శంషాబాద్‌ నుంచే హైస్పీడ్‌ రైళ్లు! | High speed trains from Shamshabad | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ నుంచే హైస్పీడ్‌ రైళ్లు!

Feb 13 2026 4:40 AM | Updated on Feb 13 2026 4:40 AM

High speed trains from Shamshabad

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో ఎంపీలు రఘురాంరెడ్డి, మల్లు రవి, అనిల్‌కుమార్‌ తదితరులు

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి 

మూడు కారిడార్లను ఇక్కడి నుంచే ప్రారంభించండి 

ఎయిర్‌పోర్టు సమీపంలో 500 ఎకరాలు కేటాయిస్తాం 

భూసేకరణ చేపట్టి పనులు మొదలు పెట్టండి 

రక్షణ, పౌర విమానయాన శాఖ మంత్రులతోనూ భేటీ 

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన మూడు హైస్పీడ్‌ రైలు కారిడార్లను అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్‌ నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని తెలిపారు. ‘హైదరాబాద్‌–చెన్నై (778 కి.మీ.) కారిడార్‌ అమరావతి మీదుగా వెళుతుంది. అక్కడి నుంచి బందరు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేస్తే, డ్రైపోర్టు నుంచి బందరు పోర్టుకు సరుకు రవాణా వేగవంతం అవుతుంది. 

హైదరాబాద్‌–బెంగళూరు (586 కి.మీ.), హైదరాబాద్‌–పుణే (556 కి.మీ.) కారిడార్లను కూడా శంషాబాద్‌ నుంచే మొదలు పెడితే అది ట్రై జంక్షన్‌ అవుతుంది. ఈ మూడు కారిడార్లకు భూ సేకరణ వెంటనే చేపట్టి పనులు ప్రారంభించండి..’అని సీఎం కోరారు. బుధవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి గురువారం పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. మూసీ పునరుజ్జీవం, రైలు మార్గాల మంజూరు, విమానాశ్రయాల పనులు వేగవంతమే లక్ష్యంగా చర్చలు జరిపారు.  

ఆ మార్గం కేంద్ర నిధులతో చేపట్టండి 
కృష్ణా–వికారాబాద్‌ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాల్సిందిగా రైల్వే మంత్రిని సీఎం కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ వ్యయం మొత్తం తామే భరిస్తామని తెలిపారు. ఈ మార్గంలోని టేకల్‌కోడ్‌లో లైమ్‌ స్టోన్‌ నిక్షేపాలను గుర్తించామని.. సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నామని చెప్పారు. 

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంతో పాటు కర్ణాటకలోని పలు సిమెంట్‌ పరిశ్రమలకు సమీపంలో కృష్ణా ప్రాంతం ఉందని..కొడంగల్, టేకల్‌కోడ్, దౌల్తాబాద్‌లను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. సీఎం వినతులపై అశ్వినీ వైష్ణవ్‌ సానుకూలంగా స్పందించారు. పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.  

‘గాంధీ సరోవర్‌’శంకుస్థాపనకు రండి 
హైదరాబాద్‌లోని ఈసా, మూసీ నదుల సంగమ స్థలిలో ప్రపంచస్థాయి విద్యా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ కేంద్రంగా నిర్మించనున్న గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ముఖ్యమంత్రి ఆ హ్వనించారు. 1948లో జాతిపిత మహత్మాగాంధీ చితాభస్మాన్ని నిమజ్జనం చేసిన బాపూఘాట్‌ వద్ద ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని తెలిపారు. 

సుస్థిర పట్టణాభివృద్ధి లక్ష్యాలతో పర్యావరణ హితంగా, స్వచ్ఛమైన నీటితో నది ప్రవహించేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 100 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. ఫిబ్రవరి నెలాఖరులో భూమి పూజ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.  

మామునూరు విమానాశ్రయ పనులు ప్రారంభించండి 
రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌కు సమీపంలో నిర్మించనున్న మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడును సీఎం కోరారు. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన భూ సేకరణ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. 

ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి సంబంధించి అనుమతులు వెంటనే మంజూరు చేయాలని, విమానాశ్రయం ఏర్పాటుకు అదనంగా అవసరమైన 249.82 ఎకరాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాగా మామునూరు ఎయిర్‌పోర్ట్‌ పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులను పంపిస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.  

18 ఎల్‌ఎంటీల అదనపు ధాన్యం తీసుకోండి 
వానాకాలం పంటకు (2025–26 సీజన్‌) సంబంధించి తాము అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకునేలా ఆదేశించాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రల్హాద్‌ జోషికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో సీఎం కలిశారు. 

వానాకాలం పంటకు సంబంధించి 53.73 ఎల్‌ఎంటీల ధాన్యం సేకరణకు అనుమతించారని, కానీ వరి భారీగా పండటంతో తాము అదనంగా 18 ఎల్‌ఎంటీలు సేకరించామని ముఖ్యమంత్రి చెప్పారు. ‘అలాగే 2024–25 యాసంగి పంటకు సంబంధించి 5 శాతం నూకతో అదనంగా 10 ఎల్‌ఎంటీల బాయిల్డ్‌ రైస్‌ మిల్లింగ్‌కు అనుమతించాలి. 2024–25 వానాకాలం పంటకు సంబంధించిన కస్టమ్‌ మిల్లింగ్‌కు ఈ నెల 28వ తేదీ వరకు గడువు నిర్దేశించారు. అయితే దానిని మరో రెండు నెలలు పాటు పొడిగించాలి.

2014–15 వానాకాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు ఎఫ్‌సీఐ బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంటనే విడుదల చేయాలి. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్‌లో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి బకాయి పడిన రూ.343.27 కోట్లు కూడా విడుదల చేయాలి..’అని కేంద్ర మంత్రికి సీఎం, మంత్రి విజ్ఞప్తి చేశారు. 

రాహుల్, కేసీ వేణుగోపాల్‌తోనూ భేటీ 
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోనూ విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ పనితీరును వివరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని, విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపలేదని తెలిపారు. అందుకు సంబంధించిన నివేదికలను అందజేశారు. 

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సన్న బియ్యం పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ తదితర పథకాల అమలుతో ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని వివరించారు. కాగా క్షేత్ర స్థాయి ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధించడంపై సీఎంను రాహుల్, కేసీ వేణుగోపాల్‌ అభినందించారు.  

హైస్పీడ్‌ కారిడార్ల అలైన్‌మెంట్‌పై సీఎం సూచనలు 
హైస్పీడ్‌ రైలు కారిడార్ల అలైన్‌మెంట్‌కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కన్సల్టెంట్‌ సంస్థకు పలు సూచనలు చేశారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌ తయారీ బాధ్యతను ‘రైట్స్‌’(ఖఐఖీఉ ) సంస్థకు రైల్వే శాఖ అప్పగించింది. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు గురువారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ఇందుకు సంబంధించి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 

అలైన్‌మెంట్లు, డీపీఆర్‌కు సంబంధించి వారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం.. పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజు, కార్యదర్శి (కో ఆర్డినేషన్‌) డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్, ‘రైట్స్‌’ఈడీ లలిత్‌కుమార్‌ పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement