గాజాలోని రఫాలో హమాస్ ఉగ్రవాదుల సొరంగాలను ఇజ్రాయిల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్లో డజన్ల కొద్దీ ఉగ్రవాదులను నిర్మూలించి, సొరంగాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. హమాస్ ఉగ్రవాదులు తమ ఆయుధాలను సొరంగాల్లో దాచారనే సమాచారంతో వాటిని పూర్తిగా నిర్వర్యం చేయడానికి రంగంలోకి దిగి, విజయవంతంగా ముగించినట్లు తెలిపింది.
రఫాలో ఒక కిలోమీటర్ పొడవైన హమాస్ సొరంగాన్ని ధ్వంసం చేసిన వీడియోలను ఐడీఎఫ్ సోమవారం విడుదల చేసింది.. ఈ సొరంగంలో హమాస్ ఉగ్రవాదులు దాగి ఉండే గదులు, అలాగే ఆయుధాలు కూడా కనుగొన్నారు. ఈ ఆపరేషన్లో పదుల సంఖ్యలో హమాస్ ఉగ్రవాదులు చనిపోయినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఈ సొరంగాన్ని యహలోమ్ ఎలైట్ ఇంజినీరింగ్ యూనిట్ పూర్తిగా కూల్చివేసినట్లు పేర్కొంది. 2025 అక్టోబరు 28న జరిగిన దాడిలో మాస్టర్ సర్జెంట్ (రిజర్వ్) యోనా ఎఫ్రైమ్ ఫెల్డ్బౌమ్ వీరమరణం పొందిన చోటుగా గుర్తించబడిన సొరంగాన్ని కూడా ధ్వంసం చేశారు.
గత వారం రఫాలోని మరో సొరంగ ద్వారం వద్ద తొమ్మిది మంది ఉగ్రవాదులను ఐడీఎఫ్ దళాలు నిర్మూలించాయి. వారు సొరంగం నుంచి బయటకు వచ్చి కాల్పులు జరిపినప్పుడు వీరిని హతమార్చాయి ఐడీఎఫ్ దళాలు. రఫా ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదుల మౌలిక వసతులను పూర్తిగా కూల్చివేయడమే లక్ష్యంగా ఐడీఎష్ దళాలు తమ దాడులు ముమ్మరం చేశాయి.


