నిజంగా భారత్ ఏఐని నిర్మిస్తుందా? అనుసరిస్తుందా? | where india exactly in ai development | Sakshi
Sakshi News home page

నిజంగా భారత్ ఏఐని నిర్మిస్తుందా? అనుసరిస్తుందా?

Feb 20 2026 1:45 PM | Updated on Feb 20 2026 2:54 PM

where india exactly in ai development

న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఏఐ సమ్మిట్ భారతీయ స్టార్టప్‌లైన సర్వం (Sarvam), జ్ఞాని (Gnani), భారత్‌జెన్ (BharatGen) స్వదేశీ ఏఐ మోడల్స్‌ను ప్రదర్శించి కొత్త ఆశలు రేకెత్తించాయి. ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్ పాత్రను కొనియాడుతూ భారీ పెట్టుబడుల ప్రకటనలు గుప్పించినప్పటికీ అసలు ప్రశ్న అలాగే ఉంది.. ప్రపంచ ఏఐ పరిణామ క్రమంలో భారత్ స్థానం ఎక్కడ? ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ప్రతిపాదించిన ‘ఐదు అంచెల ఏఐ స్టాక్’ ప్రాతిపదికన భారత్ స్థితిగతులను విశ్లేషిస్తే వాస్తవాలు కింది విధంగా ఉన్నాయి.

ఏఐ ఐదు అంచెల్లో భారత్ స్థానం ఇదేనా?

ఇంధనం.. ఏఐ డేటా సెంటర్లకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అవసరం. భారత్‌లో విద్యుత్ ధరలు తక్కువే అయినప్పటికీ గ్రిడ్ విశ్వసనీయత, పంపిణీ లోపాలు సవాలుగా మారాయి.

కంప్యూటింగ్‌ సదుపాయాలు.. ప్రస్తుతం భారత్ పూర్తిగా దిగుమతి చేసుకున్న చిప్స్, జీపీయూలపైనే ఆధారపడుతోంది.

ఫౌండేషన్ మోడల్స్.. అమెరికా (ఓపెన్‌ఏఐ, జెమిని, మైక్రోసాఫ్ట్‌ కోపైలట్‌..), చైనా (డీప్‌సీక్‌) ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. భారత్ వద్ద మల్డీమోడల్‌ డేటా ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయి మోడల్స్ ఇంకా రూపుదిద్దుకోవాల్సి ఉంది.

ప్లాట్‌ఫారమ్స్.. మన దగ్గర భారీ డెవలపర్ బేస్ ఉన్నప్పటికీ ప్రపంచాన్ని శాసించే ఏఐ ప్లాట్‌ఫారమ్స్ లేవు.

అప్లికేషన్ లేయర్.. ఇందులో భారత్‌కు మంచి పట్టు ఉంది. తక్కువ ఖర్చుతో ఏఐ పరిష్కారాలను అందించగల సామర్థ్యం మనకుంది. అయితే మేధో సంపత్తిని కాపాడుకోవడమే అసలు సవాలు.

గ్లోబల్ టెక్ దిగ్గజాలకు భారత్ ఎందుకు అవసరం?

అమెరికా కంపెనీలు భారత్‌పై ఇంతలా దృష్టి సారించడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. చైనా తన డేటాను బయట ప్రపంచానికి ఇవ్వదు. కానీ భారత్ వద్ద చెల్లింపులు, ఈ-కామర్స్, వ్యవసాయం వంటి రంగాల నుంచి అపారమైన డేటా ఉంది. భారత్ ఒక ఉచిత డేటా పూల్‌గా మారింది. విదేశీ సంస్థలు ఇక్కడి డేటాతో తమ మోడల్స్‌ను తయారు చేసి తిరిగి మనకే అధిక ధరలకు అమ్ముతాయి. చాట్‌జీపీటీకి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ భారత్. రాబోయే రోజుల్లో 50 కోట్ల ఏఐ వినియోగదారులు భారత్ నుంచే వస్తారని అంచనా. అమెరికా వైట్ హౌస్ సలహాదారులు సైతం ప్రపంచం అమెరికన్ ఏఐ మోడల్స్‌నే వాడాలని కోరుకుంటున్నారు.

భారత ఏఐ భవిష్యత్తు ఎలా ఉండాలంటే..

భారత్ కేవలం ఒక ఏఐ వినియోగదారు దేశంగా మిగిలిపోకుండా ఉండాలంటే తక్షణమే కొన్ని చర్యలు చేపట్టాలి.

డేటాపై పూర్తి అధికారం

భారతీయ డేటా స్థానిక అవసరాలకే ప్రాధాన్యతనివ్వాలి. ఫిబ్రవరి 6 నాటి భారత్-అమెరికా సంయుక్త ప్రకటనలోని ‘డిజిటల్ ట్రేడ్ రూల్స్’ భారత్ తన డేటాను నియంత్రించే శక్తిని తగ్గించే ప్రమాదం ఉంది. గతంలో ఆటోమొబైల్ రంగాన్ని రక్షించుకున్నట్టే ఏఐ రంగంలోనూ డేటా ప్రవాహంపై స్పష్టమైన నిబంధనలు ఉండాలి.

స్వదేశీ మౌలిక సదుపాయాల కల్పన

చైనా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా వంటి దేశాలు సొంత జాతీయ ఏఐ వ్యవస్థలను నిర్మిస్తున్నాయి. భారత్ ఇండియా ఏఐ మిషన్ ద్వారా ఈ మేరకు చర్యలు చేపడుతున్నప్పటికీ మన స్టార్టప్‌లకు నిధుల కొరత ఉంది. ఐటీ దిగ్గజ కంపెనీలు అమెరికా క్లయింట్ల కోసం కాకుండా సొంతంగా ఏఐ మోడల్స్ నిర్మించే దిశగా అడుగులు వేయాలి.

నైపుణ్యం కలిగిన మానవ వనరులు

ఏఐ వల్ల సంప్రదాయ కోడింగ్, టెస్టింగ్ ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. కానీ, క్లౌడ్ ఆధునికీకరణ, ఏఐ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మన ఇంజినీరింగ్ విద్యావ్యవస్థను ఏఐకి అనుగుణంగా మార్చడం అత్యవసరం.

ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్‌! తులం ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement