సార్వత్రిక సమ్మె భారీ ప్రదర్శనలో నినదించిన కార్మిక సంఘాలు
రాష్ట్రంలో లేబర్ కోడ్లను అమలు చేయబోం: టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
కవాడిగూడ/సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా సాధించుకున్న కార్మిక హక్కుల చట్టాలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ కాలరాస్తూ కార్పొరేటర్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని పలువురు వక్తలు విమర్శించారు. గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా భారీ ప్రదర్శనను ఆర్టీసీ కల్యాణ మండపం నుంచి ఇందిరాపార్కు వరకు నిర్వహించారు. ఈ ర్యాలీలో కార్మిక, రైతు, ప్రజా సంఘాలు కదం తొక్కా యి.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీఐ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, బీఆర్టీ యూ, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల ఫెడరేషన్లు, అసోసియేషన్లు, రైతు సంఘాల నేతలు వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను పూర్తిగా కాలరాస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో లేబర్ కోడ్లను అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేసే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతానని స్పష్టంచేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు, ఏఐటీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు ఎం.నర్సింహ, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, టీయూటీసీ రాష్ట్ర నాయకులు ఎస్ఎల్ పద్మ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కశ్య పద్మతో పాటు వివిధ సంఘాల నేతలు, ఆటో డ్రైవర్ యూనియన్లు, గిగ్ వర్కర్స్ యూనియన్, బ్యాంక్, అంగన్వాడీ, మున్సిపల్, జీహెచ్ఎంసీ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి.


