18 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల అద‌న‌పు ధాన్యం తీసుకోండి: సీఎం రేవంత్‌ | Cm Revanth And Uttam Kumar Reddy Meet Union Minister Pralhad Joshi | Sakshi
Sakshi News home page

18 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల అద‌న‌పు ధాన్యం తీసుకోండి: సీఎం రేవంత్‌

Feb 12 2026 9:05 PM | Updated on Feb 12 2026 9:08 PM

Cm Revanth And Uttam Kumar Reddy Meet Union Minister Pralhad Joshi

ఢిల్లీ: వానాకాలం పంట‌కు (2025-26 సీజ‌న్‌) సంబంధించి తాము అద‌నంగా  సేక‌రించిన 18 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకోవాల‌ని కేంద్ర ఆహార, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రిని ఆయ‌న నివాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గురువారం క‌లిశారు.

వానా కాలం పంట‌కు సంబంధించి 53.73 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కు (ఎల్ఎంటీ) అనుమ‌తించార‌ని.. కానీ భారీగా పంట ఉత్ప‌త్తి కావ‌డంతో అద‌నంగా 18 ఎల్ఎంటీలు తాము సేక‌రించినందున ఆ మొత్తాన్ని 10 శాతం నూక‌తో ఎఫ్ సీఐ సేక‌రించాల‌ని కేంద్ర మంత్రికి వారు విజ్ఞ‌ప్తి చేశారు. 2024-25 యాసంగి పంట‌కు సంబంధించి 5 శాతం నూక‌తో అద‌నంగా 10 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుమ‌తించాల‌ని కేంద్ర మంత్రి జోషిని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కోరారు.

2024-25 వానా కాలం పంట‌కు సంబంధించి క‌స్ట‌మ్స్ మిల్లింగ్ రైస్‌కు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ వ‌ర‌కు గడువు నిర్దేశించార‌ని,  దానిని మ‌రో రెండు నెల‌లు పాటు పొడిగించాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. భార‌త ఆహార సంస్థకు (ఎఫ్‌సీఐ) 2014-15 వానా కాలంలో స‌ర‌ఫ‌రా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణ‌కు బ‌కాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని  కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషిని సీఎం, రాష్ట్ర మంత్రి కోరారు. 

నాడు అద‌న‌పు లెవీ సేక‌ర‌ణ‌కు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వమే భ‌రించింద‌ని కేంద్ర‌ మంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. నాడు సేక‌ర‌ణ‌కు తాము రుణం తీసుకున్నామ‌ని.. దానికి వ‌డ్డీ రూ.2 వేల కోట్ల‌కుపైగా పెరిగింద‌ని తెలియజేశారు. ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ యోజ‌న కింద 2021, మే నుంచి 2022, మార్చి వ‌ర‌కు స‌ర‌ఫ‌రా చేసిన అద‌న‌పు బియ్యం,  2022 ఏప్రిల్ నెల‌లో స‌ర‌ఫ‌రా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్ల‌ను విడుదల చేయాలని కేంద్ర మంత్రికి సీఎం, రాష్ట్ర మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. స‌మావేశంలో ఎంపీలు డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, సురేశ్ షెట్కార్‌, రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అద‌న‌పు డైరెక్ట‌ర్ రోహిత్‌ సింగ్, కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement