ఏప్రిల్ 2026 నుంచి ‘రిస్క్ బేస్డ్ ప్రీమియం’తో తగ్గుదల! | RBI announced major regulatory shift risk based premium framework | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ 2026 నుంచి ‘రిస్క్ బేస్డ్ ప్రీమియం’తో తగ్గుదల!

Feb 20 2026 12:46 PM | Updated on Feb 20 2026 1:03 PM

RBI announced major regulatory shift risk based premium framework

భారత బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్కరణలు చేపడుతోంది. ఏప్రిల్ 1, 2026 నుంచి డిపాజిట్ ఇన్సూరెన్స్ కోసం ‘రిస్క్ బేస్డ్ ప్రీమియం’ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టనుంది. దీనివల్ల మెరుగైన రిస్క్ మేనేజ్‌మెంట్ పాటించే బ్యాంకులకు ఆర్థిక వెసులుబాటు కలగడమే కాకుండా ఖాతాదారుల డిపాజిట్లకు మరింత భద్రత చేకూరనుంది.

ప్రస్తుత విధానం vs కొత్త విధానం

ప్రస్తుతం అమలులో ఉన్న ఫ్లాట్ ప్రీమియం పద్ధతిలో బ్యాంకు స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి రూ.100 అసెసబుల్ డిపాజిట్లకు (ఒక బ్యాంకు తన వద్ద ఉన్న మొత్తం డిపాజిట్లపై డీఐసీజీసీకి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఏ మొత్తాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ ప్రీమియంను లెక్కిస్తారో దాన్ని అసెసబుల్ డిపాజిట్లు అంటారు) 12 పైసలను ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఫిబ్రవరి 6, 2026న విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం ఈ ధరలను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నిర్ణయించే రిస్క్ స్కోర్ల ఆధారంగా వర్గీకరిస్తారు.

ముఖ్యమైన అంశాలు

  • బ్యాంకుల అంతర్గత రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా ప్రీమియం మారుతుంది. పటిష్టమైన ఆర్థిక స్థితి ఉన్న బ్యాంకులు తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.

  • ఐసీఆర్ఏ అంచనా ప్రకారం క్లెయిమ్‌లు లేని, సుదీర్ఘ హిస్టరీ కలిగిన బ్యాంకులు తమ అసెట్స్ పై రిటర్న్ (ఆర్‌ఓఏ)లో దాదాపు 4 బేసిస్ పాయింట్ల వృద్ధిని చూడవచ్చు.

  • దేశంలోని మొత్తం డిపాజిట్లలో 80 శాతం వాటా కలిగిన బ్యాంకులు ఈ రాయితీ ప్రీమియంల వల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. దీనివల్ల బ్యాంకింగ్ రంగానికి మొత్తంగా 3 బేసిస్‌ పాయింట్లు లాభం చేకూరవచ్చు.

టైర్-1 బ్యాంకులపై ప్రభావం

షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు (ఆర్‌ఆర్‌బీలు మినహా) వర్తించే టైర్-1 మోడల్ ప్రకారం ‘ఏ’ కేటగిరీ బ్యాంకుల ప్రీమియం రూ.100కి 8 పైసలకు తగ్గుతుంది. అంటే గతంలో కంటే నేరుగా 33.33 శాతం తగ్గింపు లభిస్తుంది. అదనంగా, వింటేజ్ ఆధారిత ప్రోత్సాహకం కింద మరో 25 శాతం వరకు ప్రీమియం తగ్గే అవకాశం ఉంది.

రూ. 5 లక్షల పరిమితి పెరుగుతుందా?

ప్రస్తుతం ఒక బ్యాంకులో ఖాతాదారుడికి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు బీమా రక్షణ ఉంది. కొత్త ధరల నిర్మాణం వల్ల భవిష్యత్తులో ఈ బీమా పరిమితిని మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. రిస్క్ ఆధారిత ప్రీమియం వల్ల బ్యాంకులపై పడే అదనపు భారాన్ని ఈ రాయితీలు భర్తీ చేస్తాయని ఐసీఆర్‌ఏ పేర్కొంది.

ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్‌! తులం ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement