ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడవ ప్రపంచ యుద్ధాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే ప్రారంభించారన్నారు. మాస్కో దండయాత్రను అడ్డుకోవడం ద్యారా ఉక్రెయిన్ పూర్తి స్థాయి ప్రపంచ యుద్ధాన్ని నిరోధించడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు.
ఉక్రెయన్- రష్యా యుద్ధం ప్రారంభమై ఇటీవలే నాలుగు సంవత్సరాలు పూర్తైంది. 2022లో ప్రారంభమైన ఈ యుద్ధం మూలంగా ఇప్పటికే పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధాన్ని నిరోధించడానికి పెద్ద ఎత్తున యత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీకి జెలెన్స్కీ ఇంటర్వ్యూ ఇచ్చారు.
యుద్ధం ముగించడానికి అమెరికా అధ్యక్షుని నుంచి స్పష్టమైన హామీలు ఆశిస్తున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. కేవలం అధ్యక్షుని మాట పూర్వక హామీ కాకుండా దానికి రాజ్యాంగ పరమైన అనుమతి ఉండాలని కోరారు. 1991లో ఉక్రెయిన్ స్వాతంత్రం పొందినప్పుడు ఉన్న సరిహద్దులే తమ అంతిమ లక్షమని అయితే ఇప్పుడు రష్యా సైనిక పరంగా ఎంతో బలంగా ఉన్నందున అది సాధ్యం కాదని జెలెన్స్కీ ఒప్పుకున్నారు.
అయితే రష్యా తమ భూభాగం నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదని విషయం తనకు తెలుసన్నారు. తన పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని రష్యా విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తుందని జెలెన్స్కీ తన అభిప్రాయాలు ఇంటర్వ్యూలో పంచుకున్నారు.


