న్యూఢిల్లీ: భారత దౌత్య వ్యూహానికి మరో భారీ విజయం దక్కింది. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్ విడుదల చేసిన ‘ఫ్యాక్ట్ షీట్’లో తాజాగా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత అమెరికా విడుదల చేసిన జాబితాలో భారత్ దిగుమతి సుంకాలను తగ్గించాల్సిన వస్తువుల జాబితాలో ‘పప్పు దినుసులను’ చేర్చారు. అయితే దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో, సవరించిన నివేదికలో పప్పు దినుసుల ప్రస్తావనను వైట్ హౌస్ పూర్తిగా తొలగించింది. భారత రైతుల ప్రయోజనాలను కాపాడటంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించిందని ఈ మార్పు స్పష్టం చేస్తోంది.
ఈ ఫ్యాక్ట్ షీట్లో కేవలం వస్తువుల జాబితాలోనే కాకుండా పదజాలంలో కూడా అమెరికా కీలక మార్పులు చేసింది. గత నివేదికలో భారత్ 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ‘కట్టుబడి ఉంది’ అని పేర్కొనగా, ఇప్పుడు దాన్ని ‘ఉద్దేశిస్తోంది’ అని మార్చారు. ఫలితంగా భారత్ పై ఎటువంటి చట్టపరమైన లేదా బలవంతపు ఒత్తిడి ఉండదని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇంధనం, ఐటీ, బొగ్గు తదితర రంగాలలో అమెరికా నుంచి కొనుగోళ్లు పెంచాలని భారత్ భావిస్తున్నప్పటికీ, అది ఒక ఒప్పంద నిబద్ధత కాదని ఈ సవరణ ధృవీకరిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తర్వాత ఈ కొత్త వాణిజ్య ఒప్పంద వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం భారత ఎగుమతులపై అమెరికా విధిస్తున్న సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. ఇది భారతీయ వ్యాపారులకు అంతర్జాతీయ మార్కెట్లో గొప్ప వెసులుబాటును కల్పిస్తుంది. ఇరు దేశాల మధ్య సమగ్ర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఒక కొత్త ఫ్రేమ్వర్క్ను రూపొందించే దిశగా అడుగులు పడ్డాయి. అమెరికా తన తాజా నిర్ణయంలో భారత్కు మరో పెద్ద ఊరటనిచ్చింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిగా భారత్పై గతంలో విధించిన అదనపు 25 శాతం సుంకాన్ని అమెరికా పూర్తిగా ఎత్తివేసింది. తాజా ఒప్పందంతో ఈ అదనపు పన్నుల భారం తొలగిపోవడమే కాకుండా, అమెరికా మార్కెట్లలో భారత వస్తువులకు ప్రాధాన్యత పెరిగే అవకాశం లభించింది.
ఇది కూడా చదవండి: ‘తొలగింపు నోటీసు’లో లోపాలు.. మరో అవకాశం ఇచ్చిన స్పీకర్


