Mauritius: భారతీయ కుటుంబానికి ఘోర అవమానం | Indian family shocked by racism at luxury Mauritius resort | Sakshi
Sakshi News home page

Mauritius: భారతీయ కుటుంబానికి ఘోర అవమానం

Feb 23 2026 12:16 PM | Updated on Feb 23 2026 12:36 PM

Indian family shocked by racism at luxury Mauritius resort

మారిషస్: ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు మారిషస్‌ దేశానికి వెళ్లిన ఒక భారతీయ కుటుంబానికి జాతి వివక్ష (Racism) రూపంలో ఘోర అవమానం ఎదురైంది. మారిషస్‌లోని పంచతార రిసార్ట్‌లో బస చేసిన భారతీయ టెక్ రివ్యూయర్‌కు, అతని వృద్ధాప్య తల్లిదండ్రులకు అక్కడి సిబ్బంది నరకం చూపించారు. కొత్త ఉద్యోగం వచ్చిన ఆనందంలో తన తల్లిదండ్రులకు కానుక ఇవ్వాలని భావించిన అతనిని తీవ్ర నిరాశ ఎదురయ్యింది. సుమారు రూ. 3.5 లక్షలు వెచ్చించి, ఈ పర్యటనను ప్లాన్ చేసిన ఆ యువకుడు తనకు మారిషస్‌లో ఎదురైన అనుభవాలను ‘ఎక్స్’ వేదికలో పంచుకున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆ యువకుని కుటుంబానికి ఈ చేదు అనుభవం ఈస్టర్ పండుగ రోజున  ఎదురయ్యింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భోజనం కోసం రిసార్ట్ రిసెప్షన్‌కు ఫోన్ చేయగా, టేబుల్స్ ఖాళీ లేవని, 15 నిమిషాల్లో సమాచారం ఇస్తామని సిబ్బంది తెలిపారు. అయితే గంట గడిచినా ఎటువంటి స్పందన లేకపోవడంతో, ఆకలితో అలమటిస్తున్న తన తల్లిదండ్రులను తీసుకొని  నేరుగా స్వయంగా రెస్టారెంట్‌లోనికి వెళ్లారు. అక్కడ పరిస్థితిని గమనించి, సిబ్బందిని వివరణ కోరగా కనీస మర్యాద లేకుండా వారు సరైన సమాధానం చెప్పకుండా  లోపలికి వెళ్లిపోయారు. యూరోపియన్ అతిథులకు సకల మర్యాదలు చేస్తున్న సిబ్బంది, భారతీయుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆ యువకుని కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
 

ఆ రోజు హోటల్ యాజమాన్యం ఈస్టర్ ప్రత్యేక విందు ఏర్పాటు చేసినా, భారతీయ కుటుంబానికి ఆ సమాచారాన్ని తెలియజేయలేదు. మధ్యాహ్నం 2:30 గంటలు దాటినా లంచ్‌ దొరకకపోవడంతో, ఆకలి తట్టుకోలేక సదరు యువకుడి తల్లి అక్కడే ఉన్న హౌస్ కీపింగ్ సిబ్బంది వద్దకు వెళ్లి లంచ్‌ పెట్టమని వేడుకున్నారు. తాను లక్షల రూపాయలు చెల్లించినా, విదేశీ గడ్డపై తన తల్లి అక్కడి సిబ్బందిని అలా వేడుకోవడం చూసి ఆ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. చివరకు ఆ హౌస్ కీపింగ్ సిబ్బంది జాలిపడి వారిని విందు జరుగుతున్న ప్రాంతానికి తీసుకెళ్లగా, అక్కడ టేబుల్స్ ఖాళీగా ఉండటం, ఆహారం  నిండుగా ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు. అయితే అక్కడ కూడా వారికి వివక్ష కొనసాగింది. ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయాయని వారికి చెప్పారు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక శ్వేతజాతీయుడు అడగ్గానే వేడివేడి ఫ్రెంచ్ ఫ్రైస్‌ను వడ్డించడం జాతి వివక్షకు పరాకాష్టగా నిలిచింది.

ఈ వివక్ష పూరిత ప్రవర్తనపై హోటల్ మేనేజర్‌కు  ఆ యువకుడు ఫిర్యాదు చేసినా, కనీసం క్షమాపణ చెప్పకపోగా కేవలం ‘మీ ఫీడ్‌బ్యాక్ నోట్ చేసుకున్నాం’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. ఇతర పర్యాటకుల మాదిరిగానే తగినంత రుసుము చెల్లించినప్పటికీ, భారతీయులను  వివక్ష ధోరణితో చూడటంపై ఆ టెక్ రివ్యూయర్ మండిపడ్డారు. ఆ సమయంలో తన భద్రత దృష్ట్యా భయపడి, బయటకు చెప్పలేకపోయానని, కానీ జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికే  ఇలా ‘ఎక్స్‌’లో స్పందిస్తున్నట్లు ఆయన వివరించారు. 

ఇది కూడా చదవండి: పొట్ట కొడుతున్న ‘ఏఐ’.. ‘రియాలిటీ’ యజమాని కన్నీరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement