రూ.24.50 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు
మామిడికుదురు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మగటపల్లికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని రూ.24.50 లక్షలు పోగొట్టుకున్నారు. నగరం ఎస్ఐ ఎ.చైతన్యకుమార్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం... మగటపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొనుకు శ్రీనివాస్కు ఇటీవల ఫేస్బుక్లో సైబర్ నేరగాళ్లు ఒక లింక్ను పంపారు.
దానిని ఓపెన్ చేయగా, కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో కొంత డబ్బులు ఆన్లైన్లో బదిలీ చేస్తే రూ.10 లక్షల విలువైన ఎరువులు పంపిస్తామని, వాటిని అమ్మితే భారీ లాభం వస్తుందంటూ నమ్మించారు. నమ్మిన శ్రీనివాస్ మొదట కొంత డబ్బును ఫోన్ పే చేశారు. ఆ తర్వాతా విడతల వారీగా రూ.24.50 లక్షలు బదిలీ చేశారు. అయినా ఎరువులు రాకపోవడంతో శ్రీనివాస్ 1930కు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంకు అధికారులు నిందితుల ఖాతాలో రూ.9 లక్షలు ఫ్రీజ్ చేశారు.


