Israel: యుద్ధ విషాదం.. కన్నీరు పెట్టిస్తున్న గణాంకాలు | Over half of soldiers treated in rehab centers have mental health issues | Sakshi
Sakshi News home page

Israel: యుద్ధ విషాదం.. కన్నీరు పెట్టిస్తున్న గణాంకాలు

Dec 9 2025 1:04 PM | Updated on Dec 9 2025 1:21 PM

Over half of soldiers treated in rehab centers have mental health issues

జెరూసలేం: ఇజ్రాయెల్‌కు పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమాస్‌తో గాజా స్ట్రిప్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం తీవ్ర విషాదాన్ని తీసుకొచ్చింది.  
ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ పునరావాస విభాగం తాజాగా విడుదల చేసిన గణాంకాల కన్నీరు కంటతడి పెట్టిస్తున్నాయి.

మానసిక అనారోగ్యంతో..
ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రిత్వ శాఖ పునరావాస విభాగం తెలిపిన గణాంకాల ప్రకారం, 2023 అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 22,000 మంది గాయపడిన సైనికులకు చికిత్స అందించారు. వీరిలో అత్యధికంగా 58 శాతం మంది పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD), ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది పునరావాస కేంద్రాలకు తీవ్రమైన భారంగా పరిణమించింది.

అన్ని విభాగాలవారూ..
పునరావాస విభాగం ప్రస్తుత. గత యుద్ధాలలో గాయపడిన వారితో సహా మొత్తం 82,400 మంది గాయపడిన మాజీ సైనికులకు సేవలు అందిస్తోంది. ఈ సంఖ్యలో 9 శాతం మంది మహిళా సైనికులు ఉన్నారు. గాయపడిన మొత్తం అనుభవజ్ఞులు( సీనియర్లు)లో అత్యధికంగా 48 శాతం మంది వారి తప్పనిసరి సైనిక సేవ (Compulsory Service) సమయంలో గాయపడగా, 26 శాతం మంది రిజర్వ్ డ్యూటీలో, 13 శాతం మంది కెరీర్ సర్వీస్‌లో, తొమ్మిది శాతం మంది పోలీసు సిబ్బందిగా ఉన్న సమయంలో గాయపడ్డారని విభాగం తెలిపింది.

వీల్‌చైర్‌కే పరిమితమై..
పునరావాస విభాగంలో తీవ్రమైన గాయాలు, వైకల్యాలతో బాధపడుతున్న అనుభవజ్ఞుల సంఖ్య గణనీయంగా ఉంది. వీరిలో  873 మంది వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. వీరిలో 132 మంది అక్టోబర్ 7 తర్వాత గాయపడ్డారు. అత్యంత తీవ్రమైన గాయం స్థాయి (100% కంటే ఎక్కువ వైకల్యం) ఉన్నవారు 612 మంది ఉండగా, వీరిలో ప్రస్తుత యుద్ధంలో 64 మంది గాయపడ్డారు. అలాగే, 115 మంది అంధత్వంతో బాధపడుతున్నారు (ప్రస్తుత యుద్ధంలో ఐదుగురు), 1,061 మంది అంగవైకల్యం (Amputations) పొందినవారు ఉన్నారు, వీరిలో గత రెండేళ్ల యుద్ధంలో 88 మంది గాయపడ్డారు.

చికిత్సకు రూ. 23,130 కోట్లు
పునరావాస కేంద్రాలపై పెరుగుతున్న భారాన్ని దృష్టిలో ఉంచుకుని, 2026 చివరి నాటికి మరో 10,000 మంది గాయపడిన మాజీ సైనికులను కేంద్రాలు స్వీకరిస్తాయని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది, వీరిలో ఎక్కువ మంది PTSD వంటి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు, పునరావాస శాఖ  మొత్తం బడ్జెట్ $2.57 బిలియన్లు(₹23,130 కోట్లు) గా ఉంది. ఇందులో $1.27 బిలియన్లు(₹11,444 కోట్లు) ప్రత్యేకంగా మానసిక ఆనారోగ్యంతో బాధపడుతున్న వారి చికిత్సకు కేటాయించారు.

మృతులెందరు?
మాజీ సైనికుల సంరక్షణలో అనేక సవాళ్లు ఉన్నాయని మంత్రిత్వ శాఖ గుర్తించింది, ముఖ్యంగా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రతి 750 మంది రోగులకు కేవలం ఒకే పునరావాస సిబ్బంది అందుబాటులో ఉన్నాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి మంత్రిత్వ శాఖలు ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేశాయి. నగరాల వారీగా చూస్తే, మోదీన్ నగరంలో అత్యధిక సంఖ్యలో గాయపడిన మాజీ సైనికులు ఉన్నారు.  2023 అక్టోబర్ 7 నుండి ఇప్పటివరకు, మొత్తం 922 మంది సైనికులు, అధికారులు, రిజర్విస్టులు, వందల మంది స్థానిక భద్రతా అధికారులు మృతి చెందారు. వీరిలో దాదాపు 331 మంది హమాస్ ప్రారంభ ఉగ్రవాద దాడిలో గాజా స్ట్రిప్ సరిహద్దులో మరణించగా, 471 మంది హమాస్ ఆధీనంలోని సరిహద్దుల్లో జరిగిన భూ ఆపరేషన్లలో మృతి చెందారు.  వివిధ ఉగ్రవాద దాడులు, ఘర్షణల్లో  70 మంది ఇజ్రాయెల్ పోలీసు అధికారులు మృతిచెందారు. 

ఇది కూడా చదవండి: Tamil Nadu: ఈడీ చేతికి టెండర్ స్కాం.. సంచలన వివరాలు వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement