర్పుర్లో పొలాలు గట్రా ఉన్నా ఆమెకు ఠక్కున లాహోర్ గుర్తుకొచ్చింది. పిట్రోడా మాటలపై వివాదంపాకిస్తాన్లో ఉండగా తనకు సొంత ఇంటిలోనే ఉన్నట్లు అని పించిందని శామ్ పిట్రోడా ఇటీవల మనసులో మాట చెప్పేసి నప్పుడు, పిట్రోడాకు దేశభక్తి లేదంటూ ఎన్డీటీవీ ఆయనపై విమర్శ లతో ఊదరగొట్టేసింది. ‘‘నేను ఈమధ్య పాకిస్తాన్ వెళ్లొచ్చాను. నాకు అక్కడ నా సొంత ప్రాంతంలో ఉన్నట్లు అనిపించిందని నేను మీకు చెప్పి తీరాలి’’ అని ఆయన అన్నారు. ‘‘నేను బంగ్లాదేశ్ వెళ్లాను. నేపాల్ కూడా వెళ్లొచ్చాను. రెండు చోట్లా సొంత ప్రదేశంలో ఉన్నట్లే అనిపించింది’’ అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ టీవీ ఛానల్లో ప్రసారమైన ఇరవై ఐదు నిమిషాల న్యూస్ బులెటిన్లో పదిహేను నిమిషాలకు పైగా సమయాన్ని హానికరం కాని, భంగ కరంకాని ఆ వ్యాఖ్యను తూర్పారబట్టడానికే కేటాయించారు. బి.జె.పి అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆయనను పరుషమైన పదజాలంతో నిందించారు. నేపాల్, బంగ్లాదేశ్లలో కూడా సొంతూ రులో ఉన్నట్లుగానే ఉందన్న శామ్ పిట్రోడా మాటలను పూనావాలా సమయానుకూలంగా విస్మరించారు. మనసులను తాకిన అద్వానీ వాస్తవం ఏమిటంటే, ఎల్.కె. అద్వానీ సొంత ప్రాంతం కూడా పాకిస్తానే! ఆయన పుట్టింది, చదువుకుంది కరాచీలోనే! పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా 2005లో ఖుర్షీద్ కసూరీ ఉన్నపుడు పాకిస్తాన్ సందర్శనకు రావాల్సిందిగా అద్వానీని ఆహ్వానించారు. అద్వానీకిఆ ఆహ్వానం సంగతి చెప్పి, ఆయన స్పందన ఏమిటో తెలుసుకుని చెప్పవలసిందిగా నన్ను కోరారు. ‘‘దానిదేముంది? సంతోషంగా వెళ్లి రావచ్చు. నాకు నా కుటుంబ సభ్యులను కూడా వెంట బెట్టుకుని వెళ్లాలని ఉంది’’ అని అద్వానీ అన్నారు. అలాగే, అద్వానీ వెంట ఆయన కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. పాకిస్తాన్కు బయలు దేరేటపుడు అద్వానీ చేసిన ప్రకటన, తాను జరపబోయే ఆ పర్యటన తనకు ఎంత ముఖ్యమైనదో స్పష్టంగా వెల్లడించింది. ‘‘వ్యక్తిగత స్థాయిలో ఈ పర్యటన నాకు ప్రగాఢమైన ప్రాధాన్యం కలిగినది. కరాచీలో పుట్టి పెరిగినవాడిని కనుక, ఈ సందర్శన, నాకు మూలా లకు తిరిగి వెళ్లటం లాంటిది. ఈ రెండు దేశాలు సుస్థిరమైన శాంతితో సాగే మార్గాన్ని ఆ పరమాత్మ చూపాలని నేను ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను’’ అని ఆయన అన్నారు. అయితే, లాహోర్లో అద్వానీ అన్న మాటలను నేను ఎన్నటికీ మరచిపోను. ‘‘ప్రతి భారతీ యుడి మనసులో కొద్దిపాటి పాకిస్తాన్, ప్రతి పాకిస్తానీ హృదయంలో కొద్దిపాటి ఇండియా ఉంటాయని నేను ఎప్పుడూ విశ్వసి స్తాను’’ అని ఆయన అన్నారు. అది మనసును తాకే వాస్తవం. ముఖ్యంగా పంజాబీలు, బెంగాలీలకు సంబంధించినంత వరకు కాదనలేనిది. ఈరోజుల్లో అయితే, ఎన్డీటీవీ, అద్వానీని కూడా ఏకి పారేసి ఉండేది. దాని జాతీయతావాద చెవులకు ఆ మాటలు దేశ ద్రోహంతో సమానంలా అనిపించేవి. అదృష్టవశాత్తూ, ప్రణయ్ రాయ్ ఆధ్వర్యంలో 2006లో అది చాలా భిన్నమైన ఛానల్లా ఉండేది. ఒకేలా అనిపించటం సహజమే!నా సంగతి కూడా చెప్పనివ్వండి. నేను 1980లో మొదటిసారి పాకిస్తాన్ సందర్శించాను. ఆ తర్వాత చాలాసార్లు వెళ్లివచ్చాను. వెళ్లిన ప్రతిసారీ నాకు పూర్తిగా సొంత ఇంటిలోనే ఉన్నట్లే అని పించింది. వారి పంజాబ్లో భాష, ఆహారం, సంప్రదాయాలు, ఆచారాలు, ఇళ్లు, ప్రజా జీవనవిధానానికి మనకు తేడా ఏమీ లేదు. రెండింటినీ వేరు చేసి చూడలేం. అవే రకమైన మాటలతో శపిస్తాం లేదా అక్కున చేర్చుకుంటాం. అదే వైచిత్రి. తమిళులు, మలయాళీలు లేదా కన్నడిగులు సగటు పాకిస్తానీయులకు అపరిచితులుగా కనిపించవచ్చు. ఢిల్లీ, శ్రీనగర్లలో ఉన్నవారు కూడా అలానే అనిపించ వచ్చు. కానీ, అమృత్సర్, లూధియానాలలో ఉన్నవారు మాత్రం కాదు. పాకిస్తాన్ గురించి భారతీయుల తలపులు కూడా కొంత వరకు అదే రకంగా ఉంటాయని చెప్పవచ్చు. వారు మన దేశంలోని ఏ ప్రాంతానికి చెందినవారు అనే దానిపైనే అది ఆధారపడి ఉంటుంది. ఇటానగర్లో ఉండేవారికి కనిపించే సారూప్యం చాలా తక్కువ. అలీగఢ్లో ఉండేవారికి పెద్దగా తేడా ఏమీ ఉండదు. అర్థం చేసుకోవచ్చు... కానీ!ఇటీవల దుబాయ్లో భారతీయ క్రికెట్ జట్టు ప్రవర్తన చిన్నపిల్లల మాదిరిగా, క్రీడా స్ఫూర్తి కొరవడినదిగా కనిపించింది. ముఖ్యంగా నన్ను వేదనకు గురి చేసింది. పాకిస్తాన్ జట్టుతో కరచాలనం చేసేందుకు వారు తిరస్కరించడం క్రికెట్ అనిపించుకోదు. కరచాలనం అనే బ్రిటిష్ పదబంధానికి అర్థం ఏమైనా ఉందీ అంటే, తప్పకుండా దానిలోకి, రీతి రివాజులకు సంబంధించిన తేలికపాటి మర్యాదలు, సత్ప్రవర్తన కూడా రాకుండా ఉంటాయా? తప్పక పాటించవలసిన చక్కని నడవడికను పక్కన పెట్టాలని భారత జట్టు తీసుకున్న నిర్ణయంతో మన విజేతలు చిన్నవాళ్లుగా కనిపించారు. పహల్గావ్ు ఉగ్రదాడి అనంతరం పాకి స్తాన్తో ఆడకూడదని కోరుకోవడాన్ని నేను అర్థం చేసుకోగలను. మైదానంలో అవతలి జట్టు ఎదురుగా నిలవడం ఇష్టం లేక ఒక ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి భారత్ తిరస్కరించడం ఇది మొదటిసారేమీ కాదు. దక్షిణాఫ్రికాతో ఆడడం ఇష్టం లేక 1974లో డేవిస్ కప్లో ఏకంగా ఫైనల్స్నే త్యజించడం ఇందుకు కలకాలం గుర్తుండే ఉదాహరణ. కానీ, ఒకసారి ఆడడానికి అంగీకరించిన తర్వాత, ప్రత్యర్థులతో కరచాలనం చేయడం ఆచారమే కాదు, నాగరికత అని కూడా అనిపించుకుంటుంది. మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెబుతున్నా, ఆ అంశంపై ఎవరూ దృష్టి సారించకపోవడం నన్ను ఆశ్చర్యపరచింది. అలాగే, పాక్లో ఉన్నపుడు సొంత ఇంటిలోనే ఉన్నట్లుగా అనిపించిందని శామ్ పిట్రోడా అన్నందుకు, ఆయనని ఏకిపారేయడం కూడా నన్ను అంతే ఆశ్చర్యపరచింది. నిజం చెప్పాలంటే, నా దేశస్థుల గురించి నేను తెలుసుకుంటున్న కొద్దీ నాలో ఆశ్చర్యం పాలు ఎక్కువ అవుతోంది!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
శశి థరూర్, (కాంగ్రెస్ ఎంపీ) రాయని డైరీ
ఆటలో– ‘పడని’వాళ్లు ఉండరు. తలపడవలసిన వాళ్లు మాత్రమే ఉంటారు. రాజకీయాలైనా అంతే. గెలుపు కోసం ఆటలోకి దిగినవాడు యోధుడైతే, ఓడించటానికే ఆడేవాడు మహాయోధుడు! శ్రీ మోదీజీ నాకెప్పుడూ యోధుడిలా అనిపించరు. అన్నీ బయటికే అనలేం. కొన్ని అనకుండానూ ఉండలేం. నేను ఉన్నది కాంగ్రెస్ పార్టీలో కనుక, మా వైపూ యోధానుయోధులు ఉండే ఉంటారు కనుక, మోదీజీని నేను ‘మహాయోధుడు’ అనకూడదు. అనకూడదు కానీ, అనకుండా ఉండలేక పోతున్నాను కనుక, మోదీజీ యోధుడు కాదు అని మాత్రమే అనవలసి వస్తోంది.జట్టులో కెప్టెన్ అంటూ ఒకరు లేరంటే, జట్టులోని ఆటగాళ్లంతా కెప్టెన్కు సమానమైన వాళ్లేనని! ఇది బీజేపీ స్టయిల్. జట్టులోని ఆటగాళ్లంతా కెప్టెన్కు సమానమైన వాళ్లే అయినప్పటికీ, కెప్టెన్ ఎవరో తేల్చుకోలేక పోతున్నారంటే జట్టులో ఎవరి ఆట వారిదేనని! ఇది కాంగ్రెస్ ట్రెడిషన్! ఎప్పటిలా ఆటకు ముందే, తన ఆట మొదలు పెట్టేశారు మోదీజీ! నవంబరులో బిహార్ ఎన్నికలు. మార్చిలో బెంగాల్ ఎన్నికలు. ఏప్రిల్లో తమిళనాడు ఎన్నికలు. బిహార్ క్యాంపెయిన్కు ధర్మేంద్ర ప్రధాన్ని, సి.ఆర్. పాటిల్ని, కేశవ్ ప్రసాద్ మౌర్యని; పశ్చిమ బెంగాల్ క్యాంపెయిన్కు భూపేందర్ యాదవ్ని, విప్లవ్ కుమార్ దేవ్ని; తమిళనాడు క్యాంపెయిన్కు వైజయంత్ పాండాను, మురళీధర్ మొహల్ను పంపిస్తున్నారు మోదీజీ!‘పర్ఫెక్ట్ కాంబినేషన్‘, ‘పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్‘ అని ప్రత్యర్థి జట్టు చేత కూడా అనిపించుకోగలరు ఆయన.బిహార్ వెళ్లే ధర్మేంద్ర ప్రధాన్ యూనియన్ మినిస్టర్. సి.ఆర్. పాటిల్ యూనియన్ మినిస్టర్–కమ్–గుజరాత్ బీజేపీ చీఫ్. కేశవ్ ప్రసాద్ మౌర్య యూపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్.పశ్చిమ బెంగాల్కు వెళ్లే భూపేందర్ యాదవ్ యూనియన్ మినిస్టర్. విప్లవ్ కుమార్ దేవ్ త్రిపుర మాజీ ముఖ్యమంత్రి.తమిళనాడుకు వెళ్లే వైజయంత్ పాండా పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్. మురళీధర్ మొహల్ యూనియన్ మినిస్టర్.ప్రధాన్, యాదవ్... ఓబీసీ ఓట్ల స్ట్రాటజిస్టులు. హర్యానాలో బీజేపీ ప్రధాన్ వల్ల గెలిచింది. మహారాష్ట్రలో యాదవ్ వల్లగెలిచింది. ఇక మౌర్య, దేవ్, పాండా, మొహల్ సముద్రపు గాలుల్నే మలుపు తిప్పగలిగిన నావికులు! కాంగ్రెస్ ఇంకా గంగా నది ఒడ్డునే ఉంది! పట్నాలో జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్లో బిహార్ ఎన్నికల గురించి ఒక వ్యూహం లేదు.బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఊసే లేదు.‘‘85 ఏళ్ల క్రితం ఇక్కడే ఈ సదాఖత్ ఆశ్రమంలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది’’ అనుకున్నారు. ‘‘మళ్లీ ఇన్నేళ్లకు ఇక్కడే సీడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతోంది...’’ అన్నారు. ‘‘85 ఏళ్ల క్రితం అప్పటి ఆ సీడబ్ల్యూసీ మీటింగ్కు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షత వహించారు’’ అనుకున్నారు. ‘‘ఇప్పుడు ఈ మీటింగ్కు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షత వహించారు’’ అన్నారు. ‘‘85 ఏళ్లకు ముందు ఈ ఆశ్రమంలో గాంధీ, నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ వంటి వారు సమావేశం అయ్యేవారు...’’ అనుకున్నారు. ‘‘ఇప్పుడు రాహుల్, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ వంటివారు హాజరయ్యారు’’ అన్నారు.అన్నీ అనుకున్నాక, అన్నీ అన్నాక – ‘‘అది స్వాతంత్య్ర పోరాటం అయితే, ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం’’ అని తీర్మానించి ఎటు వాళ్లు అటు వెళ్లిపోయారు! రెండో స్వాతంత్య్ర పోరాటం, మూడో స్వాతంత్య్ర పోరాటం... అవసరం అయితే ఎన్ని స్వాతంత్య్ర పోరాటాలైనా చేయవలసిందే! కానీ కాంగ్రెస్... గెలిచే పోరాటం చేయటం లేదు, ఓడించే పోరాటమూ చేయటం లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కబడ్డీ జట్టుతో ఆటకు బిలియర్డ్స్ ప్లేయర్స్ని దింపుతూ ఉంటుంది!! -
వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తే ఎలా?
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్, ‘ఇండియా టుడే’ గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్కు తాజాగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత న్యాయ వ్యవస్థలోని పలు కీలక అంశాలను స్పృశించారు. భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ–సవాళ్లు, పౌరుల స్వేచ్ఛ మొదలు – రాజకీయాలతో ముడిపడిన కేసుల విచారణ సమయంలో, ప్రత్యేకించి ఈ సోషల్ మీడియా యుగంలో న్యాయమూర్తులు ఎదుర్కొనే సంఘ ర్షణ వరకు వివిధ సున్నిత అంశాలపై లోతైన దృష్టి కోణాన్ని జస్టిస్ చంద్రచూడ్ ఆవిష్కరించారు. తాను రచించిన ‘వై ది కాన్ స్టిట్యూషన్ మేటర్స్’ అనే కొత్త పుస్తకంలోని విశేషాంశాల ఆధారంగాసాగిన ఈ ఇంటర్వ్యూలో న్యాయస్థానాలపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకతనుజస్టిస్ చంద్రచూడ్ పునరుద్ఘాటించారు. ఆ సుదీర్ఘఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు.భిన్నాభిప్రాయాలపై ఫిర్యాదులు ఓ భయంకర ధోరణి!మనం ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. అభిప్రాయ వ్యక్తీకరణకు సోషల్ మీడియా స్వేచ్ఛా వేదిక. అలాంట ప్పుడు భిన్నాభిప్రాయాలు తప్పవు. కానీ, ఏం మాట్లాడితే కేసు పెడతారోనని సంకోచించే పరిస్థితులు ఉన్నప్పుడు అవి అభిప్రాయ వ్యక్తీకరణపై ప్రభావం చూపుతాయి. తద్వారా మాట్లాడే హక్కుకు భంగం కలుగుతుంది. మన అభిప్రాయం వ్యతిరేకంగా ఉందని, లేదా అనుకూలంగా లేదని ప్రత్యర్థులో, ప్రభుత్వమో భావిస్తే పోలీసులు అరెస్టు చేస్తారేమోనన్న భయం ఉంటుంది. ఇలాంటి భయాలు, సంకోచాలు ఇండియాకు మాత్రమే ప్రత్యేకం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న సమస్యే! మరో వైపు ప్రజా క్షేత్రంలో సైతం అసహనశీలత ఎక్కువైంది. సాధారణంగా ఎవరైనా తమకు నచ్చిందే వినాలనుకుంటారు. ఎవరో కార్టూన్ వేస్తేనో, లేక మరెవరో ప్రకటన జారీ చేస్తేనో, లేదంటే ప్రసంగిస్తేనో... అది ఎవరికో నచ్చకపోతేనో వెంటనే ఫిర్యాదు చేస్తున్నారు. అంతేకాదు, దేశంలోని ఏ ప్రాంతంలోని వారైనా ఫిర్యాదు చేయవచ్చు. ఏకకాలంలో పది వేర్వేరు ప్రాంతాల నుండీ కేసులు నమోదు కావచ్చు. ఇది నిజంగా చాలా భయంకరమైన ధోరణి. మాట్లాడితే మిమ్మల్ని శిక్షించవచ్చు అనే భయం చాలా ఆందోళన కలిగించే విషయం. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. విమర్శలను తప్పు పట్టలేం!అభిప్రాయాలు వ్యక్తం చేసేవారికి కూడా బాధ్యత అవసరం. ముఖ్యంగా – సోషల్ మీడియా ద్వారా ద్వేషం, అసహనం వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున మాటలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. సామాజిక స్పృహను కలిగి ఉండాలి. మన సమాజం బహుళ మతాలు, సంస్కృతుల సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్వేచ్ఛా హక్కు ఉన్నా, మత భావాలను దెబ్బతీయకుండా మాట్లాడాలి. లేకపోతే చట్టపరమైన పరిణామాలు తప్పవు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ఇందుకు ఉన్న సహేతుకమైన పరిమితులను వివరిస్తుంది. అయితే ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడాన్ని మాత్రం తప్పు పట్టలేం. ఇది సానుకూల ఫలితాలకే దోహదం చేస్తుంది.చట్టాల పునఃసమీక్ష అవసరంబ్రిటిష్ ప్రభుత్వం ఇండియాను పాలిస్తున్నప్పుడు చేసిన ‘దేశద్రోహం’ వంటి చట్టాలను నేడు సమీక్షించాల్సిన అవసరం ఉంది. ‘భారత్ ఒక దేశంగా నిలవగలదా?’ అని స్వాతంత్య్రానికి ఆరంభంలో సందేహాలు ఉండేవి. కానీ రాజ్యాంగ నిర్మాణం దేశాన్ని అత్యంత పటిష్ఠంగా ఉంచేలా జరిగింది. ఈ ఏడున్నర దశాబ్దాలలో భారత్ ఒక బలమైన, స్థిరమైన రాజకీయ వ్యవస్థగా అభివృద్ధిచెందింది. కాబట్టి అప్పటి చట్టాలను సమీక్షించాలి. అలాగే ‘పరువు నష్టాన్ని’ క్రైమ్ పరిధి నుంచి తప్పించాలి. ఎందుకంటే, క్రిమినల్ డిఫమేషన్ గురించి కొత్త దృష్టికోణంతో పరిశీలించడం అవసర మనిపిస్తోంది. ఒకవేళ డిఫమేషన్ను క్రిమినల్ చర్యగా కొనసాగించాలంటే కొన్ని పరిమితులను తప్పక ఏర్పరచుకోవాలి. నేర స్వరూ పాన్ని కొత్తగా నిర్వచించాలి. మొత్తం ఈ చట్టాన్ని పార్లమెంట్ తిరిగి పరిశీలించాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను.ప్రజలూ రాజ్యాంగ పరిరక్షకులే!భారత రాజ్యాంగం 75 ఏళ్లుగా దృఢంగా నిలిచి ఉండటం గర్వకారణం. రాజ్యాంగాన్ని సమీక్షించాల్సిన అవసరం లేదు. ఎన్నో సవాళ్లను తట్టుకుని నిలబడింది. ప్రధాన పీఠికకు ఎటువంటి భంగం కలుగకుండా పార్లమెంట్ ఎటూ సవరణలు చేస్తుంటుంది. కాలానికి తగ్గట్లు కోర్టులూ సూచనలు చేస్తుంటాయి. అందుకే రాజ్యాంగం సాధారణ చట్టం తరహాలో కాకుండా తరతరాల శాశ్వత విలువలను ప్రతిబింబిస్తుంది. డాక్టర్ అంబేడ్కర్ చెప్పినట్లు, రాజ్యాంగ ఫలితం దానిని అమలు చేసే వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. కేవలం న్యాయవ్యవస్థ, ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రజలకూ రాజ్యాంగ పరిరక్షణలో బాధ్యత ఉంది.గత తీర్పుల సమీక్ష సహజం!మన పాలనలో లోపాలున్నప్పటికీ ఆ పాలనను పూర్తిగా తిర స్కరించాలనడం సరికాదు. విధానాల్లో అపసవ్యతలు ఉన్నప్పటికీ మన దేశం సాధించిన ఎన్నో విజయాలను కూడా గుర్తించాలి. హక్కుల సాధనలో మనం గొప్ప ముందడుగు వేశాం. ఇది మనం అంగీకరించవలసిన అంశం. అవసరాలకు అనుగుణంగా గత తీర్పుల సమీక్షలు ఎలాగూ జరుగుతుంటాయి. ఉదాహరణకు అత్యవసర పరిస్థితుల్లో ‘జీవించే హక్కు’ను తాత్కాలికంగా నిలిపే యవచ్చు’ అని ఏడీఎం జబల్పూర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును ఆ తర్వాత ఉపసంహరించుకోవటం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఏ సమాజ చరిత్రలోనైనా ఉంటుంది. జైలు కాదు... బెయిల్ ముఖ్యం!ఉపా (ఉగ్రవాద కార్యకలాపాలు), పీఎంఎల్ఏ (మనీ ల్యాండ రింగ్) వంటి కొన్ని నిరోధక చట్టాల విషయంలో బెయిళ్లకు చాలా కఠినమైన నియమాలు అమలవుతున్నాయి. ఇది ఒక సమస్యే. న్యాయవ్యవస్థలోని అసలు సూత్రం ఏమిటంటే.. ‘ఆరోపణ నిరూ పణ అయ్యేంతవరకు ఒక వ్యక్తి నిర్దోషే’నన్నది. జస్టిస్ కృష్ణ చెప్పి నట్లు.. ‘బెయిలు నియమం కావాలి, జైలు మినహాయింపు అవాలి.’ (బెయిల్ మస్ట్ బి ది రూల్.. జైల్ మస్ట్ బి ఎక్సెప్షన్ ). ఏదైనా కేసులో అరెస్టయిన వ్యక్తి ప్రతి వాయిదాకు, అవసరమైనప్పుడూ, కోర్టు ముందుకు హాజరయ్యే హామీ ఇస్తే బెయిల్ ద్వారా ఆ వ్యక్తిని తాత్కా లికంగా విడుదల చేయవచ్చు. కోర్టులు వ్యక్తి స్వేచ్ఛను కాపాడాలి!జస్టిస్ సూర్యకాంత్ ఒక ప్రతిష్ఠాత్మకమైన తీర్పు ఇచ్చారు. నిర్దిష్ట సమయంలో విచారణ ముగియకపోతే కఠిన చట్టాలు ఉన్నా బెయిల్ను మంజూరు చేయవచ్చు. ఉదాహ రణకు ఒక కేసులో 100 మంది సాక్షులు ఉన్నారు. వారందరి విచారణకు 5–7 సంవ త్సరాలు పడుతుంది. ఈ కేసులో నింది తుడు చివరకు నిర్దోషిగా తేలితే అప్పటి వరకు దాదాపు ఐదు సంవత్సరాలు జైల్లో ఉండటం అన్యాయం. అందుకే ఆర్టికల్ 21 కింద వ్యక్తిగత స్వేచ్ఛను కోర్టులు సంరక్షించాల్సిన అవసరం ఉంది. సాక్షులను ప్రభా వితం చేసే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తప్ప నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడం జిల్లా కోర్టుల నుండి సుప్రీంకోర్టు వరకు అన్నిటి బాధ్యత.బెయిల్పై భిన్నమైన తీర్పులు తగ్గాలి!బెయిల్ మంజూరు విషయంలో భిన్నత్వం నిజమే. కానీ సుప్రీంకోర్టులో ప్రతి సంవత్సరం 70 నుంచి 80 వేల కేసులు దాఖలవుతున్నాయి. 34 మంది జడ్జీలు ఒకే సారి ఒకే కేసును విచారించలేరు కనుక ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులున్న బెంచ్లుగా విభజించడం జరుగు తుంది. ఫలితంగా వ్యక్తిగత న్యాయమూర్తుల ఆలోచనల వల్ల తీర్పుల్లో భిన్నాభిప్రాయాలు వస్తాయి. అందువల్ల బెయిల్స్ విష యంలో భిన్నమైన తీర్పులు వెలువడవచ్చు. ఈ భిన్నత్వాన్ని తగ్గించ వచ్చు కానీ పూర్తిగా నివారించడం సాధ్యం కాదు. అయితే వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన బెయిల్ విషయంలో మాత్రం ఏ బెంచ్కైనా ఒకే విధమైన ప్రాధాన్యత ఉండాలి. సుప్రీంకోర్టు నుండి హైకోర్టు లకు, అక్కడి నుండి జిల్లా కోర్టులకు ఈ సందేశం చేరాలి.వెనకాడుతున్న జిల్లా కోర్టులు!మన జిల్లా కోర్టులు బెయిల్ ఇవ్వాల్సిన కేసులలో కూడా ఇవ్వడం లేదు. ఫలితంగా ఏమవుతోందంటే... జిల్లా కోర్టు ద్వారా బెయిల్ సాధ్యమయ్యే కేసులు కూడా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు వరకు వెళ్తాయి. ఇందులో పలు ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి. మొదటిది ఆలస్యం. జిల్లా కోర్టు నుండి హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టు వరకు కేసును తీసుకెళ్లేటప్పుడు తీవ్ర జాప్యం జరుగుతుంది.రెండవది వనరులు. ప్రతి ఒక్కరికీ సుప్రీంకోర్టు వరకు వెళ్లే వనరులు ఉండవు. వనరులు లేకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లలేకపోవచ్చు. మూడవది ఇలాంటి వ్యవస్థ సుప్రీంకోర్టుపై అనవసర పనిభారాన్ని మోపుతుంది. ఇది భారతదేశంలోని సంక్లిష్టత, వైవిధ్యం, కేసుల పరిమాణాన్ని సూచిస్తుంది. న్యాయమూర్తుల సంఖ్య పెంచడంకంటే సుప్రీంకోర్టుకు వచ్చే కేసులను పరిమితం చేయడం అవసరం. ప్రభుత్వం అతి పెద్ద కక్షిదారు కావడం వల్ల కేసుల భారమూ అధిక మవుతోంది. కాబట్టి సంస్థాగత సమీక్ష అవసరం. పదవీ విరమణ వయసు పెంచాలి!న్యాయమూర్తులకు పదవీ విరమణ వయసు ఉండాల్సిందే. అయితే ఆ వయఃపరిమితిని పెంచవలసిన అవసరం కూడా ఉంది. అలాగని అమెరికా సుప్రీంకోర్టు తరహాలో న్యాయమూర్తులు ఎప్ప టికీ పదవిలో కొనసాగడమనే పరిస్థితి ఉండకూడదు. కొత్త తరానికి అవకాశం రావాలి. ఇండియాలో ప్రస్తుత పదవీ విరమణ వయసు (జిల్లా జడ్జిలు 60, హైకోర్టు జడ్జిలు 62, సుప్రీంకోర్టు జడ్జిలు 65) తక్కువనే చెప్పాలి. సగటు జీవన ప్రమాణం పెరిగినందు వల్ల విరమణ వయసులనూ పెంచాలి. హైకోర్టు, సుప్రీంకోర్టుకు వేర్వేరు వయసులు ఉండకూడదు. అందరికీ సమానంగా 68 చేయాలి. దాని వల్ల సుప్రీంకోర్టుపై కేసుల ఒత్తిడి తగ్గుతుంది. -
చేనేతపై పెనుభారమే!
మన దేశంలో చేనేత పరిశ్రమ అత్యంత పురాతనమైన వృత్తి. దీనిని దేశ వారసత్వ సంపదగా కూడా గుర్తిస్తారు. వ్యవసాయరంగం తరువాత దేశంలో ఎక్కువమంది గ్రామీణ ప్రజలు ఆధార పడ్డ రంగం చేనేత రంగం. కానీ ఇటీవల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పుల్లో భాగంగా చేనేత, టెక్స్టైల్ రంగంపై ఏకంగా 18 శాతం జీఎస్టీని విధించడంతో ఆ రంగంపై పెను భారం పడనుంది. రూ. 1,000 కంటే తక్కువ ధర ఉన్న చేనేత వస్త్రాలపై 5 శాతం, ఆ ధర కంటే ఎక్కువ ధర ఉండే చేనేత వస్త్రాలపై 12 శాతం జీఎస్టీని ఇప్పటివరకు విధించారు. నూతన జీఎస్టీలో భాగంగా 2,500 రూపాయల కంటే తక్కువ ధర ఉండే వస్త్రాలపై 5 శాతం, 2,500 రూపాయల కంటే ఎక్కువ ధర ఉండే చేనేత, ఇతర వస్త్రాలపై ఉన్న 12 శాతం జీఎస్టీని 18 శాతానికి పెంచారు. గత కొన్నేళ్లుగా మార్కెట్లో ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా వస్త్రాల ధరలు పెరిగి 5 శాతం స్లాబ్ నుండి 12 శాతం స్లాబ్లోకి వచ్చాయి. దీంతో మార్కెట్లో డిమాండ్ లేకుండా పోతోంది. చదవండి: ఖరీదైన ఆస్తిని అమ్మేస్తున్న ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ఫలితంగా ఆదాయం కోల్పోయి చాలా కుటుంబాలు చేనేత వృత్తిని వదిలి ఇతర వృత్తులను ఎంచు కుంటున్నాయి. ఇప్పుడు జీఎస్టీని కొన్ని దుస్తులకు పెంచడంతో రానున్న రోజుల్లో చేనేత పరిశ్రమ మరింత నష్టాలను ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు దేశంలో పేరొందిన పోచంపల్లి, కంచి, బెనారస్, ధర్మవరం, గద్వాల్ చేనేత వస్త్రాలు కేవలం రూ. 2,500 లోపే మార్కెట్లో దొరుకుతాయా? ఎటు వంటి శారీరక శ్రమతో పనిలేకుండా కృత్రిమ దారాలతో, యంత్రాల సహాయంతో తయారు చేసే పాలిస్టర్ వంటి వస్త్రాలపై జీఎస్టీని 12 శాతం నుండి5 శాతానికి తగ్గించడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ వస్త్రాలు తక్కువధర లకు లభించడంతో వినియోగదారులు వాటిపై మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. ఫలితంగా చేనేత పరిశ్రమకు మరింత నష్టాలు వచ్చే అవకాశంఉంది. నిజానికి చేనేత వస్త్రాలు విలాసవంతమైన వస్తువులు కావు. అవి భార తీయ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక. ముఖ్యంగా, లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయి. అలాంటి ఉత్పత్తులపై జీఎస్టీని తీసివేయాలి.లేదా ధరల సీలింగ్ లిమిట్ను హేతుబద్ధీకరించాలి. స్వదేశీ వస్తువులనే ప్రోత్సహించాలి. ‘వోకల్ ఫర్ లోకల్’, స్వదేశంలోనే ప్రతి వస్తువును తయారు చేయాలంటూ ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మ నిర్భర్ భారత్’ అంటున్న కేంద్ర ప్రభుత్వం... స్వదేశీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంపై పునఃసమీక్ష చేయాలి.ఇదీ చదవండి: నవదుర్గకు ప్రతీకగా నీతా అంబానీ : 9 రంగుల్లో బనారసీ లెహంగా చోళీ– డా.రామకృష్ణ బండారుకామర్స్ అధ్యాపకులు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ -
ఒప్పందమా? వ్యూహాత్మకమా!
పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య అనూహ్యమైన రీతిలో ఈనెల 17న జరిగిన రక్షణ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. రెండు దేశాల రక్షణ సంబంధాలు కొన్ని దశాబ్దాలుగా ఉన్నవే. సౌదీ రాజు ఫైజల్, పాక్ అప్పటి ప్రధాని అయూబ్ ఖాన్ల మధ్య 1967 లోనూ ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. కానీ అప్పటి పరిస్థితులు, అవసరాలు సాధారణ స్థాయివి. అప్పటికి పాకిస్తాన్ అణ్వాయుధ దేశం కూడా కాదు. నాటి నుంచి 58 సంవత్సరాల సుదీర్ఘకాలంలో అన్నీ మారాయి. అరబ్ దేశాలు, ముస్లిం దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగానూ ఎంతో సంక్లిష్టంగా కూడా అయ్యాయి. అందువల్లనే ప్రస్తుత ఒప్పందం గమనార్హమైనది అవుతున్నది.దాడి తర్వాతే కుదిరిన ఒప్పందం! ఒప్పందం జరిగిన తక్షణ పరిణామాలు కూడా ప్రాముఖ్యం కలిగినవి. ఈ నెల 9న గల్ఫ్ దేశమైన ఖతార్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి జరిపి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అమెరికాతో వ్యూహా త్మక సంబంధం గల అరబ్ దేశాలు, తమ ప్రాంతంలో అర డజను అమెరికన్ సైనిక స్థావరాలకు ఆశ్రయం ఇస్తున్నవి అయినప్పటికీ ఈ దాడి జరగటం ఒకటైతే, మళ్లీ దాడులకు వెనుకాడబోమని ఇజ్రాయెల్ ప్రకటించింది. అది చాలదన్నట్లు అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో స్వయంగా టెల్ అవీవ్కు వెళ్లి ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించటం సౌదీతో పాటుగా సహ గల్ఫ్ దేశాలన్నింటిని తీవ్రమైన అభద్రతా భావానికి గురిచేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అర్ధోక్తులు వాటికి తోడయ్యాయి. ఈ తక్షణ నేపథ్యంలో జరి గిందే పాకిస్తాన్తో సౌదీ రక్షణ ఒప్పందం.అక్కరకు రాని అగ్రరాజ్యంఒప్పందం అనంతరం మీడియా ప్రశ్నలకు సౌదీ ప్రభుత్వం ప్రతినిధి ఇచ్చిన ఒక సమాధానం ఇదే స్థితిని ధ్రువీకరిస్తున్నది. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు కొన్ని దశాబ్దాలుగా ఉండి, 1967 నాటి ఒప్పందం కూడా ఒకటి ఉన్నప్పుడు తిరిగి ఈ ఒప్పందం ఎందుకన్న ప్రశ్నకు ఆ ప్రతినిధి ఇచ్చిన సమాధానం – ‘అనిశ్చితంగా మారిన భవిష్యత్ అవసరాల కోసం’ అని! పైన ప్రస్తావించిన పరి ణామాల కారణంగా భవిష్యత్తు ఎందుకు అనిశ్చితంగా మారిందో వేరే వివరణ అవసరం లేదు. ఇక్కడ గుర్తించవలసిన మరొక విషయం ఏమంటే, అటువంటి అనిశ్చిత పరిస్థితులలో ఒక అణ్వస్త్ర దేశంతో సౌదీకి ఒప్పందం అవసరమైంది. సాటి గల్ఫ్ దేశం అయిన ఖతార్పై ఇజ్రాయెల్ అనే ఒక అణ్వస్త్ర దేశం దాడి జరిపినప్పుడు మరొక అణ్వస్త్ర దేశమైన అమెరికాతో తమకు గల వ్యూహాత్మక సంబంధం సౌదీకి కొరగానిది అయింది. దాంతో ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్తో పరస్పర రక్షణ ఒప్పందం అనివార్యం అయినట్లుగా కనిపిస్తోంది. మిగతా దేశాలూ చేరుతాయా?!ఒప్పంద పాఠం వెల్లడి కాలేదు గానీ, వారు అధికారికంగా ఒక ప్రకటనలో తెలియజేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి: ‘రెండి టిలో ఏ దేశం పైన బయటి నుండి ఎవరు దాడి జరిపినా రెండవ దేశంపై కూడా జరిపినట్లే పరిగణించి, దాడికి గురైన దేశానికి తోడుగా నిలుస్తారు. ఉభయుల రక్షణకు అవసరమైన పరస్పర సహ కార చర్యలు ఇప్పటికన్నా మరింతగా తీసుకుంటారు’. ఈ ఒప్పందం పరిధిలోకి పాకిస్తాన్ అణ్వస్త్రాలు కూడా వస్తాయా అన్న సూటి ప్రశ్నకు రెండు దేశాల ప్రతినిధులు కూడా... పాకిస్తాన్కు గల ఆయుధశక్తి మొత్తం వస్తుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ అణు దేశమే గాక ముస్లిం ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తి. ఇజ్రాయెల్ నుంచి ముప్పు ఎదుర్కొంటున్న ఇతర గల్ఫ్ దేశాలు సైతం ఈ ఒప్పందంలో చేరవచ్చునా అన్న ప్రశ్నకు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, తమ ద్వారాలు ఎవరికీ మూసుకుపోలేదన్నారు. ఖతార్పై ఇజ్రాయెల్ దాడి 9న; అరబ్, ఇస్లామిక్ దేశాల శిఖరాగ్ర సమావేశం 15న జరిగిన తర్వాత, 17న ఈ ఒప్పందం కుదిరినప్పటి నుంచి వారం రోజులలో ఆ సమావేశ దేశాలు గాని; ఇజ్రాయెల్, అమెరికా, యూరప్లు గాని స్పందించలేదు. భారత ప్రభుత్వ ప్రతినిధి మాత్రం, ‘మా మనోభావాలను సౌదీ నాయకత్వం మన్నించగలదని ఆశిస్తున్నా’మన్నది. అయితే, వెంటనే తలెత్తుతున్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఒకవేళ సౌదీపై ఇజ్రాయెల్ దాడి జరిపితే పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొంటుందా? పాల్గొంటే అమెరికా ఏం చేయవచ్చు? అదే విధంగా ఇండియా–పాక్ల మధ్య సాయుధ ఘర్షణ, లేదా యుద్ధం జరిగితే సౌదీ ప్రభుత్వం తన అపారమైన ఆయుధ సంపత్తిని పాకిస్తాన్కు సమకూర్చుతుందా... అన్నవి ఆ ప్రశ్నలు. ఇక్కడ పాక్ రక్షణ మంత్రి 20వ తేదీన చెప్పిన మాటను గమనించాలి. తమ ఒప్పందం ఇరువురి ఆత్మరక్షణకే తప్ప ఇత రులపై దాడి చేసేందుకు కాదని, ఒకవేళ తమపై భారతదేశం దాడి జరిపితే మాత్రం సౌదీ అరేబియా తప్పక రంగంలోకి వస్తుందని, ఆ విషయమై ఎంత మాత్రం సందేహం అక్కర లేదని అన్నారాయన. ఊహకందని పర్యవసానాలుభారత ప్రభుత్వం ఈ అసాధారణ పరిణామాన్ని అనివార్యంగా గమనికలోకి తీసుకోవలసి ఉంటుంది. ఒకవేళ రాగల రోజులలో మరిన్ని అరబ్, ముస్లిం దేశాలు ఈ ఒప్పందంలో చేరితే పరిస్థితి తీవ్రత ఆ మేరకు పెరుగుతుంది. ఇజ్రాయెల్, అమెరికా తీరును బట్టి అది జరగవచ్చు కూడా! ఒప్పందానికి ఇది ఒక కోణం కాగా, ఇజ్రాయెల్ వైఖరిలో గమనించవలసిన మరొక కోణం ఉంది. వారి దాడులు ఖతార్తో ఆగుతాయా లేక ఇతర గల్ఫ్ దేశాలకు విస్తరించే అవకాశం ఉందా? ఈ దేశాలకు అమెరికాతో గల వ్యూహాత్మక సంబంధాలు, ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాల పరిస్థితి ఏమిటి? ప్రస్తుత ఒప్పందాన్ని ప్రభావితం చేసి నిరుపయోగంగా మార్చేందుకు అమెరికా ప్రయత్నిస్తుందా? ఇటువంటి ఒప్పందం మూలంగా రాజకీయంగా పాకిస్తాన్ పాత్ర బలోపేతంగా మారే అవకాశం ఉంది గనుక ఆ ప్రభావం భారత్పై ఏ విధంగా ఉండవచ్చు?... అన్నీ ప్రశ్నలే. మున్ముందు అనేక మలుపులుఏమైనా... ఖతార్పై దాడి, అమెరికా మౌనం, దోహా శిఖరాగ్ర సమావేశం, సౌదీ–పాక్ ఒప్పందం అనే నాలుగు పరిణామాలు మాత్రం అసాధారణమైనవి. కేవలం 9 రోజుల పరిధిలో చోటు చేసుకున్న ఈ పరిణామాల అర్థం మున్ముందు అనేక రూపాలలో ఉంటుంది. ఈ పరిణామ పరంపరకంతా మూలకారణమైన పాలస్తీనా సమస్య ఏమి కానున్నదనేది అన్నింటికీ మించిన ప్రశ్న. వాస్త వానికి ఆ సమస్య కొనసాగటంలో ఇజ్రాయెల్, అమెరికాల బాధ్యత ఎంతున్నా, పరిష్కారం కోసం కచ్చితమైన వైఖరితో పట్టుదలగా ప్రయత్నించని దోషం మాత్రం అరబ్ దేశాలదే! వారు ఇప్పటికైనా ఆ పని చేయనట్లయితే, అన్ని దాడులు, పాలస్తీనా హత్యాకాండల దోషం వారిదే అవుతుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నేపాల్ సంధిస్తున్న శేషప్రశ్నలు
కొన్ని దశాబ్దాలు అసలేమీ జరగదు, కానీ కొన్ని రోజుల్లోనే దశాబ్దాలు జరిగిపోతాయి. లెనిన్ అన్న ఈ మాటలు నేపాల్ విషయంలో అక్షర సత్యాలయ్యాయి. నేపాల్లో ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్ళూనుకుంది. వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీలు పరస్పర ప్రయోజనా లందుకుంటూ చెట్టపట్టాలేసుకుని తిరిగాయి. అకస్మాత్తుగా ఎగసిన నిరసన ప్రదర్శనల వేడిని వారు ఇప్పుడు చవి చూశారు.ఇంటర్నెట్, డిజిటల్ టెక్నాలజీ మొగ్గ తొడిగిన (1997–2012) కాలంలో పుట్టిపెరిగిన తరాన్ని ‘జెన్ జెడ్’గా పిలుస్తున్నారు. ఈ ‘జెన్ జెడ్’ నేపాల్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఈ యువతరం తెచ్చిన విప్లవం బహుశా స్వల్పకాలమైనదే కావచ్చు. కానీ, అది చూపిన ప్రభావం పెద్దది. నిరసనలు మొదలైన తెల్లారే మూడు పార్టీల ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాని కేపీ శర్మ ఓలి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. నిరసనలకు ఐదు రోజుల ముందు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్తో సహా 26 సామాజిక మాధ్యమ వేదికల మూసివేతకు ఆయన ఆదేశించారు. అప్పటి కాయన ప్రజాభిమతాన్ని ప్రతిఘటించే వ్యక్తిగానే కనిపించారు. తీరా, ప్రధాని అధికారిక నివాసమైన బాలూవతార్ నుంచి ఉడాయించ వలసి వచ్చింది. ప్రధాని సింహాసనాన్ని అధిష్ఠించేందుకు వేచి ఉన్న షేర్ బహదూర్ దేవ్బా, ఆయన భార్య అర్జూ దేవ్బా (ఈమె విదేశాంగ మంత్రిగా కూడా ఉన్నారు)లపై వారి నివాసంలోనే దాడి జరి గింది. దేశవ్యాప్తంగా యువత ధ్వంసం చేస్తూ వచ్చిన రాజకీయ పార్టీల ఆస్తులు, బడా నాయకుల ప్రైవేటు నివాసాలకు లెక్కలేదు. సుప్రీంకోర్టు, పార్లమెంట్, ప్రభుత్వం కొలువుదీరే సింఘ దర్బార్ కూడా వారి ఆగ్రహ ‘జ్వాలల’ నుంచి తప్పించుకోలేక పోయాయి. జన్ జెడ్ తొలి ఉద్యమంనిరసనకారుల్లో అనేక మంది స్కూలు యూనిఫారంలలో ఉన్నప్పటికీ, పోలీసులు వారిపై దమన నీతిని ప్రదర్శించారు. దమనకాండలో స్కూలు, కాలేజీ విద్యార్థులు పందొమ్మిది మంది (వారిలో 17 మంది ఖాట్మాండులోనే) హతులయ్యారు. దాంతో దేశ మంతా ఏకమైంది. 1990లో, తర్వాత 2006లో సామూహిక ప్రజా ఉద్యమా లప్పుడు కూడా ఇలాగే జాతీయ స్థాయిలో అతిశయం వ్యక్తమైంది కానీ, అవినీతిమయ రాజకీయ నాయకులతో వారి ఆశలన్నీ అడియా సలయ్యాయి. నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ –యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు) ప్రజాభిమతానికి అనుగుణంగా నడచుకోలేక పోయాయి. ఆ రెండు ఉద్యమాలలో ‘జెన్ జెడ్’ పాత్ర నామ మాత్రమే. ఇప్పుడు నేపాల్ రికార్డు స్థాయిలో వలసలను చూస్తున్న సమయంలో, యువతలో కోపం కట్టలు తెంచుకుంది. నేపాల్ అపసవ్య కారణాలతోనే ప్రపంచంలో వార్తలకెక్కడాన్ని చూసి వారు విసుగెత్తిపోయారు. అవినీతి సూచిలో ఏయేటికాయేడు నేపాల్ ఎగబాకుతూ వస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ మినుకు మినుకు అంటూ అయినా ఉందంటే, దానికి, వర్తక వ్యాపారాలో, విదేశీ సాయమో కారణం కాదు. రాజకీయ పార్టీల చేయూత అంతకన్నా లేదు. విదేశాలలో పని చేస్తున్న నేపాలీయులు స్వదేశానికి పంపిస్తున్న జమలతోనే స్థాని కులు చాలా వరకు రోజులు వెళ్ళదీస్తూ వస్తున్నారు. పశ్చిమాసియా నుంచి మలేషియా వరకు, నార్వే నుంచి న్యూజిలాండ్ వరకు నేపా లీయులు కష్టపడి పనిచేస్తూ గడిస్తున్న నాలుగు రాళ్ళలో కొంత మొత్తాన్ని స్వదేశంలోని కుటుంబ సభ్యులకు పంపుతున్నారు. అలాచూస్తే, మారుమూల గ్రామాలలోని వారితో సహా, కుటుంబాల విడి ఆదాయాలు పెరుగుతూ వస్తున్నాయి. అంతమాత్రాన నేపాలీ యులు ధనికులుగా మారింది ఎన్నడూ లేదు.ఇప్పుడేం జరగొచ్చు?ఈ మార్పులన్నింటి మధ్య కొన్ని భయ సందేహాలు మిగిలే ఉన్నాయి. ప్రాబల్యం వహించిన పాత మూడు పార్టీలలోని నాయకులందరూ అపఖ్యాతి పాలైనవారు కాదు. వారిలో కొందరికి వారి నియోజకవర్గాలతో ఇప్పటికీ పటిష్ఠమైన సంబంధాలే ఉన్నాయి. వారు కౌంటర్ విప్లవానికి తెర లేపుతారా? అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం పాత పార్టీలన్నీ విలీనమవుతాయా? లేక నాల్గవ పెద్ద పార్టీ అయిన రాష్ట్రీయ స్వతంత్రతా పార్టీ (ఆర్.ఎస్.పి.)లోకి ఫిరాయింపులకు ఇది దారితీస్తుందా? ఈ పార్టీలోనే యువ టెక్నోక్రాట్లు పెద్ద వర్గంగా ఉన్నారు. ఎన్నికల కమిషన్ వద్ద, 2022 సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే రిజిస్టరైన ఆర్.ఎస్.పి. త్వరితగతిన జాతీయ పార్టీగా పరిణమిస్తుందా? ఖాట్మండులో ప్రజాదరణ కలిగిన యువ మేయర్ బాలెన్ షా వీరితో చేతులు కలుపుతారా? రాజధానికి బయట పార్టీని విస్తరించడానికి ఎన్నడూ ఉత్సాహం చూపని షా, యువతతో కొత్త పార్టీని పెట్టి దానికి నాయకత్వం వహిస్తారా?ఈ పరిస్థితులన్నింటి మధ్య ‘జెన్ జెడ్’ స్థానం ఏమిటి? ఈ యువతకు గొంతుకగా సూదన్ గురుంగ్ ఉన్నారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి, నేపాల్ తొలి మహిళా ప్రధాని సుశీలా కర్కీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సూదన్ ఆమె పట్ల గౌరవ ప్రపత్తులను ప్రదర్శించారు. కానీ పట్టుమని వారం కూడా గడవక ముందే, అదీ సూదన్ సమక్షంలోనే, ఆపద్ధర్మ ప్రధాని కర్కీ రాజీనామా చేయాలని ‘జెన్ జెడ్’ నిరసనకారులు డిమాండ్ చేశారు. మంత్రివర్గాన్ని విస్తరించే ముందు ఆమె తమతో సంప్రదించలేదని అన్నారు. బాలెన్ షా న్యాయ సలహాదారు ఓమ్ ప్రకాశ్ ఆర్యల్ను హోమ్ మంత్రిగా నియమించడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సైన్యం పాత్ర ఏమిటి?నేపాల్ సైన్యం ఏం చేయబోతోందనేది కూడా ముఖ్యమైనఅంశం. సార్వభౌమాధికారం 1990లో ప్రజల చేతికి వచ్చి, పార్లమెంట్ 2008లో రాచరికాన్ని రద్దు చేసేంత వరకు, రాచరికం పట్లనే సైన్యం విధేయత చూపుతూ వచ్చింది. తిరిగి అది ఇప్పుడు మళ్ళీ రాచరికం వైపే మొగ్గు చూపుతుందా? క్షేత్రస్థాయిలో నేపాలీయుల మధ్య సాంస్కృతిక పునరుజ్జీవనం కనిపిస్తోంది. హిందూ మతానికి చెందిన వివిధ వ్యక్తీకరణల్లో అది కేంద్రీకృతమవుతోంది. కానీ, నేపా లీయులు రాజకీయ హిందూయిజానికి ఎన్నడూ ఓటు వేయలేదు. వచ్చే ఏడాది (2026) మార్చి 5న నిర్వహిస్తారని చెబుతున్న ఎన్ని కలు చరిత్రను మలుపు తిప్పుతాయా? నూతన ప్రభుత్వం ఈ పరి ణామ క్రమాన్ని ఎలా నిర్వహిస్తుందనేది ప్రశ్న. నేపాలీ ప్రజలు ఆరు నెలల (రాజకీయాల్లో సుదీర్ఘ కాలం కిందనే లెక్క) తర్వాత, రాజ కీయ తీర్పును వెలువరించేంత వరకు ఈ భయాందోళనలు కొన సాగుతూనే ఉంటాయి.అఖిలేశ్ ఉపాధ్యాయ్వ్యాసకర్త ఖాట్మండులోని ఐ.ఐ.డి.ఎస్.లో సీనియర్ రీసెర్చ్ ఫెలో (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఐరాస అవసరం తీరిపోలేదు!
అమెరికాలో చార్లీ కిర్క్ హత్యోదంతంపై రేగుతున్న ప్రజాగ్రహం, పోలెండ్ను బెదిరిస్తున్న రష్యన్ డ్రోన్లు, ఇజ్రాయెల్ ఇపుడు బాహాటంగానే చెబుతున్న గాజాలోని జాతి నిర్మూలన, గాజా పొరుగు దేశాలపై ఇజ్రాయెల్ దాడులు... వీటన్నిటి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి (ఐరాస) 80వ వార్షికోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఉందా? కానీ, సహజ జ్ఞానానికి విరుద్ధంగా, ఇటువంటి సందర్భానికి ఇదే సరైన సమయమేమో అని కూడా అనిపిస్తోంది. సమస్యలను విడి విడిగా చూడాలని, చర్చలు జరపాలని అమెరికా విజ్ఞప్తి చేస్తోంది. కాల్పుల విరమణ పాటించాలనటం, శాంతియుతంగా చర్చలు జరపాలని పిలుపు నివ్వడంలో ఆ విజ్ఞప్తులు ప్రతిధ్వనిస్తున్నాయి. ఎనభై అన్నది కీలక ఘట్టంఅంతర్జాతీయ శాంతి, భద్రతలను సాధించడంలో – ఐరాస వైఫల్యాలు; నాగరికంగా చర్చలు జరుపుకొనే పద్ధతిని పెంపొందించడంలో, అందరికీ పూర్తి మానవ హక్కులను కాపాడడంలో – అమెరికా అంతర్గత బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్న దశ ఇది. మహా అయితే, ఐరాస 80వ వార్షికోత్సవం... గతి తప్పిన జాతీయ తావాదం, మిగిలిన వర్గాలను పట్టించుకోకుండా స్వీయ వర్గానికే వీర విధేయత చూపడం, విశృంఖల హింస వంటి వాటికి అతీతంగా కొన్ని విలువలున్నాయని గుర్తు చేసేందుకు ఉపయోగపడుతుంది. నానాజాతి సమితి 26 ఏళ్ళే మనగలిగింది. దానిని మించి మనుగడ సాగిస్తున్నందుకు ఐరాస గర్వపడవచ్చు. ఒక వ్యక్తి జీవితంలో 80వ పడిలో పడడం కీలక ఘట్టం. ఆయుర్దాయాన్ని జాగ్రత్తగా కాపాడు కోవాల్సి ఉంటుంది. అలాగే, ఐరాస తన ప్రాధా న్యాన్ని కొనసాగించుకునేందుకు ఈ వార్షికోత్సవం కూడా ముఖ్యమైంది. ఏడేళ్లుగా నిధుల సంక్షోభం!ఐరాసలో తిరిగి జవజీవాలు నింపేందుకు ‘యూఎన్ 80 ఇనీషి యేటివ్’ పేరుతో 2025 మొదట్లో ఒక కార్యక్రమం ప్రారంభమైంది. కానీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నట్లుగా కనిపిస్తున్న సంస్థను ప్రక్షాళన చేసే బదులుగా అది... వెలాతెలా బోతున్న సంస్థ వేడుకగా మారినట్లు కనిపిస్తోంది. ఐరాస ఆర్థిక సంక్షోభం నానాటికీ పెరుగు తోంది. ‘‘సభ్య దేశాలన్నీ తమ చందా మొత్తాలను పూర్తిగా చెల్లించక పోవడం, చాలా దేశాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల కనీసం గత ఏడేళ్లుగా ఐరాస ద్రవ్యత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది’’ అని ఐరాస ఉన్నత కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 11 నాటికి ‘‘మొత్తం 193 దేశాలలో 75 దేశాలే వాటి వంతు మొత్తాలను పూర్తిగా చెల్లించాయి. సంస్థ 2025 సంవత్సరపు బడ్జెట్ 3.72 బిలియన్ డాలర్లుగా ఉంది’’ అని ఆ ప్రకటనలో తెలి పారు. నిధుల లోటును; మధ్య ప్రాచ్యంలోను, ఉక్రెయిన్లోను శాంతిని నెలకొల్పడమనే ప్రాథమిక విధి లోని వైఫల్యాలను చూస్తుంటే ఐరాస కూడా నానాజాతి సమితి బాట పడుతుందా? అనే ప్రశ్న రావటం సహజమే. ‘శాంతి కోసం సమైక్యత’అయితే, సమితి గురించి ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ ప్రొఫెసర్, జడ్జి, గుటెరస్కు సన్నిహితుడు అయిన జార్జ్ అబీ సాబ్ ఒక ఇంటర్వ్యూలో మూడు ఆశావహమైన సంగతులను చెప్పారు. మొదటిది: అంతర్జాతీయ సమాజం తన సమష్టి అభిమతాన్ని వ్యక్తీక రించేందుకు, ఆ సమాజాన్ని న్యాయబద్ధం చేసేందుకు ఉన్న ఒకే ఒక అంతర్జాతీయ వేదిక ఇప్పుడు ఐరాస మాత్రమే. ఖతార్ రాజధాని దోహాపై ఇటీవలి దాడిని (ఇజ్రాయెల్ పేరును నేరుగా ప్రస్తావించక పోయినప్పటికీ) భద్రతా మండలి ఖండించింది. ‘శాంతి కోసం సమైక్యత’ పేరుతో ఐరాస సర్వ ప్రతినిధి సభ చేసిన తీర్మానం ప్రకారం, ఆక్రమిత పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్ తన సేనలను ఇప్పటికే సెప్టెంబర్ 18 నాటికి ఉపహరించుకుని ఉండాలి. ఇది అంతర్జాతీయ న్యాయస్థానం సలహా పూర్వకంగా వెలిబుచ్చిన అభి ప్రాయం. దాన్ని పాటించని ఇజ్రాయెల్పై సర్వ ప్రతినిధి సభ కొన్ని చర్యలు తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఐరాస శాంతి పరిరక్షక దళాన్ని నియోగించవచ్చు. చెప్పుకోదగిన విజయాలురెండు: శాంతి, భద్రతలను పక్కనపెడితే ఐరాస చెప్పుకోతగిన విజయాలు కొన్ని ఉన్నాయి. వివిధ ఐరాస సంస్థలు పర్యావరణం వంటి రంగాల్లో ప్రత్యేక సేవలందిస్తున్నాయి. పర్యావరణానికి హానికరమైన చేపల వేటకు పాల్పడేవారికి సబ్సిడీలను నిరాకరించే వాణిజ్య ఒప్పందానికి ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటీవల కట్టుబడ వలసి వచ్చింది. మూడు: బహుళ పక్షానికి (మల్టీలేటరలిజం) వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించడం. ఏవో ఒకటి రెండు దేశాలు పెత్తనం చలాయించకుండా, ప్రపంచ వ్యవస్థను తీర్చిదిద్దటంలో వివిధ దేశాలకు భాగస్వామ్యం కల్పించడానికి ఐరాస ప్రయత్నాలు ఎంతో కొంత ముందుకు సాగుతున్నాయి.షాంఘై సహకార సంస్థ ఐరాసకు ప్రత్యామ్నాయం వంటి బహుళ పక్ష వ్యవస్థ కాకపోవచ్చు. కానీ, డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులను ప్రతిఘటించే విధంగా వివిధ దేశాల్లో కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా–ఐరాస పోలికలుఅంతర్జాతీయ సహకారానికి అడ్డుపడుతున్న అంశాలకూ, అమెరికాలో రాజకీయ పోలరైజేషన్కూ మధ్యనున్న సారూప్యాలను గమనించకుండా ఉండడం కష్టం. భీకర అమెరికన్ అంతర్యుద్ధాలలో ఒకదాన్ని చవి చూసిన తర్వాత పెన్సిల్వేనియాలోని గెట్టీస్ బర్గ్లో 1863లో చేసిన ప్రసంగంలో అమెరికా పురుద్ధరణను అధ్యక్షుడు అబ్రహాం లింకన్ దర్శింపజేశారు. అమెరికా ఏర్పడిన 87 ఏళ్ల తర్వాత లింకన్ ‘‘ప్రజల కోసం, ప్రజలతో ఎన్నుకోబడిన, ప్రజా ప్రభుత్వం’ అన్న భావనను పునశ్చరణ చేశారు. ఐరాస ప్రణాళిక ఉపోద్ఘాతం కూడా ‘‘ఐక్యరాజ్య సమితి ప్రజలమైన మేము’’ అనే మొదలవుతుంది. అమెరికాను ఆ దేశ సంస్థాపక పితామహులు ముందుకు తెచ్చిన సుమారు 80 ఏళ్ల తర్వాత, లింకన్ ‘స్వాతంత్య్ర నూతన జననం’ గురించి మాట్లాడారు. ఇప్పుడు ‘యూఎన్ 80 ఇనీషియేటివ్’ అదే రకమైన నూతన ఆవిర్భావం గురించి ప్రస్తావించింది. అంతర్జాతీయంగా ప్రభుత్వాల మధ్య వారధిగా పని చేస్తున్న సంస్థ ఐరాస ఒక్కటే! కనుక సమితి తన జీవిత కాలాన్ని, ప్రాధాన్యాన్ని, 80 ఏళ్లకు మించి పొడిగించుకోగలుగుతుందా అన్నసందేహం అక్కర్లేదు. డేనియల్ వార్నర్వ్యాసకర్త అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు – రచయిత -
వాటా పెంచాలి!
వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి ఇటీవలి 56వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చారిత్రకమైనవి. జీఎస్టీ రెండవ అధ్యాయానికి అంకు రార్పణగా దాన్ని అభివర్ణించినా తప్పు లేదు. జీఎస్టీని అమలులోకి తెచ్చిన ఏడేళ్ళ తర్వాత, వినియోగంపై వేసిన ఈ లెవీని సంస్కరించేందుకు పెద్ద ప్రక్షాళననే చేపట్టారు. ఇంతవరకు ఉన్న నాలుగు ప్రధాన పన్ను శ్లాబులు సెప్టెంబర్ 22 నుంచి రెండు శ్లాబులు కానున్నాయి. అధిక విలాస వస్తువులు, పొగాకు వంటి ‘వ్యసనాల’ వస్తువులపై కొత్త శ్లాబు రేటు ప్రవేశపెట్టనున్నారు. ఇంతకుముందున్న పన్నుల రేట్లు, ‘సక్రమమైన, సరళమైన’ పన్నుగా జీఎస్టీకున్న స్ఫూర్తిని దెబ్బతీశాయి. కనుక, రెండు రేట్ల పద్ధతికి మారడం స్వాగతించదగిన పరిణామం. గతంలోని 12%–28% రేట్లను రద్దు చేసి 5%–18% రేట్లను అట్టేపెట్టారు. మొత్తం జీఎస్టీ రాబడిలో మూడింట రెండొంతుల భాగాన్ని 18% రేటు ఇప్పటికే తెచ్చిపెడుతోంది. ఆదాయంలో 7% భాగం 5% శ్లాబు ద్వారా లభిస్తోంది. అలాగే 12% శ్లాబు 5% ఆదాయానికి, 28% శ్లాబు 11% ఆదాయానికి కారణమవుతున్నాయి. ఇపుడు 18% శ్లాబు జీఎస్టీ రాబడిలో మరింత ఎక్కువ భాగాన్ని తెచ్చిపెట్టబోతోంది. అయితే, రెండు రేట్లుగా సరళీకరించిన పద్ధతి సమమితిగా సాగలేదు. ఏం చేశారంటే 12% కేటగిరీలోని చాలా వస్తువులను 5% లోకి, 28% వర్గంలోని చాలా వాటిని 18% వర్గంలోకి తెచ్చారు. అధిక పన్ను రేటులోకి చాలా తక్కువ వస్తువులే వెళ్ళాయి. మొత్తం మీద పన్ను భారం లేదా ఈ లెవీకి సంబంధించిన ప్రభావశీల పన్ను రేటు తగ్గింది. ఇది వినిమయ వ్యయాన్ని పెంపొందించే ద్రవ్య ఉద్దీపనగా ఉపకరించవచ్చు. చాలా భాగం వస్తువులు తక్కువ పన్ను రేట్లకి తరలిపోవడం వినియోగదారుల కోణం నుంచి ద్రవ్య ఉద్దీపన కావచ్చుకానీ, ప్రభు త్వానికి మాత్రం రాబడిలో లోటు ఏర్పడుతుంది. అయితే, దానివల్ల ఏర్పడే లోటు కన్నా, వినియోగదారుల అధిక వ్యయం వల్ల ఒనగూడగల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆర్థిక శాస్త్ర పరిభాషలో ‘ల్యాఫర్ కర్వ్ ఎఫెక్ట్’ అంటారు. సూటిగా చెప్పాలంటే, పన్ను రేటు తగ్గింపు పన్ను వసూళ్ళ పెరుగుదలకు దారితీస్తుంది. కానీ, భారతదేశం విషయంలో దీన్ని సిద్ధాంతపరంగా అన్వయించి చూడలేం. అనుభవంలో మాత్రమే అసలు విషయం తెలుస్తుంది. రెండు ఇబ్బందులుజీఎస్టీ వ్యవస్థలోని రెండు అంశాలు ఇప్ప టికీ వేధిస్తూనే ఉన్నాయి. ఇది పరోక్ష పన్ను. తిరోగమనదాయకమైనది కావడం వల్ల ధని కుల కన్నా పేదలను ఎక్కువ కుంగదీస్తుంది. పాటించవలసిన నియమ నిబంధనల భారం అధికంగా ఉండటం వల్ల, ముఖ్యంగా చిన్న వ్యాపారులకు ఇది తలనొప్పి తెచ్చిపెట్టే అంశం. రాష్ట్రాలపై ప్రభావం రెండవ అంశం. రేటులో కోత, హేతుబద్ధీకరణ వల్ల ఏర్పడగల స్థూల నష్టం రూ. 1.5 ట్రిలియనా లేక రూ. 1 ట్రిలియన్ కన్నా తక్కువే ఉంటుందా అన్నది చూడవలసి ఉంది. కానీ, దానిలో సగం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే మోయవలసి ఉంది. తొలుతటి జీఎస్టీ చట్టంలో చేసిన రీయింబర్స్మెంట్ వాగ్దానానికి 2022లో కాలం చెల్లింది. పరిహారం సెస్సునకు కూడా గడువు తీరబోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లలో పేర్కొన్న వ్యయాలను ఎలా నిర్వహించగలుగుతాయి? భారతదేశంలో మాత్రమే కనిపించే ‘మూడింట రెండు వంతులు/ మూడింట ఒకటో వంతు’ సమస్య దాని సమాఖ్య ఏర్పాటులోనే ఉంది. మూడింట రెండొంతుల వ్యయ కర్తవ్యం రాష్ట్ర ప్రభు త్వాలు, స్థానిక సంస్థలపైనే ఉంది. కానీ, రెవిన్యూ స్వయం ప్రతిపత్తిలో వాటికున్నది మూడింట ఒకటో వంతు మాత్రమే! పెట్రోలు, డీజిలు, విద్యుచ్ఛక్తి జీఎస్టీ పరిధిలోకి రాకుండా బయటే ఉండిపోవడానికి అది కూడా ఒక కారణం. అటువంటి ఆందోళనలపై స్పందిస్తూ ఆర్థిక మంత్రి రాష్ట్రాల కోశ సుస్థిరత, ఆర్థిక యోగక్షేమాల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్ని రాష్ట్రాలకూ హామీ ఇచ్చారు. ‘‘సహకార సమాఖ్యతత్వ స్ఫూర్తిని ఆలంబన చేసుకునే మా చర్చలు సాగాయి’’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. రాష్ట్రాలకు ఆదాయం పెరిగేలా...ఈ నేపథ్యంలో, జీఎస్టీ విధానంలో ఒక సంస్కరణ రూపుదిద్దుకునేటట్లు చేయవచ్చు. ప్రస్తుతం 50:50గా ఉన్న పంపకం సూత్రాన్ని రాష్ట్రాలకు అనుకూలంగా 60:40గా మార్చవచ్చు. ఏదేమైనా, మొత్తం ప్రభుత్వ వ్యయాలన్నింటిలోనూ మూడింట రెండొంతుల భారాన్ని రాష్ట్రాలే భరిస్తున్నాయి కనుక, జీఎస్టీ ఆదాయంలో వాటికి 60 శాతం భాగం ఇస్తే, వాటి బడ్జెటరీ ఖర్చులకు తగ్గట్లుగా ఉంటుంది. వసూలు చేస్తున్న జీఎస్టీని సమీకృత మొత్తంగానే చూస్తున్నారు. అంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున (సగం, సగం) సమ భాగాలుగా వసూలు చేస్తున్నట్లు లెక్క. కేంద్రానికి సెస్సులు, దేశ రుణం, విదేశాల నుంచి అప్పులు తెచ్చుకోవడం వంటి ఇతర వనరులు అందుబాటులో ఉన్నాయి. పంపకాల సూత్రాన్ని రాష్ట్రాలకు అనుకూలంగా కొద్దిగా మొగ్గేటట్లు చేసినా, వాటి గాబరా కొంత ఉపశ మిస్తుంది. సహకార సమాఖ్యతత్వ స్ఫూర్తి మరింత బలపడుతుంది. అజిత్ రనడేవ్యాసకర్త పుణె ఇంటర్నేషనల్ సెంటర్లో సీనియర్ ఫెలో -
ఆత్మ నిర్భర జీఎస్టీ?
సెప్టెంబర్ మాసం శుభాలను మోసుకొస్తుందని ఓ నానుడి. దానిని నిజం చేస్తూ దేశ ప్రజలకు మేలు చేసే రెండు తీపి పరిణామాలు జరిగాయి ఈ మాసంలో! ఒకటి – ఎంతో కాలంగా దేశ ప్రజలు కోరుతున్న జీఎస్టీ సంస్కరణలు. రెండు – భారత్–చైనాల మధ్య చిగురించిన మైత్రీ బంధం. వీటిని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు అందిస్తున్న దీపావళి బహుమతులుగా చెప్పడం గమనార్హం!అమెరికా విధించిన అదనపు సుంకాల పుణ్యమా అని దేశంలో విని యోగ సంస్కృతిని... అది కూడా దేశీయ వస్తువుల వినియోగం పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణను తీసుకువచ్చింది. నాలుగు శ్లాబుల్లో ఉన్న వస్తువులను సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చే జీఎస్టీ 2.0లో మూడు శ్లాబ్లకు కుదించారు. 5 శాతం, 18 శాతం శ్లాబ్లలోకి దాదాపుగా అన్ని వస్తువులు వస్తాయి. సిన్ గూడ్స్ (పాపవు వస్తువులు)గా పేర్కొంటున్న సిగరెట్లు, గుట్కా వంటి ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడం కోసం అత్యధికంగా 40 శాతం పన్ను విధిస్తారు. కార్లు, ఫ్రిజ్లు, ఏసీల వంటి లగ్జరీ గూడ్స్ కారుచౌకగా లభిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంటు న్నాయి. భారీ వాహనాల మీద జీఎస్టీ తగ్గింపు వల్ల వినియోగదారుడికి రెండు విధాల ప్రయోజనం కలుగుతుంది. ఒకటి – వాహనం ధర తగ్గుతుంది. రెండోది – వాహనం ధర ఆధారంగా రిజిస్ట్రేషన్,బీమా (ఇన్సూరెన్స్) చార్జీలు ఉంటాయి కనుక వాహనం ధర తగ్గితే... ఆ దామాషాలో వాటి ఛార్జీలు కూడా తగ్గుతాయి. ఇక, దేశంలో అత్యధిక శాతంగా ఉన్న మధ్యతరగతి వర్గానికి, పేదలకు ఊరట కలి గించే అంశం... నిత్యావసరాల ధరలు తగ్గడం. బియ్యం, గోధుమలు, పప్పులపై ప్రస్తుతం విధిస్తున్న జీఎస్టీ 18 శాతం కాగా, ప్యాకేజీలో ఉండేవి కాకుండా విడిగా లభించే ఈ వస్తువు లను కొంటే అవి 5 శాతం పరిధిలోకి వస్తా యని అంచనా వేస్తున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందే జీఎస్టీ 2.0ను ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారనీ, ఇది బీజేపీ గెలుపునకు బ్రçహ్మాస్త్రంగా పనికొస్తుందనీ ఆ పార్టీ నేతలు లెక్కలు కడుతున్నారు.రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతుందా?జీఎస్టీ మండలి సమావేశంలో జీఎస్టీ 2.0పై ఏకాభిప్రాయం కుదిరినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినప్ప టికీ... 4 రాష్ట్రాలు తమకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని గగ్గోలు పెట్టాయి. తమకు నష్టపరిహారం చెల్లించాలని బెంగాల్, కేరళ,పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు పట్టుబట్టాయి. కానీ మంత్రి ఆ రాష్ట్రాలకు సర్దిచెప్పారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల వస్తు వినియోగం పెరుగుతుందనీ, దాని వల్ల రాష్ట్రాల ఆదాయం పెరుగుతుందనీ వివరించారు. రాష్ట్రాలకు ఆదాయం చేకూరు స్తున్న రంగాలలో సిమెంటు, ఆటోమొబైల్, గ్రానైట్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల వంటివి ఉన్నాయి. ప్రస్తుతం వీటిపై అత్యధికంగా 18 నుంచి 28 శాతం జీఎస్టీ ఉంది. తాజాగా సవరించిన రేట్ల వల్ల ఈ రంగాల్లో రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో సుమారు 10 శాతం కోత పడనుంది. చాలా కాలంగా ప్రజలు కోరుకుంటున్నట్లుగా... పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ 2.0 పరిధిలోకి తీసుకు రాకపోవడం సామాన్యుల్ని నిరాశపర్చేదే! పెట్రోల్, డీజిల్, విమానాల ఇంధనంగా వాడే టర్బైన్ ఫ్యూయెల్, సహజ వాయువులపై వివిధ రాష్ట్రాలు అత్యధికంగా 18 నుంచి 34 శాతం వరకు విలువ ఆధారిత పన్ను విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలైతే అదనంగా లీటర్ పెట్రోల్, డీజిల్పై రూపాయినుండి రెండు రూపాయల మేర సెస్సు విధిస్తున్నాయి. ఇదిలా ఉండగా, అధిక మోతాదు చక్కెరతో తయారు చేసే చాక్లెట్లు, కేకులు, మిఠాయిలపై జీఎస్టీ తగ్గించటం పట్ల ఆరోగ్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం ఇప్పటికే మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్యలో అగ్రస్థానంలో కొనసాగుతున్న దశలో, చక్కెర పదార్థాల ధరలు తగ్గే చర్యల వల్ల వాటి వినియోగం పెరిగి పిల్లల్లో చక్కెరస్థాయి నిల్వలు పెరుగుతాయని హెచ్చరి స్తున్నారు. ఇంకోవైపు బీడీ కార్మికులకు మేలు చేసే నెపంతో బీడీలపై జీఎస్టీ తగ్గింపు సరికాదంటున్నారు.చైనాతో దోస్తీ... సానుకూలం!అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా విధించిన అదనపు సుంకాల నేపథ్యంలో భారత్ ఆత్మనిర్భర్ దిశగా అడుగులు వేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఒక మార్గం మూసుకుపోయి నప్పుడు, మరో మార్గాన్ని ఏర్పరచుకోవాలన్నట్లుగా ప్రధాని నరేంద్రమోదీ జీఎస్టీ 2.0తో పాటు చైనాతో వాణిజ్య బంధాన్ని మెరుగుపర్చుకోవడం గొప్ప ఊరటనిస్తోంది. ‘అన్నీ మంచి శకునములే’ అన్నట్టుగా భారత్కు అమెరికాతో ఏర్పడిన సంక్షోభతో ప్రత్నామ్నాయ అవకాశాలు లభిస్తున్నాయి. జీఎస్టీ సరళీకరణ వల్ల దేశీయ ఉత్పత్తుల వినియోగం తప్పనిసరిగా పెరుగుతుంది. అదేవిధంగా చైనాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపడటం కారణంగా చైనా పెట్టు బడులు, సాంకేతిక నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయి. ఈ అంశాలను సద్వినియోగం చేసుకొని భారతదేశాన్ని ఆత్మనిర్భర్ దిశగా వడివడిగా అడుగులు వేయించాల్సిన బాధ్యత ప్రధానిదే!డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త మాజీ కేంద్రమంత్రి, ఏపీ శాసన మండలి సభ్యులు -
పడి లేచి... మళ్లీ పడిన కెరటం
బ్రిటిష్ వార్తలు అమితా సక్తితో చదివే వారైతే తప్ప మీకు పీటర్ మ్యాండెల్సన్ ఎవరో తెలిసే అవకాశం లేదు. ఆయన మూడుసార్లు ఉన్నత ప్రభుత్వ పదవి అలంకరించి, ఆ మూడు సార్లూ ఎంతో అవమాన కరంగా వైదొలగిన వ్యక్తి. నాకు తెలిసిన అలాంటి రాజకీయవేత్త ఆయన ఒక్కడే! చివరిసారి, అమెరికాలో బ్రిటన్ రాయబారి పదవి నుంచి సెప్టెంబర్ 11న డిస్మిస్ అయ్యాడు. ఎంతో కష్టపడి అధిరోహించిన విజయ శిఖరం నుంచి అమాంతం జారిపోయాడు. ఇది ఆయనకు కొత్తేం కాదు. అయితే ఎందుకిలా జరుగు తోంది? ఈ ప్రశ్న నన్ను ఆలోచనలో పడేస్తోంది. ఒకానొకప్పుడు ఆయన నాకు మంచి మిత్రుడు. సెక్స్ నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్తో దోస్తీ ఆయన తాజా ఎపిసోడ్కు ముగింపు నిచ్చింది. రాయబారిగా నియమితుడయ్యే సమయంలో ఈ మైత్రీబంధం ఎలాంటిదో ఆయన వివరించినట్లు లేడు. 18 ఏళ్లు నిండని బాలికను వ్యభిచారానికి ప్రేరేపించినట్లు 2008లో నేరం రుజువు అయిన తర్వాత, తన ‘ప్రియ మిత్రుడు’ ఎప్స్టీన్కు అదే ఏడాది జూలైలో పీటర్ ఒక లేఖ రాశారు. ‘‘నీ ప్రపంచం గురించి ఆలోచించాను. జరిగిన దానికి నాకు కోపం వస్తోంది, నిరాశా కలుగుతోంది’’ అని ఈ లేఖలో ఉంది. ‘‘నీ మిత్రులు నీతోనే ఉంటారు, నిన్ను ప్రేమిస్తారు’’.ఈ లేఖ బయట పడిన గంటల వ్యవధిలోనే బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆయనకు ఉద్వాసన పలికారు.మళ్లీ మళ్లీ రాజీనామాలుమ్యాండెల్సన్ను దురదృష్టం వెన్నాడటం ఇది మూడోసారి. డిసెంబర్ 1998లో అప్పటి ప్రధాని టోనీ బ్లెయిర్ మంత్రి మండలిలో వాణిజ్యం, పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి దెబ్బ తిన్నాడు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ప్రభుత్వ చెల్లింపుల ముఖ్య అధికారి’ (పే మాస్టర్ జనరల్) జ్యాఫ్రీ రాబిన్సన్ నుంచి 3,73,000 పౌండ్ల అన్సెక్యూర్డ్ రుణం తీసుకున్నట్లు బయటపడటంతో ప్రధాని ఆయనతో రాజీనామా చేయించారు.ఇది జరిగిన రెండేళ్లలోనే పీటర్ మళ్ళీ ఉన్నత పదవి అలంకరించ గలిగాడు. ఈసారి ఉత్తర ఐర్లాండ్ వ్యవహారాల మంత్రిగా నియమితులయ్యాడు. శ్రీచంద్ హిందూజాకు బ్రిటిష్ పౌరసత్వం ఇప్పించేందుకు అధికార దుర్వినియోగం చేశాడని ఆరోపణలు రావడంతో 2001 జనవరిలో మ్యాండెల్సన్ మళ్లీ రాజీనామా చేయవలసి వచ్చింది.ఏమయినప్పటికీ, అంతటి దురదృష్టం కూడా పీటర్ రాజకీయ జీవితాన్ని అంతం చేయలేక పోయింది. యూరోపియన్ యూనియన్లో బ్రిటన్ కమిషనర్గా పని చేశాడు. ఆ తర్వాత గోర్డాన్ బ్రౌన్ కేబినెట్లో బిజినెస్ సెక్రటరీగా చేరాడు. ఫస్ట్ సెక్రటరీ(ఉప ప్రధాన మంత్రి)గా పదోన్నతి కూడా పొందాడు. ఆయనకు దేవుడి ఆశీస్సులు, సాతాను శాపాలు... రెండూ ఉన్నట్టుంది. ఒకరు శిఖరం మీదకు చేర్చితే, మరొకరు పాతాళానికి లాగేస్తారు.నాకాయన తెలిసున్న రోజుల్లో ఇలాంటి ఆటు పోట్లు ఏవీ లేవు. అది 1980ల నాటి విషయం. ఆయన వయస్సు 30 పైన ఉంటుంది. మేం అప్పుడు లండన్ వీకెండ్ టెలివిజన్లో టీవీ ప్రొడ్యూసర్లుగా పని చేస్తున్నాం. బహుశా బ్రిటన్లో బాగా పేరు పొందిన ‘వీకెండ్ వరల్డ్’ కరెంట్ ఎఫైర్స్ అనే ప్రోగ్రామ్ చేసే వాళ్ళం. లెజెండరీ బ్రియాన్ వాల్డెన్ దానికి యాంకర్.ఆ రోజుల్లో పీటర్ పొడవుగా సన్నగా ఉండి కులీనుడిలా కనబడే వాడు. పీటర్ తాత క్లెమెంట్ అట్లీ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నాడు. కొంతమంది పీటర్ను అహంభావి అనుకునేవారు. మితభాషి కావడంతో ఆ అపవాదు వచ్చి ఉంటుంది. ఒకటి మాత్రం వాస్తవం... ఆయన అంత త్వరగా దగ్గరయ్యే మనిషి కాడు. చాలామందిని దూరంలో ఉంచేవాడు. అప్పట్లో జరిగిన ఒక సంగతి చెబుతాను. ఏదో వివరించే ప్రయత్నం చేస్తూ, ఆ ఉత్సాహంలో పీటర్ తన కుడి చేతిని విసురుగా కదిలించాడు. అంతే... అది కాస్తా కాఫీ కప్పును తాకింది. కాఫీ ఒలికిపోయింది. నేను రాస్తున్న స్క్రిప్ట్ తడిసిపోయింది. అతడు చేసింది ఘోర తప్పిదం. ప్రోగ్రామ్ ఎయిర్ అయ్యేందుకు ఎంతో సమయం లేదు.పీటర్ తక్షణం క్షమాపణలు చెప్పాడు. ఇరకాటంలో పడినందుకో, తన మీద తనకే వచ్చిన కోపంతోనో... ముఖం కందగడ్డ అయ్యింది. తనే టైప్ చేసి పెట్టాడు. పూర్తి చేసి ఇచ్చేసరికి అర్ధరాత్రి దాటింది. టైప్ చేస్తూ కొన్ని మార్పులు కూడా చేశాడు. స్క్రిప్ట్ మరింత బాగా వచ్చింది. విజయం ఆయన్ను అత్యున్నత శిఖరాలకు చేర్చింది. అంత ఎత్తున నిలిచిన పీటర్ను నిశితంగా చూడగలిగినవారు, ఆయన ఆత్మీయ స్వభావం గుర్తించగలిగిన వారు... ఎంతమంది ఉంటారు? నేను మాత్రం ఆయన్ని ఆత్మీయ వ్యక్తిగానే గుర్తు చేసుకుంటాను. ఆయన ఎప్పటి లాగా ఉవ్వెత్తున ఎగిసి మరో విజయ శిఖరం అందుకుంటాడు... ఇది నా నమ్మకం. పీటర్ను మరోసారి అదృష్టం వరిస్తుందనీ, త్వరలోనే మేం కలుసుకుంటామనీ ఆశిస్తున్నాను.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అలాస్కా నుంచి అయోమయంలోకి!
రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఆగస్టు 15న అలాస్కాలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో పాటు యూరోపియన్ నాయకు లతో 18న వైట్హౌస్లో ముఖాముఖి చర్చలు జరిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇక యుద్ధం ముగింపునకు మార్గం సుగమమవుతున్నదనే సూచనలు ప్రపంచానికి ఇచ్చారు. సరిగ్గా మూడు వారాలు గడిచేసరికే పరిస్థితి అయోమ యంగా మారగా, ఆయన సెప్టెంబర్ 6న అదే వైట్హౌస్లో అమెరికన్ కాంగ్రెస్ సభ్యులతో మాట్లాడుతూ, యుద్ధాన్ని ఆపలేకపోతున్నట్లు అంగీకరించారు. ప్రయత్న లోపం లేకపోయినా...దాని అర్థం ట్రంప్ ప్రయత్నాలు నిలిచిపోతాయని కాదు. ఇందులో తన ప్రయత్న లోపం ఏమీ లేదు. సైద్ధాంతికంగా, భౌగోళిక రాజకీయాల దృష్ట్యా తక్కిన అమెరికన్ అధ్యక్షుల వలెనే ట్రంప్ కూడా రష్యా వ్యతిరేకి. అది తన మొదటి పదవీ కాలంలో (2017–21) స్పష్టంగానే కనిపించింది. కానీ ఈ రెండవ విడతకు వచ్చేసరికి యుద్ధాలకు వ్యతిరేకినని ప్రకటించుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి అయితే ఎన్నికల ప్రచార సమయంలోనే ఆ వైఖరి తీసుకుని 24 గంటలలోనే ఆ స్థితిని ముగింపజేస్తానన్నారు. ఆ మాటను అక్షరాలా తీసుకుని నిందించనక్కరలేదు గాని, ఆ దిశలో ప్రయత్నాలను మాత్రం 24 గంటలలోనే మొదలుపెట్టారు. అప్పటి నుంచి గత ఎనిమిది మాసాలలో తన ప్రతినిధులను మాస్కో, కీవ్, బ్రస్సెల్స్లకు పలుమార్లు పంపారు. కొందరిని వైట్హౌస్కురప్పించి చర్చించారు. పుతిన్, జెలెన్స్కీ తదితరులతో పలుమార్లు టెలిఫోన్ సంభాషణలు జరిపారు. రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధి వర్గాల మధ్య ఇస్తాంబుల్లో చర్చలు జరిగేట్లు చూశారు. యుద్ధ విరమ ణకు, సమస్య పరిష్కారానికి ఉభయ పక్షాలు తమ తమ ప్రతిపాద నలను ప్రకటించేట్లు చూశారు. ఆంక్షల రూపంలో రష్యాను, ఆయు ధాల సరఫరా నిలిపివేత రూపంలో ఉక్రెయిన్ను ఒత్తిడి చేశారు.ఇంత తక్కువ కాలంలో ఇన్నిన్ని ప్రయత్నాలన్నది సాధారణమైన విషయం కాదు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి మూల కారణం ఎక్కడుందనే అవగాహన ట్రంప్కు ఉంది. నాటో సైనిక కూటమిని రష్యా సరి హద్దు వరకు విస్తరించజూడటం వల్లనే అభద్రతాభావానికి గురైన పుతిన్ ఈ యుద్ధాన్ని సాగిస్తున్నారని అనేకమార్లు అన్నారాయన. ఉక్రెయిన్, యూరోపియన్ నాయకులకు ముఖాముఖిగా చెప్పటమే గాక, ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకునే ప్రసక్తి లేదని ప్రకటించారు. మొదట 20 ఏళ్లపాటు అని, తర్వాత ఎప్పటికీ జరగదన్నారు. క్రిమియా, దోన్బాస్లను రష్యాకు వదలివేయాలనీ చెప్పారు. ఈ ప్రతిపాదనలకు జెలెన్స్కీ, యూరోపియన్ నాయకులు సుముఖత చూపకపోవటంతో, ఇక మీ ఖర్మ మీదన్నట్లు మాట్లాడారు. పాశ్చాత్య సామ్రాజ్యవాదానికి, నాటో సైనిక కూటమికీ నాయకత్వ స్థానంలోగల ఒక దేశాధినేత ఇటువంటి వైఖరి తీసుకోవటం మామూలు విషయం కాదు.యూరప్ మొండితనంఇంతకూ పరిస్థితి అలాస్కా నుంచి అయోమయంలోకి వెళ్లటా నికి కారణాలేమిటి? అందుకు బాధ్యత యూరోపియన్ నాయకు లది. ముఖ్యంగా బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్లది. జెలెన్స్కీని అడుగడు గునా రెచ్చగొట్టి రాజీలు జరగకుండా చేస్తున్నది వారే. భూభాగా లను వదులుకునేందుకు జెలెన్స్కీ పరోక్షంగా సిద్ధపడగా, ఆ మాటను వారు మార్పించారు. తమకు పూర్తి రక్షణ హామీలు చాలు నన్న ప్రతిపాదనను జెలెన్స్కీ ఒక దశలో చేయగా, అందుకు పుతిన్ను ట్రంప్ ఒప్పించారు. నాటో ఛార్టర్లో 5వ నిబంధన అనేది ఒకటుంది. ఒక నాటో సభ్య దేశంపై ఇతరులు దాడి జరిపితే మొత్తం అందరిపై దాడి జరిపినట్లుగా పరిగణించి అందరూ ఆ దేశానికి రక్షణగా ముందుకు రావాలని ఆ నిబంధన చెప్తున్నది. ఉక్రెయిన్కు సభ్యత్వం ఇవ్వకపోయినా ఆ నిబంధనను పోలిన రక్షణలు ఇచ్చేందుకు సిద్ధమని ట్రంప్ ప్రకటించారు. అందుకు కూడా అలాస్కాలో అంగీకరించిన పుతిన్, ఉక్రెయిన్ ప్రజలకు రక్షణ అవసరమేనన్నారు. ఈ ప్రస్తావనలన్నీ ఆగస్టు 18 నాటికి వైట్హౌస్ చర్చలలో వచ్చాయి. ఇక త్వరలో పుతిన్, జెలెన్స్కీల ముఖాముఖి సమావేశం జరిగి వారొక అంగీకారానికి రానున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆ సమావే శానికి తగిన స్థలం కోసం వెతుకుతున్నారని, వారిద్దరి చర్చల తర్వాత ఒకవేళ ఆహ్వానించినట్లయితే తాను కూడా వెళ్ళగలనని అన్నారు.అటువంటి ఆశావహమైన సూచనల మధ్య అంతలోనే అంతా బెడిసిపోయింది. ఆ పరిణామాల మధ్య నుంచే ట్రంప్ సెప్టెంబర్ 6 నాటి నిస్పృహతో కూడిన వ్యాఖ్యలు వినిపించాయి. ‘నాటో’ విస్తరణ ఆగితేనే...అట్లా బెడియటానికి కనిపించే తక్షణ కారణం, ఉభయ పక్షాల మధ్య ఒప్పందం కుదిరే వరకు దాడులు కొనసాగించగలమనీ, అట్లాగాక ఉక్రెయిన్ పక్షం పట్టుబడుతున్నట్లు ముందుగానే కాల్పుల విరమణ జరిగితే ఆ వ్యవధిని ఉపయోగించుకుని సైన్యాన్ని, ఆయుధాలను సమీకరించుకోగలరనీ రష్యా వాదిస్తుండగా, అటు వంటిదేమీ చేయబోమనే హామీని ఇవ్వని ఉక్రెయిన్ తన దాడులు తాను సాగిస్తుండటం. ఇందులో ట్రంప్ రష్యా వైఖరినే సమర్థించారు. ఇది తక్షణ కారణం కాగా, కనీసం ట్రంప్ ప్రతిపాదించిన ప్రకారమైనా భూమిని రష్యాకు వదలుకోవటానికి ఉక్రెయిన్ నిరాకరిస్తుండటం ప్రధానమైంది. ఉక్రెయిన్ రక్షణ కోసం యుద్ధ ఆరంభంలో జరిగిన ఒప్పందం మేరకు అమెరికా, రష్యా, చైనా, ఇంగ్లండ్, జర్మనీ హామీగా నిలిస్తే సరిపోతుందని పుతిన్ అంటుండగా, యూరోపియన్ దేశాలు ఉమ్మడి సేనలను పంపగలవన్నది బ్రస్సెల్స్ వాదన. ఉక్రెయిన్ భూభాగంలో అటువంటి సేనల ప్రవేశాన్ని ఎంతమాత్రం సమ్మతించబోమని పుతిన్ స్పష్టం చేస్తున్నారు. అలాస్కా వైట్హౌస్ చర్చల అనంతరం విషయమంతా ఇక్కడ స్తంభించిపోయింది. అక్కడి నుంచిముందుకు ఎట్లా, ఎప్పటికి కదిలేనో ట్రంప్కు బోధపడుతున్నట్లు లేదు. ఆ నిస్సహాయతలో తను చేయగల పని రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే ఇండియా వంటి దేశాలపై సుంకాలు పెంచటం ఒక్కటే గనుక అది మాత్రం అర్థంపర్థం లేకుండా చేస్తున్నారు. నాటో విస్తరణ సమస్య ఇపుడు కొత్తగా తలెత్తింది కాదు. 1991లో సోవియెట్ యూనియన్ వార్సా కూటమి రద్దయినాక కూడా, ప్రస్తుత ఉక్రెయిన్ యుద్ధానికి ముందు రష్యా వ్యతిరేకతను లెక్కచేయకుండా నాటోను అయిదుసార్లు విస్తరించారు. యుద్ధం మొదలైనాక ఆ పని మరో రెండుసార్లు చేశారు. ఆ చర్యలను రష్యా అప్పటి అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్, ఆ తర్వాత పుతిన్ వ్యతిరేకిస్తూ వచ్చారు. అయినప్పటికీ అమెరికా అధ్యక్షులు ముఖ్యంగా క్లింటన్తో మొదలుకొని బైడెన్ వరకు వేగంగా విస్తరిస్తూ పోయారు. ఇపుడా దేశాల సంఖ్య 32కు చేరింది. ట్రంప్ మినహా ఆ నాయకుల లక్ష్యమంతా ఉక్రెయిన్ను కూడా చేర్చుకుని రష్యాను చుట్టుముట్టడం. ఇది పుతిన్కు తెలుసు.-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు-టంకశాల అశోక్ -
సాంకేతిక సమానత్వ యోధుడు
ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం పొందడమనే ఓ సుదీర్ఘ ప్రక్రియ మీకు గుర్తుందా? పదేపదే కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు, కొండవీటి చాంతాడులా బారులు తీరిన జనాలు, అడపాదడపా రుసుముల చెల్లింపులు... ఇప్పుడివన్నీ మాయమై, మీ అరచేతిలోని ఫోన్లో సాక్షాత్తూ ప్రపంచమే ఇమిడిపోయింది. ఇది ఎంతమాత్రం ఆకస్మిక పరిణామం కాదు.ప్రధానమంత్రి మోదీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశపు సమానత్వ ఆయుధంగా మలిచారు. కార్పొరేట్ ప్రపంచంలోని ఓ ఉన్నతాధికారి తరహాలో ముంబయిలోని ఒక వీధి వ్యాపారి కూడా నేడు అదే యూపీఐ చెల్లింపు వ్యవస్థను ఉపయోగించగలడు. ఈ పరిణామం మోదీ అనుసరించే అంత్యోదయ సూత్రం కీలక లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టే, వరుసలో చివరి వ్యక్తికీ సాంకేతికత చేరువైంది.బీజం పడింది అక్కడే!మోదీ ముఖ్యమంత్రి హోదాలో తొలుత సాంకేతికత, ఆవిష్క రణల వినియోగం ద్వారా గుజరాత్ రూపాంతరీకరణకు కృషి చేశారు. ‘జ్యోతిగ్రామ్’ పేరిట ఆయన 2003లో ప్రారంభించిన పథకం ‘ఫీడర్ సెపరేషన్ టెక్నాలజీ’ని విజయవంతంగా ఉపయో గించింది. తద్వారా నిర్దిష్ట సమయం ప్రకారం వ్యవసాయ విద్యుత్ సరఫరాతో భూగర్భ జల క్షీణత అదుపులోకి వచ్చింది. మరోవైపు 24 గంటల విద్యుత్ సౌకర్యం గ్రామీణ పరిశ్రమలకు ఉత్తేజమిచ్చింది. చిన్న వ్యాపారాల విస్తృతితో వలసలు తగ్గాయి. ఒక అధ్యయనం ప్రకారం ఈ పథకంపై పెట్టిన రూ.1,115 కోట్ల పెట్టుబడి కేవలం రెండున్నరేళ్లలో తిరిగి వచ్చింది.నర్మదా నది కాలువపై 2012లో సౌర ఫలకాల ఏర్పాటుకు ఆయన నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 16,000 ఇళ్లకు ఏటా 1.6 కోట్ల యూనిట్ల విద్యుదుత్పాదన సాధ్యమైంది. మరోవైపు కాలువలో నీరు ఆవిరయ్యే ప్రక్రియ మందగించి, రైతులకు నీటి లభ్యత పెరిగింది. సాంకేతికతపై మోదీ దార్శనికతకు ఈ జోడు ప్రయోజ నాల విధానమే నిదర్శం. ఇక ‘ఇ–ధర’ వ్యవస్థ ద్వారా భూ రికార్డుల డిజిటలీకరణ చేపట్టారు. ‘స్వాగత్’ పేరిట పౌరులకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముఖ్యమంత్రితో నేరుగా ముచ్చటించే వీలు కలిగింది. ఆన్లైన్ టెండర్లతో అవినీతి అంతమైంది.జాతీయ యవనికపై...గుజరాత్లో సముపార్జించిన అనుభవాన్ని, ఆచరణాత్మక విధా నాలను ఆయన 2014లో ఢిల్లీకి తెచ్చారు. అనతి కాలంలోనే డిజిటల్ సార్వజనీన మౌలిక సదుపాయాలతో ‘ఇండియా స్టాక్’ రూపు దిద్దుకుంది. జన్ధన్, ఆధార్, మొబైల్ త్రయమే వీటికి పునాది.దేశవ్యాప్తంగా 53 కోట్ల మందికిపైగా ప్రజలను జన్ధన్ ఖాతాలు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తెచ్చాయి. వీధి వ్యాపారులు, రోజుకూలీలు సహా పూర్తిగా నగదు లావాదేవీలు నిర్వహించే గ్రామీణులకూ ఇవాళ బ్యాంకు ఖాతాలున్నాయి. ఆధార్ పౌరులకు డిజిటల్ గుర్తింపునిచ్చింది. ఇప్పటివరకు 142 కోట్ల ప్రజలు దానికింద నమోదు చేసుకున్నారు. ఆధార్ ద్వారా ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) ద్వారా మధ్యవర్తుల జోక్యం తొలగి, నిధులు పక్కదారి పట్టడం తగ్గింది. డీబీటీని అవలంబించడం ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది.యూపీఐ ద్వారా దేశంలో చెల్లింపుల తీరులో సమూల మార్పు లొచ్చాయి. ఇది ప్రారంభించినప్పటి నుంచి 55 కోట్లకు పైగా వినియోగదారులు లావాదేవీలు నిర్వహించారు. ఒక్క 2025 ఆగస్టులోనే 20 బిలియన్లకు పైగా లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ. 24.85 లక్షల కోట్లు. నేడు ప్రపంచవ్యాప్తంగా రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో సగం భారత్లోనే జరుగుతున్నాయి. డిజిటల్ లావాదేవీలు నిర్వహించాల్సిందిగా కోవిడ్ సమయంలో ఆయన కోరిన వేళ, ఆర్థిక వ్యవ స్థలో ఆ దిశగా సానుకూల వాతావరణం ఏర్పడింది. ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వీసా కన్నా యూపీఐ ఎక్కువ లావాదేవీ లను ప్రాసెస్ చేస్తోంది. ఇప్పుడొక చిన్న మొబైల్ ఫోనే ఓ బ్యాంకు. సాంకేతికత అందరిదీ!సాంకేతికత వల్ల వ్యవసాయం, ఆరోగ్య రక్షణ రంగాల్లో సమూ లమైన మార్పులు వచ్చాయి. హరియాణాలో ఉండే ఓ రైతు జగదేవ్ సింగ్ విషయమే తీసుకోండి! ఆయనిప్పుడు ఏఐ యాప్లను ఉపయోగించి పంట సంబంధిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కచ్చితమైన వాతావరణ సమాచారాన్ని, భూసారా నికి సంబంధించిన డేటాను తన ఫోన్ లోనే తెలుసుకుంటున్నారు.పీఎం–కిసాన్ పథకం 11 కోట్ల రైతులకు డిజిటల్ పద్ధతిలో నేరుగా ఆర్థిక చేయూతను అందిస్తోంది. డిజి లాకర్కు ఇప్పుడు 57 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. 967 కోట్ల పత్రాలు అందులో డిజిటల్గా నిల్వ అయి ఉన్నాయి. మీ డ్రైవింగ్ లైసెన్సు, డిగ్రీ సర్టిఫికెట్లు, ఆధార్, ఇతర అధికారిక పత్రాలు భద్రంగా మీ ఫోన్ లోనే ఉంటాయి. ఇకపై రోడ్డు మీద పోలీసు తనిఖీల్లో భౌతిక పత్రాల కోసం తడబడాల్సిన అవసరం లేదు. డిజి లాకర్ నుంచి మీ డిజిటల్ లైసెన్సును చూపించండి చాలు. తక్షణ ఆధార్ ధ్రువీకరణ ద్వారా... ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు సులభతరమైంది.అసాధ్యం అనిపించిన దానిని భారతదేశం సాధించింది. మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని... అది కూడా హాలీవుడ్ సినిమా కంటే తక్కువ బడ్జెట్తో చేరుకుంది. ప్రపంచ స్థాయి ఫలితాలను అందిస్తూ భారతీయ ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని నిరూ పించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ పై చేసిన వ్యయం రూ. 450 కోట్లు మాత్రమే. చంద్రయాన్–3 భూ ఉపగ్రహంపై దిగిన నాలుగో దేశంగా భారత్ను నిలబెట్టింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా భారత్ చరిత్రకెక్కించింది. ఒకే మిషన్ లో 104 ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో ప్రపంచ రికార్డు సృష్టించింది. భారతదేశ రాకెట్లు ఇప్పుడు 34 దేశాల ఉపగ్ర హాలను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నాయి. ‘గగన్ యాన్’ మిషన్తో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంతరిక్షంలోకి మాన వులను పంపిన నాలుగో దేశంగా కూడా భారత్ నిలవనుంది. పీఎం గతిశక్తి పోర్టల్ అపూర్వమైన స్థాయిలో జీఐఎస్ టెక్నా లజీని ఉపయోగిస్తోంది. ప్రతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టునూ డిజిటల్గా మ్యాప్ చేస్తారు. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడ రేవులన్నీ కలిసి సమన్వయ ప్రణాళికగా రూపొందిస్తారు. ఇకపై సమన్వయ లోపం వల్ల జరిగే ఆలస్యం ఉండదు.ఇండియా ఏఐ మిషన్ ద్వారా, 38,000 జీపీయూలు మూడింట ఒక వంతు ప్రపంచ ధరతో అందుబాటులో ఉన్నాయి. ఇది స్టార్టప్ లకు, పరిశోధకులకు, విద్యార్థులకు సిలికాన్ వ్యాలీ స్థాయి కంప్యూ టింగ్ను గంటకు సగటున రూ. 67 రేటుతో అందించింది.మానవ అనుసంధానంప్రధాని మోదీకి సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసు. కానీ ఆయన ప్రజలను మరింత బాగా అర్థం చేసుకున్నారు. అంత్యో దయకు సంబంధించి ఆయన దార్శనికత ప్రతి ఒక్క డిజిటల్ కార్య క్రమాన్నీ ముందుకు నడిపిస్తోంది. యూపీఐ బహుళ భాషల్లో అందు బాటులో ఉంది. అత్యంత ధనిక పారిశ్రామికవేత్తతో సమానమైన డిజిటల్ గుర్తింపును నిరుపేద రైతు కూడా కలిగి ఉన్నాడు.సింగపూర్ నుంచి ఫ్రాన్స్ వరకు ఎన్నో దేశాలు యూపీఐతో అనుసంధానమైనాయి. సమ్మిళిత వృద్ధికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ అవసరమని జీ20 ఆమోదించింది. దీనికి జపాన్ పేటెంట్ మంజూరు చేసింది. భారత్ పరిష్కారంగా ప్రారంభమైన యూపీఐ డిజిటల్ ప్రజాస్వామ్యానికి ప్రపంచ నమూనాగా మారింది.గుజరాత్లో మోదీ చేసిన ప్రారంభ ప్రయోగాల నుంచి డిజిటల్ ఇండియా వరకు... ఈ ప్రయాణం జీవితాలను మార్చే సాంకేతిక పరిజ్ఞాన శక్తిని ప్రదర్శిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయన తన పాలన సారాంశంగా మార్చారు. పాలకులు మానవీయ కోణంలో సాంకేతికతను స్వీకరించినప్పుడు, మొత్తం దేశాలు భవిష్యత్తులోకి దూసుకెళ్లగలవని ఆయన నిరూపించారు.అశ్వినీ వైష్ణవ్వ్యాసకర్త కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార – ప్రసార శాఖ మంత్రి -
గయ మహిమ : ఆయన శరీరమే క్షేత్రంగా
‘త్రిమూర్తుల్లో భేదం లేదు, ముగ్గురూ ఒకటే’ అనటానికి గయ క్షేత్రం నిదర్శనం. చనిపోయిన ఆత్మీయ బంధు మిత్రుల పేర ఈ చోట కర్మకాండలా చరిస్తే మరణించిన వారికి ఉత్తమ గతులు కల్గుతాయి. ఈ కర్మనే ‘గయా శ్రాద్ధ’ మంటారు. మన ఇంటిలో పితృకార్యం జరిగినప్పుడు కూడా ‘గయా శ్రాద్ధ ఫలితమస్తు’ అని మంత్రం చదువుతారు. పిండ ప్రదానం చేస్తూ ‘గయా పిండ సదృశా భవంతు’ అని అంటారు. మన దేశంలో గయ, కాశీ, ప్రయాగ... ఈ మూడు ఈ విషయంలో అత్యంత ముఖ్యమైన క్షేత్రాలు, తీర్థాలున్నూ! వీటినే క్షేత్ర త్రయమంటారు. ఈ గయా క్షేత్రానికి పెద్ద చరిత్ర ఉంది. వేల సంవత్సరాలకు పూర్వం గయుడనే రాక్షసుడుండేవాడు. విష్ణువును గురించి ఘోరంగా తపస్సు చేసి, వందల మైళ్ళ దీర్ఘమైన భారీ శరీరం కావాలని వరం కోరుకున్నాడు. క్షణంలో అంత పెద్ద భయంకర శరీరం గయునికి వచ్చింది. గర్వం నెత్తికెక్కినప్పుడు ఎవరికైనా తిక్క మాటలు వస్తాయి. ఏకంగా బ్రహ్మదేవుడినే ఉద్దేశించి, ‘నీకేమైనా వరం కావాలంటే కోరుకో’ అన్నాడు. ఎంత కండకావరమో చూడండి! ‘అయితే గయుడా! ఈ శరీర భాగాల్లో ఒక చోట నాకు యజ్ఞం చేయాలని ఉంది’ అంటాడు బ్రహ్మ. ‘అలాగే యజ్ఞం చేయి కానీ, ఒక షరతు! అప్పుడు నా శరీరం కదలటానికి వీలులేనంత బరువు నాపై పెట్టాలి’ అన్నాడు. బ్రహ్మ ముందు శివ పార్వతులను ప్రార్థించాడు. ‘శివ శిల’ అనే పెద్ద రాయిని గయుడి మీద పెట్టారు. వెంటనే రాక్షసుని రొమ్ము మీద నిలబడ్డాడు విష్ణువు. ఎంత గింజుకున్నా గయుడింక కదలలేడు. బ్రహ్మ సంకల్పం కదా! శివుని శిల, విష్ణు పాదం... ఈ ముగ్గురి స్పర్శాదుల వల్ల వాడిలో మార్పు వచ్చింది. ‘త్రిమూర్తులు నా వల్ల జగత్తుకు ఏ మాత్రం బాధ కలగకూడదని సంకల్పించి యుక్తిగా నా లోని చెడును ఈ విధంగా తొక్కిపెట్టారు’ అని తప్పు తెలుసుకున్నాడు. ‘నా చివరి కోరిక ఒక్కటే. ఈ ప్రాంతానికి నా పేరు పెట్టాలి. నా మీద పడిన పవిత్ర పాదముద్రలకు అభిషేకం చేసినా, పితృశ్రాద్ధం చేసినా, నివేదనం పెట్టినా భక్తులను అనుగ్రహించాలి’ అని ప్రార్థించాడు.తమాషా ఏమిటంటే ఇంతవరకూ బ్రహ్మ గయుని దేహం మీద యజ్ఞం చేయలేదు. గయుని పైకి లెమ్మని కూడా అనలేదు. గయుని శరీరమే గయా క్షేత్రంగా ఉండిపోయింది. త్రిమూర్తుల సమష్టి కృషి ఫలితంగా లోక కల్యాణం కలుగుతున్నది.శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
ఇది విమోచనమే!
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తిన సాహితీ యోధుడు స్వర్గీయ దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవం ఇటీవలే జరుపుకొన్నాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17ను ‘విమోచన దినోత్సవం’గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఏడాది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా రానుండటం కోట్లాది తెలంగాణ రతనాలతో దాశరథికి నివాళులు అర్పించడమే అవుతుంది. వీరులను స్మరించుకోవడానికి...1998 సెప్టెంబర్ 17న హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో భార తీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, నాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన సమర యోధులను సత్కరించి వారి సమక్షంలోనే సెప్టెంబర్ 17ను ‘హైదరాబాద్ విమోచన దినం’గా ప్రకటించి, ప్రభుత్వమే అధికారిక ఉత్సవాలను నిర్వహించాలనీ, ప్రధాన కూడళ్లలో పోరాట యోధుల విగ్రహాలను ప్రతిష్ఠించాలనీ డిమాండ్ చేశాం. అది మొదలు బీజేపీ ఈ అంశంపై నిరంతరం ఉద్యమాలు చేస్తూనే ఉంది. ఇకపై ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విముక్తి దినం’ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించిందంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2024 మార్చ్ 12న ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘‘1947 ఆగస్ట్ 15న భారతదేశం స్వాతంత్య్రం పొందిన 13 నెలల వరకూ హైదరాబాద్కు స్వేచ్ఛ లభించలేదు. అది నిజాం పాలనలో ఉంది. ‘ఆపరేషన్ పోలో’ పేరిట పోలీస్ చర్య తర్వాత 1948 సెప్టెంబర్ 17న ఈ ప్రాంతం నిజాం పాలన నుండి విముక్తి పొందింది. అయితే, సెప్టెంబర్ 17ను ‘హైదరాబాద్ విముక్తి దినం’గా జరపాలని ఈ ప్రాంత ప్రజల నుండి డిమాండ్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ను విముక్తి చేసిన మర వీరులను స్మరించుకోవడానికీ, యువత మనస్సులో దేశభక్తి జ్వాలను నింపడానికీ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విముక్తి దినం’ జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది’’ అని ఆ గెజిట్లో పేర్కొన్నారు. అసంబద్ధమైన పేర్లుగతంలో హైదరాబాద్ సంస్థానంలో ఉండి... మహారాష్ట్ర, కర్ణాటకల్లో కలిసిన జిల్లాల్లో ఆ ప్రాంత ప్రజల ఒత్తిడి మేరకు అక్కడ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. 2001 నుంచి మహా రాష్ట్రలో, 2009 నుంచి కర్ణాటకలో అక్కడి ప్రభుత్వాలు అధికారిక విమోచన ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ నిర్ణయాలు తీసుకున్నవి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాలే కావడం విశేషం. తెలంగాణలో మాత్రం ప్రజలు ఎన్ని ఉద్య మాలు చేసినా ప్రభుత్వాలు మాత్రం అధికారికంగా విమోచన ఉత్సవాలు నిర్వహించేది లేదని భీష్మించుకు కూచున్నాయి. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో చివరకు ఒక మెట్టు దిగి గత మూడు సంవత్సరాలుగా అధికారిక వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ వేడుకలను ‘విమోచన దినోత్సవం’గా కాకుండా ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’, ‘ప్రజా పాలనా దినోత్సవం’ అంటూ సంబంధం లేని పేర్లతో సెప్టెంబర్ 17 ఉద్దేశ్యాన్ని నీరుగార్చడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత రాజ్యాంగం స్వభావ రీత్యా సమాఖ్యగా ఉన్నా... ఆత్మ ఒక్కటే అని సాధారణంగా చెప్పుకొంటాం. అందుకే, రాజ్యాంగంలో ఈ దేశాన్ని ‘రాష్ట్రాల సమాఖ్య’గా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ ప్రచురించి సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అధికారిక వేడుకలు నిర్వహిస్తుంటే... దానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వేరే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం అసంబద్ధంగా ఉంటుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. 1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి హైదరాబాద్ సంస్థానం దేశంలోని సంస్థానాల్లో చాలా పెద్దది. బ్రిటిష్ అండదండలతో అరాచకాలు సాగిస్తున్న నిజాం నవాబుపై తెలంగాణ ప్రజలు పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావుతో పాటు ఎంతో మందిని ఉస్మానియా యూనివర్సిటీ నుండి బహిష్కరిస్తే ఇతర రాష్ట్రాల్లో చదువు కొనసాగించి విద్యావంతులుగా విలసిల్లారు. పరకాల, బైరాన్పల్లిల్లో వెలుగు చూసిన దారుణ కృత్యాలు హైదరాబాద్ సంస్థానంలో అడుగడుగునా జరిగాయి. తెలంగాణ విమోచన కోసం ఆనాడు ప్రతి గ్రామంలో పోరాటాలు జరిగాయి. అతి సామన్యులైన మహిళలు, పురుషులు దృఢ చిత్తంతో సైనికులై పోరాడిన ఘటనలు కోకొల్లలు. వారి త్యాగాలు అనన్య సామాన్యం, అనితర సాధ్యం. రాబోవు తరాలకు వారి చరిత్ర ప్రేరణ దాయకం. ఒళ్లుగగుర్పొడిచే సాహస ఘట్టాలెన్నో ఉద్యమ చరిత్రలో కనిపిస్తాయి. ఆ ప్రజా పోరాటమే పోలీసు చర్యకు మార్గం సుగమం చేసింది. అందుకే 1948 సెప్టెంబర్ 17 ‘హైదరాబాద్ విమోచన పొందిన రోజు’ తప్ప మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వం విమోచన దినంగా అధికారిక ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విమోచన దినంపేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించి, అమర వీరులకు నివాళులు అర్పించాల్సిన బాధ్యత ఉంది.సీహెచ్. విద్యాసాగర్ రావు వ్యాసకర్త మహారాష్ట్ర మాజీ గవర్నర్ -
రాజ్యాంగం కంచెను రాజకీయం మేసేస్తోంది!
దేశంలో రాజ్యాంగం తరచూ అపహాస్యం పాలవుతోంది అనేందుకు ఇదో తాజా ఉదాహరణ. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదిమంది తాము అదే పార్టీలో ఉన్నామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఇచ్చిన తీరు చూస్తే విస్తుపోవాల్సిందే. బీఆర్ఎస్ జెండాతో 2023 శాసనసభ ఎన్నికలలో గెలిచిన తరువాత వీరందరూ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన విషయం బహిరంగ రహస్యం. వీరి అనర్హత కోరుతూ బీఆర్ఎస్ న్యాయస్థానాలను ఆశ్రయించడం.. చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ అంశం త్వరగా తేల్చాలని కోరడం అందరికీ తెలుసు. అయితే... చట్టాలు చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి తాము అసలు పార్టీ మారనేలేదని బుకాయిస్తూండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు నెలల గడువు కాస్తా దగ్గరపడటంతో పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది ఈ తీరున సమాధానమిచ్చారు. వీరు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి.ఆ ఉప ఎన్నికలలో గెలుస్తామో, లేదో అన్న అనుమానం కావచ్చు.. లేక ఎందుకు ఖర్చు అన్న భావన కావచ్చు. వీరు ఇలా కధ నడుపుతున్నారని అనుకోవాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేల వివరణకు ప్రతిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ సూచన మేరకు మళ్లీ కొత్త సాక్ష్యాధారాలు ఆయన ఆఫీస్లో సమర్పించారు. ఇక్కడ చిత్రం ఏమిటంటే ఎమ్మెల్యేలు ఫిరాయించారా? లేదా అన్నదానిపై స్పీకర్కు, అన్ని పార్టీలకు క్లారిటీ ఉంటుంది. న్యాయ వ్యవస్థకు కూడా ఇందులో ఉన్న వాస్తవాలనండి, మతలబు అనండి తెలియకుండా ఉండదు. అయినా ఈ డ్రామా అంతా నడవాల్సిందే. అదే మన రాజ్యాంగ బలహీనతేమో! ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పక్షాన గెలిచినా, తదుపరి జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2023 శాసనసభ ఎన్నికలలో పోటీ చేశారు. దీంతో దానం పరిస్థితి కాస్త అగమ్యగోచరమే అని చెప్పాలి. అయితే అనర్హత వేటుకు గురి కావాలి. లేదా రాజీనామా చేయాల్సి రావచ్చు. కాకపోతే స్పీకర్ ఎటూ అధికార పార్టీ వారే కాబట్టి కొంతకాలం జాప్యం చేయడానికి యత్నించవచ్చు. స్పీకర్ మరీ ఎక్కువకాలం పెండింగులో పెట్టడం కూడా సాధ్యపడకపోవచ్చు. అలాగే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కావ్య తరపున లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేశారు. వీరిద్దరూ నేరుగా ఆధార సహితంగా ఫిరాయించినట్లు కనిపిస్తుండడంతో ఏమి చేయాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు. గతంలో పది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో నేరుగా చేరకపోయినా, పలు విచారణల తర్వాత ఆలస్యంగా అయినా అప్పటి స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి వారిపై అనర్హత వేటు వేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఈ స్పీకర్ ఎంతకాలం తీసుకుంటారో, ఏమి చేస్తారో చూడాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో భేటీ అయి మంతనాలు సాగించారు.న్యాయ నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకుని ఎనిమిది మందితో స్పీకర్ నోటీసులకు బదులు ఇప్పించారు. ఆ జవాబులు చూస్తే మన ఎమ్మెల్యేలు ఇలా తమను తాము ఆత్మవంచన చేసుకుంటున్నారా? లేక ప్రజలను మోసం చేస్తున్నారా? లేక న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారా? అన్న ప్రశ్నలు వస్తాయి. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని, కేవలం అభివృద్ది కోసమే సీఎంను కలిశామని, ఆ సందర్భంలో సీఎం మర్యాదపూర్వకంగా కండువా కప్పుతుంటే తిరస్కరించడం సంస్కారం కాదని నిరాకరించ లేదని, పైగా అది కాంగ్రెస్ కండువా కాదని బుకాయించారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి తన ఇంటిలో ఇప్పటికీ కేసీఆర్ ఫోటో ఉందని చెప్పారట. అంతేకాక తాను కేటీఆర్ను కలిసిన ఫోటోలు కూడా తన సమాధానంతోపాటు జతపరిచారట. కొంతమంది తాను కాంగ్రెస్ లో చేరినట్లు ఫ్లెక్సీలు కట్టారని, వాటితో తనకు సంబంధం లేదని, దాని ఆధారంగా తనపై ఫిరాయింపు ఆరోపణ చేశారని ఆయన వివరణ ఇచ్చారట. ఇవన్ని చూస్తుంటే తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేతకని అన్నట్లుగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పీకర్గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఒకరు కావడం విశేషం. స్పీకర్గా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు, ఇతర పార్టీల వారిని కూడా బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు స్వయంగా పోచారమే పార్టీ ఫిరాయించి, తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెబుతుండడం విశేషం. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం టీఆర్ఎస్లో చేరడానికి ముందు పదవికి రాజీనామా చేశారు. కాని ఇప్పుడు మాత్రం వెనుకాడుతున్నారన్న విమర్శ ఎదుర్కొంటున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తప్ప మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ సీనియర్లే. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య గతంలో కాంగ్రెస్ పక్షాన గెలిచి బీఆర్ఎస్లో చేరితే, ఈసారి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి అనధికారికంగా మారారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొద్ది రోజుల క్రితం గండిపేట వద్ద జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తూ వివిధ పత్రికలలో ఫుల్ పేజీ ప్రచార ప్రకటనలు కూడా ఇచ్చారు. అయినా బీఆర్ఎస్ లోనే ఉన్నానని వివరణ ఇచ్చారు. వీరు తమంతట తాముగా రాజీనామా చేసినా, లేదా కాంగ్రెస్ నాయకత్వం రాజీనామా చేయించినా బాగుండేది. కాంగ్రెస్ అధిష్టానం బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఒకపక్క విమర్శలు చేస్తూ, మరో పక్క తెలంగాణలో అదే రకంగా వ్యవహరించడం ఏపాటి విలువలతో కూడినదన్న ప్రశ్న వస్తుంది. మరో సంగతి ఏమిటంటే ఒక ఇంటర్వ్యూలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి పది మంది తమ పార్టీలోకి వచ్చారని చెప్పారట. దానిని సాక్ష్యంగా తీసుకోవాలని, అప్రూవర్ గా ఆయనను పరిగణించాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు చేస్తూ రాజ్యాంగం పుస్తకం పట్టుకుని టూర్ చేస్తున్నారని, తెలంగాణలో ఎమ్మెల్యేల చోరీని ఎలా సమర్థిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ ఆధ్వర్యంలోనే ఇలా జరుగుతున్నాయని కాదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్తో పాటు వివిధ పార్టీల ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ కింద బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. అప్పుడు కూడా కొందరికి ఆయన బీఆర్ఎస్ కండువా కప్పారు.అయినా వారిలో ఎవరిపైన అనర్హత వేటు పడలేదు.అప్పట్లో బీఆర్ఎస్ విలీనం డ్రామా నడిపితే, దానికి ఆనాటి స్పీకర్ పోచారం ఆమోద ముద్రవేశారు. బీజేపీ కేంద్రంలో కాని, కొన్ని రాష్ట్రాలలో కాని పిరాయింపులను ప్రోత్సహించడం లేదా అన్న ప్రశ్న వస్తుంది. 2014 టర్మ్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్శించి వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. దానిపై న్యాయపోరాటం జరిగినా అది ఒక కొలిక్కి రాలేదు. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ వైఎస్ జగన్ ఆనాటి రాజకీయ పరిణామాలలో పార్టీని వీడినప్పుడు రాజీనామా చేసి కడప నుంచి పోటీ చేసి ఎంపీగా తిరిగి గెలిచారు. అలాగే ఆయన పార్టీలోకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలలో పోటీ చేశారు. వారిలో 15 మంది విజయం కూడా సాధించారు. ముగ్గురు ఓటమి చెందారు.అయినా విలువలకు కట్టుబడి ఉన్నట్లు గుర్తింపు పొందారు. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం చివరికి ఏ రూపు దాల్చుతుందో, అది ఎప్పటికి తేలుతుందో చెప్పలేకపోయినప్పటికి, సుప్రీం కోర్టు ఆదేశాల వల్ల ఈ నోటీసుల తతంగం అయినా సాగుతోందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ ఫిరాయింపు రాజకీయాలపై ప్రజలలో వ్యతిరేకత ఉన్నప్పటికీ, వారెవ్వరూ గట్టిగా నిరసన చెప్పలేని స్థితి ఉంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వాదనల కన్నా 'పని మిన్న'!
హలో టులేన్! ఇక్కడి అన్ని విభాగాల సిబ్బందికీ అభివాదాలు. మీలో చాలా మంది మాదిరిగానే మా ఆపిల్ సంస్థలోని కొందరికి కూడా న్యూ ఓర్లీన్స్తో సన్నిహిత అనుబంధం ఉంది. ‘టులేన్ విశ్వవిద్యాలయ జట్టు’కు అభినందనలు అని అందరూ ముక్త కంఠంతో చెబుతూంటే ఒళ్ళు పులకరిస్తుంది. ఇక్కడున్న వారితోపాటు మరో ముఖ్యమైన వర్గం ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆ వర్గంలోకి వస్తారు. మిగిలిన వారందరికన్నా కూడా వారు మిమ్మల్ని ఎక్కువ ప్రేమించి, అండదండలను అందించి ఉంటారు. మీరు ఈ స్థితికి చేరడంలో వారు చాలా త్యాగాలను కూడా చేసి ఉంటారు. వారిని కూడా మన హర్ష ధ్వానాలతో అభినందిద్దాం. ఇదే నేనిచ్చే మొదటి సలహా. వారు ఈ క్షణాల కోసం వేయి కళ్లతో ఎంతగా ఎదురుచూశారో గ్రహించి, ప్రశంసించేందుకు, మీకు జీవితంలో ఇంకా చాలా కాలం పట్టవచ్చు. వారు మీపట్ల బాధ్యతతో, ప్రేమతో వ్యవహరించిన తీరు, మీ మధ్య నున్న అనుబంధం మిగిలినవాటన్నింటి కన్నా ఎక్కువ ప్రాధాన్యం కలిగినవని మీకు తదనంతర కాలంలో తెలిసిరావచ్చు.పది మందితో మెసలండి!నిజానికి, నేను ఈ రోజు దాని గురించే మాట్లాడదలచు కున్నాను. స్వీయ జీవితాలను నమోదు చేసుకోవడంలో, అవీ ఇవీ పోస్ట్ చేయడంలో తలమునకలై ఉన్న ప్రపంచంలో, మనలో చాలా మందిమి ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన బాధ్యత పైన మాత్రం తగినంత శ్రద్ధను కనబరచడం లేదు. ఇది తల్లితండ్రులతో మరింత టచ్లో ఉండటం గురించి చెబు తున్నది మాత్రమే కాదు. మీరు వారితో నెరపే సంబంధాలు వారిని మరింత సంతోష పరుస్తాయి.అసలు, కలసికట్టుగా మనం మరింత ఎక్కువ సాధించగలమని గుర్తించడంతోనే మానవ నాగరకత ప్రారంభమైంది. మనం మరింత కలసికట్టుగా వ్యవహరిస్తే మనకెదురవుతున్న ముప్పులు, ఆపద లను నివారించుకోవచ్చు. మనం పంచుకుంటున్న కొన్ని సత్యాలను గుర్తించి సమష్టిగా పనిచేసినపుడు ఈ లోకంలో మరింత సంపద, సౌందర్యం, విజ్ఞత, మెరుగైన జీవితాలను సృష్టించగలుగుతాం. ఈ పని సాధ్యం కాకపోవచ్చుననే సందర్భాలు జీవితంలో చాలాసార్లు ఎదురవుతాయి. కానీ, ప్రయత్నించి చూడటం కన్నా మరింత అందమైన, అర్థవంతమైన పని మరొకటి లేదని ఈ విశ్వ విద్యాలయం చాటుతుంది. ముఖ్యంగా సొంతానికన్నా నలుగురి మేలు కోసం ఆ పని చేయడంలో గొప్పదనం ఉందంటుంది.నా మటుకు నన్ను... ఆ ఉన్నత పరమార్థ అన్వేషణే ఆపిల్ కంపెనీకి తీసుకొచ్చింది. క్యాంపాక్ అనే కంపెనీలో అప్పుడు కుదురైన ఉద్యోగం చేసుకుంటున్నాను. అప్పట్లో ఎప్పటికీ ఆ సంస్థే అగ్ర స్థానంలో ఉంటుందనిపించింది. అప్పటికింకా మీరు కుర్రాళ్ళు కనుక, బహుశా ఆ సంస్థ పేరు కూడా గుర్తుండకపోయి ఉండవచ్చు. కానీ, క్యాంపాక్ను విడిచిపెట్టి, దివాళా తీసే స్థితిలో ఉన్న కంపెనీలో చేరవలసిందిగా స్టీవ్ జాబ్స్ 1998లో నాకు నచ్చజెప్పాడు. అది కంప్యూటర్లు తయారు చేస్తోంది. అప్పటికి, వాటిని కొనాలనే ఆసక్తి ప్రజల్లో లేదనే చెప్పాలి. పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు స్టీవ్ దగ్గరో ఆలోచన ఉంది. నేనూ అందులో భాగం అయ్యాను. ఐమ్యాక్, ఐపాడ్ లేదా ఆ తర్వాత వచ్చిన అలాంటి వస్తువుల గురించి కాదు చెప్పుకోవాల్సింది. జీవితంలోకి ఆ ఆవిష్కరణలు తేవడం వెనుకనున్న విలువల గురించి ముచ్చటించుకోవాలి. సాధా రణ ప్రజానీకం చేతిలో శక్తిమంతమైన సాధనాలను ఉంచాలనే ఆలోచన సృజనాత్మకత వెల్లివిరియడానికీ, మానవాళిని ముందుకు నడిపించడానికీ తోడ్పడింది.చిక్కుముడులు విప్పండి!ఇష్టమైన పని చేస్తూంటే అలుపనేదే తెలియదు అని సాధారణంగా చెబుతూంటారు. కానీ, ఆ మాటల్లో సారం లేదని ‘ఆపిల్’లో గ్రహించాను. అంతలా పనిచేయడం సాధ్యమేనని మీరు ఎన్నడూ ఊహించనంతగా, శ్రమపడి పని చేయాల్సి ఉంటుంది. ఎటొచ్చీ ఇష్టంతో పనిచేస్తే, మీ చేతుల్లోని ఉపకరణాలు తేలికవుతాయి, అంతే!ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారు కనుక ఓ సంగతి చెబుతా. పరిష్కారాన్ని కనుగొన్న సమస్యలపైన మీ సమయాన్ని వృథా చేయకండి. ఇది ఆచరణసాధ్యమని ఇతరులు చెప్పిన దానికే పరిమితం అయిపోకండి. అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలోకే మీ నౌకను నడిపించండి. ఇతరులకు మరీ పెద్దవిగా కనిపించే, వారు మనకెందుకులే అనుకొనే చిక్కుముడులను విప్పేందుకూ, జటిలమైన పరిస్థితుల్లో పనిచేసేందుకూ మొగ్గు చూపండి. మీ జీవిత పరమార్థాన్ని అటువంటి చోటే కనుగొనగలుగుతారు. మీ సేవలను అక్కడే ఎక్కువ అందించగలుగుతారు.‘అతి జాగ్రత్త’కు పోకండి!ఏ పని చేసినా ‘అతి జాగ్రత్త’తో చేయాలనుకోవడం కూడా పొరపాటే! ఉన్నదున్నట్లుగా చేస్తూ పోతే, మీ కాలి కింద భూమి కదలకుండా ఉంటుందనుకోకండి. యథాతథ స్థితి కలకాలం ఉండదు. ఏదైనా మెరుగైన దాన్ని నిర్మించడంపై పనిచేయండి. కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి మా తరం మిమ్మల్ని తప్పుదోవ పట్టించింది. పనుల్లోకి దిగకుండా చర్చలతోనే మేం చాలా సమయాన్ని గడిపేశాం. ప్రగతిపై కాక పోరాటంపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాం. మా వైఫల్యాన్ని ఎత్తి చూపేందుకు మీరు ఎక్కువ వెతకాల్సిన పని లేదు. గత 100 ఏళ్ళలో చూడని ప్రకృతి వైపరీత్యాలతో వేలాది మంది నిరాశ్రయులు అవడాన్ని మనం చూస్తున్నాం. వాతావరణ మార్పు గురించి మాట్లాడుకోకుండా, వ్యక్తులుగా మనం ఒకరి పట్ల ఒకరం ఎలా బాధ్యతతో మెలగవలసి ఉందో మాట్లాడుకోగల మని నేను అనుకోవడం లేదు. మీతో విభేదించేవారిని నేలమట్టం చేయడం ద్వారానే మీరు బలవంతులు అనిపించుకోగలుగుతారని లేదా అసలు వారికి మాట్లాడే అవకాశమే ఇవ్వవద్దని నమ్మబలికేవారు కొందరుంటారు. వారి మాయలో పడకండి. అవి కొత్త ఆలోచనలు పుట్టనివ్వవు. కొత్త దారులు వెతకనివ్వవు. మాటవరుసకు వినడం కాకుండా, చెవికెక్కించుకునే విధంగా ఆలకించడాన్ని అలవరచుకోండి. కేవలం పని చేయడం కాదు, కలసిమెలసి పనిచేసే తత్వాన్ని ప్రదర్శించండి. మన సమస్యలకు పరిష్కారాలు మానవ సంబంధాల నుంచే లభిస్తాయి. సంకల్ప శక్తితో దేన్నైనా ప్రయత్నించి చూడండి. మీరు సఫలమూ కావచ్చు. విఫలమూ కావచ్చు. కానీ, ప్రపంచాన్ని నిర్మించడమే మీ జీవిత లక్ష్యంగా పెట్టుకోండి. మానవాళికి మెరుగైన వాటిని విడిచిపెట్టడం కోసం పనిచేయడం కన్నా మరింత అందమైనది ఏదీ లేదు. -
అడకత్తెరలో ఇండియా
ఇండియా–యూఎస్ బాంధవ్యం ఎంత ఘోరంగా దెబ్బ తిన్నది! అటు చూస్తే వాషింగ్టన్ – బీజింగ్ సంబంధాలు మెరు గవుతున్నాయి. ఈ నూతన పరిణామం... అమెరికాతో ఇండియా బాంధవ్యాన్ని ఇంకెంతగా ప్రభావితం చేయబోతోంది? రష్యా చమురు కొనుగోలు ఆపేయకుంటే, ఇండియాపై అగ్రరాజ్యం రెండవ, మూడవ విడత అదనపు సుంకాలు విధిస్తుందా? ‘‘ఇండియా దౌత్యానికి నిజంగా ఇదో పరీక్షా సమయం. కొంతకాలం ముందు నుంచీ పరిస్థితులు ఏమంత బాగోలేవు. ఇప్పుడు అవి మరింత దుర్బలంగా మారాయి’’... మాజీ విదేశాంగ కార్యదర్శి శ్యామ్ శరణ్ అభిప్రాయం ఇది. అధ్యక్షుడు ట్రంప్ ‘‘స్వతహాగానే కక్ష సాధింపు మనిషి. ఇండియా పట్ల ఇప్పు డాయన అదే వైఖరితో వ్యవహరిస్తున్నారు’’. కాబట్టి ఇండియా– యూఎస్ సంబంధాలు ‘‘తప్పనిసరిగా మరింత క్షీణిస్తాయి’’.‘క్వాడ్’ను సైతం వదులుకుంటారా?వాషింగ్టన్తో ఢిల్లీ బాంధవ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీసే పరిణా మాల విషయానికి వద్దాం. మొదటిది – చైనాతో తనకున్న ఎంతో మంచి బాంధవ్యాన్ని గురించి, షీ జిన్పింగ్తో తన స్నేహాన్ని గురించి ట్రంప్ అదేపనిగా మాట్లాడుతున్నారు. బీజింగ్తో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన ఎంతో ఇదిగా ఉన్నారు. తాను చైనాలో పర్యటిస్తానని సైతం చెబుతున్నారు. ఆయన ఈ మొత్తం వ్యవహారంలో ఎంత దూరం వెళ్తారన్నదే ఇక్కడ ప్రశ్న.చైనాతో పెద్ద ఒప్పందం ఒకటి కుదుర్చుకోవడానికి ‘క్వాడ్’ను సైతం త్యాగం చేయబోతున్నారా? ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రకారం, క్వాడ్ సదస్సు కోసం ఇండియాను సందర్శించే ఉద్దేశం ట్రంప్కు లేదు. దీనర్థం ఏమిటి? ఆయన ప్రభుత్వ విదేశాంగ విధానంలో ఇండో–పసిఫిక్ వ్యూహం ఇంకెంతో కాలం కీలకం కాదు. ఈ పరిణామం ఇండియా–యూఎస్ సంబంధాలకు శరాఘాతం లాంటిది. చైనా పట్ల అమెరికా విధానంలో ఒకప్పుడు కేంద్రస్థానంలో ఉన్న మనల్ని... ఇది అంచుల దాకా నెట్టివేస్తుంది. మన ప్రాధాన్యం పూర్తిగా మసకబారుతుంది. శరణ్ దీన్ని చాలా సున్నితంగా ఇలా చెప్పారు: ‘‘యూఎస్, చైనాలతో ఇండియా సంబంధాలు... వాటి పరస్పర సంబంధాల కంటే మెరుగ్గా ఉన్నప్పుడు ఇండియాకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది’’. అయితే ఇప్పుడీ పరిస్థితి లేదు. వాషింగ్టన్–బీజింగ్ నడుమ ప్రస్తుత సంబంధాలు, కచ్చితంగా వాషింగ్టన్ – ఢిల్లీ నడుమ కంటే బాగున్నాయని చెప్పాలి. ఇదంతా చూస్తుంటే – అమెరికా, చైనా నడుమ జి–2 తరహా ఏర్పాటుకు అవకాశం ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. సమాధానం అవును అనుకుంటే, ఆసియా ప్రాంతంలో చైనా ప్రాబల్యానికి ‘చట్ట బద్ధత’ కల్పించినట్లే! ఇండియాకు అది అంగీకారం కాదు.ఈ పరిస్థితుల్లో, ఇండియా, చైనా సంబంధాల్లో ఎంత పురోగతి సాధ్యమవుతుంది? మరోపక్క పాకిస్తాన్తో చైనా దృఢ సంబంధాలు సడలిపోయే అవకాశం లేదు. సరిహద్దు సమస్య అలా అపరిష్కృతంగానే మిగిలిపోతుంది. ఆసియాలో ప్రాబల్యం వహించాలని చైనా కోరుకుంటోంది. ఇండియా అందుకు ససేమిరా అంగీకరించదు. వాణిజ్యం విషయానికి వస్తే– అరుదైన ఖనిజాలు, ఎరువులు,సొరంగ తవ్వక యంత్రాల్లో చైనా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.అందుకే, తియాన్జిన్లో ఎన్ని చిరునవ్వులు చిందించినా, ఎంత గట్టి కరచాలనాలు చేసినా... ఇండియా–చైనా సంబంధాల్లో గణ నీయ పురోగతికి అవకాశాలు అతి తక్కువ.రష్యా కోసం మూల్యం చెల్లిస్తున్నామా?రష్యా చమురు విషయానికి వద్దాం. రష్యా మీద ఆర్థికంగా ఒత్తిడి తెచ్చి ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకే ఇండియా మీద 25 శాతం అదనపు సుంకం విధించామని అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ చెప్పారు. ఆ ఎత్తుగడ పారలేదు. దీంతో ట్రంప్ నిస్పృహ చెందారు. ఇప్పుడు ఆయన ఇండియా మీద అదనపు సుంకాలు విధిస్తారా?రష్యా చమురు గురించి జవాబు చెప్పుకోవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. రష్యా చమురుతో ఇండియా ఆదా చేస్తున్నది బారె ల్కు సుమారు 2 డాలర్లు మాత్రమే! ఈ చమురు కొనుగోళ్ల కారణంగా మనం అమెరికాకు ఏటా 48 బిలియన్ డాలర్ల ఎగుమతు లను కోల్పోతాం. రష్యా నుంచి చేసుకునే చమురు దిగుమతులతో మనకు సమకూరే ప్రయోజనం, మనం అమెరికాకు చేసే ఎగుమతులతో పోల్చితే చాలా తక్కువ. ఆర్థికంగా చూసినట్లయితే – రష్యా చమురు కొనుగోళ్లు నిలిపి వేయడం ఉత్తమం. అయితే వ్యూహాత్మక, రాజకీయ కోణాలు అందుకు అనుమతిస్తాయా? ఇప్పటి విధానం ప్రకారం చూస్తే, రష్యా చమురును ఇండియా కొంటూనే ఉంటుంది. దీనివల్ల రష్యాకు డబ్బు లభిస్తుంది. ఆంక్షల క్లిష్ట సమయంలో ఆర్థిక ప్రయోజనం పొందుతుంది. మరి ఇండియా? అమెరికాకు ఎగుమతులు చెయ్యలేకపోవడమే కాకుండా వాషింగ్టన్తో సంబంధాలు పూర్తిగా చెడతాయి. అలా రెండు రకాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకూ తెర వెనుక నడచిన ఒక అంశాన్ని ఇప్పుడు తెర పైకి తీసుకువచ్చి దీనికి ఒక ముగింపు ఇస్తాను. అమెరికాతో మన సంబంధాలు గడిచిన మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత అథమ స్థాయికి దిగజారి పోయాయి. మనకు పాకిస్తాన్తో ఎన్నడూ బాంధవ్యం లేదు. చైనాతో సంబంధాలు మెరుగుపడుతున్నా, ఆ దేశంతో మనకు ఉన్న సమస్యలు చిన్నవేమీ కావు. రష్యాతో మన సంబంధాలు బలోపేతం అయ్యాయి. అయితే అందుకు మనం ఇప్ప టికే భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం. మరోవంక చైనా, పాకిస్తాన్, రష్యాలతో అమెరికా సంబంధాలు బైడెన్ హయాంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉన్నాయి. ఇది నిజంగా ఒక వైచిత్రి. తొమ్మిది నెలల్లోనే వీటి మధ్య సాన్నిహిత్యం మెరుగుపడింది. అదే సమయంలో అమెరికాతో మన సంబంధాలు కుప్ప కూలాయి. కాబట్టి ఇండియా దౌత్యానికి ఇది ‘బ్యాడ్ టైమ్’ అనుకోవాలా? దీనికి సమాధానం అవును అని తప్ప మరో విధంగా చెప్పలేను.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సరైన సమయంలో సముచిత నిర్ణయం
వస్తు సేవల పన్ను మండలి (జీఎస్టీ కౌన్సిల్) 56వ సమావేశం ఇటీవల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థలో ఆమోద ముద్ర వేసిన సంస్కరణలు దేశ పరోక్ష పన్ను వ్యవస్థ పరిణామ క్రమంలో ఓ కీలక ఘట్టం. ఈ సంస్కరణల అమలు ప్రధానంగా మూడు పరస్పర అనుసంధానిత మూల స్తంభాలు – ‘సమూల సంస్కరణ, పన్ను హేతుబద్ధీకరణ, చెల్లింపుదారుల జీవన సౌలభ్యం’పై ఆధారపడి ఉంటుంది.సమూల సంస్కరణల్లో భాగంగా – పన్ను విధింపులో అనిశ్చితి తగ్గింపు ధ్యేయంగా పన్ను శాతాల సంఖ్య కుదింపుపై సునిశిత శ్రద్ధ చూపారు. సామాన్యుల దైనందిన అవసరాలకు ఉపయోగపడే కొన్ని వస్తువులపై స్వల్ప ‘మెరిట్’ శాతంలోనూ– ‘హానికర’ (సిన్ ), విలాస స్వభావం గల వస్తువులపై అధిక ‘ప్రత్యేక’ శాతంలోనూ పన్ను విధించాలని నిర్ణయించారు. వస్తు, సేవల వర్గీకరణ, పన్నుశాతాలపై అభ్యంతరాలు, వివాదాలకు సంబంధించి అధికశాతం ఆహార, ఆటోమొబైల్ విడిభాగాల రంగాల్లోనే తలెత్తినట్లు ఒక అధ్యయనం వెల్లడించింది. మార్కెట్లో ఆహారోత్పత్తుల మధ్య సారూప్యం ఎక్కువగా ఉన్న ఫలితంగా వాటి వర్గీకరణ సమస్యా త్మకమైంది. అలాగే పన్ను శ్లాబుల నిర్ణయం కూడా! ప్రస్తుత సంస్కరణల్లో ఆహార రంగాన్ని ఒకే పన్ను శాతం కిందకు తేవడం ద్వారా గందరగోళం తొలగించారు. అలాగే ఆటోమోటివ్ రంగంలో కూడా... ముఖ్యంగా వాహన విడి భాగాలపై ఏకరూప పన్ను విధింపుపై తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపశమనం ఇవ్వడంతోపాటు పరిశ్రమలో విశ్వాసం ఇనుమడించి, వివాదాలకు ముగింపు పలుకుతుంది.జీఎస్టీ వ్యవస్థలో విలోమ సుంకం పద్ధతి (ఇన్ వర్టెడ్ టాక్స్ సిస్టమ్–ఐడీఎస్) నిరంతర సమస్యాత్మకంగా మారింది. దీనికింద వస్తు తయారీ ముడిసామగ్రిపై విధించే పన్ను, తయారైన వస్తువుపై విధించే పన్ను కన్నా ఎక్కువగా ఉంటుంది. పర్యవసానంగా ‘ముడి సామగ్రిపై పన్ను వాపసు’ (ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్–ఐటీసీ) మొత్తం పేరుకుపోతూ ఉంటుంది. పారిశ్రామిక రంగంలోని అనేక విభాగాలలో ముడి సామగ్రి వినియోగ స్వభావం కలిగి ఉంటుంది. వాటిపై సరైన రీతిలో విలోమ శాతం పన్ను విధించడంలో కొంత సంక్లిష్టత ఉంటుంది. అయితే, ఇప్పుడు వీలైన ప్రతి సందర్భానికీ తగినట్లు... ముఖ్యంగా ఎరువుల పరిశ్రమలో ముడి పదార్థం ప్రధానంగా ఒకే తరహా ఉత్పత్తికి ఉపయోగపడుతుంది కాబట్టి, విలోమ పన్ను విధింపు పద్ధతిని సరిదిద్దారు.‘ఎంఎస్ఎంఈ’లు ఎక్కువగా ఉన్న రంగాల్లో ‘ఐడీఎస్’ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు దేశంలో 4.5 కోట్ల మందికిపైగా ఉపాధి పొందే వస్త్ర పరిశ్రమకు సంబంధించి చేతితో వడికిన–నేసిన ఉత్పత్తుల నుంచి భారీ మిల్లుల ఉత్పత్తుల మధ్య వైవిధ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. వాటి స్వభావం ప్రకారం దుస్తులపై సుంకం 5 శాతం వంతున... సుంకం ‘మెరిట్’ రేటుకు లోబడి ఉంటుంది. ఇక్కడ వస్త్ర రంగంలోని సహజ నూలు విభాగంలో విలోమం లేకపోయినా, మానవ శ్రమతో తయారైన వస్త్ర విభాగంలో ఉంటుంది. అయితే, రాబడి పరంగా చిక్కుల వల్ల వీటి మొత్తం విలువ శ్రేణిలో విలోమాన్ని సరిదిద్దడం దాదాపు అసాధ్యం. అయినప్పటికీ, ఈ వ్యత్యాసం ‘ఎంఎస్ఎంఈ’లపై అనవసర భారం పడని రీతిలో ఉండేవిధంగా జాగ్రత్త వహించారు.తాజా సంస్కరణల ప్రక్రియను సామాన్యులు, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే కసరత్తుగా తొలుత భావించారు. దీని ప్రకారం– జనసామాన్యం వాడే వస్తువులతో విలాసవంతమై నవిగా పరిగణించే కొన్ని వస్తువు లపై పన్నును ‘మెరిట్’ శాతానికి తగ్గించారు. తద్వారా విస్తృత జనాభా కొనుగోలు శక్తి పెరుగు తుంది కాబట్టి, డిమాండ్ కూడా పెరుగుతుంది. మొత్తం మీద ఈ సూత్రాలన్నీ కలిసి పన్ను శాతాల క్రమబద్ధీకరణ కసరత్తు హేతుబద్ధ తకు రూపమిచ్చాయి. రాష్ట్రాలకు 2022 జూలై తర్వాత పరిహార సుంకం వసూ ళ్లలో వాటా చేరడం లేదు. కోవిడ్ మహమ్మారి సమయంలో వసూళ్ల లోటు తగ్గించే దిశగా అవి తీసు కున్న రుణానికి దీన్ని జమ చేసుకోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఆ చెల్లింపులన్నీ దాదాపు పూర్తయ్యాయి కాబట్టి, కేంద్రంతోపాటు రాష్ట్రాలకూ ‘జీఎస్టీ’ వసూళ్లు పెరిగేందుకు తగిన ఆర్థిక వెసులు బాటు లభిస్తుంది. జీఎస్టీ వ్యవస్థతో పన్ను చెల్లింపుదారుల లావాదేవీలను ప్రతి దశలోనూ సరళీకరించే మార్గదర్శక సూత్రం ఈ సంస్కరణలకు మూడో మూలస్తంభం. తదనుగుణంగా వ్యాపారాల రిజిస్ట్రేషన్, పన్ను వాపసుల అంశాన్ని ఇవి లక్ష్యం చేసుకుంటాయి. దీంతో పన్ను చెల్లింపుదారులకు విధానపరమైన ఇబ్బందుల తగ్గడంతోపాటు నిర్వ హణ మూలధన సమీకరణలో అడ్డంకులు తొలగుతాయి.ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇప్పటికే ఎదిగింది. ఇక ప్రస్తుత సంస్కరణల ద్వారా దేశీయ డిమాండ్ దృఢం కావడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందుతుంది. ‘స్వయం సమృద్ధ భారత్’ స్వప్న సాకారం దిశగా విస్తృత జాతీయ దృక్కోణం బలపడేందుకు ఈ సంస్కరణలు ప్రధానంగా తోడ్పడతాయి.సంజయ్కుమార్ అగ్రవాల్వ్యాసకర్త కేంద్రీయ ప్రత్యక్ష పన్నులు–సుంకాల బోర్డు చైర్మన్ -
మల్లికార్జున్ ఖర్గే (కాంగ్రెస్) రాయని డైరీ
తెలిసిన పదాలకే అర్థాలు వెతుక్కుంటున్నాను నేను! రాహుల్ గురించి నాకేం తెలియదని?!ఆయన నాతో ఒక్క నవ్వును మించి ఎక్కువ మాట్లాడరు. ఆ నవ్వుకు ‘‘నమస్తే ఖర్గేజీ’’ అని అర్థం; ఎక్కడికి వెళుతున్నదీ చెప్పరు.‘‘నా కోసం చూడకండి’’ అని అర్థం; ఎందుకు వెళుతున్నదీ చెప్పరు. ‘‘ఎక్కువగా ఆలోచించ కండి’’ అని అర్థం; ఎప్పుడు వచ్చేదీ చెప్పరు. ‘‘రావాలని నాకూ ఉంటుంది’’ అని అర్థం;ఏం చేయబోయేది చెప్పరు. ‘‘నాకైనా ఎలా తెలుస్తుంది?’’ అని అర్థం; ఎవరి గురించి,ఏం మాట్లాడబోయేదీ చెప్పరు. ‘‘మాటలు మనకు చెప్పి వస్తాయా ఖర్గేజీ?!’’ అని అర్థం.రాహుల్ మళ్లీ ఇవాళ కొన్ని గంటలుగా కనిపించటం లేదు! ఆయన కనిపించక పోవటానికి – కనిపించకపోవటానికి మధ్య ఆయన కనిపించే నిడివి ఈ మధ్య కాస్త ఎక్కువగా తగ్గుతున్నట్లు నాకు అనిపిస్తోంది!‘‘మీకేమైనా సమాచారం ఉందా వేణుగోపాల్?’’ అని అడిగాను. పార్టీ ఆఫీస్లో నేను, వేణుగోపాల్ మాత్రమే ఉన్నాం. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ఆయన. ‘మీకు తెలియకుండా నాకు తెలుస్తుందా ఖర్గేజీ!’ అన్నట్లుగా... నిస్సహాయంగా నా వైపు చూశారు వేణుగోపాల్. ఆయన్నిక ఎక్కువ సంఘర్షణకు గురి చేయదలచుకోలేదు నేను. ‘‘సరే! తాళం వేసుకుని మీరు వెళ్లండి’’ అని పైకి లేచాను. నాతో పాటే వేణుగోపాల్ కూడా పైకి లేచి, ‘‘ఖర్గేజీ! మీతో ఒక మాట’’ అన్నారు!!‘చెప్పండి వేణు...’’ అన్నాను.‘‘ఖర్గేజీ! మీరీ మధ్య ఒకే మాటను రెండు అర్థాలు వచ్చేలా మాట్లాడుతున్నారు. లేదా, మీరు మాట్లాడుతున్న ఒకే మాట రెండు అర్థాలు వచ్చేలా ఉంటోంది...’’ అన్నారు వేణుగోపాల్.‘‘ఏమిటా ‘ఒక మాట – రెండర్థాలు’ వేణుగోపాల్?!’’ అన్నాను. ‘‘ఖర్గేజీ! జునాగఢ్లో మీరు – ‘‘మొత్తం పెట్టె కుళ్లిపోక ముందే, చెడిపోయిన మామిడిపండ్లను తొలగించాలి...’’ అని అన్నారు.వెంటనే టీవీ ఛానెళ్ల వాళ్లు, ‘కాంగ్రెస్లో ఎవరా చెడిపోయిన మామిడి పండ్లు?!’ అని డిబేట్ మొదలు పెట్టేశారు. ఇప్పుడేమో, ‘తాళం వేసుకుని మీరు వెళ్లండి’ అని నాతో అన్నారు. అదృష్టవశాత్తూ ఇది టీవీ వాళ్లకు తెలిసే అవకాశం లేదు కనుక – ‘తాళం వేయమంటే ఏమిటర్థం? పార్టీ ఆఫీస్కు తాళం వేసేద్దాం అనేనా ఖర్గే అంటున్నది...’ అని డిబేట్ పెట్టే ప్రమాదం తప్పిపోయింది...’’ అన్నారు వేణు!‘‘నిజమే కానీ వేణుగోపాల్, ఒక మాటను పది మంది పది రకాలుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని చెప్పి, ఆ పది మందికీ ఒకే రకంగా అర్థం అయ్యేలా మాట్లాడాలంటే... ఒక్క మౌనంతో మాత్రమే కదా అది సాధ్యం అవుతుంది?’’ అన్నాను. అలా అంటున్నప్పుడు నాకు రాహుల్ గుర్తొచ్చారు. బహుశా అందుకేనా రాహుల్ నాతో గానీ, పార్టీలో మరొకరితో కానీ తక్కువ మాట్లాడి, ఎక్కువ మౌనంగా ఉంటారు?! ‘‘సీఆర్పీఎఫ్ వాళ్లు లెటర్ పంపించారు వేణుగోపాల్. సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేయకుండా రాహుల్ బయట తిరుగు తున్నారని కంప్లైంట్. ఈ తొమ్మిది నెలల్లోనే ఇటలీ, వియత్నాం, ఖతార్, లండన్, దుబాయ్ మలేసియా ట్రిప్పులు వేశారట! ‘హై రిస్క్ కేటగిరీలో ఉన్న వీఐపీలు ప్రోటోకాల్ని వయలేట్ చేస్తే ఎలా?’ అంటున్నారు’’ అన్నాను.వేణుగోపాల్ మౌనంగా ఉన్నారు! బహుశా అది, వివేచనతో కూడిన మౌనం కావచ్చు. ‘‘మీరు వెళ్లండి వేణుగోపాల్! నేను కాసేపు ఉండి వస్తాను‘ అన్నాను, తిరిగి కూర్చుంటూ. ఆయన వెళ్లిపోయారు. నా చేతిలో సీఆర్పీఎఫ్ వాళ్లు పంపిన లెటర్ ఉంది. ‘‘మీ అబ్బాయి మాట వినటం లేదు’’ అని స్కూల్ హెడ్ మాస్టర్, పేరెంట్స్కి లెటర్ రాయగలరు. ‘‘మా అబ్బాయి మాట వినటం లేదు...’’ అని పేరెంట్స్ ఎవరికి లెటర్ రాయగలరు?! రాహుల్ సీఆర్పీఎఫ్కే కాదు, సీడబ్ల్యూసీకీ చెప్పి వెళ్లటం లేదని నేనెవరితో చెప్పుకోగలను?! ఎవరికి లెటర్ రాయగలను? -
కచ్చతీవుపై ఆగని రచ్చ
భారతీయుల దృష్టంతా ఉత్తరాన చైనా లోని తియాన్జిన్పై ఉన్న సమయంలో, దక్షిణపు పొరుగు దేశం సడీచప్పుడు లేకుండా ఓ సందేశాన్ని పంపింది. శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె ఇటీవల జాఫ్నా సందర్శించారు. ఒకే ఏడాదిలో దిస్సనాయకె ఆ రాష్ట్రాన్ని నాల్గవసారి సందర్శించడమే ఒక రికార్డు అనుకుంటే, ఆయన అక్కడ నుంచి నౌకా దళానికి చెందిన ఒక స్పీడు బోటులోబంజరు దీవి కచ్చతీవుకు వెళ్ళి మరో రికార్డు సృష్టించారు. శ్రీలంక అధ్యక్షుడు ఒకరు ఆ దీవిని సందర్శించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన ద్వారా ఆయన శ్రీలంక భూభాగపు హద్దును స్పష్టంగా పేర్కొన్నట్లు అయింది. శ్రీలంకదే అని ఒప్పుకొన్నప్పటికీ...కచ్చతీవు శ్రీలంకలో భాగమే! పాక్ జలసంధిలోని ఈ చిన్న భూభాగంపై పొరుగు దేశపు క్లయిమును భారత్ అంగీకరించింది. ఆ మేరకు రెండు దేశాల మధ్య 1974లో ఒక అంగీకారం కుదిరింది. ఈ అంగీకారం 1976లో మరో అంగీకారానికి దారితీసింది. అది రెండు దేశాల మధ్య సాగర జలాల సరిహద్దును నిర్దేశించింది. అయినప్పటికీ, రామేశ్వరం–జాఫ్నాల మధ్యనున్న ఈ దీవి, భారత–శ్రీలంక సంబంధాలలో అడపాదడపా చిచ్చు రేపుతూనేఉంది. బ్రిటిష్ హయాంలోనూ, స్వాతంత్య్రానంతర కాలంలోనూ భారత్ మ్యాప్లలో దాన్ని ఒక భాగంగా ఎన్నడూ చూపలేదు. రామే శ్వరంలోని జాలర్ల కోపతాపాలను చల్లార్చేందుకు, తమిళనాడు రాజ కీయ నాయకులు మాత్రం ఆ నిర్జన దీవిని తిరిగి ‘వెనక్కి తీసు కోవడం’ గురించి తరచూ గొంతెత్తుతూ ఉంటారు. తమిళనాడు జాలర్లు చేపల వేటకు అనుసరిస్తున్న ‘బాటమ్ ట్రాలింగ్’, ‘పర్స్ సైన్’, ‘డబుల్ నెట్’ వంటి పద్ధతుల వల్ల చేపలు ఇక ఏమాత్రం లభ్యంకాని స్థితి ఏర్పడింది. శ్రీలంక వైపు వనరులు ఎక్కువ ఉండటానికి కారణం, 30 ఏళ్ళ అంతర్యుద్ధ సమయంలో, జాఫ్నా జాలర్లు దూర ప్రాంతాల్లో చేపల వేటకు సాహసించకపోవ డమే! దాంతో శ్రీలంక వైపు చేపల వేట భారతీయ జాలర్లకు ఆకర్షణీ యమైనదిగా మారింది. ఫలితంగా, వారిని శ్రీలంక నౌకా దళం అరెస్టు చేయడం, వారి బోట్లను, వలలను స్వాధీనపరచుకోవడం పరిపాటిగా మారింది. విజయ్ వ్యాఖ్యలతో మరోసారి...గంగపుత్రులకు ప్రత్యామ్నాయ జీవనోపాధులను సృష్టించవల సిందిపోయి వారి సమస్యలన్నింటికీ పరిష్కారం కచ్చతీవును స్వాధీనపరచుకోవడమే అన్న భ్రమను తమిళ నాయకులు పెంచి పోషిస్తూ వచ్చారు. ‘తమిళిగ వెట్రి కళగం’ పార్టీని ప్రారంభించిన సినీ నటుడు విజయ్ కూడా నిన్నగాక మొన్న అదే పల్లవిని అందు కున్నారు. ఇంతవరకు ఆయన నిర్వహించిన ర్యాలీలన్నింటిలోకెల్లా ఇటీవలి మదురై ర్యాలీని అతి పెద్దదిగా చెప్పాలి. రాష్ట్ర జాలర్లకు ‘చిన్న పని చేసి పెట్టండి చాలు’, ‘ఈ దీవి మనదేనని క్లయిముచేస్తే మన జాలర్లు సురక్షితంగా ఉంటారు’ అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి, అదే భ్రమను కొనసాగించడంలో తాను కూడా ఒక చేయి వేశారు.కచ్చతీవును ‘తిరిగి’ తెచ్చుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వం ఇంతవరకు నాలుగు తీర్మానాలు చేసింది. శ్రీలంకతో కుదిరినఅంగీకారాన్ని ‘రాజ్యాంగ విరుద్ధమైనది’గా పేర్కొంటూ రద్దు చేయవలసిందని కోరుతున్న కేసులు కొన్ని సుప్రీం కోర్టు ముందు న్నాయి. కచ్చతీవును కాంగ్రెస్ ‘నిర్లక్ష్యపూరితం’గా శ్రీలంకకు అప్ప గించిందని 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించడం ద్వారా ప్రధాన మంత్రి మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అగ్నికి ఆజ్యం పోశారు. కచ్చతీవును వెనక్కి తీసుకోవడం తమిళ జాలర్ల సమస్యలను పరిష్కరిస్తుందనే మాటే నిజమైతే, తమిళ చేపల బోట్లు కచ్చాతీవును దాటి, శ్రీలంక తూర్పు కోస్తా వరకు ఎందుకు వెళ్తున్నట్లు? విజయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హేరత్, ‘‘రాజకీయ వేదికల నుంచి చేసే ప్రసంగాలను’’ చెవికెక్కించుకోవ ద్దంటూ శ్రీలంక పౌరులను కోరారు. దిస్సనాయకెకు కలిసొచ్చింది!కచ్చతీవును సందర్శించడం స్వదేశంలో దిస్సనాయకెకు చెందిన నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) పార్టీకి సహాయపడటం ఖాయం. తమిళులు ఎక్కువగా ఉన్న జాఫ్నాలో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాన్ని ఆయన పార్టీ కొనసాగిస్తోంది. అంతర్యుద్ధ సమయంలో, తమిళ ఉగ్ర సంస్థలకు ఉదారంగా సహాయపడిన, ఆవలి వైపునున్న తమిళ సోదరులు, ఇపుడు తమకే ఎసరు పెడుతున్నారనే భావన జాఫ్నా తమిళులలో పాదుకొంది. కచ్చతీవు దీవిలో కాలు మోపడం ద్వారా, తాను శ్రీలంక తమిళ జాలర్ల పక్షాన ఉన్నానని దిస్సనాయకె చాటుకున్నట్లు అయింది. దిస్సనాయకె ప్రతిష్ఠ కొద్ది నెలలుగా మసకబారుతూ వస్తోంది. ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తామని,కఠినంగా ఉన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ షరతులలో మార్పులు కోరతామని వాగ్దానం చేయడం ద్వారా ఎన్పీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, అది ఇంతవరకు ఉన్నపరిస్థితులు మరింత దిగజారకుండా మాత్రమే నిర్వహించగలుగుతోంది. ఈ నేపథ్యంలో, కచ్చతీవు భూభాగం తమదేనని దిస్సనాయకె చాటుకోవడం, ఆయన ప్రభుత్వానికి ప్రధాన అండగా ఉన్నసింహళ జాతీయులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. భారత్ పట్ల మరీ మెతకగా వ్యవహరిస్తున్నారని నిందిస్తున్న స్వదేశంలోని విమర్శకులకు కూడా దిస్సనాయకె సందేశం పంపినట్లయింది. భారతదేశంతో రక్షణ సహకార ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఆయన విమర్శల పాలయ్యారు. మొత్తానికి, శ్రీలంక ప్రయోజ నాలకు కట్టుబడిన వ్యక్తిగా దిస్సనాయకె తనను తాను చాటుకో గలిగారు.సముద్రంపై జీవనం సాగించేవారికి సెయింట్ ఆంటొని ఆరాధనీయుడు. ఆయన స్మారక ప్రార్థనా మందిరం కచ్చతీవులో శతాబ్దంపైగా నిలిచి ఉంది. అంతర్యుద్ధం అంతమైన తర్వాత, ప్రార్థనా మందిరం కొత్త రూపురేఖలను సంతరించుకుంది. ఇంతా చేసి, 1.6 కిలోమీటర్ల పొడవు, 300 మీటర్ల వెడల్పు కలిగిన కచ్చతీవు పర్యాటక ప్రదేశంగా పరిణమించవచ్చు. కానీ, తమిళనాడు నుంచి సన్నాయి నొక్కులు మాత్రం ఆగకపోవచ్చు. - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ - నిరుపమా సుబ్రమణియన్ -
అతి క్లిష్ట స్థితిలో నేపాల్
నేపాల్ను ఈ నెల 8, 9వ తేదీలలో తీవ్రంగా కుదిపివేసిన నిరసనలు, హింసాకాండ శాంతించి ఉండవచ్చు. నిరసనలకు నాయకత్వం వహించిన ‘జెన్–జడ్’ ఉద్యమకారులకూ, సైన్యానికీ మధ్య చర్చలు ఫలించి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడవచ్చు. కానీ, ఒక దేశంగా నేపాల్ ప్రస్తుతం ఒక అతి క్లిష్టమైన స్థితికి చేరింది. వందల సంవత్సరాల రాచరిక పాల నను కూలదోసి ప్రజాస్వామికంగా మారిన ఒక దేశం, సుస్థిరంగా అదే వ్యవస్థలో కొనసాగాలంటే ముఖ్యంగా కావలసిందేమిటి? లోపాలు ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ప్రజల విశ్వాసం పొంది, స్థిరపడి కొనసాగటం! అది జరగ నప్పుడు అనివార్యంగా వ్యక్తి నియంతృత్వాలు, వర్గ నియంతృత్వాలు, సైనిక నియంతృత్వాలు ఏర్పడతాయి. రాచరికం 2008లో పోయిన తర్వాత ఈ 17 ఏళ్లలో అక్కడి మూడు పార్టీలు కూడా స్వయంగానో, పరస్పరం చేతులు కలిపో పరిపాలించాయి. ప్రజల విశ్వాసాన్ని పొందటంలో మాత్రం అన్నీ విఫలమయ్యాయి. నిరసనకారులు మూడు పార్టీల నాయకుల ఇళ్ల పైనా దాడులు జరిపారు. దీనంతటి మధ్య ఆశాకిరణం–ఉద్యమ కారులు మౌలికంగా ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని కోల్పోకపోవటం, స్వయంగా సైన్యం ప్రజాస్వామ్యాన్ని కూలదోయక పోవటం!బద్దలైన నిరసనలునిరసనలు అనూహ్యంగా, అకస్మాత్తుగా సోషల్ మీడియాపై నిషేధం అనే చర్య నుంచి మొదలయ్యాయి. సాధారణంగా నిరస నలు, ముఖ్యంగా యువతరం నుంచి, నిరుద్యోగం, అవినీతి, బంధు ప్రీతి వంటి అంశా లపై జరగటం మనకు తెలుసు. కానీ నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధంతో మొదలై, ఆ తర్వాత తక్కిన అంశాలు వచ్చి చేరాయి. ఆ విధంగా, అక్కడి సమాజంలో సోషల్ మీడియాకు, ఇతర అంశాలకు అటువంటి అవినాభావ సంబంధం ఉంది. అది భారతదేశంలో కనిపించే స్థితికి భిన్నమైనది. ఇపుడు వెలుగులోకి వస్తున్న దానిని బట్టి, అక్కడి యువతరానికి నిరసనలకు సోషల్ మీడియా నిరంతర వేదికగా మారింది. దానితోపాటు, ఇతర దేశా లకు వలసపోయిన దాదాపు 25 లక్షలమంది నేపాలీలు అక్కడి నుంచి తమ వారికి చేస్తున్న ఆన్లైన్ నగదు బదిలీలకు కూడా! ఆ విధంగా ఆ నిషేధం పట్ల నిరసనలు, ఇతరత్రా పేరుకుపోతూ వస్తున్న నిరసనలు కలిసి అగ్ని పర్వతం వలె పేలేందుకు దోహద మయ్యాయి.ఇది ఒకటి కాగా, గత 17 ఏళ్లుగా పాలించిన అన్ని ప్రధాన పార్టీలలో ఏవీ ప్రజల విశ్వాసాన్ని పొందలేక పోయాయి. ఈ దోషం, వైఫల్యం ముఖ్యంగా వామపక్షాలవి కావటం గమనించ దగ్గది. అట్లా భావించటం ఎందువల్ల? రాచరికం నుంచి పరిమిత ప్రజాస్వామ్యం వైపు సంస్కరణల మార్గంలో ఇతర పార్టీలు ప్రయ త్నించగా, మావోయిస్టు పార్టీ పదేళ్ల పాటు రాజీలేని సాయుధ పోరాటం నడిపి రాచరిక వ్యవస్థనే అంతం చేసింది. అటువంటపుడు ఆ పార్టీగానీ, అంతకు ముందునుంచీ ప్రధాన స్రవంతిలో గల ఇతర కమ్యూనిస్టులు, సోషలిస్టులు గానీ ఏమి చేయాల్సింది? ప్రపంచంలోనే అతి పేద దేశాలలో ఒకటైన నేపాల్ అభివృద్ధికి ఒక ప్రణాళిక ప్రకారం, అంకితభావంతో కృషి చేయాలి. నైతిక విలువలను పాటిస్తూ ఆదర్శంగా నిలవాలి. తమ ఐక్యతను కొనసాగించి సుస్థిర పాలన సాగించటం మూడవ అవసరం. ఈ మూడూ జరిగి ఉంటే అసంతృప్తికి ఆస్కారమే ఉండేది కాదు.విశ్వాసం కోల్పోయిన పార్టీలునేపాల్లో అనేక పార్టీలు ఉన్నా, ప్రధానమైనవి మూడు: మధ్యే మార్గపు నేపాలీ కాంగ్రెస్, గతం నుంచి ఉన్న సాంప్రదాయిక కమ్యూ నిస్టు పార్టీ, రాచరికంపై పోరాడిన మావోయిస్టు పార్టీ. తక్కిన పార్టీ లలోనూ ఎక్కువ వామపక్ష మార్గం లోనివే. 2008లో రాచరికం పోయిన తర్వాత జరిగిన ఎన్నికలలో గెలిచి, మావోయిస్టు నాయ కుడు పుష్పకమల్ దహాల్ లేదా ప్రచండ ప్రధాని అయ్యారు. పరిపాలనలో విఫలమయ్యారు. ఏడాదికే పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. తన పార్టీ కూడా చీలిపోయింది. పరిపాలన ద్వారా సామా జిక మార్పులు, సమానత్వాలు కూడా తీసుకు రావాలని పట్టుబట్టిన ప్రచండ ప్రధాన సహచరుడు, జేఎన్యూ (ఢిల్లీ) పూర్వ విద్యార్థి బాబూరాం భట్టరాయ్ వేరే పార్టీ ప్రారంభించాడు. అప్పటి నుంచి నేపాల్లో ఇక రాజకీయ సుస్థిరత లేకపోయింది. 17 ఏళ్ళలో మొత్తం 14 మంది ప్రధానులు వచ్చారు. కొందరు మళ్లీ మళ్లీ అయ్యారు. వారిలో ఎక్కువసార్లు వామపక్షాల వారే. ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి సుశీల కర్కీ పేరు వినవస్తున్నది. గతంలోనూ ఒకసారి ఇదే విధంగా జస్టిస్ ఖిల్రాజ్ రెగ్మీ (2013–14) నియమితులయ్యారు. ఇటువంటి నియామకాలు రాజకీయ అస్థిరతకు మరొక గుర్తు అవు తున్నాయి. అస్థిరతవల్ల పెట్టుబడులు రావటం లేదు.ఆశ్చర్యకరంగా అవినీతి, బంధుప్రీతి, విలాసవంతమైన జీవితం లాంటి ఆరోపణలను మావోయిస్టు ప్రచండ తన మొదటి పాలనా కాలంలోనే ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి అన్ని ప్రభు త్వాలూ ఈ విమర్శలకు గురవుతూనే ఉన్నాయి. అయినా సరైన విచారణలు, శిక్షలు లేకుండా పోయాయి. నిరుద్యోగం, పేదరికం విషయానికి వస్తే ఒక విచిత్ర స్థితి కనిపిస్తుంది. మూడు కోట్ల జనాభాలో సుమారు పావు కోటి మంది వలసలు పోయి పనులు చేసుకుంటున్నందున ఆ వర్గాల్లో స్థానికుల నిరుద్యోగం సుమారు 10 శాతం. కానీ యువతరంలో 20 శాతంగా ఉంది. అందుకు కారణం నైపుణ్యాలు నేర్పే చదువులు గానీ, స్థానిక పరిశ్రమలు గానీ లేక పోవటం. యువత తిరుగుబాటుకు ఇదీ ఒక ముఖ్య కారణం. పోతే, ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం పేదరికం 2022లో 7.5 శాతం కాగా, 2025లో 5.6కు తగ్గుతుందని అంచనా. అయితే, విపరీతమైన వలసలు, వారు పంపే డబ్బు ఈ విధంగా తక్కువ పేదరికానికి కారణమైంది. నిజంగా పేదరికం 25 శాతమని అంచనా.అక్కడ భూకంపాలు ప్రాకృతికమైన సహజ విపత్తు కాగా,ఇంకా 20 ఏళ్లయినా నిండని ఆ ప్రజాస్వామ్యానికి రాజకీయ అస్థిర తలు నాయకులు సృష్టించే విపత్తులుగా మారాయి. అన్ని పార్టీలూ ప్రజావిశ్వాసాన్ని కోల్పోయినందున రాజకీయ శూన్యత ఏర్పడింది. ఆ స్థానాన్ని ఆక్రమించగల కొత్త పార్టీలు కనీసం ఉనికిలోకైనా రాలేదు. ఉద్యమకారులకు ఆగ్రహం, ఆకాంక్షలు మినహా విధానపరంగా, ఆచరణపరంగా ఎటువంటి ఆలోచనలూ లేవు. ప్రస్తుత రాజకీయ శూన్యాన్ని పూరించగలవారెవరూ కన్పించటం లేదు. రాజ వంశీకు లకు పునరాగమనపు ఆశలున్నా ప్రజలు ఆమోదించే అవకాశం లేదు. ఇవన్నీ ఒక విధమైన క్లిష్ట స్థితి కాగా, స్థానికంగా ఆర్థికాభివృద్ధి ప్రశ్నకు తోడు ఇవన్నీ ఎన్నటికి జరిగేనన్నది మరొక క్లిష్ట స్థితి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
జాతి సేవలో మునుముందుకు...
ఈ రోజు సెప్టెంబరు 11... ఈ తేదీ మనకు రెండు విభిన్న చారిత్రక సంఘటనలను గుర్తు చేస్తుంది. మొదటిది... షికా గోలో 1893నాటి స్వామి వివేకానంద ప్రసంగం. ‘సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా’ అన్న ఆయన పలకరింపు ఆ సమావేశ మందిరంలోని వేలాది ప్రేక్షకుల హృద యాలను పులకరింప జేసింది. భారత అజరామర ఆధ్యాత్మిక వారసత్వాన్ని, సార్వత్రిక సోదరభావన ప్రాధాన్యాన్ని ఈ అంతర్జాతీయ వేదికపై నుంచి ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు. రెండోది... ఉగ్రవాద– తీవ్రవాద దుశ్చర్యల ఫలితంగా ఈ సౌహార్ద భావనను తుత్తు నియలు చేస్తూ సాగిన 9/11 నాటి భీకర దాడులు.ఇదే రోజుకు మరో ప్రత్యేకత కూడా ఉంది... ‘వసుధైవ కుటుంబకం’ సూత్రంతో ప్రేరణ పొంది, సామాజిక మార్పు–సామరస్యం, సోదరభావ స్ఫూర్తి బలోపేతం లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుడి జన్మదినమిది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో అనుబంధంగల లక్షలాది మంది ఆయనను సగౌరవంగా... ప్రేమాభిమానాలతో పరమ ‘పూజ్య సర్సంఘ్ చాలక్’ అని పిలుచుకుంటారు. అవును... నేను చెబుతున్నది శ్రీ మోహన్ భాగవత్ గురించే! ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆయన 75వ జన్మదిన వేడుక నిర్వహించుకోవడం యాదృచ్ఛికం. ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దైవం ఆయనకు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.మోహన్ భాగవత్ కుటుంబంతో నా అనుబంధం ఎంతో లోతైనది. ఆయన తండ్రి దివంగత మధుకర్ రావు భాగవత్తో సన్నిహితంగా పనిచేసే అదృష్టం నాకు దక్కింది. ఈ అనుభవాన్ని నా రచన ‘జ్యోతిపుంజ్’లో విస్తృతంగా వివరించాను. న్యాయ వ్యవస్థతో తన అనుబంధంతో పాటు, దేశ ప్రగతి కోసం ఆయన తనను తాను అంకితం చేసుకున్నారు. గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా ‘ఆర్ఎస్ఎస్’ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దేశ పురోగమనంపై మధుకర్ రావు తపన ఎంతటిదంటే– తన కుమారుడు మోహన్ రావును భారత పునరుజ్జీవనం దిశగా కృషికి పురిగొల్పింది. మధుకర్ రావు ఒక పరుసవేది కాగా, మోహన్ రావు రూపంలో మరో ‘మణి’ని తీర్చిదిద్దారు.తొలి అడుగులుమోహన్ 1970 దశకం మధ్య భాగంలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అయ్యారు. ‘ప్రచారక్’ అంటే– ఏదో ఒక సిద్ధాంతం ఆధారంగాసంబంధిత ప్రబోధాలను ప్రచారం చేసే బాధ్యతగా కొందరు అపార్థం చేసుకోవచ్చు. కానీ, ఆర్ఎస్ఎస్ పనితీరు గురించి తెలిసిన వారికి ‘ప్రచారక్’ అనేది సంస్థలో కీలక పని సంప్రదాయమనే వాస్తవం చక్కగా తెలుసు. గడచిన వంద సంవత్సరాలుగా దేశభక్తి ప్రేరణగా వేలాది యువత ‘భారతదేశమే ప్రధానం’ లక్ష్యంగా దాన్ని సాకారం చేసే దిశగా తమ జీవితాలను అంకితం చేశారు. ఇందు కోసం వారు ఇల్లూవాకిలీ సహా కుటుంబ బంధాలన్నిటినీ వదులు కుని దేశమాత సేవలో తరించారు.ఆయన ‘ఆర్ఎస్ఎస్’లో ప్రవేశించిన తొలినాళ్ల సమయాన్ని భారత చరిత్రలో అంధకార యుగంగా అభివర్ణించవచ్చు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత క్రూర ఎమర్జెన్సీ విధించిన సమయ మది. ప్రజాస్వామ్య సూత్రాలను గౌరవిస్తూ, దేశం ప్రగతి పథంలో పయనించాలని ఆకాంక్షించే ప్రతి వ్యక్తీ దీన్ని ప్రతిఘటిస్తూ ఉద్యమంలో దూకడం అత్యంత సహజం. అదే తరహాలో మోహన్ సహా అసంఖ్యాక ‘ఆర్ఎస్ఎస్’ స్వయంసేవకులు కూడా ఇలాగే చేశారు. మహారాష్ట్రలోని గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో... ముఖ్యంగా విదర్భలో ఆయన విస్తృతంగా పనిచేశారు. తద్వారా పేదలు, అణ గారిన వర్గాల సమస్యలను ఆకళింపు చేసుకునే అవకాశం ఆయనకు లభించింది.అనంతర కాలంలో భాగవత్ ‘ఆర్ఎస్ఎస్’లో వివిధ బాధ్య తలు నిర్వర్తించారు. ఆ యా విధుల నిర్వహణలో ఆయన అసమాన నైపుణ్యం ప్రదర్శించారు. ముఖ్యంగా 1990 దశకంలో ‘అఖిల భారతీయ శారీరక్ ప్రముఖ్’ అధిపతిగా మోహన్ పనిచేసిన కాలాన్ని చాలామంది స్వయంసేవకులు నేటికీ ఎంతో ప్రేమాభిమానాలతో స్మరించుకుంటుంటారు. ఆ సమయంలో ఆయన బిహార్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సంఘ్ నిర్మాణం కోసం అవిరళ కృషి చేశారు. జనజీవనంలోని క్షేత్రస్థాయి సమస్యలపై ఆయన అవగాహనను ఈ అనుభవాలు మరింత పెంచాయి. అటుపైన 20వ శతాబ్దారంభంలో ఆయన ‘అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్’గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2000లో ‘సర్కార్యవాహ్’ అయ్యారు.ఈ రెండు పదవుల్లోనూ తనదంటూ ప్రత్యేక పనిశైలిని ఆచరణలో పెట్టారు. అత్యంత సంక్లిష్ట పరిస్థితులను సులువుగా, కచ్చితత్వంతో నిభాయించారు. ఆ తర్వాత 2009లో ‘సర్సంఘ్చాలక్’గా ఆర్ఎస్ఎస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ అందరికీ ఉత్తేజమిచ్చే విధంగా పని చేస్తున్నారు.ఈ పదవీ నిర్వహణ సంస్థాగత బాధ్యతను మించిన కర్తవ్యం. సంస్థ ఉద్దేశాలు, నిర్దేశాలపై స్పష్టత, భరతమాతపై అపార ప్రేమగల అసాధారణ వ్యక్తులు త్యాగం, అచంచల నిబద్ధతతో ఈ బాధ్యతలకు కొత్త నిర్వచనమిచ్చారు. మోహన్ భాగవత్ ఈ గురుతర బాధ్యతను అనితర సాధ్యంగా నిర్వహించడంతోపాటు స్వీయ శక్తిసామర్థ్యాలు, మేధస్సు జోడించి కరుణార్ద్ర నాయకత్వాన్ని ఆచరణాత్మకంగా చూపారు. ‘దేశమే ప్రధానం’ అన్న సూత్రమే వీటన్నిటికీ ప్రేరణ!ప్రత్యేక కార్యశీలత్వంఅవిచ్ఛిన్నత, అన్వయం... మోహన్ జీ మనఃపూర్వకంగా భావించిన, తన కార్యశైలిలో ఇముడ్చుకున్న ముఖ్యమైన అంశాలపై ఆలోచిస్తే ఈ రెండూ నాకు స్ఫురిస్తాయి. మనం గర్వించే సంస్థాగత భావజాల పరంగా రాజీపడకుండా, అదే సమయంలో మారుతున్న సామాజిక అవసరాలకూ అనుగుణంగా... సంక్లిష్టమైన అంశాల్లోనూ ఆయన సమర్థంగా సంస్థను ముందుకు నడిపారు. ఆయనకు యువతతో సహజమైన అనుబంధం ఉంది. ఎప్పుడూ పెద్ద సంఖ్యలో యువతను సంఘ్పరివార్లో భాగస్వాములను చేయడంపై దృష్టి సారించారు. ఆయనెప్పుడూ బహిరంగ చర్చల్లో పాల్గొంటూ, ప్రజలతో సంభాషిస్తూ కనిపిస్తారు. నేటి గతిశీల, డిజిటల్ ప్రపంచంలో ఇది అత్యంత ప్రయోజనకరమైన అంశం. స్థూలంగా చెప్పాలంటే, వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రస్థానంలో భాగవత్ జీ బాధ్యతలు నిర్వర్తించిన కాలం అత్యంత విప్లవాత్మక సమయమని చెప్పక తప్పదు. యూనిఫాంలో మార్పు నుంచి శిక్షా వర్గలలో (శిక్షణ శిబిరాలు) మార్పుల వరకు... ఆయన నేతృత్వంలో అనేక ముఖ్యమైన మార్పులు వచ్చాయి. మానవత్వం విపత్తుతో తలపడిన కోవిడ్ కాలంలో మోహన్ జీ కృషి నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. జీవితకాలంలో మునుపెన్నడూ చూడని ఆ విపత్తు వేళ ఆర్ఎస్ఎస్ సాంప్రదాయక కార్యకలాపాల కొనసాగింపు సవాలుగా మారింది. సాంకేతికత వినియోగాన్ని పెంచాలని మోహన్ జీ సూచించారు. ప్రపంచవ్యాప్త సవాళ్ల నేపథ్యంలో... సంస్థాగత యంత్రాంగాలను అభివృద్ధి చేస్తూనే, అంత ర్జాతీయ పరిణామాలనూ నిశితంగా పరిశీలించారు. స్వీయ రక్షణ చర్యలతోపాటు ప్రజా రక్షణను కర్తవ్యంగా భావిస్తూ.. ఆపన్నులను ఆదుకునేందుకు కోవిడ్ సమయంలో స్వయంసేవకులంతా శక్తివంచన లేకుండా కృషి చేశారు. అనేక చోట్ల వైద్య శిబిరాలు నిర్వహించాం. కష్టపడి పనిచేసే స్వయంసేవకులను కూడా కోల్పోయాం. కానీ మోహన్ జీ స్ఫూర్తి వల్ల వారి దృఢ సంకల్పం ఎప్పుడూ సడలలేదు.ఈ ఏడాది మొదట్లో నాగ్పూర్లో మాధవ్ నేత్ర చికిత్సాలయ ప్రారంభోత్సవం సందర్భంగా... ఆర్ఎస్ఎస్ ఒక అక్షయవటం లాంటిదనీ, అది మన దేశ సంస్కృతినీ, సామూహిక చైతన్యాన్నీ శక్తిమంతం చేస్తుందనీ నేను వ్యాఖ్యానించాను. ఈ అక్షయవట మూలాలు లోతైనవి, బలమైనవి. ఎందుకంటే అవి విలువలతో కూడుకున్నవి. ఈ విలువలను పెంపొందించడానికీ, ముందుకు తీసుకెళ్లడానికీ మోహన్ భాగవత్ జీ అంకితభావంతో వ్యవహరించిన విధానం నిజంగా స్ఫూర్తిదాయకం.మోహన్ జీ వ్యక్తిత్వంలో మరో అద్భుత లక్షణం ఆయన మృదు భాషణం. ఆయన అందరి మాటా వింటారు. ఈ లక్షణం విస్తృత దృక్పథానికి నిదర్శనం. ఇదే ఆయన వ్యక్తిత్వానికి, నాయకత్వానికి శోభనిచ్చింది. పంచ పరివర్తన్వివిధ ప్రజా కార్యక్రమాలపై ఆయన చూపించిన ఆసక్తి గురించి కూడా నేను రాయాలనుకుంటున్నాను. ‘స్వచ్ఛ భారత్ మిషన్’ నుంచి ‘బేటీ బచావో బేటీ పఢావో’ వరకు.. ఈ కార్య క్రమాల్లో ఉత్సాహంగా భాగస్వామ్యం వహించాలని మొత్తం ఆర్ఎస్ఎస్ కుటుంబానికీ ఆయన ఎప్పుడూ చెప్పేవారు. సామాజిక శ్రేయస్సు కోసం మోహన్ జీ ‘పంచ పరివర్తన్’ అందించారు. సామాజిక సామరస్యం, కుటుంబ విలువలు, పర్యావరణ అవగా హన, జాతీయ భావన, పౌర విధులు ఇందులోని అంశాలు. జీవితంలోని ప్రతి దశలో ఇవి భారతీయులకు స్ఫూర్తిని స్తాయి. బలమైన, సంపన్నమైన దేశాన్ని చూడాలని ప్రతి స్వయంసేవక్ కలలుగంటాడు. దాన్ని సాకారం చేయడం కోసం... స్పష్టమైన దార్శనికత, నిర్ణయాత్మక కార్యాచరణ రెండూ కావాలి. మోహన్ జీలో ఈ రెండు లక్షణాలూ పుష్కలంగా ఉన్నాయి. భాగవత్ జీ ఎప్పుడూ ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ గురించి బలంగా చెప్తారు. భారతదేశ వైవిధ్యాన్ని గట్టిగా నమ్మే వ్యక్తి. దేశంలో భాగమైన అనేక విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలను ఘనంగా చాటుతారు. తన షెడ్యూల్ వల్ల ఎంత బిజీగా ఉన్నా... మోహన్ జీ సంగీతం, పాటల వంటి అభిరుచులకు ఎప్పుడూ సమయం కేటాయించారు. వివిధ భారతీయ సంగీత వాయిద్యాలలో ఆయన చాలా ప్రజ్ఞాశాలి అని కొద్ది మందికే తెలుసు. చదవడం పట్ల ఆయనకున్న మక్కువ ఆయన ప్రసంగాలు, సంభాషణలలో కనిపిస్తుంది.మరి కొన్ని రోజుల్లో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సంవత్సరం విజయ దశమి, గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఒకే రోజున జరగడం కూడా ఒక ఆనందకరమైన యాదృచ్చికం. భారత దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న లక్షలాది మందికి ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అవుతుంది. ఈ సమయంలో మోహన్ జీ వంటి తెలివైన, కష్టపడి పనిచేసే సర్ సంఘచాలక్ సంస్థను నడిపిస్తున్నారు. మనం అంతరాలకూ, హద్దులకూ అతీతంగా ఎదిగి, ప్రతి ఒక్కరినీ మనవారిగా భావిస్తే సమాజంలో నమ్మకం, సోదరభావం, సమానత్వం బలపడుతుందని చాటిన మోహన్ జీ వసుధైక కుటుంబానికి సజీవ ఉదాహ రణగా చెబుతూ నేను ముగిస్తున్నాను. దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంతో మోహన్ జీ భరతమాత సేవలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. నరేంద్ర మోదీభారత ప్రధాని -
ఇదెక్కడి న్యాయం?
దోషులుగా నిర్ధరణ కాకముందే మన యువతీ యువకులు ఐదేళ్ళకు పైగా జైలులో మగ్గుతూంటే మన ప్రజా స్వామ్యం గురించి ఏమని చెప్పుకోగలం? ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్ నేడు అటు వంటి స్థితిలోనే చిక్కుకున్నారు. వారు దోషులుగా ప్రకటితులైనవారు కాదు. విచారణలో ఉన్న ఖైదీలు. నిర్దోషులుగానే ఇప్పటికీ భావించవచ్చు. అయినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యు.ఎ.పి.ఎ.) వల్ల ఢిల్లీ హైకోర్టు 2025 సెప్టెంబర్ ఆదేశం మేరకు వారు ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. వారు కుట్ర పన్నారనడానికి వారి ప్రసంగాలను, కరపత్రాలను, వాట్సాప్ గ్రూపులను సాక్ష్యాధారంగా తీసుకున్నారు. వేలాది పేజీల భారం కింద విచారణ కుంటు పడుతూ వచ్చింది. కేసులు ఏళ్ళకొద్దీ నానుతూ ఉంటే, స్వేచ్ఛను తొక్కి ఉంచడానికి లేదని సాక్షాత్తూ సుప్రీంకోర్టు కె.ఏ. నజీబ్ కేసు (2021)లో హెచ్చరించింది. ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టినట్లే కనిపిస్తోంది. విచారణ రంగస్థలమా?విచారణ దశలో ప్రాసిక్యూషన్ చెబుతున్నదాన్నే పరిగణనలోకి తీసుకోవాల్సిందని జడ్జీలకు నిర్దేశిస్తున్న ‘వటాలీ’ తీర్పు (2019) పూర్వ ప్రమాణంపైనే హైకోర్టు ఆధారపడింది. తాను ‘మినీ విచా రణ’ను ఏమీ నిర్వహించడం లేదని కోర్టు చెబుతోంది. కానీ, ప్రబ లంగా లేని సాక్షుల ప్రకటనలను అది వేదవాక్యంగా తీసుకుంది. అహింసకు ప్రేరేపిస్తున్న ప్రసంగాలు రక్తపాతానికి ఇచ్చిన పిలుపు లయ్యాయి. అటువంటి కారణాలపై స్వేచ్ఛను నిరాకరిస్తే, ఇంక విచారణ రంగస్థలం కాక మరేమవుతుంది?కుట్రలను పరోక్షంగా కూడా రుజువు చేయవచ్చు. కానీ, ప్రాసంగిక సాక్ష్యాధారాలైనా కనీసం ఒకదానితో ఒకటి పొసగేవిగా ఉండాలి. ఇక్కడ పౌరసత్వ సవరణ చట్టం పట్ల అసమ్మతిని ఢిల్లీని బుగ్గి చేసే బృహత్ పథకం గాటన కట్టారు. ఉమర్ ఖాలిద్ 2020 ఫిబ్రవరిలో చేసిన అమరావతి ప్రసంగాన్నే తీసుకోండి. ఆయన 24–02–2020న నిరసనలు చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక పర్యటన కూడా కాకతాళీయంగా, అదే రోజున చోటు చేసుకుంది. ‘‘హింసాయుత అల్లర్లను ప్రేరేపించేందుకే ఉద్దేశపూర్వ కంగా ఆ రోజును ఎంచుకొన్నారు. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకే ఆ పని చేశారు’’ అని కోర్టు పేర్కొంది. అయితే, ‘‘హింస పట్ల హింసతో మేం ప్రతిస్పందించం. ద్వేషం పట్ల ద్వేషంతో మేం ప్రతి స్పందించం. వారు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తే, మేం దానిపై ప్రేమతో స్పందిస్తాం. వారు మమ్మల్ని లాఠీలతో కొడితే, మేం త్రివర్ణ పతాకా లను చేతబూనుతాం’’ అని ఆయన సభికులతో అన్నట్లుగా వాస్తవిక రాతప్రతి వెల్లడిస్తోంది. ప్రజాస్వామ్యంలో నిరసన ఒక భాగంశర్జీల్ ఇమామ్ విషయంలో... ఆయన జామియా, అలీగఢ్, అసన్సోల్, గయలలో చేసిన ప్రసంగాలను ప్రముఖంగా పేర్కొంది. ‘‘భారతదేశంలోని మిగిలిన ప్రాంతం నుంచి ఢిల్లీని శాశ్వతంగా విడ గొట్టేస్తాం’’ అని ఆయన అన్నమాటలను కోర్టు ఉదాహరించింది. నిరసన ప్రదర్శనల్లో సాధారణ దృశ్యాలైన రోడ్డు దిగ్భంధ నాలు, బైఠాయింపులను ఉగ్రవాదానికి ప్రాథమిక సాక్ష్యాధారాలుగా ఉన్నత స్థానం కల్పించింది. అదే అలీగఢ్ ప్రసంగాన్ని విశ్లేషిస్తూ అలహాబాద్ హైకోర్టు ‘‘హింసకు పురికొల్పేది నిస్సందేహంగా ఏదీ లేదు’’ అని కనుగొన్న అంశాన్నీ, బెయిలు మంజూరు చేసిన విష యాన్నీ తీర్పు విస్మరించింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకు రక్షణ కల్పిస్తున్న రాజ్యాంగంలోని 19వ అధికరణాన్ని తీర్పు గుర్తించకపోలేదు.అందుకు అది మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ను ఉటంకించింది. ఇమ్రాన్ ప్రతాప్గఢీ కేసులో సుప్రీం కోర్టు 2025లో తీసుకున్న నిర్ణయాన్ని కూడా ప్రస్తావించింది. అయినా కూడా, పౌరసత్వ సవ రణ చట్ట వ్యతిరేక నిరసన ప్రదర్శనలు స్వభావసిద్ధంగా హింసా యుతమైనవని ప్రాసిక్యూషన్ చేసిన వాదనను అంగీకరించింది. భారతదేశంలో ఏ నిరసన ప్రదర్శన అయినా అవాంతరాలు సృష్టించేదిగానే ఉంటోంది.దండి యాత్ర, ఎమర్జెన్సీ వ్యతిరేక ర్యాలీల నుంచి చిల్లరమల్లర నిరసనలు, యాత్రలు, బైఠాయింపులు, రోడ్డు దిగ్బంధనాలు మన ప్రజాస్వామిక సరళిలో భాగంగా ఉంటూ వస్తున్నాయి. అటువంటి చర్యలను ‘ఉగ్రవాద కార్యకలాపాలు’గా ముద్ర వేయడం ప్రజాస్వా మ్యాన్నే నేరమయం అనడం అవుతుంది. ఈ కేసులోని పలువురు సహ నిందితులు (దేవాంగనా కలితా, నటాషా నర్వాల్, ఆసిఫ్ ఇక్బాల్ తన్హా) ఇప్పటికే బెయిలుపై బయ టకు వచ్చారు. సూత్రప్రాయంగా చూస్తే, వారి సరసన ఉన్న ఇతరులకూ అదే రకమైన ఊరట లభించాలి. కోర్టు దీన్ని కూడా పట్టించుకోలేదు. ‘‘తొలుతటి బెయిలు ఉత్తర్వులను పూర్వ ప్రమాణంగా తీసుకోవడానికి లేదు’’ అని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అది ఇందుకు వాడుకుంది. కానీ, ఖాలిద్, ఇమామ్ పాత్ర ఇప్పటికే విడుదలైనవారి కన్నా పెద్దది ఏమీ కాదు. ఏ విధంగానో చెప్పకుండానే, వారి ప్రమేయం ‘తీవ్ర’మైనదని ప్రకటించడం ద్వారా, చట్టం ముందు అందరూ సమానులేనన్న మౌలిక సూత్రాన్ని కూడా కోర్టు పట్టించుకోలేదు.ఈ కేసు కేవలం ఖాలిద్ లేదా ఇమామ్ గురించినది కాదు. భారతదేశంలో అసమ్మతికి ఉన్న తావు గురించినది. నిరసనను ఉగ్రవాదంగా చూస్తే, ఇక సమీకరించడానికి ఎవరు సాహసిస్తారు? వాట్సాప్ గ్రూపులు కుట్రలైతే వాటిలో చేరేందుకు ఎవరు సాహసిస్తారు? పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసన ప్రదర్శన రాజ్యాంగబద్ధంగా సమీకరించినదే. దాన్ని ఉగ్రవాద కుట్రగా చిత్రించడం ద్వారా కోర్టు ఒక మొత్తం ఉద్యమాన్ని చట్టవిరుద్ధం చేస్తోంది. పౌర ప్రజాస్వామ్యం స్వేచ్ఛ, భద్రత రెండింటినీ కాపాడుకొని తీరాలి. దామాషాయే అసలు పరీక్ష. మాటలకు, నిరసన ప్రదర్శ నలకుగాను, విచారణకు నోచుకోకుండా ఐదేళ్ళు జైలులో గడపడం దామాషా కిందకు రాదు. దోషిగా నిరూపణ కాకుండానే శిక్ష వేయ డమవుతుంది. పార్లమెంట్ కూడా తన బాధ్యత నుంచి తప్పించు కోలేదు. బెయిలును నిరాకరించే చట్టం ప్రజాస్వామ్యాన్ని కూడా బలహీనపరచేది అవుతుంది. ‘ఉపా’లోని సెక్షన్ 43(డి)(5) సరిగ్గా అదే పని చేస్తోంది. దాన్ని సత్వరం సంస్కరించవలసి ఉంది. ఇక్కడ పణంగా ఉన్నది ఒక్క కేసు కాదు, మొత్తం గణతంత్రం.సంజయ్ హెగ్డే వ్యాసకర్త సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
థాయ్లాండ్కు కొత్త ఏలిక
పేరుకు ప్రజాస్వామ్యమైనా రాచరిక వ్యవస్థ, దాని విధేయ సైన్యం, రాజ్యాంగ న్యాయస్థానం థాయ్లాండ్ రాజకీయాలను తెర వెనకుండి శాసించటం విడనాడలేదు. పర్యవసానంగా రెండేళ్ల వ్యవధిలో మూడో ప్రధాని రంగప్రవేశం చేశారు. ఇటీవల న్యాయస్థానం ఆదేశంతో పదవి నుంచి వైదొలగిన పేటోన్టాన్ షినవత్రా స్థానంలో బీజేటీ పార్టీ అధినేత అనుతిన్ చార్నివిరకుల్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మధ్య థాయ్లాండ్–కంబోడియాల సైన్యాల మధ్య నాలుగు రోజులపాటు కొనసాగిన ఘర్షణలు థాయ్లాండ్లో రాజకీయ దుమారం రేపాయి. ఆ ఘర్షణల్లో ఇరువైపులా 30 మంది మరణించారు. సరిహద్దులపై తలెత్తిన ఈ యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లకు లొంగి ఇరు దేశాలూ విరమించాయి. ఆ వెంటనే థాయ్ జాతీయవాదులు ఆగ్రహోదగ్రులయ్యారు. షినవత్రా తప్పుకోవాలంటూ ఉద్యమం నడిచింది. ఈలోగానే కంబోడియా మాజీ అధినేత హూన్సేన్తో ఆమె ఫోన్ సంభాషణ లీక్ కావటంతో అంతా తలకిందులైంది. ఈ సంభాషణలో తమ దేశ సైనిక జనరల్ను ఆమె తప్పుబట్టడం, వివాదం పరిష్కారానికి చొరవ తీసుకోవాలని హూన్సేన్ను కోరటం నేరంగా పరిగణించి ఆమె వైదొలగాలంటూ కోర్టు ఆదేశించింది.ప్రధానిగా ఉంటూ, ప్రత్యర్థి దేశానికి చెందిన నాయకుడితో సంభాషించటం, సైనిక జనరల్ను కించపరచటం తప్పే అయినా న్యాయస్థానానికి ఏమంత గొప్ప చరిత్ర లేదు. రాచరిక వ్యవస్థకు అనుకూలమైన తీర్పులిస్తూ ఎన్నికైన ప్రభుత్వాలను ఏదో సాకుతో తొలగించి అస్థిరపర్చటం దానికి అలవాటు. అంతేకాదు... రాచరిక అనుకూల నేతలు హత్యలు చేసినా, అవినీతికి పాల్పడినా నిర్దోషులుగా తీర్పునివ్వటం రివాజు. 1932లోనే రాచరిక వ్యవస్థ అంతరించినా అదంతా నామమాత్రం. వ్యవస్థలన్నీ దాని చెప్పుచేతల్లోనే ఉంటాయి. సైనిక కుట్రల ద్వారా లేదా న్యాయస్థానం ద్వారా ప్రభుత్వాలను కూల దోయటం పరిపాటైంది. ఎన్నికైన ఏ ప్రభుత్వమూ పూర్తికాలం అధికారంలో లేదు.ఇందుకు షినవత్రా తండ్రి తక్సిన్ షినవత్రా ఒక్కరే మినహాయింపు. 2001లో అధికారంలోకొచ్చిన తక్సిన్ను పదవీకాలం చివర 2006లో సైనిక కుట్ర ద్వారా తొలగించారు.గత ఇరవయ్యేళ్లలో షినవత్రా కుటుంబం రెండు సైనిక కుట్రలనూ, మూడు కోర్టు తీర్పులనూ చవిచూసి మూడు ప్రభుత్వాలను కోల్పోయింది. ఈ రెండు దశాబ్దాల కాలంలో అయిదుగురు ప్రధానులు మారారు. తక్సిన్ ఆధ్వర్యంలోని థాయ్ రక్ థాయ్ పార్టీని 2007లో అయిదేళ్లపాటు నిషేధించారు . అటుతర్వాత ఫ్యు థాయ్ పేరిట మరో పార్టీ స్థాపించారు. ఆయన కుమార్తె పేటోన్టాన్ పది నెలలపాటు కూటమి ప్రభుత్వాన్ని నడిపారు. పార్టీలనూ, అధినేతలనూ నిషేధించటం షినవత్రాతో ఆగిపోలేదు. 2020లో ఫ్యూచర్ ఫార్వర్డ్ పార్టీని, 2023లో మూవ్ ఫార్వర్డ్ పార్టీని ఇదేవిధంగా నిషేధించి ఆ పార్టీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ ఆంక్షలు విధించారు. ఒకరిద్దరు సీనియర్ నేతలపై దశాబ్దంపాటు ఏ పదవీ చేపట్టరాదని తీర్పులిచ్చారు. నిరుపేదల సంక్షేమాన్ని పట్టించుకుని, వారి జీవితాలను మెరుగుపర్చటానికి ప్రయత్నిస్తే రాచరిక వ్యవస్థకు కడుపుమంట. తక్సిన్ షిన వత్రానైనా, ఇతర అధినేతలనైనా కేవలం ఆ కారణంతోనే ముప్పుతిప్పలు పెట్టారు. 2006లో పదవి నుంచి తప్పించాక తక్సిన్ ప్రవాసానికి వెళ్లి పదిహేడేళ్ల తర్వాత 2023లో స్వదేశానికొచ్చారు. అటుపై అవినీతి, ఇతర నేరాల్లో ఆయన్ను అరెస్టు చేయగా అనారోగ్య కారణం చూపి ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన జైలుశిక్ష సక్రమంగా అనుభవించారా లేదా అన్న అంశంపై ఇప్పుడు తీర్పు రాబోతోంది. సైనిక జనరళ్ల నియామకాల్లో ప్రభుత్వ ప్రమేయాన్ని పెంచే ప్రతిపాదనను పేటోన్ టాన్ ప్రభుత్వం పరిశీలించింది. సైన్యం ఒత్తిళ్లతో దాన్ని విరమించుకున్నా ఆమెపై పగబట్టారు. అందుకే ఫోన్లపై నిఘాపెట్టి సాగనంపారు. దేశంలో అస్థిరత అలుము కోవటంతో విదేశీ మదుపుదార్లు 2,300 కోట్ల డాలర్ల మేర వెనక్కు తీసుకున్నారు. అసలే అంతంతమాత్రంగా ఉన్న థాయ్ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మరింత దిగజారింది. ఇలాంటి స్థితిలో కొత్త ప్రధాని అనుతిన్ దేశాన్ని గట్టెక్కించగలరా... అసలు సైన్యం సక్రమంగా పాలించనిస్తుందా అన్నది వేచిచూడాలి. -
గెలుపు బాటలో 'ఓటమి పాఠం'
అమెరికన్ మిడిల్ – డిస్టెన్స్ రన్నర్ ఎమ్మా జేన్ కోబర్న్ 3,000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో ప్రపంచ ఛాంపియన్. ఒలింపిక్ కాంస్య పతక విజేత. 10 పర్యాయాలు అమె రికా జాతీయ ఛాంపియన్. ఈ ఏడాది మే 8న కొలరాడో విశ్వవిద్యాలయ 2025 బ్యాచ్ పట్టభద్రులను ఉద్దేశించి కోబర్న్ చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం:శుభోదయం. 2025 బ్యాచ్ వాళ్ళకు అభినందనలు. నేటితో ఒక అధ్యాయం ముగిసినట్లు కాదు. ఒక పరుగు పందెం పరిసమాప్తమైంది. మరోటి మొదలవుతోంది. అంతే! మీరు విజయ రేఖ దాటే శారు. మిగిలినవాటిని ఎదు ర్కొనేందుకు మరో రేఖ ముందు ఉన్నారు. ఈ విశ్వవిద్యాలయమే నన్ను తీర్చిదిద్దింది. క్యాంపస్లో చేతులు కలిపిన అమ్మ, నాన్నలకి నేను ఇక్కడే బౌల్డర్లో పుట్టాను. అథ్లెట్గా, మనిషిగా వృద్ధిలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తూ తరచుగా ఆలోచించే సంగతులను మీతో పంచుకుంటాను.‘వెలితి’పై బెంగ వద్దు!నేను దాన్ని ‘వెలితి’గా పిలుస్తా. మీరు ఇపుడు ఉన్న స్థానానికీ, మీరు చేరుకోవాలనుకుంటున్న స్థానానికీ మధ్యనున్న ఖాళీ. ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థితికి చేరుకోవాలనుకుంటున్నారో దానిమధ్య నున్న వ్యత్యాసం. అది ఒక లోపం కాదు. వెనుకబడ్డారనడానికి సంకేతమూ కాదు. అది మీకంటూ జీవితం పట్ల ఒక దార్శనికత ఉందనడానికి రుజువు. మరింత ఉన్నత స్థితికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కనుకనే ఆ వెలితి ఏర్పడింది. ఆ వెలితిని భరించడం ఒక్కోసారి ఇబ్బందికరంగా, బాధగా కూడా అనిపించవచ్చు. కానీ, సత్యాన్ని గ్రహించండి. ఒత్తిడి, అసౌకర్యం, అపరిచితం ఉన్నచోటనే వృద్ధి సాధ్యమవుతుంది. మీరు గమనించలేదేమో కానీ, ఒక ‘వెలితి’ని మీరు ఇప్పటికే భర్తీ చేసేశారు. చూస్తూ చూస్తూ ఉండగానే పట్టభద్రులై పోయారు. ఒక్కసారి కాలేజీలో అడుగు పెట్టిన మొదటి రోజును గుర్తు తెచ్చుకోండి. ఆత్మవిశ్వాసం, ఆనందాతిరేకాలతోనే క్యాంపస్లో కాలిడి ఉండవచ్చు. ఆడిటోరియం కోసం వెతుకుతూ దారి తప్పి ఉండవచ్చు. బెంగతో అమ్మకు రెండు మూడుసార్లు ఫోన్ చేసి ఉండ వచ్చు. బుర్ర నిండా ప్రశ్నలే! స్నేహితుల్ని పోగేసుకోవడం ఎలాగో నంటూ ఆలోచన. ఉదయం 8 గంటలకే మొదలయ్యే పాఠాలు వినడంపై తర్జన భర్జన. పరీక్షలో జవాబులు రాయడం, ఇంటెర్న్ షిప్నకు దరఖాస్తు చేసుకోవడం తెలియదు. వంటగదిలో పనులు చక్కబెట్టడం ఇప్పటికీ మీలో కొందరికి తెలియకపోవచ్చు.కానీ, గత కొద్ది ఏళ్ళుగా కొద్ది కొద్దిగా కొత్త నైపుణ్యాలను, కొత్త అలవాట్లను సంతరించుకుంటూ వచ్చారు. మీకు మీరే కొత్త వ్యక్తిగా రూపాంతరం చెందారు. సమయాన్ని వెచ్చించడంపై ఒక అవగాహ నకు వచ్చారు లేదా మీకు మీరు నచ్చజెప్పుకునే విధంగా కాలాన్ని వెచ్చిస్తున్నారు. అవసరమైతే ఇతరుల సహాయాన్ని ఎలా పొందాలో నేర్చుకున్నారు. వెలితిని భర్తీ చేసుకోవాల్సిన విధానం ఇదే అనుకుంటా! ఒక్క రాత్రిలో కాదు. ఒక్కసారిగా కాదు. కానీ, స్థిరంగా అడుగులు పడాలి. క్యాంపస్ లోకి మొదటి రోజు బెరుకుగా అడుగు లేస్తూ వచ్చిన వ్యక్తి... నేడు నిబ్బరంగా కూర్చున్న వ్యక్తి ఒక్కరే! కానీ, మార్పు యథాలాపంగా రాలేదు. సంతరించుకుంటే వచ్చింది. అది మీరిక్కడ నిశ్శబ్దంగా, ఆర్భాటాలు లేకుండా, శ్రద్ధ పెట్టి చదువు కోవడం వల్ల వచ్చిన మార్పు!రెండు నియమాలుకానీ, ఇక్కడ నుంచి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత పరిస్థితి ఏమిటి? కాలేజీలోలాగా గురువులు లేకపోయినా స్వయంగా నిలబడగలగాలి. మీ తప్పటడుగులను మీరే సరిదిద్దు కోవాలి. ‘వెలితి’ని భర్తీ చేసుకోవడంలో రెండు నియమాలు నాకు సహాయపడ్డాయి. అవి మీకూ తప్పకుండా ఉపకరిస్తాయి.1. ప్రజ్ఞ అవసరం లేనివాటిని మొదట సాధించండి!త్వరగా నిద్ర లేవడానికి, సమయ పాలనకు, దయతో మెలగేందుకు, ప్రతిస్పందనలను ఆలకించేందుకు, స్థిర బుద్ధితో వ్యవహరించడానికి ప్రజ్ఞా పాటవాలు అవసరం లేదు. అవి ఎవరో కానుకగా ఇచ్చేవి కావు. మనం అలవరచుకుంటే వచ్చేవి. నేను అత్యంత అదృష్టవంతురాలినో లేదా శక్తి సామర్థ్యాలు ఉన్నదాన్నో కావడం వల్ల పరుగు పందాల్లో గెలవలేదు. చిన్న అడుగులే అయినా స్థిరంగా వేస్తూ వచ్చాను. పరుగెత్తాల్సిన దూరాన్ని తగ్గించుకోలేదు. ఆకర్షణగా లేనివాటిని వదిలేయలేదు. ఎదుటివారు చెప్పింది విన్నాను. శ్రమకోర్చి తర్ఫీదు పొందాను. క్రమశిక్షణను పెంపొందించుకున్నాను. కేవలం శక్తితోనే కాకుండా, ఆ రకమైన క్రమశిక్షణ వల్లనే 2016లో ఒలింపిక్ పతకాన్ని, 2017లో ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణాన్ని గెలుచుకున్నాను.2. చెయ్యగలిగింది చేయండి– మీ చేతిలో లేనివాటిని వదిలేయండి.క్రీడల్లో ఎవరన్నా నన్ను వంచిస్తే, లేదా నాకన్నా మెరుగైన సామర్థ్యాన్ని కనబరిస్తే, లేదా పోటీ రోజు వర్షం పడితే నేను చేయ గలిగింది ఏమీ లేదు. కానీ, నా స్పందనను నియంత్రించుకోగలను. జీవితంలో మార్పునకు లోనయ్యే అంశాలే ఎక్కువగా ఉంటాయి. కానీ, వాటిని తట్టుకోవడంలో సన్నద్ధత మన చేతిలో ఉంటుంది. మన నియంత్రణలో ఉన్నవాటిపై దృష్టి కేంద్రీకరిస్తే, మనం బలంగా తయారవుతాం. మన చేతిలో లేనివాటినే తలచుకుంటూ కూర్చుంటే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు అయిపోతాం.కొన్నింటిలో విఫలం కావచ్చు. విజేతగా నిలుస్తామనుకున్న చోట ఓడిపోనూ వచ్చు. దానికి డీలా పడనక్కర లేదు. టోక్యోఒలింపిక్స్లో నేను విఫలమయ్యా. పరుగుపందెంలో ఆఖరి అంచెలో పడిపోయా. అనర్హురాలినయ్యా. దేని కోసం నేను ఏళ్ళ తరబడి శిక్షణ పొందానో, ఏవి నా ఒలింపిక్స్ అని చాటాలనుకున్నానో అందులో విఫలమయ్యా. బహిరంగ వైఫల్యం. నిరాశ చెందా. కానీ, శ్రమించి పెంచుకున్న సామర్థ్యం వల్ల, ఓటమిని దిగమింగుకున్నా.తదుపరి వేసవిలో నా పదవ అమెరికా జాతీయ ఛాంపియన్షిప్ సాధించా. ఒకే పోటీలో పదిసార్లు విజేతగా నిలిచిన రన్నర్ నేను ఒక్కదాన్నే!ఉద్యోగంలో, ప్రేమలో, జీవితంలో ఎవరైనా విఫలం కావచ్చు. కనుక, తిరిగి పోరాడగల సామర్థ్యాన్ని ఇప్పటి నుంచే పెంచుకోండి. వైఫల్యం లేకపోవడం విజయం కాదు. ఓటమి నుంచి ముందుకు సాగగల సత్తాయే విజయం. మీ జీవితానికి మీరే జవాబుదారీ. ఉన్న స్థితికీ, చేరుకోవాలను కుంటున్న స్థితికీ మధ్య వెలితిని భర్తీ చేయాల్సింది మీరే! భయం ముప్పిరిగొన్నా, సందేహం వెనక్కి లాగుతున్నా ధైర్యంగా, క్రమ శిక్షణతో చిన్న అడుగులైనా ముందుకు వేస్తూనే ఉండండి. -
విక్రమ్... ఒక గేమ్ ఛేంజర్
భారతదేశం పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన 32 బిట్ ప్రాసెసర్ ‘విక్రమ్ 3201’ ప్రత్యేకత ఏమిటి? రేపటి తరం ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లను నడి పేంత శక్తిమంతమైంది కాకపోవచ్చు కానీ... భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో మాత్రం కీలకపాత్ర పోషించనుంది. ఇటీవల నిర్వహించిన ‘ఇండియా సెమికాన్ ’ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న విక్రమ్ 3201 ప్రాసెసర్దే ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ , గగన్ యాన్ యాత్రల ఎలక్ట్రానిక్స్లో ముఖ్య భూమిక. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిజైన్ చేయగా మొహాలీలోని సెమీకండక్టర్ లేబొరేటరీ తయారు చేసిన ఈ ప్రాసెసర్కు భారతదేశం గర్వించగదగ్గ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయి పేరు పెట్టారు. గతేడాది డిసెంబరులో ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ–60లో విజయవంతంగా పరీక్షించి చూశారు కూడా. 2009 నుంచి ఉపయోగిస్తున్న విక్రమ్ 1601 ప్రాసెసర్ స్థానంలో ఇకపై విక్రమ్ 3201ను ఉపయోగిస్తారు.పోటీ పడలేనప్పటికీ...ప్రస్తుతం స్మార్ట్ఫోన్లలో ఉపయోగిస్తున్న ప్రాసెసర్లతో పోల్చి చూస్తే విక్రమ్ 3201 గొప్ప శక్తిమంతమైందేమీ కాదు. సాంకేతిక పరి జ్ఞానం విషయంలోనూ స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లలోని ప్రాసెసర్లతో సరితూగేది కాదు. ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాల్లో 64 బిట్ ప్రాసె సర్లు ఉపయోగిస్తూండగా విక్రమ్ 32 బిట్ ప్రాసెసర్ మాత్రమే.కొంచెం సింపుల్గా చెప్పాలంటే 32 బిట్ ప్రాసెసర్తో నాలుగు గిగాబైట్ల ర్యామ్తో పనిచేయగలం. అదే 64 బిట్ ప్రాసెసర్తోనైతే 8 గిగాబైట్లు, అవసరమైతే 16 గిగాబైట్ల ర్యామ్తోనూ పనిచేయించవచ్చు. అంటే, 64 బిట్ ప్రాసెసర్తో చేయగలిగిన పనులన్నీ 32 బిట్ ప్రాసెసర్తో చేయడం కష్టమన్నమాట. అంతేకాదు... విక్రమ్ 3201ను 180 నానోమీటర్ల సైజున్న ట్రాన్సిస్టర్లతో తయారు చేశారు. ఆధునిక మైక్రోప్రాసెసర్లలోని ట్రాన్సిస్టర్ల సైజు ప్రస్తుతం మూడు నానోమీటర్లు! సైజు తక్కువగా ఉంటే ప్రాసెసర్లో ఎక్కువ ట్రాన్సి స్టర్లు పడతాయి. తద్వారా వాటి వేగం, సామర్థ్యాలు పెరుగుతాయి. ఈ రకంగా చూస్తే విక్రమ్ 3201 ఎప్పుడో 1990ల నుంచి 2000 సంవత్సరం వరకూ అందుబాటులో ఉన్న ప్రాసెసర్ల స్థాయిది.ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, ఎలెవన్ ్త జనరేషన్ కూడా పది నానో మీటర్ల ట్రాన్సిస్టర్లతో తయారైందన్నది గమనార్హం. ట్రాన్సిస్టర్ల సైజు తక్కువగా ఉంటే ప్రాసెసర్ సైజు తగ్గి... చిన్న చిన్న పరికరాల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చు. అన్నింటికీ తట్టుకునేలా...అయితే స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లతో పోలిస్తే అంతరిక్షంలో ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ తీరుతెన్నులు భిన్నం. అవి అంతరిక్షంలోని కఠిన పరిస్థితులను తట్టుకుని పనిచేయాలి. అక్కడ ఉష్ణో గ్రతల్లో విపరీతమైన మార్పులుంటాయి. భూ కక్ష్యలో తిరుగు తున్నప్పుడు సూర్యాభిముఖంగా ఉన్నప్పుడు ఉపగ్రహాలు 125 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకో వైపు ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు–55 డిగ్రీ సెల్సియస్కు పడిపోతాయి. రేడియోధార్మికత కూడా ఎక్కువ. పైగా ప్రయోగ సమయంలో పుట్టే ఎలక్ట్రిక్ ప్రకంపనలు, ధ్వని తాలూకూ షాక్లను తట్టుకుని మరీ పనిచేయాల్సి ఉంటుంది. భూ వాతావరణ పొర తాలూకూ రక్షణ ఉండదు కాబట్టి సౌరగాలులు, అత్యంత శక్తిమంతమైన కణాలతో కూడిన కాస్మిక్ రేస్ వంటివన్నీ నిత్యం ప్రాసెసర్లకు పరీక్ష పెడుతూంటాయి. ప్రాసెసర్లలో సమాచారం ‘1’, ‘0’ల రూపంలోనే నిక్షిప్త మవుతూ ఉంటుంది. ట్రాన్సిస్టర్ల గుండా విద్యుత్తు ప్రవహిస్తే ‘1’, ప్రవహించకపోతే ‘0’ అన్నమాట. ఖగోళం నుంచి దూసుకొచ్చే శక్తి మంతమైన కణాలు ట్రాన్సిసర్టలపై ప్రభావం చూపితే సమాచారం తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది. ఆధునిక మైక్రో ప్రాసెసర్లలో ఇలా జరిగేందుకు అవకాశాలు ఎక్కువ. ట్రాన్సిస్టర్ల సైజు తక్కువగా ఉండటం, విద్యుదావేశాన్ని నిలిపి ఉంచుకోవడం దీనికి కారణాలు. విక్రమ్ 3201లో 180 నానోమీటర్ల ట్రాన్సిస్టర్లు ఉండటం వల్ల ఈ తప్పులు జరగవు.వేగం కంటే అవసరాలే ముఖ్యం...పీఎస్ఎల్వీ వంటి అంతరిక్ష ప్రయోగాల్లో టెలిమెట్రీ, నావిగేషన్, కంట్రోల్ సిస్టమ్స్ వంటివి నమ్మకంగా పనిచేయాలి. ఈ అవసరాలతో పోలిస్తే స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లలోని ప్రాసెసర్ల గిగాబైట్ల వేగం అంత ముఖ్యం కాదు. అత్యంత దుర్భర పరిస్థితు లను తట్టుకుని, అతితక్కువ తప్పులు, వైఫల్యాలతో పనిచేసేలా విక్రమ్ 3201ను తయారు చేశారు. అంతరిక్ష రంగంలో స్వావలంబన అన్న భారతదేశ ఆశలు నెరవేర్చడంలో విక్రమ్ 3201 మేలి మలుపు కాగలదనడంలో సందేహం లేదు. 2009లో కార్టోశాట్ ఉప గ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఉపయోగించిన పీఎస్ఎల్వీ సీ–47లో విక్రమ్ 1601ను ఉపయోగించగా... ఫ్లోటింగ్ పాయింట్ కాలిక్యులేషన్ వంటి ఆధునిక హంగులు, అడా వంటి ఆధునిక కంప్యూటర్ భాషలతో పనిచేయగల సామర్థ్యాన్ని అందించి విక్రమ్ 3201ను తయారు చేశారు. దీన్ని విజయవంతంగా పరీక్షించిన నేప థ్యంలో ఇస్రో ఇప్పటికే 70 నానోమీటర్ల ట్రాన్సిస్టర్లతో కొత్త మైక్రో ప్రాసెసర్ తయారీ యత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. విక్రమ్ 1601 ప్రాసెసర్ వినియోగం కేవలం అంతరిక్షానికి మాత్రమే పరిమితం కాలేదు. రైల్వే వ్యవస్థల్లోనూ వినియోగి స్తున్నారు. ముఖ్యంగా ట్రాక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఆటోమెటిక్ ట్రెయిన్ సూపర్విజన్స్ వంటి వాటిల్లో. ఇదే విధంగా విక్రమ్ 3201ను కూడా ఇతర రంగాల్లో వాడే అవకాశం ఉంది. విక్రమ్ 1601కు ముందు దేశం ప్రాసెసర్ల దిగుమతిపైనే ఎక్కువగా ఆధార పడి ఉండేది. తద్వారా సరఫరా, నియంత్రణలు, భద్రతాంశాల విషయంలో సవాళ్లు ఎదుర్కొనేది. 1998 నాటి పోఖ్రాన్ అణు పరీక్షల తరువాత అమెరికా విధించిన ఆంక్షలతో స్వావలంబన అవసరం మరింత పెరిగిన విషయం తెలిసిందే. ఈ సవాలును స్వీకరించిన శాస్త్రవేత్తలు విక్రమ్ 3201తో తొలి అడుగు వేశారని చెప్పాలి. అంత రిక్ష రంగంలో సాంకేతిక పరిజ్ఞానపరంగా ‘ఆత్మ నిర్భరత’ సాధించే విషయంలో ఇది నిజంగానే మేలిమలుపు!టి.వి. వెంకటేశ్వరన్ వ్యాసకర్త మొహాలీలోని ‘ఐసర్’ విజిటింగ్ ప్రొఫెసర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
డోనాల్డ్ ట్రంప్ (అమెరికా అధ్యక్షుడు) రాయని డైరీ
అందంలోనే వికారం కలిసి ఉంటుంది! ఇది సృష్టి వైరుద్ధ్యమా, లేక మానవ మనో వైకల్యమా అని రెండు రోజులుగా వైట్ హౌస్ నుండి బయటికి రాకుండా టీవీ ముందే కూర్చొని ఆలోచిస్తున్నాను.విజ్ఞులు వికారాన్ని చూడొద్దని అంటారు. అందాన్ని వేరు చేసి చూడమంటారు! అందం, వికారం పక్కపక్కనే ఉంటే వేరు చెయ్యొచ్చు. పైనొకటి, కిందొకటి ఉంటే వేరు చెయ్యొచ్చు. ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటే ఎలా వేరు చేయటం?నేను టీవీ చూస్తుంటానని తెలిసి,జిన్పింగ్ నాకోసం బీజింగ్లోని తియానన్మెన్లో చేయించిన మిలిటరీ పరేడ్; తియాంజిన్లో పుతిన్, మోదీలతో కలిసి జిన్పింగ్ కలిసి చేసిన చిరునవ్వుల ప్రదర్శన (అది కూడా నేను టీవీ చూస్తుంటానని తెలిసే) రెండూ ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి. మిలిటరీ పరేడా, లేక చిరునవ్వుల ప్రదర్శనా... ఏది ఆ రెండింటిలో బ్యూటిఫుల్గా ఉందంటే మాత్రం, చిరునవ్వుల ప్రదర్శనే అంటాన్నేను. చిరునవ్వుల్లో కేవలం చిరునవ్వులే ఉండవు. చేతులు కలుపుకోవడం ఉంటుంది. భుజాలు తాకించుకోవటం ఉంటుంది. హత్తుకోవటం ఉంటుంది. ఆలింగనం చేసుకోవటం ఉంటుంది. అదోలా చూసు కోవటం ఉంటుంది. ఏదైనా ఇచ్చిపుచ్చు కోవటం ఉంటుంది. కలిసి నాలుగు అడుగులు వేయటం ఉంటుంది. పరవశం కలిగించే చిన్న మాట ఉంటుంది. పెద్దపెట్టున నవ్వేయటం ఉంటుంది. లోకం దృష్టిలో పడాలన్న తహతహ ఉంటుంది. ఆ లోకంలో మళ్లీ పర్టిక్యులర్గా ఫలానా వ్యక్తి కంట పడుతున్నామా లేదా అనే దొంగచూపు ఉంటుంది. ఇన్ని ఉంటాయి చిరునవ్వుల్లో! గర్జించే శతఘ్నులను మించిన మారణాయుధాలు ఈ చిరునవ్వులు. వావ్!! చిరునవ్వుల మారణాయుధాలు! వండర్ ఫుల్ థాట్. నోబెల్ను పెద్ద పెద్ద పనులకే ఇవ్వక్కర్లేదు. నాకొచ్చే ఇలాంటి చిన్న చిన్న థాట్స్కు కూడా ఇవ్వొచ్చు.జిన్పింగ్ నన్ను టీవీలోంచి దొంగ చూపులు చూడటం నేను గమనించాను. తనేంటో నాకు చూపించుకోవటం అది. నా దగ్గర పుతిన్ ఉన్నారు, మోదీ ఉన్నారు, కిమ్ జోంగ్ ఉన్ ఉన్నారు అని చెప్పుకోవటం! ఏం మనిషి అతను?! చైనాకు జపాన్ లొంగిపోయి 80 ఏళ్లయిందని బీజింగ్లో పరేడ్ చేయించి ఆ పరేడ్కు అమెరికాను పిలవలేదు! పరేడ్ అందంగా ఉంది. జిన్పింగ్ మైండే... వికారంగా ఉంది.అమెరికా బెదిరిస్తేనే కదా జపాన్ వెళ్లి చైనాకు లొంగిపోయింది! ఫారిన్ గవర్నమెంట్స్కి థ్యాంక్స్, ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్కి థ్యాంక్స్ అంటారే గానీ, అమెరికాకు థ్యాంక్స్ చెప్పటానికి ఏమైంది జిన్పింగ్కి! చరిత్రను మరిచిపోయారా లేక, చేసిన మేలునే మరిచిపోయారా? చూస్తుంటే రష్యా, ఇండియాలు కూడా అమెరికాను మర్చిపోయేలా చేసేలా ఉన్నారు జిన్పింగ్! ఇలాంటప్పుడే నాకు మరింతగా ఎవరికైనా, ఏదైనా చేయాలనిపిస్తుంది. కాల్ బటన్ నొక్కి, ‘‘పీటర్ కెంట్... మనం ఇండియా మీద ఎంత వేశాం, రష్యా మీద ఎంత వేశాం, చైనా మీద ఎంత వేశాం?’’ అని అడిగాను. నా ట్రేడ్ అడ్వైజర్ ఆయన. ‘‘ఎస్, మిస్టర్ ప్రెసిడెంట్. ఇండియా మీద 50, చైనా మీద 30, రష్యా మీద 10’’ అని గుర్తు చేశారు పీటర్ కెంట్.‘‘వెల్, మిస్టర్ కెంట్. ఇండియా మీద ఇంకో 25 వేస్తే ఎలా ఉంటుంది? మొత్తం కలిపి 75’’ అన్నాను. ‘‘గుడ్ ఐడియా మిస్టర్ ప్రెసిడెంట్. మైండ్–బ్లోయింగ్’’ అన్నారు పీటర్ కెంట్. ఎవరికైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆత్మీయులే కదా ముందుగా మనకు గుర్తుకొస్తారు. మోదీతో నేను బాగా కలిసిపోతాను. ఫిబ్రవరిలో ఆయన ఇక్కడే ఉన్నారు! మళ్లీ సెప్టెంబర్ 23న యూఎన్ఓ సమావేశానికి ఇక్కడే ఉంటారు. -
అందరికీ వైద్యం అందేదెలా?
వ్యక్తిగత వికాసానికీ, దేశ ఆర్థికాభివృద్ధికీ ఆరోగ్య పరిరక్షణకు పూచీనిచ్చే సదుపాయాలు అత్యవ సరం. ఆ సేవలు విçస్తృతమైనవిగా ఉండాలి. ఆరోగ్యం కాపాడుకోవడాన్ని ప్రోత్సహించడం, వివిధ రుగ్మతలను వెంటనే కనిపెట్టడం, తొలి దశలోనే సరైన ఔషధాలను సేవించేటట్లు చేయడం వరకు దీనిలోకి చాలా వస్తాయి. దీని పరిధిని పునరావాస సేవలు, అవసరమైన చోట ఉపశమన సంరక్షణ కల్పించడానికి కూడా విస్తరించాలి. సగటు ఆయుర్దాయాన్ని పొడిగించడం నుంచి పూర్తి జీవితాన్ని ఆనందమయంగా గడిపేటట్లు చేయడంపై దృష్టి కేంద్రీకరించాలి. వ్యక్తులు తమ పూర్తి సామర్థ్యం మేరకు పని చేయడానికి, తద్వారా దేశాన్ని సుసంపన్నం చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ అవతరించేందుకు ప్రతి భారతీయుని ఆరోగ్యం చోదకశక్తిగా పనిచేస్తుంది. వైద్యానికి ప్రతిబంధకాలుదేశంలో నివసిస్తున్న అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగల స్థితి లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) అధినేత మోహన్ భాగవత్ ఇటీవల వ్యాఖ్యానించారు. ‘‘ఏ వ్యక్తికైనా ఆరోగ్య రక్షణ, విద్య అత్యంత ముఖ్యమైనవి. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య మానవుడికి ఆ రెండూ అందని మావిపండుగానే ఉన్నాయి’’ అని ఆయన అన్నారు. ఇందౌర్లో ఆరోగ్య కేంద్ర–క్యాన్సర్ కేర్ సెంటర్ను ప్రారంభిస్తూ భాగవత్ అలా వ్యాఖ్యానించారు. చాలా మందికి వైద్యం చేయించుకోవాలనే తాపత్రయం ఉన్నా దగ్గరలో అవి లేకపోవడం, ఉన్నా స్థోమతకు మించి ఉండటం, వైద్యం ఉన్నత ప్రమాణాలతో లేకపో వడం వంటివి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. దీర్ఘకాలిక ఔట్ పేషంట్లు కొందరు వైద్యానికి పెట్టిన ఖర్చుతో పేదరికంలోకి జారుకుంటున్నారు. సదుపాయాలకు మించి పేషెంట్లు ఉండటం, ఆ యా కేంద్రాల సామర్థ్యం అంతగా లేకపోవడం, పాలనాపరమైన వైఫల్యాలతో ఆయు ష్మాన్ భారత్ కార్యక్రమం సవాళ్ళను ఎదుర్కొంటోంది. దానికితోడు, భారత దేశంలో సమాఖ్య వ్యవస్థ అమలులో ఉంది. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం వేర్వేరు బాధ్యతలను అప్పగించింది. ఆరోగ్య రక్షణ సదుపాయాలకు రూపకల్పన చేయడం, అమలుపరచడంలో ఆ రెండింటి మధ్య ఎంతో సమన్వయం అవసరం. బహుముఖ సేవలు వాడుకోవాలి!భారతదేశపు ఆరోగ్య సేవలు ప్రైవేటు రంగంపైన కూడా ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఒక ప్రణాళిక కింద కాక, అవసరాలు, అవకాశాలకు తగ్గట్లుగా ఇది ఒక మిశ్రమ వ్యవస్థగా తయారైంది. విడిగా ప్రాక్టీసు చేస్తున్న డాక్టర్లు ఇప్పటికీ ఉన్నారు. కుటుంబాల ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సింగ్ హోమ్లు ఉన్నాయి. ఏదో ఒక వైద్య విభాగానికి పరిమితమై, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారిని చేర్చుకుని సేవలందిస్తున్న ఆస్పత్రులున్నాయి. మల్టీ –స్పెషాలిటీ కార్పొరేట్ ఆసుపత్రుల సంగతి సరేసరి. అలా ప్రైవేటు వైద్య రంగం బహుముఖాలుగా ఉంది. స్వచ్ఛంద సంస్థల రంగం చెదురుమదురుగా ఉన్న చారిటబుల్ ఆసుపత్రులకు పరిమితమవుతోంది. వాటిలో కూడా కొన్నింటిలో అధునాతన వైద్య సదుపాయాలున్నాయి. అవి ధనిక రోగుల నుంచి కాస్త ఎక్కువ వసూలు చేసి, ఆ మార్జిన్ ద్రవ్యాన్ని పేద రోగుల చికిత్సకు వెచ్చిస్తున్నాయి. ప్రైవేటు రంగంపై నియంత్రణ పెళుసుగా ఉండటంతో, అది విధించే చార్జీలు తరచు సామాన్య మానవునికి పెను భారంగా పరిణమిస్తున్నాయి. ప్రతి ఒక్కరినీ ఆరోగ్య రక్షణ (యు.హెచ్.సి.) గొడుగు కిందకు తీసు కొచ్చేందుకు, మరింత మానవతావాద దృష్టితో స్పందించేందుకు ప్రభుత్వ రంగాన్ని మనం ఉద్దీపింపజేయవలసిన అవసరం ఉంది. పెద్ద సంఖ్యలో ఉంటున్న రోగుల తాకిడిని తట్టుకునేటట్లు, మరింత సమర్థతతో పనిచేసే టట్లు ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దాలి. ప్రైవేటు రంగం మరింత బాధ్య తాయుతంగా వ్యవహరించేటట్లు చూడాలి. అనవసర పరీక్షలు, అదనపు చార్జీల జోలికి వెళ్లకుండా వాటిని అరికట్టాలి. స్వచ్ఛంద రంగానికి మరిన్ని వనరులు సమకూర్చాలి. ప్రజలనే భాగస్వాములుగా చేసే విధంగా ప్రజా రోగ్య, సమాజ సంబంధిత క్లినికల్ కేర్ సెంటర్లను నెలకొల్పవచ్చు. ఇవి కొన్నిచోట్ల మొదలైతే మిగిలిన ప్రాంతాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి.టెలీ–హెల్త్ సేవలను ప్రభావశీలంగా అమలులోకి తెచ్చేందుకు ఆరోగ్య రికార్డుల డిజిటలీకరణను వినియోగించుకోవచ్చు. కంప్యూటర్ సేవల్లో ముందున్నాం కనుక ఇది సాధ్యపడే అంశమే. డాక్టర్లు లేకుండా టెక్నాలజీతో నడిచే ఆరోగ్య రక్షణ కేంద్రాలు ప్రాథమిక రక్షణకు సంబంధించి చాలా వరకు సేవలందించవచ్చు. తద్వారా, రెండవ, మూడవ స్థాయి కేంద్రాలపై భారం తగ్గుతుంది. టెక్నాలజీ కేంద్రాలే వ్యాధి తీవ్రతను బట్టి రోగి ఎక్కడికి వెళ్లాలో రిఫర్ చేయవచ్చు. ఇతర వైద్య విధానాలను కూడా ప్రోత్సహించి తీరాలి. ఏ రోగానికి ఏ రకం వైద్యం పనిచేస్తుందో గుర్తించి, వివిధ వైధ్య విధానాల పాత్రల మధ్య సరిహద్దు రేఖ గీయవచ్చు. అల్లోపతీ, సంప్రదాయ వైద్య పద్ధతులకు సరిపో యినంతగా వనరులు కేటాయిస్తేనే ఫలితం ఉంటుంది. అన్నింటినీ సమన్వయం చేయాలి!ఈ ప్రయత్నాలన్నీ సజావుగా సాగడానికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు రెండింటిలోను ఆరోగ్యానికి ఎక్కువ నిధులు కేటాయించక తప్పదు. ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం స్థూల జాతీయోత్పత్తిలో 3 శాతానికి క్రమంగా పెరగాలి. ఆరోగ్య రక్షణకు వ్యక్తులు తమ జేబుల్లోంచి తీసి పెట్టే ఖర్చు 20% కన్నా తక్కువగా ఉండేట్లు చూడాలి. ఆరోగ్య సేవల రూపకల్పనలోను, అందించడంలోను ధర్మమే ప్రధాన భూమిక వహించాలి. సమ న్యాయం అందరికీ ఒకే రకమైన సేవలను అందుబాటులోకి తెస్తుంది. నేషనల్ హెల్త్ మిషన్, పి.ఎం. జె.ఏ.వై. మధ్య సంబంధం లేకుండా ఉన్నవాటిని తొలగించి, సమీకృత రక్షణ నమూనాలను సృష్టించవచ్చు. ప్రభుత్వ ప్రైవేటు వ్యవస్థల మధ్య; అల్లోపతీ, సంప్రదాయ వైద్య వ్యవస్థల మధ్య పొంతన, సమన్వయం తీసుకొచ్చేందుకు చర్చలు జరగవలసి ఉంది.ప్రొ‘‘ కె. శ్రీనాథ్ రెడ్డి వ్యాసకర్త ‘పీహెచ్ఎఫ్ఐ యూనివర్సిటీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్సెస్’లో డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ -
ఇది సరికొత్త 2.0 ప్రపంచం
ఒక నిశ్శబ్ద విప్లవం చాప కింద నీరులా వస్తోంది. అది యుద్ధ భేరీలు మోగించదు. విజయ పతాకాలు ఎగరేయదు. కంటికి కనిపించని, ఊహకు అందని ఉప్పెనలా ఖండాలను ముంచెత్తుతూ వస్తోంది. విధ్వంసం దానికి కొలమానం కాదు. అది సకల సాంకేతికతల మహా కలయిక! ఆలోచనా పరులు, కార్యశీలురు ఆ ‘వరల్డ్ 2.0’కి ఊపిరులూదుతున్నారు.కొత్త ప్రపంచ సమతుల్యతకోవిడ్ విలయంలో దెబ్బతిన్న ప్రపంచ వాణిజ్య వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రపంచ దేశాల మధ్య కొరవడిన వాణిజ్య సమతుల్యతను తిరిగి తెచ్చే ఈ ప్రయత్నా లకు పరస్పర అవసరాలే చోదక శక్తి. డాలరు బలహీన పడటం ప్రపంచం కోలుకుంటోందనడానికి గట్టి సంకేతం. అంతర్జాతీయ వాణిజ్యం మీద అతిగా ఆధారపడకుండా డాలరును బలహీన పరచడం మంచిదే. ఈ పరిణామం వల్ల సరుకుల వాణిజ్యంలో స్థిరత్వం, అంతర్జాతీయ వడ్డీరేట్లలో సారూప్యత నెలకొంటాయి.సాంకేతికతల మీద మార్కెట్ల విశ్వాసం ఆ యా కంపెనీల విలువల్లో ప్రతిబింబిస్తోంది. ఎన్విడియా మార్కెట్ విలువ 4 లక్షల కోట్ల డాలర్లకు చేరువైంది. దీన్ని ఆ కంపెనీ వ్యక్తిగత విజయంగా చూడకూడదు. ఏఐ ఆధారిత నూతన వ్యవస్థ వేరూనుకుంటోందనడానికి నిదర్శనం. అమెజాన్, యాపిల్, ఇంకా ఇతర కంపెనీల వృద్ధి వాటికి మాత్రమే పరిమితం కాదు. ఒక బృహత్ పరిణామంలో భాగంగా ఈ మార్పును గుర్తించాలి. సాంకేతికతల మహా కలయికటెక్నాలజీల ముందడుగు కీలక ఘట్టానికి చేరింది. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయో టెక్నాలజీ, అటానమస్ సిస్టమ్స్... ఇవేవీ ఇకమీదట వేటికవి కావు. అన్నీ కలసిపోయి ఒకే ఒక్కటిగా ఆవిర్భ విస్తున్నాయి. ఈ మహా కలయిక మానవ పురోభివృద్ధికి స్వయంచోదిత ఇంజిన్ కాబోతుంది. ఇది నూతన ఆవిష్కరణలను వేగవంతం చేస్తుంది. వ్యయాలను తగ్గిస్తుంది. అందుబాటులో ఉంటుంది.ఆరోగ్య విప్లవం మరింత ప్రముఖంగా ఉంటుంది. నూతన ఔషధాలను విజయవంతంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి ఇప్పుడు దశాబ్దాలు పడుతుండగా, ఇకపై నెలల్లోనే డ్రగ్ డిస్కవరీ జరుగుతుంది. డయాగ్నస్టిక్స్ లో ఏఐ ప్రవేశించి వ్యాధులను తొట్ట తొలి దశలోనో ఇంకా ముందుగానో నిర్ధారించడం సాధ్యపడుతుంది. 24 గంటలూ దేహాన్ని అంటిపెట్టుకుని ఉంటూ మన ఆరోగ్య మార్పుల్ని నిరంతరం పర్యవేక్షించే పరికరాలు వస్తున్నాయి. వ్యాధి నిర్మూలన నుంచి వ్యాధి నివారణ యుగంలోకి అడుగు పెడు తున్నాము. దీర్ఘాయుష్షు ఇంకెంతో కాలం కొంతమందికే సొంతం కాదు. అది అందరికీ అందించాల్సిన ప్రభుత్వ లక్ష్యం అవుతుంది.రూపురేఖలు మారుతున్న విద్యా రంగంచదువును డిగ్రీలతో కొలిచే రోజులు పోతున్నాయి. పట్టాలకంటే ప్రాసంగికతే ప్రధానం అవుతుంది. వ్యక్తిగత ప్రధానమైన, నైపుణ్యాల ఆధారితమైన విధానం దాన్ని ఆక్రమిస్తుంది. ఏఐ ట్యూటర్లు, వర్చువల్ క్లాస్ రూములు, డిజిటల్ ల్యాబ్లు వచ్చాయి. చదువుకు పట్టే సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ విద్యా విప్లవం ‘వరల్డ్ 2.0’కు పునాది అవుతుంది.వ్యర్థాల సద్వినియోగంఇప్పుడు వ్యర్థాలను ముడిసరుకుగా వాడుతున్నారు. కర్బన కాలుష్య వాయువులను పీల్చుకుని నిల్వ చేసే ఇటుకల తయారీ, నాచు ఆధారిత ప్యాకేజింగ్ మెటీరియల్ ఉత్పత్తి, మునిసిపల్ మురుగును, పంటల వ్యర్థాలను హైడ్రోజన్గా మార్చి దాంతో విమాన ఇంధనం తయారీ... ఇలా ఎన్నో టెక్నాలజీలు అభివృద్ధి అయ్యాయి. చెత్త కూడా సంపదగా మారింది. ఈ మార్పులోప్రపంచ శాంతి బీజాలు ఉన్నాయి.సంపదతోనే ప్రపంచ భద్రత సంపదతోనే శాంతి అనేది కొత్త మంత్రం కాబోతోంది. డేటా, ఇంధనం, స్వచ్ఛమైన గాలి, వైద్యం, అవకాశాలు... ఇవి అన్ని దేశా లకూ అందుబాటులో ఉండేట్లయితే ఇక దేనికోసం పోరాడాలి? భౌతిక ఆధిపత్యం స్థానే డిజిటల్ సార్వభౌమత్వం రాజ్యమేలే రోజుల్లో, ప్రాదేశిక ఆక్రమణ ఆర్థిక పరంగా అవివేకం అవుతుంది.ఆధార్, యూపీఐ, డిజీ లాకర్, ఓఎన్డీసీ లాంటివాటితో కూడిన ఇండియా డీపీఐ (డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) నమూనా సమ్మిళిత విధానాలు భద్రతకు ఎలా బాటలు వేయగలవో రుజువు చేస్తున్నాయి. ప్రపంచం ఈ నిశ్శబ్ద పరివర్తనను గమనిస్తోంది. వరల్డ్ 2.0 తాత్విక చింతనసమృద్ధి పెరిగే కొద్దీ హింస క్షీణిస్తుంది. పరమార్థం తెలుసు కోవడం మీద ప్రజలు తిరిగి దృష్టి పెడతారు. పనిలో ప్రయోజనం, రాజకీయాల్లో నిజాయతీ, ఆవిష్కరణల్లో నైతికత, సంస్థల్లో పారదర్శ కత ఉండాలని డిమాండ్ చేస్తారు. వారి దృక్పథం మరింతగా అంత ర్జాతీయతను సంతరించుకుంటుంది. వారి కార్యకలాపాలు సరిహ ద్దులను అధిగమిస్తాయి. అమెజాన్ రెయిన్ ఫారెస్టుల నుంచి ఆర్కి టిక్ మంచు నదుల వరకు అన్ని ప్రాంతాల గురించీ ఆలోచిస్తారు. సైన్సును స్పిరిట్తో, టెక్నాలజీని హ్యుమానిటీతో అనుసంధానిస్తారు.శాంతి సాధన కోసం ఆపరేటింగ్ సిస్టం వరల్డ్ 2.0 ఆవిర్భవిస్తున్న తరుణంలో దాన్ని దాని మానానికి వదిలేయకూడదు. సుస్థిర శాంతి కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ను డిజైన్ చేసుకోవాలి. పర్యావరణ సాంకేతికత, వ్యవసాయ సాంకేతి కత, విద్యా సాంకేతికత, వైద్య సాంకేతికతలు అన్నీ పరస్పరం సహ కరించుకునేలా టెక్నాలజీ కన్వర్జ¯Œ ్స ప్లాట్ఫారాలు రూపొందించు కోవాలి. ఏఐ నైతిక విలువలకు, అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఉండే డిజిటల్ పబ్లిక్ గూడ్స్ తయారు చేసుకోవాలి. అయితే ఈ వరల్డ్ 2.0 ఎలాంటి ఒప్పందం కోసం నిరీక్షించడం లేదు. లక్షల కోట్ల ఎంపికలు, వందల కోట్ల చర్యలు, లక్షల ఆవిష్కర ణల ద్వారా అది ఆవిర్భవిస్తోంది. ఓ కొత్త యుగం కళ్లు తెరుస్తోంది. అక్కడ శాంతి అంటే ఏమిటి? శ్రేయస్సు, సమ్మిళితం, అవకాశం, ఉమ్మడి సారథ్యం ఇవన్నీ నెలకొని ఉండటమే! అంతే కానీ, యుద్ధం లేకపోవడం మాత్రమే శాంతి కాదు. వరల్డ్ 2.0 ఇప్పుడు మనముందుంది. దాన్ని స్వాగతిద్దాం.-వ్యాసకర్త కార్పొరేట్ నిపుణుడు, రచయిత(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)- శైలేష్ హరిభక్తి -
అన్నీ మంచి శకునములే...
భారతదేశంపై సుంకాలను అమెరికా అధ్యక్షుడు 50 శాతానికి పెంచిన ఐదు రోజులకు జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశాల నుంచి దేశానికి అన్నీ మంచి శకునాలే లభించాయి. చైనా, రష్యాలతో సంబంధాలు మరింత బలో పేతమయ్యాయి. ఈ కొత్త స్థితి వెంటనే అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్, ఆయన వాణిజ్య సలహాదారు పీటర్ నవారోలు,ఇండియాపై చేసిన అనుచితమైన వ్యాఖ్య లలో ప్రతిఫలించింది. ప్రధాని మోదీ తమపై కొంత అలిగినా తిరిగి వైఖరి మార్చుకోగలరని వారు చివరి వరకూ ఆశించారు. ఆయనకు తాము తప్ప గత్యంతరం లేదనుకున్నారు. కానీ, మోదీ వైఖరి మరింత దృఢంగా మారినట్లు తియాన్జిన్లో అడుగడుగునా కనిపించింది.అర్థాలు–అంతరార్థాలుఈ సందర్భంగా మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్న మాటలేమిటో యథాతథంగా చూడటం అవసరం. జిన్పింగ్తో సమావేశం అనంతరం మోదీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ, రెండు దేశాలూ అభివృద్ధిలో భాగస్వా ములే తప్ప ప్రత్యర్థులు కాదనీ, భిన్నాభిప్రాయాలు వివాదాలుగా మారరాదనీ భావించినట్లు పేర్కొన్నది. పరస్పర గౌరవం, ఉభయుల ప్రయోజనాలు, ఇరువురి సున్నితమైన మనోభావాల గుర్తింపు అవసర మన్నది. ఇటువంటి అవగాహనలు 21వ శతాబ్దపు ధోరణులకు అను గుణంగా బహుళ ధ్రువ ప్రపంచంతోపాటు బహుళ ధ్రువ ఆసియా రూపు తీసుకునేందుకు ఆవశ్యకమని పేర్కొన్నది. చైనాతో సంబంధాల మెరుగుదల నిరుటి కజాన్–బ్రిక్స్ సమావేశాల నుంచే మొద లైందని పలుమార్లు గుర్తు చేస్తున్న మోదీ, ఇపుడు రెండు దేశాల మధ్య ‘శాంతి, సుస్థిరతల వాతావరణం ఏర్పడింద’న్నారు. జిన్పింగ్ మాటలను కూడా కొంత చెప్పుకొన్న తర్వాత ఇరువురి అభిప్రాయాల అర్థాలు, అంతరార్థాలు చూద్దాము: రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 80 సంవత్సరాల తర్వాత కూడా ప్రచ్ఛన్న యుద్ధ కాలపు మనస్తత్వం, ఆధిపత్య ధోరణి, ప్రొటెక్షనిజం కొనసాగుతున్నాయి. కొద్ది దేశాల అంతర్గత విధానాలను ఇతరులపై రుద్దకూడదు. అంతర్జాతీయ నియమ నిబంధనలన్నవి పరీక్షాత్మక దశకు చేరుకున్నాయి. సమ్మిళితమైన ఆర్థిక ప్రపంచీకరణ అవసరం. భారతదేశం, చైనాలు పరస్పర విశ్వాసాన్ని బలపరచుకుని, పరస్పర అభివృద్ధికి అవకాశాలను పెంచుకోవాలి. వ్యూహాత్మకమైన, దీర్ఘ కాలిక దృక్కోణంతో వ్యవహరించాలి. నాయకులిద్దరూ చెప్పినవి ఇంకా ఉన్నాయిగానీ, అన్నీ ఈ ప్రధా నమైన మాటల చుట్టూ తిరిగేవే. సరిహద్దు వివాదాన్ని, పాకిస్తాన్ అంశాన్ని ప్రధానంగా ముందుకు తెచ్చుకుని అభివృద్ధి సహకార అవకాశాలను విస్మరించవద్దన్నది మొదటి అంతరార్థం. ఇరువురి సున్నిత మనోభావాలన్నది ఇందుకు సంబంధించినదే గాక, ఆసియాతో పాటు ప్రపంచంలోనూ ఒక శక్తిగా ఎదగజూస్తున్న ఇండి యాకు ఆటంకాలు కల్పించరాదనే అర్థం వస్తుంది. ఇక్కడ, బహుళ ధ్రువ ప్రపంచం అన్నమాటతో పాటు, బహుళ ధ్రువ ఆసియా అనే మాటను కొత్తగా ఉపయోగంలోకి తేవటం గమనించదగ్గది. అనగా, చైనాయేగాక ఇండియా కూడా ఒక ధ్రువమనేది గుర్తించటమన్న మాట. 21వ శతాబ్దపు ధోరణులలోకి అది కూడా వస్తుంది. సుంకాలకు ముందు నుంచే...చైనాతో సంబంధాల మెరుగుదల కజాన్ నుంచే మొదలైన మాట నిజమే అయినా ఆ విషయాన్ని మోదీ పదేపదే ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు? కేవలం ట్రంప్ సుంకాలు అందుకు కారణమని అమెరికాలో, బయటా జరుగుతున్న ప్రచారం నిజం కాదనీ, భారత దేశం తన ప్రయోజనాల కోసం స్వతంత్ర నిర్ణయాలు గతం నుంచే తీసుకుంటున్నదనీ ప్రకటించేందుకు!చైనా అధ్యక్షుని ఉద్దేశం... రెండు దేశాల మధ్య సరిహద్దుల వంటి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, అందుకు పరిష్కార ప్రయ త్నాలు జరుగుతున్నందున, అందుకు బందీ కాకుండా, పరస్పర అభివృద్ధి అవకాశాలపై దృష్టి పెట్టాలని! అందుకు అనుగుణంగా తాము భారతదేశంతో కలిసి పనిచేయగలమనటం! ఆయన ఉప యోగించిన డ్రాగన్, ఏనుగు కలిసి నాట్యం చేయటమనే మాటలో ఈ అంతరార్థాలన్నీ కనిపిస్తాయి. మారుతున్న పరిస్థితులు, అందు వల్ల రెండు దేశాలకు కలుగుతున్న సమస్యలు, వాటి నుంచి బయట పడేందుకుగానీ, భవిష్యత్తులో అభివృద్ధి కోసం గానీ అవసరమైన వేమిటో రెండు దేశాల నాయకులకు స్పష్టమైన అవగాహన ఏర్పడి నట్లు కనిపిస్తున్నది. రెండు దేశాల మధ్య చాలా కాలంగా నిలిచి పోయిన ఒప్పందాలు ఒక్కటొక్కటిగా ఇప్పటికే జరుగుతుండటం తెలిసిందే.స్పష్టమైన సందేశంరష్యా విషయానికి వస్తే, ప్రధాని మోదీ రష్యా అధ్యక్షునితో జరిపిన సమావేశం, అనూహ్యంగా ఆయన కారులో ప్రయాణించటం, హోటల్కు చేరిన తర్వాత కూడా కారులోనే ఉండి ముప్పావు గంట సేపు చర్చించి ఆ ఫొటోను పోస్ట్ చేయటం, బయట కూడా పుతిన్తో కలిసి వెళ్లి జిన్పింగ్తో చేసిన సంభాషణల వంటివన్నీ ఇటు భారతీయులకు, ప్రపంచ దేశాలకు, అటు అమెరికా శిబిరానికి పంపవలసిన సందేశాలనే పంపాయి. దేశ ప్రయోజనాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగటమే గాక, ఉభయుల మధ్యగల చిరకాలపు సాన్నిహిత్యం ఇంకా బలపడగలదని, సుంకా లకు వెరవబోమనే సంకేతాలను భారత ప్రధాని అమెరికా శిబిరానికి 50 శాతం నాటి ముందుకన్నా బలంగా పంపటం విశేషం. ఇప్పటి కైనా వివేకం కలిగితే ఆ శిబిరం చేయవలసింది తమ తీరును అన్ని విధాలా మార్చుకుని, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వ్యవహరించటం!షాంఘై సంస్థ నిజానికి రక్షణ, తీవ్రవాదం అంశాలకు సంబంధించినది. కానీ, మొదటిసారిగా తియాన్జిన్లో ఆర్థిక, రాజకీయ, భౌగోళిక వ్యూహాల గురించి చర్చించటం మారుతున్న పరిస్థితులకు, పాశ్చాత్య ప్రపంచానికి బయటి దేశాల ఆందోళనలు, అవసరాలకు అద్దం పడుతున్నది. ఈ విధంగా ‘బ్రిక్స్’కు అదనంగా మరొక సంస్థ క్రమంగా బలపడుతున్నది. కజాన్లో వలెనే తియాన్జిన్లోనూ పాశ్చాత్య ఆధిపత్య వ్యతిరేకత, బహుళ ధ్రువ ప్రపంచ నిర్మాణం, డాలర్ను క్రమంగా బలహీనపరచటం, ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థలు, ప్రస్తుతం గల అంతర్జాతీయ వ్యవస్థలపై అమెరికా కూటమి నియంత్రణ స్థానే సంస్కరణలతో ప్రజాస్వామికీకరణ, వర్ధమాన దేశాల మధ్య అవగాహనలను, మైత్రీ సహకారాలను బలపరచుకోవటం ప్రధానాంశాలయ్యాయి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఏకాకిని చేయడమే ట్రంప్ లక్ష్యం
కొన్నాళ్ళుగా మన కళ్ళెదుట నిలుస్తున్న ఒక ప్రశ్నకు జవాబు కనుగొనవలసిన సమయం ఆసన్నమైంది. భారతదేశం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కక్ష సాధింపు వైఖరిని అవలంబిస్తున్నారా? మన దేశం రోగం కుదిర్చానని ఆయన అనుకుంటు న్నారా? ఔనన్నదే దానికి జవాబు అయితే, మనం భావిస్తున్న దానికన్నా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నట్లే లెక్క. రష్యన్ చమురును దిగుమతి చేసు కుంటున్నందుకు భారత్పై 25 శాతం సెకండరీ సుంకాలు విధించి నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ప్రకటించారు. రష్యాను దృష్టిలో పెట్టుకుని ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ‘సమరశీల ఆర్థిక లివ రేజి’ కింద ఆ సుంకాలు మోపుతున్నట్లు చెప్పుకొన్నారు. భారత దేశానికి ఆనుషంగిక నష్టం వాటిల్లుతోందనీ, మన దేశానికి ఏం జరిగినా ట్రంప్ పట్టించుకోదలచుకోలేదనీ అది సూచించడం లేదా?ఒకవేళ, రష్యాపై ‘సమరశీల ఆర్థిక లివరేజి’యే లక్ష్యమైతే, భారతదేశం కన్నా ఎక్కువగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న చైనాపై సెకండరీ సుంకాలు విధించలేదు ఎందుకని? పైగా, ‘‘రష్యా నుంచి చమురు దిగుమతులను చైనా కొనసాగించడం మంచిదే. అది అంతర్జాతీయ ఇంధన ధరలలో ద్రవ్యోల్బణం రాకుండా నివారిస్తుం’’దని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో వ్యాఖ్యానించారు. ఇవి ద్వంద్వ ప్రమాణాలు కావా? చైనాకు ఒక న్యాయం, భారతదేశానికైతే మరో న్యాయమా?ఇది ప్రతీకారం కాదా?ఇంకా విడ్డూరం ఏమిటంటే, ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి భారత్ ద్వారానే నిధులు అందుతున్నాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ఆరోపించడం. భారత్పై ఆంక్షలు విధించాలని యూరప్ను బిసెంట్ కోరారు. రష్యన్ చమురును కొనుగోలు చేయడం ద్వారా అమెరికా జాతీయ భద్రతకు భారత్ ముప్పు వాటిల్లజేస్తోందనీ, ‘‘భారతదేశానికి ఏది ఎక్కువ నష్టదాయకమో అక్కడే దెబ్బ కొట్టడం’’ తమ అభిమతమనీ ట్రంప్కు వాణిజ్య సలహాదారు పీటర్ నవారో చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆయన ఇపుడు ‘‘మోదీ చేస్తున్న యుద్ధం’’గా అభివర్ణించారు. ‘‘శాంతికి రహ దారి న్యూఢిల్లీ గుండానే పడుతుంది’’ అంటున్నారు. భారతదేశపు ‘‘మృతప్రాయ’’ ఆర్థిక వ్యవస్థ నట్టేట మునిగినా తాను పట్టించుకో నని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఇది కక్ష సాధింపునూ, ప్రతీకా రాన్నీ సూచించడం లేదా?భారత్పై 50 శాతం సుంకాలు విధించడంలో, చైనాకు ట్రంప్ ఇవ్వదలచుకున్న సందేశం ఇమిడి ఉందనీ, అది కూడా భారతదేశా నికి ఆనుషంగిక నష్టం వాటిల్లజేసేదేననీ స్ట్రాట్ఫర్ సంస్థ మాజీ చైర్మన్ జార్జ్ ఫ్రైడ్మ్యాన్ ఇటీవల ఒక పాడ్కాస్ట్లో చెప్పారు.చైనాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ తహతహలాడు తున్నారు. చైనాకు వ్యతిరేకంగా తాము భారత్ పక్షాన చేర బోమనే ట్రంప్ సందేశంలోని ఆంతర్యమని ఫ్రైడ్మ్యాన్ చెప్పారు. ట్రంప్ మనసులో ఉన్న విస్తృత భౌగోళిక రాజకీయ తంత్రంలో, రష్యా, చైనాలకు ప్రాధాన్యం ఉంది. అందుకే భారతదేశాన్ని ‘‘విడిచి పెట్టేయవచ్చు’’.ఫ్రైడ్మ్యాన్ మాటలే నిజమైతే, రష్యాను హెచ్చరించేందుకు, చైనాకు పూర్తిగా వేరే రకమైన సందేశం పంపేందుకు భారతదేశాన్ని వాడుకున్నారు. రెండిందాలా భారతదేశానికే నష్టం. ట్రంప్ లెక్క లేనట్లే వ్యవహరిస్తున్నారు. ఎంతమాత్రం ప్రీతిపాత్రులం కాము!అయితే, సుంకాలు, చమురు, భౌగోళిక–రాజకీయాలను మించిన సంకట స్థితినే మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్నాం. భారత –అమెరికాల మధ్య సంబంధాలకు పునాది అయిన రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలను ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోంది. హెచ్1బి వీసా విధానంలో మార్పు తేదలచినట్లు అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లట్నిక్ ప్రకటించారు. దాని ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో 70 శాతం మంది భారతీయులే కనుక, అది మనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విద్యార్థుల వీసాలను నాలుగేళ్ళ కాలానికి మాత్రమే పరిమితం చేయాలని అమెరికా ఆంతరంగిక భద్రతా శాఖ యోచిస్తోంది. అది భారతీయ విద్యార్థుల సంఖ్యను కుంచింపజేస్తుంది. అమెరికాలోని విదేశీ విద్యార్థులలో భారతీయులు పెద్ద వర్గంగానే ఉన్నారు. మరోవైపు ఇపుడున్న సంఖ్య కన్నా దాదాపు మూడింతలు ఎక్కువగా 6,00,000 మంది చైనా విద్యార్థులకు ప్రవేశం కల్పించే అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, భారతదేశంలో అమెరికా కొత్త రాయ బారిగా సెర్గియో గోర్ నియామకాన్ని మనం ఎలా అర్థం చేసుకో వాల్సి ఉంటుంది? ఆయన ట్రంప్కు చాలా సన్నిహితుడు. కానీ ఆయనకు దౌత్యపరమైన అనుభవం గానీ, భారతదేశం పట్ల ముందస్తు అవగాహన గానీ లేవు. హెచ్చరించే విరామం తీసుకోకుండా, లేదా ప్రత్యామ్నాయాలను సూచించకుండా ట్రంప్ ఎంచుకున్న బాటలో సెర్గియో పరుగులు పెడతారని చాలామంది భయ పడుతున్నారు. అది మనకు శుభ సూచకం ఏమీ కాదు. ఆయన బాధ్యత అంతటితో తీరిపోవడం లేదు. దక్షిణ, మధ్య ఆసియాకు ప్రత్యేక దూతగా కూడా సెర్గియోను నియమించారు. ఈ అసాధారణ చర్య దేన్ని సూచిస్తోంది? భారతదేశానికి ఇష్టం లేని పనిని బలవంతంగా ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నంగా దీన్ని భావించాలా? సూటిగా చెప్పాలంటే, భారత–పాకిస్తాన్ల మధ్య తమ మధ్యవర్తిత్వానికి ఒప్పుకోవాల్సిందేనని చెప్పడమా?ఇది దాడి చేయడమేననే భయం నాలో మొదలైంది. అనేక స్థాయులలో, అనేక విధాలుగా భారతదేశంపై గురిపెడుతున్నారు. ట్రంప్కు ఇక మనం ఎంతమాత్రం ప్రీతిపాత్రులం కాము. అంచ నాలు తలకిందులవడంతో ఆయన ఖంగు తిన్నట్లున్నారు. మనపై కోపానికి కూడా లోనై ఉంటారు.సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నారని ట్రంప్కు ధైర్యంగా చెప్ప గలిగినవారు, భారతదేశం పక్షాన నిలిచేందుకు సుముఖంగా ఉన్న వారు అమెరికాలో ఎవరైనా ఉన్నారా? డెమొక్రాటిక్ పార్టీ నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సందేహం లేదు! కానీ, అమెరికాను మళ్ళీ గొప్పదిగా చేయడమనే(మాగా) వర్గంలోని వారి నుంచి గొంతుక వినిపించడం లేదు. అమెరికాలో నివసిస్తున్న భారతీయుల గొంతు పెగలకపోవడం మరింత కలవరపరుస్తోంది. మనల్ని క్లిష్ట పరిస్థితుల్లో వదిలేయాలని ట్రంప్ చూస్తున్నారా? నా వద్ద స్పష్టమైన జవాబు లేదు. కానీ, అలానే అనిపించడం లేదా?కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
వెన్నుపోటు అన్న పదమే వినబడకుండా...
నారా చంద్రబాబు నాయుడు రాజకీయ లక్ష్యం ముఖ్యమంత్రి కావడం. అందు కోసం ఆయన విద్యార్థి దశ నుంచే కలలు కనేవారు. చివరకు, ఇరవై మూడేళ్లుగా తాను కంటున్న కలలు నెరవేరే అవకాశం ఆసన్నమైంది. నమ్మిన మామగారికి వెన్ను పోటు పొడిచి, అధికారాన్ని కైవసం చేసుకునేందుకు 1995 ఆగస్టు నెల చివరి తొమ్మిది రోజుల్లో అనూహ్యమైన విధంగా వ్యూహాలు పన్నారు. పార్టీలోని సీనియర్ నాయకులను ఉచ్చులోకి లాగారు. వామపక్షాలకు సైతం ఎరవేసి, తన వైపు తిప్పుకున్నారు. ఒక్క చుక్క రక్తం చిందకుండా, ఎక్కడా నిరసన ధ్వనులు వినబడకుండా, ‘వెన్నుపోటు’ అనే పదమే మీడియాలో కనబడకుండా పావులు కదిపి, తన మామగారిని పదవి నుంచి దింపి, తాను అందలం అందుకున్నారు.1995 ఆగస్టు 31 (గురువారం)ఎన్టీఆర్ ఆగస్టు 31న విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే రాజీ నామా చేశారు. ఆ రోజు ఉదయం ఆయన ఆదేశాల మేరకు సీఎం కార్యదర్శి జయప్రకాశ్ నారాయణ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ ఉదయం 11 గంటలకు రమ్మన్నారు. రాజ్ భవన్కు వెళ్లేందుకు ఇంకా సమయం ఉండటంతో ఎన్టీఆర్ తన నివాసంలో బుచ్చయ్య చౌదరి, దేవినేని నెహ్రూ వంటి వారితో ముచ్చటిస్తున్నారు. వారితో మాట్లాడుతూనే ఎన్టీఆర్ అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయారు. ఆయనను వెంటనే దగ్గరలోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. తనను ఆస్పత్రిలో కలుసుకోవలసిందిగా ముఖ్యమంత్రి చేసిన అభ్యర్థనను గవర్నర్కు చీఫ్ సెక్రటరీ రాజాజీ తెలియజేశారు. అందుకు అంగీకరించిన గవర్నర్ కృష్ణకాంత్ ఆస్పత్రికి వెళ్లి, ఎన్టీఆర్ను పరామర్శించారు. ఎన్టీఆర్ ఆయనకు రాజీనామా లేఖ అందించారు. (అయితే తాను గవర్నర్కు రాజీనామా లేఖ ఇవ్వ లేదనీ, మంచంపై ఉన్న తన చేతిలోంచి గవర్నరే లేఖను తీసుకు న్నారనీ ఆ తర్వాత ఎన్టీఆర్ చెప్పారు. అయితే ఆయన మాటలను న్యాయస్థానం, ప్రజలు విశ్వసించలేదు.)కీలకమైన విశ్వాస తీర్మానం రోజున ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన అభిమాను లనూ, మద్దతుదారులను విషాదంలో ముంచెత్తివేసింది. ధైర్యమే ఊపిరిగా, పోరాటమే నైజంగా తల ఎత్తుకుని బతికిన ఎన్టీఆర్ చివ రకు ఇలా అస్త్రసన్యాసం చేశారు.ఆ మరుసటి రోజు, అంటే 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు మరో 11 మంది మంత్రులుగా పదవులు చేప ట్టారు. వీరిలో హరికృష్ణ కూడా ఒకరు. (అప్పటికి శాసనసభలోగానీ, శాసన పరిషత్తులో గానీ ఆయన సభ్యుడు కారు. నిబంధనల ప్రకారం మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లోగా చట్టసభకు ఎన్నిక కావాలి. అయితే హరికృష్ణ మంత్రివర్గంలో కొనసాగడం ఇష్టం లేని చంద్రబాబు ‘ఏరు దాటేదాకా ఓడ మల్లన్న... ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి, హరికృష్ణ పోటీ చేసేందుకు వీలులేని పరిస్థితులు సృష్టించారు. దీంతో హరి కృష్ణ మంత్రి పదవి ఊడిపోయింది.)పత్రికాధిపతి రామోజీరావు తన సతీమణితో కలసి ఆగస్టు 31వ తేదీ సాయంత్రం ఎన్టీఆర్ దంపతులను కలసి పరామర్శించారు. ఎప్పుడూ తెరవెనుకనే ఉండి కథ నడిపించే రామోజీరావు ఈసారి తెర ముందుకు రావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. తననూ, తన భార్యనూ కించపరుస్తూ ‘ఈనాడు’లో కార్టూన్లు వేయించినా, తన ప్రతిష్ఠను మంట కలుపుతూ వార్తా కథనాలు ప్రచురించినా, అవేవీ మనసులో పెట్టుకోకుండా, రామోజీ దంపతులను ఎన్టీఆర్ సాదరంగా ఆహ్వానించారు.ఇంత జరిగినా ఎన్టీఆర్ తన బాధను బయటకు కనిపించ నివ్వలేదు. రోజులాగే మరునాడు తెల్లవారుజామునే లేచి దైనందిన కార్యక్రమాలు ముగించుకుని, తనను కలవడానికి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎస్ రావు, సెక్రటరీ జయప్రకాశ్ నారాయణ్లతో సమా వేశమయ్యారు. ఆ రోజు సెప్టెంబర్ 1. అప్పటికి ఆయనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. అది ఎన్టీఆర్కు ముఖ్యమంత్రిగా చివరి రోజు.అసెంబ్లీని గవర్నర్ రద్దు చేసి ఉండాల్సింది: పాల్కీవాలా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటును సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పురస్కరించుకుని ప్రముఖ న్యాయవాది నానీ పాల్కీవాలా... ఎన్టీరామారావుకు ఓ లేఖ రాశారు. అప్పటికి ఎన్టీఆర్ రాజీనామా చేసి రెండు వారాలైంది. ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరినైనా ఆహ్వానించే అధికారం గవర్నర్కు ఉన్నా, అప్పటికే చంద్రబాబును తెలుగుదేశం పార్టీ నుంచి అధ్యక్ష హోదాలో ఉన్న ఎన్టీఆర్ బహిష్కరించినందు వల్ల, అదే పార్టీ పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబును ఆహ్వానించటం చట్టరీత్యా తప్పని పాల్కీవాలా అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ రద్దుకు ఎన్టీఆర్ మంత్రివర్గం చేసిన సిఫారసును గవర్నర్ ఆమోదించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.ఆంధ్రప్రదేశ్లో జరిగిందంతా ఒక ప్రహసనం, ఒక మోసమని లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ అభిప్రాయ పడ్డారు. ఆయన ‘ది హిందూ’ దినపత్రికలో 1995 సెప్టెంబర్ 4న రాసిన ఒక వ్యాసంలో బ్రిటిష్ పార్లమెంటరీ రాజకీయ సూత్రాలనే మనం పాటిస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిఫారసు మేరకు గవర్నర్ కచ్చితంగా అసెంబ్లీని రద్దు చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు.‘ది హిందూ’ దినపత్రిక 1995 సెప్టెంబర్ 1న రాసిన సంపాద కీయంలో... తెలుగుదేశం పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు చంద్రబాబుకి ఉన్నప్పటికీ, అంతకు ఏడాది ముందు 1994లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ అఖండ విజయం సాధించారన్న సంగ తిని ప్రముఖంగా ప్రస్తావించింది.ఆగస్టు సంక్షోభం... ఉపసంహారంఎన్టీఆర్ జీవిత చరమాంకం ఎన్నో ఒడుదొడుకులకు లోనైంది. పిలిచి పిల్లనిచ్చి, పార్టీలో పదవులిచ్చి, వెన్నుతట్టి ప్రోత్సహిస్తే, అధికార దాహంతో అల్లుడు తనకే వెన్నుపోటు పొడవడాన్ని ఆ వృద్ధ నేత తట్టుకోలేకపోయారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి జవ జీవాలు ఊది, అఖండ విజయంతో అధికారంలోకి తీసుకువస్తే, చివరకు ఆయనను పదవీచ్యుతుణ్ణి చేసిన ఉదంతం పార్టీలో ఎంతో మంది నాయకులను, కార్యకర్తలను కన్నీరు పెట్టించింది. ఇక లక్ష లాది అభిమానుల సంగతి వేరే చెప్పాలా?దేవులపల్లి అమర్ (స్వీయ రచన ‘మూడు దారులు’ నుంచి...) -
ఆరో రుద్రుడి అమోఘ ముద్ర
కవి, రచయిత, సినిమారంగ ప్రముఖుడు, కాలమిస్టు, చరిత్ర, సాహిత్య పరిశోధకుడు, నాలుగైదు భాషలు తెలిసినవారు, శ్రీశ్రీ భాషలో తొలుత ఆరో రుద్రుడు... ఆరుద్ర. విశాఖపట్నంలో 1925 ఆగస్టు 31న పుట్టిన భాగవతుల సదాశివ శంకర శాస్త్రి అనేక కలం పేర్లను వాడుతూ ‘ఆరుద్ర’గా స్థిర పడ్డారు. ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన ఆయన విద్యార్హత ఎస్సెస్సెల్సీనే! తండ్రి నరసింగరావు సాహిత్యా భిలాషి గనక కనిపించిన పుస్తకమల్లా తెస్తే మేనమామ శ్రీశ్రీ అప్పటికే విశాఖ రీడింగు రూములో పుస్తకాలన్నీ తాను చది వేసి ఆరుద్రతోనూ చదివించారు. ఆ విధంగా 13 ఏళ్ల వయసులోనే ఆరుద్ర కవిత్వ రచన మొదలుపెట్టారు. కొడవటిగంటి కుటుంబరావు కూడా రచనా శిల్పాన్ని మెరుగులు దిద్దారు. చాగంటి సోమయాజులు మార్క్సిజాన్ని మేధాగతం చేసుకోవడానికి ఉత్ప్రేరకంగా పనిచేశారు. 1942లో సెట్టి ఈశ్వరరావు సిఫార్సుపై ఆరుద్ర కమ్యూ నిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొ న్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యాపై జర్మనీ దాడి చేశాక... అందుకు వ్యతిరేకంగా తన వంతు పాత్ర నిర్వహించేందుకై ఆరుద్ర వైమానిక దళంలో చేరారు. ‘ఆనందవాణి’ పత్రికలో కొలువుతో సహా అనేక మజిలీల తర్వాత మద్రా సులో స్థిరపడి సృజన, పరిశోధన సాగించారు. 1955లో దర్శక దిగ్గజం హెచ్ఎం రెడ్డి, శ్రీశ్రీలే సాక్షులుగా రూ.60 ఖర్చుతో రామలక్ష్మిని రిజిస్టరు వివాహం చేసుకున్నారు.కవిత్వంలో ప్రయోగాలకూ ఆధునికతకూ ఆరుద్ర ప్రాధాన్యాన్నిచ్చారు. ‘గాయాలూ గేయాలూ’, ‘సాహిత్యోపని షత్’, (ఛందస్సు లేని) ‘ఇంటింటి పజ్యాలు’, ‘కూనలమ్మ పదాలు’, ‘సినీ వాలి’, ‘పైలా పచ్చీసు’, ‘అమెరికా ఇంటింటి పజ్యాలు’ తదితర రచనలు చేశారు. నాట్యశాస్త్రంలోని ‘హస్త లక్షణ పదాలు’ మరో ప్రత్యేక రచన. ‘ఆరుద్ర అరబ్బీ మురబ్బాలు’ ఆయన మరణానంతరం వెలువడ్డాయి. జీవితపు చివరి దశలో మొదలు పెట్టిన ‘మనిషి – ఆడ మనిషి’ కావ్యంలోని ఒక భాగం ‘స్త్రీ పురాణం’ మహిళా కోణాన్ని ఆవిష్కరించింది. తను రాయని ‘సినీవాలి’ అనే కావ్యం రాసినట్టు ఎవరో పొరబాటున పేర్కొంటే ఆ పేరుతో కావ్యం రాశారు. ఇంటింటి పజ్యాలు, కేరా శతకము వంటివి అలవోక ప్రయోగాలే. ‘కూనలమ్మ పదాలు’ వందల మందిని కవులను చేశాయంటారు. వీర తెలంగాణ సాయుధ పోరా టంపై హరీంద్రనాథ్ చటోపాధ్యాయ గీతాలను తెలుగులోకి అనువదించగా సుందరయ్యగారి పుస్తకంలో ప్రచురించారు.‘కొండగాలి తిరిగింది’ పేరిట వచ్చిన సినిమా పాటలు ఆయన పట్టును చెబుతాయి. ‘ఎదగడానికెందుకురా తొందర’ పాటలో నిరుద్యోగాన్ని వివరిస్తారు. ‘గాం«ధీ పుట్టిన దేశమా ఇది’ అంటూ ప్రశ్నిస్తారు. ‘వేదంలా ఘోషించే గోదావరి’, ‘మహాబలిపురం’ వంటి పాటలు వింటే రాగం చరిత్ర అల్లుకుపోవడం చూస్తాం. అందులో కూడా ‘కట్టు కథల చిత్రాంగి కనకమేడలు’ అంటూ అది నిజం కాదని సూచిస్తారు. ‘కొట్టుకుని పోయే కొన్ని కోటి లింగాలు వీరేశలింగమొకడు మిగిలెను చాలు’ అన్న ఆయన మాటలు సుభాషితాల్లా నిలిచిపోయాయి. ‘రగిలింది విప్లవాగ్ని ఈ రోజు’ అంటూ ‘అల్లూరి సీతారామరాజు’కు రాసిన పాట కూడా గొప్పగా ఉంటుంది. సినిమా పాటల తీరు మారి విలువలు తగ్గిపోతున్న దృష్ట్యా వాటిని రాయడం విరమించుకున్నారు. 150 చిత్రాలకు మాటలూ, 500 చిత్రాల్లో నాలుగు వేల పాటలూ రాశారు. సినీ జనానికి ఆయనో విజ్ఞాన సర్వస్వంలా గోచరించేవారు. సామాన్యుడికి సాహిత్య చరిత్ర తెలియడానికి ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ మహాభారం వేసుకున్నానని ఆరుద్ర వినయంగా చెప్పినా... పండితులకే గొప్ప వనరు సమ కూర్చారు. దాన్ని రాసే సమయంలో తీరిక లేకపోవడం వల్లనే గడ్డం చేసుకోవడం మానేసి పెంచేశానని సరదాగా చెబుతుండేవారు. ‘వేమన వేదం’, ‘మన వేమన’, ‘వ్యాస పీఠం’, ‘గురజాడ గురుపీఠం’ సంపుటాలు; ‘ప్రజా కళలూ – ప్రగతివాదులూ’ ఆయన ప్రజ్ఞకు ప్రతిబింబాలుగా నిలిచి ఉన్నాయి. ’రాముడికి సీత ఏమవుతుంది?, ‘గుడిలో సెక్స్’ అన్న గ్రంథాలు ఇప్పుడెంత సంచలనమయ్యేవో! కళలు, క్రీడలు, ఇంద్రజాలం వంటి అంశాలపై కూడా సాధికార గ్రంథాలు వెలువరించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఫాసిజాన్ని ఓడించా లంటూ సైన్యంలో చేరడంతో మొదలైన ఆరుద్ర రాజకీయ అవగాహన ఆఖరు దాకా ప్రగతిశీలంగానే సాగింది. సైద్ధాంతిక విభేదాలు పెరిగినపుడు మామూలు కవులుగా అందు కోవడంలో తాము పొరబడి ఉండొచ్చని నిస్సంకోచంగా వినయంగా చెప్పారేగానీ ఇతరులపై దాడి చేయలేదు.1985లో ఆరుద్ర షష్టి పూర్తి సాహిత్య లోకంలో ఒక పండుగలా జరిగింది. తర్వాత కాలంలో ఆరుద్ర ఉద్యమానికి మరింత దగ్గరయ్యారు. సోవియట్ విచ్ఛిన్నం, ప్రపంచీ కరణ, దేశంలో అయోధ్య వివాదం తరుణంలో ఆరుద్ర ‘మనీ ప్రపంచం మనీ ప్రపంచం/ మనీ ప్రపంచం గెలిచిందా? మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం మారిందా?’ అని ప్రశ్నించారు. ఆరుద్ర 1998 జూన్ 4న కన్నుమూసిన సంగతి అంత్యక్రియలు ముగిశాక గాని తెలియలేదంటే అది ఆయన నిరాడంబరతకు ఓ నిదర్శనమే. తన అంతిమఘట్టం అలా నిశ్శబ్దంగా జరిగిపోవాలని ఆయన ఆకాంక్షించారని భార్య రామలక్ష్మి నా ఇంటర్వ్యూలో చెప్పారు. చరిత్రనే తిరగదోడే అసహన ధోరణులూ దాడులూ, కళాసాహిత్యాలలో వాణిజ్య ప్రలోభాలూ పెరిగిన ఈ తరుణంలో ఆరుద్ర జీవితం అధ్యయనానికీ, ఆచరణకూ మార్గదర్శకం. తెలకపల్లి రవి వ్యాసకర్త సీనియర్ పత్రికా సంపాదకులు(నేడు ఆరుద్ర శతజయంతి) -
మమతా బెనర్జీ (ప.బెం. సీఎం) రాయని డైరీ
నూట నలభై తొమ్మిది పుస్తకాలు రాశాక కూడా, ఇవాళ రాయటం మొదలు పెట్టిన కొత్త పుస్తకానికి ప్రారంభ వాక్యం కుదరటం లేదు! నెహ్రూ నుంచి ముందుకు రావటమా, లేక నరేంద్ర మోదీ నుంచి వెనక్కు వెళ్లటమా? భారత ప్రధానుల మీద నేను తలపెట్టిన మహాకావ్య యజ్ఞమిది. జనవరి 22 నుండి కోల్కతా బుక్ ఫెయిర్. ఆ లోగా నా బుక్ బయటికి వచ్చేయాలంటే ప్రారంభ వాక్యం ఏమిటన్నది చూసుకోకూడదు.నిజానికి, తొలి వాక్యానికి ఇంత యోచన అక్కర్లేదు. బెంగాల్ నుంచి ఒక్క ప్రధానీ లేరు కనుక బెంగాల్ను అమితంగా ఇష్టపడిన నెహ్రూజీతో నా పుస్తకాన్ని మొదలు పెట్టొచ్చు.నెహ్రూ పొద్దస్తమానం ఇక్కడికి వచ్చి వెళుతుండేవారు. కవులతో, కళాకారులతో ముచ్చట్లు పెట్టేవారు. టాగూర్, సుభాష్ చంద్రబోస్లతో క్లోజ్గా ఉండేవారు. నేనూ ఆ కాలం నాటి రచయిత్రిని అయుంటే... బహుశా నెహ్రూకూ, నాకూ మధ్య కూడా స్నేహం ఏర్పడి ఉండేదా! నా పెదవులపై చిరునవ్వు. నెహ్రూ తర్వాత, నాలో మెదిలిన వారు శ్రీమతి గాంధీ. ఇక్కడే శాంతి నికేతన్లో ఆమె చదువుకున్నారు. నెహ్రూకి, శ్రీమతి గాంధీకి మధ్యలో ప్రధానిగా ఉన్న శాస్త్రీజీతో కూడా పుస్తకం మొదలు పెట్టొచ్చు. బోస్ మరణం లాగే, శాస్త్రీజీ మరణం కూడా ఒక మిస్టరీ! లేదంటే, నెహ్రూకీ–శాస్త్రీజీకీ మధ్యలో, శాస్త్రీజీకీ–శ్రీమతి గాంధీకీ మధ్యలో ప్రధానిగా ఉన్న నందాజీని తీసుకోవచ్చు. కానీ ఆయన బెంగాల్తో అస్సలు కనెక్ట్ అయి లేరు. మొరార్జీ దేశాయ్ ఒకసారి ఇక్కడికి వచ్చి గంగలో మునకలేసి వెళ్లారు. చరణ్ సింగ్ అసలు కలకత్తాకే వచ్చినట్లు లేరు! వీపీ సింగ్, అప్పటి బెంగాల్ సీఎంతో మాట్లాడటానికి వచ్చారు. చంద్రశేఖర్ ఒక ఇండస్ట్రియలిస్టును కలిసేందుకు కలకత్తా వచ్చి వెళ్లినట్లున్నారు. దేవెగౌడ కూడా కలకత్తా వచ్చారు. పొలిటికల్గా నాకు సపోర్టు ఇచ్చారు. ఐ.కె. గుజ్రాల్ సై¯Œ ్స సిటీని ప్రారంభించి వెళ్లారు. అసలింత ఆలోచన లేకుండా నేరుగా రాజీవ్ గాంధీతో ప్రారంభ వాక్యాన్ని మొదలు పెట్టొచ్చు. నేను కలిసిన తొలి ప్రధాని ఆయన. నన్ను తన సిస్టర్లా చూసుకున్నారు. కెరీర్లో నాకు లిఫ్ట్ ఇచ్చారు. పీవీని, వాజ్పేయిని, మన్మోహన్ని కూడా నేను కలిశాను కానీ, పీవీజీ ఎప్పుడైనా కలకత్తా వచ్చారేమో నాకు గుర్తు లేదు. అటల్జీ కలకత్తాలో మా ఇంటికి కూడా వచ్చారు. మన్మోహన్ కలకత్తా వచ్చి నా కోసం ఎన్నికల ప్రచారం చేశారు. తొలిసారి నన్ను సీఎంను చేసిన ఎన్నికలవి! ఇక మోదీజీ అయితే ఉదయం లేస్తూనే ఇప్పుడు బెంగాల్లో ఉంటున్నారు. మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు!ఇంతమంది దిగ్గజాలలో ఎవరితో పుస్తకం మొదలు పెట్టాలో నిర్ణయించుకుంటే బహుశా ఆ వెనకే ప్రారంభ వాక్యం రావచ్చా అని ఆలోచిస్తూ ఉన్నాను. ‘‘శుభేచ్ఛా పీషీ’’ అంటూ లోపలికి వచ్చాడు అభిషేక్. తను నా అన్న కొడుకు. ‘‘రా, భిపో... వచ్చి కూర్చో’’ అని దగ్గరకు పిలిచాను. కూర్చున్నాక, ‘‘పుస్తకం ఎవరితో మొదలు పెడితే బాగుంటుంది?’’ అని అడిగాను. ప్రధానుల మీద నేను పుస్తకం రాయబోతున్నట్లు అభిషేక్కి తెలుసు. కాసేపు దీర్ఘంగా ఆలోచించి, ‘‘అయినా పీషీ, ప్రధాన మంత్రుల మీద పుస్తకాన్ని ప్రధాన మంత్రులతోనే ఎందుకు ప్రారంభించాలి? ప్రధానిగా అవకాశం వచ్చినా, పార్టీ నిర్ణయాన్ని గౌరవించి, ఆ అవకాశాన్ని వదులుకున్న వారితో మొదలు పెట్టొచ్చు కదా?’’ అన్నాడు!క్షణం తర్వాత గానీ, అభిషేక్ ఎవరి గురించి చెబుతున్నాడో నాకు అర్థం కాలేదు. అర్థమయ్యాక, ‘‘ఎక్స్లెంట్, భిపో’’ అని మెచ్చుకోలుగా తన వైపు చూశాను. బెంగాల్కు 23 ఏళ్లు సీఎంగా ఉన్న జ్యోతి బసు ప్రధాని కాలేకపోవచ్చు. బెంగాల్లో ఆయన నా రాజకీయ ప్రత్యర్థి అయితే కావచ్చు. కానీ, నేను రాయబోయే ప్రధానుల పుస్తకానికి నిండుదనాన్నయితే తేగలిగినవారే! -
హిమాలయాల పెను హెచ్చరిక
ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లాలో ఆగస్టు 5న వరుణుడు విలయ తాండవం చేశాడు. ఈ తీవ్ర అవపాతం హార్షిల్ దగ్గరలోని ధరాలీ, హార్షిల్ లోని సైనిక స్థావరం వద్ద ఆకస్మిక వరదలను సృష్టించింది. భారీ వర్షంతోపాటు మేఘ విస్ఫోటనం చోటుచేసుకుందని చెబుతున్నారు. అతి స్వల్ప కాలంలో అపారమైన వృష్టిని మేఘ విస్ఫోటనం అంటున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో ఈ రకమైన పరి ణామం ఇదే మొదటిది కాదు. ‘హిందూ కుశ్ హిమాలయ’ (హెచ్కెహెచ్) ప్రాంతం ఇప్పటికే అనేక వైపరీత్యాలను చవిచూసింది. నేపాల్ లిమి కోనలోని టిల్ గ్రామంపై మే 15న వినాశకర మైన వరద విరుచుకుపడింది. తర్వాత, హిమానీ సరస్సు ఉన్న జలాశయ ఆనకట్ట తెగి రసువా–భోటేకోశీ నది ఆయకట్టును జూలై 8న వరద ముంచెత్తింది. జమ్ము–కశ్మీర్ లోని కిస్త్వార్ జిల్లాలో ఆగస్టు 14న తీవ్ర ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. చినాబ్ నది ఆరగాణి పొడవునా మొత్తం గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వంతెనలు, రోడ్లు, జల విద్యుదు త్పాదన కేంద్రాల విభాగాలు కొట్టుకుపోవడంతో అనేక మంది నిరా శ్రయులయ్యారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళే దారిలో , ఆగస్టు 26న వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు చని పోయారు. అక్కడ కొండవాలు ప్రాంతాలు బలహీనంగా ఉన్నాయి. వాటికి తీవ్ర వృష్టి తోడవుతోంది. వరదలకు లోనుకాగల సానువుల్లో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. జల బాంబులుఈ దుర్ఘటనలన్నీ, రకరకాల ఆపదల రాకను సమగ్రంగామదింపు చేసే (ఎంహెచ్ఆర్ఏ) వ్యవస్థ అవసరాన్ని మరోసారి చాటుతున్నాయి. అక్కడక్కడ విడి విడిగా ప్రమాదాలకు ఉన్న అవకాశాలనే కాకుండా , వాటి మధ్యన ఉండగల సంక్లిష్ట పరస్పర క్రియలను పరిశీలించేదిగా ఆ ప్రణాళిక ఉండాలి. అధిక వర్షపాతం కొండ చరియలు విరిగిపడటానికి, తదనంతరం, హిమానీ సరస్సు లకు గండిపడటానికీ దారితీస్తోంది. నీరు గడ్డకట్టిన ప్రాంతాలు, హిమం కరుగుతున్నాయి. ఈ జల ప్రవాహాలన్నీ కలసి లోయల్లో అస్థిరతను మరింత ఉద్ధృతం చేస్తున్నాయి. హిందూ కుశ్ హిమానీ నదాలు ఆందోళనకరమైన వేగాలతో తగ్గుతున్నాయి. ఇవి కరుగు తున్న వేగం, హిందూ కుశ్ నదుల ప్రవాహ వేగాల గతులను మార్చే స్తోంది. ఇవి ‘క్రయోస్పియర్ టైమ్ బాంబులు’గా తయారవు తున్నాయి.సిక్కింలో 2023 అక్టోబర్ 3న సంభవించిన విపత్తు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇది హిమానీ సరస్సుకు గండిపడటంతో వచ్చిన వరద బీభత్సమే కాదు. ఒక పరిణామం మరో పరిణామా నికి పురిగొల్పే సంక్లిష్టమైన ఉపద్రవం. ఒక పెద్ద హిమఖండం దక్షిణ లోనక్ సరస్సులోకి వచ్చిపడటంతో ఆ గొలుసు కట్టు ప్రక్రియ మొదలైంది. హిందూ కుశ్లో ఉపేక్షిస్తూ వచ్చిన జల ఘనీభవన స్థానాల కీలక పాత్రను అది తేటతెల్లం చేసింది. ఆర్కిటిక్ప్రాంతంలో శాశ్వత ఐసు గడ్డల గురించి విస్తృతమైన అధ్యయనాలు సాగాయి. హిందూ కుశ్ ప్రాంతంలో హిమ ఖండాలు కరగడంపై ఇటీవలి కాలంలో మాత్రమే దృష్టి సారించారు. హిమ ఖండాలు కరిగితే లోయలు అస్థిరమవుతాయి. అది కొండ చరియలు విరిగి పడటానికి కారణమవుతుంది. భూకంపాలకు హెచ్చరించినట్టుగానే...ఏయేటి కాయేడు, పర్వత ప్రాంతాల్లో పెరుగుతున్న సంక్లిష్ట ఉపద్రవాల ద్వారా ప్రకృతి మనకు తరచూ హెచ్చరికలు పంపుతోంది. ఈ పరిణామాలను ప్రభావితం చేయగలిగిన నమూనాలు లేకపోలేదు. కానీ, వాటి కచ్చితత్వం పూర్తిగా ‘ఇన్ పుట్ డేటా క్వాలిటీ’పై ఆధారపడి ఉంటుంది. ప్రమాదాలను ముందే పసిగట్టి హెచ్చరికలు జారీ చేసేందుకు, ఆపదలను తగ్గించుకునే వ్యూహాల రూపకల్పనకు మనం ఎత్తయిన ప్రదేశాలలో క్షేత్రస్థాయి డేటా సమీకరణ చేపట్టాలి. అందుకు అత్యవసరంగా మరిన్ని నిధులను వెచ్చించవలసిన అవసరం ఉంది. గ్లేసియర్ ద్రవ్య రాశి సమతౌల్య కొలతలను నమోదు చేసుకోవాలి. వాతావరణ పరిశోధన శాఖ రికార్డులను పదిలపరచుకుని పరిస్థితులను బేరీజు వేసుకోవాలి. సరస్సుల పరిమాణాలను కచ్చితత్వంతో అంచనా వేసేందుకు సమగ్ర బాతీమెట్రిక్ సర్వేలు నిర్వహించుకోవాలి.గ్లేసియర్ సంబంధిత వైపరీత్యాలు చెదురుమదురుగా ఉండటం అరుదు. అవి ఒకదానివెంట ఒకటి సంభవిస్తుంటాయి, సరిహద్దు లకు అతీతమైనవిగా తరచూ ఉంటాయి. ఎక్కడ వైపరీత్యం సంభ వించినా దాని చుట్టుపక్కల దేశాలన్నీ కష్టనష్టాలను అనుభవించక తప్పదు. కనుక, పటిష్టమైన ప్రాంతీయ సహకారం అనివార్యం. ప్రజలు లేదా మౌలిక వసతులపై ప్రభావం చూపినప్పుడు ప్రమాదం సైతం పెను ఉపద్రవంగా మారుతుంది. కనుక, జనావాస ప్రాంతాల ప్రణాళికలు, మౌలిక వసతుల అభివృద్ధి శాస్త్రీయ విజ్ఞానంతో కూడుకున్నవై ఉండాలి. ముఖ్యంగా, ఎప్పుడుఎలాంటి జలవాయు పరివర్తనాలు చోటుచేసుకుంటాయో తెలియని హిందూ కుశ్ పర్యావరణాలలో వాటి అవసరం మరింత ఉంది. వైజ్ఞానిక మదింపులను ఆధారం చేసుకున్న ఆచరణ యోగ్యమైన విధానాలను మనం తు.చ. తప్పకుండా అమలు చేయాలి. క్రయోస్పియర్ ప్రమాదకర మండలాల పటాన్ని తయారు చేయడం ఆ దిశగా వేసే ముఖ్యమైన అడుగు కావచ్చు. భూకంపాలు, కొండ చరియలు విరిగిపడటం సంభవించగల ప్రాంతాలను గుర్తించే పటం మాదిరిగానే దాన్నీ రూపొందించుకోవచ్చు. ఎత్తైన ప్రాంతాల్లోనూ, గడ్డ కట్టిన సరస్సులు ఉన్న చోట్ల ఎక్కడెక్కడ ఎలా అభివృద్ధి చేయవచ్చో ఆ మ్యాప్ మార్గం చూపుతుంది. ముఖ్యంగా ప్రవాహ దిగువ ప్రాంతాల్లో ప్రజలు ఉన్న చోట్ల, లేదా కీలకమైన మౌలిక వసతులు ఉన్నచోట ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. చివరగా, హై–రిస్క్ మండలాల్లో ఆదిలోనే హెచ్చరించగల వ్యవస్థలను నియోగించుకోవాలి. శిక్షణ ఇవ్వడం, మాక్ డ్రిల్స్ నిర్వహించడం ద్వారా ప్రజలను సన్నద్ధులను చేసే కార్యక్రమాన్ని పటిష్ఠపరచుకోవాలి. కొద్ది నిమిషాల ముందు హెచ్చరించినా ప్రాణాలను కాపాడుకునేందుకు ఎంతో అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.– మహమ్మద్ ఫారూక్ ఆజమ్ ‘ గ్లేసియాలజీ, హైడ్రాలజీ ప్రొఫెసర్, ఐఐటీ, ఇందౌర్– శాశ్వతా సన్యాల్ ‘ ఇంటర్వెన్షన్ మేనేజర్, ఐసీఐఎంఓడీ(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
భారత్కు పరీక్షా సమయం
భారత ప్రభుత్వం పలు దేశాలతో సంబంధాల అభివృద్ధికి శీఘ్రగతిన చేస్తున్న ప్రయత్నాలు, చూపుతున్న స్వతంత్ర ధోరణి అమెరికాతో తలెత్తిన సమస్యల వల్ల తాత్కాలికమా? లేక దీర్ఘ కాలంలో ‘బ్రిక్స్’ వేదికగా బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థే సరైన ప్రత్యామ్నాయమనే గుర్తింపు మౌలికమైన రీతిలో కలిగి నందువలనా? ఈ కీలకమైన ప్రశ్నపై స్పష్టత అవసరం. ఎన్నెన్ని లోపాలు ఉన్నా వర్ధమాన ప్రపంచంలోని అగ్ర దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచం ఆర్థికంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా కూడా ఒక చౌరస్తా వంటి పరిస్థితిలోకి వచ్చి చేరింది. ప్రపంచాన్ని అన్ని విధాలుగా కొన్ని శతాబ్దాల పాటు శాసించిన పాశ్చాత్య దేశాలు బలహీనపడు తుండటం ఒకవైపు కనిపిస్తున్నది. నెమ్మదిగా బలపడుతూ, స్వతంత్ర ధోరణిలో ముందుకు పోజూస్తున్న వర్ధమాన దేశాల ధోరణి మరో వైపు ఆవిష్కృతమవుతున్నది. అటువంటపుడు భారతదేశం ఎక్కడ నిలిచి ఏ పాత్ర వహించగలదన్నది చరిత్రాత్మక నిర్ణయం కానున్నది.తాత్కాలికమా? దీర్ఘ కాలికమా?భారతదేశం వివిధ కారణాల వల్ల గత పాతిక సంవత్సరాలుగా అమెరికన్ శిబిరానికి సన్నిహితంగా ఉంటూ వచ్చింది. ఇటీవలి కాలంలో బలహీనపడుతున్న అమెరికాకు తన పట్ల, ప్రపంచం పట్ల దృష్టి మారి గతం కన్నా భిన్నమైన విధానాలను రూపొందించుకుంటున్నది. ఈ కొత్త పరిస్థితి భారతదేశానికి ఒక పరీక్షగా మారిందన్నది గుర్తించవలసిన విషయం. అమెరికా విధానాలలోని మార్పుల వల్ల వాణిజ్య సుంకాల రూపంలో, వాణిజ్య ఒప్పందపు చర్చల రూపంలో, ఇతరత్రా కూడా ఎదురవుతున్న ఆర్థిక రంగ సమస్యలు కనిపిస్తున్నవే! ఇవి గాక, ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ప్రభావాలు భారతదేశంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉండ బోతున్నాయి. ఉదాహరణకు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ), ఐసీజే, ఐసీసీ, యూఎన్ఓ, డబ్ల్యూహెచ్ఓ, యునిసెఫ్ మొదలైన సంస్థలను బలహీనపరచటమో, వాటి నుంచి ఉపసంహరించుకోవ టమో అమెరికాకు నిత్యకృత్యంగా మారింది. అటువంటపుడు ప్రభుత్వం అమెరికాతో ఏర్పడిన సమస్యలు తాత్కాలికమని, క్రమంగా వెనుకటి స్థితి ఏర్పడగలదనే అవగాహ నతో ముందుకు పోతుందా అన్నది ఒక ప్రశ్న. దీని అర్థం అమెరికాతో మైత్రికి బదులు వైరం ఏర్పడాలని ఎంతమాత్రమూ కాదు. కానీ, తగిన స్పృహ, జాగ్రత్తలు లేని మైత్రికీ, అవి ఉండే మైత్రికీ తేడా ఉంటుంది. అదే సమయంలో రెండు దేశాల మధ్య ఇటీవల తలెత్తిన సమస్యలు పరిష్కారం కావటం అవసరం. అందువల్ల కలిగే మేలు చాలానే ఉంటుంది. అందులో వ్యూహాత్మకమైనవి, దేశ రక్షణకు సంబంధించినవి కూడా ఉంటాయి. అయితే, స్వల్పకాలిక, మధ్యకాలిక ప్రయోజనాల కోసం అమె రికా వైపు చూడవలసి రావటం ఎంత అవసరమో, దీర్ఘకాలిక దృష్టితో ‘బ్రిక్స్’ వంటి ప్రత్యామ్నాయాలు, బహుళ ధ్రువ ప్రపంచా లను లక్ష్యంగా పెట్టుకోవటం కూడా అంతే అవసరం. ఏక కాలంలో ఈ రెండింటితో ఎట్లా వ్యవహరిస్తారన్నది దౌత్యనీతిపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి అటువంటి సంతులనం అవసరమని జైశంకర్ విదేశాంగ మంత్రి అయిన కొత్తలోనే ‘ది ఇండియా వే’ పుస్తకంలో సూచించారు. కానీ, అప్పటికన్నా పాశ్చాత్య ప్రపంచపు బలహీనతలు పెరిగాయి. ముఖ్యంగా ట్రంప్ విధానాలతో పరి స్థితులు గణనీయంగా మారుతున్నాయి. అందువల్ల, ప్రత్యామ్నా యాల వైపు లోగడకన్నా మరింత ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం ఏర్పడుతున్నది. బ్రిక్స్ కరెన్సీ అనకుండానే...పోతే, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కొన్నింటిని చూద్దాము. అవి – ట్రంప్ సుంకాలు, జిన్పింగ్తో జైశంకర్ సమా వేశం, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఢిల్లీకి రావడం, ఈ నెలాఖరున బీజింగ్లో జరిగే ‘షాంఘై సహకార సంస్థ’ శిఖరాగ్ర సమావేశానికి మోదీ వెళ్లనున్నట్లు ప్రకటన, ట్యారిఫ్లకు జంకబోమంటూ దేశ స్వావలంబనకు పిలుపునిచ్చి జీఎస్టీ స్లాబ్లను నాలుగు నుంచి రెండింటికి ప్రభుత్వం తగ్గించటం వంటివి. ఇవన్నీ జాబితా వలె రాసుకోవటం ఎందుకంటే, ఈ పరిణామాలు కొద్ది కాలంలోనే అమెరికా చర్యలకు స్పందనగా జరిగినటువంటివి. వాటన్నిటికి తగు ప్రాముఖ్యం ఉంది.వీటిమధ్య చాలా ముఖ్యమైనది ఒకటి జరిగింది. అది – అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి మారకపు చెల్లింపులకు సంబంధించిన నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సడలించటం. ప్రైవేట్ కంపెనీలు ఇతర దేశాలతో జరిపే లావాదేవీలలో రూపాయి కరెన్సీ వినియో గానికి ప్రత్యేకంగా వోస్ట్రో అకౌంట్లు తెరవాలి. అందుకు స్థానిక బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి అవసరమయేది. ఆ నిబంధనను రిజర్వ్ బ్యాంక్ ఇపుడు ఎత్తివేసింది. అందువల్ల వాణిజ్యం సులభతరం అవుతుందనేది సరేసరి. కానీ, అంతకుమించిన విశేషం ఉంది. ఇంతకుముందు వలె డాలర్పై ఆధారపడనక్కర లేక పోవటం! డాలర్కు బదులు ‘బ్రిక్స్’ దేశాలు పరస్పరం గానీ, ఇతర దేశాలతో గానీ తమ సొంత కరెన్సీలలో చెల్లింపులు చేసుకోవాలని, ఆ విధంగా డాలర్ బలహీన పడుతుందన్నది ఆ సంస్థ తీర్మానం. డాలర్కు ప్రత్యామ్నాయంగా ‘బ్రిక్స్’ కరెన్సీ అనకుండానే వారు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఇండియా కూడా అటువంటి చెల్లింపులు కొన్ని చేస్తున్నా, డాలర్కు తాము వ్యతిరేకం కాదంటూ వచ్చింది. ధోరణి ఇదే విధంగా కొనసాగితే, కొందరు విమర్శకులు ఎత్తి చూపుతున్నట్లు బ్రెజిల్, చైనాల వలె భారత్ కూడా అమెరికాపై ఎదురు సుంకాలు విధించటం, డబ్ల్యూటీఓకు ఫిర్యాదు చేయటం వంటి చర్యలు తీసుకోగలదేమో చూడవలసి ఉంటుంది.వచ్చే సంవత్సరం ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకో నుంది. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం 2026లో ఢిల్లీలో జరిగి, ఆ సంస్థకు భారతదేశం అధ్యక్షత వహించనుంది. అందువల్ల ఈ దేశంపై ఎటువంటి బాధ్యతలు ఏర్పడతాయో ఊహించవచ్చు. ఇప్పటికే ఒక కొత్త ధోరణిలో ముందుకు వెళ్లవలసి వస్తున్న భారత ప్రభుత్వం ఆ మార్పును స్వల్పకాలికానికి పరిమితం చేయగలదా, లేక దీర్ఘకాలికం, మౌలికం చేయవచ్చునా అన్నది పెద్ద ప్రశ్న అవు తున్నది. ఈ పరిణామాలకు కొసమెరుపు 23వ తేదీ నాటి జైశంకర్ వ్యాఖ్యలు. తన జీవితంలో ట్రంప్ వంటి అధ్యక్షుడిని చూడలేదని, ఇండియా ఉత్పత్తులను వారికి కావాలంటే కొనవచ్చు, లేదా మాన వచ్చునని, మాకు వేరే మార్కెట్లు ఉన్నాయని అన్నారాయన. ఆత్మ విశ్వాసం కలిగి స్వతంత్రంగా వ్యవహరిస్తే ఇట్లాగే ఉంటుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
స్వావలంబన సాధించగలమా?
స్వాతంత్య్రానంతరం 1950వ దశకం మొదటి అర్ధ భాగంలో ఆహార ధాన్యాలు, హెవీ ఇంజినీరింగ్ వస్తువులు, రవాణా పరికరాలు, యంత్రాలు, మెషిన్ టూల్స్, ఇతర మూలధన వస్తువుల దిగుమతులపై భారత్ అధికంగా ఆధారపడింది. స్వావ లంబన, స్వీయ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ప్రారంభమైన మూడవ పంచ వర్ష ప్రణాళిక, ఆ తర్వాతి హరిత విప్లవం, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్లు సరైన ఫలితాలను అందించలేక పోయాయి. 2024–25లో వస్తు వాణిజ్య లోటు 282.3 బిలియన్ డాలర్లు కాగా, కరెంటు ఖాతా లోటు 23.3 బిలియన్ డాలర్లుగా నమోదవడాన్ని బట్టి, భారత్ వస్తు దిగుమతులపై అధికంగా ఆధారపడటం తేటతెల్లమవుతున్నది.తయారీకి దిగుమతులే ఆధారంతయారీ రంగాన్ని పటిష్ఠపరచడంతోపాటు భారత్ను ప్రపంచంలో ‘తయారీ, డిజైన్ హబ్’గా రూపొందించడానికి 2014 సెప్టెంబర్లో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ప్రారంభమైంది. నియంత్రణ–విధానపరమైన అడ్డంకులు, లాజిస్టిక్స్–సప్లయ్ చెయిన్ వ్యవస్థ సమర్థంగా లేకపోవడం, ప్రైవేటు–విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో తక్కువ వృద్ధి, నైపుణ్యం గల శ్రామిక శక్తి లభ్యత తక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లో అధిక పోటీ కారణంగా మేక్ ఇన్ ఇండియా తన లక్ష్య సాధనలో వెనుకబడింది.సెమీ కండక్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో మొబైల్ ఫోన్ తయారీదారులు అధికంగా దిగుమతులపై ఆధార పడుతున్నారు. భారత్లో ఫోన్ల అసెంబ్లింగ్లో నిమగ్నమైన ఆపిల్, శామ్సంగ్, షావోమీ కంపెనీలు చైనా, తైవాన్, దక్షిణ కొరియా నుండి చిప్సెట్స్, డిస్ప్లే ప్యానల్స్, కెమెరా మాడ్యూల్స్ను దిగుమతి చేసు కుంటున్నాయి. కార్ల తయారీలో నిమగ్నమయిన టాటా,హ్యుండాయ్, మారుతి సుజుకీలు ఎలక్ట్రానిక్స్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ, ఇంజిన్ కంట్రోల్ యూనిట్లను దిగుమతి చేసుకుంటున్నాయి. చైనా నుండి సోలార్ సెల్స్, మాడ్యూల్స్ను పెద్ద సోలార్ పార్క్లు దిగు మతి చేసుకుంటున్నాయి. భారత్లో అవసరమైన ఆరోగ్య సంరక్షణ సాధనాలు 90 శాతం చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నవే. ప్రపంచ మార్కెట్లో టెక్స్టైల్స్కు సంబంధించి భారత్ అతి పెద్ద ఎగుమతిదారునిగా నిలిచినప్పటికీ వీటి తయారీలో ఉపయోగించే సింథటిక్ ఫైబర్, ముఖ్య యంత్రాల కొరకు భారత్ దిగుమతులపై ఆధారపడుతోంది. టీవీ, లాప్టాప్స్, వాషింగ్ మెషిన్ ఉత్పత్తుల అసెంబ్లింగ్కు అవసరమైన చిప్స్, సెన్సార్స్, డిస్ప్లేలు కూడా దిగుమతి చేసుకుంటున్నవే.ఎరువుల ఉత్పత్తిని పెంచడమెలా?79వ స్వాతంత్య్ర దినోత్సవాలలో భాగంగా ప్రధాని ‘స్వయం సమృద్ధ భారత్’ను ప్రస్తావించారు. 2047 నాటికి అన్ని రంగాలలో ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ విజన్ను పేర్కొన్నారు. అయితే, దేశీయంగా వ్యవసాయ డిమాండ్ నేపథ్యంలో ఎరువులు ప్రధాన దిగుమతులుగా నిలిచాయి. 2024–25లో ఎరువు లకు డిమాండ్ 650 లక్షల టన్నులు కాగా, దేశీయంగా ఉత్పత్తి తక్కు వగా ఉండటంతో 170 లక్షల టన్నులకు పైగా దిగుమతి చేసు కున్నట్లు అంచనా. అధిక దిగుమతులపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించుకున్నప్పుడు వాణిజ్య లోటు తగ్గుతుంది. యూరియా, ఫాస్పటిక్, పొటాసిక్ ఎరువుల దిగుమతులను తగ్గించుకోవడానికి గ్యాస్ ఫీల్డ్స్ అధికంగా ఉన్న ప్రాంతాలలో నూతన ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. ఇప్పటికే మూసివేసిన ఎరువుల కర్మాగారాలను తిరిగి ప్రారంభించడంతో పాటు నానో– ఫెర్టిలైజర్ టెక్నాలజీని ప్రోత్సహించాలి. బయో ఆధారిత, ఆర్గానిక్ ఎరువుల వినియోగం పట్ల రైతులలో అవగాహన పెంపొందించినట్లయితే రసాయన ఎరు వుల వినియోగం తగ్గుతుంది. ఎరువుల ఉత్పత్తిని పెంచడానికి విదే శాలలో జాయింట్ వెంచర్స్ ఏర్పాటుతో పాటు ప్రపంచ ఎరువుల మార్కెట్లో ప్రధాన దేశాలుగా ఉన్న రష్యా, జోర్డాన్, కెనడాలతో దీర్ఘకాలిక ఒప్పందాలు అవసరం. ‘పునరుత్పాదక’ సమస్యలుజనాభా పెరుగుదల, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో 2040 నాటికి భారత్ శక్తి వినియోగం రెట్టింపు కాగలదని ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ’ అంచనా. భారత్ అవస్థాపిత విద్యుత్ సామర్థ్యం 2025 జూన్ నాటికి 476 గిగావాట్లకు చేరుకుంది. 2013 –14తో పోల్చినప్పుడు 2024–25లో విద్యుత్ కొరత తగ్గినప్పటికీ తలసరి వినియోగంలో 45.8 శాతం పెరుగుదల ఏర్పడింది. భారత్ మొత్తం విద్యుత్ సామర్థ్యంలో థర్మల్ విద్యుత్ వాటా 50.52 శాతం కాగా, శిలాజేతర ఇంధనాల వాటా 49 శాతం. 2014–15లో భారత్ మొత్తం ఎనర్జీ వినియోగంలో దిగుమతి వాటా 26 శాతం కాగా, 2025 జనవరి నాటికి 19.60 శాతానికి తగ్గింది. ‘వాణిజ్య బొగ్గు మైనింగ్’, ‘మిషన్ కోకింగ్ కోల్’ వంటి ప్రభుత్వ చర్యల వల్ల స్వదేశీ బొగ్గు ఉత్పత్తి పెరిగి, దిగుమతులపై ఆధారపడటం తగ్గింది. కానీ 2030–2035 మధ్య బొగ్గుకు డిమాండ్ అధికంగా ఉంటుందని నీతి ఆయోగ్ అంచనా. రాబోయే కాలంలో శక్తికి బొగ్గు ప్రధాన ఆధారంగా నిలిచే అవకాశం ఉన్నందువలన సౌర, పవన, జల విద్యుత్తు లాంటి పునరుత్పాదక శక్తి వనరులపై దృష్టి సారించాలి. శిలాజేతర ఇంధన ఆధారిత శక్తి సామర్థ్యం 2030 నాటికి 500 గిగావాట్లకు చేరుకోవాలని లక్ష్యం. అవస్థాపనా సౌకర్యాల కల్పన, గ్రీన్ ఫైనాన్సింగ్, ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యా లను ప్రోత్సహించినప్పుడు ఆయా ఉత్పత్తులు పెరిగి శక్తి సప్లయ్ పెరుగుతుంది. పునరుత్పాదక శక్తి ఆధారాలు ఎదుర్కొంటున్న సమస్యలైన ట్రాన్స్మిషన్ మౌలిక వసతులు సరిపోయినంతగా లేకపోవడం, నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం, వాతావరణ మార్పులు, సౌర, పవన క్షేత్రాలు నిర్మించడానికి అవసరమైన భూసేకరణ లాంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి.అవసరమైన సంస్కరణలురక్షణ ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి ఇటీవల ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి ఎఫ్డీఐ పరిమితిని సరళీకరించడంతోపాటు దేశీయ ఉత్పత్తికి ప్రాధాన్యమి స్తోంది. 2020–24 మధ్య ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆయుధాల దిగుమతిలో భారత్ వాటా 8.3 శాతం. మందుగుండు సామగ్రిలో భారత్ 88 శాతం స్వయంసమృద్ధి సాధించింది. రక్షణ రంగంలో భవిష్యత్ ఒప్పందాలు, ప్రాజెక్టులకు సంబంధించిన ‘డిఫెన్స్ ఆర్డర్ పైప్లైన్’ స్వదేశీ రక్షణ ఉత్పత్తుల పెరుగుదలకు దోహదపడగలదు. రక్షణ రంగంలో స్వావలంబన సాధన దిశగా ‘మిలిటరీ–ఇండ స్ట్రియల్ కాంప్లెక్స్’ను అభివృద్ధి పరచాలి.ముఖ్య రంగాలలో నైపుణ్యం, పోటీతత్వం, స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యం, కార్మిక సంస్కరణలు, కీలక పరిశ్రమలలో ప్రైవేటు కంపె నీలను అనుమతించడం లాంటి చర్యలు తీసుకున్నప్పుడే స్వావలంబన లక్ష్యం నెరవేరగలదు.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్ఛార్జ్), ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
పేదవాడి గుండె చప్పుడు!
ఆయన భారతదేశ రాజకీయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జరుగుతున్న పరిణామాలను అవలీలగా అర్థం చేసుకొని ప్రజలకు వివరించే బహుముఖ ప్రజ్ఞాశాలి. నిరంతరం కార్మిక, కర్షక, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా ఆలోచన చేసే మేధావి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన గొప్ప నాయకుడు. ఆయనే కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి. 1942 మార్చి 25న జన్మించిన ఆయన ఈ 2025 ఆగస్ట్ 22న తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మానవపాడు మండలం కంచుపాడు ఆయన స్వగ్రామం. సురవరం ప్రతాపరెడ్డి గారికి సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామారెడ్డి స్వయానా తమ్ముడు. కర్నూలులో చదువుకునే రోజుల్లో 19 ఏళ్లకే ఏఐఎస్ఎఫ్ కర్నూల్ పట్టణ కార్యదర్శిగా, 1960లో కర్నూలు జిల్లా కార్యదర్శిగా పని చేశారు సుధాకర్ రెడ్డి. 1967లో హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా కోర్సులో చేరారు. యూనివర్సిటీ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. 1963లో ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై అనంతరం రెండు పర్యాయాలు జాతీయ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. లా పూర్తి చేసిన తర్వాత ఢిల్లీలో సీనియర్ న్యాయవాది వద్ద చేరి ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వం సీపీఐలో పూర్తి కాలం పని చేయడానికి అవకాశం ఇచ్చింది. దీంతో భారత కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఎదిగి 2012లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అయితే 2019లో అనారోగ్య కారణాల వల్ల పార్టీ పదవుల నుండి తప్పుకొన్నారు.1980, 1984ల్లో మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం నుండి పోటీచేశారు. 1994లో ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. 1998, 2004ల్లో లోక్ సభకు నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. భారతదేశ అత్యున్నత పార్ల మెంటరీ కమిటీలకు ప్రాతినిధ్యం వహించారు. అనేకమంది పేద లకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వడం కోసం కేంద్ర ప్రభు త్వంతో కీలకంగా వ్యవహరించారు. ఏఐఎస్ఎఫ్ ఉద్యమ సమయంలో పరిచయమైన డా‘‘ బీవీ విజయలక్ష్మిని 1974లో ఆదర్శ వివాహం చేసుకున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న క్రమంలో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్న సుధాకర్ రెడ్డి నాకు సైద్ధాంతిక అవగాహన కల్పించడంలో అందరి కంటే ముందున్నారు.2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆనాటి ఇందుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సిటింగ్ స్థానాన్ని సైతం నాకు ఇప్పించినేను శాసనసభ్యునిగా గెలుపొందడం కోసం కృషి చేశారు. శాసనసభలో సీపీఐ పక్ష నాయకునిగా పనిచేస్తున్న క్రమంలో ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చి ప్రోత్సహించారు. నిబద్ధత కలిగిన కమ్యూనిస్టుగా తుది శ్వాస విడిచే వరకు పని చేశారు. వారు విడిచిన సైద్ధాంతిక లక్ష్యాలను పుణికి పుచ్చుకొని ముందుకు పోవడమే ఆయనకు అసలైన నివాళి. – చాడ వెంకటరెడ్డిసీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు -
మట్టి చేతుల క్యూ!
అతను అదనపు భూమినోఅర్ధ సామ్రాజ్యాన్నో అడగడం లేదు పొలం తరఫున పంట కోసం ఎరువును అడుగుతున్నాడు అరువుకు కాదు ఖరీదుకే!ఇంట్లోనో పొలం దగ్గరో ఉండిఅతను హుకుం జారీ చేయడం లేదు క్యూలో నిల్చుని మట్టి చేతులు మోడ్చిమరీ అడుగుతున్నాడుపోలింగ్ బూత్ క్యూలనైతే మీరు ప్రేమతో పట్టించుకుంటారు కదా! పొలం వచ్చి క్యూలో నిల్చుంటే అసలు పట్టనట్లుంటే ఎట్లా? ఇది అన్న మూలమన్న సంగతి మరిస్తే ఎట్లా?తెలుసుకోండి: అతను ఎరువు కోసం క్యూలో నిల్చున్నాడంటేదేశం అన్నం కోసం క్యూలో నిల్చున్నట్లే!– దర్భశయనం శ్రీనివాసాచార్య94404 19039 -
బుద్ధిజీవులకైనా 'బలమైన సవాల్'
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని నా రచనల్లో ఎలీన్ ఇంటెలిజెన్స్గా కూడా ప్రస్తావిస్తూ ఉంటాను. బుద్ధిజీవు లైన మానవ జాతిని మానవ పరిణామ శాస్త్ర పరిభాషలో హోమో సేపియన్స్గా పిలుస్తారు. నాకెందుకో ఒక కొత్త జాతి వృద్ధి చెంది ఈ హోమో సేపియన్స్ స్థానాన్ని భర్తీ చేస్తుందని అనిపిస్తోంది. ఈ భూగోళంపై మొదటిసారిగా మనకు నిజమైన పోటీ ఎదురవుతోంది. ఇప్పటికి కొన్ని వేలాది ఏళ్ళుగా మనమే అత్యంత తెలివైన జాతిగా ఉంటూ వస్తున్నాం. ఆఫ్రికాలో ఓ మూలన ప్రాధాన్యం లేని కోతులుగా పడి ఉన్న మనం ఈ తెలివి తేటల కారణంగానే, ఈ భూగోళానికి తిరుగులేని పాలకులుగా మారగలిగాం. కానీ, ఇపుడు మనం సృష్టిస్తున్నది సమీప భవిష్యత్తులో మనకు పోటీగా పరిణమించవచ్చు. పిల్లల్ని పెంచడం లాంటిదే!ఏఐ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన సంగతి ఒకటుంది. అది ఒక సాధనం కాదు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగిన ఏజెంట్. అది కొత్త ఐడియాలను కనిపెట్టగలదు. నేర్చుకోగలదు. తనకుతాను మారగలదు. మనం ఇంతకు ముందు కనుగొన్న ముద్రణాలయం, అణు బాంబు లాంటివి మనల్ని శక్తిమంతులను చేసిన సాధనాలు. వాటికి మన అవసరం ఉంది. ప్రెస్ స్వయంగా పుస్తకాలు రాయలేదు. ఏ పుస్తకాలను ప్రచురించాలో నిర్ణయించలేదు. అణు బాంబు తనకన్నా శక్తిమంతమైన మరో బాంబును కనుగొనలేదు. తానెక్కడ పేలాలో దాని కంతట అదే నిర్ణయించుకోలేదు. కానీ, ఏఐ ఆయుధం దాడికి లక్ష్యాన్ని ఎంచుకోగలదు. తదుపరి తరం ఆయుధాలను దానికంతట అదే డిజైన్ చేయగలదు.నా తాజా పుస్తకం ‘నెక్సస్’లో ఏఐని చిన్న పిల్లాడిలా అభివర్ణించాను. మనం ఏది నేర్పుతామో వాడు అదే నేర్చుకుంటాడు. కనుక, మనందరం ముఖ్యంగా, వివిధ దేశాల స్థితిగతులను ప్రభావితం చేస్తున్న నాయకులు చాలా బాధ్యతతో వ్యవహరించాలి. మనం అబద్ధాలాడుతూ, వంచన చేస్తూ, ఏఐ మాత్రం దయగలదిగా ఉండా లంటే కుదరదు. ఒక నిర్దిష్టమైన రీతిలో ఈ ఏఐని మనం డిజైన్ చేయగలమా? ఏఐకి నీతి నియమాలు బోధించగలమా? వాటిలోకి కొన్ని లక్ష్యాలను చొప్పించగలిగిన విధంగా కోడింగ్ చేయగలమా? అనే అంశాలపై పరిశోధన, ప్రయత్నాలు సాగుతున్నాయి. అపుడు మనం సురక్షితంగా ఉంటాం కదా అని భావిస్తున్నారు. కానీ, ఈ దృక్పథంలో రెండు ప్రధాన సమస్యలు ఇమిడి ఉన్నాయి. ఒకటి– అసలు ఏఐ అంటేనే నేర్చుకోగలదు, దానికంతట అది మారగలదు. కనుక మనం ఏఐని డిజైన్ చేస్తే, నిర్వచనాన్ని అనుసరించి, మనం ఊహించలేని అన్ని రకాల పనులనూ అది చేసేస్తుంది. రెండు– ఇది ఇంకా పెద్ద సమస్య. మనం ఏఐని పిల్లాడిలానే భావించి విద్యా బుద్ధులు నేర్పించాం అనుకుందాం. సత్పౌరుడుగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా పాటుపడ్డారు. వారి చదువు సంధ్యలపై మీరు ఎంత వెచ్చించారన్నది లెక్కలోకి రాదు. చివరకు, వారు చేసే పని మిమ్మల్ని ఆశ్చర్యపరచనూవచ్చు లేదా భయపెట్టనూవచ్చు. ఇంకో విషయం కూడా ఉంది. ఇది పిల్లల్ని పెంచేవారందరికీ అనుభవంలో ఉన్న విషయమే. మనం పిల్లలకి ఏం చెబుతామన్న దానికన్నా ఏం చేస్తున్నామన్నది ముఖ్యం. మనం పిల్లలకి అబద్ధా లాడవద్దని చెప్పేసి, మనం మాత్రం ఇతరులతో అబద్ధాలు చెబుతూంటే, వారు చూసి మనల్నే అనుకరిస్తారు. మన ఆదేశాల్ని పాటించరు. అబద్ధాలాడకూడదనే నీతిని ఏఐలలో చొప్పించే ప్రాజెక్టును చేపట్టామనుకుందాం. కానీ, వాటికి ప్రపంచంతో యాక్సెస్ ఉంది. మానవులు ఎలా ప్రవర్తిస్తున్నారో అవి గమనిస్తాయి. అదే నడతను మన పట్లా ప్రదర్శిస్తాయి. అన్నింటిలోనూ... అన్ని చోట్లా...వ్యాపారాలలో ఏఐ ప్రాధాన్యం ప్రస్తుతానికి పెద్ద లెక్కలోకి రానిదిగానే కనిపించవచ్చు. ఇప్పటికి 36 నెలల తర్వాత కూడా పరిస్థితి ఇలానే ఉంటుందా అంటే... అది టైమ్ స్కేల్పై ఆధారపడి ఉంటుందని చెప్పాలి. ఉదాహరణకు, ఇది లండన్లో 1835 సంవ త్సరం అనుకుందాం. మాంచెస్టర్– లివర్పూల్ మధ్య మొదటి రైలు మొదలై అప్పటికి ఐదేళ్లయింది. లండన్లో 1835లో చర్చకు కూర్చున్నవాళ్లకు ‘రైల్వేలు ప్రపంచాన్ని మార్చేస్తాయి, పారిశ్రామిక విప్లవం వచ్చేస్తుంది’ అంటే నాన్సెన్స్ అని కొట్టిపడేస్తారు. కానీ, ఇపుడు రైల్వేలు మొదలై చాలా ఏళ్ళు అయింది. పారిశ్రామిక విప్లవం, రైల్వేలు ప్రతీదాన్నీ మార్చేశాయని మనకు ఇపుడు తెలుసు. కానీ, మార్పు వచ్చేందుకు ఐదేళ్ళకన్నా ఎక్కువే పట్టింది. అలాగే, ఇప్పటికి తెలిసిన రంగాలు, అంతగా తెలియని రంగా లన్నింటిలో కూడా ఏఐతో మార్పులు రావచ్చు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగం ప్రధానమైన మార్పులను చూడవచ్చు. ఆర్థిక వ్యవస్థను ఏఐ చాలా వేగంగా హస్తగతం చేసుకోబోతోంది. ఆర్థికం పూర్తిగా సమా చార ప్రభావిత రంగం. డ్రైవర్ సీట్లో మనిషి లేకుండా నడిచే కార్లు లక్షల్లో మనకు అప్పుడే రోడ్డు మీద కనబడకపోవచ్చు. ఎందుకంటే, రోడ్డుమీద గుంతలుంటాయి, మనుషులు నడుస్తూంటారు, కంగా ళీగా ఉంటుంది కనుక ఏఐతో నడిచే వాహనాలు రాకపోకలు సాగించడానికి సమయం పడుతుంది. కానీ, ఆర్థికంలో సమాచా రమే ప్రధానం. వస్తుంది, వెళుతుంది. దానిపై పట్టు సాధించడం ఏఐకి చాలా తేలిక. ఆయుధ పోటీ లాంటి స్థితిఏఐ కొందరి ఉద్యోగాలకు ఎసరు పెడుతుంది అంటున్నారు. దీనిపై చాలా మందిలో ఆందోళన ఉంది. మరి ఒక సమాజంగా బతికి బట్టకట్టడమే కాదు, వృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఏఐకి అపారమైన సానుకూల సామర్థ్యమూ ఉంది. ప్రమాదకరమైన సామర్థ్యమూ ఉంది. ఒకే టెక్నాలజీ పూర్తిగా భిన్నమైన సమాజాలను సృష్టించడాన్ని మనం 20వ శతాబ్దంలో గమనించాం. అందుకే కమ్యూనిస్టు నిరంకుశ ప్రభుత్వాలతోపాటు, ఉదారవాద ప్రజాస్వామిక వ్యవస్థలూ ఏర్పడ్డాయి. ఏఐతోనూ అంతే! దాన్ని అనేక విధాలుగా ఉపయోగించుకునేందుకు మనకు అవకాశం ఉంది. కాకపోతే, మనం మొదటిసారిగా పనిముట్లతో కాకుండా ఏజెంట్లతో వ్యవహరిస్తున్నామనే సంగతిని గుర్తు పెట్టుకోవాలి. కానీ, ఇప్పటికీ ఏఐ చాలా వరకు మన చెప్పుచేతల్లోనే ఉంది. మనం ఆ టెక్నాలజీని ఎలా అభివృద్ధి చేస్తాం? అంతకన్నా ముఖ్యంగా మనం దాన్ని ఎక్కడెక్కడ నియోగించబోతున్నాం? అన్నది ప్రశ్న. ఎంచుకునేందుకు మనకు చాలా అవకాశాలున్నాయి. ప్రధాన సమస్య ఏమిటంటే, ఏఐ విప్లవంలో ప్రస్తుతం అగ్ర భాగాన ఉన్న కంపెనీలు, దేశాలు ఆయుధాల సమీకరణ లాంటి పోటీ స్థితిలో చిక్కుకున్నాయి. ఈ విషయంలో మందగతిన సాగడమే మంచిదని వాటికి తెలిసినా, సురక్షణపై మరింత వ్యయం అవసరమనే గ్రహింపు ఉన్నా, ఆ శక్తిమంతమైన పరిణామం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలనే ఆలోచన ఉన్నా, మనం బ్రేకులు వేసి నంత మాత్రాన ఇతరులు వేయకపోవచ్చనే భయం వారిని నిరంతరం వెన్నాడుతోంది. ఎక్కడ ఎదుటివారు ప్రపంచంపై ఆధిపత్యం సంపాదిచ్చేస్తారేమోననే ఆదుర్దా వారిని నిలువనీయడం లేదు. -
నిలుపుకోవాల్సిన బంధం
ఇండియాకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోరుపారేసు కోవడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఆయన అక్కసు వెనుక ప్రతిసారీ ఒక భూ స్వామ్య పెత్తందారీ విధానం కనిపిస్తుంది. సుంకాలు, జరిమానాలను రక్షణ కవచంగా ధరించి ఆయన విమర్శలకు, బెదిరింపులకు దిగుతూంటారు. అమెరికా అధ్యక్షుడి వదరుబోతుదనంలో ఒక సామ్రాజ్య వాదిలో ఉండే దురహంకారం ప్రతిబింబిస్తూ ఉంటుంది.రష్యా చమురును ఒక బూచిగా చూపిస్తున్నారంతే. అలనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ధోరణి ఇప్పుడు అమెరికా వ్యవహార శైలిలో కనిపిస్తోంది. వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమ పట్ల భారత దేశం అనుసరిస్తున్నట్లు చెబుతున్న సంరక్షణ విధానంపై నిజంగానే అమెరికా విభేదిస్తోందని మనకు ఎక్కడైనా మనసు పొరల్లో చిన్న సందేహం మిగిలి ఉంటే, ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఉపయోగించిన భాషతో అది కాస్తా పటాపంచలైపోతుంది. ‘మహారాజా సుంకాలు’ అనే పద బంధాన్ని గమనిస్తే, భారత దేశాన్ని ప్రాచ్యవాద, పురాతన జాతివాద కళ్ళద్దాలతోనే నవారో చూస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఈసారి ఆయన ‘పాములు ఆడించే వాళ్ళ’ ఉపమానాన్ని ఉపయోగిస్తారేమో! ఏదో ఒక పక్షం వైపు రావలసిందిగా భారతదేశాన్ని నేరుగానే హెచ్చరించారాయన. కొత్తగా ఉపయోగించిన మాటలతో భారతీయుల మనసును నవారో మరింత గాయపరచారు. క్రెమ్లిన్కి ‘లాండ్రోమాట్’గా ఆయన భారతదేశాన్ని అభివర్ణించారు. నిజానికి, అప్ప టికి కొద్ది రోజుల క్రితమే అలాస్కాలో వ్లాదిమీర్ పుతిన్కి ట్రంప్ అక్షరాలా ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలికిన సంగతిని ఆయన సమయానుకూలంగా మరచినట్లుంది. అమెరికా ఆత్మవంచనమనం రష్యా ముడి చమురు కొని, శుద్ధి చేసిన తర్వాత, ఆ చమురును యూరప్ దేశాలు కూడా కొనుగోలు చేశాయి. అలా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా మనం ‘లాభాలు గడిస్తున్నా’మని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ఆరోపించారు. కానీ, ఉక్రెయిన్ యుద్ధం వల్ల నిజంగా లబ్ధి పొందు తున్నది వారే! ఐరోపా దేశాలు అమెరికా నుంచి ఆయుధాలు కొని ఉక్రెయిన్కు లాభాలకు అమ్ముతున్నాయి. అందుకే అవి విక్రయిస్తున్న అన్ని ఆయుధాలపైనా (అదనపు వ్యయాలు, లాభం కింద) ట్రంప్ ప్రభుత్వం 10% మొత్తాన్ని తీసుకుంటోందని బిసెంట్ మరో ఇంటర్వ్యూలో స్వయంగా అంగీకరించారు. ఇండియా మాత్రం రష్యా చమురు కొనడం తమ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతూంటే... అదే వ్యక్తులు, పుతిన్ యుద్ధాన్ని మనం బలో పేతం చేస్తున్నట్లుగా నిందిస్తున్నారు. ఇక్కడ అమెరికా ఆత్మ వంచన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కపటత్వానికీ స్థిరమైన వాదన అవసరం.ఎవరో ఒక అధ్యక్షుడి చపలచిత్త ధోరణిని పట్టించుకోనక్కర లేదని, భారత–అమెరికా స్నేహ సంబంధాలు సుదీర్ఘమైనవి, గాఢ మైనవని వాదించేవారితో నేనూ ఏకీభవిస్తాను. కానీ, ట్రంప్కు అర్థ మయ్యే భాషలోనే ఆయనకు వ్యతిరేకంగా స్వల్పకాలిక చర్యనైనా తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను. అలా గని వాషింగ్టన్ ఇవ్వనిది చైనా మనకేదో దోచిపెడుతుందని కూడా నేను అనుకోవడం లేదు. చైనాను నమ్మవచ్చా?ట్రంప్ది దూకుడు తత్త్వం. చైనా సైనికంగా మనకి ప్రత్యర్థి. ట్రంప్వి అవాకులో చవాకులో బహిరంగంగానే ఉంటాయి. జిన్పింగ్వి పారదర్శకం కాని తెరవెనుక చర్యలు. పాకిస్తాన్ పట్ల ట్రంప్ మెతక వైఖరిని అర్థం చేసుకోవచ్చు. దాని పొగడ్తలకు ఆయన ఉబ్బి పోయాడు, లేదా అది ఇవ్వజూపిన ప్రయోజనాలకు ప్రలోభపడ్డాడు అనుకుందాం. కానీ, ఇటీవలి ‘ఆపరేషన్ సిందూర్’లో కూడా పాకి స్తాన్తో చైనా చెట్టపట్టాలేసుకుని తిరిగింది.కనుక, ట్రంప్ను, ప్రస్తుత లోటుపాట్లను పక్కనపెట్టి అమెరికా – భారత్ స్నేహ సంబంధాన్ని కాపాడుకోవాలని కోరుకోవడంలో ఔచిత్యం ఉంది. ఇప్పటి అమెరికా స్పందన ఒకటే పాఠం నేర్పుతోంది. అది: ప్రపంచంలో ఓ మూలనున్న ప్రాంతంపై లేదా ఒకే దేశంపై ఆశలన్నీ పెట్టుకోవద్దు. అది ప్రమాదకరం.మనవాళ్లు ఏం చేస్తున్నట్టు?ట్రంప్ను భారత్ ఎందుకు దారికి తెచ్చుకోలేకపోయింది అనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆపరేషన్ సిందూర్ ఆగి పోవడంలో ట్రంప్ స్వోత్కర్షను సమర్థించనందుకా? ఆయన ‘ఇగో’ దెబ్బతిందా? ట్రంప్ మాజీ అంగరక్షకుడు ఒకరిని పాకిస్తాన్ తన లాబీయిస్టులలో ఒకడిగా చేర్చుకుందని చెబుతున్నారు. మనం అలా కాకుండా, లాంఛన పూర్వకంగా, సంయమనంతో దౌత్యం నెరప డమా? కానీ, నాకొకటే సందేహం. అమెరికాలో ఉంటున్న భారత సంతతికి చెందిన గొప్ప వ్యక్తులు ఏమైపోయినట్లు? యాభై లక్షల మంది ఇండియన్–అమెరికన్ సమూహాన్ని ఒక చక్కని వలస వర్గానికి నమూనాగా తరచూ అభినందిస్తూ ఉంటారు. ఆ వర్గం నాయకులు పెద్ద టెక్, ఫినాన్షియల్ సంస్థలను నడుపు తున్నారు. విద్యా, విధాన నిర్ణాయక సంస్థల్లో కీలక పదవుల్లో ఉన్నారు. ఇండియా పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరు చూసి వారికి ఒళ్ళు మండటం లేదా? స్వీయ నిర్ణయాలు తీసుకోవడం భారతదేశానికున్న సార్వభౌమాధికారమనే సంగతిని ట్రంప్ ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోతే, ఆయన శ్వేత సౌధం నుంచి నిష్క్ర మించే నాటికి కాపాడుకోవాల్సినవి పెద్దగా ఏమీ మిగలవు.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
సీపీ రాధాకృష్ణన్ (ఉప రాష్ట్రపతి అభ్యర్థి) రాయని డైరీ
మనవి కాని రోజులు కొన్ని ఉంటాయి. కచ్చితంగా అవి మన రోజులే అనుకుని, అవి తెచ్చిన ఆకూ వక్కల పళ్లేన్ని అందుకోవటానికి చేతులు చాస్తామా, హఠాత్తుగా అవి పక్కకు మళ్లిపోతాయి!మోదీజీ నన్ను ఉప రాష్ట్రపతిగా అనుకోగానే మొదట నాకు... ఇలా దగ్గరి వరకు వచ్చి, అలా దూరంగా మళ్లిపోయిన రోజులే గుర్తొచ్చాయి.అయితే నాకు ఒకటే నమ్మకం. మనవి కాని రోజులను కూడా మనవి అయ్యేలా చెయ్యగల శక్తిమంతులు మోదీజీ. లెక్కలైనా ఆఖరి నిమిషంలో అటూ ఇటూ అవొచ్చు. మోదీజీ లెక్క ఎటూ అవ్వదు.రెండు సభల మొత్తం ఓట్లు 782. ఉప రాష్ట్రపతిగా నేను గెలవటానికి కావలసిన ఓట్లు 394. ఎన్డీయేకు ఉన్నవి 422. ఇక నేను ఉప రాష్ట్రపతిని కాకుండా ఎలా ఉంటాను? ఉంటాను! ప్రతిపక్షాలకు ఉన్న 330 ఓట్లు, ఏ పక్షానికీ చెందని 30 ఓట్లు, ఎన్డీయే నుండి ఒకవేళ చీలిపోయే 35 ఓట్లు కలిస్తే నేను ఉప రాష్ట్రపతిని కాకుండా ఉంటాను.కానీ... గోడ మీది ఈ కూడికలు, తీసివేతలు మోదీజీ అనే సింహం ముందు వట్టి పిల్లి మొగ్గల వంటివి. ఆయన ఒకరి పేరు చెప్పారంటేæఆ ఒకరు రాష్ట్రపతి భవన్ ఫోర్కోర్టులో ప్రమాణ స్వీకారం చేసినట్లే!సెప్టెంబరు 9న ఉప రాష్టపతి ఎన్నిక! సెప్టెంబరు 9 అనగానే నాకు 25 ఏళ్లనాటి సెప్టెంబర్ 29 మనసులోకి వచ్చింది! ఆ రోజు... ప్రధాని వాజ్పేయి, వరుసగా ప్రమాణ స్వీకారాలు చేయిస్తున్నారు. నా వంతు వచ్చింది. నా పేరు కూడా వచ్చింది.‘‘రాధాకృష్ణన్ అనే ఆ గడ్డం మనిషి ఎక్కడ? ఆయన్ని పిలిపించండి’’ అని వాజ్పేయి, తన పక్కనే ఉన్న అద్వానీతో అన్నారు. అయితే వాళ్లు పిలిపించింది సీపీ రాధాకృష్ణన్ అనే నన్ను కాదు. పి. రాధాకృష్ణన్ అనే వేరొకర్ని! నేను కోయంబత్తూరు ఎంపీని. ఆయన నాగర్కోయిల్ ఎంపీ. పొరపాటున నాకు బదులుగా ఆయన చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు! ఎప్పుడూ గడ్డం ఉండే నాకు అప్పుడు గడ్డం లేక పోయుండాలి. లేదంటే, ఎప్పుడూ గడ్డం ఉండని పి.రాధాకృష్ణన్కు అప్పుడు గడ్డం ఉండి ఉండాలి. ‘‘ఎవరైతే ఏంటీ, ఇద్దరూ జెమ్సే కదా’’ అన్నారట వాజ్పేయి! బీజేపీ ఎప్పుడూ అలానే ఆలోచిస్తుంది. జెమ్ ఏదైనా జెమ్మే అయినప్పుడు కోయంబత్తూరు జెమ్ కోసమే ఎందుకు చూడటం అంటుంది. ఇంకోసారి 2014లో మోదీజీ ప్రధానిగా వచ్చినప్పుడు నా చేతికి రావలసిన ఆకూ వక్కల పళ్లెం చేజారి, మళ్లీ పి. రాధాకృష్ణన్ వైపే వెళ్లిపోయింది!సీఎం జయలలిత ప్రిస్టేజ్గా తీసుకుని కోయంబత్తూరులో నాకు పోటీగా వాళ్ల క్యాండిడేట్ను గెలిపించుకోవటంతో, కన్యాకుమారిలో గెలిచిన పి.రాధాకృష్ణన్ను నా ప్లేస్లో (నేను గెలిచి ఉంటే) కేబినెట్లోకి తీసుకున్నారు మోదీజీ.చేయలేకపోయిన సహాయాలను గుర్తు పెట్టుకుని, చేసిన సహాయాలను మర్చిపోయే మహనీయుడు మోదీజీ!నాకు మంత్రి పదవి ఇవ్వలేక పోయినందుకు ఆయన నన్ను పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ని చేశారు. తెలంగాణ గవర్నర్ని చేశారు. జార్ఖండ్ గవర్నర్ని చేశారు. మహారాష్ట్ర గవర్నర్ని చేశారు. ఇపుడు భారత ఉప రాష్ట్రపతిని చేస్తున్నారు! ఒకటి ఇవ్వలేక పోయినందుకు వంద ఇస్తారు మోదీజీ! మనవి కాని రోజులు ఉన్నట్లే, మోదీజీ తలచుకుంటే మనవి తప్ప వేరేవారివి కాని రోజులు కూడా ఉంటాయి. బహుశా అలాంటి రోజులలో ఒకటిగా 2027 జూలై 25 నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందని నా నమ్మకం. ద్రౌపదీ ముర్ము తర్వాత వచ్చే వారు భారతదేశ 16వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు అది! -
ప్రభుత్వాలను దించే ఆయుధమా?
రాజ్యాంగంలోని 75, 164, 239ఎఎ అధికరణలకు సవరణలను ప్రతిపాదిస్తూ రాజ్యాంగ (130వ) సవరణ బిల్లును ఇటీవల లోక్ సభలో ప్రవేశపెట్టారు. దానిని కేంద్ర పాలిత ప్రాంతాలు, జమ్ము–కశ్మీర్కు వర్తింపజేసే విధంగారెండు అనుబంధ బిల్లులను కూడా ప్రవేశపెట్టారు. మూడింట రెండొంతుల మెజారిటీ ప్రభుత్వానికి కొరవడినందు వల్ల ఈ ప్రతిపాదనలు చట్ట రూపం ధరించకపోవచ్చు. అయినప్పటికీ, వాటి వెనుక ఆలోచన గమనార్హమైనది. ప్రధాని లేదా ముఖ్యమంత్రితో సహా ఏ కేంద్ర లేదా రాష్ట్రమంత్రి అయినా ఐదేళ్ళు లేదా అంతకు మించి శిక్షపడగల ఆరోపణ లను ఎదుర్కొంటూ అరెస్టు అయి, వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే సదరు మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి. లేకపోతే, వారు ఆయా పదవుల నుంచి ఆటోమేటిక్గా వైదొలగినట్లు పరిగణి స్తారన్నది సవరణ మూల సారాంశం. బిల్లును సమర్థించుకునేందుకు చెబుతున్న ఆశయాలు గొప్పవిగానే ఉన్నాయి. అవి: రాజ్యాంగ నైతిక తను కాపాడటం, ప్రజల విశ్వాసాన్ని పరిరక్షించడం, ఉన్నత పద వుల్లో ఉన్నవారు తాము చట్టానికి అతీతులమనే భావనకు లోను కాకుండా చూడటం. కానీ, ఉన్నతాశయాలు ఎల్లప్పుడూ ఉన్నతమైన ఫలితాలనే ఇస్తాయనే పూచీ ఏమీ లేదు. రాజకీయాలలో వ్యూహం తరచు నైతికతను పక్కకు నెడుతున్న పరిస్థితుల్లో ఈ రాజ్యాంగ సవరణ ఆయుధంగా పరిణమించవచ్చు. పరిశుద్ధ రాజకీయాలపై వాగ్దానమేనా?మంత్రులు నిజాయతీకి ప్రతీకలుగా ఉండి తీరాలనీ, వారు కస్టడీలో ఉన్నపుడు పరిపాలనకు భంగం కలుగకుండా నివారించ వలసి ఉందనీ ఈ బిల్లును తేవడంలోని లక్ష్యాలు, కారణాలపత్రంలో పేర్కొన్నారు. రాజకీయ వాస్తవికత ముందు ఈ నైతిక విజ్ఞాపన తేలిపోవచ్చు. అరెస్టయి, కస్టడీలో ఉన్నంత మాత్రాన ఎవరూ దోషి కారు. అధికారంలో ఉన్నవారికి జీ హుజూర్ అనే పోలీసు వ్యవస్థ ఉన్న ప్రజాస్వామ్యంలో నిజాన్ని రాబట్టడానికి, వేధించడానికి మధ్య నున్న రేఖ బహు పల్చనైనది. ఈ సవరణ, అరెస్టు చేసేందుకు ఉన్న అవకాశాలను తక్కువ చేసే బదులు, అరెస్టు చేయడానికి మరిన్ని అవకాశాలను సృష్టించేలా ఉంది. దీనిలో కొట్టొచ్చినట్లు కనిపించే అంశం 30 రోజుల వ్యవధి. ఒక మంత్రి 30 రోజులకు మించి నిర్బంధంలో ఉంటే రాజీనామా చేసి తీరాలి. ఆచరణలో, ప్రభుత్వాన్ని మార్చేందుకు రాజ్యాంగం ప్రసా దించిన ‘కూల్చివేత ఆయుధం’గా ఇది ఉపకరించవచ్చు. ప్రతిపక్షా నికి చెందిన ఒక ముఖ్యమంత్రి ఎన్నికలకు వెళ్ళబోతున్నాడు అనుకుందాం. పోలింగ్కు ఒక నెల ముందు పన్నాగంతో చేయించిన అరెస్టుతో అతని పార్టీ నిర్వీర్యం అయిపోతుంది. ప్రభుత్వాలనుదించడానికి బ్యాలట్ కన్నా లాకప్ ఒక మార్గంగా మారుతుంది. వ్యవస్థలు రాజకీయమయంఈ నిబంధన తటస్థంగా ఉండవలసిన వ్యవస్థలను అనివార్యంగా రాజకీయమయం చేస్తుంది. ఇప్పటికే రాజకీయ ఒత్తిడులకు లొంగిపోయేవారిగానున్న పోలీసు అధికారులు తాము ఒక ముఖ్య మంత్రిని అరెస్టు చేస్తే అతను లేదా ఆమె ప్రభుత్వం కూలిపోవచ్చని గ్రహించుకుంటారు. బెయిలు దరఖాస్తులను నిర్ణయించే జడ్జీలు ఎవరు పాలించారో నిర్ణయించే శక్తిమంతులుగా మారతారు. బెయిలు సంపాదించి పెట్టడంలో వ్యూహాత్మక మాయోపాయాలకు పాల్పడే యుక్తిపరులైన న్యాయవాదులు భారీ ప్రయోజనాలుపణంగా పెట్టే రాజకీయ పోరాటంలో ముఖ్యమైన పాత్రధారులుగా మారతారు. చట్టాలను అమలుపరచవలసిన వ్యవస్థలకూ, రాజకీయ ఇంజనీరింగ్కూ మధ్య రేఖ గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. పాకిస్తాన్ నేర్పుతున్న పాఠాలులీగల్ సాధనాలు ప్రజాస్వామ్యాన్ని ఎలా డొల్ల చేయగలవో తెలుసుకునేందుకు పాకిస్తాన్ ప్రత్యక్ష ఉదాహరణ. రాజకీయ ప్రేరేపి తమైనవిగా చాలా మంది భావించిన ఆరోపణలపై సుప్రీం కోర్టు 2017లో నవాజ్ షరీఫ్ను అనర్హుడిగా ప్రకటించింది. ఆయన తొల గింపు ప్రజాస్వామిక ప్రక్రియలను అస్థిరపరచి, ఎన్నిక కాని పాత్ర ధారులను బలోపేతులను చేసింది. ఒకప్పుడు పాకిస్తాన్ అసలైన పాలక వ్యవస్థకు ప్రీతిపాత్రుడుగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ అనర్హుడుగా ప్రకటితుడై ఇపుడు జైలులో మగ్గు తున్నారు. ఓటర్లలో ఇమ్రాన్ ఖాన్కు ఉన్న ప్రజాదరణ జుడీషియల్ మాయోపాయాల నుంచి ఆయనను కాపాడలేకపోయింది. నైతికత ముసుగు కప్పుకున్న చట్టాలు అనర్హత వేటు వేసేందుకు, చట్టబద్ధ తను తొలగించడానికి సాధనాలుగా ఎలా ఉపయోగపడగలవో ఆ రెండు కేసులు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రభుత్వాల మార్పులో కోర్టులు కూడా ఒక పావుగా మారిపోబట్టే పాకిస్తాన్లో ప్రజా స్వామ్యం బలహీనపడింది. అదే దారిని రాజ్యాంగంలో చొప్పించే ప్రమాదంలో ఇపుడు భారతదేశం ఉంది. వ్యాధికన్నా దుర్భరమైన వైద్యంసుదీర్ఘ కాలం కస్టడీలో ఉన్న మంత్రి విధులను నిర్వర్తించలేడని బిల్లు మద్దతుదారులు వాదిస్తున్నారు. అది నిజమే. కానీ, దానికి విరుగుడులు ఇప్పటికే ఉన్నాయి. మంత్రిత్వ శాఖలను ఒకరి నుంచి మరొకరికి మార్చవచ్చు. తాత్కాలిక అధిపతులను నియమించ వచ్చు. కస్టడీలో ఉన్న నాయకునికి మద్దతు కొనసాగించాలో వద్దో చట్ట సభలు నిర్ణయించుకుంటాయి. ఈ ప్రక్రియలను పక్కనపెట్టేసి, ఒక నిర్దిష్ట గడువును విధించడం ద్వారా, ఈ సవరణ నియమాని కన్నా అవసరానికి పెద్ద పీట వేస్తోంది. అరెస్టు అయిన వ్యక్తి నిర్దోషి కూడా కావచ్చుననే సూత్రానికి నీళ్ళు వదులుతోంది. ప్రతి సవరణ ఒక ప్రమాణాన్ని నెలకొల్పుతుంది. ఈ రోజున మంత్రులను 30 రోజులు కాగానే పదవుల నుంచి తొలగిస్తే, రేపు 15 రోజులు కాగానే, శాసన సభ్యులను లేదా పార్లమెంట్ సభ్యులను అనర్హులుగా ప్రకటించవచ్చు. రాజకీయాలను ప్రక్షాళన చేసే ప్రయత్నం కాస్తా, అరెస్టును రాజకీయాల్లో సర్వ సాధారణమైనదిగా రూపొందించవచ్చు. నాయకత్వం బ్యాలెట్ ద్వారా కాకుండా పోలీసు స్టేషన్లు, కోర్టులలో నిర్ణయమవుతుందని పౌరులు భావించడం ప్రారంభిస్తారు. ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా రాజ్యాంగాన్ని ఉద్దేశించారు కానీ, ప్రత్యర్థులను దునుమాడే కత్తులను సమకూర్చడానికి కాదు. 130వ సవరణ బిల్లు అభిమతం మంచిదే కానీ, అది అరెస్టులను ప్రోత్సహించేదిగా, సంకుచిత రాజకీయాలకు ధైర్యం కల్పించేదిగా, న్యాయవ్యవస్థను కూడా రాజకీయమయం చేసే ప్రమాదాలను కొనితెచ్చేదిగా ఉంది. అంతిమంగా, పాలకుడు అంటే, పోలీసు అధికారో లేదా మేజిస్ట్రేటో కాదు, ఓటరు. ఎవరు అధికారంలోఉండాలో ఎవరు వైదొలగాలో ఓటరు మాత్రమే నిర్ణయించాలి.-వ్యాసకర్త సుప్రీం కోర్టు న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- సంజయ్ హెగ్డే -
అప్పుడే... ఏఐకి సార్థకత
కృత్రిమ మేధ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రీన్ హైడ్రోజన్, డిజిటల్ ఇండియా వంటి వాటి గురించి తరచూ మన రాజకీయ నాయకులూ, ప్రభుత్వ పెద్దలూ ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఆ యా టెక్నాలజీలను భారత్ ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో వెనుకబడే ఉందన్నది గమనించాలి. అలా అని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అర్థం కాదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏఐ మిషన్ కోసం పదివేల కోట్లనూ, జాతీయ క్వాంటమ్ మిషన్ కోసం ఆరు వేల కోట్లనూ కేటాయించింది. మౌలిక సదుపాయాలకు, డేటా వేదికల రూపకల్పనకు, నైపుణ్య శిక్షణా తరగతుల నిర్వహణకు, ఇతర సాధనాలను అందుబాటులోకి తేవటానికి సన్నాహాలు చేస్తోంది. అయితే కేవలం అధు నాతన టెక్నాలజీలను సమాజానికి పరిచయం చేయటం, పైపై మెరుగుల కోసం, అవసరాల కోసం వీటిని వాడుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఆధునిక సాంకేతికతలను ఉప యోగించి సామాన్య మానవుని జీవనాన్ని సులభతరం చేయడంతో పాటు, అనేక రంగాల్లో సమూల మార్పులు చేసినప్పుడు మాత్రమే ఈ సాంకేతికతలను సరిగా ఉపయోగించుకున్నట్లు లెక్క. ఎన్నికల అవకతవకలపై ఎన్నో ఆరోపణలూ, విమర్శలూ వినిపిస్తున్నాయి. వీటికి తావు లేకుండా చేయాలంటే ప్రతి ఓటునూ ఆధార్ కార్డ్తో అనుసంధానం చెయ్యడమే కాక, ఫేక్ ఓటర్లను గుర్తు పట్టడానికి డీప్ టెక్ను వినియోగించుకోవాలి. అపుడు అత్యంత పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించవచ్చు. అమెరికా, చైనా వంటి దేశాలు తమ వ్యవస్థలను కృత్రిమ మేధ వినియోగించి పునః రూపకల్పన చేస్తున్నాయి. విద్య, వైద్యం, వ్యవ సాయం, భద్రతా రంగాలను కృత్రిమ మేధతో అనుసంధానం చేస్తు న్నాయి. స్మార్ట్ నగరాల రూపకల్పన, డిజిటల్ పరిపాలన, వ్యవ సాయ ప్రణాళికలు, సామాజిక మౌలిక వసతులు వంటి రంగాలకు చైనా కృత్రిమ మేధను అనుసంధానం చేస్తోంది. కేవలం ఏఐ ఆధా రిత ఉపకరణాలను వినియోగించుకుంటూ వివిధ వ్యవస్థల పని తీరును సమూలంగా పునర్నిర్వచిస్తున్నాయి. మనదేశంలో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్వంటి ఆధునిక అంశాలను పాఠ్యాంశాలుగా విద్యార్థుల నెత్తిమీద రుద్దుతున్నారు తప్ప, ప్రతి విద్యార్థికీ తాను కోరుకున్నట్టు చదువుకోవడానికి కావలసిన స్వీయ అభ్యాసనా వాతావరణాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చెయ్యడం లేదు. ఏఐ ఉపకరణాలు ఉపయోగించి ప్రతి విద్యార్థి పురోగతినీ అంచనా వేసి, వారి స్వీయ అభ్యసనా సామర్థ్యాలకు అనుగుణంగా బోధనా పద్ధతులను మార్పు చేయవచ్చు.అదే విధంగా వ్యవసాయంలో రైతులకు, స్వర/వాక్ ఆధారిత ఏఐ ద్వారా, ఆ యా ప్రాంతాలకు అనుకూలమైన వ్యవసాయ పద్ధ తుల గురించి, పంటల గురించి సలహాలను అందించవచ్చు. గిట్టుబాటు ధరలు, మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ రుణాలు వంటి వాటి గురించి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ రైతులు నష్టపోకుండా చూడవచ్చు.మన దగ్గర అనితర సాధ్యమైన మేధా సంపత్తి ఉంది. కానీ ఆ మేధను కృత్రిమ మేధ, డీప్టెక్ తదితర రంగాల వైపు మళ్ళించి దేశీయ వ్యవస్థలను పునః రూపకల్పన చెయ్యటానికి పటిష్ఠమైన ప్రణాళికలు రచించడం లేదు. ఈ పని జరిగినప్పుడే ఆధునిక టెక్నా లజీ దన్నుతో దేశం అభివృద్ధి పథంలోకి దూసుకుపోగలదు.మన దగ్గర అనితర సాధ్యమైన మేధా సంపత్తి ఉంది. ఆ మేధను కృత్రిమ మేధవైపు మళ్లించి వ్యవస్థలను పునఃరూపకల్పన చెయ్యటానికి ప్రణాళికలను రచించినపుడు టెక్నాలజీ దన్నుతో దేశం అభివృద్ధి చెందుతుంది. – శ్రీవిద్య శ్రీనివాస్, కృత్రిమ మేధ నిపుణులు -
బంగ్లాదేశ్ ఇప్పుడొక టైమ్ బాంబ్!
‘ఉక్కు మహిళ’ షేక్ హసీనా నిరంకుశ పాలనకు తెరపడినా, బంగ్లాదేశ్లో ప్రజా స్వామ్య ద్వారాలు తెరుచుకోలేదు. విద్యార్థుల తిరుగుబాటుకు వెనుక ఉండి మద్దతు ఇచ్చిన సైన్యం హసీనా నిష్క్రమణతో నేరుగా రంగంలోకి దిగింది. తమ ఆటలు సాగనివ్వని హసీనాపై సైనిక అధికారులు పగ తీర్చుకున్నారు. చివరకు ఆమె దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. సైన్యంతో పాటు విద్యార్థుల తిరుగు బాటుకు అన్ని రకాలుగా తోడ్పాటు అందించిన ఇస్లామిస్ట్ శక్తులు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. సెక్యులర్ పాలనలో కుక్కిన పేనుల్లా పడి ఉన్న ఈ శక్తులు ఇదే అదనుగా వీధుల్లోకి వచ్చాయి.యూనస్ దేనికి వారధి?తను స్థాపించిన గ్రామీణ్ బ్యాంక్ ద్వారా బీదాబిక్కీకి రుణ సాయం అందిస్తూ వారి పాలిట దేవుడిగా కీర్తించబడి 2006లో నోబెల్ శాంతి బహుమతి పొందిన మహమ్మద్ యూనస్ను గద్దె ఎక్కించడంతో బంగ్లాదేశీయుల ప్రజాస్వామ్య ఆశలు మరింత బలపడ్డాయి. అయితే అవి వమ్ము కావడానికి ఎంతో కాలం పట్టలేదు.నోబెల్ కమిటీ యూనస్ను ఎంపిక చేయడానికి గ్రామీణ్ బ్యాంకు ద్వారా ఆయన సేవలు అందించారనడం అనేది పైకి కనిపించే కారణం మాత్రమే! భౌగోళిక రాజకీయాలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. ఇస్లాముకూ, పశ్చిమ దేశాల ప్రజలకూ నడుమ యూనస్ ఒక వారధి లాంటి వాడని కమిటీ అధ్యక్షుడు ఆయనకు అవార్డు ప్రకటిస్తూ అభివర్ణించారు. 2001 సెప్టెంబర్ 11న యూఎస్ మీద జరిగిన టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో ‘ఇస్లామును ఒక భూతంగా చూసే విస్తృత ధోరణి’ని ఎదుర్కోవడానికి యూనస్ ఎంపిక తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. యూనస్ తరఫున అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ లాబీయింగ్ చేయడం వెనుక అసలు కారణం ఇదే!దేశంలో సమూల సంస్కరణలు ప్రవేశపెడతాననీ, ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తాననీ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధినేతగా సైన్యం వెన్నుదన్నుతో పగ్గాలు చేతబట్టిన యూనస్ దేశ ప్రజలకు వాగ్దానం చేశారు. అయితే ఎన్నికలు పదే పదే వాయిదా పడుతున్నాయి. ఇలా ఉండగా, రాజ్యాంగ బద్ధత లేనప్పటికీ, మధ్యంతర ప్రభుత్వం అనేక స్వతంత్ర సంస్థల్లో పెనుమార్పులు ప్రకటిస్తోంది. వీటిలో భాగంగా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తినీ, సీనియారిటీ పరంగా ఆయన తర్వాతి స్థానాల్లో ఉండే అయిదుగురు న్యాయమూర్తులనూ పదవుల నుంచి తొలగించింది. హసీనా పార్టీ అవామీ లీగ్ను నిషేధించింది. దేశంలోనే అతి పెద్దదైన ఈ రాజకీయ పార్టీ నాయకత్వంలోనే బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.వీధుల్లో బీభత్స కాండమానవ హక్కులను కాపాడవలసిన ప్రభుత్వమే వాటిని ఉల్లంఘిస్తోంది. నిరసనలను అణచివేస్తోంది. న్యాయవాదులు, విద్యా వేత్తలు, పాత్రికేయులు, ప్రతిపక్ష నేతలను, హసీనా మద్దతుదారు లను మూకుమ్మడిగా జైళ్లకు పంపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అనేక వేల మందిని నిర్బంధంలోకి తీసుకుంది. హత్యలు వంటి అభియోగాలు మోపి జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెడు తోంది. వారిపై పెరిగిపోయిన దాడుల పట్ల అంతర్జాతీయ మీడియా పరిశీలక సంస్థలు ఆందోళన ప్రకటిస్తున్నాయి. దేశంలో కస్టడీ హత్యలు, చిత్రహింసలు మామూలు అయ్యాయి.ఇస్లామిస్టు ఉగ్రవాదులకు పునరావాసం కల్పించే కొత్త పరి ణామం మరింత ఆందోళన కలిగిస్తోంది. యూనస్ నాయకత్వంలోని మిలిటరీ–ముల్లా ప్రభుత్వం జిహాదీ గ్రూపుల మీద నిషేధాలు ఎత్తివేసింది. కరడు గట్టిన ఉగ్రవాద నాయకులకు స్వేచ్ఛ ప్రసాదించింది. అంతకంటే ఘోరంగా, అనేక మంది ఉగ్రవాదులు మంత్రి పదవులు, ఉన్నత ప్రభుత్వోద్యోగాలు పొందారు. వారి అనుచర గణాలు ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. బౌద్ధులు, క్రైస్తవులు, హిందువులు, గిరిజన తెగల మీద దాడులు చేస్తున్నారు. ‘ఇతర’ ఇస్లామిక తెగలనూ వారు విడిచి పెట్టడం లేదు. ఈ దాడులను నేరాలుగా పరిగణించక పోవడం విశేషం. స్త్రీలు ధరించే దుస్తులను సాకుగా చూపి, వారి మీదా దాడు లకు తెగబడుతున్నారు. తాలిబన్ శైలిలో ‘మోరల్ పోలీసింగ్’ సంస్కృతి వ్యాప్తి చెందుతోంది. పరిస్థితి ఎంత దుర్మార్గంగా తయా రైందంటే, ఆఖరుకు అవామీ లీగ్ పార్టీకి బద్ధ వ్యతిరేకమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సైతం ఈ మౌలిక హక్కుల హననాన్ని, ‘మతం పేరిట రేగిన ఉన్మాదం’గా, ‘వీధుల్లో బీభత్స కాండ’గా అభివర్ణిస్తోంది.పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది. జీడీపీ వృద్ధి కుప్పకూలింది. విదేశీ రుణం పెరిగి పోయింది. ద్రవ్యోల్బణం 12 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. ఇన్వెస్టర్ల విశ్వాసం క్షీణించడంతో, స్టాక్ మార్కెట్ అయిదేళ్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఉద్యోగాలు పోతున్నాయి. ఉపాధి దొరకడం లేదు. జీవన ప్రమాణాలు తిరోగమిస్తున్నాయి. ఇలాంటి ఆర్థిక వ్యవస్థ ఉగ్రవాద వ్యాప్తికీ, సామాజిక అశాంతికీ దారి తీస్తుంది.ఇండియాకూ గట్టి దెబ్బముస్లిం మెజారిటీ దేశంలో లౌకిక ప్రజాస్వామ్యానికి బంగ్లాదేశ్ ఒకప్పుడు చిరునామాగా ఉండేది. కోవిడ్–19 మహమ్మారి ముంచు కొచ్చే వరకు ఆర్థిక అభివృద్ధి, సామాజిక స్థిరత్వం దిశగా పురోగమించింది. ఏ దేశం నుంచి విడిపోయేందుకు విముక్తి ఉద్యమం చేసిందో ఆ దేశం బాటలోనే ప్రయాణించే దుఃస్థితి నేడు బంగ్లాదేశ్కు పట్టింది. బంగ్లాదేశ్ దుష్పరిణామాల ప్రభావం ఈ ప్రాంతం అంతటా పడుతుంది. బంగ్లాదేశ్కు మూడు వైపులా సరిహద్దుగా ఉన్న ఇండి యాలోకి అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు ప్రవేశించారు. హసీనా హయాంలో ఉగ్రవాద నిరోధకత, ప్రాంతీయ సంధాయకత అంశాల్లో ఇండియాకు బంగ్లాదేశ్ అత్యంత సన్నిహిత భాగస్వామిగా ఉండేది. ఆమె ప్రభుత్వం కూలిపోవడం... వ్యూహాత్మక ప్రయోజ నాల పరంగా ఇండియాకు గట్టి దెబ్బ. ఇప్పుడు ఆ వైపున కూడా సరిహద్దు భద్రత పెంచడం అనివార్యం అయ్యింది. లేదంటే, బంగ్లా దేశ్ నుంచి కూడా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే ప్రమాదం పొంచివుంది.హసీనా పదవీచ్యుతి వల్ల ఎదురు కానున్న ప్రమాదాలను ఇండియా తక్షణం గుర్తించినప్పటికీ, అమెరికా అందుకు విరుద్ధంగా ఆ మార్పును స్వాగతించింది. అయితే, బంగ్లాదేశ్ ఇదే పంథాను కొనసాగిస్తే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ సుస్థిరత సౌభాగ్యాల కోసం యూఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న కృషి కొరగాకుండా పోతుంది. సుదూర దేశాలను సైతం ముగ్గులోకి దించే మరో అంత ర్జాతీయ స్థాయి ఉద్రిక్త కేంద్రంగా బంగ్లాదేశ్ అవతరిస్తుందని పరి శీలకులు హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలు, మత స్వేచ్ఛ, ప్రాంతీయ సుస్థిరతలను పరిరక్షించాల్సిన తక్షణ అవసరాన్ని అంతర్జాతీయ సమాజం సీరియస్గా తీసుకోవాలి, బంగ్లాదేశ్ అధః పతనాన్ని ఇక ఎంత మాత్రం ఉపేక్షించకూడదు.బ్రహ్మ చేలానీ వ్యాసకర్త న్యూఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్’ ఎమిరెటస్ ప్రొఫెసర్ (‘ప్రాజెక్ట్ సిండికేట్’ సౌజన్యంతో) -
దీపావళి కానుకపై ఆశలు
దేశవ్యాప్త వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)ని ఎనిమిదేళ్ళ క్రితం అట్టహాసంగా ప్రారంభించారు. ఆ సందర్భంగా అర్ధరాత్రి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించారు. దేశాన్ని ఉమ్మడి ఆర్థిక మార్కెట్గా ఏకీకృతం చేసే చారిత్రక సంస్కరణగా దాన్ని కొనియాడారు. పరోక్ష పన్నులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తున్నామన్నారు. ఘర్షణలు, ఎగవేతలను నిర్మూలిస్తుందని చెప్పారు. ఎక్సైజ్, సర్వీసు పన్నులను విధించే హక్కును కేంద్ర ప్రభుత్వం వదులుకోవడంతో సాయలాపాయలాగా కుదుర్చుకున్న వ్యవహారంగా జీఎస్టీ సంస్కరణ ఆమోదం ఖ్యాతికెక్కింది. దానికి తగ్గట్లుగానే అన్ని రాష్ట్రాలూ రాష్ట్ర స్థాయిలో విధించే అమ్మకం పన్నులు, విలువ–జోడింపు పన్ను, ఆక్ట్రాయ్ వంటి ఇతర చిన్నా చితకా పన్నులను విధించే హక్కును కేంద్రానికి దత్తం చేశాయి. రాష్ట్రాలకు పన్నుల రాబడులలో ఏర్పడే లోటును తాము భర్తీ చేస్తామని కేంద్రం వాగ్దానం చేయడం వల్ల ఆ రాజీ బేరం కుదిరింది. రాష్ట్రాలు పన్నుల విధింపులో ఉన్న స్వయం ప్రతిపత్తిని త్యాగం చేశాయి. దీన్ని 2017 నాటి తొలి చట్టంలో జీఎస్టీ పరిహార క్లాజుగా చేర్చారు. ఆ క్లాజు గడువు 2022తో పూర్తయింది. ఇపుడు జీఎస్టీలో తమ వాటా ఒక్కసారిగా బాగా తగ్గిపోయే ప్రమాదం ఉందని రాష్ట్రాలు భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ‘దీపావళి కానుక’గా జీఎస్టీలో పెద్ద సంస్కరణనే తీసుకురానున్నట్లు ప్రకటించడం హర్షణీయం. తదుపరి సంస్కరణలు సాధారణ ప్రజానీకంపై, ముఖ్యంగా మధ్యతరగతి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలపై పన్ను భారాన్ని తగ్గించేవిగా ఉంటాయని ఆయన వాగ్దానం చేశారు. సంస్థాగత సంస్కరణలు, రేటు హేతుబద్ధీకరణ, బతుకు తెరువును సులభతరం చేయడమనే మూడు అంశాలను ప్రభుత్వం పరిగణించవచ్చు.పుట్టుకలోనే లోపాలురూపకల్పన, అమలులో కూడా ఏకీకృత, దేశవ్యాప్త, పరోక్ష పన్నుగా జీఎస్టీ పుట్టుకలోనే కొన్ని లోపాలున్నాయని చెప్పక తప్పదు. రూపకల్పనలోని లోపం ఏమిటంటే, జీఎస్టీ వంటి పరోక్ష పన్ను అంతర్గతంగానే తిరోగమనమైనది. ఒక వ్యక్తి చెల్లించే పన్ను ఆ వ్యక్తి ఆదాయంపైన కాక, కొనే వస్తువు విలువపై ఆధారపడి ఉంటుంది. కనుక, జీఎస్టీ మంట ధనికుల కన్నా పేదలకు ఎక్కువ తెలుస్తుంది. ఆదాయ పన్ను, సంపద పన్ను వంటి ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నుల కన్నా ఔచిత్యంతో కూడినవిగా ఉంటాయి. మీ పన్ను ఆదాయంతోపాటే పెరుగుతుంది. ఆదాయం తగ్గితే పన్ను ఉండదు.జీఎస్టీలోని అసమంజసత్వాన్ని తగ్గించేందుకు బహుళ శ్లాబులు పెట్టారు. పేదలు కొనే వస్తువులను సున్నా లేదా 5 శాతం శ్లాబులో పెట్టారు. ధనికులు కొనే వస్తువులను హెచ్చు శ్లాబులో పెట్టారు. ఇది ఒక రకంగా పేదలు ఏ వస్తువులను వాడాలో శాసించడమవుతుంది. సాధారణంగా ఆహారం, ఔషధాలను పన్నుల నుంచి మినహా యించే విధానం ప్రపంచ వ్యాప్తంగా అమలులో ఉంది. అన్ని వస్తు వులు, సేవలకు ఒకే రేటు ఉండటం హేతుబద్ధమైన, సమర్థమైన వ్యవస్థ అనిపించుకుంటుంది. యూరోపియన్ యూనియన్ దేశాలు, సింగపూర్, ఆస్ట్రేలియాలలో అది కనిపిస్తుంది. మధ్యస్థ రేటు ఉండా లన్నది స్థూలంగా అంగీకరించే సూత్రం. (ఆహారం, ఔషధాలు వంటి) అత్యవసర వస్తువులపై చాలా తక్కువగా, (పొగాకు, మద్యం వంటి) వ్యసన, విలాస వస్తువులపై చాలా ఎక్కువగా ఉంటుంది. సులభతర శ్లాబులు మేలుఇక అమలులో లోపాల గురించి ముచ్చటించుకుందాం. జీఎస్టీ బహుళ పన్ను శ్లాబుల (0 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం, పాప కార్యాల కింద వచ్చే వాటిపై వేసే పన్ను, వివిధ సెస్సులు)తో కూడిన సంక్లిష్ట వ్యవస్థ. ఈ సంక్లిష్టత, వస్తువులు, సేవల వర్గీకరణ, పన్ను చెల్లింపుదారులలో అయోమయం, వ్యాజ్యాలు వంటి వివాదాలకు దారితీస్తోంది. అంతిమ వస్తువుల పైన కన్నా ఆ యా వస్తువులను తయారు చేసేందుకు ఉపయోగించే వస్తువులపై పన్ను రేట్లు అధికంగా ఉన్న దృష్టాంతాలు కూడా ఉన్నాయి. ఇది దేశంలో వస్తూత్పత్తిని నీరుగారుస్తోంది. వ్యవసాయం, పెట్రోలు ఉత్పత్తులు, విద్యుచ్ఛక్తి, ఆల్కహాల్, స్థిరాస్తుల రంగం వంటి జీడీపీలోని పెద్ద భాగాలు... జీఎస్టీ పరిధికి బయటనే కొనసాగుతున్నాయి. కొన్నింటికి మినహాయింపు ఇవ్వడం వల్ల రెవెన్యూ తగ్గుతుంది. జీఎస్టీ సంస్కరణలోని స్ఫూర్తి దెబ్బతింటోంది. చిన్న వ్యాపారాల వారు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల వారిపై భారం పడుతోంది. కారణం– వారు వెంటనే జీఎస్టీ చెల్లించాల్సి రావడం, వారి ఖాతాదారులు చెల్లింపులలో జాప్యం చేయటం! రిఫండులలో జాప్యాలు ఉండనే ఉన్నాయి. ఇవి వ్యాపారు లకు చేతిలో నగదు ఆడకుండా చేస్తున్నాయి. ప్రధాని ప్రకటించిన ప్రతిపాదిత సంస్కరణల్లో ఒకటి గణ నీయమైన మార్పు తీసుకురాగల ఆశ రేపుతోంది. అది ప్రస్తుత బహుళ శ్లాబుల పద్ధతిని రద్దు చేసి, రెండు (స్టాండర్డ్, మెరిట్ ) రేట్ల శ్లాబుల సులభతర విధానానికి మళ్ళడం! కొన్ని ఎంపిక చేసిన వస్తువులపైన మాత్రం ప్రత్యేక రేట్లు ఉంటాయి. వ్యాజ్యాలతోపాటు, వర్గీకరణకు సంబంధించిన వివాదాలు తగ్గుతాయి. దైనందిన వాడుక వస్తువులు, జనం సమకూర్చుకోవాలని ఆశపడే వాటిపై పన్ను రేటు తగ్గుతుందని భావిస్తున్నారు. వినిమయం పెరగడం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రేట్లు తగ్గించడం వల్ల భారతదేశపు ఎగుమతుల పోటీ సామర్థ్యం పెరుగుతుంది. దేశంలో ఉద్యోగాల కల్పనకూ సాయపడుతుంది. మధ్యస్థ రేటును మరీ భారం మోపేదిగా ఉన్న 18 శాతంగా కాక 15 శాతంగా నిర్ణయించవచ్చు. పన్నుల సంస్కరణలపై ఏర్పాటు చేసిన కేల్కర్ సత్వర కార్యాచరణ బృందం సిఫార్సు చేసినట్లుగా దాన్ని 15 శాతంకన్నా తక్కువగా 12 శాతంగా నిర్ణయిస్తే ఇంకా బాగుంటుంది. రాష్ట్రాలకు చేయి తిరిగేలా...చివరగా, ఫెడరలిజంలో (ఆరోగ్యం, విద్య వంటివాటిపై) వ్యయాల బాధ్యతలను రాజ్యాంగం రాష్ట్రాల పైనే మోపింది. కానీ, స్వతంత్ర ఆదాయ వనరులను మాత్రం కొద్దిగానే కల్పించింది. ఈ అసమతౌల్యాన్ని జీఎస్టీ ఇంకా పెంచి, కేంద్ర బదలాయింపులపైనే రాష్ట్రాలు ఎక్కువగా ఆధారపడక తప్పని స్థితి కల్పించింది. స్థానిక అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి నిధుల సమీకరణకు రాష్ట్రాలకు పన్నులు విధించే అధికారం కొంత కావాలి. జీఎస్టీ భారతదేశపు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసిందనే అభిప్రాయం ఒకటి ఉంది. రాష్ట్రాలకు కోశాగారాన్ని విస్తరించుకునే, స్వయం ప్రతిపత్తిని కల్పించే అవకాశాన్ని పునరుద్ధరించేందుకు అన్వేషించవలసిన అవసరం ఉంది. ఫలితంగా, రాష్ట్రాలు వాటి నిర్దిష్ట ఆర్థిక, సామా జిక, ప్రాంతీయ అవసరాలకు తగ్గట్లుగా విధానాలు రూపొందించు కోగలుగుతాయి. అసమానతలను తగ్గించేందుకు, ప్రస్తుతం పరోక్ష పన్నుల వైపు తూగిన తక్కెడను ప్రత్యక్ష పన్నుల వైపు మొగ్గే విధంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. అజీత్ రానాడే వ్యాసకర్త ఆర్థికవేత్త (‘దక్కన్ హెరాల్డ్’ సౌజన్యంతో) -
శాంతి సాధనలో మూడు ముక్కలాట
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 15న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో, 18 నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నాయ కులతో జరిపిన చర్చలు ఆశాభావాన్ని కలిగిస్తున్నాయి. అందుకు సంబంధించి ఉండిన చివరి అనుమానాలు 18 నాటి వైట్ హౌస్ సమావేశంతో తీరిపోయాయి. అంతకుముందు 15న అలాస్కాలో ట్రంప్, పుతిన్ల మధ్య జరిగిన చర్చలలో కనిపించిన సానుకూలతను జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నాయకులు వైట్హౌస్ సమావేశంలో భంగపరచవచ్చుననే సందేహా లుండేవి. శాంతి ప్రయత్నాలకు ముందు కాల్పుల విరమణ జరిగి తీరాలనే పట్టుదలతో ఉండిన ఆ బృందం, ట్రంప్ ఆలోచనను తిరిగి మార్చవచ్చుననే భావన చాలా మందికి కలిగింది. కానీ, అది గ్రహించి కావచ్చు 18 నాటి చర్చలకు ముందు రాత్రే ట్రంప్, కేవలం కాల్పుల విరమణ వల్ల ఉపయోగం లేదనీ, పూర్తి స్థాయిలో శాంతి కోసం ప్రయత్నం జరగాలనీ స్పష్టం చేశారు.పుతిన్ వాదనను అంగీకరించిన ట్రంప్అంతిమంగా అలాస్కా, వైట్ హౌస్ భేటీల సారాంశం ఏమిటి? మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంపై అమెరికా, రష్యా అధ్యక్షులు మొదటిసారి సమావేశమయ్యారు. వెంటనే కాల్పుల విరమణకు పుతిన్ను ఒత్తిడి చేయగలనని, అందుకు సమ్మతించని పక్షంలో తీవ్ర మైన చర్యలు తీసుకోగలనంటూ వెళ్లారు ట్రంప్. అక్కడ మూడు గంటల చర్చలలో పుతిన్ ఇచ్చిన సుదీర్ఘమైన వివరణలతో పూర్తిగా సంతృప్తి చెంది, కాల్పుల విరమణ వల్ల ప్రయోజనం లేదని,సంపూర్ణ స్థాయిలో శాంతి సాధనే సరైన మార్గమనే వాదనతో అంగీ కరించారు. చంచల స్వభావిగా పేరున్న ఆయన అటువంటి అభిప్రా యంపై స్థిరపడటం ఈ కథాక్రమంలోని కీలకమైన మలుపు. పుతిన్ వాదన నచ్చినప్పటికీ అట్లా స్థిరపడక పోయి ఉంటే, యూరోపియన్ల సమావేశంలో తన ఆలోచనను తిరిగి మార్చుకునే వారేమో! అపుడు విషయం మళ్లీ మొదటికి వచ్చేది. జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడరిక్ షుల్జ్, యూరోపియన్ నాయకుల తరఫున మాట్లాడుతూ, శాంతి చర్చల కన్నా ముందు కాల్పుల విరమణ తప్పనిసరియని వాదించారు. కానీ ట్రంప్ జర్మనీ ఛాన్స్లర్ మాటను తోసిపుచ్చారు.ఈ ఒక్క విషయమే ఇంతగా చెప్పుకోవటం ఎందుకంటే, ఈ దశలో మొత్తం విషయమంతా అమెరికా అధ్యక్షుడు ఎవరి వాదనను అంగీకరించి ముందుకు పోగలరన్న దానిపైనే ఆధారపడి ఉంది. ఇపుడు రెండు చర్చల అనంతరం అందుకు స్పష్టత వచ్చినందున ఇతర విషయాలను చూద్దాము. అవి ప్రధానంగా మూడు. ఒకటి– రష్యా కోరుతున్న భూభాగాలను ఉక్రెయిన్ వదలుకోవటం; రెండు– ఉక్రెయిన్ ‘నాటో’లో చేరకపోవటం; మూడు– ఉక్రెయిన్కు భవిష్యత్తులో భద్రత కోసం రక్షణ హామీలు లభించటం. ఈ మూడు అంశాలు కూడా అలాస్కాలో, వైట్ హౌస్లో ప్రస్తావనకు వచ్చాయి. రష్యా తాను ఇప్పటికే పూర్తిగానో, పాక్షికంగానో ఆక్రమించిన క్రిమియా, డొనెటెస్క్, జపోరిజిజియా, ఖేర్సాన్, లుహాన్స్క్, ఖార్కివ్ ప్రాంతాలను తమకు అప్పగించటం, ఆ యా నియంత్రణ రేఖలను అదే స్థాయిలో స్తంభింపజేయటం జరగాలని కోరుతున్నది. అవి అన్నీ కాకపోయినా ఏదో ఒక మేరకు వదులుకోవాలని ట్రంప్ మొదటినుంచి అంటున్నారు. యూరోపియన్ నాయకుల వైఖరి ఇంచుమించు అదే! వైట్ హౌస్ చర్చల సందర్భంలో అవుననక, కాదనక... అది జెలెన్స్కీ తేల్చుకోవలసిన విషయమని వదలి వేశారు. భూభాగాలను వదలుకొనే ప్రసక్తి లేదని జెలెన్స్కీ అంటూనే, అది తనకు, పుతిన్కు, ట్రంప్కు మధ్య త్రైపాక్షిక చర్చ లలో తేలుతుందని మరొకవైపు సూచిస్తున్నారు. ఈ పరిణామాల న్నింటినీ పరిగణనలోకి తీసుకున్నపుడు, రష్యా డిమాండ్లలో ఒకటి కొలిక్కి రాగల అవకాశాలు సూత్రరీత్యా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ ‘నాటో’లో చేరకూడదు...‘నాటో’లో ఉక్రెయిన్ సభ్యత్వం విషయానికి వస్తే, రష్యా డిమాండ్కు అమెరికా అధ్యక్షుడు మొదటి నుంచీ సానుకూలంగా ఉన్నారు. అసలు ఉక్రెయిన్ ఆ సంస్థలో చేరాలనుకోవటమే రష్యా అభద్రతా భావానికి, ఈ దాడికి మూల కారణమని కూడా అన్నారు. అటువంటి వైఖరి తీసుకున్న తర్వాత ఇక ఉక్రెయిన్ ఆ సైనిక కూట మిలో చేరగల అవకాశం ఉండదు. వాస్తవానికి అందులో చేరాలనే మాట ఉక్రెయిన్ రాజ్యాంగంలో లాంఛనంగా ఉన్నప్పటికీ, ఆ పట్టుదల యూరోపియన్ దేశాలదే! రష్యాను క్రమంగా చుట్టుముట్టి, ఛిన్నాభిన్నం చేయాలన్నది వారికి గతం నుంచి గల దీర్ఘకాలిక ప్రణాళిక. అయితే, ఈ ఒప్పందాల క్రమంలో ఉక్రెయిన్ తామిక ‘నాటో’లో చేరబోమంటూ రాజ్యాంగపరంగా ప్రకటించవలసి ఉంటుందన్నది రష్యా డిమాండ్. అది జరగాలని ట్రంప్ కూడా ఒత్తిడి చేయవచ్చు. అదే జరిగితే యూరోపియన్ నాయకులు చేయ గలిగింది ఉండదు. ఆ విధంగా శాంతి సాధనకు మరొక అడ్డంకి తొలగిపోతుంది. ఉక్రెయిన్లోని రష్యన్ జాతీయుల హక్కుల పరి రక్షణ వంటి మరికొన్ని అంశాలు ఉన్నాయి గానీ, ఇతరత్రా గల ప్రధాన సమస్యలు పరిష్కారమైనపుడు అవీ కావచ్చు.ఉక్రెయిన్కు ఆందోళనకరంగా ఉన్న ప్రధానాంశం తమ రక్షణ. చర్చలలో రష్యా అధ్యక్షుడు మొట్టమొదటిసారిగా అందుకు కొన్ని సడలింపులు చూపటం శాంతి సాధనకు మార్గాన్ని సుగమం చేసింది. అక్కడ ట్రంప్తో పుతిన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్కు భద్రత ఏర్పడటం తప్పనిసరి అవసరమని, అక్కడి ప్రజల మూలాలూ తమ ప్రజల మూలాలూ ఒకటేనని, కనుక వారికి రక్షణ ఏర్పాట్లకు ఎటు వంటి అభ్యంతరమూ లేదని అన్నారు. ఆ భద్రత ఏ రూపంలోన న్నది ప్రశ్న. ‘నాటో’లో చేరేందుకు వీలు లేదన్న పుతిన్ డిమాండ్ను ట్రంప్ అంగీకరించారు. అట్లా చేరకపోయినా 5వ ఆర్టికల్ను పోలిన రక్షణలు కల్పించగలమని ట్రంప్ సూచించగా అందుకు పుతిన్ సమ్మతించారు. ఆర్టికల్ 5 అనే మాట ప్రచారంలోకి వచ్చినట్లు అందులోని వివరాలు ప్రచారంలోకి రాలేదు గానీ, అవి గమనించ దగ్గవి. నాటోలోని ఏ దేశంపై అయినా బయటి దేశం దాడి జరిపితే అది మొత్తం నాటో కూటమిపై జరిగిన దాడిగా పరిగణించి అందరూ ఆ దేశానికి మద్దతుగా కదలివస్తారు. కానీ దాని అర్థం అందరూ యుద్ధంలో ప్రవేశిస్తారని కాదు. ఎవరు ఏ రూపంలో పాల్గొంటారన్నది వారి నిర్ణయం. ఉక్రెయిన్ నాటోలో లేకపోయినా అమెరికా సహా అందరూ తమ తమ సహాయాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో గుర్తించవలసింది మరొకటి ఏమంటే, ఉక్రెయిన్కు అంద జేసే ఆయుధాలన్నీ ఖరీదుకేగానీ ఉచితంగా కాదు. వైట్హౌస్ చర్చలు సానుకూలంగా ఉన్నట్లు భావించిన ట్రంప్ ఆ వెంటనే పుతిన్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇక ఇరుపక్షాలూ సన్నద్ధమైతే మొదట రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య ద్వైపాక్షికంగా, తర్వాత అమెరికా అధ్యక్షుని చేరికతో త్రైపాక్షికంగా చర్చలు జరుగు తాయి. శాంతి దిశగా అడుగులైతే పడుతున్నాయి. ఇందుకు తిరిగి ఏ భంగమూ కలగదని ఆశించాలి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మనమంటే మొహం మొత్తిందా?
ఇండియాపై ట్రంప్కు మొహం మొత్తిందా? ఆయన తన చేతల ద్వారా అదే విషయాన్ని తెగేసి చెబుతున్నారా? ఆయన మనపై 50% సుంకాలు విధించారు. సుంకాలపై వివాదం పరిష్కారమ య్యేంత వరకూ వాణిజ్య చర్చలను సుప్తావస్థలో పెడుతున్నట్లు ఆయన తెలి పారు. భారతదేశ మృతప్రాయ ఆర్థిక వ్యవస్థ నట్టేట మునిగినా తాను లెక్క చేయబోనని కరాఖండీగా చెప్పేశారు. రష్యా చమురును కొంటూ, అమెరికా జాతీయ భద్రతకు భారత్ ముప్పు తెస్తోందని ట్రంప్కు వాణిజ్య సలహాదారైన పీటర్ నవారో ప్రకటించారు. పుతిన్తో ట్రంప్ చర్చలు విఫలమైతే భారత్పై సెకండరీ సుంకాలు పెరగ వచ్చని ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ వెల్లడించారు. యూరప్ కూడా భారత్పై సెకండరీ సుంకాలు విధించాలని ఆయన కోరారు. అమె రికా స్నేహహస్తం నుంచి భారత్ చేజారిందని ఇవన్నీ సూచిస్తున్నాయా? చైనా, రష్యాలను హెచ్చరించేందుకు భారత్ను ట్రంప్ వాడు కుంటున్నారనే అభిప్రాయమూ ఉంది. అది కూడా సంతోషపడదగ్గ అంశం కాదు. మనం ఆనుషంగిక నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. మనం ఏమైపోయినా నిజంగానే, ఆయనకు పట్టదు.మరోపక్క, ట్రంప్ పాకిస్తాన్తో ప్రేమలో పడినట్లు కనిపిస్తోంది. అదీ మనల్ని సంకటంలో పడేసే సంగతే. ఆయన పాక్పై 19% సుంకాలే విధించారు. ఆయన ప్రభుత్వం ఇస్లామాబాద్ను ఉగ్రవాదంపై పోరాటంలో ‘అసాధారణ భాగస్వామి’గా పరిగణి స్తోంది. ‘ఉగ్రవాద సంస్థలను అరికట్టడంలో విజయాలను కొనసా గిస్తున్నందుకు’ అది ఇటీవల పాకిస్తాన్ను కొనియాడింది. ట్రంప్... పాక్ ఫీల్డ్ మార్షల్ మునీర్ను విందుకు ఆహ్వానించి, చమురును వెలికితీయడంలో పాక్కు సాయపడతామని చెప్పారు. నిజం చెప్పా లంటే, ఏదో ఒక రోజున పాక్ నుంచి భారత్ కూడా చమురును కొనుగోలు చేసే రోజు రావచ్చని, ఆయన మనల్ని కవ్వించారు.అంటే, ఆయనకు పాకిస్తాన్ కొత్త ముద్దుగుమ్మగా మారినట్లా? రష్యన్ చమురు ఢిల్లీని చీకాకుపరచే అంశంగా మారడమేకాదు, అది పరిష్కారమయ్యేంత వరకూ భారత్తో వాణిజ్య చర్చలు జరి పేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు కనుక మొదట దానిపై దృష్టి కేంద్రీకరిద్దాం. పైగా, జరిమానా కింద మరిన్ని సుంకాలు విధిస్తా మని బిసెంట్ హెచ్చరించారు. సత్యం ఏమంటే, రష్యన్ చమురు కొనేటట్లుగా ఇండియాను బైడెన్ ప్రభుత్వం ప్రోత్సహించింది. ‘వాస్తవానికి, ధరపై పరిమితి ఉన్న రేటు వద్ద రష్యన్ చమురు కొనుగోలు చేయాల్సిందిగా మేము (అమెరికా) కోరబట్టే వారు (ఇండియా) కొనుగోలు చేశారు...ఎందుకంటే, చమురు ధరలు పెరగడం మాకిష్టం లేదు. వారు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించారు’ అని ఢిల్లీలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటి 2024 మే నెలలో చెప్పారు. ట్రంప్ ఈరోజు, తనకు ముందున్న ప్రభుత్వ విధానాన్ని కావాలని ఉపేక్షిస్తూ, ఇండియాను నిందిస్తున్నారు. ఈ విషయంలో ట్రంప్ ఆత్మవంచన తేటతెల్లమవుతోంది. రష్యా నుంచి అమెరికా పాలాడియం, యురేనియం హెక్సాఫ్లోరైడ్, ఎరువులు, రసాయనాలను దిగుమతి చేసుకుంటూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే, గడచిన ఆరు నెలల్లో ఈ దిగుమతుల పరిమాణం గణనీయంగా పెరిగిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక వార్తాకథనంలో పేర్కొంది. రష్యా నుంచి అమెరికా స్వేచ్ఛగా దిగుమతి చేసుకుంటున్నప్పుడు లేని అభ్యంతరం, ఇండియా పట్లనే ఎందుకు? ఇక మూడవ అంశం – ట్రంప్ అసలు ఉద్దేశాలను బయట పెడుతోంది. ఆయన ద్వంద్వ ప్రమాణాలకు ఇది మరో నిదర్శనం. రష్యా చమురును పెద్దయెత్తున దిగుమతి చేసుకుంటున్న, మూడవ పెద్ద దిగుమతిదారులుగా ఉన్న చైనా, తుర్కియేలను ట్రంప్ హెచ్చరించ లేదు. రష్యన్ చమురు దిగుమతి చేసుకుంటున్న హంగరీ, స్లొవేకియా – రెండూ యూరప్ దేశాలు, ‘నాటో’లో సభ్యత్వం ఉన్నవీనూ! కానీ ట్రంప్ పల్లెత్తు మాట అనడం లేదు. ఈ ఏడాది జూన్ నుంచి జపాన్ కూడా దిగుమతి చేసుకుంటున్న సంగతిని ఆయన సమయానుకూలంగా విస్మరిస్తున్నారు. చైనాపై సుంకాల విధింపులో ఇచ్చిన విరామాన్ని ఆయన ఇటీవల మరో 90 రోజులు పొడిగించారు. ఆయన ఢిల్లీపైన మాత్రమే మూడవ కన్ను తెరిచారని స్పష్టమవుతోంది. ఈ సమస్యకు సంబంధించి మరో పార్శ్వం కూడా అంతే కలవరపరుస్తోంది. ‘క్వాడ్’ (ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమె రికా)లోని మిగిలిన మూడు దేశాలతో తనకు అవసరం తీరిపోయిందని ట్రంప్ భావిస్తున్నారని... ఆయన వైఖరి, నడతను బట్టి అర్థం చేసుకోవచ్చా? అదే నిజమైతే, ఇండో–పసిఫిక్ వ్యూహం విషయంలో అమెరికా వైఖరి ఏమిటి? చైనాతో మనకున్న సమస్యల దృష్ట్యా ‘క్వాడ్’ కూటమి మనకు ఊరటనిచ్చిన మాట నిజం. ‘క్వాడ్’ పట్ల ట్రంప్ నిబద్ధత చూపకపోతే, అది మనకు మరిన్ని చిక్కులు సృష్టించవచ్చు.చైనాతో ట్రంప్ ఆర్థిక ఒప్పందానికి వస్తారా? ఊహించడం కష్టం. కానీ, షీ జిన్ పింగ్తో శిఖరాగ్ర సమావేశమై ఆయన ఇప్పటికే మాట్లాడుతున్నారు కనుక, అటువంటి దానికి అవకాశం ఉందని పిస్తోంది. చైనాను రాజకీయంగా మరింత మెరుగ్గా అవగాహన చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందా అనేది ప్రశ్న. బీజింగ్ ప్రాంతీయ ఆకాంక్షలకు అమెరికా మరింత వెసులుబాటు కల్పిస్తుందా? ఒకవేళ అదే కార్యరూపం ధరిస్తే, చైనాతో సరిహద్దు వివాదంపై అమెరికా మద్దతు మనకు కొనసాగుతుందా? ఈ విషయమై మనం ఎటువంటి వైఖరిని అనుసరించాలన్నది పెద్ద ప్రశ్న? జవాబు కోసం మనం గాభరా పడాల్సిన అవసరం లేదు. మన నుంచి దిగుమతి చేసుకోకపోతే బతకలేమన్నంతగా, అమెరికా మొహం వాచి చూస్తున్నవాటిని మనం ఏమీ అమెరికాకు ఎగుమతి చేయడం లేదు. చైనా వద్ద రేర్ ఎర్త్ ఖనిజాలు, లోహాలు ఉన్నాయి. మనకి లేవు! కనుక, బేరసారాలకి మనకున్న అవకాశం తక్కువ. మనకున్న ఆశ ఒక్కటే! ఉక్రెయిన్పై పుతిన్–ట్రంప్ ఒక ఒప్పందానికి రాగలిగితే, అది మనపై విధించిన సెకండరీ ఆంక్షలను ఎత్తివేయడానికి తోడ్పడవచ్చు. అమెరికా దృష్టిలో భారత్ ఇప్పటికీ ఉందని స్కాట్ బిసెంట్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. అనుకున్నట్లు జరగకపోతే ట్రంప్ తీవ్ర ఆగ్రహ జ్వాలలకు మనం గురికావాల్సిందే!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మన ముందున్న 'ఏఐ' బాధ్యత
కశ్మీర్లో మళ్ళీ హింసాయుత సంఘట నలు పెచ్చుమీరడం చూశాక, రణ తంత్రంలో టెక్నాలజీ, ముఖ్యంగా జనరే టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (జెన్ ఏఐ) పాత్ర గురించిన ప్రశ్నలు నా మెదడును తొలవడం ప్రారంభించాయి. మీరు బత కండి, ఇతరులను బతకనివ్వండి అనే తాత్త్వికత భారతదేశానికి పునాది. అంత మాత్రాన దురాక్రమణను చూస్తూ ఊరు కుంటామని కాదు. ఫినాన్షియల్ సర్వీసులు, ఏరోస్పేస్, సెమీకండక్టర్లు, వస్తూత్పత్తి వంటి కీలకమైన పరిశ్రమల్లో ఏఐని బాధ్యతాయుతంగా వర్తింపజేసే పనిలో ఉన్న వ్యక్తిగా, మేం అభివృద్ధి చేసే సాధనాలకున్న కలవర పరచే ద్వంద్వ వినియోగ సామర్థ్యం గురించి నాకు బాగా తెలుసు. సామర్థ్యానికి, నవీకరణకు చోదక శక్తిగా పనిచేసే అదే టెక్నాలజీ హానికరమైన ఆయుధంగానూ పరిణమించవచ్చు. మనం కీలకమైన ఘట్టంలో ఉన్నాం. జెన్ ఏఐ సాంకేతిక పురోగతిగా చెప్పుకొనే స్థాయి నుంచి చాలా వేగంగా ప్రగాఢమైన భౌగోళిక రాజకీయ సాధనంగా మారుతోంది. ఏ గూటి ఏఐ...అధునాతన జెన్ ఏఐ సామర్థ్యాలను సంతరించుకున్న దేశా లకూ, విదేశాలలో అభివృద్ధి చెందిన సిస్టంలపై ఆధారపడిన దేశా లకూ మధ్యన కొట్టొచ్చినట్లు కనిపించే చీలిక వ్యూహపరంగా తీవ్ర మైన రిస్కులను రేకెత్తిస్తోంది. ఏఐని అభివృద్ధి చేస్తున్న ప్రధాన దేశాలు, ముఖ్యంగా అమెరికా, చైనాల ప్రయోజనాలు, పక్షపాతా లతో రూపుదిద్దుకున్న మోడళ్ళు అనివార్యంగా వాటిని సృష్టించిన వారి కథనాలనే వ్యాప్తి చేస్తాయి. అవి తరచూ ప్రపంచ నిష్పాక్షికతను నీరుగారుస్తాయి. ఓపెన్ ఏఐకి చెందిన జీపీటీ సిరీస్ లేదా చైనాకు చెందిన డీప్ సీక్ వంటి ఏఐ మోడళ్ళలో అంతర్లీనంగా నిక్షిప్తమైన పక్షపాతాలనే పరిశీలించండి. అవి చాలా శక్తిమంతంగా భౌగోళిక రాజకీయ అభి ప్రాయాలను ప్రతిబింబిస్తాయి. ఈ మోడళ్ళు వాటి మాతృదేశాలపై వచ్చే విమర్శలను తగ్గిస్తాయి. దానితో ఆగక పక్షపాతాల వల్ల అంత ర్జాతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతాయి. ఉదాహరణకు, చైనా ఏఐ దృక్పథం దాని జాతీయ విధాన వైఖరులను బలంగా చాటు తుంది. సరిహద్దు వివాదాలలో చైనా వైపునే న్యాయం ఉన్నట్లు చెప్పే స్తుంది. సార్వభౌమాధికారం ఉన్న సంస్థలను కూడా చట్ట బద్ధమైనవి కావని తోసిపారేస్తుంది. ఫలితంగా, అస్తుబిస్తుగా ఉన్న దౌత్యసంబంధాలు మరింత జటిలంగా మారతాయి. కశ్మీర్ వంటి సున్నిత మైన ప్రాంతాల్లో ఇది ఇంకా ఎక్కువ ప్రస్ఫుటమవుతుంది. సుస్థిరత కోసం డిజిటల్ పోటీగతంలో పరస్పరం విధ్వంసాన్ని చవిచూడటం ఆ యా దేశాల వద్దనున్న అణ్వాయుధాలపై ఆధారపడి ఉండేది. నేటి ఆయుధాల పోటీలో ‘డిజిటల్’ ఆ స్థానాన్ని ఆక్రమించింది. అంతర్జాతీయ సుస్థిర తకు కొత్త రూపునిచ్చే సామర్థ్యంలో ఏఐ అణ్వాయుధాలతో సమా నంగా ప్రాధాన్యం ఉన్నదే. కాలం చెల్లిన ఈ చట్రాన్ని మనం అత్య వసరంగా పునః పరిశీలించవలసి ఉంది. డిజిటైజేషన్ ద్వారా పర స్పరం పురోగతి సాధించే కొత్త విధానానికి మళ్ళాలని నేను చెప్ప దలచుకున్నాను. ఈ నమూనా విధ్వంసకర పోటీ నుంచి నలుగురితో కలసి అభివృద్ధిని, సాంకేతిక స్వావలంబనను సాధించేందుకు ప్రాధాన్యం ఇచ్చేట్లు చేస్తుంది. ఈ కొత్త నమూనాను అనుసరించేందుకు దేశాలు, ముఖ్యంగా టెక్నాలజీపరంగా దుర్బలంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు స్వతంత్రమైనవి, సాంస్కృతిక పరిజ్ఞానం ఉన్నవి అయిన ఏఐదొంతరలను ఏర్పరచుకోవలసి ఉంటుంది. అటువంటి స్వయం ప్రతిపత్తి మాత్రమే స్థానిక చరిత్రలను, సంస్కృతులను, రాజకీయ పరమైన సూక్ష్మ భేదాలను ప్రతిబింబించగలుగుతుంది. అప్పుడే ఈ దేశాలు బాహ్యపరమైన మాయోపాయాలకు లోనుకాకుండా నిల బడగలుగుతాయి. సాంస్కృతిక వివరాలను పుష్కలంగా నిక్షిప్త పరచుకున్న ఏఐ, దుష్ప్రచారం నుంచి తమ దేశాన్ని కాపాడుకోవ డమే కాదు సిసలైన అంతర్జాతీయ చర్చలను పెంపొందించ గలుగు తుంది. సమతూకంతో కూడిన బహుళపక్ష ఏఐ ల్యాండ్స్కేప్ ఏర్ప డేందుకు తోడ్పడగలుగుతుంది. ప్రపంచంలో ప్రాబల్యం వహిస్తున్న ఏఐ మోడళ్ళు ప్రాథమికంగా ఇంగ్లీషు, చైనా భాషల్లో రూపొందినవి. అవి 22 అధికార భాషలు, వందలాది మాండలికాలతో కూడిన, భాషాపరంగా,సాంస్కృతికంగా బహుళత్వంతో నిండిన భారత్ వంటి వైవిధ్యభరి తమైన దేశాలను ప్రమాదకరమైన స్థితిలోకి నెడుతున్నాయి. భాషా పరంగా సూక్ష్మమైన భేదాలను పట్టుకోలేని ఏఐ అవగాహనా లోపా లను సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది. అవి దౌత్యపరంగా తీవ్ర మైన పర్యవసానాలకు దారితీయవచ్చు. దీన్ని నివారించడానికిసాంస్కృతిక చైతన్యం కలిగిన అధునాతన ఏఐ మోడళ్ళను అభివృద్ధి చేయడం ఆవశ్యకం. మరాఠీ–గుజరాతీ లేదా తమిళం–కన్నడంవంటి సంబంధిత భాషలలో ఉన్న సారూప్యాలను బహుభాషా ఏఐ సిస్టంలు వినియోగించుకుని తీరాలి. అప్పుడు ఆ యా భాషల్లోఉండే గాఢతను, సూక్ష్మతరమైన భేదాలను విస్మరించకుండా వేగంగా ఆంతర్యాన్ని అందిపుచ్చుకోవడం సాధ్యమవుతుంది. నిర్ణయాధికారం మనిషిదే కావాలి!సామాజిక మౌలిక సదుపాయాలలోకి, నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియలలోకి జెన్ ఏఐ మమేకం అయితే అది మానవ పాత్రలకు తప్పకుండా కొత్తరూపునిస్తుంది. సమర్థత విషయంలో ఆటోమేషన్ బ్రహ్మాండమైన ఆశలు రేపుతున్న మాట నిజమేకానీ, యుద్ధ తంత్రం వంటి జీవన్మరణ సందర్భాలలోనూ నిర్ణయం తీసుకునే బాధ్యతను ఏఐ సిస్టంలకు అప్పగించేయడం ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఈ సందర్భంగా నాకు, ప్రచ్ఛన్న యుద్ధ కాలానికి సంబంధించి 1983 నాటి ఉదంతం ఒకటి గుర్తుకువస్తోంది. ఆనాటి సోవియట్ లెఫ్టినెంట్ కల్నల్ స్టానిస్లావ్ పెట్రోవ్ సాంకేతిక తార్కిక ప్రమాద హెచ్చరి కల కన్నా మానవ అంతఃకరణనే ఎక్కువ లెక్కలోకి తీసుకున్నారు. ఫలితంగా, ఒక అణు వినాశనాన్ని నివారించగలిగారు. మనుషులు ఒక నిర్ణయం తీసుకునే లేదా ఆలోచించే పనిని ఇష్ట పూర్వకంగానే బీజగణితాలకు అప్పగించేస్తారేమోనని నన్నొక పెద్ద భయం వెన్నాడుతోంది. ఆ రకమైన భవిష్యత్తును మనం అంగీకరించకూడదు. మానవ విజ్ఞతకు ఏఐ ఉపయోగపడాలే కానీ, విజ్ఞత స్థానాన్ని అది ఆక్రమించకూడదని డిమాండ్ చేసే కర్తవ్యం, అలా జరగకుండా చూసే బాధ్యత నవీకరణవేత్తలుగా, టెక్నాలజిస్టులుగా, ప్రపంచ పౌరులుగా మనందరి మీదా ఉంది. మానవాళి విజ్ఞతను పక్కకు తోసేసే టెక్నాలజీని ఎన్నటికీ అనుమతించేది లేదని ఈ రోజే మనం ప్రతిన బూనుదాం.-వ్యాసకర్త ఏఐ కంపెనీ ‘ఆర్టికల్8’ వ్యవస్థాపక సీఈఓ(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-అరుణ్ సుబ్రమణియన్ -
స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందినప్పుడే...
భారతదేశం నేడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చేందుకు ఎంతవరకు కృషి చేస్తున్నామో మనం ప్రశ్నించుకోవాలి. 2024 ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం, భారతదేశం 127 దేశాలలో 105వ స్థానంలో ఉంది. ‘సర్వైవల్ ఆఫ్ ద రిచెస్ట్: ది ఇండియా స్టోరీ’ అనే శీర్షికతో ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ తాజా నివేదిక భారతదేశంలో గణనీయమైన ఆదాయ అసమానతను పేర్కొంది. అత్యంత ధనవంతులైన 1% మంది ఇప్పుడు దేశ మొత్తం సంపదలో 40% కంటే ఎక్కువ కలిగి ఉన్నారు. దిగువన ఉన్న 50% మంది కేవలం 3% మాత్రమే సంపద కలిగి ఉన్నారు. వీటితో పాటు 2024లో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ‘కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్’ ప్రకారం భారతదేశం అవినీతి అవగాహన సూచికలో 180 దేశాలలో 96వ స్థానంలో ఉంది.2025 నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై చేసే మొత్తం వ్యయం జీడీపీలో 4.64%గా ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. అయితే ఇది నూతన విద్యా విధానం –2020 నిర్దేశించిన 6% లక్ష్యం కంటే తక్కువగా ఉండటం గమనార్హం. 2025–26 కేంద్ర బడ్జెట్లో, భారతదేశం ఆరోగ్య రంగానికి రూ. 99,859 కోట్లు కేటాయించింది. ఇది గత సంవత్సరం సవరించిన అంచనాలతో పోలిస్తే 11% పెరుగుదలను సూచిస్తుంది. మొత్తం ఆరోగ్య బడ్జెట్లో 96%తో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు ఎక్కువ కేటాయింపులు లభించాయి. అయితే ఇది వార్షిక బడ్జెట్ కేటాయింపులు, విధాన మార్పుల ఆధారంగా మారవచ్చు. ఆర్థిక వ్యవస్థలో రెడ్ టేపిజం ఇప్పటికీ తన ప్రభావాన్ని చూపుతోంది. బంధుప్రీతి దాదాపు అన్ని రంగాలలో కనిపిస్తోంది. ఇప్పటికీ మనం వరకట్నం, ఆడ శిశువుల హత్య, లింగ అసమానత, గృహ హింస, అంటరానితనం వంటి సాంఘిక దురాచారాలతో కునారిల్లడం బాధాకరం.అయితే మన దేశం ఎన్ని ఆటంకాలు ఎదురైనా విభిన్న రంగాలలో చాలా అభివృద్ధిని సాధించింది. మానవ వనరులలో (జనాభా) భారతదేశం మొదటి స్థానంలో ఉంది. భారతదేశం ప్రపంచంలోనే పాలు, పప్పుధాన్యాలు, జనపనార ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. బియ్యం, గోధుమలు, చెర కు, వేరుసెనగ, కూరగాయలు, పండ్లు, పత్తి ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద దేశంగా ఉంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్యలో అమెరికా, చైనాల తర్వాత మూడవ స్థానంలో ఉంది. ప్రపంచంలో 10వ అతిపెద్ద దిగుమతిదారుగా, 16వ అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది. 2024లో, భారతదేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్వీకరించడంలో ప్రపంచవ్యాప్తంగా 15వ స్థానంలో నిలిచింది. సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణల నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా అనుసరిస్తున్న ట్రంప్ విధానాల నుండి, యుద్ధాల నుండి రక్షించుకోవడం కోసం నిరంతర ఆర్థికాభివృద్ధి, విభిన్న సంక్షేమ కార్యక్రమాలతో స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని మనం కొనసాగించాలి. అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలపై అవగాహన ఉన్న పౌరుల భాగస్వామ్యంతోనే స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని అందుకుని అభివృద్ధి సాధించగలం.– డా‘‘ పి.ఎస్. చారి, కామర్స్– మేనేజ్మెంట్ స్టడీస్లో ప్రొఫెసర్ -
మానవత్వాన్ని మింగే ప్రపంచ స్వార్థం
‘కళ్ల ముందు హింస జరుగుతుంటే, దానిని చూస్తూ మౌనంగా ఉండటం కూడా హింసలో భాగమే’ అన్నారు మహాత్మా గాంధీ. ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని అందించి ప్రపంచ మానవాళి సుఖసంతోషాలతో ఉండాలంటే అదొక్కటే ఏకైక మార్గమని ఆయన నిరూపించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యుద్ధోన్మాదానికి రక్తపుటేరులై పారుతున్న ‘గాజా’ను చూస్తూ కూడా ప్రపంచంలోని అత్యధిక బలమైన దేశాలు నోళ్లు కుట్టేసుకున్నట్లు ప్రవర్తించడమే నెతన్యాహు హింస కంటే బీభత్సంగా గోచరిస్తోంది. ‘గాజా’ మొత్తం ఛిద్రం అయింది. 75,000 మంది ఇప్పటివరకు మట్టిలో కలిసిపోయారన్నది అధికారిక లెక్క. అంతకు మించిన సంఖ్యలో అక్కడి ప్రజలు, సైనికులు హతం అయ్యారన్నది అనధికార అంచనా. అంకెలను బట్టి చూస్తే, గతంలో హిట్లర్, ముస్సోలినీ నెలకొల్పిన రికార్డులన్నింటినీ నెతన్యాహు తిరగరాసినట్లే ఉంది.మొదటి ప్రపంచ యుద్ధం సమయంలోగానీ, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు గానీ బాధితులకు, క్షతగాత్రులకు రెడ్క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థలు అందించిన సాయాన్ని అడ్డుకొన్న దాఖలాలు లేవు. కానీ, నేడు అంతర్జాతీయ సమాజం అందిస్తున్న సాయంపై ఇజ్రాయెల్ సైనికులు ఆంక్షలు పెట్టారు. ఇంతటి అమానవీయం కనివిని ఎరుగం. 22 నెలలు గడిచినా ‘గాజా’లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఏ దేశమూ చొరవ చూపడం లేదు. ఆ ఒక్క యుద్ధం సరిపోదన్నట్లుగా... ఇరాన్లో అణ్వస్త్రాయుధాలు, శుద్ధి చేసిన యురేనియం నిక్షేపాలు ఉన్నాయనే మిషతో ఆ దేశంపై కూడా విరుచుకుపడి పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులు సృష్టించి ఏ ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా చేశారు నెతన్యాహు. వియన్నా డిక్లరేషన్ను అనుసరించి యుద్ధంలో పాల్గొనే దేశాలు... సామాన్య పౌరులను చంపకూడదు. జన సామాన్యం, నివాస ప్రాంతాలపై దాడులు చేయరాదు. ఈ నిబంధనను ఇజ్రాయెల్ అటకెక్కించింది. అలాంటి నాయకులేరీ?‘వసుధైక కుటుంబం’ అన్నది భారతదేశం ప్రవచించిన మహత్తరమైన భావన. దానిని భావనగానే ఉంచకుండా ఆచరణలోకి తేవడానికి చిత్తశుద్ధితో కృషి చేసింది కూడా భారతదేశ నాయకత్వమే. గాంధీజీ, నెహ్రూ, అంబేడ్కర్, లోహియా, వినోబాభావే మొదలైన నాయకులతో పాటు, ఆ తర్వాత తరానికి చెందిన ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, అబ్దుల్ కలాం వంటివారు ప్రపంచ శాంతికి, ప్రపంచ దేశాల ఆర్థిక సామాజిక పురోగతికి కృషి చేశారు. కెన్నెడీ, చౌ ఎన్ లై, మార్షల్ టిటో, నాజర్ మొదలైన వివిధ దేశాల నాయకులు సైతం ప్రపంచశాంతికి కృషి చేశారు. మానవజాతి వినాశనానికి దారితీసే యుద్ధాల నివారణకు ఎందరో నేతలు గతంలో తాపత్రయ పడ్డారు. వివిధ దేశాల నడుమ ఘర్షణలు చెలరేగినప్పుడు ఆ ఉద్రిక్తతలను తగ్గించడంలో, సంప్రదింపుల ద్వారా, ఒడంబడికల ద్వారా యుద్ధాలను నివారించడాన్ని అనుభవంలో చూశాం. కానీ ఇప్పుడా చొరవ ఒక్క నాయకుడూ చేయడం లేదు. ‘నేను– నా పొట్ట’ అనే రీతిలో, ‘నేను– నా దేశం’ అనే విధంగా మాట్లాడటం తమ దేశీయ ప్రయోజనాలను పరిరక్షించుకోవడం గానూ, తమ దేశాభి వృద్ధిని కాంక్షించే జాతీయ విధానంగానూ భావిస్తున్నారు తప్ప... అటువంటి విధానం వల్ల దేశాల మధ్య పరస్పర సహకారం, సహజీవనం, శాంతి సౌభాగ్యాలకు విఘాతం కలుగుతుందని ఆలోచించడం లేదు.అప్పుల కోసం, ఆయుధాల కోసం నేడు అనేక దేశాలు... ఆగ్రదేశాల ముందు సాగిలపడుతున్నాయి. బదులుగా అగ్రదేశాలు ఏం చేసినా... ‘తానా అంటే తందాన’ అంటున్నాయి. ఈ ధోరణి ఇప్పటికిప్పుడు అలవాటు చేసుకొన్నది కాదు. దాదాపు 3 దశాబ్దాలుగా కొనసాగుతున్నదే. ఇప్పుడది పరాకాష్ఠకు చేరింది. ఐక్యరాజ్యసమితి కోరల్ని ఎప్పుడో పీకేయడంతో ఆ సంస్థ అస్తిత్వం నామమాత్రంగా మారి యుద్ధాలను నివారించడంలో ఎటువంటి పాత్రనూ పోషించలేకపోతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపగల చొరవ ఎవరు తీసుకొంటారు? ఆ శక్తి ఎవరికి లేకపోవడం అటుంచి... అలాంటి ప్రయత్నం చేయాలన్న తపన కొరవడటమే అత్యంత బాధాకరం.ద్వంద్వ ప్రమాణాలుయుద్ధోన్మాదులు దేశాధినేతలైతే, ఆ దేశ ప్రజల భవిష్యత్తే కాదు... యావత్ ప్రపంచ భవిష్యత్ తారుమారవుతుందని గత అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసిన కొన్ని గంటల్లోనే అంతర్జాతీయ చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న సుదీర్ఘ యుద్ధం కారణంగా వాతావరణంలోకి ప్రవేశించిన ప్రమాదకర ‘ధూళి’ యూరప్తో సహా పొరుగునున్న పలు దేశాలలో ప్రతికూల ఫలితాలు చూపిస్తోందన్న వార్తలు వెలువడుతున్నాయి. దేశాల మధ్య ఏర్పడుతున్న ఉద్రిక్తతల కారణంగా తమ తమ గగనతలాలను మూసివేయడం, నౌకాయాన మార్గాలను దిగ్బంధనం చేయడం వంటి దుందుడుకు చర్యల ఫలితంగా మానవాళికి జరుగుతున్న నష్టం, కాలహరణం ఊహాతీతమైనది.ప్రపంచంలో మూడు బలమైన దేశాలు అమెరికా, రష్యా, చైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా యుద్ధాల్లో పాల్గొనడం లేదా మిత్రదేశాలకు యుద్ధాల్లో సాయపడటం విరమించుకోనంత వరకు ప్రపంచంలో శాంతి స్థాపన జరగడం కష్టం. నిజానికి ఈ దేశాల ప్రజలకూ, ఆ మాటకొస్తే ఉత్తరకొరియా ప్రజలకు సైతం యుద్ధం అభిలషణీయం కాదు. ప్రజలెప్పుడూ అభివృద్ధిని ఆశిస్తారు. సుఖశాంతులను కోరుకుంటారు. కయ్యానికి కాలు దువ్వే మనస్తత్వం మెజారిటీ ప్రజలకు ఉండదు.ప్రజల ఆశలు, ఆకాంక్షలకు భిన్నంగా, తమ ప్రతిష్ఠను పెంచుకోవడానికీ, తమ దేశ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని చాటుకొని అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికీ కొందరు ప్రపంచ నేతలు హ్రస్వదృష్టితో అనుసరిస్తున్న విధానాల వల్లనే... యుద్ధాలు ముగింపు లేకుండా కొనసాగుతున్నాయి. యుద్ధం పేరుతో బలహీనులపై అన్ని రకాల దారుణాలూ జరుగుతున్నాయి.స్వార్థమే యుద్ధకారణంకళింగ యుద్ధంలో గెలిచిన తర్వాత అశోక చక్రవర్తిలో పశ్చాత్తాపం కలుగుతుంది. ప్రత్యర్థులకు కలిగిన నష్టం కంటే మన నష్టం కొంచెం తక్కువ... అంతే... ఇది విజయం కాదు... పరాజయం... మానవత్వానికి తీరని మచ్చ అని మథన పడతాడు. యుద్ధాలకు స్వస్తి పలికి శాంతి కాముకుడిగా మారి శాంతిని విశ్వజనీనం చేయడానికి తన జీవితాన్ని ధారపోస్తాడు. ప్రపంచాన్ని జయించాలనుకున్న అలెగ్జాండర్ కథ కూడా చివర్లో విషాదంగానే ముగిసింది. ఈ ఉదంతాల నుంచి గుణపాఠాలు నేర్చుకొనే విశాల దృక్పథం నేడు నాయకుల్లో కరువైంది. వారి స్వార్థం నుంచే యుద్ధాలు మొదలవుతున్నాయి. అవి అంతిమంగా మానవత్వాన్ని మింగేస్తున్నాయి. ఉక్రెయిన్లో కావొచ్చు, గాజాలో కావొచ్చు... జరుగుతున్న పరిణామాల పట్ల ప్రపంచ దేశాలు నిర్లిప్తంగా, ఉదాసీనంగా, శిలాసదృశంగా మారిపోయాయి. వీటి ప్రతికూల పరిణామాలు ఊహిస్తేనే భయంగా ఉంటుంది. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు -
'దేశ'మంత మందికి ఓటుండదా?
బిహార్ ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్ఐఆర్–సర్)లో భాగంగా ఎంత మంది పేర్లు గల్లంతయ్యాయి? దానికంటే ముఖ్యంగా, ఎంతమంది పేర్లు ఈ తాజా జాబితాల్లో నమోదు కాలేదు? ఈ సంఖ్యలు చాలా ముఖ్యం. వీటిని బట్టే ‘సర్’ పట్ల నా అభిప్రాయం ఉంటుంది. నేననుకోవడం, మనకు చెప్పిన దానికంటే వాస్తవ సంఖ్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. వివరాల్లోకి వెళ్దాం.ఎన్నికల కమిషన్ ఒకటో తేదీన ముసాయిదా జాబితా విడుదల చేసింది. దీని ప్రకారం, 65.6 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారు. సవరణ ప్రక్రియ ప్రారంభించడానికి ముందున్న మొత్తం ఓటర్లలో వీరు దాదాపు 9 శాతం ఉంటారు. ఈ తాత్కాలిక సంఖ్య చిన్నదేం కాదు. ఇప్పటికే ఇది ఆందోళన కలిగిస్తోంది.పెరగాల్సింది పోయి...మరొక విషయం ఏమిటంటే – 2024 సాధారణ ఎన్నికలతో, 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినట్లయితే ఈ దఫా నమోదైన ఓటర్లు తక్కువగా ఉన్నారు. 2005లో రెండు సార్లు వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు మినహా, 1977 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికలకూ మొత్తం ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే, ఈ ఏడాది జరగనున్న ఎన్నికల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది.బిహార్ రాష్ట్ర అధిక సంతానోత్పత్తి రేటు (ఫెర్టిలిటీ రేట్)ను దృష్టిలో పెట్టుకుంటే, ఇది మరింత కలవరపెడుతోంది. 2001, 2011 మధ్య కాలంలో వయోజనులు 28.5 శాతం పెరిగారు. అయినా 2025లో మొత్తం రిజిస్ట్టర్డ్ ఓటర్ల సంఖ్య పెరగటానికి బదులు తగ్గటం వింతే!కొద్ది రోజుల క్రితం ప్రకటించిన దానికంటే అంతిమంగా ప్రకటించే వాస్తవ తొలగింపులు పెరిగే అవకాశం ఉంది. ‘భారత్ జోడో అభియాన్’ నేషనల్ కన్వీనర్ యోగేంద్ర యాదవ్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 65.6 లక్షలు అనే సంఖ్య ఇంకా పెరుగుతుందన డానికి ఆయన మూడు కారణాలు చెబుతున్నారు. ఒకటి – బూత్ లెవెల్ ఆఫీసర్స్ ముసాయిదాలోని పలు పేర్లను తిరస్కరించే అవ కాశం ఉంది. వారికా అధికారం ఉంది. రెండు – తమ దరఖాస్తు ఫారాలను అప్లోడ్ చేసిన అనేక మంది వాటిలో పొందుపరచిన వివరాలకు సరైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి ఉండరు. అలాంటి వారి పేర్లను మలి విడతలో తొలగిస్తారు. మూడు – ఎల క్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు స్థానికంగా విచారణ చేసి మరికొన్ని పేర్లను కొట్టేసే వీలుంది. ఈ మూడు కారణాల ప్రకారం, 65.6 లక్షలు అనేది ఆరంభ సంఖ్య మాత్రమే. చివరి లెక్కల్లో ఇది తప్పనిసరిగా చాలా ఎక్కువ ఉంటుంది.నమోదు కానివారి మాటో?ఓటర్ల జాబితాలపై, అంతిమంగా బిహార్ ఎన్నికలపై ఈ పేర్ల తొలగింపు ప్రభావం గురించి మాత్రమే విశ్లేషణ జరిగింది. మరి, జాబితాల్లో కొత్త ఓటర్ల నమోదు మాటేమిటి? ఈ అంశానికి దక్కా ల్సినంత ప్రాధాన్యం దక్కలేదు.యోగేంద్ర యాదవ్ దీనిపై అధ్యయనం చేశారు. ప్రభుత్వ అధికారిక జనాభా అంచనాలనే ఆయన తన అధ్యయనానికి ఆధా రంగా తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ సైతం ఓటరు జాబితాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయడానికి, ధ్రువీకరించుకోవడానికి వీటినే ప్రాతిపదికగా తీసుకుంటోంది.బిహార్ ఓటర్ల జాబితాల్లో నమోదైన వయోజన జనాభా (18 ఏళ్ల లేదా అంతకు మించిన వయసు ఉన్నవారు) శాతం వారి వాస్తవ జనాభాలో ఎంత ఉందో యోగేంద్ర యాదవ్ లెక్కగట్టారు. ‘సర్’కు ముందు, జూన్ 24న ఇది 97 శాతం. ‘సర్’ తర్వాత, ఇప్పుడు 88 శాతం! అంటే, 9 శాతం తగ్గింది. ఇది 94 లక్షలకు సమానం. జాబితాల నుంచి తొలగించిన 65.6 లక్షల పేర్ల కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. మరో విధంగా చెప్పాలంటే, 30 లక్షల మంది వయోజనులు అర్హత ఉండీ ఓటర్లుగా నమోదు కాలేదు.యోగేంద్ర యాదవ్ తన అధ్యయన ఫలితాలు ప్రచురించి పది రోజులు దాటింది. ఎన్నికల కమిషన్ వీటిని ఖండించలేదు, ప్రశ్నించలేదు. ఈ నిశ్శబ్దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?దేశమే అదృశ్యం?యోగేంద్ర యాదవ్ తన అధ్యయనంలో రెండు నిర్ధారణలకు వచ్చారు. బిహార్ ఓటర్ల జాబితాల్లో పేర్లు అదృశ్యమైన వారూ, పేర్లు నమోదు కాని వారూ కలిసి 1.5 కోట్ల మంది ఉంటారని ఆయన అంచనా. ఇది నిజం కాకపోతే బాగుండని అనుకోవడం తప్ప మనం చేయగలిగింది లేదు. ఇక రెండో నిర్ధారణ మనందరికీ ఆందో ళన కలిగించక మానదు. అధికారిక ప్రకటన ప్రకారం, 9 శాతం పేర్ల తొలగింపునే పరిగణనలోకి తీసుకున్నా సరే, ఇప్పటికిప్పుడు దేశ వ్యాప్తంగా ‘సర్’ నిర్వహిస్తే ఈ లెక్కన 9 కోట్ల మంది పేర్లు అదృశ్యమవుతాయి. వీరి సంఖ్య బ్రిటన్ లేదా ఫ్రాన్స్ జనాభాకు ఒకటి న్నర రెట్లు! బిహార్ ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ గురించి ఒక అభిప్రాయానికి వచ్చేందుకు ప్రధానంగా ఈ వివరాలు సరిపోతాయని అనుకుంటున్నాను. మీరేమంటారు?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
గాజాను గాలికి వదిలేయడమేనా?
‘మొత్తం గాజాను ఇజ్రాయెల్ తన అదుపులోకి తీసుకుంటుంది –నెతన్యాహు ప్రకటన’, ‘గాజా నగరం మొత్తాన్ని గుప్పిట్లోకి తీసుకోనున్న ఇజ్రాయెల్’– గత రెండు రోజుల్లో పత్రికల్లో కనిపించిన ఈ శీర్షికలు చూసిన ఎవరైనా అడగవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అవి: ఆ మాట అనడానికి ఆయనకు ఎంత ధైర్యం? ఆ పని చేసేందుకు ఇజ్రాయెల్కు ఉన్న హక్కే మిటి? కానీ, ఈ ప్రశ్నలను ఎవరూ అడిగినట్లు లేదు. కానీ, నేడు ప్రపంచంలో రాజ్యమేలుతున్న నైతిక పరిస్థితులు అలాంటి ప్రశ్నలు లేవనెత్తగల పరిధిని కుంచించివేశాయి. దాదాపు రెండేళ్ళ నుంచి పాలస్తీనా పౌరుల్ని ఇజ్రాయెల్ భయంకర హింసకు గురి చేస్తున్నా, సైనికంగా, ఆర్థికంగా శక్తిమంతమైన పాశ్చాత్య దేశాలు నిరోధించ లేదు. పరిస్థితులు ఇంతవరకు రావడానికి అవే ప్రధాన కారణం. ఇజ్రాయెల్ చేతిలో 60,000 మందికి పైగా పాలస్తీనియన్లు హతమైనా, అంతకు రెండింతల కన్నా ఎక్కువ మంది గాయపడినా ఉదార ప్రజాస్వామిక ఆదర్శాలను వల్లెవేసే ఈ దేశాలు చోద్యం చూశాయి. లేదా ఇజ్రాయెల్ చర్యలను ప్రోత్సహించాయి. అంతర్జా తీయంగా దేశాలు నాగరిక ప్రవర్తనను గాలి కొదిలేస్తే, ఆ యా దేశాలలోని సమాజాలలో ప్రజాస్వామిక విలువలే దెబ్బతింటాయి. గాజాపై సైనికచర్యలో వినియోగించడానికి అవకాశమున్న ఆయుధాలను ఇజ్రాయెల్కు ఇవ్వడాన్ని నిలిపివేస్తామని జర్మనీ ప్రకటించింది. ఈ ఘర్షణలో జోక్యం చేసుకోకూడదని అమెరికా నిర్ణయించుకుంది. గాజా నగరంపై దాడికి దిగాలన్న ఇజ్రాయెల్ నిర్ణయంపై వివిధ దేశాల, అంతర్జాతీయ ఏజన్సీల స్పందనలు అలా రకరకాల స్థాయుల్లో వ్యక్తమయ్యాయి. సైనిక హింసను వెంటనే నిలువరించేందుకు ఒక జీ7 లానో, జీ20 మాదిరిగానో ఏర్పడకుండా ఈ దేశాలకు అడ్డుపడిన అంశం ఏమిటి? పాలస్తీనా ప్రయోజనాలకు ఇండియా కొన్ని దశాబ్దాలుగా మద్దతు ఇస్తూ వస్తోంది. కానీ, మన దేశం కూడా ఇప్పటికీ అధికారిక స్పందనను వెల్లడించలేదు.హమాస్ 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్ పై దాడులకు దిగింది. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ 15 నెలలపాటు ఏకధాటిన పాలస్తీనాను పిండి చేసిన తర్వాత అమెరికా, ఖతార్, ఈజిప్టుల మధ్య వర్తిత్వంతో మూడు దశల కాల్పుల విరమణకు జనవరిలో ఇజ్రా యెల్, హమాస్ అంగీకరించాయి. కానీ, రెండు నెలలు గడిచాయో లేదో గాజా నగరంపై రాత్రిపూట వైమానిక దాడులకు ఇజ్రాయెల్ తెగబడింది. వాటిలో 400 మంది పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో హింసకు తాత్కాలికంగానైనా అడ్డుకట్టపడుతుందనే ఆశను కాల్పుల విరమణ ఒప్పందం కల్పించింది. ఆరు వారాల మొదటి దశలో – బందీలుగా పట్టుకున్న ఇజ్రాయలీలను హమాస్ వదిలేయాలి. ప్రతిగా ఇజ్రాయెల్ జైళ్ళలో ఉన్న పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ సేనల ఉప సంహరణ మొదలవ్వాలి. నానా అగచాట్లు పడుతున్న పాలస్తీనియ న్లకు మానవతా సహాయం పెరగాలి. రెండవ దశలో– ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపడంతో యువ బందీలు, ఖైదీల మార్పిడి సాఫీగా సాగాలి. మూడవ దశలో– బందీలు, ఖైదీల మృతదేహాల అప్పగింత అమలవ్వాలి. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ సేనల ఉపసంహ రణతోపాటు, గాజాలో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలి. కానీ, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కనపెట్టిన ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూ, పాలస్తీనియన్లను చంపుతూనే ఉంది. గాజాకు ఆహారం, దుస్తులు, ఆస్పత్రి సామగ్రితో సహా మానవతా దృష్టితో సాగుతున్న అంతర్జాతీయ సాయానికీ అడ్డుపడింది. గాజా నగరాన్ని హస్తగతం చేసుకోవాలన్న ఇజ్రాయెల్ నిర్ణయాన్ని హమాస్ చేతిలో ఇప్పటికీ బందీలుగా ఉన్నవారి కుటుంబాల వారు వ్యతిరే కిస్తున్నారు. దాడికి సంబంధించి ఇజ్రాయెల్ సైనిక ప్రణాళికలను ఈ ప్రతిఘటన ఆపుతుందో లేదో రాబోయే రోజుల్లో చూడాలి. ఇజ్రాయెల్ సైనిక దాడులు మొదలైన తొలి నెలల్లో లక్షలాది మంది పాలస్తీనియన్లు గాజాను విడిచి వెళ్ళిపోయారు. వివిధ ప్రాంతాల్లో నిస్సహాయ పరిస్థితుల్లో తలదాచుకున్న పాలస్తీనియన్లు కాల్పుల విరమణ తర్వాత తిరిగి వచ్చారు. అప్పటికే వారి గృహాలు, వాడలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. గాజాలో నివసిస్తున్న పది లక్షల మంది పాలస్తీనియన్లను, రానున్న వారాల్లో ఇజ్రాయెల్ సేనలు తరిమేస్తే, ఆ తర్వాత వారు తిరిగి వచ్చేందుకు, ఆ మాత్రం నగరం కూడా మిగిలి ఉండదు. రఫాకు పట్టిన గతే గాజాకూ పడుతుంది. హమాస్ సేనలను పట్టుకునేందుకు రఫాలో ఉన్న పది లక్షల మంది పౌరులను ఇజ్రాయెల్ ఖాళీ చేయించేసింది. ఇపుడు రఫా ఏ మాత్రం నివాసయోగ్యం కాని విధంగా నేలమట్టమై ఉంది. గాజాలో పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్న భీతావహ పరిస్థి తుల్ని ఊహించుకోవచ్చు. అస్తిత్త్వానికే ముప్పు ఎదురవుతున్న ఈ సమయంలో వారి పట్ల మనం సానుభూతితో వ్యవహరించాలి. జాతిని తుదముట్టించే ప్రణాళికలు నిర్వహించకుండా ఇజ్రాయెలీలను ఆపే బాధ్యతను శక్తిమంతమైన దేశాలు భుజానికెత్తుకుంటాయా? అలా చేస్తే, అంతర్జాతీయ వ్యవస్థపై మళ్ళీ నమ్మకం నెలకొంటుంది. తాత్కాలిక విధానాలతోనే అన్నింటిని సద్దుపుచ్చే తత్వం నేడు ప్రపంచమంతటా కనిపిస్తోంది. ఆ జాడ్యం నుంచి దూరం జరిగేందుకు కూడా అది తోడ్పడవచ్చునని ఓ చిగురాశ! ప్రొ‘‘ చందన గౌడ వ్యాసకర్త డీన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, విద్యాశిల్ప్ యూనివర్సిటీ(‘దక్కన్ హెరాల్డ్’ సౌజన్యంతో) -
మాలెగావ్ తీర్పే కాదు, విచారణా విచిత్రమే!
మహారాష్ట్రలోని మాలెగావ్లో 2008 సెప్టెంబర్ 29న జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా పదిహేడేళ్లుగా విచారణను ఎదుర్కొంటున్న ఏడుగురు నింది తులు నేరం చేశారని ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయిందని ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ న్యాయస్థానం న్యాయమూర్తి ఏకే లాహోటీ ఈ ఏడాది జూలై 31న తీర్పు ప్రకటించారు. ఆరుగురి మరణానికీ, వంద మంది దాకా గాయపడటానికీ కారణమైన ఆ నేరం ఎవరు చేశారో ఇప్పటికీ బయటపడలేదు! ఈ కేసు గురించీ, విచారణ క్రమం గురించీ, తీర్పు గురించీ ఆలోచించవలసిన అంశాలెన్నో! ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే మాలెగావ్లో ఒక మసీదు సమీపంలో మోటార్ సైకిల్కు అమర్చిన బాంబులు పేలి, ఆరుగురు మరణించిన ఆ కేసు దర్యాప్తును అప్పటి ప్రభుత్వం మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటి ఎస్)కు అప్పగించింది. అప్పటి ఏటిఎస్ అధిపతి హేమంత్ కర్కరే నాయకత్వంలో ఆ దర్యాప్తు జరిగి అక్టోబర్–నవంబర్లలో 11 మంది అనుమానితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో అఖిల భారత విద్యార్థి పరిషత్ మాజీ నాయ కురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, మతాచార్యులు దయా నంద పాండే అలియాస్ స్వామి అమృతానంద, రిటైర్డ్ సైనికాధికారి మేజర్ రమేశ్ ఉపాధ్యాయ, అప్పటికి సైన్యంలో పని చేస్తున్న అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ ఉన్నారు. వారిలో అత్యధికులు ‘అభినవ భారత్’ అనే సంస్థ సభ్యులనీ, ఆ సంస్థ హిందూ రాజ్య స్థాపన లక్ష్యంతో విధ్వంసాలకు పూనుకుంటున్నదనీ ఏటిఎస్ అధి కారి హేమంత్ కర్కరే చెప్పారు. ఈ సంస్థకు, అనుబంధ సంస్థలకు దేశంలో 19 చోట్ల జరిగిన పేలుళ్లతో సంబంధం ఉందని తేలిందని కూడా కర్కరే అన్నారు. అప్పటికి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండిన భారతీయ జనతా పార్టీ, శివసేనలు ఇదంతా కాంగ్రెస్ పన్నాగమనీ, కేసు దర్యాప్తు ఇలా సాగించిన హేమంత్ కర్కరే ‘దేశద్రోహి’ అనీ ప్రకటించారు. అప్పటి గుజరాత్ సీఎం మోదీ ఏటిఎస్ దర్యాప్తు మన సైనిక బలగాల నైతిక ధృతిని కించపరిచేలా ఉందని విమర్శించారు. ఈ దర్యాప్తు వివరాలు బయటపెట్టి, నిందితులను అరెస్టు చేసిన నెల రోజుల తర్వాత ముంబా యిపై తీవ్రవాద దాడిలో హేమంత్ కర్కరేను గురిచూసి కాల్చి చంపారు. ఆయన తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోయా రనే అభిప్రాయం ఎంత ఉందో, ఆయన హత్య వెనుక కుట్ర ఉందనే అభిప్రాయం అంత ఉంది. ఆయన చనిపోగానే తన ‘శాపం వల్లనే చనిపోయాడ’ని సాధ్వి అన్న మాటలు ఆ అనుమానాలకు ఆజ్యం పోశాయి. మరొకవైపు, ఏటిఎస్ 2009 జనవరి 20న పదకొండు మంది నిందితుల మీద చార్జిషీట్ దాఖలు చేసింది. అప్పటికి ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పింది. 2011 ఏప్రిల్లో ఈ కేసును ఎన్ఐఏ తన పరిధిలోకి తీసుకుని, 2012లో మరొక ఇద్దరిని అరెస్టు చేసి నిందితుల సంఖ్యను 14కు చేర్చింది. 2016 మేలో ఎన్ఐఏ కొత్త ఛార్జిషీట్ తయారు చేసింది. ‘ఉపా’ చట్టం కింద ఆరోపణలున్నప్పటికీ, 2017లో నిందితులందరూ బెయిల్మీద బయటికి వచ్చారు. 2018లో విచారణ ప్రారంభమయింది. 323 మంది ప్రాసిక్యూషన్ సాక్షులను, 8 మంది డిఫెన్స్ సాక్షులను విచారించిన తర్వాత, ప్రాసిక్యూషన్ నేర నిర్ధారణకు తగినంత విశ్వసనీయంగా సాక్ష్యాధారాలను సమర్పించలేదని తీర్పు వెలువడింది.ఆ తీర్పులోనే న్యాయమూర్తి కొందరు కీలకమైన సాక్షులను ఎన్ఐఏ ఉపసంహరించుకోవడం ప్రాసిక్యూషన్ ఉద్దేశాల గురించి ప్రతికూల నిర్ధారణలకు అవకాశం ఇచ్చిందని అన్నారు. ఆ సాక్షులను ప్రవేశపెట్టి ఉంటే, ఆరోపణలను రుజువు చేయడంలో చాలా ఖాళీలు పూరింపబడేవని అన్నారు. కేసు విచారణకు, నేర నిరూపణకు ఉపయోగపడే సాక్షులను ప్రాసిక్యూషన్ తనంతట తానే ఎలా పక్కన పెట్టిందో తీర్పులో వివరంగా రాశారు. అలాగే, సీఆర్పీసీ సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ దగ్గర నమోదు చేసిన పద ముగ్గురు సాక్షుల వాంఙ్మూలాలు మాయమై పోయాయని ఎన్ఐఏ కోర్టుకు చెప్పింది. ఆ పత్రాలు మాయమైనప్పుడు, అవి ఏ మేజిస్ట్రేట్ ముందర నమోదయ్యాయో ఆ మేజి స్ట్రేట్ను విచారించవలసి ఉంటుంది. కాని ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. అయితే ఇలా ప్రాసిక్యూషన్ తప్పులన్నిటినీ జాగ్రత్తగా నమోదు చేసిన న్యాయమూర్తి, ప్రాసిక్యూషన్ వ్యతిరేకించినా అవసరమైన సాక్షులను పిలవడానికి తన కున్న హక్కును మాత్రం వాడుకోలేదు! విచారణలో మరొకమలుపు కూడా ఉంది. కేసు మొద లయిన నాటి నుంచీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉండిన రోహిణి సాలియాన్ ఈ కేసు విచారణలో వేగంగా సాగవద్దని ఎన్ఐఏ నుంచి తనకు ఆదేశాలు వచ్చాయని 2015లో బయట పెట్టారు. ఆ తర్వాత ఆమెను ఎన్ఐఏ ప్రాసిక్యూటర్ల జాబితా నుంచి తొలగించారు. ఏటిఎస్ నేతృత్వంలో తాము చాలా బలమైన సాక్ష్యాధారాలు తయారు చేశామని, ప్రస్తుత కేసు ఓటమి సాక్ష్యాధారాల లేమి వల్ల జరగలేదనీ, సంస్థా గత, రాజకీయ నిజాయతీ కుప్పకూలడం వల్ల జరిగిందనీ ఆమె అన్నారు. ‘చట్టాన్ని అమలు చేయ వలసినవారే అధికా రంలో ఉన్నవారిని సంతృప్తి పరచడం కోసం దురుద్దేశాలతో పని చేస్తే న్యాయం పట్టాలు తప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు’ అన్నారామె. ఇదీ మన దర్యాప్తు వ్యవస్థల పని తీరు!! ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త ‘వీక్షణం’ సంపాదకుడు -
సబీర్ భాటియా (బిజినెస్మేన్) రాయని డైరీ
దేశభక్తి మంచి విషయమే. అయితే నేనంటానూ... దేశానికి ఆర్థికంగా చేవనిచ్చే శక్తి కూడా మనలోని ఆ దేశభక్తికి ఉండాలని! శక్తి లేని భక్తి ఉత్త వేస్ట్ వ్యవహారం. దేశానికి వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. గర్వంగా తల పైకెత్తి చూస్తూ గట్టిగా ‘జై హింద్’ అని సెల్యూట్ కొట్టినప్పుడు జాతీయ జెండా నుండి బిలియన్ల కొద్దీ ఫారిన్ ఎక్ఛ్సేంజ్ నాణేలు దేశ ప్రజలపై గలగలమని కురిసినప్పుడు మాత్రమే అది ప్రయోజన కరమైన దేశభక్తి అవుతుంది. డబ్బును ఉత్పత్తి చెయ్యలేని దేశభక్తికి నా దృష్టిలో ఒక్క డాలర్ విలువైనా లేదు.తక్కువ మాట్లాడి ఎక్కువ పని చెయ్యటం దేశభక్తి. జీడీపీని చేతులు మారుతున్న డబ్బుతో కాకుండా, ముక్కలవుతున్న రెక్కల చెమట చుక్కలతో లెక్కేయటం దేశభక్తి. మన జీడీపీ ఘనంగా ఉన్నందువల్ల దేశంలో ఏం మార్పు వచ్చింది? మన ఎకానమీ ఫోర్త్ లార్జెస్ట్కి చేరుకున్నందు వల్ల ప్రపంచం మనల్ని చూసే విధానం ఏం మారింది? ఇలా మాట్లాడితే, ‘యాంటీ నేషనల్’ అంటారు! నిజాలను చూడటం యాంటీ నేషనల్ అయితే, నిజాలను చూడనివ్వకుండా చేయటం ‘నేషనలిజం’ అవుతుందా? నేనిక్కడ క్యాలిఫోర్నియాలో కూర్చుని ‘నా దేశం’ అంటూ ఇండియా గురించి మాట్లాడటం హర్ష్ గోయెంకా వంటి దేశభక్త భారతీయ పారిశ్రామికవేత్తలకు బొత్తిగా నచ్చటం లేదు! ‘‘మేము ఇక్కడ జీవిస్తున్నాం. ఇక్కడ ఓటు వేస్తున్నాం. ఇక్కడ పని చేస్తున్నాం. ఇక్కడ పన్నులు కడుతున్నాం. మేము ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాం. కాబట్టి, మా తలనొప్పులేవో మేము పడతాం. అన్నీ సర్దుకుని దేశం వదిలి వెళ్లిన వారు, మా కోసం ఏమీ ధర్మోపదేశాలు చేయనవసరం లేదు’’ అని హర్ష్ గోయెంకా!ఏం? దేశం లోపల ఉండేవారికి మాత్రమే దేశభక్తి ఉండాలా? దేశం బయట ఉన్నవారికి దేశభక్తి ఉండకూడదా? దేశభక్తి అంటే జయజయధ్వానాలు మాత్రమేనా? నా దేశం గురించి నేను మాట్లాడటం దేశభక్తి అవదా?!ఇంట్లో బియ్యానికి డబ్బుల్లేవు. దాని గురించి నేను మాట్లాడతాను. బయట అమ్మా, చెల్లి స్వేచ్ఛగా మసల లేరు. ఆ విషయమూ నేను మాట్లాడతాను. నాన్న మా అందర్నీ చదివించటానికి సతమతమౌతున్నారు. అదీ మాట్లాడతాను. ఇది పరువు సమస్య కాదు.నా దేశపు దాపరికాల సమస్య!దాపరికము, దీర్ఘాలోచన... రెండూ ఒకటే! మాట్లాడవలసిన చోట మౌనంగా ఉండటం తప్పవుతుంది. నిర్ణయం తీసుకోవలసినప్పుడు ఆలోచిస్తూ కూర్చోవటం అనర్థాన్ని తెస్తుంది.18 ఏళ్ల వయసులో నేనొక నిర్ణయం తీసుకున్నాను. అలాగే 28 ఏళ్ల వయసులో ఇంకొక నిర్ణయం. ఇప్పుడు నేనేమిటన్నది అప్పటి ఆ రెండు నిర్ణయాలే!‘‘నా లైఫ్ను నాకు వదిలేయండి’’ అని ఇంట్లో చెప్పి, నేను బెంగుళూరు రైల్వే స్టేషన్లో ఢిల్లీ రైలెక్కాను. ఢిల్లీ చేరాక, అక్కడి నుంచి ట్యాక్సీలో బిట్స్ పిలానీకి. అది నా మొదటి నిర్ణయం. తర్వాత పదేళ్లకు, నా ‘హాట్ మెయిల్’ను 400 మిలియన్ డాలర్లకు మైక్రోసాఫ్ట్కు ఇచ్చేశాను. అది నా రెండో నిర్ణయం.మరోసారి నేనిప్పుడు నిర్ణయం తీసుకోవా ల్సిన టైమ్ వచ్చింది. అయితే అది తీసుకునే నిర్ణయం కాదు, తీసుకోవాలని చెప్పే నిర్ణయం! అమెరికా మనపై ట్యారిఫ్లు వేస్తోంది. 25 శాతం, 50 శాతం, ఇంకా అంతకుమించి కూడా! మనమూ అమెరికాపై టారిఫ్లు వెయ్యాలి. ఇరవై శాతమో, యాభై శాతమో, వంద శాతమో కాదు. ‘0’ శాతం వెయ్యాలి! అవును. ‘0’ శాతంతో మనమంటే ఏంటో చూపించాలి. ట్యారిఫ్లు వెయ్యకపోతే అమెరికా బతకలేదు, ట్యారిఫ్లు ఎత్తేసి కూడా ఇండియా నిలబడగలదు అని నిరూపించాలి. ఇది సాహసం. కానీ, ఇదే తగిన సమాధానం! మనకెంత దేశభక్తి ఉందన్నది కాదు లెక్క, మనమంటే ప్రపంచానికి భయ భక్తులుండటం లెక్క! దేశభక్తికీ ఆర్థిక శక్తి ఉన్నప్పుడే లెక్కలు తేలుతాయి. -
యాభై శాతం హద్దు తొలగేనా?
దేశ రాజకీయం మళ్ళీ బీసీల చుట్టూ తిరుగుతున్నది. ఇందుకు తెలంగాణ ఒక వేదికగా మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం స్థానాలను కేటాయించాలని నిర్ణ యించి శాసన పరమైన చర్యలు చేపట్టింది. దీనిని పార్లమెంటు చేత ఆమోదింపజేసి రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించేలా కేంద్రంపై ఒత్తిడి కల్పించ డానికి సన్నాహాలు మొదలుపెట్టింది. తమిళనాడులో చాలా కాలం కిందటే 69 శాతం కోటా అమల్లోకి వచ్చింది. అంతే కాకుండా కేసులు వేయకుండా న్యాయ సమీక్షకు అతీతం చేస్తున్న రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో ఈ కోటాను తమిళనాడు ప్రభుత్వం చేర్పించుకున్నది. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినా...రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి, లక్షణానికి విరుద్ధంగా ఉండే చట్టాలను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినా వాటిని సమీక్షించే అధి కారం తనకున్నదని సుప్రీంకోర్టు ప్రకటించి ఉంది. తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నట్టు పంచాయతీల్లో బీసీలకు 42 శాతం కోటా బిల్లును పార్లమెంటు ఆమోదించడం గానీ, అది 9వ షెడ్యూ ల్లో చేర్చడం గానీ సులభ సాధ్యమైనవి కావు. కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే పనులను బీజేపీ ఎందుకు చేస్తుంది? పని కాకపోతే బీజేపీ బీసీలకు వ్యతిరేకి అని ప్రచారం చేయవచ్చన్నది కాంగ్రెస్ ఎత్తుగడ. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా కల్పిస్తే సుప్రీం కోర్టు మొత్తం రిజర్వేషన్లపై విధించిన 50 శాతం హద్దును అది మీరిపోతుంది. ఇలా హద్దు మీరిన రిజర్వేషన్లను కోర్టులు చాలా సార్లు రద్దు చేశాయి. తాజాగా మహారాష్ట్రలో మరాఠాలకు కేటాయించిన 16 శాతం రిజర్వేషన్లు వివాదాస్పదమయ్యాయి. దీనితో మహా రాష్ట్రలో రిజర్వేషన్లు 50 శాతం హద్దును దాటిపోతున్నాయంటూ బొంబాయి హైకోర్టును కొందరు ఆశ్రయించగా అది వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాను 16 నుంచి 12 శాతానికి, విద్యాసంస్థల్లో13 శాతానికి తగ్గించివేసింది. దీని మీద సుప్రీం కోర్టు స్టే ఇచ్చి, ఇప్పుడు విచారణ జరుపుతోంది. 1931 నాటి లెక్కలతో...విచిత్రమేమిటంటే ఇదే కాంగ్రెస్ పార్టీ 1980–90 మధ్య పదేళ్ల పాటు మండల్ కమిషన్ నివేదికను అమలుపరచకుండా ఆటకెక్కించింది. 1990లో వి.పి.సింగ్ ప్రధానిగా ఈ నివేదికను పాక్షికంగా అమలుచేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లను ఆచరణలోకి తెచ్చారు. తిరిగి 2006లో మన్మోహన్ సింగ్ నాయక త్వంలోని యూపీఏ ప్రభుత్వం కేంద్ర విద్యా సంస్థలలోనూ బీసీలకు 27 శాతం కోటాను అమలు చేసింది. 1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం నియమించిన బి.పి. మండల్ కమిషన్ 1931 కులగణన ప్రకారం దేశ జనాభాలో ఇతర వెనుకబడిన తరగతులవారు 52 శాతం ఉంటారని నిర్ధారించి, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించ కుండా ఉండేందుకు వారికి 27 శాతం కోటాను సిఫారసు చేసింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో కుల గణన జరిపిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. మోదీ ప్రభుత్వం ఈ విషయంలో తన చిరకాల వ్యతిరేకతకు తెర దించి, త్వరలో జరగబోతున్న దేశ జనాభా గణనలో భాగంగా కులాలవారీ గణనను చేపట్టడానికి అంగీకరించింది. ఇందుకు కారణం లేక పోలేదు. ఇంతవరకూ కేవలం ధనిక, మధ్యతరగతి వర్గాల పార్టీగా మాత్రమే ఉన్న బీజేపీ వైపు ఇప్పుడు పేదలు, అణగారిన వర్గాలు కూడా గణనీయంగా మళ్ళినట్టు భావిస్తున్నారు.రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని 1992 నవంబర్ 16న సుప్రీం కోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం విధించింది. ఇంద్ర సాహనీ కేసు లేదా మండల్ కమిషన్ కేసుగా ప్రసి ద్ధమైన వ్యాజ్యంలో ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు దేశంలో రిజ ర్వేషన్లపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలను ప్రకటించింది. కులం ప్రాతిపదిక వెనుకబాటుతనాన్ని ఈ తీర్పు గుర్తించింది. అంటే సామాజిక న్యాయ అవసరం రాజ్యాంగ విహితమైనదని చెప్పింది. అదే సమయంలో పరిమితులను విధించింది. 50 శాతం హద్దు, బీసీలలో మీగడ వర్గం, లేదా ముందుబడిన వర్గాన్ని (క్రీమీ లేయ ర్ను) గుర్తించి కోటా నుంచి దూరం చేయడం, పదోన్నతులలో రిజర్వేషన్లు ఉండరాదనడం ఈ కోవలోకి వస్తాయి. కేంద్రం తలుచుకుంటే...పదోన్నతులలో రిజర్వేషన్లను సుప్రీం కోర్టు రద్దు చేసినా 1995లో 77వ రాజ్యాంగ సవరణ ద్వారా 16(4ఎ)ను చేర్చి ఎస్సీ, ఎస్టీల విషయంలో వాటికి తిరిగి ప్రాణం పోశారు. వాస్తవానికి రాజ్యాంగం 340, 341, 342 అధికరణాలు బీసీ, ఎస్సీ, ఎస్టీల పరి స్థితులను మెరుగుపరచడానికి, వారి యెడల సానుకూల వివక్షను ఉద్దేశించి చేర్చినవి. అయితే సుప్రీం కోర్టు 50 శాతం పరిమితి ఉల్లంఘన రాజ్యాంగం 14వ అధికరణం హామీ ఇస్తున్న సమానత్వ సూత్రానికి విరుద్ధమని ప్రకటించింది. అత్యంత ప్రత్యేక పరిస్థితు లలో 50 శాతానికి మించి రిజర్వేషన్లను కేటాయించవచ్చని సైతం ఈ తీర్పు చెప్పింది. కానీ కోర్టులు ప్రధానంగా 50 శాతం హద్దును అమలు పరచడమే కర్తవ్యంగా తీర్పులు వెలువరిస్తున్నాయి. కేంద్రం తలచుకుంటే 50 శాతం హద్దును ప్రభావరహితం చేయడం కష్టమేమీ కాదు. విద్యకు, హక్కులకు సుదూరంగా విసిరి వేసిన ప్రజలను పైకి తేవడానికి ఉద్దేశించిన అధికరణాలురాజ్యాంగం ప్రసాదించినవి కాగా, 50 శాతం హద్దు సుప్రీం కోర్టు విధించినది. నిజానికి రాజ్యాంగం కేవలం సాంఘికంగా, విద్యా పరంగా వెనుకబడిన వర్గాలకే విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చింది. ఇందులో ఆర్థిక వెనుకబాటుతనం ప్రస్తావనే లేదు. అయినా మోదీ ప్రభుత్వం 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థిక బలహీన (ఈడబ్ల్యూఎస్) వర్గాలకు 10% రిజర్వేషన్లను కల్పించింది. ఇది 50 శాతం పరిమితిని దాటిపోడమే కదా! రాజ్య సభలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ విషయాన్నే ప్రశ్నించగా, సామాజిక న్యాయ శాఖ మంత్రి విచిత్రమైన సమాధానంతో సమర్థించుకున్నారు. ఇంద్ర సాహనీ కేసులో సుప్రీం కోర్టు విధించిన 50 శాతం హద్దు సామాజి కంగా విద్యాపరంగా (ఎస్.ఇ.బి.సి.) వెనుకబడిన వర్గాలకు మాత్రమే వర్తిస్తుందని, ఆర్థిక బలహీన వర్గాలకిచ్చిన 10 శాతం రిజర్వేషన్లకు, దానికి సంబంధం లేదని చెప్పారు. ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలు రాజకీయ అవకాశవాదాన్నే రుజువు చేస్తాయి. అందుకే ‘మేమెంద రమో మాకు అంత కోటా’ అనే నినాదం రోజు రోజుకీ పుంజుకుంటు న్నది. అందుకోసం మరొక రాజ్యాంగ సవరణ ద్వారా 50 శాతం హద్దును కూడా రద్దు చేయడమే ఏకైక మార్గంగా తోస్తున్నది.-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు-జి. శ్రీరామమూర్తి -
ఇండియాలోనూ పదహారేళ్లకు తగ్గించాలా?
16 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని యునైటెడ్ కింగ్డమ్ నిర్ణయించింది. స్కాట్లాండ్, వేల్స్ పార్లమెంటు ఎన్నికలకు ఇప్పటికే ఈ అర్హత అమలులో ఉంది. వయఃపరిమితి తగ్గింపు నిర్ణయం అనూహ్యమేం కాదు. లేబర్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలోనే ఈ వాగ్దానం చేసింది. దీని ఆమోదానికి అవసరమైన సంఖ్యాబలం ఆ ప్రభుత్వానికి ఉంది.16 ఏళ్ల బ్రిటిషర్లకు దీంతో సమకూరే ఇతర హక్కులు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. జాతీయ ఎన్నికల్లో ఓటేయడమే కాకుండా, తల్లితండ్రుల అంగీకారం ఉంటే వారు పెళ్లి కూడా చేసుకోవచ్చు. సివిల్ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చు కొనేందుకు అర్హులు.ఇంట్లోంచి వెళ్లిపోయి స్వతంత్రంగా జీవించే హక్కు లభిస్తుంది. ట్రేడ్ యూనియన్లో చేరే హక్కు వస్తుంది. పన్నులు చెల్లిస్తారు. వెయి టర్గా పనిచేసే హక్కుంటుంది. రైళ్లలో ఇక హాఫ్ టికెట్ కుదరదు, ఫుల్ టికెట్ తీసుకోవాలి.అయితే కొన్ని పనులు చేయడానికి వారికి ఇక మీదట కూడా అనుమతి ఉండదు. ఉదాహరణకు, వారు లాటరీ టికెట్లు కొనడం నిషేధం. తమంతట తాము కారు డ్రైవ్ చేయకూడదు. పబ్బులో కూర్చుని బీరు తాగకూడదు. అన్నింటికంటే ముఖ్యంగా, ఎన్నికల్లో పోటీ చేయడానికి పదహారేళ్ళ వారు అనర్హులు. అంటే తమకు తాము ఓటేసుకునే హక్కు ఉండదు. ఇదంతా సమాజంలో గందర గోళం సృష్టిస్తుంది అనుకుంటున్నారు కదూ? మీరే కాదు, బ్రిటన్ ప్రతిపక్ష మితవాదులు కూడా మీలానే అనుకుంటున్నారు. దేశాన్ని ఎవరు పాలించాలో నిర్ణయించే అంతటి పరిపక్వత 16 ఏళ్ల వారికి ఉంటుందా అనేది కీలకమైన ప్రశ్న. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, తెలివితేటలతో అనే పదం నేను ఈ ప్రశ్నలో ఉపయోగించ లేదు. 20లు, 30లు, లేదా 50లు, 60ల వయసులో ప్రజలు తెలివితేటలతో నిర్ణయం తీసుకుంటున్నారా? ఉద్వేగంతోనే ఓటేస్తున్నారా? లేదా కేవలం ఆనవాయితీగానో, దురభిప్రాయంతోనో వ్యవహరిస్తున్నారా? ఎలా నిర్ణయం తీసుకున్నా పెద్దవారికి చెల్లుబాటు అయినప్పుడు 16 ఏళ్ల వారికి ఎందుక్కాకూడదు?అయినా సరే, వారి పరిపక్వత సరిపోతుందా అనేది ప్రశ్నే. ఆ వయసు వారు కొందరికైనా సరే ఓటేసే పరిపక్వత ఉంటుంది. చాలా మంది పెద్దవారి కంటే వారు ఆలోచనాపరులు అని ‘యూకే యూత్ పార్లమెంట్’ చైర్పర్సన్ వ్యాఖ్యానించారు.16 ఏళ్ల వారు ఇంకా మానసికంగా ఎదిగే దశలోనే ఉంటారని యాభై పైబడిన పెద్దవాడిని కాబట్టి నేను అలానే అనుకుంటాను. అనుభవం ద్వారా నేర్చుకునే వయసనీ అంటాను. ఆ నేర్చుకునేది... ఒప్పు లేదా తప్పు ఏదైనా కావచ్చు. 1970ల ప్రారంభంలో నాకది కచ్చితంగా వర్తిస్తుంది. ఇందిరా గాంధీ కాంగ్రెస్, ప్రతిపక్ష మహా కూటమి... రెంటిలో ఒకదాన్ని నేను అప్పట్లో అర్థవంతంగా ఎంచు కునేవాడినా? చాలామంది మాదిరిగానే నా తల్లిదండ్రుల అభిప్రా యాన్నే నా అభిప్రాయం చేసుకుని ఉండేవాడినా?సొంత నిర్ణయం తీసుకునే చిన్న వాళ్లూ ఉంటారు. నేను కాదనను. కానీ, అధిక సంఖ్యాకులు తమ చుట్టూ ఉండే పెద్దవారి భావాలనే ఆమోదిస్తారు. వారితో ఏకీభవించడం లేదనీ, వారి కంటే ఎదిగిపోయామనీ తెలుసుకొనే వరకైనా అలా చేస్తారు. ఎవరికి ఓటేయాలనేది మన ముందున్న పలు ప్రత్యామ్నా యాలను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవలసిన విషయం. మరోసారి ఆలోచించండి. పెద్దవారు నిజంగా అలానే చేస్తున్నారా? 16 ఏళ్ల వారు ఎలా చేస్తారో అలానే మనం కూడా ఇతరుల ప్రభా వానికి లోనవటం వాస్తవం కాదా?వాస్తవానికి ఇండియా 1989లో 18 ఏళ్ల వారికి ఓటు హక్కు ఇచ్చినప్పుడు ఇవే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వ్యతిరేకుల సంశ యాలు అన్నీ తప్పని కాలం రుజువు చేసింది. ఇప్పుడూ అదే పున రావృతం అవుతుందా? పెద్దవారికి తేలిగ్గా మింగుడు పడని సత్యం ఏమిటంటే, ఇవ్వాళ్టి చిన్నవారు మనం ఆ వయసులో ఉన్నప్పటికంటే తెలివైనవారు. ప్రతి తరమూ తన ముందటి తరం కంటే తెలివిగా ఉంటుంది. కావాలంటే స్మార్ట్ ఫోన్ పట్టుకున్న నాలుగేళ్ల పిల్లాడిని గమనించండి. నేను చెప్పేది నిజమని మీకు తెలుస్తుంది. అందుకే నేను బ్రిటిష్ వారిని మెచ్చుకుంటున్నా. మనం కూడా వారిలా అలాంటి నిర్ణయం తీసుకోవాలేమో!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పాక్ ప్రమిదకు ట్రంప్ చమురు
పాకిస్తాన్–అమెరికాలు జూలై 31న ఒక నూతన వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. పాకిస్తాన్లోని చమురు నిక్షేపాలను అభివృద్ధి చేయడానికి సంయుక్తంగా కృషి చేయడంపై ఈ ఒప్పందం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇంధనం, ఖనిజాలు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, క్రిప్టో కరెన్సీలలో కూడా విస్తృత సహకారాన్ని అభివృద్ధి చేసుకోవాలని రెండు దేశాలూ కోరుకున్నాయి. ఇది పాకిస్తాన్లోని మౌలిక సదుపాయాలపై అమెరికా పెట్టుబడులను పెంపొందించేందుకు తోడ్పడవచ్చు. ద్వైపాక్షిక మార్కెట్ సౌలభ్య విస్తరణకు సాయపడవచ్చు. ‘మేం ఈ భాగస్వామ్యానికి నేతృత్వం వహించగల ఆయిల్ కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నాం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పాకిస్తాన్ చమురు సంపద మొదట్లో ఆ దేశ సెంట్రల్ పంజాబ్ లోని టూట్ చమురు క్షేత్రానికే పరిమితమైంది. ఆ ప్రాంతం పోటో హార్గా సుపరిచితం. అది ఇస్లామాబాద్కు సుమారు 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొదటి చమురు బావిని 1964లో తవ్వారు. వాణి జ్యపరమైన ఉత్పాదన 1967లో మొదలైంది. సుమారు 6 కోట్ల పీపాల చమురు ఉందని భావించారు. దాని నుంచి 12–15 శాతం భాగం మాత్రమే తవ్వితీయగలమని నిర్ణయించారు. ఉత్పాదన 1986లో శిఖర స్థాయికి చేరి, రోజుకు సుమారు 2,400 పీపాల చమురు వెలికి తీశారు. పెట్రో దిగ్గజం యూనియన్ టెక్సాస్కు చెందిన పాకిస్తానీ అనుబంధ సంస్థ... సింథ్ దిగువన ఒక చమురు క్షేత్రాన్ని 1981లో కనుగొంది. సింథ్ చమురు క్షేత్రాలు 1998–1999 నాటికి టూట్ చమురు క్షేత్రం కంటే ఎక్కువ చమురును అందించాయి. టూట్ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పాకిస్తాన్ జాతీయ చమురు కంపెనీ ఆయిల్ అండ్ గ్యాస్ డెవలప్ మెంట్ కంపెనీ (ఓజీడీసీ) లిమిటెడ్తో వాంకూవర్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ సావరిన్ ఎనర్జీ కార్పొరేషన్ 2005లో ఒక అవగా హనా పత్రంపై సంతకాలు చేసింది. షుంబర్గర్ ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్ 2006లో అక్కడ మొదట కార్యకలాపాలు ప్రారంభించింది. టూట్ చమురు క్షేత్రంలోను, దాని పొరుగునున్న మిస్సా కేశ్వాల్ చమురు క్షేత్రంలోను పనిచేసేందుకు రెండు కెనడియన్ కంపెనీలు రంగంలోకి దిగాయి. వీటి స్థానాన్ని ఇపుడొక అమెరికన్ కంపెనీ భర్తీ చేయవచ్చు. పాక్లో ఐదు చోట్ల –చెంగియూ పీకే లిమిటెడ్ (బెలూచిస్తాన్ లోని హబ్ ), పాక్–అరబ్ రిఫైనరీ కంపెనీ లిమిటెడ్ (గుజరాత్లోని కస్బా), పాకిస్తాన్ రిఫైనరీ లిమిటెడ్ (కరాచి), అటాక్ రిఫైనరీ లిమి టెడ్, నేషనల్ రిఫైనరీ లిమిటెడ్ (కామ్చి)–చమురు శుద్ధి కర్మాగారా లున్నాయి. వాటన్నింటి చమురు శుద్ధి సామర్థ్యం రోజుకు 4,20,000 పీపాల వరకు ఉంటుంది. గ్వాదర్లో మరో ఆయిల్ రిఫైనరీ నెల కొల్పే ఆలోచనలో ఉన్నట్లు సౌదీ ఆర్మకో 2019లో ప్రకటించింది. అమెరికా–పాకిస్తాన్ల మధ్య వాణిజ్యం 2024లో 7.3 బిలియన్ల డాలర్ల మేరకు ఉంది. అమెరికా వస్తువుల వాణిజ్య లోటు 300 కోట్ల డాలర్ల మేరకు ఉంటుంది. పాకిస్తాన్ నుంచి అమెరికా లినెన్ ఉత్ప త్తులు, లెదర్ వస్తువులు, కలపతో చేసిన ఫర్నిచర్ వస్తువులను దిగు మతి చేసుకొంటూ, పాకిస్తాన్కు ముడి పత్తి, విమానాల భాగాలు, ఇతర యంత్ర సామగ్రి పరికరాలను ఎగుమతి చేస్తోంది. ఈ అసమతౌల్య సమస్యను పరిష్కరించేందుకు అమెరికా నుంచి వస్తువుల దిగుమతులను పెంచుకుంటామని పాక్ పేర్కొంది. పాకిస్తాన్లోని ఖనిజ నిక్షేపాల పట్ల అమెరికాకు కొత్తగా ఆసక్తి పుట్టుకురావడం వెనుక వేరే లావాదేవీలు ఉన్నాయని వాషింగ్టన్ లోని విల్సన్ సెంటర్లో సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మైకేల్ కుగెల్ మ్యాన్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ట్రంప్ బంధువులకి వరల్డ్ లిబర్టీ ఫినాన్షియల్ సంస్థలో షేర్లు ఉన్నాయి. ఆ సంస్థ పాక్లో 2025 మార్చిలో ఏర్పడిన పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్తో ఆ వెంటనే ఏప్రిల్లో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. పాక్లో కొత్తగా మంత్రిగా నియమితుడైన బిలాల్ బిన్ సాకిబ్ ఆ కౌన్సిల్కి నేతృత్వం వహిస్తున్నారు. సాకిబ్ ఇటీవల బిట్ కాయిన్ల రంగంలోకి ప్రవేశించారు. లాస్ వేగాస్లో మే నెలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సాకిబ్, క్రిప్టోను కాపాడిన అధ్యక్షుడిగా తాను ట్రంప్ను గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. తర్వాత, వైట్ హౌస్లో అమెరికా అధికారులతో సాకిబ్ మంతనాలు జరిపారు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్కి, ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మాలిక్కి వైట్ హోస్లో ట్రంప్ విందు ఏర్పాటు చేయడానికి ఆ సమావేశమే మార్గం సుగమం చేసిందని చెబుతారు. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకుని నాలుగేళ్ళు గడుస్తున్నా, అమెరికా–పాక్ సంబంధాలలో ఇప్పటికీ చాలా అనిశ్చితి ఉంది. పాకిస్తాన్కు చెందిన ఎఫ్–16 యుద్ధ విమా నాల నిర్వహణ, మరమ్మతు పరికరాలకు సంబంధించి ఈ ఏడాది మొదట్లో అమెరికా సైన్యం సమకూర్చిన సాయం 397 మిలియన్ల డాలర్ల మేరకు ఉంది. చైనా ఆయుధాలపై మితిమీరి లేదా దాదాపు పూర్తిగా ఆధారపడుతున్న స్థితి నుంచి పాక్ రక్షణ వ్యవస్థను తప్పించాలని అమెరికా కోరుకుంటూ ఉండవచ్చుకానీ, మునుపు పాక్తో భారీ స్థాయిలో ఉన్న ఆయుధాల సంబంధాలను పునరు ద్ధరించుకోవడంపై అమెరికా వైపు ఏకాభిప్రాయం లేదు.ఈ నేపథ్యంలో, భారత్–పాక్ల మధ్య శాంతికి ప్రయత్నించినట్లు ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్నా, భారత్తో కలసి అడుగులు వేయడంపై అమెరికా తాత్సారం చూపడం సహజ పరిణామంగానే తోస్తుంది. రాణా బెనర్జీ వ్యాసకర్త క్యాబినెట్ సెక్రటేరియట్లో మాజీ ప్రత్యేక కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మృత్యువు ముంగిట మానవాళి
హిరోషిమా పేరు తలచుకోగానే, ఒక కళాత్మక సినిమాలోని ఒక చిన్న దృశ్యం నా మదిలో మెదులుతూ ఉంటుంది. అది రుయుసుకె హమగుచి తీసిన ‘డ్రైవ్ మై కార్’ సినిమా. దానికి 2021లో ఆస్కార్ అవార్డు లభించింది. అది వియోగం, కళాత్మక స్ఫూర్తి గురించిన కళాఖండం. ఆ సినిమాలో ఒక సన్నివేశం. శరదృతువు. ఆరుబయలులో హాయిగొలిపే గాలిలో రిహార్సల్ చేసేందుకు థియేటర్ నుంచి కొందరు నటులు బయటకు వస్తారు. చెఖోవ్ రాసిన ‘అంకుల్ వన్యా’ రష్యన్ నాటకంలో ఒక ఘట్టం రిహార్సల్ కోసం ఇద్దరు నటీమణులు నడుస్తూంటే వారి పాదాల కింద నలుగుతున్న ఎండు టాకుల చప్పుడు వినిపిస్తుంది. వారు అప్పటి వరకు విచారం, స్తబ్ధత గురించి చెఖోవ్ రాసిన వాక్యాలను వల్లె వేయడంలో సతమత మవుతూంటారు. బతకలేని జీవితాలు, చిదిమేసిన కలలు, కలలు కల్లలేనా? అనుకుంటూ మథనపడుతుంటారు. కానీ, ఆ పార్క్లో వారికి ఏదో తట్టింది. వారు బతికి తీరాలనుకున్నారు. జీవితాన్ని కొనసాగించాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారు. ఆ నటులకు ఈ పార్క్ విచారం, సహనశక్తికి సంబంధించి మొత్తం విశ్వాన్ని ఎలా చూపినట్లు? బతకడానికి స్ఫూర్తి ఎందుకంటే, అది ‘హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్’. గొప్ప ఆధునిక ఆర్కిటెక్ట్ కెన్ జో టాంగే 1954లో దాన్ని డిజైన్ చేశారు. అక్కడ 80 ఏళ్ళ క్రితం సుమారు 1,900 అడుగుల ఎత్తున, ఇంచుమించుగా చడీచప్పుడు లేకుండా ఒక కొత్త రకం బాంబు పేలింది. అక్కడ 1945లో నుంచున్నవారందరూ వెంటనే విగత జీవులయ్యారు. తర్వాత మంటలు. మిగిలిన పర్యవసానాలు!ఆగస్టు 6 తర్వాత, అక్కడ కొద్ది రోజులపాటు వర్షం పడింది.నల్లని జిగట చుక్కలు. మసి, శిథిలాల అణువులతో బరువైనవి. హిరోషిమా శిథిలాల మధ్యన కొనప్రాణాలతో ఉన్నవారు ఆర్తిగా ఆ నీటినే తాగారు. కానీ, అవి అణు ధార్మికతతో నిండిన వర్షపు చినుకులు. ‘‘అణువు మరింత విభజనకు గురైంది. ఈ అణు విచ్ఛిత్తితో, మొత్తం ప్రపంచం కుప్పకూలినట్లు నా అంతరాత్మకు అనిపించింది’’ అని పెయింటర్ వాసిలి కాండినిస్కీ 1913లో రాశారు. గడచిన శతా బ్దపు ఆరంభంలో ఎర్నెస్ట్ రూథర్ ఫర్డ్, పియరీ, మేరీ క్యూరీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటివారు అణు భౌతిక శాస్త్ర రహస్యాలను విప్పడం ప్రారంభించినపుడు, తదనంతర కాలంలో, నిర్ణీత కాల వ్యవధుల్లో వచ్చిన ఆర్టిస్టులు, రచయితలు, తత్త్వవేత్తలు ఈ కొత్త సైన్స్ సాంస్కృతిక పర్యవసానాలపై ఒకే రకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ వచ్చారు. ‘‘ప్రతీదీ అస్థిరమైనదిగా, ప్రమాదకరమైనదిగా, నిస్సారమైనదిగా పరిణమించింది’’ అని కాండినిస్కీ వ్యాఖ్యానించారు. ఆ వాదన ఎక్కడికి దారితీసిందో చూసేందుకు, అనుభూతి చెందేందుకు ప్రయత్నించడానికి నేను హిరోషిమా వచ్చాను. పీస్ మెమోరియల్ మ్యూజియం జనంతో నిండినా, మౌనం రాజ్య మేలుతూ, అణు శక్తి పార్శా్వన్ని చూపింది. కాలిపోయిన విద్యార్థుల యూనిఫారాలు. పిల్లల దుస్తులు. హిరోషిమాలోని కుటుంబం ఒకటి ఈ మధ్యనే ఆరు ముడతల తెరను మ్యూజియానికి ఇచ్చింది. దాని బంగారపు అంచులపై నల్లని వాన చారికలు. ఇంత భయం గొలిపే నైరూప్య చిత్రాన్ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు.హిరోషిమాలో హైపోసెంటర్కి సుమారు 850 అడుగుల దూరంలో ఓ బ్యాంక్ బిల్డింగ్ ఉంది. సుమారు 3,871 డిగ్రీల సెల్సి యస్ లేదా అంతకుమించిన ఉష్ణోగ్రతలో అక్కడ చనిపోయిన ఒక వ్యక్తి శాశ్వత నీడతో బ్యాంకు మెట్లు నల్లని రూపు సంతరించు కున్నాయి. వాటిని చూడడంతోనే ఆధునిక కళారీతి ‘ఆటమిక్ ఆప్టిమిజం’ దెబ్బకు అదృశ్యమైపోయిందని చెప్పాలి. ఒక డాక్యుమెంటరీలో ఆ మెట్లను చూసిన పెయింటర్ ఈవ్ క్లేన్ కొన్ని భయంకర మానవాకారాలను సృష్టించారు. నీలి రంగు ‘ట్రేడ్ మార్క్’గా గుర్తింపు పొందిన ఆయన చిత్రాలు కొన్ని ఆ తర్వాత బూడిద తెలుపునకు మారాయి. ఏదీ రాజకీయ వివేకం?హిరోషిమాపై మొదటి బాంబును ప్రయోగించిన మూడు రోజులకే నాగసాకిపై రెండవ బాంబు వదిలారు. 1945 ఆగస్టు 6 తదనంతర దశాబ్దాలలో చిత్రకళ, సినిమా, సాహిత్య రంగాలు పరస్పర విధ్వంసం వల్ల ఉత్పన్నమయ్యే వినాశకర పరిస్థితులను రూపుకట్టించేందుకు నడుం బిగించాయి. ‘ఆన్ ద బీచ్’ (1959) సినిమాలో, మూడవ ప్రపంచ యుద్ధం నుంచి బతికి బట్టకట్టిన వారు, అణు ధార్మికత ఆస్ట్రేలియాను తాకనుందని బితుకు బితుకు మంటూ ఉంటారు. జార్జ్ ఆర్వెల్, ఫిలిప్ కె. డిక్, కిమ్ స్టాన్లీ రాబిన్సన్ వంటివారు అణు ఉత్పాతం తర్వాత జీవితం ఎలా ఉండ గలదో లేదా ఏం మిగిలి ఉంటుందో ఊహించారు. వారంతా అణు భవిష్య ప్రవక్తలు. మన సంస్థలు, మన నాయకులు ప్లుటోనియం మాదిరిగానే అస్థిరమైనవారని వారు కనుగొన్నారు. హిరోషిమాపై దాడి జరిగిన 80 ఏళ్ళ తర్వాత, మనం మన నడవడికను సరిదిద్దుకోకపోగా అణు వినాశనపు నూతన శకంలోకి అడుగులు వేసే పెద్ద పొరపాట్లు చేస్తున్నాం. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ తర్వాత, క్యూబా క్షిపణుల సంక్షోభం తర్వాత తిరిగి, ఈ భూగోళం అణు యుద్ధపు అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ అన్నారు. ‘‘మును పెన్నటికన్నా కూడా అణ్వస్త్రాలతో నిర్మూలనం కాగల ప్రమాదం అంచున’’ మనం ఉన్నట్లు అధ్యక్షుడు ట్రంప్ పాలనా యంత్రాంగంలో జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ ఈ ఏడాది మొదట్లో హెచ్చరించారు. ఇరాన్లోని అణుశక్తి అభివృద్ధి ప్రదే శాలపై అమెరికా, ఇజ్రాయెల్ జూన్లో బాంబులు కురిపించాయి. అణు సామర్థ్య శక్తులను ఆధునికీకరించే పనులను ఉత్తర కొరియా కొనసాగిస్తోంది. అణ్వస్త్ర అగ్ర రాజ్యాలు రెండు కాదు మూడు అని తెలుసుకుని తీరాలన్నట్లుగా చైనా అణ్వాయుధాలను విస్తరిస్తోంది. అమెరికా–రష్యాల మధ్య కుదిరిన కడపటి ఆయుధ నియంత్రణ ఒడంబడికకు ఇంకో ఆరు నెలల్లో కాలం చెల్లనుంది. ఆయుధాల నియంత్రణ అనే సూత్రానికే దాంతో కాలం చెల్లుతుందని అను కోవచ్చు. ఇంత జరుగుతున్నా ప్రజల నుంచి ఆగ్రహావేశాలు ఏమంత లేవు. అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎక్కడా గతంలోలా శాంతి కాముక అడ్వర్టయిజ్మెంట్లు లేవు. పైగా, గ్రహాంతరవాసులు, ఏ దిశగా దూసుకెళతాయో చెప్పలేని గ్రహ శకలాలు, అత్యంత తాజాగా అయితే కిల్లర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటివల్ల ఈ భూగోళానికి ప్రమాదం పొంచి ఉన్నట్లుగా పుస్తకాలు, సినిమాలు వస్తున్నాయి.ప్రస్తుతం వివిధ దేశాల వద్ద 12,000 అణ్వాయుధాలు ఉన్నట్లు ‘ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్’ అంచనా. అయినా, అవేవో రెండవ ప్రపంచ యద్ధం నాటివనే భ్రమల్లోనే మనం ఇప్పటికీ ఉన్నాం. హిరోషిమా దాడిపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడానికి బదులు అణుబాంబు అంత విధ్వంసాన్ని సృష్టించిందా అనే ఆశ్చ ర్యమే అమెరికన్లలో ఎక్కువ వ్యక్తమైంది. బతికి ఉండగలమా?‘ద న్యూయార్కర్’ పత్రిక 1946లో తెచ్చిన ప్రత్యేక సంచికలో హిరోషిమాపై జాన్ హెర్షే రాసిన వార్తా కథనాన్ని మినహాయిస్తే, అణు విధ్వంసాన్ని మొదట్లో విహంగ వీక్షణంగానే చూశారు. అమెరికా ఆక్రమిత దళాలు 1945 నుంచి 1952 వరకు ఆ రెండు విధ్వంస నగరాలలోని దృశ్యాలను నిష్ఠగా సెన్సార్ చేస్తూ వచ్చాయి. హిరోషిమాలో అమెరికా సైన్యం తీసిన ఫోటోలలో జనం అరకొర గానే కనిపిస్తారు. అవి చికిత్స పొందుతున్నవారిని చూపుతాయి. ప్రజలు ఎంత బాధకు ఓర్చు కున్నదీ తెలియదు. నాగసాకిలో ఎట్సూయూకీ మాట్సీ అనే హైస్కూలు టీచరు ఉన్నారు. తీరిక వేళల్లో ఆయన హైకూలు రాస్తూంటారు. ఆయన 1945 ఆగస్టు 9న ఒక ఆహార పంపిణీ కేంద్రం వద్ద పనిచేస్తున్నారు. అర్ధరాత్రి మంటలను దాటుకుంటూ ఎలాగో ఇంటికి పరుగెత్తారు. ఆయన పిల్లల్లో ఇద్దరు అప్పటికే చనిపోయారు. ఇంకో పిల్లాడు ఆ మర్నాడు కన్నుమూశాడు. భార్య వారం లోపలే గతించింది. అణు విస్ఫోటం గురించి 1946లో నాగసాకిలోని ఒక జర్నల్లో ఆయన కవితలను ప్రచురించాలని కోరుకున్నప్పుడు దాని ఎడిటర్లు అందుకు నిరాకరించారు. దానికి విరుద్ధంగా 1960లు, 1970లలో అమెరికాలో చాలామంది ఆర్టిస్టులకు ఈ బాంబులు కథా వస్తువుగా మారాయి. అణుబాంబు దాడి వంటి అత్యంత వినాశకర ఘట్టాన్ని నిజంగా పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యం కాని పని. టోక్యో నుంచి హిరోషిమాకు బులెట్ రైలులో వెళుతూ నేను గుంథర్ యాండర్స్ రాసిన పుస్తకాన్ని చదవడం ప్రారంభించా. ఆయన 1945 ఆగస్టు 6న న్యూయార్క్లో ఉన్నారు. ఆ రోజు రేడియోలో వార్తలు విన్నప్పుడు ఆయన మెదడు మొద్దుబారిపోయింది.తర్వాత కొన్నేళ్ళపాటు ఆయన కాగితంపై కలం పెట్టలేక పోయారు. సవ్యంగా లేదా సత్ప్రవర్తనతో జీవించడం గురించిన పరిశీలనే 2,500 ఏళ్ళుగా తత్త్వశాస్త్రానికి మూల బిందువుగా ఉంటూ వస్తోంది. అది కాస్తా, ఒక్క రోజులో, ఒక్క చర్యతో, తుడిచి పెట్టుకుపోయింది. హిరోషిమా తర్వాత, ‘‘గత యుగాల మౌలిక నైతిక ప్రశ్నను విప్లవాత్మకంగా పునర్ నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంది’’ అని యాండర్స్ వాదించవచ్చు. ‘‘మనం ఎలా జీవించాలి? అని ప్రశ్నించుకోవడానికి బదులుగా, అసలు మనం జీవించి ఉంటామా?’’ అని ప్రశ్నించుకుని తీరాలి. మన ముఖ్య నైతిక వైఫల్యం అందులోనే ఉంది.జేసన్ ఫారగో వ్యాసకర్త కళా విమర్శకుడు (‘న్యూయార్క్ టైమ్స్ సౌజన్యంతో) -
ఎవరిని ఉద్ధరించడానికి ఈ ఒప్పందం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గందరగోళం సృష్టించాయి. ట్రంప్ రోజుకో మాదిరిగా మార్చివేస్తున్న ఈ సుంకాలు ఎంతోకాలం మనలేవు. అయితే, వీటిని భౌగోళిక రాజకీయ ఆయు ధాలుగా ప్రయోగిస్తున్న తీరు మాత్రం రానున్న సంవత్సరాల్లో అంతర్జాతీయ వాణిజ్య రూపురేఖలను మార్చేస్తుంది.ఇతర దేశాలు తమ వస్తువుల మీద అధిక సుంకాలు విధిస్తు న్నాయని అదేపనిగా చెబుతూ అమెరికా ప్రపంచ ప్రజల దృష్టి మళ్లిస్తోంది. నిజానికి సుంకాల ముసుగులో అగ్రరాజ్యం అల్పా దాయ దేశాల అభివృద్ధిని బలిచేస్తూ, తమ కంపెనీలకు ప్రపంచ మార్కెట్లలో పెద్ద పీట వేయించడమే ఎజెండాగా పెట్టుకుంది. టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టకుండా చైనాను నిలువరించాలన్న వ్యూహాత్మక లక్ష్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. పేటెంట్లు, కాపీరైట్లు, పారిశ్రామిక డిజైన్లతో కూడిన మే«ధాసంపత్తి వర్ధమాన దేశాలకు అందకుండా నిరోధించడం అమెరికా ధ్యేయం. ఇండోనేషియాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇందుకు ఒక ఉదాహరణ.ఇండోనేషియాకు జరిగినట్టే...అమెరికా పారిశ్రామిక, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై ఇండో నేషియా 99 శాతం సుంకాలను ఎత్తివేసింది. ఇక ఆ దేశ ఎగు మతులపై అమెరికా 19 శాతం సుంకం విధిస్తుంది. ఈ ఒప్పంద ఫలితంగా ఇండోనేషియా రైతులు ప్రభుత్వ భారీ సబ్సిడీల ఫలితంగా చౌకగా లభించే అమెరికా వ్యవసాయోత్పత్తులతో పోటీ పడాల్సి ఉంటుంది. అమెరికా సంస్థలు అత్యధిక ప్రయోజనాలు పొందుతాయి. యూఎస్ తయారీ వస్తువులపై పరిమాణపరంగా ఎలాంటి నిబంధనలూ ఉండవు. అమెరికా వెహికల్ సేఫ్టీ నిబంధ నలను, ఉద్గార ప్రమాణాలను ఇండోనేషియా యథాతథంగా ఆమో దించింది. వైద్య పరికరాలు, ఔషధాల విషయంలోనూ అమెరికా ఎఫ్డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అనుమతులను అంగీకరిస్తుంది. యూఎస్ ఆహార, వ్యవసాయ ఉత్పత్తులకు స్థానిక లైసెన్సింగ్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. మరింత సమస్యాత్మకంగా మేధాసంపత్తి నిబంధనలు ఉన్నాయి. సాంప్రదాయిక విజ్ఞానం, జన్యు వనరులు, నిర్బంధ లైసెన్సులు వంటి అంశాల్లో ఇప్పటికే ఉన్న అన్ని వివాదాలనూ పరిష్కరించుకోవాలని ఈ ఒప్పందం ఒత్తిడి చేస్తోంది. దీంతో, అమెరికా కంపెనీలు ఎలాంటి సమ్మతి పొందాల్సిన, పరిహారం చెల్లించాల్సిన అవసరం లేకుండానే అక్కడి సాంప్రదాయిక విజ్ఞా నాన్ని కొల్లగొడతాయి.ఇండియాకు ఏం లాభం?ఇలాంటి ఎజెండాతో ముందుకు పోతున్న దేశం అమెరికా ఒక్కటే కాదు. యూకేతో ఇటీవలే ఇండియా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇండోనేషియా ఒప్పందం కంటే ఎక్కువగా ప్రశ్నలు రేకెత్తిస్తోంది. చెప్పాలంటే ఈ ఒప్పందానికి వాణిజ్యపరంగా ఎలాంటి ప్రాధాన్యతా లేదు. కారణం, ఈ రెండు దేశాలు ప్రపంచ వ్యాప్తంగా చేసే ఎగుమతుల విలువలో వీటి ద్వైపాక్షిక వాణిజ్యం 2.5 శాతం కంటే కూడా తక్కువే. యూకే–ఇండియా తాజా ఒప్పందం పర్యవసానంగా, 92 శాతం యూకే ఎగుమతులకు ఇండియా పూర్తిగానో పాక్షికంగానో సుంకాల మినహాయింపు ఇచ్చింది. అలాగే యూకేకు ఇండియా చేసే 99 శాతం ఎగుమతులు ‘ట్యాక్స్ ఫ్రీ’గా ఉంటాయి. వాటిపై ఆ దేశం ఎలాంటి సుంకాలూ విధించదు. అయితే, యూఎస్–ఇండోనేషియా ఒప్పందంలో వలే ఈ ఒప్పందంలోనూ మేధాసంపత్తి నిబంధనలు కీలకమైనవి. ఇవి పశ్చిమ దేశాల పేటెంట్ దారులకు అనుకూల రీతిలో ఉన్నాయి. ఔషధాల విషయంలో భారత పౌరులు, దేశీయ ఉత్పత్తి సంస్థల కంటే యూకే ‘బిగ్ ఫార్మా’ ప్రయోజనాలకే ప్రాధాన్యం లభించింది. ఉదాహరణకు, నిర్బంధ లైసెన్సులకు బదులు ‘స్వచ్ఛంద లైసెన్సు’లను ఈ ఒప్పందం ప్రోత్సహిస్తోంది. భవిష్యత్తులో ధరల తగ్గింపు అవకాశాలను ఈ నిబంధన నీరుగార్చుతుంది. పేటెంటు ప్రమాణాల సమన్వయీకరణ క్లాజుకూ ఇండియా అంగీకారం తెలిపింది. దీంతో ప్రస్తుత ఔషధాలకు చిన్నా చితకా మార్పులు చేసి వాటి పేటెంట్ హక్కులు పొడిగించుకునే దొడ్డిదారికి ద్వారాలు పూర్తిగా తెరచినట్లయింది.ఇండియాలో పేటెంటెడ్ డ్రగ్ వాడకం వివరాలు వెల్లడించాల్సిన గడువును ఏడాది నుంచి మూడేళ్లకు పొడిగించే నిబంధన వినాశ కరమైంది. గిరాకీకి తగినంత సరఫరా లేదని (అన్ మెట్ డిమాండ్) నిరూపించడం ఆ ఔషధం ఉత్పత్తి చేయదలచిన కొత్త దరఖాస్తు దారుకు కష్టతరంగా మారుతుంది. ఇవి ఫార్మా పరిశ్రమ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయి. అంతే కాకుండా, అందుబాటు ధర లకు మందులు లభ్యం కాని పరిస్థితి ఉత్పన్నమవుతుంది.బలహీన పడిన ఒక మాజీ వలసవాద దేశానికి, అదీ ప్రధాన వాణిజ్య భాగస్వామి కూడా కానటువంటి దేశానికి ఇండియా ఇలా రాయితీలు ఇవ్వడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ), యూఎస్లతో జరుపుతున్న వాణిజ్య చర్చల మీదా ఈ ఒప్పందం వల్ల మరింత ఆందోళనకరమైన ప్రభావం పడుతుంది. ప్రొ‘‘ జయతీ ఘోష్వ్యాసకర్త యూనివర్సిటీ ఆఫ్ మసాచూసెట్స్లో ఎకనామిక్స్ ప్రొఫెసర్ -
తలతిక్క సుంకాల తలనొప్పి!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన బృందంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై భారత్ నాలుగు నెలలు చర్చలు జరిపినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నవాటిపై 26 శాతం సుంకం విధిస్తామని ఏప్రిల్ 2న బెదిరించిన ట్రంప్ ఆగస్టు 30న 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.చర్చలు మొదలైనప్పటి నాటికన్నా పరిస్థితి ఇపుడు మరింత దారుణంగా తయారైంది. రష్యా నుంచి చమురు, రక్షణ సామగ్రి కొనుగోళ్ళను నిలిపివేయకపోతే జరిమానా కింద మరికొంత సుంకాన్ని విధిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు. అయితే, ఆ సుంకం శాతాన్ని నిర్దిష్టంగా ప్రకటించలేదు. భారత్ సుంకాలు ప్రపంచం మొత్తంమీద చాలా ఎక్కువగా ఉన్నాయని, ద్రవ్యేతర వాణిజ్య చర్యలు ‘‘అత్యంత శ్రమ పెట్టేవిగా, అప్రియమైనవిగా’’ ఉన్నాయని ఆయన అన్నారు.ట్రంప్ కోరుతున్నదేమిటి?అమెరికాతో వాణిజ్యం విషయంలో, ట్రంప్ కుయుక్తులను, మనం ఎలా అర్థం చేసుకోవాలి? అన్ని రకాల చర్చలనూ విరమించుకోవాలా లేక లొంగిపోవాలా? ద్వైపాక్షిక వాణిజ్య లోటును నిర్మూలించే పేరుతో ట్రంప్ మొదలెట్టిన జూదం దాని భాగస్వామ్య దేశాలకు ఎంత రుచించని దైనా, ఆయన లక్ష్యాలు మాత్రం స్పష్టం. అమెరికాతో వాణిజ్యంలో మిగులులో ఉన్న దేశాలు, ఆ వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు నాలుగు చర్యలు తీసుకోవాలని ట్రంప్ కోరుతున్నారు. 1. సుంకం పైసా కూడా లేకుండా అన్ని అమెరికా ఉత్పత్తులకూ సంపూర్ణ మార్కెట్ సౌలభ్యం కల్పించడం; 2. అమెరికాకు ఎగుమతి చేసే వాటిపై 15–25 శాతం సుంకం విధించడానికి అంగీకరించడం; 3. వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు వీలుగా అమెరికా నుంచి ఇపుడు కొంటున్నవాటికి తోడుగా విమానాలు, ఇంధనం వంటివాటిని కొనడం; 4. అమెరికాలో వస్తూత్పత్తికి పెట్టుబడులు పెట్టడం.చాలా దేశాలు రెండు కారణాలతో అమెరికాకు ఎగుమతులు ఇష్టపడతాయి. ఒకటి– అది చాలా పెద్ద మార్కెట్ (మొత్తం ప్రపంచం ఎగుమతుల్లో సుమారుగా 15 శాతం దానికే వెళుతున్నాయి), రెండు – ఎగుమతిదారులకు లాభాలు సమకూరుతాయి. కానీ అద నపు సుంకాల భారాన్ని నెత్తికెత్తుకుని అనిష్టంగానైనా ఎగుమతులు చేస్తే వారికొచ్చే లాభాలు ఏమీ ఉండవు. అదనపు సుంకాల భారాన్ని భరించినా ఎంతో కొంత లాభాన్ని మిగుల్చుకోగలిగిన అవకాశం భారతీయ ఎగుమతిదారులకు లేదు. కనుక, అదనపు 25 శాతం సుంకానికీ, జరిమానా సుంకానికీ భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు.తీర్చలేని డిమాండ్లుజన్యుపరంగా సవరించిన గింజలతో తీసిన వంటనూనె దిగు మతులను (జీఎం నూనె మనుషుల ఆరోగ్యానికి మంచిది కాదని నిరూపించే శాస్త్రీయ అధ్యయనాలు ఏవీ జరగలేదు), పాడి పరిశ్రమ ఉత్పత్తులను, పౌల్ట్రీ ఉత్పత్తులను (అమెరికన్ చికెన్ లెగ్స్ వినియోగదారుల సంక్షేమాన్ని మెరుగుపరుస్తాయి) అనుమతించడం అంటే... వ్యావసాయిక వాణిజ్యాన్ని భారత్ సరళీకృతం చేయడం. ఇది వివేకవంతమైన చర్యగానే తోస్తుంది. కానీ, దేశీయ రైతులను సంరక్షించవలసిన బాధ్యత వల్ల, ఈ విషయంలో భారత దేశం పాలుపోని స్థితిలో ఉంది. వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికాకు ఎలాంటి రాయితీలూ ఇవ్వగలిగిన స్థితిలో ఇండియా లేదు. భారతదేశ రక్షణ అవసరాలకు ఒదగని లేదా మరీ ఖరీదుతో కూడిన ఎఫ్–35 విమానాలను లేదా ముడి చమురును కొనాలని అమెరికా బలవంతపెట్టడం బ్లాక్ మెయిల్ చేయడమే! దానికి లొంగి పోతే భారత్ బలహీనమైనదనే ముద్రపడుతుంది. ఇక భారత్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వీకరించడమేకానీ, ఇవ్వడం చాలా అరుదు. విదేశాల్లో భారత్ పెట్టుబడులు కొద్దిగానే ఉన్నాయి. రానున్న 5–10 ఏళ్ళలో, అమెరికాలో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడం కూడా మనకు కష్టమే. ట్రంప్ అడుగుతున్న నాలుగింటిలో దేన్నీ తీర్చగల స్థితిలో ఇండియా లేదు.ట్రంప్ నాలుగు డిమాండ్లకూ వియత్నాం, జపాన్, ఇండో నేషియా, యూరోపియన్ యూనియన్ మాత్రమే అంగీకరించాయి. అమెరికా అదనపు సుంకాలను దిగమింగుకుని ఈ దేశాల ఎగుమతిదారులు తమ వస్తువుల ధరలను తగ్గిస్తారా లేక అమెరికా వినియోగదారులకు ఆ భారాన్ని బదలీ చేస్తారా? లేక రెండింటి మిశ్రమంతో ముందుకు సాగుతారా? ఆ యా ఎగుమతి దేశాలు అదనపు సుంకాలను తామే భరించడంలో లేదా అమెరికా వినియోగ దారులకు బదిలీ చేయడంలో విఫలమైతే నష్టపోయేది అమెరికా, దాని వినియోగదారులే! ఇచ్చిన వాగ్దానం మేరకు, ఆ యా దేశాలు, నిజంగా చెప్పినంత సంఖ్యలో విమానాలను, ఇంధన ఉత్పత్తులను, రక్షణ పరికరాలను కొనుగోలు చేయగలుగుతాయా? దానికి చాలా కాలం పడుతుంది. పైగా, వాటి ధరలు తగ్గించాలని అవి అమెరికాను డిమాండ్ చేయవచ్చు. తాము దిగుమతి చేసుకుంటున్న వస్తువులు ఇలా ఉండాలి, అలా ఉండాలని చర్చలతో సుదీర్ఘ కాలయాపన చేయ వచ్చు. ఈ తతంగం ద్వారా ట్రంప్ ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారో అది నెరవేరకపోవచ్చు. లేదా ఆశించింది కొండంత, లభించింది ఆవగింజంతగా పరిణమించవచ్చు. ఇండియా ముందున్న మార్గంభారత్ ఎదుట రెండు అవకాశాలున్నాయి. ఒకటి– జపాన్, వియత్నాం, ఇండోనేషియా, యూరోపియన్ యూనియన్ల మాదిరిగా తలొగ్గి ఒప్పందం కుదుర్చుకోవడం. తర్వాత, భారత్ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎగువ పేర్కొన్న ఎత్తుగడలను అనుసరించడం. రెండు– ట్రంప్ వాణిజ్య బృందంతో అన్ని చర్చలకూ స్వస్తి పలికి, ఏ సుంకాలు విధించుకుంటావో విధించుకో అనడం. అదనపు సుంకాల భారాన్ని నెత్తిన రుద్దుకోకుండా, వస్తువులను వాటి సాధారణ ధరలకే విక్రయించవలసిందని ఎగుమతిదారులకు నచ్చజెప్పడం. అమెరికాలోని దిగుమతిదారులు కొంటే మంచిదే. లేదంటే, ఆ వస్తువులను, అటువంటి అసంబద్ధ సుంకాలు లేని ఇతర దేశాలకు విక్రయిచడం. దేశీయ మార్కెట్ లోనూ అమ్ముకునేటట్లు చూసుకోవడం. కొన్ని ఎంపిక చేసుకున్న వాటికి అంగీకరించి, మధ్యే మార్గాన్ని అనుసరించడం వల్ల భారత దేశానికి పెద్దగా ఒనగూడేది ఏమీ ఉండదు. అంతకంటే, రెండవ దారిని ఎంచుకుని ముందుకు సాగడమే మంచిది. ట్రంప్ పాలనా యంత్రాంగం తలతిక్కతో తీసుకుంటున్న సుంకాల చర్యల ప్రతికూల పర్యవసానాలను త్వరలోనే (మహా అయితే 3–6 నెలల్లో) చవిచూడవలసి రావచ్చు. అమెరికా దిగు మతులు మందగిస్తాయి (ఏప్రిల్–జూన్ త్రైమాసిక గణాంక వివ రాలు దాన్ని ధ్రువపరుస్తున్నాయి). సుంకాల రాబడి కింద అమెరికాకు కొద్ది వందల బిలియన్ల డాలర్లు లభించవచ్చు. కానీ, దానిలో చాలా భాగాన్ని అమెరికాలోని దిగుమతిదారులు, వినియోగదారులే చెల్లించవలసి ఉంటుంది. ధరలు మంట పుట్టించడంతో వినియోగ దారుల తిరుగుబాటుకు ఎంతో కాలం పట్టదు. పరిస్థితులు తేటతెల్లమవుతున్నకొద్దీ, ట్రంప్ తాను విధించిన చాలా సుంకాలను వెనక్కి తీసుకోక తప్పదు. అందుకే ఇండియా వేచి చూడటమే మంచిది. దానివల్ల పెద్దగా ఖర్చయ్యేదేమీ ఉండదు.సుభాష్ చంద్ర గర్గ్ వ్యాసకర్త ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అన్యాయమా? ఆలస్యపు న్యాయమా?!
బొంబాయి హైకోర్టు జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చందక్ల ద్విసభ్య ధర్మాసనం జూలై 21న ఒక చరిత్రా త్మకమైన తీర్పు ఇచ్చింది. అది పదిసంవత్సరాల కింద జరిగిన అన్యాయాన్ని కొంతవరకు సరిదిద్దడం మాత్రమే గాని పూర్తి న్యాయం అనడానికి కూడా వీలు లేదు.ప్రత్యేక మకోకా న్యాయస్థానం 2015లో అయిదుగురు నిందితులకు విధించిన మరణశిక్ష, ఏడుగురికి విధించిన యావజ్జీవ శిక్ష చెల్లవని, పందొమ్మిదేళ్లుగా జైలులో మగ్గుతున్న నిందితులు నేరం చేశారని ప్రాసిక్యూషన్ నిస్సందేహంగా రుజువు చేయలేకపోయిందని, తప్పుడు సాక్ష్యాలు సృష్టించిందని, పోలీసు కస్టడీలో చిత్రహింసలు పెట్టి నేరాలు ఒప్పించారని, కూటసాక్ష్యాలు తయారుచేశారని, దర్యాప్తు ప్రక్రియ కళ్లకు గంతలు కట్టుకున్నట్టు ఇతర అవకాశాల వైపు చూడకుండా ఎవరో ఒకరిని ఇరికించి శిక్ష విధించే లక్ష్యంతో సాగిందని హైకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.దేశంలో కొనసాగుతున్న పోలీసు వ్యవస్థ మీద, దర్యాప్తు యంత్రాంగం మీద, ప్రాసిక్యూషన్ మీద, కిందిస్థాయి న్యాయ వ్యవస్థ మీద తీవ్రమైన విమర్శనాత్మక వ్యాఖ్యానం ఇది.పందొమ్మిది సంవత్సరాల కింద, 2006 జూలై 11న ముంబాయి సబర్బన్ రైళ్లు రద్దీగా ఉండే సమయంలో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లలో వరుస బాంబు పేలుళ్లు జరిగి 187 మంది మరణించారు, ఎనిమిది వందల మంది గాయపడ్డారు. ఈ దారుణ మారణకాండకు వ్యతిరేకంగా దేశమంతా నిరసన పెల్లు బికింది. మహారాష్ట్రలో అప్పుడు అధికారంలో ఉండిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కేసు దర్యాప్తు చేయడానికి నియమించిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కొద్ది నెలల్లోనే 13 మంది నేరస్థులను పట్టుకున్నామని ప్రకటించింది.సరైన దర్యాప్తు జరపకుండానే కొందరు ముస్లిం అనుమానితులను పట్టుకుని వారి చేత నేరం ఒప్పించి కేసు నడిపే ఆనవాయితీని పాటించింది. పాకిస్తాన్ ఐఎస్ఐ, లష్కర్ ఎ తోయెబా, దేశంలో నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లా మిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, కొందరు భారతీయ అను చరులతో కలిసి కుట్ర చేసి ఈ బాంబు దాడులు చేశారని మహా రాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (మకోకా), భారత శిక్షా స్మృతి, ఆయుధాల చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలా పాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నడిపారు. ప్రత్యేక మకోకా న్యాయస్థానం 2007లో విచారణ ప్రారంభించి, 2015 సెప్టెంబర్లో పదమూడు మంది నిందితులలో పన్నెండు మందికి శిక్షలు విధించి, ఒకరిని నిర్దోషిగా విడుదల చేసింది. అలా నిర్దోషిగా విడుదలైన వ్యక్తి డా‘‘ అబ్దుల్ వహీద్ షేఖ్ ప్రస్తుత హైకోర్టు తీర్పుకు ప్రధాన కారకులలో ఒకరు. అప్పటికి తొమ్మిది సంవత్సరాల పాటు జైలులో మగ్గిపోయి నిర్దోషిగా విడుదలయ్యాడు. అరెస్టుకు ముందు ఆయన ముంబైలో ఉపాధ్యాయుడుగా పని చేసేవారు. రాజకీయాలలో పాల్గొనడం కాదు గదా, వాటి మీద ఆసక్తి కూడా ఎన్నడూ చూపలేదు. తాను, తన ఉద్యోగం, కుటుంబంగా ఉండేవారు. జైలులో ఉన్న కాలంలో ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎల్ఎల్బీ చదివాడు. విడుదలయ్యాక శిక్షలు పడిన ఇతరనిందితులు కూడా తనలాగనే నిర్దోషులేననీ, వారి మీద ప్రాసిక్యూషన్ తప్పుడు కేసు బనాయించిందనీ, వారిని కూడా నిర్దోషులుగా న్యాయస్థానంలో నిరూపించడమే తన లక్ష్యమని ‘ఇన్నోసెన్స్ నెట్వర్క్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి హైకోర్టు అప్పీలు ప్రక్రియలో పాలు పంచుకున్నాడు. ‘అక్విట్ అండర్ ట్రయల్’ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నిరపరా ధులైన ఖైదీల విషాద గాథలు వినిపించాడు. ఎల్ఎల్ఎం చదివి, దేశంలో నేర విచారణ వ్యవస్థ మీద పీహెచ్డీ చేశాడు. దేశమంతా ఎన్నోచోట్ల సభల్లో ఈ కేసు గురించి మాట్లాడాడు. ‘బేగునా ఖైదీ’ (నిరపరాధులైన ఖైదీలు) అని ఆయన ఉర్దూలో రాసిన పుస్తకం ఎన్నో భాషల్లోకి అనువాదమై ఈ కేసులో పోలీసులు, ప్రాసిక్యూషన్ చేసిన అక్రమాల గుట్టు విప్పింది.ఒకవైపు సామాజిక స్థాయిలో ఈ పోరాటం చేస్తూనే, న్యాయపోరాటాన్ని కూడా కొనసాగించాడు. మొత్తం కేసులో ప్రాసిక్యూషన్ వాదన అంతా నిందితుల ఒప్పుదల ప్రకటనల మీదనే ఆధారపడిందని, ఆ ఒప్పుదల ప్రకటనలు చిత్రహింసలు పెట్టి తయారు చేసినవని ఆయన వాదించాడు. ప్రాసిక్యూషన్ సమర్పించిన ఇతర సాక్ష్యాలు ఆకుకు అందకుండా పోకకు పొందకుండా, పరస్పర వైరుద్ధ్యాలతో ఉన్నాయని చూపాడు. పేలుడు పదార్థాలకు సంబంధించిన కీలక ఫోరెన్సిక్ నిర్ధారణలు బలహీనంగా, వీరే నిందితులు అని నిర్ధారించడానికి వీలులేకుండా ఉన్నాయని చూపాడు. సమాంతరంగా జరిగిన పరిశోధ నలు కూడా నిజంగా నేరస్థులు ఇతరులని నిర్ధారించాయి.అప్పీలులో ఈ వాదనలను కూలంకషంగా పరిశీలించి హైకోర్టు ఇచ్చిన 671 పేజీల తీర్పు... ఆ ఒప్పుదల ప్రకటనల విశ్వసనీయతను ప్రశ్నించింది. సందర్భ సాక్ష్యం బలహీనంగా ఉందని చెప్పింది. కాల్ డాటా రికార్డులలో, అవి ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చడంలో ప్రాసిక్యూషన్ తప్పులు చేసిందని చెప్పింది. సాక్షులు పరస్పర విరుద్ధంగా, పొంతన లేకుండా మాట్లాడారని గుర్తించింది. ప్రాసిక్యూషన్ చట్టపరమైన నిబంధ నలను ఉల్లంఘించిందని గుర్తించింది. ‘ఈ పోరాటం నా ఒక్కడిదే కాదు. అది సత్యం కోసం, న్యాయం కోసం, అన్యాయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మా సమూహం కోసం జరిపిన పోరాటం’ అన్నాడు వహీద్. ఇప్పుడు నిర్దోషులుగా, లేదా నేరం చేశారని ప్రాసిక్యూషన్ రుజువు చేయలేక పోయినవారిగా బైటపడిన పన్నెండు మందిలో ఒకరు 2021లో కోవిడ్తో జైలులోనే చనిపోయారు. మిగిలిన వారందరూ వారి ఇరవైల్లో జైలుకు వెళ్లి ఇప్పుడు నలభయ్యో పడి దగ్గర పడుతుండగా విడుదల అవుతున్నారు. అందుకే హైకోర్టు తీర్పు రాగానే వహీద్ ‘ఈ తీర్పు అసంపూర్ణం. కోర్టు కేసు పునర్విచారణకు ఆదేశించ లేదు. రెండు దశాబ్దాల జీవితం నష్టపోయినవారికి పరిహారం గురించి మాట్లాడలేదు. కనీసం ఇప్పటికైనా నిజమైన నేరస్థులను పట్టు కొమ్మని ప్రాసిక్యూషన్కు చెప్పలేదు. అయితే ఇవాళ్టి భారతదేశంలో ఈ అసంపూర్ణ తీర్పు అయినా ముస్లింలకు గొప్ప విజ యమే’ అన్నాడు. ఈ నిర్దోషులు ఇంతకాలం అనుభవించిన తప్పుడు ముద్ర తర్వాత, విచ్ఛిన్న మైన తమ జీవితాలను పునర్నిర్మించుకోగలరా? ఆలస్యంగా జరిగిన న్యాయం అన్యాయమే అన్నమాట మరొకసారి రుజువు అవుతున్నదా? -ఎన్. వేణుగోపాల్, వ్యాసకర్త ‘వీక్షణం’ సంపాదకుడు -
జేమ్స్ కామెరన్ (డైరెక్టర్) రాయని డైరీ
‘అవతార్–3’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. సన్నగా మళ్లీ కడుపునొప్పి మొదలైంది! డైవర్టిక్యులిటిస్!! డాక్టర్లు ఈ నొప్పికి పేరైతే పెట్టారు కానీ, నయమవటం మాత్రం నా చేతుల్లోనే ఉందంటారు. నా చేతుల్లో అంటే – నేను తినే వాటిల్లో! ‘‘మిస్టర్ కామెరన్! ఇలా నొప్పి వచ్చినప్పుడు మీరు కొద్ది రోజుల పాటు కూరగాయల రసం మాత్రమే తాగండి. అలాగే గుజ్జు లేని పండ్ల రసాలు...’’ అంటారు వైద్యులు. ఈ మందు చీటీ నా దగ్గర ‘అవతార్–1’ ముందు నుంచే ఉంది. పొత్తి కడుపు కింద, ఎడమవైపు సన్నగా మొదలైన నొప్పి... కాసేపు మెలిపెడుతోంది, కాసేపు కత్తితో పొడిచినట్లుగా ఉంటోంది. ఆత్మశక్తిని కూడదీసుకుని పని చేస్తున్నాను. ‘‘ఏంటి మళ్లీనా?’’ అన్నారు, నా పక్కనే ఉన్న స్టీఫెన్ ఇలియెట్. ఫిల్మ్ ఎడిటర్ తను. అతడికి నా డైవర్టిక్యులిటిస్ గురించి తెలుసు.‘‘లేదు, లేదు... స్టీఫెన్, ఏదో కొద్దిగా! అంతే’’ అన్నాను, నవ్వే ప్రయత్నం చేస్తూ. పెయిన్ కన్నా కూడా పని ఆగి పోవటం ఎక్కువ పెయిన్ నాకు. డిసెంబర్లో ‘అవతార్–3’ రిలీజ్ పెట్టుకున్నాం. ఆ లోపే నేను అన్నీ సర్దేసుకుని న్యూజిలాండ్ వెళ్లిపోవాలి. ఇప్పటికి రెండుసార్లు యూఎస్ సిటిజెన్షిప్కు అప్లికేషన్ పెట్టి కూడా వెనక్కు తీసుకున్నాను. మొదటిసారి 2004లో జార్జి బుష్ అమెరికా ప్రెసిడెంటుగా రీ–ఎలెక్ట్ అయినప్పుడు. ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ డోనాల్డ్ ట్రంప్ రీ–ఎలెక్ట్ అయినప్పుడు. హారిఫిక్ ప్రెసిడెంట్లు ఇద్దరూ! ఇలాంటి వాళ్లు మళ్లీ గెలవటం అంటే ఒకే కారుకు పదే పదే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండటం. అమెరికాను వదిలి, న్యూజిలాండ్ వెళ్లటం అంటే కేవలం ఇల్లు మారటం కాదు. ఒక మంచి ఇంట్లోకి మారటం! న్యూజిలాండ్ అందర్నీ సమానంగా చూస్తుంది. కెనడా నుంచి వెళ్లిన వారినైనా, వేరే ఖండం వారే అయినా అక్కడ ప్రశాంతంగా జీవించవచ్చు. ప్రశాంతంగా జీవించటం అంటే, జీవితమంతా ఇష్టంగా చేస్తూ వచ్చిన పనిని జీవితాంతమూ కొనసాగిస్తూ ఉండటం. నేనైతే ఎనభై ఏళ్లకీ, తొంభై ఏళ్లకీ ఎన్ని ‘అవతార్’లు తీయగలిగితే అన్నీ తీస్తూనే ఉంటాను. ఇక తీయలేనప్పుడు, సినిమా తియ్యటం ఎంత తేలికో పిల్లలకు చెబుతూ ఉండిపోతాను. న్యూజిలాండ్ వెళ్లినప్పుడు నన్నొక పట్టభద్రుడు కలిశాడు. ‘‘సర్! నేను సినిమా డైరెక్టర్ని అవ్వాలనుకుంటున్నాను. అవగలనా?’’ అని అడిగాడు.‘అవగలనా?’ అనుకుంటే ఎవరూ అవలేరు.‘‘అవలేనా!’ అనుకుంటే ఎవరైనా అవగలరు అన్నాను.అతడి కళ్లు మెరిశాయి. ‘‘ఒక కెమెరా తీసుకో. ఒక కథ అనుకో. చిన్న కథా, చెత్త కథా అని చూడకు. నీ ఫ్రెండ్స్ చేత యాక్ట్ చేయించు. నీకు సిస్టర్ ఉంటే తనకూ ఒక పాత్ర ఇవ్వు. షూటింగ్ అయ్యాక టైటిల్స్లో డైరెక్టర్గా నీ పేరు పెట్టుకో. ఇక అప్పట్నుంచీ నువ్వు సినిమా డైరెక్టర్! నువ్వెంత బడ్జెట్లో తీస్తావో, నీకెంత ఇవ్వాలో నిర్మాతలతో బేరం కుదుర్చుకో’’ అని చెప్పాను. మెరుస్తున్న అతడి కళ్లలో నాకు ‘జెనోజెనిసిస్’ సినిమా కనిపించింది. నా 24 ఏళ్ల వయసులో మా టీమ్ తీసిన తొలి సినిమా అది. 12 నిమిషాల సైన్స్ ఫిక్షన్ షార్ట్ ఫిల్మ్! ‘‘కామెరన్... కామెరన్... మళ్లీ మీరు న్యూజిలాండ్ వెళ్లిపోయారా?’’ అని, నా భుజం ఊపుతూ పండ్ల రసం అందించారు స్టీఫెన్.‘‘థ్యాంక్యూ స్టీఫెన్’’ అన్నాను, అతడి చేతిలోని గ్లాసును తీసుకుంటూ. స్టీఫెన్ నా భుజం ఊపినప్పుడు ఏ యాంగిల్లోనో నా కడుపు నొప్పి కాస్త తగ్గినట్లుగా అనిపించింది.కదలిక వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తోందీ అంటే నాకెందుకో నమ్మకం కలుగుతోంది – నేను ముందసలు అమెరికా నుంచి కదిలితే, ఈ డైవర్టిక్యులిటిస్ నన్నొదిలేస్తుందని!-మాధవ్ శింగరాజు -
ఇండియన్ ఎకానమీ ‘డెడ్ ఎకానమీ’నా?
‘ఇండియన్ ఎకానమీ... డెడ్ ఎకానమీ’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించడం, వెనువెంటనే రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలను సమర్థించడం; శశిథరూర్, రాజీవ్ శుక్లా లాంటి కాంగ్రెస్ నేతలే రాహుల్ వ్యాఖ్యల్ని తప్పు పట్టడం... తాజా పరిణామాలు.నిజానికి ఏ ప్రభుత్వం పనితీరును అయినా అంచనా వేయడా నికి కీలక అంశం ద్రవ్యోల్బణం. అది ముఖ్యంగా... పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను ప్రభావితం చేస్తుంది. యూపీఏ రెండో హయాంలో ప్రజల్లో ఏర్పడిన ఆగ్రహానికి ఒక కారణం... దేశంలోని ద్రవ్యోల్బణం. ఇది అప్పట్లో గరిష్ఠంగా 12 శాతానికి చేరుకుంది. ఆ తరువాత ప్రతిపక్ష నేతలు... ఆర్థిక మాంద్యాన్ని, ద్రవ్యోల్బణాన్ని ఆయుధంగా మలచుకుని మోదీ ప్రభుత్వాన్ని బద్నాం చెయ్యాలని పదేపదే ప్రయత్నించారు. కానీ... వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్పటికీ, ద్రవ్యోల్బణం అనేది 2019 ఎన్నికల్లో గానీ, 2024 ఎన్నికల్లో గానీ ప్రముఖ ఎన్నికల నినాదంగా మారలేదు. ద్రవ్యోల్బణాన్ని నిర్ధారించటానికి మన దేశంలో... 2012 వరకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ)ని అనుసరించారు. ఆ తర్వాత నుంచి కంజ్యూ మర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ)ని అనుసరిస్తున్నారు. ఎన్డీయే హయాంలో సగటు సీపీఐ ద్రవ్యోల్బణం 5.03 శాతంగా ఉంది. ఇది ఆర్బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం 4 శాతం నుండి 6 శాతానికి మధ్యలో ఉంది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం రేటు ఇంకా తక్కువగా... 3.1 శాతమే ఉంది. కాబట్టి ఇది ఆల్ టైవ్ు రికార్డ్ అన్నమాట! మోదీకి ముందు ప్రధానిగా పని చేసిన మన్మోహన్ సింగ్ పాలనా కాలంతో పోల్చినా కూడా ఇది ఎంతో మెరుగైన స్థితి. తక్కువ సమయంలో ద్రవ్యోల్బణం అంతగా నియంత్రణ అయిందంటే, దాని పైన ప్రభుత్వ ప్రభావం ఉందనే కదా! దీర్ఘకాలిక ద్రవ్యోల్బణ సమస్యను అధిగమించడంలో మోదీ ప్రభుత్వం తెచ్చిన అనేక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు సహాయపడ్డాయి.అంతకుముందు, భారతదేశంలో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వస్తువుల రవాణాలో... పర్మిట్లు, పన్నుల పరంగా ఆలస్యం చోటు చేసుకునేది. జీఎస్టీ రావడంతో పరిస్థితి మారిపోయింది. దీనివల్ల రవాణా వేగంగా జరిగి ఇంధన ఆదా పెరిగింది.క్రూడాయిల్ ధరలలో తగ్గుదల, డిజిటల్ సంస్కరణలు, పాల నలో అవినీతి తగ్గడం... ముఖ్యంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందేలా చెయ్యడం కూడా ద్రవ్యోల్బణ నియంత్రణకు తోడ్ప డ్డాయి. ప్రజలకి డబ్బులివ్వడం కంటే... వాళ్లకి పనికొచ్చే నాణ్యమైన ఇళ్ళను ‘పీఎమ్ ఆవాస్ యోజన’ ద్వారా ప్రభుత్వమే కట్టించి ఇవ్వడం, టాయిలెట్లు కట్టించి ఇవ్వడం లాంటి ప్రత్యక్ష ప్రయోజన కార్యక్రమాలు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయ పడ్డాయి. కార్పొరేట్ పన్ను తగ్గింపులు, పీఎల్ఐలతో సహా అనేక పథకాలతో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్రం సఫలమైంది. ఇవన్నీ పటిష్ఠమైన ఆర్థిక క్రమశిక్షణతో వచ్చాయి. వాటి కారణంగానే ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలలో 4వ స్థానానికి మనం ఎగబాకాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుత పరిస్థితులపై ఎవరైనా ఒక అంచనాకు రావాలి.– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి ‘ సామాజిక విశ్లేషకుడు


