ఎ.కొండూరు కేజీబీవీలో విద్యార్థినులపై ఎలుకల దాడి
11 మంది విద్యార్థినులకు గాయాలు
ఎ.కొండూరు: ఎలుకలు కరిచి 11 మంది విద్యార్థినులు గాయపడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో జరిగింది. విద్యార్థినులు బుధవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో చిమట ప్రసన్న, కావూరి కళావతి, చావల కుమారితో పాటు మరో ఎనిమిది మందిని ఎలుకలు తీవ్రంగా కరిచాయి. దీంతో ప్రిన్సిపాల్ విద్యార్థినిలకు స్థానిక ప్రాథమిక వైద్యశాలలో చికిత్స చేయించారు.
ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు తహసీల్దార్ అరవింద్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ కేశవరావు, జీసీడీఓ విశ్వభారతిని విచారణకు ఆదేశించారు. వారు విద్యాలయాన్ని సందర్శించి ఘటనపై విచారణ జరిపారు. నివేదికను కలెక్టర్, ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు. ఎలుక కరిచిన విద్యార్థినులను గురువారం వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్సెల్ కార్యదర్శి నరెడ్ల వీరారెడ్డి తదితరులు పరామర్శించారు.
కేజీబీవీలో సమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వేముల స్వాతిని వివరణ కోరగా విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన వాస్తవమేనన్నారు. మొత్తం 11 మందిని కరవగా వారికి టీటీ, ఏఆర్వీ వ్యాక్సిన్లు వేశామని వివరించారు.


