ఓ భారతీయుడి నమ్మి.. ప్రేమించి.. అతడిని పెళ్లి చేసుకున్న పాపానికి తాను నరకం అనుభవిస్తున్నానని రష్యా మహిళ బోరున విలపించింది. ఇంతటి నమ్మక ద్రోహాన్ని తాను ఎక్కడా చూడలేదని.. తన జీవితంలో మరోసారి భారతీయులను నమ్మను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో తాను స్వదేశానికి(రష్యా) వెళ్లిడానికి భారత్లో వీసా విషయంలో ఉన్న లోపాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీంతో, బాధితురాలి పోస్టుపై స్పందిస్తూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. రష్యాకు చెందిన ఒల్గా 2015లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్డీ కోసం భారత్కి వచ్చింది. ఈ సమయంలో భారత్కు చెందిన వ్యక్తిని(భర్త పేరు చెప్పలేదు) ప్రేమించింది. వారిద్దరూ 2019లో వివాహం చేసుకున్నారు. అనంతరం, ఆమె భారత్లో శాశ్వత నివాసం ఉండాలని నిర్ణయం తీసుకుంది. అయితే, కొద్దిరోజుల తర్వాత వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో, ఒల్గా.. 2023 నవంబరులో స్పౌసల్ వీసా(భారతీయ పౌరుడు లేదా OCI కార్డ్ హోల్డర్ను వివాహం చేసుకున్న విదేశీయులకు Spousal Visa (X Visa లేదా Entry Visa) మంజూరు చేస్తారు) కోసం దరఖాస్తు చేసినప్పుడు తన భర్త ఇంటర్వ్యూకి హాజరుకాలేదు. ఈ పరిణామాలతో వారి మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఒల్గా.. రష్యా వెళ్లిపోయేందుకు సిద్ధమైంది.
ఇంతలో 2024 జనవరిలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన భర్త అదృశ్యమయ్యాడు. దీంతో, ఆందోళన చెందిన ఒల్గా.. పోలీసులను సంప్రదించి. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఆరు నెలలు అయినా తన భర్త ఆచూకీ తెలియకపోవడంతో అతను చనిపోయినట్టు భావించి భయంతో కాలం వెల్లదీసింది. కుటుంబం లేకుండా, డబ్బు లేకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. వీసా సమస్యల వల్ల రష్యాకు వెళ్లలేకపోయినట్టు చెప్పుకొచ్చింది.
అయితే, ఒక రోజు ఇన్స్టాగ్రామ్లో జపాన్ పర్యాటకుడి పోస్ట్లో తన భర్త.. ఒల్గాకు కనిపించాడు. వారణాసిలో సన్యాసిలా మారిపోయి కనిపించడంతో ఆమె ఒక్కసారిగా ఖంగుతింది. దీంతో, అతడిని కలిసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో భర్త మరో స్టోరీ అల్లాడు.. ఒల్గాకు క్షమాపణలు చెప్పి, తనను ప్రేమిస్తున్నట్టు నటించి నమ్మించాడు. మరోసారి ఇలా చేయనని చెప్పడంతో.. అతడి మాటలను ఒల్గా నమ్మి మళ్లీ సంబంధాన్ని కొనసాగించింది. దీంతో, ఒల్గా.. హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగం చేస్తూ, భర్తకు ఆర్థికంగా సహాయం చేసింది. ఇంతలో.. తన భర్త చేసిన మరో మోసాన్ని ఆమె తెలుసుకుంది. ఆయన మరో మహిళతో 15 కి.మీ దూరంలో సంబంధం పెట్టుకుని ఉంటున్నాడని గుర్తించింది. ఈ క్రమంలో అతడిని ప్రశ్నించలేక.. చేసేదేమీ లేక ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు రష్యాకు వెళ్లేందుకు ప్రయత్నించింది. రష్యా వెళ్తున్న సమయంలో తన భర్త ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ కారణంగా ఆమెను విమానం నుండి దింపివేశారు. ప్రస్తుతం ఆమె వీసా సమస్యలు పరిష్కరించుకోవడానికి న్యాయ సహాయం కోరుతున్నట్టు పోస్టులో వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ఆమె పోస్టులపై నెటిజన్లు స్పందిస్తున్నారు. చాలా మంది ఆమెకు మద్దతు తెలుపుతూ, ధైర్యంగా నిలబడమని ప్రోత్సహించారు. కొంతమంది ఆమె భర్త ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా భారత వీసా చట్టాలు, విదేశీయుల హక్కులు, భార్యాభర్తల మధ్య న్యాయ పరిరక్షణలపై చర్చలు జరిగాయి.


