సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రత్యామ్నాయమే లేదన్నారు. కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందని స్థానిక సంస్థల ఎన్నికలే నిరూపించాయి అంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయమై ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రేపటి మీటింగ్ అన్ని రాష్ట్రాలపై ఏఐసీసీ సమీక్ష జరుగుతుంది. ఇప్పటికే 11 రాష్ట్రాలపై సమీక్ష అయిపోయింది. పార్టీ నిర్మాణం, సంక్షేమంపై చర్చ జరగనుంది. చిత్త శుద్ధితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. 67 శాతం బీసీ వార్డు మెంబర్లు గెలిచారు. 87.5 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది.
ఇక్కడ జీవన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సీట్లు సర్వేల ఆధారంగా మున్సిపల్ చైర్మెన్ కౌన్సిలర్ల ఆధారంగా ఎంపిక జరిగింది. మంత్రివర్గంపై పీసీసీ జోక్యం ఉండదు. 94 మున్సిపాలిటీలు గెలిచామంటే అభివృద్ది, సంక్షేమం పట్ల ప్రజలకు సానుకూలతే నిదర్శనం. నిజామాబాద్లో ఐదు సీట్లలో ఏంఐఏం అభ్యర్థుల మీద గెలిచాం. మేయర్ వస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని కార్పొరేటర్లు ఆ దిశగా ఆలోచించారు. ఈనెల 21 నుంచి 10 రోజుల పాటు వికారాబాద్ హరిత రిసార్టులో ఏపీ, తెలంగాణ డీసీసీలకు శిక్షణ తరగతులు ఉన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఒకరోజు అటెండ్ అవుతారు.
వరుస ఓటముల కారణంగా బీఆర్ఎస్ కేటీఆర్ ఫ్రస్టేషన్లో ఉన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడే ఆయనే చెప్పారు. దీనిపై మేము మాట్లాడటానికి ఏమీ లేదు. ఢిల్లీ మీటింగ్ తర్వాత పార్టీలో చేరిన ఎమ్మెల్యేల వ్యవహారంపై పూర్తిగా స్పష్టతను ఇస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు.


