మోదీకి ప్రశ్నా.. నార్వే మహిళా జర్నలిస్టు దుస్సాహసం! | Norwegian journalist Helle Lyng Serious On PM Modi | Sakshi
Sakshi News home page

మోదీకి ప్రశ్నా.. నార్వే మహిళా జర్నలిస్టు దుస్సాహసం!

May 20 2026 10:39 AM | Updated on May 20 2026 1:44 PM

Norwegian journalist Helle Lyng Serious On PM Modi

ఇంటా బయటా విలేకరులతో మాట్లాడడానికి ఇష్టపడని మన ప్రధాన మంత్రి మోదీ నిన్న నార్వే టూర్‌లో Dagsavisan అనే పత్రిక మహిళా జర్నలిస్టు (Helle Lyng Svendsen) నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కున్నారు. "Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world?" అని ఆ జర్నలిస్టు అడిగారు.

నార్వే ప్రధానితో కలిసి జాయింట్ ప్రెస్ మీట్ ముగించుకుని కరచాలనం చేసి వెళ్తుండగా అది వినిపించిందో, లేదో గానీ మోదీ గారు ఆ ప్రశ్న పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత, ఎక్స్ వేదికగా ఆమె రచ్చ చేశారు. "It is our job to question the powers we cooperate with," అని ఆమె రాశారు. దీని మీద సోషల్ మీడియాలో హంగామా జరుగుతోంది. కాషాయ సోషల్ మీడియా బృందం ఆమె వెంటపడి కామెంట్స్‌తో కుమ్ముతోంది. దీనిపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ఈ క్రమంలో దాచడానికి ఏమీ లేనప్పుడు భయపడటం ఎందుకు?. తన విశ్వసనీయతపైనే సందేహాలున్న ఒక ప్రధానమంత్రి, కేవలం కొన్ని ప్రశ్నలకు భయపడి వెళ్లిపోవడాన్ని ప్రపంచం చూసినప్పుడు, భారతదేశ ప్రతిష్ట ఏమవుతుంది? అని ప్రశ్నించారు.

కాగా, 2015లో బ్రిటన్‌లో, 2023లో అమెరికాలో మాత్రమే మోదీ విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత జర్నలిస్టులకు దూరంగా ఉంటున్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయిన మీడియాను ఏ మాత్రం పట్టించుకోకుండా మూడు సార్లు ప్రధానమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కింది. నార్వేలో ఇద్దరు ప్రధానులు చేసింది press briefing మాత్రమే అనీ, అది press conference కాదు కాబట్టి ఆయన సమాధానం చెప్పకుండా వెళ్ళారని భారత అధికారులు అంటున్నారు. It is indeed a point!

సమాధానం ఇస్తే బాగుండేది..
ప్రోటోకాల్‌లో లేకపోయినా, మన ప్రధాని ఆ జర్నలిస్టు నుంచి ఒక ప్రశ్న తీసుకుని చక్కగా నవ్వుతూ సమాధానం ఇస్తే బాగుండేది. మహా అయితే.. మానవ హక్కుల ఉల్లంఘన, ముస్లిం వ్యతిరేకత, వ్యవస్థల నిర్వీర్యం, రెండు యుద్ధాల (ఇరాన్, ఉక్రెయిన్) వంటి వివాదాస్పద ప్రశ్న ఒకటి అడిగి ఉండేది ఆమె. ఆ ప్రశ్నకు నేరుగా కాకపోయినా, డొంక తిరుగుడుగా సూపర్ సమాధానాలు చెప్పవచ్చు. దానికి కూడా మంచి పాజిటివ్ కవరేజ్ వచ్చేది. నాకు ఆసక్తి కలిగించిన అంశం ఏమిటంటే, ఒక మహిళా జర్నలిస్టు ధైర్యంగా ప్రశ్న అడిగితే ఆమె ఘోర అపరాధం చేసినట్లు ఆ దేశ అధికారులు, భద్రతా సిబ్బంది ఎవ్వరూ స్పందించలేదు. మన దగ్గర అయితే సీన్ వేరుగా ఉంటుంది. అందుకే మహిళా జర్నలిస్టులు గ్రేట్.

ఇక, ఫ్రాన్స్ కేంద్రంగా ఉండే అంతర్జాతీయ NGO రిపోర్టర్స్ విత్అవుట్ బోర్డర్స్ ప్రతి ఏడాదీ World Press Freedom Index విడుదల చేస్తుంది. వివిధ కొలబద్దల ఆధారంగా దేశాలకు ర్యాంకింగ్ ఇస్తారు. 180 దేశాలలో మీడియా స్వేచ్ఛలో ఫస్ట్ ప్లేస్‌లో నార్వే ఉండగా, భారత్ ర్యాంకు 157గా కొనసాగుతోంది.  
- డాక్టర్‌ ఎస్‌.రాము, సీనియర్‌ జర్నలిస్ట్‌. 

ఇదిలా ఉండగా.. ఓస్లోకు చెందిన డ‌గ్‌సావిసెన్ అనే ప‌త్రిక‌లో హెల్లి లింగ్ ప‌నిచేస్తున్న‌ది. మోదీ నార్వే విజిట్‌ను క‌వ‌ర్ చేసే బృందంలో ఆమె కూడా ఉన్నారు. గతంలో MSN మరియు ఇతర నార్వేజియన్ మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశారు. త‌మ ప్ర‌భుత్వంతో స‌హ‌క‌రించే అధికారుల‌ను ప్ర‌శ్నించ‌డం త‌న క‌ర్త‌వ్యం అని ఆమె తెలిపారు. అనంతరం, ఈ పరిణామాల కారణంగా తన ఇన్స్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ బ్లాక్‌ అయినట్టు ఆమె పేర్కొంది. 

లింగ్‌ ప్రశ్నల వర్షం.. 
ఇక భార‌త విదేశాంగ మంత్రిత్వ‌శాఖ నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలోనూ లింగ్ మ‌ళ్లీ ప్ర‌శ్న‌లు కురిపించారు. భార‌త్‌లో ఉన్న ప్ర‌జాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ‌, మాన‌వ హ‌క్కుల గురించి ఆమె ప్ర‌శ్నించారు. అంత‌ర్జాతీయ స‌మాజం ఇండియాను ఎందుకు న‌మ్మాల‌ని ఆమె అడిగారు. సంక్లిష్ట‌మైన అంశాల్లో ప్ర‌ధాని మోదీ స్పందించ‌డం లేద‌ని ఆమె ఆరోపించారు. లింగ్ చేసిన ఆరోప‌ణ‌ల‌కు విదేశాంగ శాఖ ప్ర‌తిని సిబి జార్జ్ స్పందించారు. భార‌తీయ ప్ర‌జాస్వామ్యాన్ని, మీడియాను ఆమె స‌మ‌ర్ధించారు. అయితే ఏమీ తెలియ‌ని ఎన్జీవోలు ఇచ్చే నివేదిక‌ల‌ను విదేశీ విమ‌ర్శ‌కులు ప‌రిశీలిస్తుంటార‌ని జార్జ్ అన్నారు. విదేశాంగ శాఖ‌, జ‌ర్న‌లిస్టు మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌కు చెందిన వీడియోలు వైర‌ల్ అయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement