బ్యాంకుల్లో బీమా సహా ఇతర ఆర్థిక ఉత్పత్తులను తప్పుదోవ పట్టించి విక్రయించడాన్ని (మిస్ సెల్లింగ్) నిరుత్సాహపరిచే నిబంధనలను ఆర్బీఐ ప్రతిపాదించింది. ‘‘ఉత్పత్తులు/సేవల విక్రయాలను పెంచుకునేందుకు గాను, మిస్ సెల్లింగ్ లేదా ఉద్యోగులను ప్రోత్సహించే విధంగా బ్యాంక్ విధానాలు, పద్దతులు లేకుండా చర్యలు తీసుకోవాలి’’అని ఆర్బీఐ తన ముసాయిదా నిబంధనల్లో పేర్కొంది.
ఉత్పత్తులు/సేవల విక్రయాలకు సంబంధించి వివిధ యూనిట్ల మధ్య పోటీలను నిర్వహించడాన్ని ఉదాహరణగా ఆర్బీఐ పేర్కొంది. థర్డ్ పార్టీ (బ్యాంకు సొంతం కానివి) ఉత్పత్తులు/సేవల మార్కెటింగ్/విక్రయాలపై ఉద్యోగులకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి ప్రోత్సాహకాలు ఉండరాదని స్పష్టం చేసింది. అలాగే, బ్యాంక్లు తన ఉత్పత్తికి జోడింపుగా (బండిల్డ్) థర్డ్ పార్టీ ఉత్పత్తి విక్రయాన్ని చేపట్టరాదని కోరింది.
ఈ విషయంలో కస్టమర్లకు ఒకటికి మించి ఆప్షన్లు అందించాలని నిర్దేశించింది. ఒకవేళ కస్టమర్ను తప్పుదోవ పట్టించి ఉత్పత్తిని విక్రయించినట్టు తేలితే.. అంత మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి అదనంగా కస్టమర్కు ఏదైనా నష్టం కలిగితే అంత మేర పరిహారం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.


