పాకిస్తాన్ సరిహద్దుల్లో.. జైసల్మేర్ వద్ద పట్టివేత
సాక్షి, హైదరాబాద్ : రాజస్థాన్లోని జైసల్మేర్ ఉన్న భారత్– పాకిస్తాన్ సరిహద్దుల్లో మంగళవారం కలకలం రేగింది. అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న హైదరాబాదీ మహమ్మద్ అషా్ఫక్ హుస్సేన్ను పట్టుకున్న గ్రామస్తులు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు (బీఎస్ఎఫ్) అప్పగించారు. అతడి వద్ద ఆధార్ కార్డు, పాస్పోర్టుతో పాటు సౌదీ అరేబియా వీసా స్వా«దీనం లభించింది.
అష్ఫాక్ హుస్సేన్ అక్కడికి ఎందుకు వచ్చాడనే కోణంలో బీఎస్ఎఫ్ విచారణ చేస్తోంది. కరీంనగర్కు చెందిన మహమ్మద్ అషా్ఫక్ హుస్సేన్ (38) కొన్నాళ్లుగా హైదరాబాద్లో నివసిస్తున్నాడు. మంగళవారం ఉదయం జైసల్మేర్లోని మియాజలార్ ప్రాంతంలో ఉన్న గుంజన్గఢ్ గ్రామం వద్ద సంచరిస్తున్నాడు. ఇతడి వ్యవహారశైలిని అనుమానించిన గ్రామస్తులు ప్రశ్నించారు. అతడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో బీఎస్ఎఫ్కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న బీఎస్ఎఫ్ బృందం హుస్సేన్ను అదుపులోకి తీసుకుంది.
బీఎస్ఎఫ్తో పాటు ఆర్మీ, ఐబీ అధికారులు రంగంలోకి దిగి ఇతడిని వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. సౌదీ వీసా ఉన్న అతడు అక్కడికి ఎలా.. ఎందుకు వచ్చాడు? స్థానికులతో సంబంధాలైమైనా ఉన్నాయా? లేక ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న రాష్ట్ర నిఘా వర్గాలు అటు కరీంనగర్, ఇటు హైదరాబాద్ల్లో ఆరా తీస్తున్నాయి.


