హైదరాబాద్: హైడ్రా కూల్చివేతల ఎపిసోడ్ మరోసారి ఉద్రిక్తతకు దారితీశాయి. మాదాపూర్ ఖానామెట్లో ఆలయ స్థలంలో నిర్మించిన షాప్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తుండగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆలయ స్థలంలో నిర్మించిన షాపులను కూల్చివేయడంపై ఆలయ పూజారులు, భక్తులు, గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. దాంతో అక్కడ అధికారులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కాగా, అక్రమ నిర్మాణాలను హైడ్రా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్నారు హైడ్రా అధికారులు. ఈ క్రమంలోనే పలు చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. అయితే పలు చోట్ల మాత్రం హైడ్రా చర్యలను స్థానికులు అడ్డుకుంటున్నారు. ఎప్పట్నుంచో ఇక్కడ ఉంటుంటే హఠాత్తుగా హైడ్రా పేరుతో ఈ తొలగింపులేమిటని ప్రశ్నిస్తున్నారు.


ఇదిలా ఉంచితే, హైదరాబాద్ నగర పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా తీసుకుంటున్న చర్యలతో బీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్పటికీ మధ్యతరగతి ప్రజల నుంచి స్పందన మాత్రం సానుకూలంగానే ఉంది. ఇప్పటికే ఎన్నో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా.. ఇంకా కూల్చివేయాల్సిన అక్రమ నిర్మాణాలు మాత్రం ఇంకా ఉన్నట్లే తెలుస్తోంది. ప్రధానంగా బడాబాబుల అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వస్తున్నాయి.


