హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయని, అన్నీ గమనిస్తున్నారని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామరక్ష అని అన్నారు. శేరిలింగపల్లి నియోజకవర్గం నుంచి విజయ్కుమార్రెడ్డి బీఆర్ఎస్లో చేరడాన్ని కేటీఆర్ స్వాగతించారు. దీనిలో భాగంగా మాట్లాడుతూ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పార్టీ మారినా, కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్లోనే ఉన్నారన్నారు. ఎమ్మెల్యే లేనప్పటికీ హైదరాబాద్ మొత్తంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే బిఆర్ఎస్ బలంగా ఉందన్నారు కేటీఆర్.
‘ఈ రాష్ట్రానికి కాంగ్రెస్, బిజెపి చేసింది ఏం లేదు. వెట్టి పనికైనా, మట్టి పనికైనా మనోడే ఉండాలి అని పెద్దలు చెప్తారు. అందుకే ఈ రాష్ట్రానికి శ్రీ రామ రక్ష బిఆర్ఎస్ మాత్రమే. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఒకే ఒక విషయం చెప్పాను. ఓటు ఎవరికి వెయ్యాలి, ఎందుకు వెయ్యాలో ఆలోచన చెయ్యండని. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో ఎగిరేది మాత్రం గులాబీ జెండానే. గ్రేటర్ హైదరాబాద్ లో కొందరు నాయకులు పార్టీ మారిన, కార్యకర్తలు మాత్రం బిఆర్ఎస్ లోనే ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ లేదు. కేసీఆర్ హయంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉండేవి’ అని పేర్కొన్నారు.


