న్యూఢిల్లీ: దేశంలో ఎండల తీవ్రత మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకుంది. ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లా ప్రస్తుతం నిప్పుల కొలిమిలా మారింది. ఇక్కడి ఉష్ణోగ్రతలు ఏకంగా 48.2 డిగ్రీల సెల్సియస్కు చేరుకోవడంతో, తీవ్రమైన వేడిని తట్టుకోలేక ఉదయం 10 గంటలకే జిల్లా మొత్తం పూర్తిగా స్తంభించిపోతోంది. ఒకప్పుడు రాజస్థాన్లోని చురు, జైసల్మేర్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, ఇప్పుడు బందా జిల్లాను దేశంలోనే అత్యంత వేడి ప్రాంతంగా నిలబెట్టాయి.
ఎండ దెబ్బకు మారిన జీవనశైలి
తీవ్రమైన ఎండల కారణంగా స్థానిక ప్రజల దినచర్య పూర్తిగా మారిపోయింది. వ్యాపారులు ఉదయం 6 గంటలకే పనులు ప్రారంభించి, 9 గంటలకల్లా ఇళ్లకు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం వేళల్లో కూలీలు పని చేయలేకపోవడంతో తమ వేతనాల్లో 40 శాతం వరకు నష్టపోతున్నారు. ఈ పరిస్థితి తట్టుకోలేక రైతులు రాత్రి వేళల్లో ఎల్ఈడీ లైట్ల వెలుతురులో వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఉష్ణోగ్రతల తాకిడికి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా ఉండేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది వాటిని నిరంతరం కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పర్యావరణ విధ్వంసమే కారణం
బందా జిల్లాలో ఈ స్థాయి వేడి ఏర్పడేందుకు వాతావరణ మార్పులే కాకుండా, స్థానికంగా జరిగిన పర్యావరణ క్షీణత కూడా ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ అడవుల విస్తీర్ణం 15.54 శాతం మేర తగ్గిపోయింది. వింధ్య పర్వత శ్రేణులలో జరుగుతున్న విచక్షణారహిత మైనింగ్, భారీ పేలుళ్ల వల్ల భూగర్భ జలాల పునరుద్ధరణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. దీనివల్ల పచ్చదనం కోల్పోయి, నేలలో తేమ శాతం దారుణంగా పడిపోయింది.
నదుల క్షీణత.. ఎడారిగా మారే ప్రమాదం
బందా గుండా ప్రవహించే కేన్ నదితో పాటు రంజ్, బగాయ్ వంటి చిన్న నదులలో భారీ యంత్రాలతో ఇసుకను తోడేయడం వల్ల నదీ గర్భాలు శిలలుగా మారుతున్నాయి. కేన్ నది నుండి ప్రతిరోజూ దాదాపు 55,000 టన్నుల ఎర్ర ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు అంచనా. ఈ విధ్వంసం ఇలాగే కొనసాగితే రాబోయే రెండు దశాబ్దాలలో ఈ ప్రాంతం పూర్తిగా నివాసయోగ్యం కాని ఎడారిగా మారుతుందని లక్నో, బందా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘గెస్ పేపర్'లో కెమిస్ట్రీ ప్రశ్నలన్నీ అవుట్.. సీబీఐకి చిక్కిన లిస్ట్!


