జపాన్లో ఓ అజ్ఞాత వ్యక్తి ఔదార్యం
టోక్యో: స్వాతంత్య్రోద్యమ సమయంలో, 1962లో చైనాతో యుద్ధం సమయంలో మన దేశంలో చాలామంది మహిళలు బంగారు ఆభరణాలను ప్రభుత్వానికి విరాళంగా అందజేశారు. అలాగే ఇప్పుడు జపాన్లోనూ ఓ అజ్ఞాత వ్యక్తి తను నివాసముంటున్న ఒసాకా నగరం మీద ప్రేమతో ఏకంగా 21 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చేశాడు! వాటి విలువ ఏకంగా రూ.32 కోట్ల పై చిలుకు! నగరంలో పూర్తిగా పాతబడిపోయిన తాగునీటి, డ్రైనేజీ పైపుల వ్యవస్థను వాటి సాయంతో సమూలంగా పునరుద్ధరించాల్సిందిగా ఆయన కోరాడు. ఒసాకా మేయర్ హిదేయుకి యొకోయామా గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు.
‘‘ఒసాకాలో 90 శాతానికి పైగా నీటి పైపులు లీకేజీలమయమే. దీనిపై నగర వాటర్వర్క్స్ బ్యూరో ఇప్పటికే పలుమార్లు ఆందోళన వెలిబుచ్చింది కూడా. వాటి పునరుద్ధరణకు భారీ నిధులు కావాలి. కానీ నగరానికి అంత బడ్జెట్ లేదు. ఈ సమయంలో అద్భుతం జరిగింది. అజ్ఞాత దాత ఒకరు గత నవంబర్లో ఏకంగా 21 కిలోల బంగారు కడ్డీలు విరాళమిచ్చారు. ఆయనకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే! పైపుల పునరుద్ధరణ సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వాటిని సది్వనియోగం చేస్తాం’’అని ఆయన ప్రకటించారు. సదరు అజ్ఞాత దాత గతంలో మున్సిపల్ వాటర్ వర్క్స్ కోసం లక్షల రూపాయల నగదు ఇచ్చారని తెలిపారు.
సమస్యల నగరం
30 లక్షల జనాభా ఉన్న ఒకాసా జపాన్లో మూడో అతి పెద్ద నగరం. దేశ ఆర్థిక రాజధానిగా కూడా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు దేశ రాజధానిగానూ కొనసాగింది. అత్యంత పురాతన నగరం కూడా. ఇక్కడి మంచి నీరు, డ్రైనేజీ పైపులు కూడా అంతే పురాతనమైనవి. పైపులు పూర్తిగా తుప్పు పట్టి పనికి రాకుండా పోయాయి. వాటి లీకేజీలు స్థానికుల భద్రతను నిత్యం ప్రమాదంలోకి నెడుతున్నాయి. వీటికి తోడు నగరంలో రోడ్లపై సింక్ హోల్స్ (భారీ గుంతలు) కూడా సర్వసాధారణంగా మారాయి. గతేడాది అలాంటి ఓ భారీ సింక్ హోల్ ఏకంగా ఒక క్యాబ్నే మింగేసింది. ఆ దుర్ఘటనలో దాని డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. కానీ నిధుల లేమి కారణంగా మంచినీటి, డ్రైనేజీ పైపుల మారి్పడి వ్యవహారం ఓ పట్టాన ముందుకు సాగడం లేదు.


