ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ప్రశ్నలు | Supreme Court criticized freebie culture warning indiscriminate distribution | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ప్రశ్నలు

Feb 20 2026 9:29 AM | Updated on Feb 20 2026 9:38 AM

Supreme Court criticized freebie culture warning indiscriminate distribution

దేశంలో ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు గుప్పిస్తున్న ‘ఉచితాల’ సంస్కృతిపై భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అసలైన లబ్ధిదారులకు, సంపన్నులకు మధ్య తేడా చూడకుండా ప్రజా ధనాన్ని ఇష్టానుసారంగా పంపిణీ చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ఇలాంటి విధానాలు పాటిస్తారా అని ప్రశ్నించింది.

ఖజానా ఖాళీ అవుతున్నా ఆగని కానుకలు

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం (జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలి) ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలైనా, లోటు బడ్జెట్‌తో నడుస్తున్న రాష్ట్రాలైనా.. అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుల్లో ఉన్న రాష్ట్రాలు సైతం ఎన్నికల ముందు స్కూటీలు, బట్టలు, ఆహార పదార్థాలను ఉచితంగా పంపిణీ చేయడానికి వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తున్నాయి?’ అని ధర్మాసనం నిలదీసింది.

ఈ ప్రస్తావనకు సందర్భం ఏమిటి?

తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎన్‌పీడీసీఎల్‌) దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ చర్చ మొదలైంది. విద్యుత్ (సవరణ) చట్టం-2024లోని రూల్ 23 రాజ్యాంగ బద్ధతను తమిళనాడు ప్రభుత్వం సవాలు చేసింది. ఈ క్రమంలో సీజేఐ స్పందిస్తూ.. ‘విద్యుత్ రంగంలో సంపన్నుల నుంచి వసూలు చేసి లాభాలు గడించే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రాలు ఎందుకు ఆ పని చేయడం లేదు? హరియాణా, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్ లేదా ఈశాన్య రాష్ట్రాలు ఏదైనా కావచ్చు.. ఎన్నికలు రాగానే పథకాల వెల్లువ ఎందుకు వస్తోంది?’ అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు, సిద్ధాంతకర్తలు ఈ సంస్కృతిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

కోర్టు పరిమితులు

ఒక దశలో సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు భావించింది. అయితే న్యాయవ్యవస్థ పరిమితులను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోకూడదని ధర్మాసనం నిర్ణయించుకుంది. కానీ, సంక్షేమానికి, విచ్చలవిడి ఖర్చుకు మధ్య సమతుల్యత లేకపోతే భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది.

టీఎన్‌పీడీసీఎల్‌ వాదన ఏమిటి?

తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ప్రధానంగా విద్యుత్ (సవరణ) నియమావళి, 2024లోని రూల్ 23 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైంది.

రూల్ 23 అంటే..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన ప్రకారం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌) తాము సరఫరా చేసే విద్యుత్తుకు అయ్యే ఖర్చును వినియోగదారుల నుంచి వసూలు చేయాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా వర్గానికి (ఉదాహరణకు రైతులకు లేదా గృహ వినియోగదారులకు) ఉచిత విద్యుత్ లేదా సబ్సిడీ ఇవ్వాలనుకుంటే ఆ సబ్సిడీ మొత్తాన్ని ముందుగానే డిస్కమ్ సంస్థలకు చెల్లించాలి.

తమిళనాడు ప్రభుత్వం ఏమంటుంది?

తమిళనాడు ప్రభుత్వం ఈ నిబంధనను కొన్ని కారణాలతో వ్యతిరేకిస్తోంది. విద్యుత్ అనేది భారత రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజల అవసరాలకు అనుగుణంగా సబ్సిడీలు ఇచ్చే స్వతంత్ర అధికారం ఉంటుంది. కేంద్రం ఇలాంటి కఠిన నిబంధనలు పెట్టడం రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడమేనని వారి వాదన. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యయాలు పెరిగినప్పుడు ఆ భారాన్ని తక్షణమే వినియోగదారులపై వేయడం సాధ్యం కాదని, అది సామాన్యులపై భారం చూపుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అనేది దశాబ్దాలుగా వస్తున్న విధానం. రూల్ 23 వల్ల ఈ సంక్షేమ పథకాల అమలు కష్టతరమవుతుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను విచారించినప్పుడు ఉచితాల అంశాన్ని లేవనెత్తింది. ఒకవైపు డిస్కమ్‌లు భారీ నష్టాల్లో ఉన్నాయని చెప్తూ, మరోవైపు సంపన్నులకు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని కోర్టు ప్రశ్నించింది. సంపన్నుల నుంచి సరైన ధర వసూలు చేస్తే ఆ ఆదాయాన్ని పేదలకు మెరుగైన విద్యుత్ అందించడానికి లేదా మౌలిక సదుపాయాల కల్పనకు వాడవచ్చు కదా అని సీజేఐ సూచించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలు కింది విధంగా ఉన్నాయి.

ఇదీ చదవండి: ‘భారత్‌లో ఏఐ స్పీడ్‌ చూస్తే విస్మయం కలుగుతుంది’

Supreme Court criticized1
1/4

Supreme Court criticized2
2/4

Supreme Court criticized3
3/4

Supreme Court criticized4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement