ఒ‍క్కరోజే 75 ఫైల్స్‌ క్లియర్‌.. అజిత్‌ మృతి రోజున ఏం జరిగింది? | 75 school files Sudden clearance On Ajit Pawar crash sparks row | Sakshi
Sakshi News home page

ఒ‍క్కరోజే 75 ఫైల్స్‌ క్లియర్‌.. అజిత్‌ చ‌నిపోయిన రోజు ఏం జరిగింది?

Feb 18 2026 4:25 PM | Updated on Feb 18 2026 5:29 PM

75 school files Sudden clearance On Ajit Pawar crash sparks row

ముంబై: మహారాష్ట్రలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మృతి చెందిన రోజున మహారాష్ట్ర మైనారిటీ శాఖ మైనారిటీ పాఠశాలలకు సంబంధించిన 75 ఫైళ్లను క్లియర్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, మైనార్టీ శాఖ అజిత్‌ పవార్‌ వద్దే ఉండటం గమనార్హం. దీంతో, ఈ వ్యవహారంలో మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకేరోజు ఇలా ఫైల్స్‌ క్లియర్ చేయడంపై అటు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

కాగా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ జనవరి 28న విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, అదే రోజున  మహారాష్ట్ర మైనారిటీ శాఖలో మైనారిటీ పాఠశాలలకు సంబంధించిన 75 ఫైళ్లను క్లియర్ అయ్యాయి. ఈ ఫైళ్లలో మైనారిటీ విద్యా సంస్థలకు గుర్తింపు, ఆమోదాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే, అజిత్‌ పవార్‌ వద్దే మైనార్టీ శాఖ ఉంది. ఆయన చార్జ్‌ తీసుకున్న తర్వాత దాదాపు రెండేళ్ల కాలంలో మైనార్టీ శాఖకు సంబంధించిన కొన్ని నిర్ణయాలను ఆయన పక్కన పెట్టినట్టు సమాచారం. ముఖ్యంగా మైనార్టీ విద్యా సంస్థలకు సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో, తాజాగా ఈ పరిణామం రాజకీయంగా, పరిపాలనా వర్గాల్లో తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది. ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో ఫైళ్లను అకస్మాత్తుగా క్లియర్ చేయడంలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.

రాష్ట్ర పరిపాలన అజిత్ పవార్ చుట్టూ ఉన్న బ్రేకింగ్ న్యూస్‌తో బిజీగా ఉన్న రోజున తక్కువ వ్యవధిలో 75 ఫైళ్లను ఎలా ప్రాసెస్ చేసి సంతకం చేశారని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు. మరోవైపు.. ఈ సమస్య పరిపాలనా చర్యకు కూడా దారితీసింది. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే మహారాష్ట్ర మైనారిటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ మిలింద్ షెనాయ్‌ను బదిలీ చేశారు. దీంతో, ఈ వ్యవహారంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, ఒక ప్రముఖ రాజకీయ ఘటన(అజిత్‌ పవార్‌ మృతి) చర్చగా ఉన్న రోజున ఇంత పెద్ద పరిపాలనా కార్యక్రమం జరగడం సహజంగానే సందేహాన్ని రేకెత్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, తుది నిర్ణయాలు ప్రభుత్వ విచారణ ఫలితంపై ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. ఈ విషయం ఇప్పుడు మహారాష్ట్రలో రాజకీయ చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ విషయంపై ప్రభుత్వం విచారణ ప్రారంభించిందని, తదుపరి చర్యలు కూడా జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇక, ప్రస్తుతం మైనార్టీ శాఖ ఆయన భార్య సునేత్రా పవార్ వద్ద ఉంది. ఆమె ఈ అనుమానాస్పద సర్టిఫికెట్లపై విచారణ ఆదేశించారు.

ఇదిలా ఉండగా.. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కూలిపోవడంతో ప్రాణాలు విడిచారు.. అయితే, ఈ ప్రమాదంపై ఆది నుంచి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఆ ప్రాణాంతక ప్రమాదానికి కారణం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సునీల్ తత్కరే.. అజిత్ పవార్ మరణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న నిజాన్ని వెలికి తీయాల్సిన అవసరాన్ని ఇద్దరూ ప్రత్యేకంగా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement