భద్రాచలంలో జన్మనిచ్చిన మహిళ
భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బుధవారం రాత్రి ఓ మహిళ ఐదు కిలోలకు పైగా బరువు ఉన్న బాలుడికి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురుకు చెందిన సురేశ్ భార్య సంధ్యారాణికి నెలలు నిండటంతో కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం భద్రాచలం ఆస్పత్రికి తీసుకొచ్చారు.
సంధ్యారాణిని పరీక్షించిన వైద్యులు సాధారణ ప్రసవానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు 7.36 గంటలకు ఆపరేషన్ చేయగా 5.100 కిలోల బరువు గల మగ శిశువు జన్మించాడు. ఈ సందర్భంగా గురువారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తల్లీబిడ్డల ఆరోగ్యంపై ఆరా తీశారు.


