ఈ రోజుల్లో రీల్స్ పిచ్చి ఎంత ప్రమాదకరంగా మారుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. రీల్స్ మోజులో పడి ప్రాణాలు పోతున్నా.. యువతలో మార్పు రావడం లేదు. తాజాగా యూపీలో ఉరికి సంబంధించిన రీల్ తీయడానికి ప్రయత్నించిన యువతి.. పొరపాటు జరిగి ప్రమాదవశాత్తు నిజంగానే ఉరికి బలైంది.
సోషల్ మీడియాలో వైరల్ కావాలన్న ఆలోచనతో ప్రజలు ఎంతకైనా బరితెగిస్తున్నారు. ప్రమాదకర స్టంట్స్ చేస్తూ తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. తాజాగా అటువంటి ఘటనే యూపీలో జరిగింది. బన్దా జిల్లాలో మోహిని అనే 27 ఏళ్ల యువతి ఉరికి సంబంధించిన రీల్ తీద్దామని ప్రయత్నించింది. దాని కనుగుణంగా ఫ్యానుకు తాడు కట్టి తన మెడ చుట్టూ ఉచ్చు బిగించుకుంది. ఈ చిత్రాలను తన మెుబైల్లో చిత్రీకరించింది.
అయితే ఏం జరిగిందే ఏమో తెలియదు కానీ కొద్దిసేపటి తర్వాత దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. తన నాలుగేళ్ల పాప తలుపు తీసేసరికి ఆమె విగతజీవిగా పడి ఉంది. దీంతో తన తల్లి పరిస్థితి అర్థం కానీ ఆ చిన్నారి పెద్దగా ఏడ్చేసరికి చుట్టుప్రక్కల వారు వచ్చి చూడగా మోహిని ఫ్యానుకు వేలాడుతూ ఉంది.
దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. రీల్స్ తీసే తొందరలో పొరపాటున స్టూలు జారి ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.


