260 మంది ప్రాణాలు తీసింది ఆ ఒక్క స్విచ్చేనా? | India Expands Ahmedabad Crash Probe, Scrutinizes Boeing 787 Fuel Switches | Sakshi
Sakshi News home page

260 మంది ప్రాణాలు తీసింది ఆ ఒక్క స్విచ్చేనా?

May 20 2026 10:26 AM | Updated on May 20 2026 11:26 AM

India Expands Ahmedabad Crash Probe, Scrutinizes Boeing 787 Fuel Switches

న్యూఢిల్లీ: దాదాపు 260 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా బొయింగ్ 787 ఘోర విమాన ప్రమాదం జరిగి ఏడాది కావస్తున్నది. ఈ దారుణ ఉదంతంపై భారత విమానయాన అధికారులు సరికొత్త కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. డ్రీమ్‌లైనర్ విమానాల్లోని ‘ఫ్యూయల్-కంట్రోల్ స్విచ్‌లు’ (ఇంధన నియంత్రణ స్విచ్‌లు) అకస్మాత్తుగా ఆగిపోవడమే ఈ ప్రమాదానికి కారణమా అనే కోణంలో విచారణ తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో భారత సివిల్ ఏవియేషన్ (డీసీసీఏ) ఉన్నతాధికారులు అమెరికాలోని సీటెల్‌ నగరంలోని బొయింగ్ ప్రధాన కార్యాలయానికి స్వయంగా వెళ్లి, ఈ స్విచ్‌ల పనితీరుపై జరగబోయే  ప్రయోగాలను పర్యవేక్షించనున్నారు.

లండన్-బెంగళూరు ఫ్లైట్‌లో బయటపడ్డ లోపం
ఇటీవల లండన్ నుండి బెంగళూరు వస్తున్న మరో ఎయిర్ ఇండియా బొయింగ్ 787 విమానంలో పైలట్లు ఇంధన స్విచ్‌లలో ఒక విచిత్రమైన సాంకేతిక సమస్యను గుర్తించారు. ఇంజిన్ స్టార్ట్ చేసే సమయంలో స్వల్ప ఒత్తిడి పడినా ఈ స్విచ్‌లు స్థిరంగా ఉండకుండా ఊడిపోవడాన్ని పైలట్లు గమనించారు. మూడుసార్లు ప్రయత్నించిన తర్వాతే అవి సరిగ్గా పనిచేశాయి. ఈ ఘటన విమాన ప్రమాద దర్యాప్తుకు అత్యంత కీలకమైన ఆధారంగా మారింది. అహ్మదాబాద్ ప్రమాదంలో కూడా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండు ఇంధన స్విచ్‌లు ఒకేసారి ‘కటాఫ్’ పొజిషన్‌కు మారిపోయి, ఇంజిన్‌కు ఇంధనం అందకుండా ఆగిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

సీటెల్ బొయింగ్ ల్యాబ్‌లో క్లిష్టమైన పరీక్షలు
ఆటోమేటిక్‌గా లేదా అనుకోకుండా మారడానికి వీల్లేని ఈ సురక్షితమైన లాకింగ్ స్విచ్‌లు, ఏదైనా నిర్దిష్ట కోణంలో బాహ్య ఒత్తిడి పడటం వల్ల దానంతట అవే కట్-ఆఫ్ అయ్యే అవకాశం ఉందా? అనే కోణంలో ఇప్పుడు  అధికారులు పరిశోధించనున్నారు. లండన్ ఫ్లైట్ నుండి తొలగించిన స్విచ్ మోడ్యూల్‌ను ప్రస్తుతం అమెరికా బొయింగ్ ల్యాబ్‌లో క్లోజ్డ్ ఎన్విరాన్‌మెంట్‌లో పరీక్షించనున్నారు. అయితే, ప్రాథమిక తనిఖీల్లో ఈ సిస్టమ్ బాగానే ఉందని బొయింగ్ పేర్కొన్నప్పటికీ, ప్రమాద తీవ్రత దృష్ట్యా డీజీసీఏ అధికారులు స్వయంగా అక్కడ ఉండి ప్రయోగాలను వీక్షించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించారు.

పైలట్ల సంఘాల ఆందోళన – అంతర్జాతీయ నిఘా
మరోవైపు అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) గతంలో ఈ ప్రమాదానికి ఎలాంటి యాంత్రిక లోపం కారణం కాదని, పైలట్లే మాన్యువల్‌గా ఇంధనాన్ని నిలిపివేసి ఉండవచ్చని అభిప్రాయపడింది. అయితే ఈ వాదనను భారత పైలట్ల సంఘాలు, మరణించిన కెప్టెన్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పూర్తి విచారణ ముగియకముందే పైలట్లపై నిందలు వేయడం సరికాదని, స్వతంత్ర, పారదర్శక దర్యాప్తు జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న భారత విమానయాన రంగ భద్రత దృష్ట్యా, డీజీసీఏ ఈ దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఇది కూడా చదవండి: ‘బందా​’లో నిప్పుల కొలిమి: కర్ఫ్యూను తలపిస్తున్న వీధులు!
 

Advertisement
 
Advertisement
Advertisement