అందుకు ప్రేరేపించిన డాక్టర్ అమర్ అరెస్టు
వీడిన పీజీ వైద్య విద్యార్థిని మృతి మిస్టరీ
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఎనస్థీషియా పీజీ విద్యార్థిని బత్తుల దీపిక గతనెల 5న అనుమానాస్పదంగా ఆపరేషన్ థియేటర్లో మృతిచెందిన ఘటన మిస్టరీ వీడింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం రిపోర్టు ద్వారా పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే, దీపికను ఆత్మహత్యకు ప్రేరేపించాడనే కారణంతో ఎనస్థీషియా సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అమర్ సహాస్ను సోమవారం మాచవరం పోలీసులు అరెస్టు చేశారు.
తన కుమార్తె మృతికి అమర్ కారణమంటూ దీపిక తండ్రి కోదండరామిరెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, మంత్రులు లోకేశ్, సత్యకుమార్ యాదవ్, హెల్త్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లకు వినతిపత్రాలు అందజేశారు. అంతేకాక.. దీపికతో చివరిసారిగా ఫోన్లో డాక్టర్ అమర్ సహాస్ మాట్లాడినట్లు ఉంది. వాళ్లిద్దరికీ ప్రేమ విషయంలో విభేదాలు తలెత్తినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో.. ఆమె ఆత్మహత్యకు అమర్ ప్రేరేపించాడనే కారణంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
పోలీసులకు పోస్టుమార్టం నివేదిక..
ఇదిలా ఉంటే.. దీపిక పోస్టుమార్టం నివేదిక పోలీసులకు అందినట్లు తెలిసింది. అందులో వాంతులు కాకుండా ఇచ్చే జోఫర్ ఇంజక్షన్తో పాటు, మజిల్ రిలాక్సేషన్, మత్తుకు వాడే ఇంజక్షన్ ఉన్నట్లుగా నిర్ధారించినట్లు సమాచారం. అయితే, జోఫర్తో ప్రాణాలు పోయే ప్రమాదం లేనందున.. మజిల్ రిలాక్సేషన్, మత్తు ఇంజక్షనే కారణంగా ఆమె మృతి చెందినట్లు అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఆమె రక్తంలో గుర్తించిన ఇంజక్షన్ కాలీ వెయిల్ను ఘటన జరిగిన రోజు ఆమె బ్యాగులో పోలీసులు గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు.


