లడ్డూపై అబద్ధాల ప్రచారం రాజకీయ కుట్రే! | Sakshi Guest Column On Tirumala Laddu Chandrababu Politics | Sakshi
Sakshi News home page

లడ్డూపై అబద్ధాల ప్రచారం రాజకీయ కుట్రే!

Feb 6 2026 2:16 AM | Updated on Feb 6 2026 2:16 AM

Sakshi Guest Column On Tirumala Laddu Chandrababu Politics

అభిప్రాయం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగకుండానే జరిగిందని ప్రచారం చేయడం పెద్ద నేరం. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు లడ్డూలో కల్తీ జరిగిందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ను దోషిగా నిలబెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన స్వామివారి ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డుకు ఈడ్చడం ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తికి ఏమాత్రం తగనిది. సీబీఐ నేతృత్వంలోని స్వతంత్ర సిట్‌ దర్యాప్తులో ఈ విషయాలన్నీ నేడు స్పష్టమయ్యాయి. అయినా  వైఎస్సార్‌ సీపీని టార్గెట్‌ చేసేందుకు మళ్లీ దర్యాప్తు కమిటీని నియమిస్తామంటున్నారు. సీబీఐ తమకు అనుకూలంగా నివేదిక ఇవ్వనందుకే ఈ కమిటీని నియమిస్తున్నారా?

రాజకీయ లబ్ధి కోసం భక్తుల భావోద్వేగాలతో ఆడుకున్న చంద్రబాబు, ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని ప్రజలకు క్షమాపణ చెబుతారని ఆశించినవారికి నిరాశే మిగిలింది. తన తప్పు బయటపడకుండా ఉండేందుకు అనుకూల మీడియాతో కలిసి ప్రజ లను తప్పుదోవ పట్టించే కొత్త పంథాను ఆయన అనుసరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ‘నేను మారిన మనిషిని, నన్ను నమ్మండి’ అని చెప్పి అధికారం దక్కించుకున్నాక, తన సహజ స్వరూపాన్ని మరో సారి బయటపెట్టుకున్నారు. 

సీబీఐ ఛార్జ్‌షీట్‌లో జంతు కొవ్వు కలవ లేదని తేలినా, పదే పదే అబద్ధాలు చెప్పి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి గురించి మాట్లాడేటప్పుడు ఓపిక, సహనం ఉండాలి. ఎటు వంటి విచారణ లేకుండా, కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు కాకుండా ముఖ్యమంత్రే స్వయంగా కల్తీ జరిగిందని ప్రకటించడం వెనుక ఉన్న ప్రాతిపదిక ఏమిటో అర్థం కావడం లేదు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సైతం ఘాటుగా స్పందించింది. సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి అపోహలు సృష్టించడం తగదని మందలించింది.

భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అనుబంధ సంస్థ లైన హరియాణాలోని ‘నేషనల్‌ డైరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’, గుజరాత్‌ లోని ‘నేషనల్‌ డైరీ డెవలప్‌మెంట్‌ బోర్డు’ పరిశోధనల ప్రకారం లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయింది. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కూడా జంతు కొవ్వు ప్రస్తావనే లేదు. ఇలాంటప్పుడు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసినందుకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. హిందువుల మనోభావాలను తాకట్టు పెట్టి చేసిన ఈ రాజకీయ క్రీడ అత్యంత దురదృష్టకరం. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు, ఇప్పటికైనా బాబు తన తప్పును ఒప్పుకుని హుందాగా వ్యవహరించడం అవసరం.

దేవుని పేరుతో రాజకీయం చేసే బీజేపీ నాయకత్వం ఈ విష యంలో అనుసరిస్తున్న మౌనం విస్మయకరంగా ఉంది. ఒక మహిళా నేత తమ పార్టీకి కష్టం వచ్చినప్పుడు మౌనంగా ఉండి, పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీకి చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే స్పందిస్తున్నారు.  గతంలో కేంద్రం తెచ్చిన రైతు చట్టాలపై సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పుడు నోరు మెదపని ఆమె, ఇప్పుడు కోర్టు చేసిన వ్యాఖ్యలపై వింతగా స్పందిస్తున్నారు. తన బంధువు దోషిగా తేలుతారని తెలిసి ఇటువంటి విమర్శలు చేస్తున్నారా? మరొక నాయకుడు ఆలయ మెట్లు కడుగుతూ, సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. తన రాజకీయ భాగస్వామిని రక్షించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జరిగిన తప్పునకు బాధ్యత వహిస్తూ భక్తులకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది.


డా‘‘ పూనూరు గౌతమ్‌ రెడ్డి
వ్యాసకర్త వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement