అనంతపురం టౌన్: నిరుపేద కుటుంబాల్లోని ఆడబిడ్డల వివాహాలకు పెళ్లి కానుకలను అందిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ‘పెళ్లి కానుక’ పథకానికి మంగళం పాడారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రూ.లక్ష, బీసీ వర్గాలకు రూ.50వేలు, కులాంతార వివాహాలకు రూ.లక్ష చొప్పున అందిస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయలేక చేతులేత్తేశారు.
కల్యాణలక్ష్మి పేరిట రుణ పథకానికి శ్రీకారం
ఈ నెలలో ఉగాది పండుగ తర్వాత ‘ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి’ పథకాన్ని అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పెళ్లి కానుకైతే ఉచితంగా ఇవ్వాల్సి వస్తుందని, ఆ భారం నుంచి తప్పించుకునేందుకు ‘కల్యాణలక్ష్మి’ పేరుతో రుణ పథకాన్ని అమలు చేస్తోంది. ఆడబిడ్డ పెళ్లి కోసం బ్యాంక్ల ద్వారా రూ.10 వేల నుంచి రూ.లక్ష మేర రుణం మంజూరు చేయనుంది. తీసుకున్న రుణాన్ని 48 వాయిదాల్లో 4 శాతం వడ్డీతో బ్యాంక్లకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంతో నిరుపేదలకు ‘పెళ్లి కానుక’ ఇవ్వకుండా రుణాలు ఇవ్వడం ఏంటని మహిళా సంఘాల సభ్యులు మండిపడుతున్నారు. గతంలో అమలు చేసిన విధంగా ‘పెళ్లికానుక’ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
కల్యాణలక్ష్మి రుణ పథకానికి అర్హతలు ఇవే..
పెళ్లికూతురికి కచ్చితంగా 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.కూతురు పెళ్లికి రుణం పొందే మహిళలు డ్వాక్రా సంఘంలో కనీసం ఆరు నెలల సభ్యత్వం కలిగి ఉండాలి.
పెళ్లి కూతురు ఆధార్కార్డు, పెళ్లి పత్రిక, పెళ్లికి అయ్యేఖర్చు అంచనాతో కూడిన పత్రం సమరి్పంచాలి.
అన్ని రకాల వర్గాల ప్రజలకు ఈ పథకం వర్తిస్తుంది.
మండల పరిషత్ కార్యాలయాలు, డీఆర్డీఏ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలి
పెళ్లికి రెండు రోజుల ముందు పెళ్లి కూతురు తల్లి ఖాతాలో రుణం మొత్తాన్ని జమ చేస్తారు.
మార్గదర్శకాలు రావాల్సి ఉంది
ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి రుణ పథకం ఈ నెలలో ఉగాది పండుగ తర్వాత అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు రావాల్సి ఉంది.
– శైలజ, డీఆర్డీఏ ఇన్చార్జ్ పీడీ


