వెనుకబడిన, బలహీనమైన చిన్న దేశా లను, ఆ దేశాల ప్రభుత్వాలను ఆయుధ బలంతో తన చెప్పుచేతుల్లో పెట్టుకోవడం, తన మాట వినని ప్రభుత్వాలు కూలిపోయేలా చేయడం, అది సాధ్యం కాకపోతే యుద్ధం ద్వారా తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తరు వాత ఆ దేశాల సహజ వనరులను తరలించుకుపోవడం అమెరికా అనుసరిస్తున్న విధానంగా ఉంది.
నేడు వెనిజులాపై దాని యుద్ధ సన్నాహాలు ఆ విధానంలో భాగమే. దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాపై దాడి చేయడానికి అమె రికా అధ్యక్షుడు ట్రంప్ కరేబియన్ దీవులకు 8 వార్షిప్లతో పాటు అతిపెద్ద విమాన వాహక నౌకను, 10 వేల మంది సైనికులనుపంపాడు. ఇది ఇలా ఉండగా 2025 సెప్టెంబర్ 2 నాడు వెనిజులా నుంచి పోతున్న పడవలపై అమెరికా దాడి చేసి 11 మంది ప్రాణాలు తీసింది. ఈ దాడికి కారణం పడవల్లో వెనిజులా మాదక ద్రవ్యాలను రవాణా చేయడమే అంటున్నది.
వెనిజులాపై అమెరికా వ్యతిరేకత చాలా కాలంగా కొనసాగు తున్నది. ఆ దేశ భూగర్భంలో చమురు, సహజ వాయువు నిక్షేపాలు, వజ్రాలు, బంగారం వంటివి అపారంగా ఉన్నాయి. తన బహుళ జాతి సంస్థల ద్వారా వాటిని తరలించుకు పోతున్న అమెరికాకు, 1999లో వెనిజులా అధ్యక్షునిగా ఎన్నికైన హ్యూగో చావేజ్ అడ్డు కట్ట వేశాడు. ప్రభుత్వ సంస్థలను జాతీయం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న పెట్టుబడిదారీ అనుకూల ముఠా చావేజ్ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రయత్నాలకు మద్దతిచ్చింది.
ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. బొలీ వియా దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక సమూహాలకు ఒక అమెరికా రాయబారి సహకరించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ దేశానికి మద్దతుగా 2008లో అమెరికా రాయబారిని వెనిజులా దేశం నుంచి బహిష్కరించింది. చావేజ్ మరణం తర్వాత వరుసగా మూడు సార్లు నికోలస్ మదురో అధ్యక్షుడయాడు. తమ దేశ పెట్టుబడిదారులకు చెందిన వెనిజులాలోని సంస్థలనూ, గను లనూ ఆ దేశం జాతీయం చేసినందుకు నష్టపరిహారం చెల్లించాలని అమెరికా కోర్టులు తీర్పులు వెల్లడించాయి.
సార్వభౌమాధికారం గల ఒక దేశానికి సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. వెనిజులా అలాంటి దేశం కాబట్టి చమురు పరిశ్రమలను, ఖనిజాల గనులను జాతీయం చేసింది. ఆ దేశ నిర్ణయాలపై అమెరికా కోర్టులు తీర్పులు ఎలా ఇస్తాయి? వెని జులా నుంచి ఎవరూ చమురు కొనవద్దని అమెరికా ఆంక్షలు (2023) విధించి ఆర్థికంగా దాన్ని దెబ్బతీస్తోంది.
అలాగే వెనిజులాపై యుద్ధానికి సిద్ధమై ఆ దేశ గగన స్థలాన్ని మూసి వేస్తున్నట్లు ప్రకటించింది అమెరికా. అధ్యక్షుడు నికోలస్ మదురో దేశం విడిచిపెట్టి పోవాలని, అతని మంత్రి వర్గ ముఖ్య సహచరులను కాపాడుకోమని ట్రంప్ బెదిరించినట్లు ‘హెరాల్డ్’ పత్రిక పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వ ప్రకటనను వెనిజులా తీవ్రంగా ఖండించింది. ఇది ఏకపక్ష చర్య అని పేర్కొంది. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో విమాన సర్వీసులను నిలిపి వేసిన స్పెయిన్, పోర్చుగల్, కొలంబియా, చిలీ, బ్రెజిల్, తుర్కియే దేశాలపై వెనిజులా ఆగ్రహం వ్యక్తం చేసి ఆ దేశాలకు సంబంధించిన విమాన సంస్థలపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
సార్వభౌమాధికారం గల ఒక దేశ గగన స్థలాన్ని మరొక దేశం మూసి వేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ ఒడంబడికలకు విరు ద్ధమైనది. ఒక స్వతంత్ర దేశమైన వెనిజులా అధ్యక్షుణ్ణి పట్టి అప్ప
గించమని అమెరికా కోరడం, నికోలస్ మదురో సమాచారం ఇస్తే ఏకంగా 5 కోట్ల డాలర్ల బహుమతి ప్రకటించడం దాని హంతక మనస్తత్వానికి నిదర్శనం.
– బొల్లిముంత సాంబశివరావు
రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు


