ఇప్పుడిప్పుడే బంగారం ధరలు తగ్గుతున్నాయని పసిడి ప్రియులు సంబరపడుతున్నారు. ఈ తరుణంలో గోల్డ్ రేటు మళ్లీ రూ. 2 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను, ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపుపై కొనసాగుతున్న అనిశ్చితి వంటివి కారణాలు అని వెల్లడించారు.
అమెరికా - ఇరాన్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా యుద్ధ వాతావరణం లేదా రాజకీయ అస్థిరతలు ఏర్పడినప్పుడు.. పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ పెట్టుబడులవైపు చూస్తారు. ఇలాంటి సమయంలో.. బంగారం, వెండి వంటి సురక్షితమైన ఆస్తులలో పెట్టుబడులు పెడతారు. ఇదే జరిగితే.. గోల్డ్, సిల్వర్ రేట్లు అమాంతం పెరుగుతాయి.
ఇక మరో అంశం.. వడ్డీ రేట్లు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందా? లేదా?.. అనేది చాలాకాలంగా పెట్టుబడిదారుల్లో నిలిచిపోయిన ఒక ప్రశ్న. వడ్డీ రేట్లు తగ్గితే.. బంగారం వంటి ఆస్తులు మరింత ఆకర్షణీయంగా మారుతాయి. ఎందుకంటే వడ్డీ వచ్చే పెట్టుబడులపై లాభం తగ్గినప్పుడు, పెట్టుబడిదారులు బంగారం వంటి ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతారు.
రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగితే.. ధరలు ఎగిసే అవకాశం ఉంది. అదే విధంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు ప్రకటిస్తే కూడా బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు.. మార్కెట్లో పెద్ద మార్పులు కనిపించకపోవచ్చు.
ప్రస్తుతం తగ్గిన ధరలు!
2026 జనవరిలో రూ. 1.80 లక్షలకు చేరిన తులం బంగారం.. ప్రస్తుతం రూ. 1.50 లక్షల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఇంత తక్కువ వ్యవధిలో రేటు ఎంత తగ్గిందో చూడవచ్చు. వెండి రేటు కూడా దాదాపు భారీగా తగ్గి కేజీ రేటు రూ. 2.70 లక్షలకు చేరింది.


