నేపాల్‌ సంధిస్తున్న శేషప్రశ్నలు | Sakshi Guest Column On Nepal Issues | Sakshi
Sakshi News home page

నేపాల్‌ సంధిస్తున్న శేషప్రశ్నలు

Sep 24 2025 12:27 AM | Updated on Sep 24 2025 12:27 AM

Sakshi Guest Column On Nepal Issues

నేపాల్‌ ఆపద్ధర్మ ప్రధాని సుశీలా కర్కీ ముందు సవాళ్ళెన్నో!

విశ్లేషణ

కొన్ని దశాబ్దాలు అసలేమీ జరగదు, కానీ కొన్ని రోజుల్లోనే దశాబ్దాలు జరిగిపోతాయి. లెనిన్‌ అన్న ఈ మాటలు నేపాల్‌ విషయంలో అక్షర సత్యాలయ్యాయి. నేపాల్‌లో ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్ళూనుకుంది. వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీలు పరస్పర ప్రయోజనా లందుకుంటూ చెట్టపట్టాలేసుకుని తిరిగాయి. అకస్మాత్తుగా ఎగసిన నిరసన ప్రదర్శనల వేడిని వారు ఇప్పుడు చవి చూశారు.

ఇంటర్‌నెట్, డిజిటల్‌ టెక్నాలజీ మొగ్గ తొడిగిన (1997–2012) కాలంలో పుట్టిపెరిగిన తరాన్ని ‘జెన్‌ జెడ్‌’గా పిలుస్తున్నారు. ఈ ‘జెన్‌ జెడ్‌’ నేపాల్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఈ యువతరం తెచ్చిన విప్లవం బహుశా స్వల్పకాలమైనదే కావచ్చు. కానీ, అది చూపిన ప్రభావం పెద్దది. నిరసనలు మొదలైన తెల్లారే మూడు పార్టీల ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాని కేపీ శర్మ ఓలి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. నిరసనలకు ఐదు రోజుల ముందు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్‌తో సహా 26 సామాజిక మాధ్యమ వేదికల మూసివేతకు ఆయన ఆదేశించారు. 

అప్పటి కాయన ప్రజాభిమతాన్ని ప్రతిఘటించే వ్యక్తిగానే కనిపించారు. తీరా, ప్రధాని అధికారిక నివాసమైన బాలూవతార్‌ నుంచి ఉడాయించ వలసి వచ్చింది. ప్రధాని సింహాసనాన్ని అధిష్ఠించేందుకు వేచి ఉన్న షేర్‌ బహదూర్‌ దేవ్‌బా, ఆయన భార్య అర్జూ దేవ్‌బా (ఈమె విదేశాంగ మంత్రిగా కూడా ఉన్నారు)లపై వారి నివాసంలోనే దాడి జరి గింది. దేశవ్యాప్తంగా యువత ధ్వంసం చేస్తూ వచ్చిన రాజకీయ పార్టీల ఆస్తులు, బడా నాయకుల ప్రైవేటు నివాసాలకు లెక్కలేదు. సుప్రీంకోర్టు, పార్లమెంట్, ప్రభుత్వం కొలువుదీరే సింఘ దర్బార్‌ కూడా వారి ఆగ్రహ ‘జ్వాలల’ నుంచి తప్పించుకోలేక పోయాయి. 

జన్‌ జెడ్‌ తొలి ఉద్యమం
నిరసనకారుల్లో అనేక మంది స్కూలు యూనిఫారంలలో ఉన్నప్పటికీ, పోలీసులు వారిపై దమన నీతిని ప్రదర్శించారు. దమనకాండలో స్కూలు, కాలేజీ విద్యార్థులు పందొమ్మిది మంది (వారిలో 17 మంది ఖాట్మాండులోనే) హతులయ్యారు. దాంతో దేశ మంతా ఏకమైంది. 1990లో, తర్వాత 2006లో సామూహిక ప్రజా ఉద్యమా లప్పుడు కూడా ఇలాగే జాతీయ స్థాయిలో అతిశయం వ్యక్తమైంది కానీ, అవినీతిమయ రాజకీయ నాయకులతో వారి ఆశలన్నీ అడియా సలయ్యాయి. 

నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ –యునైటెడ్‌ మార్క్సిస్ట్‌ లెనినిస్ట్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (మావోయిస్టు) ప్రజాభిమతానికి అనుగుణంగా నడచుకోలేక పోయాయి. ఆ రెండు ఉద్యమాలలో ‘జెన్‌ జెడ్‌’ పాత్ర నామ మాత్రమే. ఇప్పుడు నేపాల్‌ రికార్డు స్థాయిలో వలసలను చూస్తున్న సమయంలో, యువతలో కోపం కట్టలు తెంచుకుంది. నేపాల్‌ అపసవ్య కారణాలతోనే ప్రపంచంలో వార్తలకెక్కడాన్ని చూసి వారు విసుగెత్తిపోయారు. 

అవినీతి సూచిలో ఏయేటికాయేడు నేపాల్‌ ఎగబాకుతూ వస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ  మినుకు మినుకు అంటూ అయినా ఉందంటే, దానికి, వర్తక వ్యాపారాలో, విదేశీ సాయమో కారణం కాదు. రాజకీయ పార్టీల చేయూత అంతకన్నా లేదు. విదేశాలలో పని చేస్తున్న నేపాలీయులు స్వదేశానికి పంపిస్తున్న జమలతోనే స్థాని కులు చాలా వరకు రోజులు వెళ్ళదీస్తూ వస్తున్నారు. పశ్చిమాసియా నుంచి మలేషియా వరకు, నార్వే నుంచి న్యూజిలాండ్‌ వరకు నేపా లీయులు కష్టపడి పనిచేస్తూ గడిస్తున్న నాలుగు రాళ్ళలో కొంత మొత్తాన్ని స్వదేశంలోని కుటుంబ సభ్యులకు పంపుతున్నారు. అలాచూస్తే, మారుమూల గ్రామాలలోని వారితో సహా, కుటుంబాల విడి ఆదాయాలు పెరుగుతూ వస్తున్నాయి. అంతమాత్రాన నేపాలీ యులు ధనికులుగా మారింది ఎన్నడూ లేదు.

ఇప్పుడేం జరగొచ్చు?
ఈ మార్పులన్నింటి మధ్య కొన్ని భయ సందేహాలు మిగిలే ఉన్నాయి. ప్రాబల్యం వహించిన పాత మూడు పార్టీలలోని  నాయకులందరూ అపఖ్యాతి పాలైనవారు కాదు. వారిలో కొందరికి వారి నియోజకవర్గాలతో ఇప్పటికీ పటిష్ఠమైన సంబంధాలే ఉన్నాయి. వారు కౌంటర్‌ విప్లవానికి తెర లేపుతారా? అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం పాత పార్టీలన్నీ విలీనమవుతాయా? లేక నాల్గవ పెద్ద పార్టీ అయిన రాష్ట్రీయ స్వతంత్రతా పార్టీ (ఆర్‌.ఎస్‌.పి.)లోకి ఫిరాయింపులకు ఇది దారితీస్తుందా? ఈ పార్టీలోనే యువ టెక్నోక్రాట్లు పెద్ద వర్గంగా ఉన్నారు. ఎన్నికల కమిషన్‌ వద్ద, 2022 సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే రిజిస్టరైన ఆర్‌.ఎస్‌.పి. త్వరితగతిన జాతీయ పార్టీగా పరిణమిస్తుందా? ఖాట్మండులో ప్రజాదరణ కలిగిన యువ మేయర్‌ బాలెన్‌ షా వీరితో చేతులు కలుపుతారా? రాజధానికి బయట పార్టీని విస్తరించడానికి ఎన్నడూ ఉత్సాహం చూపని షా, యువతతో కొత్త పార్టీని పెట్టి దానికి నాయకత్వం వహిస్తారా?

ఈ పరిస్థితులన్నింటి మధ్య ‘జెన్‌ జెడ్‌’ స్థానం ఏమిటి? ఈ యువతకు గొంతుకగా సూదన్‌ గురుంగ్‌ ఉన్నారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి, నేపాల్‌ తొలి మహిళా ప్రధాని సుశీలా కర్కీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సూదన్‌ ఆమె పట్ల గౌరవ ప్రపత్తులను ప్రదర్శించారు. కానీ పట్టుమని వారం కూడా గడవక ముందే, అదీ సూదన్‌ సమక్షంలోనే, ఆపద్ధర్మ ప్రధాని కర్కీ రాజీనామా చేయాలని ‘జెన్‌ జెడ్‌’ నిరసనకారులు డిమాండ్‌ చేశారు. మంత్రివర్గాన్ని విస్తరించే ముందు ఆమె తమతో సంప్రదించలేదని అన్నారు. బాలెన్‌ షా న్యాయ సలహాదారు ఓమ్‌ ప్రకాశ్‌ ఆర్యల్‌ను హోమ్‌ మంత్రిగా నియమించడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

సైన్యం పాత్ర ఏమిటి?
నేపాల్‌ సైన్యం ఏం చేయబోతోందనేది కూడా ముఖ్యమైనఅంశం. సార్వభౌమాధికారం 1990లో ప్రజల చేతికి వచ్చి, పార్లమెంట్‌ 2008లో రాచరికాన్ని రద్దు చేసేంత వరకు, రాచరికం పట్లనే సైన్యం విధేయత చూపుతూ వచ్చింది. తిరిగి అది ఇప్పుడు మళ్ళీ రాచరికం వైపే మొగ్గు చూపుతుందా? క్షేత్రస్థాయిలో నేపాలీయుల మధ్య సాంస్కృతిక పునరుజ్జీవనం కనిపిస్తోంది. హిందూ మతానికి చెందిన వివిధ వ్యక్తీకరణల్లో అది కేంద్రీకృతమవుతోంది. కానీ, నేపా లీయులు రాజకీయ హిందూయిజానికి ఎన్నడూ ఓటు వేయలేదు. వచ్చే ఏడాది (2026) మార్చి 5న నిర్వహిస్తారని చెబుతున్న ఎన్ని కలు చరిత్రను మలుపు తిప్పుతాయా? నూతన ప్రభుత్వం ఈ పరి ణామ క్రమాన్ని ఎలా నిర్వహిస్తుందనేది ప్రశ్న. నేపాలీ ప్రజలు ఆరు నెలల (రాజకీయాల్లో సుదీర్ఘ కాలం కిందనే లెక్క) తర్వాత, రాజ కీయ తీర్పును వెలువరించేంత వరకు ఈ భయాందోళనలు కొన సాగుతూనే ఉంటాయి.

అఖిలేశ్‌ ఉపాధ్యాయ్‌
వ్యాసకర్త ఖాట్మండులోని ఐ.ఐ.డి.ఎస్‌.లో సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement