ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ను ఉపయోగించుకుందని ఆరోపించారు. పాకిస్తాన్ను టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుని విస్మరించిందని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో.. ఉగ్రవాదంపై ఖవాజా చేసిన వ్యాఖ్యలు.. భారత్ తరచూ చేసే ఆరోపణలకు బలం చేకూర్చాయి. భారత్కు మద్దతు ఇచ్చే విధంగా ఉన్నాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. ఇటీవల పార్లమెంట్లో ప్రసంగిస్తూ అమెరికా–పాకిస్తాన్ సంబంధాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో అమెరికా తన ప్రయోజనాల కోసం పాకిస్తాన్ను వాడుకుందని అన్నారు. 1999 కార్గిల్ యుద్ధం, 9/11 దాడుల తర్వాత పాకిస్తాన్ మళ్లీ అమెరికాతో కలవడం అనే నిర్ణయం మాకు దీర్ఘకాలిక నష్టం కలిగించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్ యుద్ధంలో “జిహాద్” పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించారని ఆయన విమర్శించారు. పాకిస్తాన్లో ఉగ్రవాదం ప్రధానంగా అవినీతి, స్మగ్లింగ్ నెట్వర్క్లు, పాలనా వైఫల్యాలు వల్ల పెరుగుతోందని ఆయన అంగీకరించారు. అమెరికా మద్దతును అనుసరించడం ఒక తీవ్రమైన నష్టంగా ఆయన అభివర్ణించారు. దీని పరిణామాలు పాకిస్తాన్కు దశాబ్దాల తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు.
జిహాద్ యుద్ధాలను చట్టబద్ధం చేయడానికి పాకిస్తాన్ విద్యా వ్యవస్థను కూడా మార్చారని, ఆ సైద్ధాంతిక మార్పులు చాలా వరకు నేటికీ ఉన్నాయని ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1980లలో ఆఫ్ఘనిస్థాన్లో జరిగిన సోవియట్ వ్యతిరేక యుద్ధం మతపరమైన ఆవశ్యకత కంటే అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువగా ఉపయోగపడింది. పాకిస్తాన్ తనది కాని సంఘర్షణలలో పాల్గొనడం దీర్ఘకాలిక అస్థిరతను సామాజిక నష్టాన్ని కలిగించింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్రజలు ఎదుర్కొన్న నష్టాలను ఎప్పటికీ భర్తీ చేయలేము అంటూ వ్యాఖ్యానించారు.
కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్–అమెరికా సంబంధాలు
1999 కార్గిల్ యుద్ధం తర్వాత అమెరికా–దక్షిణాసియా సంబంధాల్లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. కార్గిల్ యుద్ధం సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్కు మద్దతు ఇచ్చారు. ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ను వాషింగ్టన్కు పిలిచి, సైన్యం వెనక్కి తగ్గాలని ఒత్తిడి చేశారు. ఈ సంఘటన తర్వాత అమెరికా–భారత్ సంబంధాలు మరింత బలపడ్డాయి. 2000లో క్లింటన్ భారతదేశాన్ని సందర్శించడం దీనికి సంకేతం. అయితే, కార్గిల్ యుద్ధం పాకిస్తాన్కు రాజకీయంగా, వ్యూహాత్మకంగా నష్టం కలిగించింది.


