
అఫ్గానిస్తాన్(తాలిబాన్) విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీతో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్
విశ్లేషణ
2021 ఆగస్టులో అధికారాన్ని చేపట్టిన తర్వాత మొదటిసారి, తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీకి న్యూఢిల్లీలో భారత్ ఆతిథ్యం ఇచ్చింది. తాలిబాన్ను అఫ్గానిస్తాన్ అధికారిక ప్రభుత్వంగా గుర్తించకుండానే, దానితో చర్చలు సాగించే విధానాన్ని ఇన్నాళ్లూ భారత్ అను సరిస్తూ వచ్చింది. ఆ మాటకొస్తే, రష్యా మాత్రమే కొద్ది నెలల క్రితం ఆ ప్రభు త్వాన్ని గుర్తించింది.
ముత్తాకీ న్యూఢిల్లీ రావడం, ఆయన్ని అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రిగా భారత్ ప్రస్తావించడంతో, తాలిబన్ను అఫ్గానిస్తాన్ అధికారిక ప్రభుత్వంగా గుర్తించే దిశగా భారత్ మరో అడుగు వేసిన ట్లయింది. అలా చేస్తే, ఎదురుకాగల ఇబ్బందులు తక్కువ, ఒనగూడ గల వ్యూహాత్మక ప్రయోజనాలు ఎక్కువ.
మూడు ముఖ్య అభ్యంతరాలు
అవాంఛనీయ విలువలను ప్రబోధిస్తూ, తన జనాభాలో సగం మందికి వ్యతిరేకంగా వివక్షాయుత విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వాన్ని భారత్ గుర్తించకూడదన్నది ఒక వాదన. దీనిలో సహే తుకత ఉంది. అయితే, మనం ఒక విషయాన్ని దృష్టిలో ఉంచు కోవాలి. (క్రూరమైన పనులను నాజూకుగా చేస్తున్నంత మాత్రాన) అన్ని ప్రభుత్వాలూ నైతికంగా ఆమోదయోగ్యమైనవి కావు.
అంగీ కారయోగ్యం కాని విలువలతో కూడిన ప్రభుత్వాన్ని గుర్తించినంత మాత్రాన, ఆ విలువలను మనం ఆమోదిస్తున్నట్లు కాదు. అంత ర్జాతీయ రాజకీయాలు అంతకు మించి జటిలమైనవి. వ్యక్తిగత స్నేహానికి ఎంచుకొనే ప్రమాణాలను, ప్రభుత్వాల విధాన నిర్ణయాలకు వర్తింపజేయలేం.
అఫ్గానిస్తాన్ చట్టబద్ధమైన పాలకులుగా తాలిబాన్ను గుర్తించడం వల్ల, ఈ ప్రాంతంలో శుద్ధాచారవాదం పెరిగేందుకు దోహద పడినట్లు అవుతుందనేది రెండో అభ్యంతరం. కానీ, తాలిబాన్ను గుర్తించడం ద్వారా వారు ప్రధాన జీవన స్రవంతిలోకి రావడానికీ, సామాజికంగా మెరుగైన ప్రవర్తనను అలవరచుకోవడానికీ బాటలు పరచినట్లు అవుతుంది. 1996 నాటి తాలిబాన్ వేరు, 2025 తాలి బాన్ వేరు. వారు మరికాస్త మధ్యేవాదులుగా మారారు, ఆధునిక మార్గాలను అనుసరించేందుకు మరింత సుముఖంగా ఉన్నారు.
స్త్రీ–పురుష వివక్ష చూపడంపై విమర్శలను ఎదుర్కొన్న తర్వాత, భారతీయ మహిళా జర్నలిస్టులను ఆహ్వానించడం ద్వారా, తాలి బాన్ తన తప్పును సరిదిద్దుకుంది. కొన్నిసార్లు మార్పు, ఏక పక్షంగా దూరం పెట్టడం కన్నా, నలుగురితో కలవడం, ఒత్తిడిని చవిచూడటం వల్ల వస్తుంది. వారి మత విశ్వాసాలు, విధానాలతో ఏకీభవించనంత మాత్రాన పొరుగు దేశాన్ని దూరంపెట్టడం గొప్ప రాజ్య లక్షణం అనిపించుకోదు.
తాలిబాన్కు దగ్గరైతే పాకిస్తాన్తో మన సంబంధాలు మరింత క్షీణిస్తాయనేది మూడో అభ్యంతరం. వాస్తవం ఏమిటంటే, భారత్ –పాక్ సంబంధాలు ఇప్పటికే అట్టడుగుకు చేరాయి. ఈ చర్య వల్ల ఇప్పుడు ఆ గతిశీలతలో గణనీయంగా రాబోయే మార్పు ఏమీ లేదు.
నాలుగు ప్రధాన ప్రయోజనాలు
ఐ.సి.814 విమాన హైజాక్ ఉదంతాన్ని పక్కన పెడితే, సాధా రణంగా భారత్ పట్ల తాలిబాన్ వైఖరి సానుకూలంగానే ఉంది. ఆ హైజాక్ సూత్రధారి పాకిస్తాన్ సైనిక గూఢచారి సంస్థ. ఆ ఘటనలో తాలిబాన్ కన్నా ఐఎస్ఐ పాత్ర ఎక్కువ. తాలిబాన్ 2021 ఆగస్టులో అధికారం చేపట్టిన నాటి నుంచీ భారత్తో సంబంధాలు మెరుగు పరచుకునేందుకు ప్రయత్నిస్తోంది. కశ్మీర్ను భారత్ – పాక్ మధ్య ద్వైపాక్షిక అంశంగా చూడటం ద్వారా, అది భారత్ వైఖరిని సమ ర్థిస్తోంది.
రెండు – రష్యాను అనుసరిస్తూ మిగిలిన దేశాలూ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి ఎంతో కాలం పట్టదు. తాలిబాన్పై పశ్చిమ దేశాల ఒత్తిడీ తగ్గింది. చైనా, పాకిస్తాన్ కూడా రష్యాను అనుసరించే అవకాశం ఉంది. మిగిలిన దేశాలు గుర్తించేంత వరకు భారత్ వేచి చూసి, ఆ తర్వాత గుర్తిస్తే, దౌత్యపరంగా దానికి ఇపుడు న్నంత ప్రాధాన్యం ఉండదు. పైగా, త్వరగా గుర్తించడం వల్ల, వ్యూహాత్మకంగా మొదటి మిత్రుని సానుకూలత లభిస్తుంది. అఫ్గానిస్తాన్ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహించే అవకాశం దక్కుతుంది.
మూడు – తాలిబాన్ నేతృత్వంలోని అఫ్గానిస్తాన్తో సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడం మనకే మంచిది. ఈ ప్రాంతంలోని దేశాలను భారత్కు దూరం చేయాలని చైనా – పాకిస్తాన్ వేస్తున్న పథకాలను అడ్డుకునేందుకు వీలవుతుంది. కాబూల్తో చైనా సాన్నిహిత్యం కూడా పెరుగుతోంది. దానితో వీలైనంత మేరకు సమతూకం సాధించేందుకు ఇది తోడ్పడుతుంది. కాబూల్లో ఎవరు అధికారంలో ఉన్నారనేదానితో ప్రమేయం లేకుండా, అఫ్గానిస్తాన్ చాలావరకు, భారతదేశానికి ముఖ్యమైన భాగస్వామిగా కొనసాగుతూ వస్తోంది. కాబూల్లో అనంగీకార ప్రభుత్వం ఉందని, ఆ భాగస్వామ్యాన్ని పాడుచేసుకోకూడదు.
‘అఫ్గానిస్తాన్ సార్వభౌమత్వానికీ, ప్రాంతీయ సమగ్రతకూ, స్వాతంత్య్రానికీ’ భారత్ పూర్తిగా కట్టుబడి ఉంది’’ అని ముత్తాకీ పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చేసిన ప్రకటన ప్రధానంగా పాకిస్తాన్ను ఉద్దేశించినదిగానే కనిపిస్తోంది. అఫ్గాన్ ప్రభుత్వంతో క్రియాశీలంగా వ్యవహరించడంలోని వ్యూహా త్మక విలువను న్యూఢిల్లీ గుర్తించిందనీ, ఈ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రాబల్యాన్ని కట్టడి చేసేందుకు ఒక మార్గంగా దాన్ని భావిస్తోందనీ ఆ ప్రకటన సూచిస్తోంది.
అంతిమంగా, భారత్ నుంచి దౌత్యపరమైన గుర్తింపు లభించడం అంతర్జాతీయంగా గుర్తింపు కోసం తహతహలాడుతున్న తాలి బాన్కు ఎంతో ఊతాన్ని ఇస్తుంది. ప్రాంతీయంగా అ–మిత్ర వాతా వరణం పెరుగుతున్న నేపథ్యంలో, ఈ చర్య ద్వారా, మధ్య ఆసియాలో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, స్నేహపూర్వక ఉనికితో భారత్ లబ్ధి పొందనుంది.
హ్యాపీమాన్ జాకబ్
వ్యాసకర్త ‘కౌన్సిల్ ఫర్ స్ట్రేటజిక్ డిఫెన్స్ అండ్
రిసెర్చ్’ వ్యవస్థాపక డైరెక్టర్
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)