స్పైనల్ మసు్క్యలర్ అట్రోఫి టైప్–2తో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారి
ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు
దాతల సాయం కోసం లేపాక్షికి చెందిన నటరాజ్, శైలజ దంపతుల వేడుకోలు
లేపాక్షి: ఆడుతూ పాడుతూ తల్లిదండ్రుల చెంత ఆనందంగా ఉండాల్సిన ఆ మూడేళ్ల చిన్నారిని అరుదైన వ్యాధి వెంటాడుతోంది. బత్తలపల్లి, పుట్టపర్తి, బెంగళూరులోని నిమ్హాన్స్ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించినట్లు శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షికి చెందిన నటరాజ్, శైలజ దంపతులు తెలిపారు. తమ కుమారుడు కేయాన్స్ అద్విక్ (3)కు అత్యంత అరుదైన స్పైనల్ మసు్క్యలర్ అట్రోఫి(ఎస్ఎంఏ) టైప్–2 వ్యాధి సోకిందని బెంగళూరు బాప్టిస్ట్ ఆస్పత్రిలో ఇటీవల చేయించిన వైద్య పరీక్షల్లో బయట పడిందన్నారు.
చిన్నారికి రూ.16 కోట్లు విలువ గల ఏవీఎక్స్ఎస్–101 ఇంజెక్షన్ వేయాలని వైద్యులు సూచించారు. ఈ ఇంజెక్షన్ భారతదేశంలో లేకపోవడంతో అమెరికా నుంచి తెప్పించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపినట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు. చిరు ఉద్యోగంతో జీవనం సాగించే తాము ఇంత భారీమొత్తాన్ని భరించే స్థితిలో లేమని, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని వేడుకున్నారు. ‘ఎం.శైలజ, ఎస్బీఐ, హిందూపురం బ్రాంచ్’ అకౌంట్ నంబర్ 32029137877 లేదా ఫోన్పే నంబర్లు 7795576806, 9618339438 ద్వారా ఆర్థికసాయం అందించాలని కోరారు.


