రష్యాలోని ప్రసిద్ధ బైకాల్ సరస్సు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. గడ్డకట్టిన సరస్సుపై పర్యాటకులతో వెళ్తున్న బస్సు, మంచు పలకలు పగలడంతో నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో చైనాకు చెందిన ఏడుగురు పర్యాటకులు మరణించారు. ఈ విషయాన్ని రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
వీరితో పాటు రష్యాకు చెందిన డ్రైవర్ కూడా మృతి చెందినట్లు సమాచారం. అయితే ఒక్క పర్యాటకుడు మాత్రమే బస్సు మునిగిపోయేలోపు కిటికీలోంచి బయటకు దూకి ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రష్యా అత్యవసర సేవల విభాగం రంగంలోకి దిగింది. బస్సు సుమారు 18 మీటర్ల లోతులో ఉన్నట్లు అండర్ వాటర్ కెమెరాల సహాయంతో గుర్తించారు. అయితే భద్రతా నిబంధనల ఉల్లంఘన కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
కాగా సైబీరియాలో ఉన్న బైకాల్ సరస్సు ప్రపంచంలోనే అత్యంత లోతైన మంచి నీటి సరస్సు. శీతాకాలంలో ఇది పూర్తిగా గడ్డకట్టి, వాహనాలు వెళ్లడానికి వీలుగా మారుతుంది. అయితే ఈ మధ్య అక్కడ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మంచు పలకలు బలహీనపడ్డాయి. అధికారులు పర్యాటక తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారు అనుమతించిన సురక్షిత మార్గంలోనే వాహనాలు ప్రయాణించాలి. ఈ చైనా టూరిస్ట్లు ఉన్న బస్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించినట్లు సమాచారం.


