పోటీని దెబ్బతీసే విధానాలను పాటించినందుకు ఇంటెల్ కార్పొరేషన్పై కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) రూ. 27.38 కోట్ల జరిమానా విధించింది. డెస్క్టాప్లో ఉపయోగించే బాక్స్డ్ మైక్రోప్రాసెసర్లకు (బీఎంపీ) సంబంధించి భారత్కి మాత్రమే పరిమితమయ్యే వారంటీ పాలసీని వర్తింప చేయడం ద్వారా మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కంపెనీ దుర్వినియోగం చేసిందని సీసీఐ పేర్కొంది.
చైనా, ఆస్ట్రేలియా, ఇతరత్రా ప్రపంచదేశాల్లో కంపెనీల పాటించే వారంటీ పాలసీలతో పోల్చినప్పుడు భారత్లో అమలు చేస్తున్న విధానం వివక్షపూరితమైనదని తెలిపింది. భారత్లోని అధీకృత పంపిణీదారు నుంచి కొనుగోలు చేస్తేనే బీఎంపీలకు వారంటీ చెల్లుబాటయ్యేలా, మిగతా ఎక్కడా లేని విధంగా ఇండియాకు మాత్రమే పరిమితమయ్యే విధంగా పాలసీని ఇంటెల్ అమలు చేయడం సరికాదంటూ మ్యాట్రిక్స్ ఇన్ఫో సిస్టమ్స్ చేసిన ఫిర్యాదుపై సీసీఐ ఈ ఆదేశాలిచ్చింది.


