‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ vs ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’? | Cockroach Janta Party Vs National Parasitic Front, India’s Angry Youth Turn Insult Into Viral Political Movement | Sakshi
Sakshi News home page

CJP Vs NPF: ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ vs ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’?

May 20 2026 1:01 PM | Updated on May 20 2026 1:15 PM

Cockroach Janta Party vs National Parasitic Front Sparks Internet Rebellion

న్యూఢిల్లీ: భారతదేశ రాజకీయ ముఖచిత్రంలో నిత్యం కూటములు, చీలికలు, వాట్సాప్ వార్ రూమ్‌ల హడావుడిని చూస్తూనే ఉంటాం. అయితే, దేశంలో ఎన్నడూ లేని విధంగా ఒక సరికొత్త ‘బయోలాజికల్’ డిజిటల్ రాజకీయ యుద్ధం మొదలైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన ‘బొద్దింకలు’, ‘పరాన్నజీవులు’ (కాక్‌రోచెస్, పారాసైట్స్) అనే వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయితే, యువత ఈ అవమానాన్ని కేవలం నిరసనగా మార్చకుండా, ఒక వినూత్న వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా మలిచారు. దీని ఫలితంగానే ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (సీజేపీ), ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’ (ఎన్‌పీఎఫ్‌) వంటి వ్యంగ్య పొలిటికల్ గ్రూపులు నెట్టింట ప్రభంజనం సృష్టిస్తున్నాయి.

కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రస్థానం (CJP)
‘ఎక్కడ వైఫై ఉంటే అదే మా ప్రధాన కార్యాలయం’ అంటూ అభిజీత్ దిప్కే అనే యువకుడు మే 16న ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ని స్థాపించారు. కేవలం నాలుగు రోజుల్లోనే ‘ఎక్స్’, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ పేజీకి ఏకంగా 10 లక్షల (మిలియన్) పైగా ఫాలోవర్స్ వచ్చారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రవేశ పరీక్షల భారంతో నలిగిపోయే యువతకు ఈ వేదిక ఒక ఆయుధంగా మారింది. వీరి మేనిఫెస్టోలో.. రిటైర్మెంట్ తర్వాత చీఫ్ జస్టిస్‌లకు రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదని, తప్పుడు వార్తలు రాసే మీడియాపై చర్యలు తీసుకోవాలని, మహిళలకు కేబినెట్‌లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయడం గమనార్హం. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులు కూడా దీనిపై ఆన్‌లైన్‌లో స్పందించడంతో ఈ ఉద్యమానికి మరింత ప్రచారం లభించింది. (Cockroach Janta Party Story)

దూసుకొచ్చిన ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’(NPF)
రాజకీయాల్లో ఖాళీలు ఉండవు కాబట్టి, సీజేపీకి పోటీగా ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’ రంగంలోకి దిగింది. పరాన్నజీవులుగా ముద్రపడిన సాధారణ పౌరుల తరఫున తామే అసలైన ప్రతిపక్షం అని ఈ గ్రూప్ ప్రకటించుకుంది. ‘వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికే మేము ఈ విరిగిన వ్యవస్థతో అతుక్కుపోయాం’ అని ఎన్‌పీఎఫ్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. పార్లమెంట్‌లో నేరస్థులు ఉండకూడదని, చదువుకున్న ప్రజాప్రతినిధులు రావాలని, వర్షం పడితే నదులుగా మారే రోడ్ల వ్యవస్థ మారాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. సీజేపీ బొద్దింకలాగా ఎలాంటి కష్టాలనైనా తట్టుకునే సామాన్యుడిని ప్రతిబింబిస్తే, ఎన్‌పీఎఫ్‌ మాత్రం ‘అసలైన పరాన్నజీవులు ఎవరు?’ అంటూ పాలకుల వైపు ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది. (National Parasitic Front Story)

సరికొత్త మీమ్ పాలిటిక్స్ యుగం
భారతదేశంలో కార్టూన్లు, మిమిక్రీ ద్వారా రాజకీయ వ్యంగ్యం ఎప్పటి నుంచో ఉంది. కానీ 2026 నాటి ఈ డిజిటల్ యుగంలో, యువత కేవలం జోకులను చూసి నవ్వుకోకుండా, తామే స్వయంగా భాగస్వామ్యులయ్యే ‘పార్టిసిపేటరీ సాటైర్’ విధానాన్ని ఎంచుకున్నారు. పూర్వం యువత ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఒక వెబ్‌సైట్ తెరిచి, లోగో క్రియేట్ చేసి, ఒక నకిలీ రాజ్యాంగాన్ని రాసి మధ్యాహ్నానికల్లా వేలల్లో ఫాలోవర్లను సంపాదిస్తున్నారు. ఈ రెండు గ్రూపులు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన అధికారిక పార్టీలు కాకపోయినప్పటికీ, దేశంలోని నిరుద్యోగ యువత ఆవేదనను, వ్యవస్థపై వారికున్న అసంతృప్తిని డిజిటల్ వేదికగా ప్రపంచానికి చాటిచెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: మీ అర్హతలకు ప్రభుత్వ పథకాలు.. కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది!

Advertisement
 
Advertisement
Advertisement