సాక్షి, ఢిల్లీ: ‘‘తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీ కాదు’’ అంటూ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. 2029లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని.. పదిన్నరేళ్ల పాటు నేనే సీఎంగా ఉంటానని రేవంత్ అన్నారు. తానూ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించనని..తనను అన్నవాళ్లనే తాను అంటున్నానన్నారు. అన్ని కేసుల్లో దర్యాప్తు ఆధారంగానే ముందుకెళ్తామని.. కేసీఆర్, హరీష్రావు కోరినట్లు ప్రభుత్వం నడవదన్నారు.
‘‘మున్సిపల్ ఎన్నికల్లో నేను డిస్టింక్షన్లో పాస్ అవుతా. జూబ్లీహిల్స్లో ఎన్టీఆర్ విగ్రహం నేనే ఆవిష్కరిస్తా. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి. కేసీఆర్ సెల్ఫ్ హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. సింగరేణిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెడతా. సైట్ విజిట్ నిబంధన కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. మా ప్రభుత్వం వచ్చినట్టుకే సింగరేణి అప్పుల్లో ఉంది. మా ప్రభుత్వం ఎవరి ఫోన్లు టాపింగ్ చేయడం లేదు. జనాభా గణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి’’ అని రేవంత్ పేర్కొన్నారు.
ప్రభాకర్రావును విచారించేందుకే మాకు 20 నెలలు పట్టింది. ఫోన్ టాపింగ్ కేసు విచారణకు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. సుప్రీంకోర్టు ద్వారా ప్రభాకర్రావును రప్పించాను. త్వరలో చార్జిషీట్ కూడా వేయమని ఆదేశాలు ఇచ్చా. ప్రభాకర్రావు ఇచ్చిన సమాచారం మేరకే కేసీఆర్ విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టును ఎవరు బాంబులతో పేల్చలేదు. బాంబులతో పేలిస్తే ప్రాజెక్టుపైకి లేస్తుంది. గుంతలోకి కూరుకుపోదు. ఎన్డీఎస్ఎ నివేదిక మేరకు కాళేశ్వరంపై అధ్యయనం జరుగుతుంది’’ అని రేవంత్ వెల్లడించారు.


