మీడియేషన్‌ సరైన సొల్యూషన్‌! | Supreme Court encouraging mediation | Sakshi
Sakshi News home page

మీడియేషన్‌ సరైన సొల్యూషన్‌!

Feb 13 2026 4:47 AM | Updated on Feb 13 2026 4:47 AM

Supreme Court encouraging mediation

మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహిస్తున్న సుప్రీంకోర్టు 

సమయం ఆదా.. ఖర్చు స్వల్పం 

కేసుల భారం తగ్గించడం, సత్వర న్యాయమే ధ్యేయం 

ఈ ఏడాది నిర్వహణకు హైకోర్టులకు సూచనలు 

చర్యలు ప్రారంభించిన రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ

తండ్రి వీలునామా ద్వారా సంక్రమించిన 4,461 చదరపు గజాల స్థలంలో భవన నిర్మాణం కోసం కె.రవీంద్రనాథ్, ఆయన సోదరి మధ్య వివాదం నెలకొంది. సుప్రీంకోర్టు వరకు కేసులు వేస్తూ వెళ్లారు. ‘ఇది అన్నాచెల్లెలి మధ్య జరుగుతున్న న్యాయపోరాటం. వివాదం ప్రారంభమై ఇప్పటికే 12 ఏళ్లయింది. ఇద్దరూ చర్చించుకుని ఓ న్యాయబద్ధమైన పరిష్కారానికి రావాలన్నది మా ఆకాంక్ష. దీని కోసం మధ్యవర్తిగా జస్టిస్‌ సుధాంశు ధులియాను నియమిస్తున్నాం.’ –హైదరాబాద్‌కు చెందిన కేసులో సుప్రీంకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: కోర్టుకు వెళ్లాలంటే భయం.. కేసు ఎప్పటికి పరిష్కారమవుతుందోనని.., న్యాయవాదులు ఫీజు ఎంత అడుగుతారోనన్న ఆందోళన. కేసు తేలేదాక పార్టీల మధ్య వివాదాలూ తప్పవు. అదే బంధువులు, స్నేహితులైతే ఇక ఆ బంధం నిలబడే అవకాశమే ఉండదు. పలు క్రిమినల్‌ కేసులకు సివిల్‌ కేసు మూలంగా మారుతోంది. అలా కాకుండా.. సమయం, డబ్బుతోపాటు బంధాలు కలిపి ఉంచే ఒకే ఒక వేదికే ‘మధ్యవర్తిత్వం’. ఇరుపక్షాలు రాజీ కుదర్చుకుని ఆనందాన్ని పొందవచ్చు. 

ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనాలైన సుప్రీంకోర్టు, హైకోర్టు మధ్యవర్తిత్వాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. న్యాయస్థానాలపై కేసులు భారం తగ్గించడం, సత్వర న్యాయం అందించడమే ధ్యేయంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది కూడా ‘దేశం కోసం మధ్యవర్తిత్వం’కార్యక్రమాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రారంభించింది. ఈ సందర్భంగా ‘మధ్యవర్తిత్వం’పై ప్రత్యేక కథనం.. 

పరిష్కరించుకునే కేసులు: 
సివిల్, వాణిజ్య, దాంపత్య వివాదాలు, చెక్‌బౌన్స్‌ కేసులు, రాజీపడదగిన క్రిమినల్‌ కేసులు, భూసేకరణ, వినియోగదారుల సంబంధ, కాంట్రాక్ట్‌ యాక్ట్‌ కేసులు, ఆర్థిక, ఆస్తి విభజన తగాదాలు, లేబర్‌కోర్టు కేసులు

ఇరుపార్టీలకు విజయం: పంచాక్షరీ, సభ్యకార్యదర్శి, టీజీఎల్‌ఎస్‌ఏ 
ఢిల్లీలోని మీడియేషన్‌ అండ్‌ కన్సిలియేషన్‌ ప్రాజెక్టు కమిటీ ఆదేశాల మేరకు ‘దేశం కోసం మధ్యవర్తిత్వం–2.0’ను గత నెల 2 నుంచి ప్రారంభించాం. హైకోర్టు సీజే జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, టీజీ ఎల్‌ఎస్‌ఏ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ శామ్‌కోషి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నాం. కక్షిదారులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని విలువైన సమయం, డబ్బును ఆదా చేసుకోవాలి. ఇరుపార్టీల అంగీకారం మేరకే వివాదం పరిష్కారం అవుతుంది. మధ్యవర్తిత్వంలో ఆయా పార్టీలదే అంతిమ విజయం. మధ్యవర్తిత్వం బంధాలను నిలబెడుతుంది.  

మధ్యవర్తిత్వం కోసం ఎక్కడ సంప్రదించాలి... 
» ప్రతీ జిల్లాలోని న్యాయసేవాధికార సంస్థ ఆవరణలో మధ్యవర్తిత్వ కేంద్రం ఉంటుంది. 
»  కో–ఆర్డినేటర్, మధ్యవర్తిత్వ కేంద్రం, హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ, హైకోర్టు ప్రాంగణం. 

నల్సా టోల్‌ ఫ్రీ నంబర్‌ 15100  

దేశం కోసం మధ్యవర్తిత్వం 
పురాతన, ఇతిహాసాల కాలం నుంచి మన దేశంలో అమల్లో ఉన్న మధ్యవర్తిత్వాన్ని న్యాయపరంగా, చట్టబద్ధంగా ప్రోత్సహించాలని సుప్రీంకోర్టు నిర్ణయించి ఏటా ‘దేశం కోసం మధ్యవర్తిత్వం’కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతేడాది ప్రారంభించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఈ ఏడాది మధ్యవర్తిత్వానికి అనుకూలంగా ఉన్న కేసులను సిద్ధం చేయాలని హైకోర్టులకు సమాచారమిచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌ ఆదేశాల మేరకు జనవరి 2 నుంచే దీని కోసం తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ(టీజీఎల్‌ఎస్‌ఏ) చర్యలు ప్రారంభించింది.  

మధ్యవర్తిత్వ నిర్వహణకు శిక్షణ పొందిన వారు  : 587 
వీరిలో న్యాయవాదులు : 581 
పదవీ విరమణపొందిన హైకోర్టు జడ్జిలు :
న్యాయవాదుల్లో హెచ్‌సీఎల్‌ఎస్‌సీ సభ్యులు : 67 
40 గంటల ప్రత్యేక శిక్షణ పొందిన జ్యుడీషియల్‌ అధికారులు: 137  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement