ఈనెల 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు
సాక్షి, అమరావతి: ఈనెల 23 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదల చేశారు. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి https://bie.ap.gov.in వెబ్ సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. రెండో ఏడాది విద్యార్థులు మొదటి సంవత్సరం హాల్టికెట్ నంబర్, మొదటి ఏడాది విద్యార్థులు పదో తరగతి హాల్టికెట్ నంబర్ లేదా ఆధార్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్ పొందవచ్చన్నారు. మనమిత్ర వాట్సాప్ నంబర్ (9552300009)కు ‘హాయ్’ అని మెసేజ్ చేసిన అనంతరం వచ్చే వివరాల ఆధారంగా కూడా హాల్టికెట్ను పొందవచ్చని చెప్పారు. కాలేజీ యాజమాన్యాలు తమ లాగిన్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించాలని ఆదేశించారు.
23 నుంచి పరీక్షలు ప్రారంభం
ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. రెండో ఏడాది విద్యార్థులకు 24న పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 24వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. అయితే మార్చి 3న జరగాల్సిన రెండో ఏడాది మ్యాథ్మెటిక్స్, సివిక్స్ పేపర్లు మార్చి 4న, మార్చి 20న ప్రకటించిన మొదటి ఏడాది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్లు మార్చి 21న నిర్వహిస్తారు. మార్చి 3న హోలీ, మార్చి 20 రంజాన్ సెలవులు ఉండడంతో ఈ మార్పులు చేశారు. మిగిలిన పరీక్షలు గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఉంటాయి.


